పూరీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గర్భాలయం నుంచి బయటకు వచ్చి, మూడు రథాలను అధిరోహించి, భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
అంగరంగ వైభవంగా జరిగే యాత్ర కోసం జగన్నాథుడి రథం నందిఘోష, బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్ర రథం దర్పదళన్ సిద్ధమయ్యాయి. దేవుళ్ల అనుమతికి సూచికగా ఆజ్ఞామాలను స్వీకరించిన తర్వాత రథాలను 12వ శతాబ్దపు ఆలయ సింహద్వారం వద్దకు తీసుకువెళ్లారు. ఆలయం ముందున్న గ్రాండ్ రోడ్డుపై రథాలు నిలిచి ఉన్నాయి. రథ యాత్రను ప్రత్యక్షంగా తిలకించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.
అన్ని సంప్రదాయ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత గురువారం సాయంత్రం 4 గంటలకు త్రిమూర్తుల రథయాత్ర ప్రారంభం కానుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు లక్ష మంది ప్రజలు పూరీకి చేరుకున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీ రథయాత్ర ఈ నెల 24న ముగుస్తుంది.


