రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు ఊరట లభించింది. రష్యా ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా చట్టసభ సభ్యులు తీసుకొచ్చిన కఠిన ఆంక్షల బిల్లులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం వరకు భారీ టారిఫ్లు విధించే ప్రతిపాదన ఉండగా, తాజాగా సవరించిన బిల్లులో ఆ పరిమితిని 100 శాతానికి తగ్గించారు. దీంతో అమెరికా టారిఫ్ ముప్పు నుంచి భారత్, చైనాలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన ఈ ద్వైపాక్షిక బిల్లును రిపబ్లికన్ పార్టీకి చెందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమొక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ తొలిసారిగా ప్రవేశపెట్టారు. రష్యా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటు.. రష్యా ఇంధనంపై ఆధారపడుతున్న దేశాలపై టారిఫ్ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.
ప్రారంభ ప్రతిపాదనలో రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలపై ఒకే విధంగా 500 శాతం భారీ సుంకాలు విధించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అమల్లోకి వస్తే రష్యా చమురుకు ప్రధాన కొనుగోలుదారులైన భారత్, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండేది. అయితే తాజాగా సవరించిన వెర్షన్లో రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై విధించే టారిఫ్ను గరిష్ఠంగా 100 శాతానికి తగ్గించారు.
కొత్త ప్రతిపాదనలో కొన్ని దేశాలకు మినహాయింపులు కూడా కల్పించారు. రష్యా సహజ వాయువు దిగుమతులు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలు, ఆ దిగుమతులను తగ్గించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంటున్నట్లయితే ఆ దేశాలకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఈ నిబంధనతో జపాన్, ఫ్రాన్స్, హంగేరీ, బెల్జియం వంటి దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బిల్లుకు ప్రస్తుతం అమెరికా సెనేట్లో మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 26 మంది సెనేటర్లు సహ-ప్రతిపాదకులుగా ఉన్నారని సెనేట్ వర్గాలు తెలిపాయి. మరింత మంది సభ్యులు మద్దతు ఇస్తారని, బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. వీటితో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ కూడా రష్యా ముడి చమురు దిగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా సహజ వాయువు దిగుమతుల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరీ, బెల్జియం ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఇక, రష్యా చమురు ఆదాయం తగ్గించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంపై మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా లక్ష్యం. అయితే భారత్ మాత్రం తన ఇంధన అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. చౌక ధరలకు లభించే రష్యా ముడి చమురు భారత ఇంధన భద్రతకు కీలకంగా మారింది. 500 శాతం టారిఫ్ ప్రతిపాదన నుంచి 100 శాతం పరిమితికి మారడం భారత్కు తక్షణ ఉపశమనంగా కనిపిస్తోంది. అయితే రష్యా చమురు అంశం అమెరికా-భారత్ సంబంధాల్లో, అలాగే ప్రపంచ ఇంధన రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా కీలక అంశంగానే కొనసాగనుంది.


