ప్రైమరీ మార్కెట్లో ఈ వారం రూ.10 వేల కోట్లకు పైగా విలువైన మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. మెయిన్బోర్డు విభాగంలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఆల్పైన్ టెక్స్వరల్డ్లు, ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానున్నాయి. అలాగే ఇదే వారంలో మూడు ఐపీఓలు ముగియనున్నాయి. నాలుగు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్కు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు ఈ వారం జోరందుకోనున్నాయి.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ
ఈ వారంలో ప్రధాన ఆకర్షణ ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్’ ఐపీఓ కానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఫ్రాన్స్కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అముండి సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఈ కంపెనీ రూ.9,812.91 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. షేరు ధరను రూ.545–574గా నిర్ణయించారు. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండటంతో సమీకరించే నిధులు కంపెనీకి కాకుండా, షేర్లు విక్రయించే వాటాదారులకే దక్కనున్నాయి.
ఆల్పైన్ టెక్స్వరల్డ్
గుజరాత్కు చెందిన టెక్స్టైల్ కంపెనీ ఆల్పైన్ టెక్స్వరల్డ్ మెయిన్బోర్డు విభాగంలో రెండో ఐపీఓగా రానుంది. రూ.126.25 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.100–105గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను కొత్త వీవింగ్ యూనిట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
మిల్వర్క్స్ టెక్నాలజీస్
ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఒక్కటే పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. రూ.160.30 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.315–331గా నిర్ణయించారు. సమీకరించే నిధులను ప్లాంట్ ఏర్పాటు, యంత్రాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
4 లిస్టింగులు
ఈ వారంలో (బుధవారం) జూలై 15న కుసుమ్గర్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానున్నాయి. మరుసటి రోజు గురువారం లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా, డెవ్సన్ క్యాటలిస్ట్, హ్యాపీ స్టీల్స్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు రెండంకెల ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.


