టీమిండియాలోకి సూర్యకుమార్‌ యాదవ్‌! | BCCI Planning Suryakumar T20I Comeback After Disastrous England Tour | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి సూర్యకుమార్‌ యాదవ్‌!

Jul 13 2026 3:38 PM | Updated on Jul 13 2026 4:19 PM

BCCI Planning Suryakumar T20I Comeback After Disastrous England Tour

ఐసీసీ చైర్మన్‌ జై షాతో సూర్య (PC: BCCI X)

టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. కానీ ఈ మెగా టోర్నీ తర్వాత జట్టు ఆడిన తొలి సిరీస్‌లోనే ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌పై వేటు పడింది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా.. జట్టులోనే అతడికి స్థానం లేకుండా చేసింది.

గత ఏడాదిన్నర కారణంగా బ్యాటర్‌గా సూర్యకుమార్‌ వ్యక్తిగత వైఫల్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సూర్య స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు, పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.

ఘోర పరాభవం!
అయితే, అయ్యర్‌ కెప్టెన్సీలో తొలి సిరీస్‌లోనే భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌లో 2-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఇంగ్లండ్‌ చేతిలోనూ 4-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. దీంతో తాజా యూకే టూర్‌ భారత క్రికెట్‌ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో సూర్యను గుర్తు చేసుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అతడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా జర్నలిస్టు కరిష్మా సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌!.. కానీ ఓ కండిషన్‌!
సూర్యకు టీమిండియా తలుపులు శాశ్వతంగా ఏమీ మూసుకుపోలేదన్నారు. అతడు త్వరలోనే తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, అందుకోసం సూర్య దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున.. అదే విధంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫునా కచ్చితంగా రాణించాల్సి ఉంటుందని కరిష్మా చెప్పుకొచ్చారు.

అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు కరిష్మా తెలిపారు. బంతి ఇప్పుడు సూర్య కోర్టులోనే ఉందన్నారు. 

దేశీ క్రికెట్‌లో రాణిస్తే తప్పక అతడు తిరిగి టీమిండియాలో అడుగుపెడతారని జోస్యం చెప్పారు. కాగా మాజీ ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్‌, దినేశ్‌ కార్తిక్‌ తదితరులు కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైనా.. దేశీ క్రికెట్‌లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.

చదవండి:  ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు భారత జట్టు ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement