చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం | India Women Beat England Women In Historic Lords Test | Sakshi
Sakshi News home page

చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం

Jul 13 2026 5:06 PM | Updated on Jul 13 2026 5:35 PM

India Women Beat England Women In Historic Lords Test

PC: BCCI Women X

‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌లో భారత్‌ చారిత్రక విజయం సాధించింది. ఈ మైదానంలో మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్‌ సేన చరిత్రకెక్కింది.

స్మృతి మంధాన అర్ధ శతకం
లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌- భారత్‌ మహిళా జట్ల మధ్య శుక్రవారం ఏకైక టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్‌ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం (83)తో మెరిసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (58), దీప్తి శర్మ (57) కూడా హాఫ్‌ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్‌ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అమీ జోన్స్‌ అర్ధ శతకం (52)తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.

క్రాంతికి ఐదు వికెట్లు
ఇక భారత బౌలర్లలో పేసర్‌ క్రాంతి గౌడ్‌ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేసిన మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. మిగిలిన వారిలో సయాలీ సత్ఘరే, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

యస్తికా సెంచరీ
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం (115 పరుగులు) కలుపుకొని రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌.. ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా సెంచరీ (113)తో సత్తా చాటింది.

ఇంగ్లండ్‌ లక్ష్యం 457
ఫలితంగా టీమిండియా ఇంగ్లండ్‌ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్‌ కేవలం 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో 130/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌.. మరో 56 పరుగులు జతచేసి ఆలౌట్‌ అయింది.

ఆఖరి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్‌ స్టార్‌ సోఫీ ఎక్లిస్టోన్‌ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసింది. భారత్‌ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు కూల్చారు.

సంక్షిప్త స్కోర్లు
భారత్‌ : 285 &3 41/7 డిక్లేర్డ్‌
ఇంగ్లండ్‌ : 170 & 186
ఫలితం : ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో భారత్‌ గెలుపు.

చదవండి: టీమిండియాలోకి సూర్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement