భారత రైల్వే చరిత్రలో గ్రీన్‌ సంచలనం  | PM Narendra Modi to Launch India First Hydrogen Train in Haryana | Sakshi
Sakshi News home page

భారత రైల్వే చరిత్రలో గ్రీన్‌ సంచలనం 

Jul 17 2026 4:56 AM | Updated on Jul 17 2026 4:56 AM

PM Narendra Modi to Launch India First Hydrogen Train in Haryana

హరియాణాలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

జింద్‌–సోనీపట్‌ మార్గంలో పరుగులుపెట్టనున్న హరిత రైలు

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. హరియాణా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

 ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే.. ఆ తర్వాత డీజిల్, విద్యుత్‌ శకాలను దాటుకుని, ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం ’హైడ్రోజన్‌’వైపు అడుగులు వేసింది. బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో ఇప్పటికే 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్‌ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. 

ప్రమాదాలకు తావులేదు.. భద్రత అమోఘం! 
హైడ్రోజన్‌ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికులలో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్‌ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్‌ సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్‌ లీకైనా, అది ఒకచోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్‌ వ్యవస్థ ఉంది. 

జింద్‌ వద్ద అతిపెద్ద హైడ్రోజన్‌ ప్లాంట్‌! 
హరియాణాలోని జింద్‌ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్‌ రీఫ్యూయలింగ్‌ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుది్వశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్‌) ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్‌ వాయువును తయారు చేస్తారు. దీనిని 500 బార్‌ ప్రెజర్‌ వద్ద నిల్వ చేసి, రైళ్లకు 350 బార్‌ ప్రెజర్‌ వద్ద నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో రెండు పవర్‌ కార్లలో గ్యాస్‌ నింపే సదుపాయం ఉంది. ఈ రైలును ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కింద భారత్‌లోనే రూపొందించారు. 

రైలు ప్రత్యేకతలు.. 
ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్‌ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్‌లతో మాత్రమే నడుస్తుండగా, భారత్‌లో ఏకంగా 10 కోచ్‌ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్‌ రైలుగా ఇది రికార్డ్‌నెలకొల్పే ఆస్కారముంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హరియాణాలోని నార్తర్న్‌ రైల్వే పరిధిలోని జింద్‌ నుంచి సోనిపట్‌ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపునున్నారు. 

జింద్‌ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్‌ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 75 కి.మీ వేగంతో నడపనున్నారు. రైలుకు ఇరువైపులా రెండు హైడ్రోజన్‌ డ్రైవింగ్‌ పవర్‌ కార్లు (డీపీసీ)లు ఉంటాయి. ఇవి చెరో 1,200 కిలోవాట్ల (1600 హెచ్‌పీ) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్యాకప్‌ కోసం లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ (ఎల్‌ఎఫ్‌పీ) బ్యాటరీలను జతచేశారు.

నిప్పులు చిమ్మని హరిత రథం
మారనున్న భారతీయ రైల్వే ముఖచిత్రం 
బొగ్గుతో నడిచే రైళ్లు మొదలు విద్యుత్‌తో నడిచే రైళ్లదాకా కొనసాగిన భారత రైల్వే ప్రస్థానంలో సరికొత్త హరిత అతిథి నేడు వచ్చిచేరుతోంది. వాతావరణంలోని కర్భన ఉద్గారాలను అస్సలు వెదజల్లని వాతావరణహిత హరిత రైలు రాకతో భారత రైల్వే ముఖచిత్రం మారబోతోందని రైల్వే రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్‌ రైలు పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఎలా పనిచేస్తుంది? 
సంప్రదాయక రైలు మాదిరి ఈ రైలు నుంచి కాలుష్యకారక ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలువడవు. హరిత శకటం నుంచి కేవలం నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ రైలు ముందుభాగంలో లేదా పైభాగంలో లేదా ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లో భారీ స్థాయిలో హైడ్రోజన్‌ వాయువును నిల్వచేసే ట్యాంకర్‌ ఉంటుంది. దీనికి సమీపంలో ఫ్యూయల్‌సెల్‌ వ్యవస్థ ఉంటుంది. ట్యాంక్‌లోని హైడ్రోజన్‌ను ప్రత్యేక పైపుల ద్వారా ఫ్యూయల్‌సెల్‌లోకి పంపిస్తారు. అయితే అది ఫ్యూయల్‌ సెల్‌లోకి వచ్చే క్రమంలోనే ప్రోట్రాన్లు, ఎల్రక్టాన్లుగా విడిపోతుంది. ఎల్రక్టాన్లు ఫ్యూయల్‌ సెల్‌లోకి వెళ్లవు.

 ప్రత్యేక సర్క్యూ ద్వారా ప్రవహిస్తాయి. ఇదే రైలు ముందుకు కదలడానికి సాయపడుతుంది. ఫ్యూయల్‌సెల్‌లోకి వచ్చే ప్రోటాన్లు అనేవి బయటి గాలి నుంచి వచ్చే ఆక్సీజన్‌తో ఎల్రక్టానిక్‌ రసాయన చర్య జరిపి విద్యుత్‌ను, నీటి ఆవిరిని ఉత్పత్తిచేస్తాయి. ఈ నీటి ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. విద్యుత్‌ మాత్రం అక్కడే ట్రాక్షన్‌ మోటార్లకు చేరి రైలు చక్రాలను ముందుకు కదిలేలా చేస్తాయి. రైలు ఒకవేళ నెమ్మదిగా వెళితే ఆ సమయంలో ఫ్యూయల్‌ సెల్‌ వ్యవస్థ ద్వారా జనించిన విద్యుత్‌ అనేది రైలులో అమర్చిన భారీ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుంది. ఇది అవసరమైన వేళల్లో హఠాత్తుగా రైలు వేగం పెరిగేందుకు సాయపడుతుంది.

 హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థతో ఈ రైలు పనిచేస్తుందని శివనాడార్‌ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ విభాగ ప్రొఫెసర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ అరోరా చెప్పారు. ఓవర్‌హెడ్‌ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగల నుంచి వచ్చే విద్యుత్‌తో విద్యుత్‌ ఆధారిత రైలు పనిచేస్తాయి. కానీ హైడ్రోజన్‌ రైళ్లలో అత్యధిక పీడనంతో నింపిన హైడ్రోజన్‌ ఈ ప్రోటాన్‌ ఎక్సే్ఛంజ్‌ మెంబ్రేన్‌ ఫ్యూయల్‌ సెల్‌ విధానంలో ఆక్సీజన్‌తో చర్య జరిపి అటు విద్యుత్‌ను, ఇటు నీటి ఆవిరిని, పరిమిత స్థాయిలో వేడిమిని అందిస్తుందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరోన్మెంట్‌ మేథోసంస్థలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విభాగ సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ మౌష్మీ మొహంతీ తెలిపారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement