గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: ప్రభుత్వం, ప్రజల మధ్య సమర్థవంతమైన వారధులుగా ప్రభుత్వ అధికారులు నిలవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. ప్రజలకు మెరుగైన సేవల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. బుధవారం జరిగిన ఒడిశా పరిపాలనా సర్వీస్ – ఓఏఎస్ (డీఆర్ 2023) బ్యాచ్ ప్రొబేషనరీ అధికారుల సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. స్థానిక లోక్ భవన్ అభిషేక్ హాల్లో 31 మంది ఓఏఎస్ ప్రొబేషనరీ అధికారులతో ఆయన మాట్లాడారు. అధికారులకు విధాన లక్ష్యాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలపై కూడా గట్టిపట్టు ఉండాలని గవర్నర్ సూచించారు. సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు, అర్హులైన లబ్ధిదారులకు గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా చూడటానికి ఇటువంటి పరిజ్ఞానం అక్కరకు వస్తుందన్నారు. పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, పీఎం సూర్య ఘర్, ముఫ్త్ బిజ్లీ యోజన వంటి కీలక కార్యక్రమాలపై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా సేవల పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి చక్కని అవగాహనతో అధికారుల చురుకుదనం కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. సంబంధిత సామాజిక భద్రతా పథకాలలో తాము నమోదు చేసుకుని, ఆయా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని చురుకుగా ప్రోత్సహించాలని శిక్షణార్థులకు సలహా ఇచ్చారు. కోవిడ్ 19 మహమ్మారికి భారత దేశం స్పందించిన తీరును గుర్తుచేసుకుంటూ ఆత్మ నిర్భరత, ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన ద్వారా దేశం సవాళ్లను అవకాశాలుగా సమర్థవంతంగా మార్చుకుందని డాక్టర్ కంభంపాటి పేర్కొన్నారు. విదేశీ మాదక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం తగ్గింపు వంటి విచక్షణతో కూడిన ఖర్చులలో వివేకంతో వ్యవహరించాలన్నారు. గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మోనాలిసా లెంకా స్వాగతోపన్యాసం చేసి శిక్షణ ఉద్దేశాన్ని వివరించారు.


