ఇరాన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ అమెరికా | US launches fresh airstrikes on Iran, IRGC hits military sites in Bahrain, Kuwait | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ అమెరికా

Jul 15 2026 2:45 AM | Updated on Jul 15 2026 4:39 AM

US launches fresh airstrikes on Iran, IRGC hits military sites in Bahrain, Kuwait

ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్‌లపై టెహ్రాన్‌ బాంబుల వర్షం

దుబాయ్‌: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ మధ్య భీకర స్థాయిలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఓడరేవులపై దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తామని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా సైన్యం ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున పలుచోట్ల క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రేవు నగరం బందర్‌ అబ్బాస్‌ సమీపంలో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 

బుషెహర్‌లోనూ 4 ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్‌ వెంటనే ప్రతీకార దాడులకు పాల్పడింది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడింది. అమెరికా–ఇరాన్‌ ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా దౌత్యపరమైన పరిష్కారం లభించకపోతే ఇది పూర్తిస్థాయి యుద్ధంగా తీవ్రరూపం దాల్చవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మధ్యంతర ఒప్పందం ప్రకారం జలమార్గాన్ని తిరిగి తెరవాల్సి ఉండగా, చమురు నౌకలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. హార్మూజ్‌ను బలవంతంగా తిరిగి తెరుస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే, దీనికి భారీ నౌకాదళం లేదా అమెరికన్‌ భూతల దళాలు అవసరమని నిపుణులు అంటున్నారు.  

ఇరాన్‌ సామర్థ్యాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యం!  
ఇరాన్‌లోని తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్‌ స్థావరాలు, సముద్ర సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని పలు ప్రాంతాలపై దాడి చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. దాడులు జరిగినట్లు ఇరాన్‌ సైతం అంగీకరించింది. కానీ, ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ దాడులు ఇరాన్‌ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయని, హార్మూజ్‌లో అమాయక పౌరులు, వాణిజ్య నౌకలపై గురిపెట్టేందుకు వీల్లేకుండా ఇరాన్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ స్పష్టంచేసింది. అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది.

బహ్రెయిన్, జోర్డాన్‌లో వైమానిక దాడులకు పాల్పడింది. బహ్రెయిన్‌లో మంగళవారం తెల్లవారుజామున మూడుసార్లు క్షిపణి హెచ్చరిక సైరన్‌లను మోగించారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్‌ సైన్యం, కువైట్‌ ప్రకటించాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ గగనతలంలో, ఒమన్‌ గల్ఫ్‌ మీదుగా కార్యకలాపాలు నిర్వహించవద్దని తమ విమానయాన సంస్థలను యూరోపియన్‌ యూనియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ హెచ్చరించింది. క్షిపణులు, డ్రోన్ల దాడులు, యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థల వినియోగం వంటి అంశాలు పౌర విమానయానానికి తీవ్ర ముప్పును కలిగించే అవకాశం ఉందని స్పష్టంచేసింది.

టోల్‌ వసూలుపై వెనక్కి తగ్గిన ట్రంప్‌ 
హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై 20 శాతం టోల్‌ఫీజు వసూలుచేస్తానన్న ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ‘‘రాజులు, అమీర్‌లతో మాట్లాడా. టోల్‌ఫీజుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తామన్నారు. అమెరికాలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. గల్ఫ్‌ దేశాలతో కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల రూపంలో అమెరికా ఆదాయాన్ని సాధించబోతోంది’’ అని ట్రంప్‌ అన్నారు.    

ట్యాంకర్లపై ఇరాన్‌ దాడి  
ఒక భారతీయుడి మృతి.. మరో 10 మందికి గాయాలు  

న్యూఢిల్లీ: హార్మూజ్‌ జలసంధిపై పట్టుకోసం ఇరాన్‌ సైన్యం విదేశీ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. మంగళవారం జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు ట్యాంకర్లపై దాడులు చేయడంతో ఒక భారతీయుడు మరణించాడు. 10 మంది భారతీయులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా మారింది. హార్మూజ్‌లో ఎం.టి.అల్‌ బహియా, ఎం.టి.మొంబాసా అనే రెండు వాణిజ్య చమురు నౌకలపై దాడులు జరిగాయి. ఈ రెండు నౌకల్లో మొత్తం 46 మంది నావికులు ఉండగా, వీరిలో 30 మంది భారతీయులు ఉన్నారు. దాడి ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో ఉన్నతాధికారిని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ కార్యాలయానికి పిలిపించి తాజా దాడులపై తీవ్ర నిరసన తెలియజేసింది. హార్మూజ్‌లో నౌకలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని తేల్చి చెప్పింది. నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు హింసాకాండను తక్షణమే విరమించుకోవాలని ఇరాన్‌కు స్పష్టంచేసింది. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాల్లో ముందుకెళ్లాలని సూచించింది.

ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎం.టి.అల్‌ బాహియా నౌకలో 12 మంది భారతీయులు, ఎం.టి.మొంబాసా నౌకలో 18 మంది భారతీయులున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. హార్మూజ్‌ వంటి అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానానికి అంతరాయం కలిగిస్తూ, నావికులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను, హింసాత్మక చర్యలను ఖండిస్తున్నామని తేల్చిచెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement