కోహ్లి, రోహిత్‌ వచ్చేశారు... | England and India clash in the 1st ODI on 14 july 2026 | Sakshi
Sakshi News home page

కోహ్లి, రోహిత్‌ వచ్చేశారు...

Jul 14 2026 5:53 AM | Updated on Jul 14 2026 5:53 AM

England and India clash in the 1st ODI on 14 july 2026

వన్డే సిరీస్‌లో విజయంపై భారత్‌ దృష్టి

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ తొలి వన్డే

మధ్యాహ్నం గం.3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

బర్మింగ్‌హామ్‌: ‘టి20 సిరీస్‌ ప్రభావం మాపై ఉండదు. ఫార్మాట్‌ వేరు, జట్టు వేరు, లక్ష్యం వేరు. పూర్తిగా భిన్నమైన, కొత్త తరహా వాతావరణం ఇక్కడ కనిపించనుంది’... ఇంగ్లండ్‌తో భారత్‌ వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ చేసిన వ్యాఖ్య ఇది. ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనలో కలిపి ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా ఆరు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో పోరుకు సిద్ధమైంది. 

ఇక్కడైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి సిరీస్‌లో పైచేయి సాధించాలని భారత్‌ పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ కోసం జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే టి20లకంటే ఈ ఫార్మాట్‌లో టీమిండియా ప్రదర్శన కీలకం కానుంది. భారత జట్టు తాము ఆడిన గత 6 వన్డే సిరీస్‌లలో 3 సిరీస్‌లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన గత 5 వన్డేల్లోనూ భారత్‌ గెలవడం విశేషం.  

బుమ్రా 2 ఏళ్ల 8 నెలల తర్వాత... 
మాజీ కెప్టెన్లు, స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ రాకతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. వీరికి తోడు నిలకడగా రాణించే కెప్టెన్‌ గిల్‌ ఆట జట్టుకు అదనపు బలం. ఎలాగైనా వరల్డ్‌ కప్‌ ఆడాలనే లక్ష్యంతో ఉన్న కోహ్లి, రోహిత్‌ ఈ క్రమంలో తమకు లభించే ప్రతీ అవకాశాన్ని సమర్థంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారిద్దరి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించవచ్చు. 

ఈ టాప్‌–3 తర్వాత  శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌ బాధ్యతలు తీసుకుంటారు. వన్డేల్లో రెగ్యులర్‌ బ్యాటర్‌గా రాహుల్‌ ఇప్పటికే పలు మార్లు తన విలువను చూపించాడు. ఇప్పుడు శ్రేయస్‌పై మాత్రం అదనపు భారం ఉంది. పేస్‌ బౌలింగ్‌లో అన్నింటికంటే పెద్ద బలం జస్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనంగా చెప్పవచ్చు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత బుమ్రా వన్డేలే ఆడలేదు! 

మరో ఇద్దరు యువ పేసర్లు గుర్నూర్, ప్రిన్స్‌లకు చోటు కల్పిస్తారా... ఒకరిని పక్కన పెట్టిన అర్ష్ దీప్‌ను ఆడిస్తారా చూడాలి.

ఆల్‌రౌండర్లే బలం... 
టి20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లండ్‌ అదే ఊపులో వన్డే సిరీస్‌పై కన్నేసింది. టి20 టీమ్‌లో ఉన్న కెప్టెన్‌ బ్రూక్, ఆర్చర్, బెతెల్, బట్లర్, కరన్, టంగ్, రషీద్, జాక్స్‌లు వన్డేల్లో కూడా జట్టును గెలిపించగల సమర్థులు. వీరందరితో పాటు సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ వన్డే జట్టులో ఉండటం ఇంగ్లండ్‌కు పెద్ద సానుకూలాశం. అయితే జనవరిలో శ్రీలంకతో తలపడిన తర్వాత టీమ్‌ ఒక్క వన్డే కూడా ఆడలేదు. దాంతో ఈ ఫార్మాట్‌లో సన్నద్ధత విషయంలో కొంత తడబాటు కనిపించింది. అయితే సొంతగడ్డపై సిరీస్‌ కాబట్టి ఇంగ్లండ్‌ ఈ సవాల్‌ను అధిగమించగలదు. 2024 నుంచి ఆడిన 7 వన్డే సిరీస్‌లలో 5 ఓడిపోయిన ఇంగ్లండ్‌... చాంపియన్స్‌ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement