స్టూడెంట్‌ వీసాకు కాల పరిమితి  | Donald Trump new rule will limit foreign students to four-year stays | Sakshi
Sakshi News home page

స్టూడెంట్‌ వీసాకు కాల పరిమితి 

Jul 17 2026 5:10 AM | Updated on Jul 17 2026 5:10 AM

Donald Trump new rule will limit foreign students to four-year stays

నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండేందుకు వీల్లేదంటూ కొత్త కఠిన నిబంధన జే–1 కేటగిరీకీ 

ఇదే నిబంధన వర్తింపు 

భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు 

విదేశీ జర్నలిస్టులకు గడువు కుదింపు 

చైనా పాత్రికేయులకు అత్యల్పంగా 90 రోజులే సమయం 

ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురణ 

తర్వాత  అమలుకానున్న కొత్త నిబంధన

వాషింగ్టన్‌: ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులతోపాటు సక్రమంగా వచ్చిన విదేశీ విద్యార్థుల మీదా ట్రంప్‌ సర్కార్‌ కఠిన నిబంధనల కత్తిని దూస్తోంది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులను ఇష్టారీతిన పరిమితికి మించి ఎక్కువకాలం తమ గడ్డపై ఉండనివ్వబోమని అమెరికా ప్రభుత్వం తెగేసి చెబుతోంది. విద్యార్థి వీసా(ఎఫ్‌–1 కేటగిరీ)తో దేశంలో అడుగుపెట్టిన విదేశీయులు గరిష్టంగా నాలుగు సంవత్సరాలు మాత్రమే అమెరికా ఉండేందుకు అవకాశం కల్పిస్తామని హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ తాజాగా ఒక నిబంధన తెచ్చింది. 

గతంలో ఒక కోర్సులో చేరిన విదేశీ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఒక సబ్జెక్ట్‌ పరీక్ష రాయకపోవడమో, లేదంటే రాసి ఫెయిల్‌ కావడమో చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యేదాకా వీసా గడువు పొడిగించాలని సంబంధిత విద్యాసంస్థ లేదా ఉన్నతాధికారి నుంచి అనుమతి పొంది నెలల తరబడి అదనంగా అమెరికాలో తిష్టవేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇలాంటి వాటికి ఇకపై తావులేకుండా వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన సరిగ్గా నాలుగేళ్ల తర్వాత స్వదేశం తిరిగి వెళ్లిపోవాల్సిందేనని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం కొత్త నిబంధనలో స్పష్టంచేసింది.

 విదేశీ అంతర్జాతీయ జర్నలిస్టులు సైతం ఐ కేటగిరీ వీసాతో అమెరికాకు వస్తే ఇకపై గరిష్టంగా 240 రోజులు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు. చైనా జర్నలిస్టులకు ఈ గడువును మరీ దారుణంగా 90 రోజులకే పరిమితంచేశారు. సాంస్కృతిక సంబంధాల కేటగిరీలో జే–1 వీసాతో అమెరికాలోకి అడుగుపెట్టి విశ్వవిద్యాలయాల్లో సేవలందించే పరిశోధకులు, విద్యావేత్తలు తదితరలు సైతం నాలుగేళ్ల నిర్దిష్ట కాలావధి వరకే అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండనుంది. గతంలో ఈ మూడు కేటగిరీలకు నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదు.

 ఎఫ్‌–1, జే–1 కేటగిరీలకు నాలుగేళ్ల గడువు ముగియగానే అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌)లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ స్టే(ఈఓఎస్‌) దరఖాస్తు పెట్టుకుని గడువు పొడిగించుకునేవాళ్లు. ఈ లొసుగును అడ్డుపెట్టుకుని కొందరు ఏకంగా దశాబ్దాల తరబడి అమెరికాలో తిష్టవేశారని ఆరోపణలు రావడంతో ట్రంప్‌ సర్కార్‌ ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’కు చరమగీతం పాడి కొత్తగా ‘ఎక్స్‌పైరీ డేట్‌’రూల్‌ను తీసుకొస్తోంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వ ‘గెజిట్‌’మాదిరి అమెరికాలో ‘ఫెడరల్‌ రిజిస్ట్రీ’లో సంబంధింత నిబంధనలు ప్రచురితమైన 60 రోజుల తర్వాత ఇవి అమల్లోకి రానున్నాయి.  

భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు 
1990 తొలినాళ్ల నుంచి అమల్లో ఉన్న పాత నిబంధనను తొలగించి కొత్త నిబంధన తీసుకొస్తే లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలపై ప్రతికూల ప్రభావంచూపే ఆస్కారముంది. కఠిన సబ్జెక్టులతో ఉత్తీర్ణులుకాలేక తమ కోర్సులు/డిగ్రీలు/రీసెర్చ్‌ను పూర్తిచేయలేకపోయినా భారతీయ విద్యార్థులు ఇకపై అదనంగా నెలల తరబడి అమెరికాలో ఉండిపోయే సువర్ణావకాశం చేజారే వీలుంది. దీంతో అసంపూర్ణ చదువులు, డిగ్రీ పట్టాలతో భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. 

వీసాతో అమెరికాకు వెళ్లాక అడ్మిషన్‌ ప్రక్రియలో, పరిశోధనా పత్రం జారీలో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో అక్కడే ఉండిపోవాల్సి వస్తే ఆలోపే ‘ఎక్స్‌పైరీ డేట్‌’దాటిపోతే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు ప్రభుత్వం పరిగణిస్తుంది. అప్పుడు ఆలస్యంగా అమెరికాను వీడేప్పుడు వాళ్లపై కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా పదేళ్లపాటు అమెరికాకు తిరిగిరాకుండా నిషేధం విధించే ప్రమాదముందని వీసారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టోరల్‌ విద్యార్థులు, వైద్యులు, వర్సిటీల్లో పరిశోధకులు, విజిటింగ్‌ స్కాలర్లు, మెడికల్‌ ట్రైనీలకు సైతం ఇదే నిబంధన వర్తించనుంది. 

అమెరికా 2024లో ఏకంగా 18 లక్షల స్టూడెంట్‌ వీసా అడ్మిషన్లు  ఇచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ. 2024లో అమెరికా ఏకంగా 5 లక్షల ఎక్సే్ఛంజ్‌ విజిటర్‌(జే–1) వీసాలు మంజూరుచేసింది. అదే ఏడాది 37,300 మంది జర్నలిస్టులకు ఐ కేటగిరీ వీసాలిచ్చింది. ఒక మీడియా ఈవెంట్‌ తర్వాత మరో ఈవెంట్‌లో మీడియా ప్రతినిధిని అని చెప్పుకుంటూ కొందరు జర్నలిస్టులు ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోయారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈ నిబంధనను ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురించాక దీనిపై అమెరికా ఉభయ చట్టసభలు సమీక్ష జరుపుతాయి. రెండు సభలూ నిబంధనను ఆమోదిస్తే అది చట్టంలో భాగంగా మారుతుంది. లేదంటే 60 రోజుల్లోపు అది అమల్లోకి రావడం ఆగిపోయే ఆస్కారముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement