నీట్‌, జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం.. | Board exam marks may count 50percent alongside NEET, JEE in admissions | Sakshi
Sakshi News home page

నీట్‌, జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం..

Jul 2 2026 6:33 PM | Updated on Jul 2 2026 7:08 PM

Board exam marks may count 50percent alongside NEET, JEE in admissions

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో, ఇకపై అడ్మిషన్ల మెరిట్ జాబితాలో క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్రమైన వివాదాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎంట్రన్స్‌ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత లభిస్తుంది. 

ఎంట్రన్స్ పరీక్షల సిలబస్‌ను పాఠశాల పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్చడం ద్వారా విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ లీకేజీల రిస్క్‌ను పూర్తిగా తగ్గించడానికి, క్రమంగా అడాప్టివ్ ఆన్ డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లనున్నారు.

ప్రస్తుత విధానం ప్రకారం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తిగా నీట్, జేఈఈ ఎంట్రన్స్ స్కోర్‌లపైనే ఆధారపడి జరుగుతోంది. బోర్డు పరీక్షలు కేవలం అర్హత సాధించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి,అనధికారిక విద్యాసంస్థల వ్యాప్తిని, కోచింగ్ సంస్కృతిని అరికట్టడానికి విద్యాశాఖ నియమించిన తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement