ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 9 కిలోల బరువు కోల్పోయిన ఆయన ప్రస్తుతం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన పరిస్థితి విషమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర హెచ్చరిక చేసింది.
రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బహిరంగ లేఖ రాస్తూ.. వెంటనే వాంగ్చుక్తో చర్చలు జరపాలని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం వినాలని కోరారు. ఆయనకు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్కు రాజకీయ మద్దతు క్రమంగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్ జంతర్మంతర్కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వాంగ్చుక్కు బహిరంగ లేఖ రాస్తూ.. దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ), సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు.

అసలు ఈ దీక్ష ఎందుకు?
జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయనతో పాటు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని కేంద్రం రాజకీయ ప్రేరేపితమని అభివర్ణిస్తూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరసనకారులను "అశాంతి సృష్టించే శక్తులు"గా వ్యాఖ్యానించారు.
ఎవరీ సోనమ్ వాంగ్చుక్?
లడఖ్కు చెందిన సోనమ్ వాంగ్చుక్ ప్రముఖ ఇంజినీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలకు కృషి చేసిన ఆయనకు 2018లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది. హిమాలయ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం రూపొందించిన 'ఐస్ స్తూపాలు' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జీవితం, ఆలోచనల ఆధారంగానే బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్ర(అమీర్ ఖాన్ పోషించిన పాత్ర) రూపుదిద్దుకుంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేపట్టిన ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. లడఖ్లో గతంలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పటికీ అక్కడి చల్లటి వాతావరణం కారణంగా ఇంతగా బలహీనపడలేదని, ఢిల్లీలోని వేడి, తేమ వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉప్పు, నీటితోనే దీక్ష కొనసాగిస్తున్నారని.. వైద్యుల సూచనలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే ఆలోచన లేదని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకుండా బలవంతంగా ఆహారం అందించాలని, దీక్ష విరమింపజేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. అయితే తాను స్వచ్ఛందంగా చేపట్టిన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్చుక్ స్పష్టం చేస్తున్నారు.


