న్యూఢిల్లీ: భారత్, యునైటెడ్ కింగ్డమ్(యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సెటా)బుధవారం అమల్లోకి వచ్చింది. ఇది యూకేకు జరిగే భారత ఎగుమతుల్లో దాదాపు 99 శాతానికి సుంకం లేని ప్రవేశాన్ని కల్పించడంతోపాటు రెండు దేశాల నడుమ వాణిజ్యం, పెట్టుబడులు, సేవల రంగాల్లో సంబంధాలను బలోపేతం చేయనుంది. యూకేలోకి ప్రవేశించే భారతీయ ఉత్పత్తుల్లో 99 శాతం, భారత్లోకి ప్రవేశించే యూకే ఉత్పత్తుల్లో 90 ఉత్పత్తులకు సున్నా సుంకం వర్తిస్తుంది.
కొన్నింటిపై సంకాలు తగ్గుతాయి. ఇది ఆటోమోటివ్, తయారీ, వినియోగ వస్తువులు, సృజనాత్మక పరిశ్రమలు, వైద్య సాంకేతికతతో సహా ఇరువైపులా అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వ్రస్తాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, ప్రాసెస్ చేసిన ఆహారంతో సహా పలు రంగాల్లో సుంకాలు భారీగా తగ్గుతాయి. ‘సెటా’తో పాటు సామాజిక భద్రత ఒప్పందం (ద్వంద్వ సహకార ఒప్పందం) కూడా అమల్లోకి వచ్చింది.
వాణిజ్య ఒప్పందంలో భాగంగా బుధవారం నుంచే స్కాచ్ విస్కీపై దిగుమతి సుంకాన్ని 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించారు. భారత్–యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం అమల్లోకి రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హర్షం వ్యక్తంచేశారు. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా అభివరి్ణంచారు.
భారత్, యూకే మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని, ఉమ్మడి ఆశయాలు ప్రజలకు ప్రయోజనకరమైన అవకాశాలుగా మారుతాయని వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, అలాగే పలు కీలక రంగాలు యూకే మార్కెట్లోకి సులభంగా ప్రవేశం పొందుతాయని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు మరింత మేలు జరుగుతుందని, రెండు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారం పెరుగుతుందని ఉద్ఘాటించారు.


