ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా భావించే హర్ముజ్ మరోసారి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల సరకు విలువపై 20 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని ఆయన సూచించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘‘ఈ అత్యంత సున్నితమైన ప్రాంతానికి అమెరికా భద్రత కల్పిస్తోంది. అందుకు తగిన పరిహారం చెల్లించాలి’’ అన్నది ట్రంప్ వాదన. అయితే.. అంతర్జాతీయ జలమార్గంపై రుసుము విధించే ఆలోచనను పలువురు నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భద్రత పేరుతో తప్పనిసరి వసూలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.
ఫీజు అందుకేనట!
పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ భారీగా చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం గుండా సాగుతుంది. అమెరికా దశాబ్దాలుగా గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించి భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంత రక్షణ కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఇకపై అందుకు పరిహారం రావాలి’’ అని పేర్కొన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ ఖర్చును భరించాలని ఆయన సూచించారు.
విమర్శలకు స్పందన
ట్రంప్ ప్రతిపాదనపై విమర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. భద్రత కల్పిస్తామని చెప్పి దానికి ప్రతిగా డబ్బు వసూలు చేయడం ‘ప్రొటెక్షన్ మనీ’ /‘హఫ్తా’ తరహాలో ఉందని ఆరోపిస్తున్నారు. (బెదిరించి లేదంటే ఒత్తిడి చేసి క్రమం తప్పకుండా వసూలు చేసే డబ్బును కూడా హప్తా అంటారు). అయితే అమెరికా మాత్రం ఈ విమర్శలను ఖండిస్తోంది. ఇది ఎలాంటి బలవంతపు వసూలు కాదని.. ప్రపంచ వాణిజ్య మార్గాన్ని రక్షించేందుకు చేస్తున్న ఖర్చుకు పరిహారం మాత్రమేనని చెబుతోంది.
అంతర్జాతీయ చట్టాలపై ప్రశ్నలు
హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన మార్గం. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇక్కడ నౌకలకు స్వేచ్ఛా రవాణా హక్కు ఉంటుంది. ఇలాంటి మార్గంలో ప్రయాణానికి తప్పనిసరి టోల్ లేదంటే ఫీజు విధించే హక్కు ఎవరికీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థ కూడా ఇలాంటి రుసుములకు చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్కు కలిసొచ్చే అంశమా?
ట్రంప్ ప్రతిపాదన మరోవైపు ఇరాన్కు కొత్త వాదనను అందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇరాన్ కూడా హర్ముజ్పై తన ప్రభావాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసింది. నౌకల భద్రత పేరుతో రుసుములు వసూలు చేసే ఆలోచనలను ఆ దేశ వర్గాలు ప్రస్తావించాయి. ఇప్పుడు అమెరికానే ఫీజు ప్రతిపాదించడం వల్ల.. ‘‘అమెరికాకు అవకాశం ఉంటే మాకు ఎందుకు ఉండకూడదు?’’ అనే వాదనను ఇరాన్ ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ‘‘20 శాతం ఎక్కువే.. మేము న్యాయంగా వ్యవహరిస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు.
యుద్ధం చేసింది ఎవరు.. బిల్లు చెల్లించేది ఎవరు?
విమర్శకుల వాదన ప్రకారం.. ‘‘సంక్షోభాన్ని సృష్టించి.. దాని భద్రత ఖర్చును ప్రపంచానికి అప్పగించే ప్రయత్నమా?’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనపై ప్రధాన విమర్శ ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఇప్పటికే చమురు మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఇంధన ధరలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే ఖర్చును అంతర్జాతీయ రవాణాపై మోపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆధిపత్య పోరు ముదురుతుందా?
ట్రంప్ ప్రతిపాదన అసలు ఆచరణలోకి వస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ ప్రకటనతో హజ్ మరోసారి అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. పంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలమార్గం.. ఇకపై కేవలం వాణిజ్య మార్గంగానే కాకుండా, రాజకీయ ఒత్తిళ్లు, సైనిక ఆధిపత్యం, ఆర్థిక పోరాటాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది.


