దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ రీఎగ్జామ్-2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం రాత్రి ప్రకటించింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 20లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. రికార్డు స్థాయిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్కార్డులను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
అమ్మాయిలదే పైచేయి!
ఈ ఏడాది నీట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం అర్హత సాధించిన వారిలో 58 శాతం కంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం.
టాప్ స్కోరర్లు వీరే..
ఈ ఏడాది పరీక్షలో 720 మార్కులకు గానూ అత్యధికంగా 715 మార్కులు సాధించి ఆర్యన్ గుప్తా(పంజాబ్), పాన్షుల్ బన్సాల్(హర్యానా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అదేవిధంగా 19 మంది విద్యార్థులు 700 కంటే ఎక్కువ మార్కులు సాధించారు.
కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. జనరల్ కేటగిరీలో 2.91లక్షల మంది క్వాలిఫై కాగా.. ఓబీసీ ఎన్సీఎల్లో 5.12లక్షలు, ఎస్సీ 1.59లక్షల మంది, ఎస్టీ 63,716మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ 95,026, పీడబ్ల్యూబీడీ 3666, పీడబ్ల్యూడీ 303మంది క్వాలిఫై అయ్యారు.
కాగా నీట్ పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ అవ్వడంతో జూన్ 21న మరోసారి దేశ వ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.


