ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిని ఉపయోగించే నౌకలపై 20శాతం రుసుము వసూలు చేయాలనే తన ప్రతిపాదనను ట్రంప్ ఉపసంహరించుకున్నారు.
దీనికి బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాతో కుదుర్చుకోబోయే భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలతో టోల్ ఫీజును భర్తీ చేయనున్నట్టు ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. కాగా హోర్ముజ్ జలసంధి భద్రతా వ్యయాన్ని భరించడానికి నౌకల కార్గో విలువపై 20 శాతం టోల్ ఫీజు విధిస్తామని సోమవారమే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాల రాజులు, ఎమిర్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
అయితే టోల్ ప్లాన్ రద్దయినప్పటికీ, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించనున్న ఆర్థిక, రవాణా దిగ్బంధనం మాత్రం మరికొద్ది గంటల్లో అమలు కానుంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మూజ్ నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది.


