హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు! | Iran Hits Back at Trumps 20% Hormuz Toll Plan | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

Jul 14 2026 6:46 AM | Updated on Jul 14 2026 6:51 AM

Iran Hits Back at Trumps 20% Hormuz Toll Plan

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధి.. ఉద్రిక్తతలతో పాటు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20 శాతం టోల్‌ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని.. భారత్‌ సహా పలు దేశాలు ఈ రుసుము చెల్లించాల్సిందేనని అంటున్నారాయన. దానికి ఇరాన్‌ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.

ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ చేసిన పోస్టులో.. ఇకపై అమెరికా "ది గార్డియన్‌ ఆఫ్‌ ది హర్ముజ్‌ స్ట్రైట్‌"గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తున్నందున, ఆ ఖర్చుకు ప్రతిఫలంగా హర్ముజ్‌ (Strait of Hormuz) గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనికి విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చీ స్పందిస్తూ.. "హర్ముజ్‌కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అన్నారు. అంతేకాదు 20 శాతం రుసుము చాలా ఎక్కువ.. మేమైతే న్యాయమైన రుసుమే వసూలు చేస్తాం" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

ఇరాన్‌ ఘాటు కౌంటర్‌
ట్రంప్‌ వ్యాఖ్యలపై ఎక్స్‌ (X) వేదికగా స్పందించిన అరాగ్చీ.. "వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే వారికి పారితోషికం ఇవ్వాలన్న ట్రంప్‌ మాట సరైనదే. కానీ హర్ముజ్‌కు ఎప్పటినుంచో నిజమైన గార్డియన్‌ ఇరానే. ఇకముందూ అలాగే ఉంటుంది" అన్నారు.  అయితే ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌పై సెటైర్‌ వేస్తూ.. "20 శాతం చాలా ఎక్కువ. మేమైతే న్యాయంగా వ్యవహరిస్తాం" అని వ్యాఖ్యానించారు. దీంతో హర్ముజ్‌పై అమెరికా-ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

మరోసారి అమెరికా బ్లాకేడ్‌
ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని (Maritime Blockade) అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. జూలై 14 సాయంత్రం 4 గంటల (ET) నుంచి ఇరాన్‌ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై దిగ్బంధన చర్యలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్‌ పోర్టులకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌, హర్ముజ్‌ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.

పాత ఒప్పందం ముగిసిందా?
గతంలో ఏప్రిల్‌ 13 నుంచి జూన్‌ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో దానిని ఎత్తివేశారు. అయితే ఇటీవల ఆ ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్‌ ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.

ఇరాన్‌ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్ముజ్‌లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని, అవసరమైతే టోల్‌ కూడా వసూలు చేసే అధికారం ఉందని చెబుతోంది. దీనిని అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రపంచ నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని వాషింగ్టన్‌ వాదిస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో దాదాపు 20 శాతం హోర్ముజ్‌ జలసంధి గుండా రవాణా అవుతుంది. అందువల్ల ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ అమల్లోకి వస్తే, పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్‌ ట్యాంకర్‌ దాదాపు 30 మిలియన్‌ డాలర్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటివరకు ఇరాన్‌ వసూలు చేసినట్లు భావిస్తున్న రుసుము సుమారు 2 మిలియన్‌ డాలర్ల పరిధిలోనే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇంధన వ్యయం భారీగా పెరగడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హర్ముజ్‌ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్‌ ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement