Photo credit : x
భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను పునరుద్ధరించాలని కోరాడు.
ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
"ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలి. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నాడు.
ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలు ఎంతో ఆదరణ పొందేవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రతి ఏడాది నిర్వహించే ట్రై-సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే టీ20 క్రికెట్ విస్తరణతో అలాంటి టోర్నీలు క్రమంగా అంతరించిపోయాయి.
కాగా, ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.
తాజాగా భారత్ ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోవడంతో ఈ సిరీస్ను ప్రాధాన్యత మరింత పెరిగింది. శుభ్మన్ గిల్ అయినా టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించగా.. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.


