ఇరాన్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుత పాలకులను గద్దె దించి ఆ స్ధానంలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదినీజాద్ను కొత్త నాయకుడిగా కూర్చోబెట్టేందుకు మొసాద్ కొన్నేళ్లుగా రహస్య ఆపరేషన్ నడిపినట్లు 'న్యూయార్క్ టైమ్స్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ప్లాన్ చివరి నిమిషంలో విఫలమైందని ఎన్టీ తమ కథనంలో పేర్కొంది.
కాగా తొలిసారిగా 2024లో హంగేరీ వేదికగా జరిగిన ఒక సదస్సులో అప్పటి మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా అహ్మదినీజాద్తో కలిపి చర్చలు జరిపినట్లు సమాచారం. అహ్మదినీజాద్ విదేశీ ప్రయాణాలకు, నివాసాలకు సంబంధించిన ఖర్చుల కోసం ఇజ్రాయెల్ భారీగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తమకు అహ్మదీనెజాద్తో పరిచయం ఏర్పడిందనే విషయాన్ని మొసాద్ అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ (CIA)కి తెలియజేసిందంట.
అదేవిధంగా 2025 జూన్లో బుడాపెస్ట్లో కూడా మరోసారి ఆయన మొసాద్ ఏజెంట్లను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో అహ్మదినీజాద్ తన బాడీగార్డులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కళ్ళు గప్పి మరి మొసాద్ ఏజెంట్లతో సమావేశమైనట్లు ఇరాన్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి.
సేఫ్ హౌస్ నుండి ఎస్కేప్!
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇరాన్పై ప్రారంభమైనప్పుడు ఈ ఆపరేషన్ చివరి దశకు చేరింది. అహ్మదీనెజాద్ ఉంటున్న కాంపౌండ్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అహ్మదీనెజాద్ చనిపోయాడని ప్రపంచమంతా భావించింది. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే... మొసాద్ ఏజెంట్లు ఆయనను అక్కడి నుంచి రక్షించి, ఇరాన్ లోపలే ఉన్న ఒక రహస్య 'సేఫ్ హౌస్'కు తరలించారు.
అయితే ఇజ్రాయెల్ ప్లాన్ పట్ల అహ్మదీనెజాద్కు నమ్మకం కుదరకపోవడంతో, ఆయన కొన్ని రోజులకే ఆ సేఫ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో ఇరాన్ వర్గాలు షాక్కు గురయ్యాయి. ఇజ్రాయెల్తో ఆయనకు ఉన్న సంబంధాల గురించిన పూర్తి వివరాలను ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా కనిపెట్టాయి. దీంతో అహ్మదీనెజాద్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


