న్యూజిలాండ్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. సౌత్ ఐలాండ్ (దక్షిణ ద్వీపం) లోని 'తే అనావ్' పట్టణానికి సమీపంలో ఈ భూకంపం సంభవించడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి ఆ హెచ్చరికను కేవలంసునామీ అడ్వైజరీగా సవరించారు.
తే అనావ్ పట్టణానికి ఉత్తరంగా దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రారంభంలో ఈ భూకంప తీవ్రతను 6.3గా అంచనా వేసిన అధికారులు.. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీర ప్రాంతాలైన మిల్ఫోర్డ్ సౌండ్ నుంచి పుయ్సెగర్ పాయింట్ వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఖచ్చితమైన అంచనాల ఆధారంగా భూకంప తీవ్రతను 5.9గా నిర్ధారించి.. సునామీ హెచ్చరికను తగ్గించారు.
ప్రస్తుతానికి సునామీ ముప్పు లేనప్పటికీ, న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో బలమైన అలల కదలికలు, అంచనా వేయలేని నీటి ఉప్పెనలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని.. బీచ్లకు దూరంగా ఉండాలని సూచించింది.


