సురక్షిత ప్రయాణానికి ఈ రుసుము తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పషీ్టకరణ
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగిన దాడులు
దుబాయ్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై పట్టుకోసం అమెరికా, ఇరాన్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ జలమార్గం ప్రస్తుతం తమ అ«దీనంలోనే ఉన్నట్లు అమెరికా ప్రకటించగా, ఇరాన్ ఖండించింది. హార్మూజ్పై తామే పూర్తిస్థాయిలో పట్టు బిగించాయని తేల్చిచెప్పింది. గత నెలలో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందం ప్రకారం జలసంధి గుండా జరిగే రాకపోకలను నియంత్రించడానికి, నౌకల నుంచి అవసరమైతే రుసుములు వసూలు చేయడానికి తమకు హక్కు ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. దీన్ని అమెరికాతోపాటు ఇతర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
ముమ్మాటికీ మా భూభాగమే: ఐఆర్జీసీ
సోమవారం ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ పరికరాలు, చిన్న పడవలు సహా పదుల సంఖ్యలో లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. హార్మూజ్గన్, ఖుజెస్తాన్, మర్కాజీ తదితర ప్రాంతాల్లో అమెరికా దాడులు చేసిందని, ఈ దాడుల్లో ఇద్దరు మరణించారని ఇరాన్ పేర్కొంది. సిస్తాన్, బలుచిస్తాన్ ప్రావిన్స్ల్లోనూ దాడులు జరిగాయి.
యుద్ధానికి ముందు ఉన్నట్లుగా జలసంధిని తెరిచి ఉంచాలని యూరోపియన్ యూనియన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త కాజా కల్లాస్ పిలుపునిచ్చారు. జలసంధి కోసం ఇరాన్ పోరాడుతుందని ఇరాన్ సుప్రీంలీడర్ సలహాదారు మహమ్మద్ మోఖ్బర్ తేల్చిచెప్పారు.
భవిష్యత్తులో ఇరాన్ నౌకల రాకపోకల కోసం శత్రువుకు కప్పం చెల్లించాల్సిన అవసరం రాకుండా ఉండేందుకు హార్మూజ్ను కాపాడుకుంటున్నామన్నారు. ‘‘హార్మూజ్ జలసంధి ముమ్మాటికీ మా భూభాగమే. ప్రపంచంలోని మరోవైపు నుంచి వస్తున్న దుష్ట సైన్యం, శిశువులను హత్య సైన్యం ఇందులో జోక్యం చేసుకోవడాన్ని మేము సహించం’’అని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది.
గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సైన్యం సోమవారం సైతం దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తదితర దేశాల్లో భారీగా సైరన్ల శబ్దాలు వినిపించాయి. ప్రజలు సురక్షిత ప్రాతాలకు వెళ్లిపోవాలని బహ్రెయిన్ ప్రభుత్వం సూచించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన నాలుగు క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని
తెలియజేసింది.
20 శాతం సుంకం విధిస్తాం
ఆదివారం జరిగిన సమావేశంలో ‘అన్నింటికీ అంగీకారం’ కుదిరిందని ట్రంప్ చెప్పారు. జలసంధిలో ఇరాన్పై దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నామని, సురక్షిత ప్రయాణానికి నౌకల నుంచి రుసుము(టోల్ ఫీజు) వసూలు చేస్తామని ప్రకటించారు. ఇరాన్ నౌకలు ఇకపై ఆ జలసంధి గుండా ప్రయాణించలేవని, సరుకులపై అమెరికా 20 శాతం సుంకం విధిస్తుందని తెలిపారు. ఇరాన్ మినహా మిగతా దేశాలన్నీ జలసంధిని వాడుకుంటాయన్నారు. ఈ ప్రాంతానికి భద్రత కల్పించే విధులకు అవసరమైన ఖర్చులను భరించడానికి ఈ టోల్ ఫీజు తోడ్పడుతుందన్నారు.


