పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోషల్ మీడియా వినియోగించకుండా డిఫాల్ట్ పరిమితులు విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్లను వినియోగించకుండా నిరోధించేలా కొత్త నిబంధనలు తీసుకురానుంది.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. యువతలో పెరుగుతున్న రాత్రివేళల ఫోన్ వినియోగంపై ఆందోళనలే. ఆలస్యంగా నిద్రపోవడం, ఏకాగ్రత తగ్గడం, చదువుపై ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు అధిక స్క్రీన్ టైమ్ కారణమవుతోందని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వినియోగదారులను ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా రూపొందించిన విధానాలపై విమర్శలు ఉన్నాయి.
ఇందులో భాగంగా.. వినియోగదారులను నిరంతరం ఆకర్షించే కొన్ని ఫీచర్లపై కూడా బ్రిటన్ దృష్టి పెట్టింది. వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానం వంటి ‘ఎంగేజ్మెంట్ ఫీచర్లను’ డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. అయితే వినియోగదారులు కోరుకుంటే కొన్ని సెట్టింగులను మార్చుకునే అవకాశం ఉండనుంది.
పూర్తి నిషేధం కాదు.. నియంత్రణే లక్ష్యం
ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిస్థాయి నిషేధం విధించే మార్గాన్ని కాకుండా.. బ్రిటన్ దశలవారీ నియంత్రణ విధానాన్ని ఎంచుకుంది. ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 16, 17 ఏళ్ల యువతపైనా రాత్రివేళ పరిమితులను తీసుకురావడం ద్వారా మధ్యస్థ మార్గాన్ని అనుసరిస్తోంది.
స్క్రోలింగ్కు బ్రేక్.. నిద్రకు ప్రాధాన్యం
బ్రిటన్ కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా యాప్లలో అంతులేని స్క్రోలింగ్కు కారణమయ్యే ఫీచర్లను డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ఒక వీడియో తర్వాత మరో వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానాన్ని నియంత్రించనున్నారు. దీంతో టీనేజర్లు రాత్రివేళల్లో ఎక్కువ సమయం ఫోన్లకు అతుక్కుపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. "యువతకు అవసరమైన నిద్ర లభించేందుకు, చదువుపై దృష్టి పెట్టేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి" అని బ్రిటన్ టెక్నాలజీ మంత్రి లిజ్ కెండల్ తెలిపారు.
ఆస్ట్రేలియా అనుభవాలతో బ్రిటన్ జాగ్రత్తలు
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకున్న తొలి దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండకుండా నిషేధం విధించే చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అయితే ఆ నిబంధనలను తప్పించుకునేందుకు కొందరు టీనేజర్లు కొత్త మార్గాలను అన్వేషించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. వయసు ధ్రువీకరణ వ్యవస్థలను దాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేవలం పూర్తిస్థాయి నిషేధం కంటే.. వినియోగ అలవాట్లను నియంత్రించడం, ముఖ్యంగా రాత్రివేళల స్క్రీన్ టైమ్ను తగ్గించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని బ్రిటన్ భావిస్తోంది.
మానసిక ఆరోగ్యంపై ఆందోళనలు
సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యువతలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో రాత్రివేళ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల నిద్ర, దృష్టి కేంద్రీకరణ, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించినట్లు తేలింది.
2027 నుంచి అమలు?
బ్రిటన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా నియంత్రణ(పూర్తిస్థాయి) నిబంధనలను ఈ ఏడాది చివరి నాటికి పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. 2027 వసంతకాలం నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షిస్తామని కూడా స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ.. ఆస్ట్రేలియా పూర్తిస్థాయి నిషేధం వైపు వెళ్తుంటే.. బ్రిటన్ మాత్రం నియంత్రణల మార్గాన్ని ఎంచుకుంది. రాబోయే రోజుల్లో యువతను సోషల్ మీడియా ప్రభావం నుంచి రక్షించేందుకు మరిన్ని దేశాలు ఎలాంటి విధానాలు అవలంబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.


