అబుదాబి: హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి హర్ముజ్కు ప్రత్యామ్మయంగా తూర్పు తీరంలో ఓ కొత్త ఓడరేవు నిర్మించే ప్రణాళిక చేపడుతుంది. ఇదే పూర్తయితే ఇక ఇరాన్తో సంబంధం లేకుండా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని యూఏఈ భావిస్తోంది.
అమెరికా ఇరాన్ యుద్ధం మెుదలై దాదాపు నాలుగు నెలలు గడుస్తోన్నా ఇంకా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిపై అధిపత్యం విషయంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ చర్చలు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా స్తంభించి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు దేశాలు చమురు లేక అనేక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
UAEకు చెందిన ప్రముఖ బహుళజాతి లాజిస్టిక్స్ సంస్థ "డీపీ వరల్డ్" తన వ్యాపార కార్యకలాపాలను దేశ తూర్పు తీరానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దుబాయ్లోని తన ప్రధాన వ్యాపార కేంద్రమైన 'జెబెల్ అలీ' పోర్టుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, వివాదాస్పద హర్ముజ్ జలసంధిముప్పును తప్పించుకోవడమే దీని ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.దానికి ప్రత్యామ్నయంగా ఫుజైరాతీరప్రాంతంలో సరికొత్త మల్టీపర్పస్ పోర్టును, అలాగే అక్కడ ఉన్న పాత ఓడరేవులో కొత్త కంటైనర్ టెర్మినల్ను అభివృద్ధి చేయడానికి అధికారులతో చర్చలు జరుపుతోన్నట్లు ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వచ్చే భద్రతా ముప్పుల నుండి తమ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలనే అబుదాబి ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే డిపి వరల్డ్ ఈ అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు
ఈ కొత్త పోర్టు గనుక అందుబాటులోకి వస్తే హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే.. సరుకు రవాణా నౌకలు నేరుగా దేశంలోకి వచ్చేందుకు అక్కడి నుండి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్కు ఉన్న ఏకైక పెద్ద ఓడరేవు 'జెబెల్ అలీ పోర్ట్' పర్షియన్ గల్ఫ్ లోపల ఉంది.దుబాయ్ నుండి అమెరికా, యూరప్, ఆఫ్రికా లేదా భారతదేశం లాంటి దేశాలకు ఓడలు వెళ్లాలన్నా.. లేదా అక్కడి నుండి దుబాయ్కి సరుకు రావాలన్నా.. ఇరాన్ పక్కనే ఉండే అత్యంత ఇరుకైన హోర్ముజ్ జలసంధిని దాటడం తప్ప వేరే మార్గం లేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం దుబాయ్ (డిపి వరల్డ్) నిర్మించాలనుకుంటున్న కొత్త పోర్టు వ్యూహాత్మకంగా ఫుజైరా తీరంలో రానుంది. ఇది భౌగోళికంగా బయటి వైపు ఉండటంతో నేరుగా హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయ నౌకలు అసలు ఆ సమస్యాత్మకమైన హోర్ముజ్ జలసంధి లోపలికి ప్రవేశించాల్సిన అవసరమే ఉండదు.


