ఒకప్పుడు తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వన్ప్లస్. ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.
జర్మన్ వార్తా సంస్థ విన్ఫ్యూచర్ కథనం ప్రకారం, వన్ప్లస్ తన మాతృసంస్థ ఒప్పోతో కలిసి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై మీడియాతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఈ నిర్ణయానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తలు వన్ప్లస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారత్లో మాత్రం తన వ్యవహారాలను కొనసాగించనుంది. దీనికి కారణం కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్ కావడమే. చైనాలో కూడా సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా జరపనుంది.
ఇప్పటికే వన్ప్లస్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి కూడా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం.. వినియోగంలో ఉన్న ఫోన్లకు వాటి సపోర్ట్ గడువు పూర్తయ్యే వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు, సెక్యూరిటీ అప్డేట్లు, సర్వీస్ సెంటర్ సేవలు అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. అయితే.. కొత్త ఫోన్ల విడుదల, లేటెస్ట్ స్టాక్ విక్రయం, స్థానిక మార్కెటింగ్ కార్యక్రమాలు మాత్రం నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్లోని కొన్ని దేశాల్లో వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లలో ఫోన్ల స్టాక్ కూడా దాదాపు ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది.


