హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన | Deal Collapses Irans Shock Move After US Revives Hormuz Blockade | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

Jul 15 2026 7:05 AM | Updated on Jul 15 2026 7:08 AM

Deal Collapses Irans Shock Move After US Revives Hormuz Blockade

పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరోసారి ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజూ అమెరికా-ఇరాన్‌ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. మధ్యవర్తుల ప్రయత్నాలతో ఉద్రిక్తతలు తగ్గి.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని అంతా భావించిన వేళ.. పరిణామాలు మళ్లీ మారిపోయాయి. పరస్పర ఆరోపణలు, కవ్వింపు చర్యలతో శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్‌ జలసంధిపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఇరాన్‌ ఆరోపించింది. దీంతో ఆ అవగాహన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది.

గత నెలలో స్విట్జర్లాండ్‌ వేదికగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం.. ఘర్షణలను నిలిపివేసి, రెండు నెలల కాలపరిమితిలో శాంతి ఒప్పందం దిశగా ముందుకు సాగాల్సి ఉంది. ఇందులో కీలకమైన అణు అంశంపై ఒప్పందం కూడా భాగంగా ఉంది. అయితే అమెరికా పదేపదే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేయడం.. ఈ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీసిందని టెహ్రాన్‌ మండిపడుతోంది.

హర్ముజ్‌పై మళ్లీ ఆధిపత్య పోరు
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌ జలసంధి మరోసారి ఘర్షణ కేంద్రంగా మారింది. ఇరాన్‌కు చెందిన నౌకలు ఈ మార్గంలో ప్రయాణించే విషయంలో అమెరికా ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్‌ మరోసారి దాడులకు దిగిందని సమాచారం. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై కూడా ఇరాన్‌ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్‌ మార్గం గుండా సాగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ సంక్షోభమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

"హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం మాదే"
ఇరాన్‌ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్‌ ఘరీబాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. "ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా హర్ముజ్‌పై మా సార్వభౌమ హక్కును కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో హర్ముజ్‌ జలసంధి నిర్వహణలో ఇరాన్‌తో పాటు ఒమన్‌కూ పాత్ర ఉంటుంది. అయితే జాతీయ భద్రత దృష్ట్యా ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో మొత్తం మార్గంపై నియంత్రణ అవసరమని ఇరాన్‌ వాదిస్తోంది.

చర్చలకు నో చెప్పిన ఇరాన్‌
అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి పెంచే చర్యలను కొనసాగిస్తే.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతుండగా.. తాజాగా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటన చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.

హర్ముజ్‌పై బ్లాకేడ్‌.. మళ్లీ
హర్ముజ్‌ జలసంధి పరిణామాల్లో అమెరికా బ్లాకేడ్‌ కీలక అంశంగా మారింది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా తొలిసారి ఏప్రిల్‌ 13న ఇరాన్‌ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నౌకలపై నౌకాదళ దిగ్బంధాన్ని ప్రారంభించింది. ఈ చర్యతో గల్ఫ్‌ ప్రాంతంలో నౌకాయాన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన (MoU) కుదిరిన తర్వాత పరిస్థితులు కొంత చల్లబడ్డాయి. ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా జూన్‌ 18న బ్లాకేడ్‌ను ఎత్తివేసింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని, తదుపరి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా జూలై 14 నుంచి ఇరాన్‌ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరించింది. ఇరాన్‌ మాత్రం ఈ చర్యను ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ.. శాంతి ఒప్పందాన్ని అమెరికానే నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తోంది.

ప్రపంచానికి కొత్త ఆందోళన
హర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. దాని ప్రభావం అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణకే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే.. అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్‌ మార్గం గుండా సాగుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా సరఫరా వ్యవస్థ దెబ్బతిని.. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. దాని ప్రభావం పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి.. రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. హర్ముజ్‌లో సంక్షోభం మరింత ముదిరితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌ వంటి దేశాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే హర్ముజ్‌ జలసంధిపై అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల సమస్యగా కాకుండా.. ప్రపంచ ఇంధన భద్రతకు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాలుగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement