వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకుపై అమెరికా 20% ఛార్జీ వసూలు చేస్తుందని ప్రకటించారు. "ఇప్పటి నుంచి అమెరికాను 'హార్మూజ్ జలసంధి సంరక్షక దేశం'గా పిలుస్తారు. ఈ అత్యంత ఉద్రిక్త ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించే పనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సరుకులపై 20% రేటుతో తిరిగి వసూలు చేస్తాం. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది" అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు.
హార్మూజ్ జలసంధి తెరిచే ఉందని, అలాగే కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకలు దేశంలోకి రావడం, బయటకు వెళ్లడం అడ్డుకునే దిగ్బంధాన్ని అమెరికా మళ్లీ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. "హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్ ఉన్నా లేకపోయినా అలాగే ఉంటుంది. ఇరాన్ నౌకలు, ఆ దేశ వినియోగదారుల నౌకల రాకపోకలను మాత్రమే అడ్డుకునే దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేస్తున్నాం. మిగతా అన్ని దేశాల నౌకలకు హార్మూజ్ జలసంధి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు" అని ట్రంప్ తెలిపారు.
ఈ పోస్టుకు కొన్ని గంటల ముందు ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. "ఆ జలసంధిని మేమే నియంత్రిస్తాం. దాన్ని నిర్వహించే బాధ్యత కూడా మాదే కావచ్చు. ఆ జలసంధికి సంరక్షకులమవుతాం. దానికి అయ్యే ఖర్చు మాకు తిరిగి రావాలి" అని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ ఘాటు హెచ్చరిక
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సైనిక కమాండ్ ప్రతినిధి వీడియో సందేశం ద్వారా స్పందించారు. హార్మూజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ జలమార్గం విషయంలో అమెరికాతో సహకరించే గల్ఫ్ దేశాల చర్యను యుద్ధ చర్యగానే పరిగణిస్తామని హెచ్చరించారు.
అమెరికా, ఇరాన్ వరుసగా రెండో రోజు పరస్పర దాడులు జరుపుకుంటున్న వేళ ఈ హెచ్చరిక వచ్చింది. హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉందని రెండు దేశాలూ చెబుతున్నాయి.


