సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పాలనపై అన్నామలై సానుకూలంగా స్పందించడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరతీసింది.
విజయ్ ప్రభుత్వం ఇంకా కొత్తదేనని, దానికి కనీసం ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని అన్నామలై అన్నారు. తొలి 100 రోజుల్లో ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం కనిపించిందని, అవినీతిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రస్తుతం విజయ్కు నా మద్దతు ఉందని చేశారు.
అన్నామలై వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. బీజేపీ నిర్ణయాలు మరింతగా ఢిల్లీ కేంద్రీకృతమవుతున్నాయని, రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత స్వేచ్ఛ, అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలోనూ గుజరాత్ కేంద్రీకృత మోడల్ మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఒకవైపు బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు.. మరోవైపు విజయ్కు బహిరంగ మద్దతు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో అన్నామలై తదుపరి రాజకీయ అడుగు ఏంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపు ఆయన అడుగులు వేస్తారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు అన్నామలై టీవీకేలో చేరుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ ఊహాగానంగానే చూడాలి. విజయ్కు అన్నామలై మద్దతు ప్రకటించడం, అదే సమయంలో బీజేపీ నిర్ణయాలపై విమర్శలు చేయడం.. తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


