Odisha News
-
కొరాపుట్ జిల్లాలో ముగ్గురు వలస కార్మికులు మృతి
కొరాపుట్: పొట్టకూటి కోసం వెళ్లిన ముగ్గురు వలస కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారు. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కక్కిరిగుమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలో పంచాడా గ్రామానికి చెందిన తంగు జానీ (30), మెఘా జానీ (27) మృతి చెందారు. దిబా జానీ (29) విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ గ్రామానికి చెందిన సుమారు 10 మంది యువకులు మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ధన్య శ్రీ కేష్ గ్రానైట్ పరిశ్రమలో పని చేయడానికి వెళ్లారు. అక్కడ ధూళి, కాలుష్యం వల్ల వీరంతా అనారోగ్యం పాలయ్యారు. దాంతో వీరంతా ఇంటి బాట పట్టారు. అనారోగ్యం పాలైన వారిలో జిత్తు జాని అనే యువకుడు ప్రస్తుతం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. గతంలో మరో ఇద్దరు యువకులు కూడా పరిశ్రమ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యంతో మృతి చెందారన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోనికి రావడంతో జిల్లా అధికారులు ఆ గ్రామానికి తరలి వెళ్లారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మరణాలకు కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవడానికి వివిధ శాఖల మద్య సమన్వయం జరుగుతుంది. ఈ సంఘటన తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క బాదిత గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలు వెల్లడించిన వివరాలు నమోదు చేసుకున్నారు. చట్టపరంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే పవిత్ర శాంత బాధిత గ్రామానికి వెళ్లారు. ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. అనారోగ్యం పాలైన దిబాకర్ జానీ విశాఖ పట్నంలో మృతి చెందాడన్నారు. అతని మృతదేహం విడుదల చేయడానికి డబ్బులు బాకీ ఉన్నాడని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారన్నారు. వెంటనే తాను రు.85 వేలు ఫోన్ పే చేయగా విడుదల చేశారన్నారు. తాను పంపిన ఫోన్ ఫే వివరాలు మీడియాకి చూపించారు. రాష్ట్రంలో గిరిజన గ్రామాల్లో యువతకి ఉపాధి లేకుండా పోయిందన్నారు. దాంతో ఈ మరణాలు జరుగుతున్నాయన్నారు. తక్షణం ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
జాంత్రీని ఆదర్శ పంచాయతీగా మార్చాలి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జాంత్రీ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ ఆదేశాలతో జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి ఈ రోజు మంగళవారం జంత్రీ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భీమభోయి దివ్యాంగ సామర్థ్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. మొత్తం 154 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. వీరిలో 83 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. 24 మంది దివ్యాంగులు, 13 మంది మానసిక వికలాంగులు, 12 మంది దృష్టిలోపం ఉన్న వారు 22 మంది చెవిటి, మూగ దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా భద్రతాధికారి నిర్మల్ ధారువా, డీఎంఓ డాక్టర్ నిహర్ రంజాన్ ప్రహరాజ్, చిత్రకొండ బీడీఓ ప్రీత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తుఫాన్పై సన్నద్ధత
భువనేశ్వర్: ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన మంగళ వారం తుఫాను సన్నద్ధతా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనూ గర్గ్ మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టుకోవాలన్నారు. అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని శర వేగంగా ప్రసారం చేయడం జరగాలని సూచించారు. పటిష్టమైన సన్నద్ధత, మెరుగైన సమన్వయం, ముందస్తు హెచ్చరికలను సకాలంలో అందించడం ద్వారా జీరో క్యాజువాలిటీ మిషన్కు కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించారు. తుఫాను, వరద ఆశ్రయాలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా చూడాలని, నియంత్రణ గదులను తక్షణమే క్రియాశీలం చేయాలని, మరియు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీ) ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా మత్స్యకారులకు తుఫాను హెచ్చరికలను సకాలంలో తెలియజేయడం, సమర్థమైన విపత్తు ప్రతిస్పందన కోసం శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గాలింపు, సహాయక చర్యల కోసం 30 ఒడీఆర్ఏఎఫ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగేందుకు సన్నద్ధంగా ఉన్నాయని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) తెలిపారు. ప్రస్తుతం ఒడిశా తీరంలో తుఫాను వచ్చే అవకాశం లేదని స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మనోరమ మహంతి తెలియజేశారు. అయినప్పటికీ రాష్ట్రం అన్ని స్థాయిలలో పూర్తి సన్నద్ధతను కొనసాగించాలని ఆమె సూచించారు. సమావేశానికి అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శి డీకే సింగ్, అగ్నిమాపక సేవల డైరెక్టరు జనలర్ డాక్టర్ ఎస్. షడంగి, ప్రత్యేక సహాయ కమిషనర్, భారత వాతావరణ శాఖ, ఓడీఆర్ఏఎఫ్ ఉన్నతాధికారులు, సంబంధిత అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. -
చిరు తగాదాతో మహిళ దారుణ హత్య
● సైకిల్పై మృతదేహంతో నిరసన భువనేశ్వర్: పొరుగు వారితో జరిగిన చిరు తగాదాతో పట్ట పగలు మహిళ దారుణ హత్యకు గురైంది. బాలాసోర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, నిందితులను పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మంగళ వారం ఉదయం ఆమె మృతదేహాన్ని సైకిల్పై దాదాపు 15 కిలో మీటర్ల దూరం ఖొయిరా పోలీస్ ఠాణా వరకు తీసుకు వెళ్లారు. హరిపూర్ గ్రామంలో ఆదివారం నాడు వారి పొరుగువాడు గొడ్డలితో దాడి చేయడంతో కమలా సెఠి మరణించింది. ఆమె వదిన తీవ్రంగా గాయపడింది. పోస్టు మార్టం తర్వాత మృత దేహాన్ని తమకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు దాన్ని సైకిల్పై ఎక్కించుకుని పోలీస్ ఠాణా వైపు కవాతు చేశారు. దారి పొడవునా పట్టపగలు ఆమెను ఎలా నరికి చంపారో వారు ప్రజలకు వివరించారు. నడి రోడ్డు మీద కొనసాగుతున్న నిరసన సమాచారం అందడంతో ఖొయిరా ఠాణా పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మృతదేహాన్ని తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన అంబులెన్స్ను నిరసనకారులు నిరాకరించారు. మృత దేహాన్ని రోడ్డుపై ఉంచి పోలీస్ ఠాణా సమీపంలో ప్రదర్శన నిర్వహించారు. కమలా సెఠి ఇంట్లో పైకప్పు నిర్మాణానికి సెంటరింగ్ పనులు జరుగుతుండగా ఎండు కట్టెలు, వెదురు కరల్రు, ఖాళీ ప్లాస్టిక్ సంచులు వంటి నిర్మాణ సామగ్రి పొరబాటున జారి పొరుగున ఉన్న మానస్ జెనా ఇంటి ఆవరణలో పడటంతో ఈ వివాదం చెలరేగింది. సెంటరింగ్ పనులు పూర్తయ్యాక నిర్మాణ సామగ్రిని తొలగిస్తామని కమల, శకుంతల అభ్యర్థించిన మానస్ జెనా వారితో తీవ్ర వాగ్వాదానికి తలపడ్డాడు. తీవ్ర ఆగ్రహ ఆవేశంతో అతడు గొడ్డలిని తీసుకుని కమల, శకుంతలపై దాడి చేసినట్లు ఆరోపణ. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఖొయిరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో తొలుత భద్రక్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి, ఆ తర్వాత కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. ఆదివారం రాత్రి గాయాలతో చికిత్స పొందుతూ కమలా సెఠి తుది శ్వాస విడిచింది. దాడిలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఖొయిరా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి భారతి జెనాని అరెస్టు చేశారు. మానస్ తన తండ్రి భరత్ జెనాతో కలిసి పరారీలో ఉన్నాడు, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని బాలాసోర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యూష్ దివాకర్ తెలిపారు. -
ఫుట్బాల్ పోటీలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో సీఎం ఫుట్బాల్ ట్రోఫీ చాంపియన్షిప్ పోటీలను అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గుణి మఝి సాయంత్రం ప్రారంభించారు. ఈ అంతర్జిల్లా చాంపియన్ షిప్ పోటీలకు 14 ఏళ్ల లోపు బాలుర జట్లు 6, బాలికలు 5 జట్లు పాల్గొన్నాయి. పర్లాకిమిడి, గుసాని బ్లాక్లో ఉప్పలాడ ఠాగోర్ మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయగిరి, నువాగడ, బాగుసల (గుసాని), కాశీనగర్ జట్లు తొలిరోజు పాల్గొన్నారు. తొలుత చంద్రగిరి, గుసాని సమితి బాగుసల పాఠశాల విద్యార్థులు తలపడ్డారు. వీరిలో చంద్రగిరి ఉన్నత పాఠశాల విద్యార్థులు పైచేయి సాధించారు. ఈ సందర్భంగా ఏడీఎం మఝి మాట్లాడుతూ, అండర్ 14 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం సీఎం ట్రోఫీను అందజేస్తుందని, అందుకోసం ఈనెల 14 వరకూ స్టేడియంలో ఫుట్బాల్ పోటీలు జరుపుతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, ఉన్నత పాఠశాలల క్రీడాధికారి సురేంద్ర పాత్రో, ఎస్ఎస్డీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాధికారి సంతోష్ప్రసాద్ పండా, ఉప్పలాడ ప్రభుత్వ ఠాగోర్ ఉన్నత పాఠశాల పీఈటీ రేఖారాణి దేవ్ తదతరులు పాల్గొన్నారు. -
మజ్జిగౌరీ మందిరం అభివృద్ధిపై సమీక్ష
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరీ మందిరం అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆధికారులతో మంగళవారం సమీక్షించారు. మందిరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు బీజేడీ ప్రభుత్వ హయాంలో 26 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి గత ఏడాది ఆగస్టు 29వ తేదిన అభివృద్ధి పనులకు భూమి పూజ జరిగింది. బరంపురానికి చెందిన ఒక కాంట్రాక్ట్ కంపెనీకి టెండర్ లభించింది. రెండేళ్లలో నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నది షరతు. అయితే భూమి పూజ ప్రారంభించి ఆరు నెలలు గడిచినప్పటికీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టలేదు. అయితే గత నాలుగు నెలలుగా అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా పనుల శాఖ అధికారులతో మజ్జిగౌరీ మందిరం ప్రాంగణంలో సమీక్షించారు. త్వరలో పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మందిరం ప్రవేశద్వారం నామమాత్రంగా కాకుండా అందరినీ ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, డార్మిటరీ, ప్రసాద సేవన గృహం పనులు జూన్ చివరి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తామని అధికారులు వివరించారు. -
మాజీ మంత్రి రఘునాథ్ పట్నాయక్కు ఘననివాళులు
జయపురం: రాష్ట్ర ఆర్థిక, న్యాయ శాఖల మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయవేత్త స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ 10వ వర్ధంతి సందర్బంగా జయపురం లో ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. స్థానిక రఘునాథ్ పట్నాయక్ కూడలి వద్ద ఏర్పాటు చేయబడిన నిలువెత్తు స్వర్గీయ పట్నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పెద్ద కుమారుడు కాంగ్రెస్ నాయకుడు బిరెన్ మోహణ పట్నాయక్, చిన్న కుమారుడు ప్రముఖ సంగీత కళాకారుడు ధిరెన్ మోహణ పట్నాయక్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, పుర ప్రముఖులు నివాళులు అర్పించారు. అలాగనే కొరాపుట్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు రూపక్ తురుక్ పిలుపు మేరకు స్థానిక జిల్లా కాంగ్రేస్ భవణంలో నిర్వహించిన స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రేస్ పార్టీ జిల్లా కార్యదర్శి రూపక్ తురుక్ అవిభక్త కొరాపుట్ జిల్లాకు, రాష్ట్రానికి స్వర్గీయ పట్నాయిక్ మంత్రిగా అందించిన సేవలు, వివరించారు.అవిభక్త కొరాపుట్ జిల్లాలో పలు పరిశ్రమలు న్యాయ, మహిళా కళాశాలల ఏర్పాటులో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవల స్పూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.అలాగనే స్థానిక యాదవ భవణంలో కొరాపుట్ జిల్లా ఉత్కళ సమ్మిలినీ స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ వర్దంతి సభను నిర్వహించి నివాళులు అర్పించారు. ఘనంగా నర్సింగ్ దినోత్సవం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో సత్యనారాయణ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్లో మంగళవారం 52వ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షురాలు హాజరై నర్సింగ్ విద్య స్థాపకురాలు ఫోరెసీ నిగితిన్గేలా సేవాభావం క్రమశిక్షణ, అంకితభావాన్ని విద్యార్థులకు వివరించారు. ఆమె త్యాగం నిస్వార్ధ సేవా భావం ద్వారా ప్రేరణ పొందుతూ దేశానికి, సత్యనారాయణ్ నర్సింగ్ సంస్థకు పేరు.. గౌరవం తీసకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షురాలు సుశ్రీ సుమరిన్ సుమన్ కార్తిక్, తనుశ్రీ దేవనాధ్, సిబ్బంది పాల్గున్నారు . ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ కిల్లి వెంకటరావు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పరిశీలించి వివరాలు సేకరించారు. లారీ ఢీకొని రిటైర్డ్ ఎంఈఓ మృతి ఎచ్చెర్ల: అల్లినగరం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో ఆకుల సన్యాసినాయుడు (80) మృతి చెందారు. ఈయన విశాఖపట్నం నుంచి స్వగ్రామం వచ్చేందుకు అల్లినగరం జంక్షన్ వద్ద బస్సు దిగి జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సన్యాసినాయుడుకు భార్య సీతారత్నం, కుమారుడు నాయుడుబాబు, కుమార్తె ఉమ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జయపురం అభివృద్ధికి కృషి
జయపురం: కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి కొరాపుట్ జిల్లా న్యాయవాదుల సంఘం మంగళవారం సన్మాణించింది. ఈ సందర్భంగా న్యాయ వాదుల సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు పిట్టా రమేష్ పాత్రో, జిల్లా అధ్యక్షుడు బిజయ రాయ్ జనాదేవ్, ఉపాధ్యక్షుడు శరత్ మఝి, కార్యదర్శి సహదేవ్ పట్నాయక్, కోశాధికారి వి.రామానుజ ప్రసాద్, తదితరులు ఎంపీ సప్తగిరి ఉల్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ను స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు రమేష్ పాత్రో మాట్లాడుతూ.. గతంలో జయపురంలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఎంపీ నిర్వహించిన భూమికను గుర్తు చేశారు. ఇక ముందు కూడా న్యాయవాదుల ప్రయోజనాల కోసం లోక్ సభలో గళం విప్పాలని కోరారు. జిల్లా న్యాయవాదుల సంఘ నూతన భవన ఉన్నతికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత మొత్తం సమకూర్చాలని జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు జనాదేవ్ విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఉల్క మాట్లాడుతూ జయపురం అభివృద్ధికి కోసం తాను అన్ని వేళలా ముందుంటానని వెల్లడించారు. జయపురం నుంచి భువనేశ్వర్కు పగటి పూట రైలు నడపాలని లోక్ సభలో పదే, పదే తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. భువనేశ్వర్–విశాఖపట్నం వందే భారత్ రైల్ను అరుకు మీదుగా కొరాపుట్ వరకు పొడిగించాలని పార్లమెంట్లో తాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జయపురం విమానాశ్రయం విస్తరణ, జయపురం నుంచి – మల్కనగిరి, జయపురం నుంచి నవరంగపూర్ రైల్వే లైన్లు త్వరతిగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానన్నారు. జయపురం పట్టణం ఉన్నతికి తాను కట్టుబడి ఉంటానని, న్యాయవాదుల సంఘం ఏ ప్రతిపాదన చేసినా అమలు చేసేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం న్యాయవాదుల సంఘం నూతన భవనాన్ని సందర్శించారు. భవనాన్ని మరింతగా అభివృద్ధి పరచే విషయంపై తాను జిల్లా కలెక్టర్తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ సహాయ కార్యదర్శి భోళా పట్నాయక్, సభ్యులు తరణి పాణిగ్రహి, దాశరథి పట్నాయక్, సుభాష్ పండా, లాల్ మోహన్ షడంగి, రాజేంద్ర కుమార్ గౌడ, అరుణ పండా, నళినీ రథ్, రేఖా భాయ్, సురేష్ పట్నాయక్, బిభూతి పట్నాయక్, శిశిర మిశ్ర, ఆరతి మహంతి, తదతరులు పాల్గొన్నారు. -
సకాలంలో ఎరువులు అందించాలి
జయపురం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, మండీలకు తీసుకువచ్చిన ధాన్యం కొనుగోలుపై దృష్టి కేంద్రీకరించాలని కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. లేంప్స్ల ప్రధాన లక్ష్యం.. వ్యవసాయం ఉన్నతి, రైతుల ఆర్థిక ప్రగతే కావాలన్నారు. మంగళవారం జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి బొతాసన గ్రామంలో నిర్వహించిన కొట్పాడ్ లేంప్స్ స్వతంత్ర వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొట్పాడ్ లేంప్స్ పరిచాలన డైరెక్టర్ రాజేంఽద్ర నాయక్ అధ్యక్షత వహించారు. కొరాపుట్లో 2025–26 రబీ సీజన్ ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను డైరెక్టర్ రాజేంద్ర నాయక్ వివరించారు. సమావేశంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో లేంప్స్కు రూ.52,07,872 లాభం వచ్చిందని, లాభాన్ని కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్లో రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నా. ఏ రైతులైతే రుణాలు తీసుకున్నారో కేసీసీ బ్యాంక్లో వేసిన లాభంతో రుణం తీరుతుందన్నారు. రైతు నేత ప్రఫుల్ల కుమార్ బిశాయి రైతుల సమస్యలపై మాట్లాడుతూ.. సునారిబలి నువాగాంలో గల లేంప్స్ శిథిలావస్థలో ఉందని, దీనిని పునర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రతినిధి రామేశ్వర జేనా, డీఎల్పీసీ సభ్యుడు గణేష్ చంద్ర పండా, ఘుమర సర్పంచ్ కమల పూజారి, కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర మఝి, తదితరులు పాల్గొన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జయపురం: ఆదివాసీ కోంద్ సంప్రదాయ యువతిని వివాహం చేసుకుంటానని ప్రలోబపరుచుకుని, ఆ తరువాత మోసం చేసిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదివాసీ యువతికి న్యాయం చేయాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్శాఖ నేతలు డిమాండ్ చేశారు. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ను కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, తదితరులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో కోంద్ ఆదివాసీ యువతిని కందులిగుడ గ్రామానికి చెందిన యువకుడు వివాహం చేసుకుంటానని ప్రలోబపరచి, ఆమెతో శారీరిక సంబంధం నెలకొల్పాడని, ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయాన్ని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై బొయిపరిగుడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఏసీఏలో హనుమాన్ జయంతి భువనేశ్వర్: హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించింది. కార్యవర్గ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సమితి సభ్యులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఏసీఏ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. -
పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులకు, ఒక హత్య కేసులో నిందితుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలోని సాగువాన్ అటవీ ప్రాంతంలోని కార్లాఖమన్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో గాయపడిన నిందితులు సునీల మహానంద అలియాస్ టాబు, చంద్ బంచోర్లుగా పోలీసులు గుర్తించారు. వీరు సోమవారం ఝార్సుగుడ జిల్లాలోని బెల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యువకుని హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం కారులొ ప్రయాణిస్తున్న వ్యక్తులు అదే రహదాలో బైకుపై వెళుతున్న ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారి తీసింది. చినికిచినికి గాలివానలా మారిన ఈ వాగ్వాదంలో రాహుల్ మహత, అతని స్నేహితుడు ఆకాష్ సాహుపై కత్తితో కారులో వస్తున్న వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో రాహుల్ మహాత మృతి చెందగా ఆకాష్ సాహు తీవ్రగాయాలతో ఝార్సుగుడ హస్పటల్లొ చికిత్స పొందుతున్నాడు. ఘటన అనంతరం పోలీసులు కార్ డ్రైవర్తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే సునీల మహానంద, చంద్ బంచొర్ పరారీలొ ఉన్నారు. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కార్లాఖమాన్ గ్రామసమీపంలొ దాక్కున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు దొరికిపోతామన్న భయంతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని ఎస్పీ రాఘవేంద్ర తెలియజేశారు. ఈ సంఘటనలో నిందితులు మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరపగా, పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించారు. గాయపడిన నిందితులను మొదట లక్ష్మన్పూర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను చేయించడంతో పాటు మెరుగైన చికిత్స కొసం వారిని వెంటనే ఝార్సుగుడ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇందులో ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో బుర్లా మెడికల్ కళాశాలకు తరలించారు. -
సాగుకు సమాయత్తం
● ప్రారంభమైన ఖరీఫ్ పనులు ● పొలం దుక్కులు, విత్తన మడులు సిద్ధం చేస్తున్న రైతులు ● జిల్లా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్ పెట్టిన అధికారులు జలుమూరు: రబీ పనులు దాదాపు పూర్తయ్యాయి. అపరాలు, మొక్కజొన్న, రాగులు, పొద్దు తిరుగుడు తదితర పంటలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పొలాలను చదునుచేసి వేసవి దుక్కులు, విత్తన మడులను సిద్ధం చేసి విత్తనాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పనులన్నీ ఒక ఎత్తు అయితే విత్తన ఎంపిక మరో ఎత్తు అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 4.20 లక్షల ఎకరాలు వరి సాగు అయ్యే అవకాశం ఉంది. ఇందు కోసం వ్యవసాయ శాఖ 32 వేల క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే పచ్చిరొట్టకు సంబంధించి అన్ని మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలలో విత్తనాలు సిద్ధం చేసింది. రైతులు తక్కువ ఖర్చుతోపాటు మంచి దిగబడులు సాధిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను నరసన్నపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎల్.వి.మధు ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. వరుస పద్ధతి మేలు.. ●వరి అధిక దిగుబడి సాధించాలంటే నాట్లు పద్ధతిలో వరి సాగుచేయాలి. పచ్చిరొట్ట విత్తనాలు వేసి సుమారు 40 రోజుల్లోపే దమ్ము చేస్తే కలుపు నివారణతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు చేయగలం. ● డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తనాలు వేయడం వల్ల నారుతీయడం, నాట్లు వేయడం చేయకుండా కూలీలు ఖర్చు ఎకరాకు సుమారు రూ.ఏడు వేలు వరకూ తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల నాట్లు వరుస పద్ధతిలో పడతాయి. కాలిబాటలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ● వరి నారుమడిలో యూజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. ఇందులో మంచి రకాలు ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువులు, కలుపు నివారణ, పురుగు మందులు వాడకంలో వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరి. ● సాధారణ పరిస్థితిలో నాటడానికి ఎంటీయూ(7029) స్వర్ణ, దీనికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎంటీయూ–1318 రకం అన్ని భూములకు అనువైనవి. సన్నరకం సాంబకు ప్రత్యామ్నాయంగా 1282 సాగు చేసుకోవచ్చు. ● విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కొన్న రకాల తెగుళ్లను నివారించేందుకు విత్తన శుద్ధి ప్రధానం. దీని కోసం సుడోమోనస్, కార్బండిజమ్ మందులను వినియోగించుకోవచ్చు. ● నాటే పద్ధతిలో ఎకరానికి 25 నుంచి 30 కేజీల విత్తనాలు సరిపోతాయి. డ్రమ్సీడర్ ద్వారా ఎనిమిది నుంచి పది కేజీలు, వెద పద్ధతిలో 20 కేజీలు చాలు. ● దృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే 12 రోజుల ముందే దమ్ముచేయాలి. చిన్నమడులుగా విభజించి అవసరమైన నీరు పెట్టడానికి, తొలగించడానికి పిల్లకాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కేజీల విత్తనాలు చల్లుకోవాలి. విత్తనం ఎక్కువైతే నారు బలహీనంగా తయారై తెగులు సోకే ప్రమాదముంది. ఎక్కువ విత్తనాలు చల్లుకున్నా వేరు తెగి పిలకలు పెట్టేందుకు వీలుండదు. దీని వల్ల పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. మొలక కట్టిన విత్తనం చల్లుకోవడం మంచిది. రెండుమూడు ఆకులు తొడిగేవరకూ తడి అందించాలి. తర్వాత పలుచగా నీరు పెట్టాలి. ● దమ్ములో ప్రతి ఐదు సెంట్లు నారుమడికి రెండు కిలోల యూరియా, ఏడు కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, రెండు కిల్లో మ్యారేటి ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తిన రెండు వారాలు తర్వాత మళ్లీ రెండు కిలోల యూరియా వేసుకొని అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
ముగిసిన నర్సెస్ వీక్ ఉత్సవాలు
రాయగడ: స్థానిక పితామహాల్ వద్ద గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ నర్శింగ్ ఆధ్వర్యంలొ ఈ నెల ఆరో తేదీ నుంచి జరుగుతున్న నర్సెస్ వీక్ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులు నిర్వహించిన కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉర్మిళ కాటూరు పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల మధ్య వివిధ పోటీలు, సాహిత్య, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, గౌరవ అతిథిగా డాక్టర్ చంద్రశేఖర్ పాత్రోలు హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిథులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాఢి మాట్లాడుతూ.. ఆరోగ్య సేవల్లో నర్సుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నిరంతర విద్యాభ్యాసం, మానవతా సేవల పట్ల అంకితభావం అవసరమని అన్నారు. విద్యార్థులు భవిష్యత్లో నిబద్ధతతో సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. -
వ్యక్తికి దేహశుద్ధి!
మల్కన్గిరి: పిల్లలను అపహరించడానికి వచ్చినట్టు భావించిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసు స్టేషన్ పరిధిలోలోని ఎంవీ 114 గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పిల్లలను అపహరించడానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఎం.వి.60 గ్రామానికి చెందిన సుబ్రత్ మండాల్ ఎంవీ 114 గ్రామానికి చెందిన మహిళను ప్రేమించేవాడు. ఆ మహిళ తో కలిసి ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే ఆ మహిళ కొద్దీరోజుల క్రితమే అక్కడ నుంచి సొంతఊరుకి వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సుబ్రత్తో కలవలేదు.. మాట్లాడలేదు. దానితో సుబ్రత్ మాహిళను కలవాలని భావించాడు. బిడ్డను అపహరిస్తే ఆమె తన వద్దకు వస్తుందని భావించాడు. సోమవారం తెల్లవారు జామునవచ్చి ఉదయం ఆరు గంటల మహిళ పిల్లవాడు అనుకొని పొరపాటున పక్కింటి పాపను అపహరించాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు వెంటనే పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. అనంతరం మోటు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. ముందుగా పోలీసులు కలిమెల ఆరోగ్యకేంద్రంలో ్ చికిత్స ఇప్పించి అనంతరం కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. -
సెల్ టవర్ ఎక్కి మందుబాబు హల్చల్
రాయగడ: మొబైల్ టవర్ ఎక్కిన మందుబాబు హల్చల్ చేశాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో సొమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి యువకుడిని కిందకు దింపారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణసింగుపూర్లోని కుంబారి వీధికి చెందిన త్రిలోచన్ కాశీ పూటుగా తాగి సమీపంలో గల సెల్ టవర్ పైకి ఎక్కాడు. కిందకు దిగాలని స్థానికులు పలుమార్లు వారించినప్పటికీ పట్టించుకోకుండా తాను టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానిని బెదిరించాడు. దీంతో కాసేపు అక్కడ హైడ్రామా నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు రెండు గంటలపాటు మందుబాబుని బుజ్జగించి కిందకు దించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
సరిహద్దులో ‘షో’
● ఒడిశాలో జోరుగా పేకాట శిబిరాలు ● పాతపట్నం నియోజకవర్గానికి కూతవేటు దూరంలోనే ● అక్కడి పోలీసులు పట్టించుకోరు.. మన పోలీసులు వెళ్లలేరు ● మూల్యం చెల్లించుకుంటున్న జిల్లావాసులు జూదం నిషేధం.. జూదం, జూద శిబిరాలు నిషేధం. అలాంటివి ఎక్కడైనా నిర్వహిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. జూదం ఆటలో పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. అటువంటివి నిషేధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. – చింతాడ ప్రసాద రావు, సీఐ, కొత్తూరు హిరమండలం: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జూదం శిబిరాలు కొనసాగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గం చెంతనే ఒడిశా భూభాగంలోని కొండ ప్రాంతాల్లో డెన్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. లక్షలు దాటి కోట్లాది రూపాయల ‘ఆట’ కొనసాగుతున్నట్టు సమాచారం. అటువైపు ఏపీ పోలీసులు వెళ్లరు.. ఒడిశా పోలీసులు పట్టించుకోరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ జూదం మాటున అసాంఘిక కార్యకలా పాలు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. మూడు నాలుగు రోజుల కిందట జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఒడిశా జూదం డెన్కు వెళ్లిన వారికి అనుకొని ఘటన ఎదురైనట్టు తెలుస్తోంది. ఓ ముఠా ఆయుధాలతో బెదిరించి రూ.36 లక్షలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జూదంరాయుళ్లు కట్టుబట్టలతో స్వస్థలాలకు చేరుకున్నట్టు సమాచారం. గారబంద, గొసాని, ఏడో మైలురాయి, లావణ్యకోట వంటి ప్రాంతాలు పాతపట్నం నియోజకవర్గానికి చెంతనే ఉంటాయి. మహేంద్రగిరులు సైతం దగ్గరే ఉంటాయి. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జూదం డెన్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రవేశానికి కొంత రుసుం ఉంటుంది. సకల సౌకర్యాలు కూడా లభిస్తాయి. డెన్లు కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. అక్కడకు వెళ్లేవారికి రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అంతా ప్రైవేటు వ్యక్తుల పహారాలో ఉంటుంది. జూదం శిబిరానికి వచ్చేవారి వాహనాలను రెండు కిలోమీటర్ల దూరంలో అడ్డుకుంటారు. అక్కడి నుంచి వారిని తమ సొంత వాహనాల్లో స్థావరాలకు తెస్తారు. మన జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరంతో పాటు పలాస, టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. మెళియాపుట్టితో పాటు పలాస మార్గాల నుంచి నిత్యం ఖరీదైన వాహనాలు వెళుతుంటాయి. అందు లో ఎక్కువగా జూదం డెన్లకే వెళుతుంటాయన్నది స్థానికుల మాట. అయితే ఒడిశాకు చెందినే వారే ఈ జూదం డెన్ల నిర్వాహకులు. అటువైపు అక్కడి పోలీసులు చూడరు. ఏపీ పోలీసులు చూసేటంత సాహసం చేయరు. ఎందుకంటే ఈ జూదం డెన్లన్నీ మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. చుట్టూ భారీ బౌన్సర్ల వలయం ఉంటుంది. ఒక వేళ పోలీ సులు దాడిచేసినా నగదు దొరకకుండా అ న్ని జాగ్రత్తలు తీసుకుంటారు. టోకెన్ల సిస్టమ్ ఉంటుంది. జూదంకు వచ్చేవారు రూ.1500 ఇచ్చి ఎంట్రీ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకూ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆట గెలిచిన వారు చివరిలో టోకెన్లు సెక్యూరిటీ సిబ్బందికి ఇస్తే వారు నగదు అందిస్తారు. మరోవైపు జూదం డెన్లో ప్రామిసరీ నోట్లు సైతం అందుబాటులో ఉంటాయి. ఎవరైనా డబ్బు లు అవసరమైతే వారి ఆధార్, ఇతర ధ్రువీకరణతో అప్పు ఇస్తారు. వారితో ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. డెన్లోనే భోజనం, మందు, ఇతరత్రా స్నాక్స్, టీ, బిస్కెట్ వంటివి అందుబాటులో ఉంటా యి. అయితే జూదంతో నష్టం ఎక్కువగా జూదరులకు జరుగుతుండగా.. నిర్వాహకులు మాత్రం కో ట్లు కొల్లగొడుతున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది మన జిల్లావాసులే. ఇప్పటికై నా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఒడిశా అధికారులతో సంయుక్తంగా ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. -
గుండెపోటుతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
కొరాపుట్: విధి నిర్వహణలో సీఆర్పీఎఫ్ జవా ను మృతి చెందాడు. సోమవారం నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రంజన్ హరిజన్ (27) పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్లో విధి నిర్వహ ణలో ఉండగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. 2003లో కాశ్మీర్లో విధుల్లో చేరిన రంజన్ అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. మృత దేహం స్వస్థలానికి చేరడంతో స్థానిక ప్రజలు, పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. జయపురం: ఆర్ట్ ఆఫ్ లివింగ్ పూజ్య గురుదేవ్ జన్మదినం సందర్భంగా సోమవారం కొట్పాడ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కుటుంబ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గురుదేవ్ జన్మదిన ఉత్సవా లు దేశ వ్యాన్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకు లు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన బెంగుళూరులో గల గురుదేవ్ ఆశ్రమానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. సోమవారం కొట్పాడ్ శ్రీరామ మందిర సమీపంలో గల గోపబందుపాఠాఘర్లో రక్తదాన శిబిరం నిర్వహించామని, 40 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపా రు. గురుదేవ్ గత 45 ఏళ్లుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారన్నారు. యోగా శిక్షణ ఇచ్చా మని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో గౌర చంద్ర రథ్, సూర్య కాంత పాడీ, విశ్వజిత్ మల్లిక్, బెనర్జీ రావు, తపన మహాపాత్రో, కిశోర్ మిశ్ర, ప్రదీప్ ప్రధాన్, కెల్ల గోపి, అశోక్ మిశ్ర, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరివార సభ్యులు పాల్గొన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా భాస్కర్రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్స్టేషన్కు డీఎస్పీగా ఎన్.భాస్కర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వీఆర్ఎస్లో ఉన్న ఈయన నేరుగా పోస్టింగ్పై శ్రీకాకుళం వచ్చారు. 1995 బ్యాచ్కు చెందిన ఈయన అనంతపురంలో ఎస్ఐ, సీఐగా పనిచేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే స్టేషన్కు డీఎస్పీగా బి.రాజశేఖర్ వచ్చినప్పటికీ కొన్ని నెలలు పనిచేసి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పోస్టు ఖాళీగా ఉండటంతో సీఐలతోనే స్టేషన్ నెట్టుకువచ్చారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో వంటి కీలక కేసులను ఎక్కువగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకే తమ విచక్షణాధికారాన్ని బట్టి ఉన్నతాధికారి అప్పజెప్పేవారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్లో జాప్యం రావడంతో ఇతర డివిజన్ల అధికారులకు అదనంగా బాధ్యతలు పడ్డాయి. బీచ్ కబడ్డీలో సిక్కోలు అ‘ద్వితీయం’ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కబడ్డీ జట్లు మరోసారి సత్తాచాటాయి. ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బీచ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా మహిళా జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ పోటీలు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరు వేదికగా జరిగాయి. పురుషుల జట్టు సెమీస్లో నిష్క్రమించగా..మహిళల జట్టు తుది వరకు పోరాడింది. వీరి రాణింపు పట్ల జిల్లా కబడ్డీ సంఘ చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, సాదు శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో ని ఆంధ్రా ఆర్గానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్ర మ కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి పరిశ్రమ ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికు ల పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడీకి పాల్పడటం తగదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధిక సమయం పనిచేయించి సింగిల్ ఓటీ మాత్రమే ఇస్తున్నారని, మిగతా పరిశ్రమల్లో డబల్ ఓటీ ఇస్తారని చెప్పారు. నెల వేతనం బోనస్గా ఇవ్వాలని, అతి తక్కువ బోనస్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు, చట్టబద్ధంగా వీడీఏ అమలు చేయా లని డిమాండ్ చేశారు. -
రైతుల ఆందోళనకు జయపూర్ ఎమ్మెల్యే మద్దతు
కొరాపుట్: కొక్సర రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పా ర్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీనీపతి మద్దతు పలికారు. సోమవారం కలహండి జిల్లా కొక్సర ప్రాంత రైతు ఆందోళన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ ప్రాంతంలో 15 వేల మంది రైతుల పేర్లు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు కాలేదన్నారు. దాంతో వారు స్ధానికి ఎంఎల్ఏతో కలసి సీఎంతో పాటు అన్ని పార్టీల నాయకులను కలిశారన్నారు. కానీ ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాలలో రైతుల పేర్లు నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం మీద జీవిస్తున్నారన్నారు. ఈ సమస్య పై రానున్న అసెంబ్లీ సమావేశాలలో పోరాటం చేస్తామని బాహీని పతి ప్రకటించారు. -
ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది
కొరాపుట్: అటవీ శాఖ సిబ్బంది ఎలుగు బంటిని బంధించారు. సోమవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రం నుంచి దెవులా–కొసాగుమ్డ మార్గంలో ఎలుగుబంటి సంచిరిస్తుండదాన్ని స్థానికులు గమనించారు. జన సంచారం ప్రాంతంలో ఎలుగు సంచరిస్తుండంతో భయాందోళన చెందారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎండ వేడిమితో ఎలుగు బంటి ప్రధానమార్గంలో కల్వర్టు కింద సేద తీరుతుంది. ఇదే సమయంలో అటవీసిబ్బంది కల్వర్టుకి ఒక వైపు బోను పెట్టి మరో వైపు మూసి వేశారు. దాంతో ఎలుగు బోను లోనికి వెళ్లి చిక్కుకుంది. వెంటనే దానిని నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సురక్షితంగా అడవిలో విడిచి పెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. -
జనావాసాల్లోకి జింక పిల్ల
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి చాటికొన పంచాయతీ రాణిబంధ గ్రామంలోకి సోమవారం ఉదయం జింక పిల్ల ప్రవేశించింది. సమీప అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి గ్రామంలోకి చేరుకుందని భావిస్తున్నారు. జింకపిల్లను చూసిన గ్రామస్తులు దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ గార్డులు చేరుకుని జింకపిల్లను రక్షించారు. అయితే అది అస్వస్థతతో పడి ఉండటం గమనించి తమ వెంట తీసుకువెళ్లి చికిత్స జరిపిన అనంతరం తిరిగి అడవుల్లో విడిచిపెట్టేస్తామని చెప్పారు. పద్మపూర్లో వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని పద్మపూర్లోని సమితి కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలొ వివిధ ప్రాంతాల నుంచి 29 వినతులు అందాయి. వీటిలో 26 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా మరో మూడు గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిశీలించి వాటిని సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలొ జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్, ఏఎస్పీ గోసొనొర్ బర్లా, ఐటీడీఏ గుణుపూర్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు. కార్మిక నేతకు వీడ్కోలు భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం శ్రామిక కాంగ్రెస్ నేత సరోజ్ కుమార్ మంగరాజ్కు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రధాన టికెట్ తనిఖీ అధికారిగా ఉద్యోగ విరమణ సందర్భంగా శాఖ కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో పలువురు కార్మిక నేతలు ప్రసంగించారు. రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన నిఖిల్ అడప అనే యువకుని హత్య కేసుకు సంబంధించి దక్షిణాంచల్ డీఐజీ కన్వర్ విశాల్ సింహ్ ప్రత్యేక దర్యాప్తునకు రాయగడ చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిఖిల హత్య కేసు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్ టీం లను ఏర్పాటు చేసామని అన్నారు. అనుమానితుల సంఖ్య పెరగడంతో మరో మూడు టీమ్లు వేశామని పేర్కొన్నారు. వీరంతా గాలిస్తున్నారని తెలిపారు. సైబర్, టెక్నికల్ వంటి బృందాలకు చెందిన వారి సహాయాన్ని తీసుకుంటున్నామని అన్నారు. నిందితులు తుపాకీలు వినియోగిస్తున్నారు, అవి వారికి ఎలా లభ్యమవుతున్నాయన్న విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ దానిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని, మరో 15 రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు ఆయుధాల సరఫరా, రవాణాకు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
మాత్తిలి గ్రీవెన్స్లో 57 వినతులు స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి దుంగియాపూట పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రధమేశ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్ సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించి 57 వినతులు స్వీకరించారు. వీటిలో 22 వ్యక్తిగత ఫిర్యాదులు కాగా 35 గ్రామస్థాయి సమస్యలు ఉన్నాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సహాయ శిబిరాలు నిర్వహించారు. మాత్తిలి బీడీఓ ప్రమోద్ బెహరా అధ్యక్షతన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధన్, జిల్లా అదనపు ఎస్పీ రశ్మిరంజన్ సేనాపతి పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రధమే శ్ అర్వింద్ రాజశిర్కే కలిమెల సమితిలో బాడిగేటా, మల్కన్గిరి సమితిలో ఝూరపల్లి, చిత్రకొండ సమితిలో బడపోఢ పంచాయతీ, ఖోయిర్పూట్ సమితి లో గోవిందపల్లి, కోరుకొండ సమితిలో మారివా డా, పోడియా సమితిలో బాపన్పల్లి పంచాయతీలో గ్రీవెన్స్ను నిర్వహించి వినతులు స్వీకరించారు. ఆర్.ఉదయగిరిలో.. పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభకు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఆర్.ఉదయగిరి, సబ్ డివి జనల్ పోలీసు అధికారి రాజేష్కుమార్ సాహు, జిల్లా పరిషత్తు సీఈవో దయామయ పాఢి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. 25 వినతు లు రాగా అందులో వ్యక్తిగతం 9, గ్రామ సమస్యల కు సంబంధించి 16 ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ క్రింద ఎటువంటి సహాయం అందలేదు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు, రోడ్డు సౌకర్యం, మంచినీటి సమస్యలపై ఎక్కువు వినతులు అందాయి. ఆర్.ఉదయగిరి తహసీల్దార్, బీడీవో హాజరయ్యారు. -
సీఈఓతో బీజేడీ ప్రతినిధి బృందం భేటీ
● 2 ఓట్లు రద్దు చేయాలి ● పారదర్శకత నిరూపనకు అభ్యర్థన భువనేశ్వర్: ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన రాజ్య సభ ఎన్నికల సందర్భంగా ఇద్దరు భారతీయ జన తా పార్టీ శాసన సభ్యులకు రెండవ బ్యాలెట్ పత్రాలను అక్రమంగా జారీ చేశారని బిజూ జనతా దళ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేడీ శాసన సభ పక్ష ఉప నాయకుడు డాక్టరు ప్రసన్న ఆచార్య ఆధ్వర్యంలో ప్రతిపక్ష బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం సోమ వారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్ఎస్ గోపాలన్ను కలిసింది. ఇటీవల ముగిసిన రాజ్య సభ ఎన్నికల్లో బ్రహ్మగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉపాసన మహా పాత్రో, ఖల్లికోట నియోజక వర్గం ఎమ్మెల్యే పూర్ణ చంద్ర సెఠికి జారీ చేసిన తొలి బ్యాలెట్ పత్రాలపై ఓటు ముద్ర పెట్టినప్పటికీ వారికి రెండవ బ్యాలెట్ పత్రాలను తప్పుగా జారీ చేశారని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి సమర్పించిన ఒక వినతి పత్రంలో బీజేడీ ఆరోపించింది. దీని పట్ల తమ పోలింగ్, లెక్కింపు ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తిన పెడ చెవిన పెట్టి చెల్ల ని బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన 1961 ఎన్నికల నిర్వహణ నియమావళి 41వ నియమం కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘించి ఎన్నికల అధికారులు రెండవ బ్యాలెట్ పత్రాలను జారీ చేయడానికి అనుమతించారని విపక్ష బిజూ జనతా దళ్ ఆరోపించింది. బిజూ జనతా దళ్ ప్రకారం ఎన్నికల సంఘం పరిశీలకుడు తొలుత రెండో బ్యాలెట్ పత్రాల జారీకి అనుమతి నిరాకరించారు. ఆ తర్వా త వాటిని అనుమతించడంతో ఈ నిర్ణయం యొక్క చట్టబద్ధత మరియు శాసన నిబంధనల నిబద్ధత పట్ల తీవ్ర ఆందోళనలు తలెత్తాయి. పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు, అధీకృత ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, పార్లమెంటరీ ప్రతినిధులు నిరంతరం, పలు స్థాయిలలో ఈ అంశాన్ని ఎన్నికల పవిత్రతను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన చట్టబద్ధమైన ఉల్లంఘనగా పరిగణించాలని అభ్యర్థించారు. రాజ్య సభ ఓటింగ్ ప్రక్రియలో తప్పిదంపై బీజేడీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ బహిరంగంగా స్పందించారు. అనంతరం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 18న నవీన్ పట్నాయక్ ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు. ఆ తర్వాత ఏప్రిల్ 28న రాజ్య సభ ఎంపీ డాక్టరు సస్మిత్ పాత్రో తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ఎన్నికల సంఘానికి ఒక వివరణాత్మక వినతిపత్రాన్ని సమర్పించారు. ఆ విజ్ఞప్తి నేపథ్యంలో బీజేడీ ప్రతినిధి బృందం సమస్యలను వినాల్సింది గా ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓను ఆదేశించినట్లు సమాచారం. రాజ్యసభ అభ్యర్థి దిలీప్ రేకు అనుకూలంగా ఉపాసన మహా పాత్రో, పూర్ణ చంద్ర సెఠి వేసిన ఓట్లను తిరస్కరించాలని బీజేడీ తన వినతిపత్రంలో డిమాండ్ చేసింది. ఆ 2 ఓట్లను అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ దత్తేశ్వర్ హొత్తాకు ఎక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తాయి. అందువల్ల ఆయనను ఎన్నికై నట్లు గా ప్రకటించాలని సవివరంగా విశ్లేషించి అభ్యర్థించారు. ఈ ఏడాది మార్చి 16 మరియు 18 తేదీలలో తాము చేసిన మునుపటి ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని బిజూ జనతా దళ్ కోరింది. దీంతో బాటు రద్దు చేసన బ్యాలెట్ పత్రాలు, పరిశీలకుల నివేదికలు, పోలింగ్, లెక్కింపు రికార్డు లు, సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రాఫ్లు మరియు ఇతర అధికారిక ఎన్నికల సామగ్రితో సహా ఈ వివాదానికి సంబంధించిన అన్ని రికార్డుల ను భద్రపరచి, పరిశీలించాలని సీఈఓను బీజేడీ ప్రతినిధి బృందం కోరింది. రెండవ బ్యాలెట్ పత్రాలను ఏ పరిస్థితులలో జారీ చేశారనే దానిపై స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి 1961 ఎన్నికల నిర్వహణ నియమావళి 41వ నియమం ఉల్లంఘించబడిందా లేదా అనే దానిపై నిర్ధారణ చేయాలని బీజేడీ డిమాండ్ చేసింది. -
అంత్యక్రియల్లో ఉద్రిక్తత
రాయగడ : స్థానిక రెల్లివీధికి చెందిన హడప నిఖిల్ (18) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించి అనంతరం హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో గల నాగావళి నది వద్ద పడేసిన ఘటనకు సంబంధించి సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని ఆదివారం నాడు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సోమవారం స్థానిక రెల్లి వీధి నుంచి వందల సంఖ్యలో బాధిత కుటుంబీకుల బంధువులు, వీధి ప్రజలు మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలొ సదరు పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేస్తారన్న సమాచారం మేరకు సదరు పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందొబస్తును ఏర్పాటు చేసారు. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ స్వయంగా సదరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పర్యవేక్షించారు. ఎస్డీపీఓ గౌరహర సాహు నేతృత్వంలొ పోలీసులు పోలీస్ స్టేషన్ మెయిన్ గేటును మూసివేసి ఎదుట ఎలాంటి అల్లర్లు జరగకుండా కాపలాకాసారు. రెల్లివీధి నుంచి మృతదేహాన్ని రామాటాకీస్ మీదుగా తీసుకువస్తున్న సమయంలో పోలీసులు ఆర్కే నగర్ వైపు వెళ్లాలని పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లకూడదని అడ్డుకున్నారు. అయితే అందుకు ససేమిరా అంగీకరించని ఆందోళనకారులు పోలీసులతొ కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిస్తున్నప్పటికీ వారిని తోసుకుంటూ పోలీస్ స్టేషన్ మీదుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ పరిస్థితిలో ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగితే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రయత్నం ఉన్న కారణంగా పోలీసులు కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ నుంచి ఆందోళనకారులు మృతదేహాన్ని తీసుకువెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం నాడు స్థానిక ఇందిరానగర్ మూడో లైన్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది తన కొడుకును తుపాకీతో బెదిరించి అపహరించి తీసుకువెళ్లిన విషయాన్ని అదే రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అప్పుడే పోలీసులు అప్రమత్తమై స్పందించి ఉంటే తన కొడుకు హత్యకు గురయ్యేవాడు కాదని మృతుడు నిఖిల్ తండ్రి హడప శివ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు తన కొడుకు అంత్యక్రియల్లో భాగంగా కొత్తబస్టాండు వద్ద విలేకర్లతో ఆయన మాట్లాడారు. తన కొడుకు మృతికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని బహిరంగంగా ఆరొపించారు. తన కొడుకు హత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 14 మంది కలిపి ఈ హత్యకు వల పన్నినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం నిఖిల్ (మృతుడు) వినియోగిస్తున్న బైకును కొత్తబస్టాండు వద్ద గల ప్రధాన రహదారి వద్ద ఆందోళనకారులు పెట్రోల్ పోసి తగుల బెట్టారు. -
నకిలీ డీఈఎఫ్ తయారీ ముఠా గుట్టురట్టు
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో నకిలీ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్యూయిడ్ (డీఈఎఫ్) తయారీ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆపరేషన్ నేత్రలో భాగంగా జిల్లా ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర ఆదేశాల మేరకు సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరియాబగిచా ప్రాంతంలో నడుస్తున్న అక్రమ డీఈఎఫ్ తయారీ యూనిట్ను ఇటీవల పోలీసులు గుర్తించి భారీ ఎత్తున సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా రాజస్థాన్లోని తంగగజి జిల్లా అల్వార్ ప్రాంతానికి చెందిన ముఖేష్ చాంద్, ఝార్సుగుడ జిల్లాలోని ఒరియంట్ పోలీస్ స్టేషన్ పరిధి లమిటిబహాల్ ప్రాంతానికి చెందిన అమన్ కుమార్ సింగ్, సిరియాబగిచ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ హెంబ్రమ్, బ్రిజిభూషన్ సింగ్, ఛత్తీస్గఢ్ జిల్లాలోని దులుదులా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జియల్ అన్సారి, బరగడ జిల్లాకు చెందిన ఆకాష్ అగ్రవాల్, ఝార్సుగుడ జిల్లాలోని పార్ధశారధి మిశ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 422 లీటర్ల సామర్ధ్యం గల ఖాళీ బకెట్లు, రెండు వాహనాలు, తదితరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు వెళ్లి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అనూజ్ అగ్రవాల్ను అరెస్టు చేసి ఝార్సుగుడకు తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఎస్పీ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల మేరకు.. రైతులకు సరఫారా చేయాల్సిన సబ్సిడీ యూరియాను నీటితో కలిపి డీఈఎఫ్గా తయారీ చేసి టాటా, అశోక్టైలాండ్ మహేంద్ర వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ బ్రాండింగ్ చేసి ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని వివరించారు. దీనిని అనుసరించి దర్యాప్తు చేయగా పూర్తి వివరాలు బయటపడ్డాయని అన్నారు. ఈ నకిలీ తయారీ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్, ముడిసరుకుల సరఫరా, సబ్సిడీ యూరియా మళ్లింపు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రజల విశ్వసనీయత ప్రధానం
భువనేశ్వర్: స్థానిక డీజీపీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల సమన్వయం, పోలీసింగ్ వ్యవస్థ సమర్థత, ప్రజోపయోగంగా చేరువ కావడం వంటి అంశాలపై సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో పోలీసుల సానుకూల పని తీరు, తక్షణ చర్యలు, ప్రజా సేవల పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ ఆదేశించారు. నేరాల నియంత్రణలో ప్రజల విశ్వసనీయత చూరగొని ముందుకు సాగడం అత్యంత ప్రయోజనకర సోపానంగా పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం బలోపేతం చేసేందుకు నిర్దిష్టమైన, సమర్థమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, రేంజ్ ఐజీలు, డీఐజీలను డీజీపీ ఆదేశించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ (ఈఆర్వీ)లో పని చేసే సిబ్బంది అందరికీ వృత్తిపరమైన, ఆచరణాత్మక శిక్షణ కల్పించాలన్నారు. సమయోచిత శిక్షణ, క్లిష్టమైన, అత్యవసర పరిస్థితులలో సత్వర ప్రతిస్పందనకు పదును పెడుతుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రీఫింగ్ పరేడ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతి రోజూ ఉదయం 9 గంటలలోపు క్రమం తప్పకుండా బ్రీఫింగ్ పరేడ్ నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. దీన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. బ్రీఫింగ్ పరేడ్ అనంతరం, సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నేరస్థుల కదలికలు, కొనసాగుతున్న దర్యాప్తులపై సమీక్షించి, చర్చించాలని సూచించారు. పోలీస్ ఠాణా స్థాయిలో సమన్వయం, అప్రమత్తత, త్వరితగతిన స్పందించే సామర్థ్యం మరింత బలపడతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పటిష్టతకు వివిధ కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా కొనసాగుతున్న నాన్ బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ)ను వేగంగా అమలు చేయడం, జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కరడుగట్టిన, నిత్య నేరస్థులపై కఠిన చర్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంపై దృష్టి సారించాలన్నారు. అన్ని పోలీస్ ఠాణాల్లో బీట్ పెట్రోలింగ్, జాతీయ రహదారులపై సాధారణ పెట్రోలింగ్ విస్తరణ, దుష్ప్రవర్తన, నేర సంబంధిత ఘటనలను నివారించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. హత్య వంటి తీవ్రమైన కేసులను సీనియర్ పోలీస్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి నిందితులను త్వరగా అరెస్టు చేయడం, సమగ్ర దర్యాప్తుతో చట్ట ప్రకారం శిక్ష పడేలా సమర్థమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. సమావేశంలో డీజీపీ (క్రైం శాఖ) బినయ్తోష్ మిశ్రా, ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఆర్పీ కోచే, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) సంజయ్ కుమార్ ప్రముఖంగా పాల్గొన్నారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా భువనేశ్వర్ కమిషనరేట్ పోలీస్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణపై చర్యలు, సున్నితమైన కేసుల తక్షణ, నిష్పక్షపాత దర్యాప్తు, సామాన్య ప్రజలతో పోలీసుల సానుకూల మమేకత్వం, ట్రాఫిక్ వ్యవస్థ సులభతర నిర్వహణ వంటి అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కటక్, భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎస్. దేవ దత్త సింగ్, అదనపు పోలీస్ కమిషనర్ నరసింగ్ భోలా పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బంధగూడ గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆయన కారు డ్రైవర్కు గాయాలయ్యాయి.మాత్తిలి సమితి దుంగియాపూట్ పంచాయతీలో గ్రీవెన్స్కు హాజరవుతున్న సమయంలో భంజనగార్ నుంచి కలిమెల వస్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. వ్యవసాయశాఖ జిల్లా అధికారి అనిల్కుమార్ ప్రహరాజ్కు స్వల్ప గాయాలు, డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతు న్నారు. -
ఉర్రూతలూగించిన గిరిజన ఉత్సవం
భువనేశ్వర్: ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఒడిశా సంగీత నాటక అకాడమీ, కలహండి జిల్లా సాంస్కృతిక మండలి, శుభం ఇన్స్టిట్యూట్ల సహకారంతో డొంగొరొ గిరిజన నృత్య, సంగీత ఉత్సవం ఉర్రూతలూగించింది. రెండు రోజుల పాటు భవానీపట్నం మహావీర్ కల్చరల్ ఇన్స్టిట్యూట్ రంగమంచ్లో జరిగిన ఈ సాంస్కృతిక ఉత్సవం ఆదివారంతో ముగిసింది. యువ కళాకారులు గిరిజన సమాజం నృత్య, సంగీత సంప్రదాయంలోని మౌలిక స్వభావం, విశిష్టతని ప్రతిబింబించారు. గిరిజన నృత్య, సంగీత ప్రదర్శనలకు ఉజ్వల భవిష్యత్ చేరువలో ఉందని ఈ వర్గం ఆశాభావం వ్యక్తం చేసింది. గిరిజన సంప్రదాయ నృత్య, సంగీత కళలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రపంచానికి తెలియజేసేందుకు యువ కళాకారులు తమ నిరంతర కృషిని కొనసాగించాలని అతిథులు అభిప్రాయపడ్డారు. డొంగొరొ నృత్యోత్సవంలో కోయ, ఖడియా, కిసాన్, పొతొరొ సౌరా, లంజియా సౌరా, ఢెమ్సా, పంచరసి, గిరిజన నృత్యం, సింగారి నృత్యం ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. -
ఏయూఈఈటీకి 330 మంది హాజరు
ఎచ్చెర్ల: ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్ల డ్యూయల్ ఇంజినీరింగ్ (బీటెక్, ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికి ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఏయూఈఈటీ– 2026కు 330 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు 374 మందికి హల్టికెట్లు జారీ చేయగా 44 మంది గైర్హాజరయ్యారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు పర్యవేక్షించారు. ఎచ్చెర్లతో పాటు రాష్ట్రంలో మరో ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం ఉదయం కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావుకు వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో మత్స్యశాఖ డైరెక్టర్ జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరున్ని మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అర్చకులు ఆల చరిత్ర వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. ఈయనతోపాటు డీడీ గోపికృష్ణ, సిబ్బంది, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉన్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను పట్టుకొని డ్రైవర్పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆదివారం తెలిపారు. నారాయణవలస సంత వద్ద నుంచి అలమండ సంతకు ఎటువంటి అనుమతులు లేకుండా చిన్న వ్యాన్లోనే 9 ఆవులను ఎక్కించడంతో ప్రాణాపాయంగా కనిపించాయని చెప్పారు. తామరాపల్లి వద్ద వీటిని పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించి వ్యాన్ సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. నాటకరంగానికి చేయూతనివ్వాలి శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ నియామకం పట్ల శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి మాట్లాడుతూ ఒడిదుడుకుల్లో ఉన్న నాటకరంగానికి, పేద కళాకారులకు చేయూతనందించాలని కోరారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి, కార్యదర్శి బి.రామచంద్ర దేవ్, న్యాయ సలహాదారు కంచరాన అప్పారావు, కార్యవర్గ సభ్యులు చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
బలియంత దాడిపై క్రైం శాఖ దర్యాప్తు
● నలుగురు పోలీసు అధికారులు సస్పెండ్ ● ఐఐసీ అనిల్ పరిడా బదిలీ భువనేశ్వర్: బలియంత మూక దాడి ఘటనపై క్రైం శాఖ దర్యాప్తు ప్రారంభం అయింది. ఈ నెల 7వ తేదీన గ్రామస్తుల మూక దాడిలో 32 ఏళ్ల ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) కానిస్టేబులు సౌమ్య రంజన్ స్వంయి మరణించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి క్రైం శాఖ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు సూపరింటెండెంట్ అనిరుధ్ రౌత్రాయ్ ఆధ్వర్యంలో క్రైమ్ శాఖ దర్యాప్తు బృందం ఆది వారం బలియంత పోలీస్ ఠాణాకు చేరింది. ఈ బృందం దర్యాప్తు అధికారి నుంచి కేసుకు సంబంధించిన పత్రాల ఆధారంగా దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. ఈ దర్యాప్తు పూర్తిగా వాస్తవాల ఆధారంగా సాక్ష్యాధారాలతోనే సాగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై క్రైమ్ శాఖ డీఐజీ బి. గంగాధర్ మాట్లాడుతూ 10 మంది అధికారులతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని తెలిపారు. ఈ బృందాలలో శాసీ్త్రయ, సైబర్ విభాగాల నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు, హత్యాయత్నం, పోలీసుల నిర్లక్ష్యం వంటి పలు అంశాలను ఈ దర్యాప్తులో క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. తొలి దశ దర్యాప్తు ఆధారంగా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఘటన తీవ్రత దృష్ట్యా బలియంత పోలీస్ ఠాణా ఇనస్పెక్టర్ ఇన్ ఛార్జ్ (ఐఐసీ) అనిల్ పరిడాను భువనేశ్వర్లోని యూపీడీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సహాయ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), 1 ఒడిశా సాయుధ పోలీసు దళం (ఓఏపీఎఫ్) ఉద్యోగి మరియు ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. 2 మంది హోం గార్డులను విధుల నుండి తొలగించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఘటనా సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో వైఫల్యం కారణాలతో ఈ కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసు యంత్రాంగం నిఘాను పెంచింది. దర్యాప్తు కొనసాగుతోంది మరియు రానున్న రోజుల్లో నిందితులపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ వేంకటేశ్వర కాలనీ నడిబొడ్డున ఉన్న ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. రణస్థలం మండలం నారువ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్న డి.మల్లేష్ వెంకటేశ్వర కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లావేరు మండలం నేతేరు లక్ష్మీపురం వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని సమీపంలో ఉంటున్న బంధువులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే మల్లేష్కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ బృంద సభ్యులు వచ్చి వివరాలు సేకరించారు. ఐదు తులాల బంగారం, రూ.లక్షా ఇరవై వేలు నగదు పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన వివరాలు ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీతో రాత్రి 11 గంటల సమయంలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. 12.30 గంటల సమయంలో మిగతా ఇద్దరు స్కూటీతో రాగానే లోపలి వ్యక్తి బయటకు వచ్చి అందరూ పరారయ్యారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యంత రద్దీగా, ముఖ్య కూడలిలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడం ఎక్కువైందని, అర్ధరాత్రి వేళల్లో కూడా బైక్లతో తిరగడం, అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారిందని, ఇప్పటికై న ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
32 ఏళ్ల తర్వాత..
దూసి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేరింతలు కొడుతూ తమ చిన్ననాటి అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. మాతృదినోత్సవం రోజున ఈ ఆత్మీయ సమావేశం జరగడం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. – ఆమదాలవలస -
గుడ్ల గూబకు చికిత్స
రాయగడ: కాలు విరిగి ఎగరలేని స్థితిళక్ష ఉన్న ఒక గుడ్లగూబను అటవీ శాఖ సిబ్బంది చికిత్స చేయించి తమ మానవీయతను చాటుకున్నారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సునాఖండిలో గల హనుమాన్ మందిరం వద్ద పడి ఉన్న గుడ్ల గూబను చూసి పూజారి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది గుడ్ల గూబను చికిత్స చేయించి తిరిగి కోలుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టారు. బిసంకటక్లో భల్లూకం హల్చల్ రాయగడ: బిసంకటక్లోని మార్కమ వీధిలో శనివారం రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది. సరాసరి వీధిలోకి ప్రవేశించిన ఎలుగు ఇళ్ల లోపలకు చొరబడేందుకు ప్రయత్నించింది. ఎలుగు అరుపులు రాకను గుర్తించిన వీధిలోని జనం ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. అనంతరం దానిని తరిమే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ కదలకపోవడంతో భయాందోళనకు గురైన కాలనీ వాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఎలుగును అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి తరిమివేశారు. డాబుగాం ఐఐసీ సస్పెన్షన్ కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా డాబుగాం ఐఐసీ రఘునాఽథ్ మజ్జిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ వైబీ ఖురానియా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఒక కేసు విచారణలో నిందితుడిని పోలీస్ స్టేషన్కి పోలీసులు తెచ్చారు. అయితే ఆ నిందితుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఐఐసీ రఘునాఽథ్ మజ్జిని సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు సదరన్ వెస్ట్రన్ రేంజ్ డిఐజీకి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.66 సెల్ఫోన్లు స్వాధీనం రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో మోబైల్ ఫోన్లను పోగొట్టుకొవడం, దొంగతనానికి గురైన ఫిర్యాదులను నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా 66 మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఝార్సుగుడ పోలీస్స్టేషన్లో 15, సదర్ పోలీస్ స్టేషన్లో 7, బ్రజరాజ్నగర్లో 6, బదమాల్లో 6, బెల్ఫహార్లో 5, బన్హార్పల్లిలో 4, లైకేరాలో 4, లఖన్పూర్లో 4, కొలాబిరాలో 4, రెంగాలిలో 3, ఎయిర్పోర్టులో మూడు.. మొత్తం 66 ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వీటిని పొగొట్టుకున్న వారి వివరాలను సేకరించి వారికి ఆందజేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి మైకంచ్ గ్రామ సమీపంలో బొలేరో వాహనం ఢీకొని ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. ఆది వారం జరిగిన ఈ ఘటనలో మైకంచ్ గ్రామానికి చెందిన లావణ్య జొడియా, పపున్ జొడియా, రామచంద్ర జొడియాలు గాయాలపాలయ్యారు. ఒకే బైకుపై వెళ్తున్న వీరిని గ్రామానికి సమీపంలోని కాలనీ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరొ ఢీకొంది. దీంతో వీరంతా కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. అయి తే ఢీకొట్టిమ వాహనం ఆగకుండానే వెళ్లిపోయింది. క్షతగాత్రులను కాసీపూర్ పీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. -
అధికారులూ.. ఇదేం తీరు..!
● కార్పొరేట్ పాఠశాలలకు రాష్ట్ర అధికారుల పరోక్ష దన్ను ● అడ్మిషన్లపై చిన్న ప్రైవేటు స్కూళ్లపైనే దృష్టి పెట్టాలని ఆదేశం! శ్రీకాకుళం : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖలోనే చర్చ జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నాయి. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు దీనిని తప్పుపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని, ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి అందరినీ ఒకేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా తాము ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారు సమ్మతిస్తే ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని మాత్రమే చెప్పారని, ఎంఈఓలు టీసీలు ఇస్తారనడంలో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు. -
చందన యాత్రలో సంప్రదాయ నృత్యం
భువనేశ్వర్: శ్రీ క్షేత్రం శ్రీ జగన్నాథుని వెలుపలి చందన యాత్ర బొడొ దండొ మార్గాన్ని కళా వేదికగా మలిచింది. శ్రీ మందిరం నుంచి నరేంద్ర సరోవరం తీరం వరకు దారి పొడవునా సాగే స్వామి పల్లకి ఊరేగింపులో హై టెక్ విద్యా సంస్థలో ఒడియా భాషా సాహిత్య విభాగం సీనియర్ ప్రొఫెసర్, అంతర్జాతీయ ఒడిస్సీ నర్తకుడు అయి న డాక్టర్ చిత్తరంజన్ సహాణి శాసీ్త్రయ నృత్య ప్రదర్శన సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా శ్రీ క్షేత్రం శ్రీమందిరంలో జరిగే చందన యాత్ర, స్నానోత్సవం, రథ యాత్ర, బహుడా, నీలాద్రి విజే, డోలా యాత్ర వంటి వివిధ ఉత్సవాలలో మహాప్రభువుకు నృత్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
● లారీని ఢీకొట్టిన కారు ● తండ్రీకొడుకుల దుర్మరణం ● మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలుమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాత్తిలి పోలీస్స్టేషన్ సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 నెలల బాబుతోపాటు తండ్రి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొరాపూట్ నుంచి మల్కన్గిరికి శనివారం బంధువుల ఇంట జరిగిన ఓ ఫంక్షన్కు పొట్నూరు మణికాంతారావు తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఆదివారం తిరిగి కారులో వెళ్తుండగా లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మణికాంతారావు (25)తో పాటు అతని 11 నెలల కుమారుడు మృతి చెందారు. అయితే కారు లాక్ అయి ఉండడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న సిబ్బంది కారు డోర్లను కట్టర్ల సాయంతో కోసి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. అయితే తండ్రీకొడుకు మృతి చెందగా ముగ్గురు మహిళలు గాయపడ్డారు. తండ్రికొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రంకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స కొసం తొలుత మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్కు రిఫర్ చేశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రధాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నల్లాన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన నల్లాన వెంకునాయుడు నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని సంఘ జాతీయ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ నియామక పత్రాన్ని వెంకునాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకునాయుడు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి పిల్లా కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో చోరీలకు అడ్డుకట్ట పలాస: దొంగతనాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కోరారు. ఆదివారం స్థానిక జి.ఎం.ఈ కాలనీలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఇటీవల దొంగతనం జరిగిందని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోతున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతివీధిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
అరసవల్లిలో భక్తుల రద్దీ
అరసవల్లి: వైశాఖమాసం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సందడి కనిపించింది. చివరి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయక పూజలు నిర్వహించారు. పెసల మొలకలు, ధాన్యం, బెల్లం, వడపప్పు, మామిడి పండ్లు, టెంకాయలతో ప్రత్యేకంగా స్వామి వారికి నివేదించి తమకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ మొక్కుకున్నారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకున్నారు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఉక్కబోత, ఎండతీవ్రత పెరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్కరిణి సమీపంలో టెంట్లు ఉన్నప్పటికీ ఏమాత్రం సరిపడకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నదాన ప్రసాదానికి భక్తులు బారులు తీరారు. పెందుర్తికి చెందిన భక్తులు ఆరిపాక సంధ్యారాణి, ఆమె కుమారుడు అయాన్ష్ నందన్లు తులాభారం మొక్కు చెల్లించుకుని 60 కేజీల బెల్లం చెక్కీలను ఈవో ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణల సమక్షంలో ప్రసాదాల విభాగానికి సమర్పించారు. -
పోర్టు నిర్వాసితులకు తప్పని పాట్లు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. నౌపడలో కేటాయించిన పునరావాస కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో మూలపేట గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు, రోడ్లు లేకపోవడం, డ్రైనేజీలు అరకొరగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్స్తో వస్తున్న ట్రాక్టర్, టిప్పర్లు తరచూ బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం కూడా ఇదే సమస్య పునరావృతం కావడంతో అవస్థలు పడ్డారు. తమ భూములు, గ్రామాన్ని పోర్టుకు ఇస్తే త్యాగాలను గుర్తించకుండా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యపై సమీక్ష
రాయగడ: జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో గల రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యానాణ్యత, హాస్టల్ నిర్వహణకు మెరుగు పరిచేందుకు కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం కలెక్టర్ సమావేశ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలో గల 149 రెసిడెన్సియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. విద్య శ్రేష్టత, విద్యార్థుల సంక్షేమంపై దృష్టిసారించి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించినంత స్థాయిలో విద్యా నాణ్యత మెరుగుపడటం లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అందుకు కారణం ఉపాధ్యాయుల కొరతేనని, దీని వల్ల విద్యావిధానికి గండి పడుతుందని ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యా బోధన గురించి నియమితులైన ఉపాధ్యాయులకు బోధనతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు ఆశించినంతగా విద్యార్థులకు బోధించలేకపోతున్నారని వివరించారు. దీని వల్ల విద్యా నాణ్యత పూర్తిగా లోపించిందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలలొ పదో తరగతి పరీక్షల్లో కనీసం ఐదుగురు విద్యార్థులు ఎ–1 గ్రేడ్ను సాధించి ఉత్తీర్ణులయ్యేలా కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. -
ధాన్యం కొనుగోలుకు మోక్షమెప్పుడో?
సారవకోట: కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు వీడటం లేదు. సారవకోట మండలంలోని పలు గ్రామాలలో రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యం నేటికీ కొనుగోలు కాలేదు. సారవకోట, జగ్గయ్యపేట, బురుజువాడ, కొత్తూరు, అగదల తదితర గ్రామాల రైతులకు పంట త్వరగా చేతికి రావడంతో ధాన్యాన్ని వ్యాపారులకు ఎంతోకొంత ధరకు విక్రయించుకున్నారు. ప్రస్తుతం తొగిరి, అక్కివలస, బద్రి, అడ్డపనస గ్రామాల రైతులకు పంట ఆలస్యంగా చేతికి రావడంతో రోడ్లపై ఆరబెడుతున్నారు. ప్రభుత్వం రబీలో పండిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో వారంతా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం సరైన ధర మార్కెట్లో లేదని, ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఈదుర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం భద్రపర్చుకునేందుకు అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులలో తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలవరపడుతున్నారు. మరోవైపు మొక్క జొన్న సాగు చేసిన రైతులు సైతం మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
జూన్ 1 నుంచి మహేంద్ర మేళా
పర్లాకిమిడి: మహేంద్రగిరి పరశురాం క్షేత్ర పర్వతంపై జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు మహేంద్రమేళాను నిర్వహిస్తున్నట్టు మహంత డాక్టర్ హరిహర దాస్ ఆదివారం తెలిపారు. ఈ మహేంద్రమేళాకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా ప్రారంభిస్తారని మాజీ ఎస్డీసీ చైర్మన్, బీజేపీ నాయకులు అంతర్యామి గోమాంగో అన్నారు. స్థానిక రాజవీధిలో శ్రీశైలం కల్యాణ మండపంలో విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు సిద్ధేశ్వర మిశ్రా, మహంత రామానంద దాస్, కాశీనగర్ బీజేపీ నాయకురాలు నళినీ పాత్రో పాల్గొన్నారు. మహేంద్రగిరి కుల పర్వతం ప్రాచుర్యం సంపాదించడానికి వివిధ హోమాలు, యజ్ఞాలు, పుష్కర స్నానాలు జరుపుతామన్నారు. తొలిరోజు కలశ యాత్ర, దీక్షాగ్రహణ, అంకురార్పణం, భాగవతం, రామచరిత మానస పఠిస్తామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే పలు ఆథ్మాత్మిక కార్యక్రమాల్లో అనేకమంది సాధు సంతవులు ఇక్కడికి విచ్చేస్తారని సిద్ధేశ్వర మిశ్రా తెలియజేశారు. -
ఆక్రమణదారులకు నోటీసులు జారీ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల మరాఠీగుడ కపిలపూర్ సమీపంలో మున్సిపాలిటీ స్థలాలను అక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్న వారికి సంబంధిత శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన 48 గంటల గడువులో స్థలాలను ఖాళీ చేయాలని, లేనిపక్షంలో ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇలా 35 కుటుంబాలు మున్సిపాలిటీ స్థలాలను అక్రమించుకున్నట్లు గుర్తించిన మున్సిపాలిటీ అధికారులు ఈ మేరకు వారికి శనివారం నోటీసులు జారీ చేశారు. ఇంటింటికీ సంబంధిత శాఖ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 42 మంది స్థలాలను ఆక్రమించుకున్నట్లు తమ సర్వేలో తేలిందని మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంగతోష్ కుమార్ నాయక్ తెలిపారు. మొదటి విడతలో 35 మంది కుటుంబాలకు ఈ నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం మిగతా వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
● నాగావళి నది సమీపంలో మృతదేహాన్ని పడేసిన దుండగులు ● పోలీస్ స్టేషన్ ఎదుగ బాధిత కుటుంబీకుల ఆందోళన
రాయగడ: స్థానిక రెల్లివీధికి చెందిన హడిప నిఖిల్ (18) అనే యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడిని మొదట అపహరించి అనంతరం అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని సమీపంలో గల నాగావళి నది వద్ద పడేశారు. అటువైపుగా వెళ్లిన కొందరు యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, ఎస్డీపీఓ గౌరహరి సా హు, పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రసన్న కుమార్ సైంటిఫిక్ టీమ్తో చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహా న్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచే పోలీసులు గాలింపు శనివారం రాత్రి పదిన్నర గంటలకు ఇందిరానగర్లో తుపాకీల గుళ్ల మోతతో కలకలం రేపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఫైరింగ్ చేసినట్లు కాలనీ వాళ్ల సమాచారం మేరకు ఆ దిశగా దుండగులను గాలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మృతదేహం లభించిన స్థలానికి చేరుకున్న ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు విలేకర్లతొ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన ఇదిలాఉండగా ఈ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబీకులు రెల్లివీధికి చెందిన మహిళలు సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో టైర్లను కాల్చి రాకపోకలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తుతో పోలీస్ స్టేషన్ ఎదుట పహారా కాశారు. నిందితులను గుర్తించాం శనివారం రాత్రి సుమారు సదరు పోలీస్ స్టేషన్లో నిఖిల్ అనే యువకుడి తల్లి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని ఎస్పీ స్వాతి తెలియజేశారు. ఈ మేరకు సదరు పోలీసులు కేసు నమోదు చేసి మూడు టీమ్లుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం కనిపించకుండాపోయిన నిఖిల్ అనే యువకుని మృతదేహం స్థానిక రింగ్ రోడ్డు సమీపంలొ గల నాగావళి నది వద్ద ఉందని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసు బలగాలతొ చేరుకున్నామని ఎస్పీ వివరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులను గుర్తించామని త్వరలో వారిని పట్టుకుంటామని అన్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు నిందితులను పట్టుకున్న తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందంటే..? శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్థానిక ఇందిరానగర్ మూడో లైన్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక మోటార్ సైకిల్, మరో వాహనంలో చేరుకున్నారు. అక్కడ ఏదో పనిమీద ఉన్న హడిప నిఖిల్ ఉండటం ముందుగానే గమనించిన దుండగులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరి రాకను గమనించిన నిఖిల్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దుండగులు తమ వెంట తీసుకువచ్చిన తుపాకీతొ రెండు రౌండ్లు పేల్చారు. దీంతో భయాందోళనకు గురైన నిఖిల్ ఇందిరానగర్ కాలనీలోని ఒకరి ఇంటిలోకి దూరిపోయాడు. వెంబడిస్తూ వెళ్లిన దుండగులు అతడిని పట్టుకుని తమ వెంట రింగ్ రోడ్డు వైపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి అతడిని దారుణంగా హత్య చేసి రింగ్ రోడ్డు సమీపంలొ గల నాగావళి నదికి దగ్గరలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపాయారు. ఆదివారం తెల్లవారున నిఖిల్ మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. -
రెడ్క్రాస్ సేవలు స్ఫూర్తిదాయకం
మల్కన్గిరి: రెడ్క్రాస్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. మల్కన్గిరి కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం డాక్టర్ చిత్తరంజన్ బారిక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్కన్గిరి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, కన్వీనర్ కార్యదర్శ రంజాన కుమార్ స్వాయి, జిల్లా యువ రెడ్క్రాస్ కన్వీనర్, కార్యదర్శి విఘ్నేశ్వర్, స్వచ్ఛంద సేవకులు శుభలక్ష్మీ సాహు, సునేలి మహారాణ, అంబికా ఖరా, సనతన్ కబసి, సురజ్ మల్లిక్, ఇస్పితా దాస్, జి.సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
కొండచరియలు పడకుండా ప్రత్యేక చర్యలు
రాయగడ: రైల్వే లైన్లలో వర్షా కాలంలో కొండచరియలు, బండరాళ్లు జారిపడటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపధ్యంలో రైల్వే శాఖ అందుకు నివారణ చర్యలను చేపట్టింది. ముఖ్యంగా కొరాపుట్–రాయగడ (కే ఆర్) లైనులో కొండ చరియలు జారిపడుతుండటంతో ఆందోళన కలిగించే విషయంగా భావించిన రైల్వేశాఖ అందుకు అనుగుణంగా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొండచరియల నుంచి ఇటాలియన్ వైర్ మెస్ రక్షణ కల్పించేలా రక్షణ గోడను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో మొదటిసారిగా రాయగడ జిల్లాలో దీనిని ప్రారంభించడం విశేషం. రాయగడలోని మజ్జిగౌరి మందిరానికి దగ్గరలో ఉన్న కొండలపై పనులను రైల్వే శాఖ ప్రారంభించింది. కొండపై డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో రంధ్రాలు చేసి ఆ రంధ్రంలో ఇనుపు ఊచలను ఏర్పాటు చేసి వైర్ మెస్ను నిర్మిస్తున్నారు. వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జారిపడే కొండచరియల నుంచి ఈ మెస్ రక్షణ కల్పిస్తుంది. రాయగడ, కాసీపూర్ సమితుల్లో ఇటువంటి తరహా ఇటాలియన్ మెస్ రక్షణ గోడలను రైల్వే శాఖ నిర్మిస్తుంది. వర్షాకాలానికి ముందే ఈ పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో శరవేగంగా నిర్మిస్తున్నారు. స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలో సుమారు 3 వేల కిలోల సామర్ధ్యం గల 230 మీటర్ల పొడవైన భద్రతా గోడను, అదేవిధంగా కాసీపూర్ సమితిలో 500 కిలోల సామర్ధ్యం గల సుమారు 70 మీటర్ల పోడవైన ఇటాలియన్ మెస్ రక్షణ గోడను నిర్మిస్తుండటం విశేషం. -
చిన్నారులను కాపాడుకుందాం
పర్లాకిమిడి: బాలబాలికలు సులభంగా సైబర్ నేరాలు బారిన పడటం, సోషల్మీడియా మాయలో చిక్కుకుని క్రిమినల్స్ చేతిలో హ్యాక్కు గురికావడం, కిడ్నాప్, క్రైం వంటి కేసుల్లో ఇరుక్కోవడం కోవిడ్ 2019 నుంచి ఎక్కువైందని, ఇలాంటి వారిని సంరక్షించడానికి ‘జువెటికా’ అనే అవుట్రీచ్ కార్యక్రమం ప్రారంభించామని ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి అన్నారు. స్థానిక ఆదర్శపోలీసు ష్టేషన్లో జువెటికా అవుట్రీచ్ కార్యక్రమాన్ని ఒడిషా డి.జి.పి. భుభనేశ్వర్ నుంచి వర్చువల్గా ప్రారంభించగా.. పర్లాకిమిడిలో జిల్లా ఎస్పీ (ఇన్చార్జి) సునీల్ కుమార్ మహాంతి ముఖ్య అతిథిగా హాజరై గజపతిలో ప్రారంభించారు. కార్యక్రమంలో డి.సి.పి.ఓ.అరుణ్ కుమార్ త్రిపాఠి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సఖీ వన్స్టాప్ సెంటర్, అంగన్వాడీ వర్కర్లు, వివిధ ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండి
● వృథాగా డ్రైవర్ల సంఘం భవనం ● సచివాలయానికి అప్పగించాలని పూర్వపు అధ్యక్షుల డిమాండ్ శ్రీకాకుళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలో ఉన్న డ్రైవర్ల సంఘం కార్యాలయ భవనం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ భవనం ద్వా రా వస్తున్న ఆదాయం ఎవరికి వెళ్తోంది, ఎక్కడ ఖర్చవుతోంది అన్నది తెలియకుండా ఉందని డ్రైవ ర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని అనీల్చంద్ర పునేఠ కలెక్టర్గా ఉన్న సమయంలో డ్రైవర్ల కు అప్పగించారు. రౌతు సింహాచలం ఈ సంఘాని కి అధ్యక్షులుగా ఉన్న సమయంలో 2014లో రూ.14 లక్షలతో భవనానికి మరమ్మతులు నిర్వహించి పక్కా షాపులు నిర్మించారు. అనంతరం అద్దెల వసూలు మొదలుపెట్టారు. నెలకు సుమారు రూ.50వేలకు పైగా అద్దెలు వస్తున్నాయి. ఇన్నేళ్లలో దాదాపు లక్షల్లో అద్దె రూపంలో వచ్చిఉండాలని, కానీ ఆ డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సంఘానికి చెందిన వారు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికే డ్రైవర్లు కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ రూమ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు సుమారు 320 మంది ఉండేవారు. వారంతా పదవీ విరమణ చేయడంతో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. గతంలో వాచ్మెన్లను పెట్టి అన్ని రకాల క్లీనింగ్లు వంటివి చేసేవారు. కలెక్టరేట్లో డ్రైవర్గా ఉన్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనే పెత్తనమంతా చెలాయిస్తున్నట్లు ఆ సంఘ నాయకులే చెబుతున్నారు. భవనానికి వచ్చిన రాబ డి అంతా సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాను కలెక్టరేట్ డ్రైవర్నని తనను ఎవరూ ఏమీ చేయలేరని డాంబికాలు పలుకుతున్నట్లు సమాచారం. ఓ ఇద్దరు వ్యక్తులే వచ్చిన కాడికి తినేస్తున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. అద్దెలు కలెక్షన్ చేస్తున్నారే తప్ప ఎలాంటి లెక్కలు చూపించడం లేదని, సంఘ భవనాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లించగలిగితే బాగుంటుందని పూర్వపు అధ్యక్షులు, సంఘ నాయకులు కోరుతున్నారు. కనీసం సచివాలయాలకైనా ఇస్తే ఆ డబ్బులైనా మిగులుతాయని అంటున్నారు. -
సైలెన్సర్లు ధ్వంసం
● రూ.1,27,500 జరిమానా వసూలు జయపురం: జయపురం పట్టణంలో శబ్ధ కాలుష్యం సృష్టిస్తున్న మోటారు బైక్ల సైలెన్సర్లను పట్టణ పోలీసులు ధ్వంసం చేశారు. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ ఆదేశాల మేరకు శుక్రవారం జయపురం పట్టణం ప్రధాన కూడలి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంలో ద్విచక్రాల వాహనాలను, వాటి పత్రాలను తనిఖీ చేసినట్లు పోలీసు అధికారి అర్చన మిత్తల్ వెల్లడించారు. 85 మోటారు వెహికల్ కేసులు నమోదు చేసి, ఆయా వాహనాల డ్రైవర్ల నుంచి రూ.1,27,500 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. పోలీసులు జప్తు చేసిన సైలెన్సర్లను రోలర్తో మట్టించి ధ్వంసం చేశామన్నారు. వాహనదారులు కొత్త సైలెన్సర్లు తెచ్చిన తరువాతనే వారికి వాహనాలు అప్పగించారు. మావో లేఖ విడుదల మల్కన్గిరి : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఉత్తర సమన్వయ కమిటీ శుక్రవారం ఓ మావో లేఖను విడుదల చేశారు. ఈ లేఖ విడుదలతో చత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర భద్రత సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి. లేఖలో సంస్థ ప్రస్తుతం నేరుగా ఎదురుకాల్పుల్లో నివారిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని చూస్తున్నట్లు కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. లేఖలో చత్తీస్గఢ్, తెలంగాణలో చురుగ్గా పనిచేసిన ప్రముఖ నక్సల్ నాయకుడు దేవ్జీ లొంగుబాటు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతడిని శత్రువుల ఏజెంట్గా అభివర్ణించారు. దేవ్జీ వంటి సీనియర్ నేతల లొంగుబాటు సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. అందుకే లేఖ ద్వారా సంస్థ ముగిసిపోలేదనే సంకేతాన్ని పంపించారు. -
మట్టిలో మాణిక్యం..
రాయగడ: స్థానిక రాయగడ స్వయం ప్రతిపత్తి కళాశాల స్నాతక, స్నాతకోత్సవ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. స్నాతక స్థాయి కళల (ఆర్ట్స్) విభాగం 12 శాఖల్లో తెలుగు శాఖకు చెందిన పచమట్ల వర్షిత 9.05 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన వర్షిత పాఠశాల విద్య నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచేది. పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన వర్షిత.. తల్లి, వదిన సంపాదన మీదే ఆధారపడింది. ఎలాగైనా ఉన్నత విద్యను అభ్యసించి అధ్యాపక వృత్తి చేపట్టానలన్నదే ధ్యేయంగా నిరంతరం కృషి చేసింది. వర్షిత సాధించిన ఈ విజయానికి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులు వర్షితను స్ఫూర్తిగా తీసుకోవాలని అధ్యాపకులు అన్నారు. హెల్ప్లైన్ నంబర్ల విడుదల జయపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయపురం పట్టణ పోలీసు అధికారులు ప్రజల కోసం హెల్ప్లైన్ నంబర్లను శుక్రవారం విడుద ల చేశారు. ఈ కార్యక్రమానికి జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల స హాయం కోసం 112, అంబులెన్స్కు 108, అగ్నిమాపక సేవలకు 101, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1030, బాలల సహాయ సేవలకు 1098, మహిళల సహాయ సేవలకు 181 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్డీపీఓ అర్చిత మిత్తల్ వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్విని యోగ పరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్ర రౌత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజనపై సమీక్ష పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజన ద్వారా రైతులు లాభసాటి వ్యవసాయం, రొయ్యల పెంపకం, లేయర్ఫార్మ్, ఉద్యానవనాలు పెంపకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి ఎం.ప్రకాశరావు తెలిపారు. కలెక్టరేట్లో హాల్.2లో శుక్రవారం ఎం.కె.యు.వై. పథకంపై ఆగ్రో ఎంటర్ప్రైజర్స్, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గుణీ మఝి, జిల్లా ముఖ్య ప్రాణి చికిత్సా అధికారి డాక్టర్ తుషారేందు నాయక్, అటవీ శాఖ రేంజర్ నిరోధచంద్ర నాయక్, డి.ఎం.ఆపికోల్ బిపిన్కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఉదయం జిల్లా అత్యవసరశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏడీఎం మునీంద్ర హానగ ముఖ్యఅతిథి గా విచ్చేశారు. ప్రముఖ మానవతావాది జీన్ హెన్రీ డమంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. మానవత్వంలో ఏకత్వం... ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం, యుద్ధాలు, విపత్తులు జరిగి నా రెడ్ క్రాస్ సొసైటీ స్పందించటం అనేది రెడ్ క్రా స్ వాలంటీర్ల స్ఫూర్తి అని రెడ్ క్రాస్ నోడల్ అధికారి బినాయక్ చంద్రరౌళో అన్నారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్కుమార్ త్రిపాఠి, తదితరు లు హాజరయ్యారు. గజపతి జిల్లాలో ఒక్క రోడ్డు రవాణా సంస్థ, ఒక్కటే అత్యధిక మొత్తంలో రెడ్ క్రా స్ నిధులు సేకరిస్తుందని, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా స్పందించి విరాళాలు సేకరించాలని ఏడీఎం మునీంద్ర హానగ కోరారు. గత ఏడాది జిల్లా వ్యా ప్తంగా ఇండియాన్ రెడ్క్రాస్ సంస్థ రూ.20.53 లక్షల సేకరించగా, దానిలో ఆర్.టి.ఓ. (గజపతి) రూ. 16.63 లక్షలు సేకరించిందని అందుకు ప్రతిగా ఆ శాఖకు మెమొంటో, ప్రశంపాపత్రాన్ని ఏడీఎం హాన గ అందజేశారు. అనంతరం ఎక్సైజ్శాఖ, మోహనా ప్రభుత్వ ఎస్.ఎస్.డి పాఠశాల, రక్తదానం చేసిన అత్యధికులకు కూడా ప్రశంసాపత్రాల్ని అందజేశారు. -
కేసీసీ బ్యాంకు కేసులో మరిన్ని అరెస్టులు
మల్కన్గిరి : మల్కన్గిరి కేసీసీ బ్యాంక్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఘటనలో ఒడిశా విజిలెన్స్ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కేసులో బ్యాంకు శాఖ మేనేజర్ సుధాంశు ఖోరాను ముందుగానే అరెస్టు చేశారు. శుక్రవారం ఆయన సహచరులు సుశ్రీ నివేదిత, ఆమె ప్రియుడు నృసింహ ప్రసాద ఖమారిను అరెస్టు చేశారు. వీరి నుంచి 25 బ్యాంక్ ఖాతాలు, 33 మొబైల్ ఫోన్లు, డ్రోన్ కెమెరాలు, విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంట భువనేశ్వర్ ఖుర్దాలో ఇలా అనేక చోట్ల వీరి మోసచరిత్ర ఉన్నట్లు విజిలెన్స్ దర్యాప్తులో తెలిసింది. -
హక్కులు హరించి సమావేశాలా?
● జెడ్పీ సమావేశం బహిష్కరించిన సభ్యులు కొరాపుట్ : ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై న ప్రజా ప్రతినిధుల హక్కులు హరిస్తూ సమావేశాలు నిర్వహించడం ఎందుకని సభ్యులు మండిపడ్డారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా పరిషత్ 9వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. జిల్లాలో 26 జెడ్పీ స్ధానాలలో అధికార బీజేపీకి సభ్యత్వం లేదని, కానీ ప్రతి చోట జెడ్పీ నిధులు వినియెగంలో స్థానిక జెడ్పీ సభ్యుల మాటకు విలువ లేకుండా బీజేపీ కార్యకర్తలే నిధులు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. అధికారం మాటున కార్యకర్తలు బరి తెగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మర్కోట్లో ఏకపక్షంగా పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. అనంతరం జిల్లా పరిషత్ అధ్యక్షుడు మోతిరాంనాయక్ అధ్యక్షతన కాంగ్రెస్, బీజేడీలకు చెందిన జెడ్పీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ గౌరీశంకర్ మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి తదితరులు పాల్గొన్నారు. -
మోసాలపై అవగాహన
రాయగడ: జిల్లాలోని 16 పోలీస్ స్టేషన్లలో జువెన్టిక అవుట్రీచ్ విత్ అడాల్సెంట్ కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగాయి. యువతీ, యువకులను ఆహ్వానించి వారికి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. డిజిటల్ మాధ్యమంలో యువత వివిధ మోసాలకు గురవుతున్న నేపథ్యంలో వారికి జరిగిన మోసాలకు సంబంధించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సంకోచించడం వల్ల తరచూ మోసాల బారిన పడుతున్నారు. అందువల్ల వారు పోలీసులకు సంప్రదించడంతో పాటు వారికి జరిగిన మోసాలకు సంబంధించి ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకువెళితే తగిన న్యాయం చేకూరుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ విభాగం నిర్వహించింది. శుక్రవారం నాడు జిల్లాలో జరిగిన వివిధ పోలీస్ స్టేషన్లలో యువతీ, యువకులను ఆహ్వానించిన పోలీసులు ఈ మేరకు వారిని చైతన్య పరిచారు. -
సొమ్ము దోచేశాడు
గ్యాస్ ఓటీపీ అడిగాడు.. ● హిరమండలం మండలంలో వెలుగుచూసిన వైనం ● ఆన్లైన్లో వివరాలు చెబితే అంతే.. ● హెచ్చరిస్తున్న పోలీసులు హిరమండలం: హిరమండలం మండంలోని పిండ్రువాడ, రెల్లివలసలో గుర్తు తెలియ ని యువకుడు మోసాలకు గురిచేశా డు. గ్యాస్ పేరుతో ఫోన్లకు నకిలీ మెసేజ్లు పెట్టాడు. గ్యాస్ వచ్చిందని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర రూ.1000 వసూలు చేసి ఉడాయించాడు. అయితే ఆ రెండు గ్రామాల్లోనే కాదు. పరిసర ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గ్యాస్ పేరుతో ఇలా మోసాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో విధిగా 45 రోజుల తరువాత కొత్త గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అటు ఫోన్లకు వచ్చే ఓటీపీ చెబితే కానీ గ్యాస్ అందించడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఓటీపీ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాలో జనగణన కూడా ప్రారంభమైంది. దీంతో ఎవరు ఎందుకు వస్తున్నారో? ఏ వివరాలు సేకరిస్తున్నారో తెలియని పరిస్థితి. అసలు జనగణన కోసం వచ్చేవారు ఏ వివరాలు తీసుకుంటారు? ప్రజలు ఏ వివరాలు ఇవ్వకూడదు? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఆన్లైన్లోనూ వల గ్యాస్ పేరుతో ఆన్లైన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. కొరతను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారు. రెండు రోజుల్లో గ్యాస్ సరఫరా అంటూ వల పన్నుతున్నారు. వారు పంపిన లింక్లను క్లిక్ చేసిన మరుక్షణం వినియోగదారుల ఫోన్లు మోసగా ళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. వినియోగదారుడు తెలుసుకునేలోగా మోసం జరిగిపోతోంది. వారి వలకు చిక్కకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, గ్యాస్ డీలర్లు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. గ్యాస్ వాహనాలు వచ్చి డెలివరీ బాయ్స్ సంప్రదించేవరకూ ఎవరూ స్పందించవద్దని కోరుతున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆన్లైన్లో ఓటీపీలు అడగరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేవలం గ్యాస్ వాహనంతో డెలివరీ బా య్స్ వచ్చి వివరాలు అడిగితేనే చెప్పాలని సూచిస్తున్నారు. గ్యాస్ పేరుతో అపరిచిత వ్యక్తులు వచ్చి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. గ్యాస్ వాహ నం రాకుండా ఇంటికి వచ్చి అడిగేవారు మోసం చేసేవారు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. అదే సమయంలో ఆన్లైన్లో సైతం ఎలాంటి వివరాలు చెప్పకూడదు. చెబితే సైబర్ నేరగాళ్ల మాయలో పడినట్టే. అందుకే అప్రమత్తంగా ఉండాలి. – వై.మధుసూధనరావు, ఎస్ఐ, హిరమండలం -
ఏపీఈసెట్ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీఈసెట్–2026 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 90.97 శాతం ఉత్తీ ర్ణతను సాధించి మెరిశారు. పాలిటెక్నిక్ చదివి ఇంజినీరింగ్ కోర్సు ల్లో నేరుగా రెండే ఏడాది ప్రవేశా లు పొందేందుకుగాను రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీన రెండు సెషన్లగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. ఈసారీ బాలికలే టాప్.. ఎప్పటిలాగే సారి కూడా బాలికలే టాప్లేపే ఫలితాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 1389 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1340 మంది హాజరయ్యారు. వీరిలో 1219 మంది ఉత్తీర్ణత సాధించి అర్హత సాధించారు. ఇందులో 923 మంది బాలురుకుగాను 89.17 శాతం ఉత్తీర్ణతతో 823 మంది క్వాలిఫై అవ్వగా, 417 మంది బాలికలకుగాను 94.6 శాతం ఉత్తీర్ణతతో 396 మంది అర్హత పొందారు. వివిధ బ్రాంచీల్లో పలువురు విద్యార్థులు అదిరేటి ర్యాంకులు పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్లో పలాస మండల పరిధిలోని తాళ్లభద్ర గ్రామానికి చెందిన కుప్పిలి నిఖిల్కుమార్ స్టేట్లో 7వ ర్యాంకు సాధించాడు. లింగాలవలస విద్యార్థికి ఈసెట్లో 33 వ ర్యాంక్ జలుమూరు: లింగాలవలసకు చెందిన పంచిరెడ్డి పవన్ కల్యాణ్కు ఈసెట్లో 33వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 973. ఒకటి నుంచి ఐదు వరకూ చల్లవానిపేట విజ్ఞాన దుర్గ, ఆరు నుంచి పది వరకూ కరవంజ ఆదర్శ పాఠశాలలో చదివాడు. తల్లి దండ్రులు జయలక్ష్మి, ప్రకాశరావు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసు సాధనే తన లక్ష్యమని పవన్కల్యాణ్ తెలిపాడు. -
నిదురమ్మ ఎటు బోతివే..
స్మార్ట్ స్క్రీన్ల వెలుగులో ‘మెలటోనిన్’ హార్మోను రాను రానంటోంది. మొబైల్ ఫోన్ల మాయలో పడి ‘సెరొటోనిన్’ రావడమే మానేసింది. ఈ రెండూ లేకుంటే మనిషికి నిద్ర లేదు.. జీవికి ప్రశాంతత లేదు. రాత్రంతా కొరివి దెయ్యాల్లా కళ్లు ఎర్రగా మండేంత వరకు సెల్ఫోన్ చూడడం, నిశాచరుల్లా తిరగడం, ఇష్టానుసారం తినడంతో ఈ హార్మోన్ల అసమతుల్యత తప్పడం లేదు. ఒకప్పుడు టీవీ చూస్తూ ఆవులింతలు తీయడం, మాటలు వింటూ కునికి పాట్లు పడడం అన్నది ఈ తరానికి పూర్తిగా దూరమైపోయింది. అర్ధరాత్రి దాటినా చాలా మందిని నిద్ర కరుణించడం లేదు. దీని ఫలిత మే సవాలక్ష ఆరోగ్య సమస్యలు. శ్రీకాకుళం కల్చరల్: ఉరుకులు, పరుగులు, హడావుడి.. బతుకుంతా ఇలాగే మారిపోయింది. ఈ గజిబిజి జీవనంలో కంటి నిండా నిద్రపోయే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి గురై వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం కనిపించడం లేదు. నేటి పరిస్థితులలో జీవన సమస్యలు ఎదుర్కోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తున్నారు. కనీసం పిల్లల గురించైనా పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పిల్లలతో కలిసి కాసేపు పార్కులకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. నిద్ర పట్టకపోవడం. ఆకలి లేకపోవడం, ఎక్కువ తినాలనిపించడం. హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళలలో పీరియడ్స్ ఇబ్బందులు. ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు సోకడం. నిద్రకు దూరమవుతున్న యువత చుట్టు ముడుతున్న ఆరోగ్య సమస్యలు గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్లకు ఇదీ ఓ కారణం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం. ఒకే సమయానికి రోజూ నిద్రించడం అలవాటు చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్పై దృష్టి సారించాలి. సెల్ఫోన్ చూడడం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. నిద్ర తగ్గితే ప్రాణ హాని కలుగుతుంది. శారీరక, మానసిక ఒత్తిడులు నిద్రలేమి వల్లనే కలుగుతాయి. వృత్తిపరమైన స్ట్రెస్, పర్సనల్ లైఫ్ సమస్య, ఎగ్జైట్మెంట్ వల్ల మానసిక వ్యాధులు వస్తాయి. పిల్లలైనా పెద్దవారైనా ప్రతి వారు శారీరక వ్యాయామం, ఆటపాటల వల్ల మంచి నిద్ర పట్టి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. – జి.రోష్మల్లికార్జున్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, శ్రీకాకుళం -
శ్రీ జగన్నాథుని పేరుతో ప్రత్యేక చానెల్ యోచన
భువనేశ్వర్: రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని సంస్కృతి విస్తృత ప్రసారానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ జగన్నాథుని పేరుతో ఒక ప్రత్యేక టీవీ చానెల్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ఆరంభించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అధ్యక్షతన లోక్ సేవా భవన్ న్యాయ శాఖ సమావేశం హాలులో చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత కొత్త చానెల్ స్వరూపం, రోజువారీ కార్యక్రమాలు, జగన్నాథ సంస్కృతి వ్యాప్తి, భక్తుల మనసుల్లో జగన్నాథుని పట్ల భావాలను ప్రేరేపించే ప్రతిపాదిత ప్రసారాలపై చర్చించారు. చానెల్ ఏర్పాటుపై జరిగిన ప్రాథమిక చర్చలు సానుకూలంగా సాగాయి. జగన్నాథ సంస్కృతిపై మరింత పరిశోధన, చర్చల ద్వారా యావత్ ప్రపంచానికి అవగాహన కల్పించడం, భక్తులకు జగన్నాథుని మహాత్యం, ఆధ్యాత్మిక భావాల గురించి తెలియజేయడం, భక్తుల అనుభవాల ప్రతిస్పందన వంటి శీర్షికలతో ప్రసారం చేయడం ఈ చానెల్ ఏర్పాటు యోచన ప్రధాన లక్ష్యంగా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరిపి, పూర్తి ప్రొఫైల్ను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి శ్రీ మందిరం ముఖ్య నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి హాజరు అయ్యారు. -
జీడి.. ఇంటికి చేరిందండి
● ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు ● దేశీయ పిక్కలపై ఆసక్తి చూపని వ్యాపారులు పలాస: ఉద్దానం ప్రాంతంలో ప్రజల జీవనాధారమైన జీడి పంట రైతుల ఇళ్లకు చేరింది. వాటిని అమ్ముకోవడానికి ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి తోటల్లో జీడి పిక్కలు కాపునకు వచ్చాయి. వాటిని తోటల్లో సేకరించి ఎండబెట్టి గోనె సంచుల్లో నింపి భద్రపరిచారు. ప్రస్తుతం జీడి పంటలు ఆఖరి దశకు చేరుకున్నాయి. పలాస నియోజకవవర్గంలోని పలా స మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో గల జీడి తోటల్లో పిక్కలు ఇళ్ల వద్దకు చేరుకున్నాయి. అయితే గ్రామాల్లోకి వ్యాపారులు ఇంకా రావడం లేదు. ఇప్పటికే విదేశీ పిక్కలను దిగుమతి చేసుకున్న పలాస వ్యాపారులు ప్రస్తుతం వాటిపైనే ఆధార పడి తమ పరిశ్రమలను నడిపించుకుంటున్నారు. దీంతో వారంతా ధీమాగా ఉన్నారు. ఏటా ఇదే తంతు జరుగుతోందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పలాస పప్పు అంటే ఉద్దానం జీడి పిక్కల వల్లనే వాటికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పు డు ఉద్దానం పిక్కలను కొనుగోలు చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఎప్పు డో ఒకప్పుడు తమకే అమ్ముతారన్న ధీమా వారిలో నాటుకు పోయింది. అలాగే రైతులు కూడా చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం, వారితో ఉన్న అవినాభావ సంబంధాల మేరకు వారికే పిక్కలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకా పిక్కల ధరలు తేలలేదు. రైతు సంఘాల మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 80 కిలోల బస్తా పిక్కలను రూ.16వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న వారి డిమాండు ఏడాది ఎంత వరకు నెరువేరుతుందో వేచి చూడాలి. -
కన్నీటి చార ఆరక ముందే..
నరసన్నపేట: జమ్ము గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. వారం వ్యవధిలో తండ్రీకుమారులు కోల లక్ష్మణరావు, కోల శివప్రసాద్లు మృతి చెందారు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రమైంది. వారం కిందట కోల లక్ష్మణరావు కుమారుడు శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శివప్రసాద్ ద్విచక్రవాహనం విజయనగరం వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఇంటిని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పుట్టెడు దుఖంతో తండ్రి లక్ష్మణరావు కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అనారోగ్యానికి గురైన లక్ష్మణరావు జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుమారుడు మృతి నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే తండ్రి కూడా మరణించడంతో ఈ కుటుంబం దిక్కులేనిదైంది. శివప్రసాద్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరు సోదరీమణులకు వివాహాలు చేశాడు. ఇప్పుడు తండ్రీ కుమారులు ఇద్దరూ వారం వ్యవదిలో మరణించడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావ డం లేదు. కోల లక్ష్మణరావుకు భార్య సీతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
యువత క్రీడలపై ఆసక్తి కనబరచాలి
రాయగడ: యువత క్రీడలపై ఆసక్తి కనబరిచి ప్రతిభ చాటుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి కొరాడ రజిత అన్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సింగారి పంచాయతీ సనొబామునగుడలో సనొబామునగుడ క్రికెట్ టోర్నీ ఫైనల్స్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గుండురిగుడ, హతిముండ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో గుండురిగుడ జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు రంజనా ఉపాధ్యాయ, టుటు ఖడంగ, కొరప పంచాయతీ బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ పాత్రొ తదితరులు పాల్గొన్నారు. -
బలియంత హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తు
భువనేశ్వర్: బలియంత దారుణ హత్యా ఘటనతో యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. లైంగిక వేధింపుల ఆరోపణ కింద గ్రామస్తులు మూక దాడికి పాల్పడి యువకుడిని చావగొట్టారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం ఘటనా స్థలం చేరింది. రాష్ట్ర పోలీస్ డైరెక్టరు జనరల్, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సంఘటనా స్థలం ప్రత్యక్షంగా సందర్శించి విచారణ చేపట్టారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియాతో నగర డీసీపీ జగ మోహన్ మీనా, బలియంత ఠాణా పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ జరుపుతున్నారు. అదే విధంగా ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శోభనా మహంతి బలియంత ప్రాంతంలో హత్య ఘటనా స్థలం సందర్శించారు. ఆ ప్రాంతంలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ బాధితుడి ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక దాఖలు చేయనున్నట్లు వివరించారు. దోషులపై చర్య తీసుకోవడం తథ్యమని హామీ ఇచ్చారు. ఈ హృదయ విదారక ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. అందుబాటులో ఆధారాల వనరుల నుంచి మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. మృతుడు సౌమ్య రంజన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురు వారం రాత్రి పొద్దుపోయే వరకు బలియంత పోలీస్ ఠాణా బయట నిరసన చేపట్టారు. ఇలాంటి మూక దాడులు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఒడిశా కానిస్టేబుల్ సిపాయి మహాసంఘ్ ప్రభుత్వవ రైల్వే పోలీసు (జీఆర్పీ) సూపరింటెండెంటుతో భేటీ అయింది. ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని సిపాయి మహాసంఘ్ అభ్యర్థించింది. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేపట్టడంతో మృతుడు సౌమ్య రంజన్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సంఘం ప్రతినిథులు కోరారు. -
నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలో గల నవజీవన ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావ సర వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రతి నెలా తమ ట్రస్టు తరఫున నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు బియ్యం, కందిపుప్పు, దుంపలు, నూనె, తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆచార్య ఇక్కడ ట్రస్టును ఏర్పాటు చేశారన్నారు. ట్రస్టు ద్వారా పేదలైన ఆదివాసీ యువతులకు చదివించడంతోపాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఇలా దాదాపు వంద మందికి పైగా యువతులు ట్రస్టు ద్వారా సాయం పొందుతున్నారన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు మందస: స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో శుక్రవారం గిరిజనుల సమస్యలపై పీజీఆర్ఎస్ కు 23 వినతులు అందా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ ఎర్.అప్పలరాజు, తహసీల్దార్ మిస్క శ్రీకాంత్ పాల్గొన్నారు. కుసుమాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంకు మంజూరు, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. నువాగడ గ్రామానికి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, పట్టులోగాం గ్రామంలో రోడ్డును మరమ్మతు చేయాలని, సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కుడుమసాయి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని మరికొందరు కోరారు. సవర మధ్య గ్రామానికి వ్యవసాయ బావులకు త్రీ ఫేస్ విద్యుత్ను అందించాలని, ఒడిశా అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ‘వేధింపులు ఆపండి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని, ఈ వేధింపులు తక్షణమే ఆపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం రెండో డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ బాబు, కె.బాబూరావులు అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉద్యోగులపై పని భారం పెంచుతోందన్నారు. డబుల్ డ్యూటీలు చెయ్యమని ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం రెండవ డిపో ఉద్యోగులు ఆనంద్, వై.దుర్గారావు, ఎస్.జోగారావు, ఎస్ఎస్ రావు, బి.సుభద్ర పాల్గొన్నారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్ఐ ఎస్.మధుసూదనరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హతిగూడ ప్రాంతానికి చెందిన రాజేంద్ర పొలై (22) బరంపురం నుంచి అన్నవరం వైపు రైల్లో ప్రయాణిస్తున్నట్లు అతని వద్ద లభించిన రైల్వే టికెట్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. జనర ల్ బోగీలో ప్రయాణిస్తున్న రాజేంద్ర గుర్తుతెలియని రైలు నుంచి శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ వద్ద జారిపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. 25, 26న ఎస్బీఐ సమ్మె శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 25వ తేదీ, 26న రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు నిర్ణయించిన ట్లు రీజినల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలోని జీటీరోడ్లోగల ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎస్బీఐ ఉద్యోగులంతా శుక్రవారం మౌనదీక్ష వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రెండు రోజులు పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. సమ్మెకు దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వారి మద్దతును తెలిపారని పేర్కొన్నారు. -
ఘనంగా ప్రభుదాన్ భొత్ర జయంతి
జయపురం: ప్రముఖ కవి, రచయిత, పత్రికా సందకుడు, విద్యాదాత, సమాజ సేవకుడు ప్రభుధాన్ భొత్ర జయంతి గురువారం ఘనంగా జరిగింది. భొత్ర స్థాపించిన స్థానిక ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ భాగృహంలో డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ అధ్యక్షతన జయంతి కార్యక్రమం నిర్వహించారు. భొత్ర చిత్రాలతో రచించిన ‘సంగరె సెల్ఫీ’ పుస్తకం ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. ‘దండకారణ్య సమాచార్’ పత్రిక సంపాదకులు బినోద్ మహాపాత్రో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భొత్ర అవిభక్త కొరాపుట్లో అనేక రంగాల్లో పని చేశారన్నారు. పత్రికా సంపాదకుడిగా పాత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. ముఖ్యవక్తగా ఆల్ ఇండియ రేడియో విశ్రాంత అధికారి, స్థానిక పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జాని, తదితరులు మాట్లాడుతూ.. ప్రభుదాన్ భొత్ర జీవన శైలి, వ్యక్తిత్వం, సమాజ సేవలను వివరించారు. పత్రికా సంపాదకులు బినోద్ మహాపాత్రను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు అలోక్ మహరాణ, భారతీ మల్లిక్, సమాజ సేవి బాలారాయ్, అశోక్ మహనందియ, అశోక్ మహరాణ, అభినాష్ పాత్రో, నారాయణ మహాపాత్రో, బిపిన్ మహానందియ, సుభాష్ మహాపాత్రో, డాక్టర్ సబిత శతపతి, డాక్టర్ శౌభాగిణి నందో, తదితరులు పాల్గొన్నారు. -
టమాటా రైతులకు పరిహారం అందించాలి
సోంపేట: మండలంలో గత నెల ఏడో తేదీన కురిసిన వర్షాలకు టమాట పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమాట రైతులను ఆదుకోవాలని కోరుతూ గురువారం సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జింకిభద్రలో టమాటా పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత నెలలో కురిసిన వర్షాలకు టమాటా రైతులు, కాయగూరల రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వలల్ల టమాట పంట నీట మునిగి రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టగా.. వర్షాల వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్నారు. ప్రభుత్వాలు టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో 600 ఎకరాల్లో టమాట సాగు చేస్తే ఏప్రిల్ 7న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయిందన్నారు. నేటికీ పంటల బీమా గానీ, పంట పెట్టుబడి సహాయం గానీ అందలేదన్నారు. టమాట పంటకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్చేశారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ చొరవ తీసుకోవాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టమాటా రైతులను ఆదుకోవాలని విన్నవించామని, అయినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నాయకులు ఇప్పిలి కృష్ణారావు, సల్ల దేవరాజు, గురాల శ్రీను, బతకల మోహనరావు, తామాడ పద్మావతి, పాతిన శేషగిరి, పిన్నింటి ఈశ్వరరావు పాల్గొన్నారు. -
నేటి నుంచి పీజీ సెట్
ఎచ్చెర్ల : రాష్ట్రంలో పలు యూనివర్శిటీలు, అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8 నుంచి నాలుగు రోజులపాటు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారు వెబ్ ఆప్షన్స్ ద్వారా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో వివిధ కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ● ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి ఎం.కాం, ఎం.ఎ (ఎకనామిక్స్), ఎం.ఎ (రూరల్ డెవలప్మెంట్), ఎంఈడీ, ఎం.ఎల్.ఐ.సీ (లైబ్రరీ సైన్స్), ఎం.ఎ(సోషల్వర్క్), ఎం.ఎ (ఇంగ్లీష్), ఎం.ఎ (తెలుగు), ఎం.జె.ఎం.సి (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) కోర్సులకు వెబ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ● సైన్స్ కళాశాలకు సంబంధించి ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్సీ (మైక్రో బయాలజీ), ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (అనలైటికల్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (అప్లయిడ్ మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (ఫిజిక్స్)లకు ఏపీపీీజీసెట్–2026 ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.ఎపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. అధునాతన వసతులు.. పీజీ ప్రవేశాలు పొందినవారికి అంబేడ్కర్ వర్శిటీ పలు వసతులు కల్పిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన హాస్టళ్లు, కిచెన్లు, గ్రంథాలయాలు, వ్యాయామశాలలు, ప్రయోగశాలలు, యోగా హాళ్లు, హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. జీసీసీ కేఫ్, క్యాంటీన్, బ్యాంక్, వైఫై సదుపాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలకు విద్యార్థులు అర్హులేనని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య తెలిపారు. -
నేటి నుంచి పలు జిల్లాల్లో వర్ష సూచన
భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) జారీ చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ సూచన. ఈ వ్యవధిలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ పసుపు హెచ్చరిక జారీ చేసింది. మయూర్భంజ్, కెంజొహర్, సుందర్గడ్, నవరంగపూర్, కలహండి, కంధమల్, నువాపడా, సంబల్పూర్, ఝార్సుగుడ, దేవ్గడ్, బర్గడ్, అంగుల్, బాలాసోర్, అంగుల్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, ఢెంకనాల్, గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలో మీటర్ల వరకు వేగం పుంజుకునే ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఉరుములతో కూడిన వర్షాలు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రదేశాలలో పనిచేసే వర్గాలు ఎత్తైన చెట్లు, లోహ నిర్మాణాలకు దూరంగా ఉండాలని ఐఎండీ కోరింది. రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఫుడ్ సేఫ్టీ విభాగం, మున్సిపల్ సంబంధితశాఖ అధికారులు బుధవారం పలు హోటళ్లల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా జరిమానా రూ పంలో రూ.58 వేలను వసూలు చేశారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిప్రకాష్ సోరేన్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్కుమార్ నాయక్ నేతృత్వంలో గుణుపూర్ పట్టణంలో గల వివిధ హోటళ్లలో దాడులను నిర్వహించారు. పాడైన ఆహా ర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగులు వినియోగించవద్దని హెచ్చరించారు. హోటళ్ల నిర్వహణకు సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించే హో టళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నా రు. హోటళ్లలో పాలిథిన్ వినియోగం, ట్రేడ్ లైసెన్స్ లేనివారిపై జరిమానాలు విధించారు. 14 హోటళ్ల లో అధికారులు దాడులను నిర్వహించి రూ.58 వేలు జరిమానా విధించారు. -
రవి అస్తమించని మైనింగ్ సామ్రాజ్యం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో కొండలు తరిగిపోతున్నాయి. అక్రమంగా కొండల్ని తవ్వేసి గ్రావెల్ దోపిడీ చేస్తున్నా రు. ప్రకృతి వనరులు విధ్వంసం చేసి, అడ్డంగా సంపాదిస్తున్నారు. కీలక నేత కనుసన్నల్లో పచ్చనేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడక్కడ క్రషర్లకు ఉన్న అనుమతులు చూపించి, ఏకంగా క్వారీలు నడుపుతున్నారు. రైల్వే లైన్లు, లేఅవుట్లకు, అపార్ట్మెంట్, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్కు విక్రయించి అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మై నింగ్ సామ్రాజ్యంలో ఏ ఒక్కరూ అడుగు పెట్టలేక పోతున్నారు. అధికారులు సైతం అక్కడికెళ్లడానికి భయపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను నియంత్రించాలంటే చెక్ పోస్టు పెట్టాలని మండల స్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దర్జాగా దోపిడీ.. పొందూరు మండలంలో అధిక సంఖ్యలో కొండలు ఉన్నాయి. నల్ల రాయి, ఎర్ర రాయి, ఎర్ర గ్రావెల్ అధికంగా దొరుకుతుంది. ఈ మండలంలో రాపాకలోని సర్వే నంబర్ 335లో, కృష్ణాపురంలోని సర్వే నంబర్ 198లో మాత్రమే నల్ల రాళ్లను కొట్టుకోవడానికి అనుమతి ఉంది. అలాగే, వీఆర్ గూడెంలో క్రషర్కు అనుమతి ఉంది. మిగతా చోట్ల ఎక్కడా అనుమతుల్లేవు. కానీ రాపాకలో అనుమతి ఉన్న ప్రాంతంలోనే కాకుండా పక్కనున్న ఏరియాలో అక్రమంగా తవ్వేస్తున్నారు. కృష్ణాపురంలో కూడా అదే జరుగుతోంది. వీఆర్ గూడెంలోని సర్వే నంబర్ 137లోని ఎర్రకొండనైతే ఏకంగా గుల్ల చేసేస్తున్నా రు. వీటితో పాటు మరికొన్ని గ్రామాల్లోని కొండల్లో కూడా అక్రమ క్వారీ జరుగుతోంది. రైల్వే లైన్ కో సం, అపార్ట్మెంట్లు, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్ కోసం, లేఅవుట్లను చదును చేసేందుకు నల్లరాయి, ఎర్ర రాయి, గ్రావెల్ను విక్రయిస్తున్నారు. రోజూ వందలాది లారీలకు వక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్లు వేసే ముందు గ్రావెల్తో కప్పుతారు. దాని కోసం కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మొత్తానికి కీలక నేత అండతో రూ. కోట్లలో తమ్ముళ్లు ఆర్జిస్తున్నారు. విధ్వంసం జరుగుతున్నా.. అక్రమంగా నడుస్తున్న క్వారీల్లో ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమి ది మంది వరకు మృత్యువాత పట్టారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అంతేకాకుండా అక్రమ క్వారీ ల సమాచారాన్ని బయటపెట్టాలని చూసిన కొందరు లారీల కింద సమాధి అయ్యారు. అంత దారుణాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక, గ్రావెల్ రవాణా లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. క్వారీ తవ్వకాలతో గ్రామాలు కాలుష్యం బారిన ప డుతున్నాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునే నాథు డు లేకుండా పోయారు. దట్టమైన కొండలు కావడంతో అక్కడికి వెళ్తే మైనింగ్ మాఫియా చేతులో ఏమవుతామో అన్న భయం పట్టుకుంది. అధికారు లు సైతం అక్కడికి వెళ్లడానికి హడలెత్తిపోతున్నారు. అసలే నిర్మానుష్య ప్రదేశం, మరోవైపు కీలక నేత అండదండలు ఉండటంతో వెనక్కి తగ్గిపోతున్నారు. కొండలను తవ్వి ఆక్రమణ మండలంలోని కొండలను తవ్వి, ఆ తర్వాత చదు ను చేసి ఆక్రమించుకుంటున్న పరిస్థితులు ఉన్నా యి. వందలాది ఎకరాలు ఈ రకంగా అక్రమార్కుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడా భూ ములను చూపించి క్వారీలు, క్రషర్ల ఏర్పాటు కోసం అనుమతులకు యత్నిస్తున్నారు. ప్రస్తుతానికై తే ఆ దర ఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అనుమతులు రాకపోయినా తమ పని మాత్రం కానిచ్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. పొందూరు మండంలో ఎక్కడైతే కొండలు ఉన్నాయో అక్కడ పచ్చ గెద్దలు వాలిపోతున్నాయి. రూ. కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాయి. పొందూరు మండలంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీని అడ్డుకోవాలంటే చెక్ పోస్టు శరణ్యమని ఇక్కడ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు గతంలో నివేదిక ఇచ్చారు. అక్రమ క్వారీలు, తవ్వకాలు, రవాణాను తాము నియంత్రించలేమని, పరిస్థితి చేయి దాటిపోయిందని, రహదారి మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే కనీసం రవాణానైనా అడ్డుకుని తద్వారా అక్రమ తవ్వకాలు నిలువరించవచ్చని మండల అధికారులు తమ నివేదికలో వి వరించారు. కానీ ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయో తెలి యదు గానీ చెక్ పోస్టు ఏర్పాటు ఊసేలేదు. మండల అధికారులు ఇచ్చిన నివేదిక ముందుకెళ్లలేదు. చెప్పాలంటే తుంగలోకి తొక్కేసినట్టు స్పష్టమవుతోంది. పొందూరు మండలంలో తరిగిపోతున్న కొండలు అడ్డగోలుగా తవ్వకాలు ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ తవ్విన ప్రాంతాన్ని చదును చేసి గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం -
రాయగడలో బీజేపీ జెండా ఎగురవేయాలి
రాయగడ: రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు భవిష్యత్లో రాయగడ జిల్లాలో బీజేపీ జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ అన్నారు. రాజధాని భువనేశ్వర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కోడూరు నారాయణరావు నేతృత్వంలో రాయగడ జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మన్మోహన్ సామల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేలా కార్యకర్తలు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయ ఢంకా మోగించిందని గుర్తు చేశారు. రానున్న కాలంలో బీజేపీ ఇక తిరుగులేని పార్టీగా మారే అవకాశం ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్క కార్యకర్త నిస్వార్థంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. చేరికల్లో భాగంగా బీజేడీ సీనియర్ నాయకుడు కాశీనాయుడు, కె.శ్రీధర్ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, కాళీరాం మాఝి, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి వీడ్కోలు
భువనేశ్వర్: పేద, నిస్సహాయ, గిరిజన, అణగారిన ప్రజల సహచరుడైన విశ్రాంత పాస్టర్ సుమన్ రైకా 107 ఏళ్ల వయసులో కన్ను మూశారు. ఆయన మృతిపై హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి నివాళులర్పిస్తూ తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతు దివంగత సుమన్ రైకా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. గజపతి జిల్లాలోని కొండ, దుర్గమ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, రవాణా అభివృద్ధికి బలమైన వారధిగా కొనసాగారు. రెకా జీవితం చిట్ట చివరి దశ వరకు సాంఘిక సేవకు అంకితం అయ్యారు. ఈ మహనీయుని మరణం ఈ ప్రాంతంలో పూడ్చలేని లోటును సృష్టించిందని ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
ఉత్తర్వులు జారీ
సమగ్ర నగర గ్యాస్ పంపిణీ..భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా పైపుల ద్వారా వంట గ్యాసు సరఫరా వ్యవస్థ కార్యాచరణ వేగం పుంజుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా నగర గ్యాస్ పంపిణీ (సీజీడీ) విధానం, 2026ను గెజెట్ జారీ చేసింది. సహజ వాయువు (పీఎన్న్జీ) నెట్వర్క్, నగర గ్యాస్ పంపిణీ (సీజీడీ) మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్లో ప్రచురితమైన తేదీ నుంచే ఈ కార్యాచరణ అమల్లోకి వస్తుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, రవాణా రంగాలకు స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల ఇంధనంగా సహజ వాయువును ప్రోత్సహించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. నిర్ధారిత కాలపరిమితితో ఆమోదిత యంత్రాంగం ద్వారా పీఎన్జీ కనెక్షన్లు, సీఎన్జీ స్టేషన్లు, సంబంధిత మౌలిక సదుపాయాల అమలును వేగవంతం అవుతుంది. ఈ విధానం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లో పైపు లైను ద్వారా గ్యాసు పంపిణీ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సీజీడీ సంస్థలకు అధికారం కల్పించింది. నిర్ధారిత కాల పరిమితి కింద సుమారు 9 లక్షల పీఎన్జీ గృహ కనెక్షన్లు మరియు 271 సీఎన్న్జీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీని వ్యయ అంచనా దాదాపు రూ.5,100 కోట్లు. గృహ, పట్టణాభివృద్ధి శాఖను నోడల్ శాఖగా ఈ విధానం అమలు కార్యకలాపాలు పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు సీజీడీ ప్రాజెక్టుల ఏర్పాటు, కార్యాచరణకు సరళీకృత వ్యవస్థలో వేగవంతమైన అనుమతులు మంజూరు కోసం ప్రామాణిక అనుమతి రుసుములు, జీఐఎస్ ఆధారిత భూగర్భ యుటిలిటీ మ్యాపింగ్, సీఎన్జీ స్టేషన్లు, సిటీ గేట్ స్టేషన్లకు భూమి ప్రాధాన్యతా కేటాయింపు, భవన ప్రణాళికలు, పట్టణ మాస్టర్ ప్లాన్లలో పీఎన్జీ పైప్లైన్ నిబంధనలను చేర్చడం వంటి శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ కార్యకలాపాలు చేపడతాయి. 2027 మార్చి 31 వరకు పైప్లైన్ వేయడానికి అనుమతి, పర్యవేక్షణ రుసుములను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ విధానం భద్రతా ప్రమాణాలు, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలు, నిత్యావసర సేవలుగా పీఎన్జీ/సీఎన్జీ నిరంతరాయ సరఫరా, స్థానిక సంస్థల సహకారంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ఈ విధానం రాష్ట్రంలో స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేసి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో కాలుష్యాన్ని నివారణకు దోహదపడుతంది. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన ఉపాధి, పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
హజ్ యాత్రకు అన్నాచెల్లెలు
రాయగడ: ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్కు రాయగడ నుంచి అన్నాచెల్లెలు బయల్దేరారు. వృద్ధులైన ఆలీ హైదర్, సర్వరీ బాను అనే వీరిద్దరు గురువారం హజ్ ప్రయాణించేందుకు స్థానిక రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వీరి ని సాగనంపేందుకు ముస్లింలు, వారి బంధు వులు పెద్ద సంఖ్యలో వెళ్లి వీడ్కోలు చెప్పారు. గత మూడుసార్లు ఈ యాత్రను చేసి వచ్చామని భాను, ఆలీలు తెలిపారు. నకిలీ పోలీసు అధికారి అరెస్టు భువనేశ్వర్: పోలీసుగా నమ్మిస్తూ చలామణి అవుతున్న బూటకపు పోలీసు అధికారిని గురువారం అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా స్థానిక ఎయిర్ఫీల్డ్ ఠాణా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించిన మేరకు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు భువనేశ్వర్లో ఉంటున్న అభిషేక్ మిశ్రాగా గుర్తించారు. బూటకపు పోలీసు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకుని ఎయిర్ ఫీల్డు ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నబరంగ్పూర్లో బంకులు మూసివేత కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూసి వేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో 6 బంకుల్లో ఇంధన నిల్వలు అడుగంటాయి. దాంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు బంకులు మాత్రం నడుస్తున్నాయి. అవి కూడా ద్విచక్ర వాహనానికి రు.100, ఆటోకి రూ.200, కార్లకి రూ.400, పెద్ద వాహనాలకు రూ.1000 ఇంధనం మాత్రమే ఇస్తున్నాయి. ఈ కొరత పల్లెలపై కూడా పడింది. పట్టణాల్లో ఇంధనం దొరక్కపోవడంతో వాహనదారులు పల్లెల్లో ఉన్న బంకుల వైపు తరలివెళ్లారు. జయపురం: గుణాత్మక విద్యను అందించాలని జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతి హృశికేష్ సనాపతి అన్నారు.విశ్వవిద్యాలయ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. విశ్వవి ద్యాలయ సభాగృహంలో నిర్వహించిన సమావేశానికి కులపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యావిధాన రూపురేఖలు, ఇంటర్నర్షిప్, క్లా సుల నిర్వహణ, అధ్యాపకుల టైమ్ టేబుల్, విద్యా ర్థులు క్లాసులలో పాల్గొనే వ్యవస్థ, ప్రాక్టికల్ సిస్టం, పేరేంట్స్–అధ్యాపకుల సమావేశం, ఇంటర్నల్ మూల్యాంకనం, విద్యార్థుల ప్రవర్తన, లెసన్ ప్లాన్ తదితర విషయాలపై కౌన్సిల్ సమావేశం చర్చించింది. కులపతి మాట్లాడుతూ.. విద్యా బోధనలో అధ్యాపకులు సమన్వయనంతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో పి.జి.కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంతకుమార్ పాత్రో, రంజన్కుమార్ ప్రధాన్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. విక్రమదేవ్ +2 కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ లక్ష్మణ పాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
గుంపు దాడిలో యువకుడి దుర్మరణం
భువనేశ్వర్: రాజధాని నగరం శివార్లు బలియంత పోలీస్ ఠాణా పరిధిలోని భింగరపూర్ ప్రాంతంలో స్థానికుల గుంపు దాడిలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఊగిసలాడుతున్నాడు. ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో స్థానికులు ఈ మారణాంతక దాడికి పాల్పడ్డారు. బలియంత పోలీసు ఠాణా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోటార్ సైకిల్పై వస్తున్న ఇద్దరు యువకులు ఆ మార్గంలో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ రచ్చ మొదలైంది. ఈ ప్రమాదం అనంతరం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆ యువకులు తమపై లైంగిక దాడికి ప్రయత్నించారని సహాయం కోసం ఆ మహిళలు గగ్గోలు చేయడంతో పరిస్థితి ఉద్ధృతమైంది. కేకలు విని ఆ ప్రాంత నివాసులు సంఘటనా స్థలానికి గుంపుగా దూసుకొచ్చి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి చేతులు, కాళ్లు కట్టి, వెదురు కరల్రతో దారుణంగా కొట్టారు. గాయపడిన ఇద్దరు యువకులను తీవ్రమైన పరిస్థితిలో స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన అదాస్పూర్ ప్రాంతానికి చెందిన సౌమ్య రంజన్ స్వంయి మరణించాడు. అతడు ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) సిబ్బంది అని సమాచారం. గ్రామస్తుల దాడిలో గాయ పడిన మరో యువకుడు ఓంప్రకాష్ రౌత్ పరిస్థితి విష మంగా ఉంది. ఆయన ప్రాణాపాయ పరిస్థితిలో ఊగిసలాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఓం ప్రకాష్ రౌత్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా పట్టపగలు నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఒక గుంపు ఎలా చంపగలదని మృతుని బంధువులు నిలదీస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మృతుడి కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య ఘర్షణ ఉగ్ర రూపం దాల్చుతుంది. బలియంత ఠాణా పోలీసులు 4 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బలియంత పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి (ఐఐసీ) తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న వారి మధ్య ఎలాంటి పూర్వ వైరం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలలేదని స్పష్టం చేశారు. ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, యువకులు తమ మోటార్సైకిల్తో వారిని ఢీకొట్టడానికి ప్రయత్నించి, వారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ మహిళలు 112 అత్యవసర హెల్ప్లైన్కు ఫోన్ చేసి స్థానికులను అప్రమత్తం చేశారని ఠాణా అధికారి తెలిపారు. -
సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి
రాయగడ: రైల్వే ప్రయాణికులు తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలంటే తగిన భద్రత, నియ మ, నిబంధనలు పాటించాలని ఆర్పీఎఫ్ పోలీసు లు అన్నారు. ఈ మేరకు రాయగడలోని రైల్వే ఫ్లాట్ పారం వద్ద ప్రయాణికులకు గురువారం అవగాహ న కల్పించారు. రైలులో ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రైలు ఎక్కేటప్పుడు, దిగే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. టికెట్టు లేని ప్రయాణం నేరమన్నారు. అపరిచితులు ఇచ్చే ఆహారాలు తీసుకోవద్దని, వారికి తమ వెంట తీసుకువచ్చే సామగ్రీని అప్పగించి ఎక్కడికీ వెళ్లకూడదన్నారు. ఫ్లాట్ ఫారంలో రైలు గురించి వేచి ఉండే ప్రయాణికులు రైలు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలన్నారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ బి.కె.బాల్, కానిస్టేబుల్ కేకే రావు,హెడ్ కానిస్టేబు ల్ దాస్, మహిళా కానిస్టేబుల్ ఎ.లక్ష్మి పాల్గొన్నారు. -
● అలా.. ఉమ్లింగ్లా వరకు
● ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించిన కిశోర్ ● జిల్లా నుంచి బైక్పై సాహస యాత్ర చేసిన యువకుడు రణస్థలం: రణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ సాహస యాత్ర చేశాడు. ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వాహనాలు తిరగగలిగే ప్రదేశం. లఢక్ ప్రాంతంలో ఉంటుంది. ఏప్రిల్ 18న కిశోర్ ఈ సాహస యాత్ర మొదలుపెట్టాడు. ఈ నెల 5వ తేదీన అక్కడకు క్షేమంగా చేరుకున్నాడు. లఢక్ ప్రాంతం నుంచి ఉమ్ లింగ్ లా చేరుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నీ తట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాడు. జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా అంతదూరం సాహసయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచాడు. కిశోర్ తల్లిదండ్రు లు పతివాడ కమల, పతివాడ నర్సింహమూర్తి వ్యవసాయ కూలీలు. కిశోర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొండములగాం గ్రామానికి చెందిన మేనమామ లారీతో డ్రైవింగ్ వెళుతుంటానని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు సాహసయాత్రలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు. ఉమ్లింగ్ లా ఎందుకంత ప్రత్యేకం..? ఉమ్లింగ్ లా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మోటర్బుల్ రోడ్డుగా ప్రపంచ ఖ్యాతి గడించింది. 19,024 అడుగులు అంటే 5798 మీటర్ల ఎత్తులో అత్యంత ప్రమాదక బైక్ రైడింగ్ ప్రాంతమిది. ఎంతోమంది సాహస బైక్ రైడర్లు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన గడ్డకట్టే చలి, వాతావారణం అనుకూలించక సగంలోనే తిరుగు బాట పడుతుంటారు. పదిహేడు రోజుల్లోనే ఈ సాహస యాత్ర పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని కిశోర్ చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు ఈ సాహస యాత్ర చేసినందుకు గుర్తింపు పత్రం అందజేశారు. -
జెమ్స్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం
శ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్–హెచ్ ఆస్పత్రి వైద్య కళాశాల నుంచి ఇకపై అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందిస్తామని జెమ్స్–హెచ్ చీఫ్ పేట్రన్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. తమ కళాశాలకు దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్గా గుర్తింపు రావడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి జనరల్ సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు, రోగుల సంరక్షణపై శిక్షణ ఇచ్చే సీసీఆర్ఎల్ఎస్పీ ప్రొవైడర్ కోర్సును జెమ్స్ హెచ్ ఆస్పత్రిలోనే నెలకొల్పినట్లు వివరించారు. ప్రధానంగా సర్జికల్ విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, అధ్యాపక బృందం, నాణ్యత ప్రమాణాలు, శిక్షణా విధానాలపై జరిగిన సమీక్షలో జెమ్స్ ఆస్పత్రికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ మాట్లాడుతూ సర్జరీ విద్యా ప్రమాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ గుర్తింపు ఇచ్చిందన్నారు. సీసీఆర్ఎల్ఎస్సీ కోర్సు డైరెక్టర్ జీఐ సర్జన్ డాక్టర్ ఎం.బి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఈ కోర్సును మే 7, 8 తేదీల్లో 16 మంది శస్త్ర చికిత్స శిక్షణార్థులకు అనస్తీషీ యా విభాగాలకు చెందిన నిపుణుల బృందం శిక్షణ అందిస్తోందన్నారు. సామర్థ్యాలను పెంపొందించేలా కోర్సు అందిస్తున్నట్లు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మల్కన్గిరి: జిల్లాలోని పంగం గ్రామం వద్ద బుధవారం రాత్రి గోవిందపల్లి నుంచి మల్కన్గిరికి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి పొలాల్లో పడిపోయి సంతోష్ కిర్సనీ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సంతోష్ తెలిసినవారిని గోవిందపల్లిలో దించడం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాద జరిగింది. చాలా సమయం తర్వాత అటుగా వచ్చిన గ్రామస్తులు చూసి వెంటనే గ్రామంలో వారికి తెలియజేశారు. మల్కన్గిరికి చెందిన యువకుడిగా గుర్తించి తండ్రి అర్జున్ కీర్సనీకు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసు శాఖలో విధుల్లో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతదేహన్ని మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంతోష్ మృతితో మల్కన్గిరిలో విషదచాయలు అలుముకున్నాయి. -
సర్వేలో సరిహద్దు సమస్య
పర్లాకిమిడి: గంగాబడ పంచాయతీలో మాణిక్పట్నా, గుడిఖుడి గ్రామాల్లో ఒడిశా రాష్ట్ర జనగణన అధికారులు ఇళ్ల లెక్కింపు సర్వే కార్యక్రమంలో ప్రతి ఇంటిపై రాసిన నంబర్లను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం రెవెన్యూ అధికారులు చెరిపివేయడంతో ఈ ప్రాంతంలో మరోసారి సరిహద్దు సమస్య తలెత్తింది. గజపతి జిల్లా రాయగడ బ్లాక్ గంగాబడ పంచాయతీ సర్పంచు హరిబంధు కార్జి సబ్ కలెక్టర్ అనుప్ పండాకు ఫిర్యాదుచేశారు. దీంతో సబ్ కలెక్టర్ అనుప్ పండా రాయగడ తహసీల్దార్తో పాటు పోలీసు అధికారులను గురువారం వెంటబెట్టుకుని గంగాబడ పంచాయతీలో మాణిక్పట్నా, గుడిఖుడి గ్రామాలను సందర్శించారు. ఒడిశా రాష్ట్ర జనగణన అధికారులు ఇళ్ల లెక్కింపు సర్వేలో ప్రతిఇంటికి మార్కింగ్ చేసిన సంఖ్యలను శ్రీకాకుళం జిల్లా మందస మండలం రెవెన్యూ అధికారులు చెరిపి వేసి వారి సర్వే నంబర్లు వేయడంపై సరిహద్దు సమస్య తలెత్తింది.ఒడిశా ప్రభుత్వం వెనుకబడిన గంగాబడ పంచాయతీలో పలు గ్రామాలకు బిజూ పక్కాఇళ్ల పథకాన్ని 2018లో వర్తింపచేశారు. ఈ సర్వే సమస్యపై ఒడిశా సబ్ కలెక్టర్ అనుప్ పండా స్పందించి ఒడిషా భూభాగంలో ఉన్న గంగాబడ పంచాయతీని మందస మండల అధికారులు తమదని వాదించడం అసందర్భంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారుల వద్ద గంగాబడ పంచాయితీ ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు గతంలో నిర్ధారించలేకపోయారని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు వహించి అందజేయాల్సిందిగా సబ్ కలెక్టర్ పండా రాయఘడ తహసీల్దార్కు ఆదేశించారు. -
11న జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవ అద్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, ఉపాధ్యక్షుడు వై.సూర్యారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.కాంతారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఎంపికల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక్కడ రాణించి ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 24వ తేదీన కర్నూలులో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన స్వి మ్మింగ్ క్రీడాకారులు తమ పేర్లను ఈనెల 9వ తేదీలోగా డీఎస్ఏ కోచ్ మురళీ (సెల్: 99088 31849)ని సంప్రదించాలని వారు కోరారు. ‘ఒడిశా అధికారుల నుంచి రక్షించండి’ మందస: మాణిక్యపట్నం గిరిజనులపై ఒడిశా అధికారులు, పోలీసుల దౌర్జన్యాలు ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు విన్నవించారు. జనగణనలో భాగంగా సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో ఉంటున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. రక్షించాలని తహసీల్దార్ మిస్క శ్రీకాంత్, ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, ఎంపీడీఓ వై.వెంకటరమణలకు వినతి పత్రం అందజేశారు. సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ సచివాలయం సిబ్బంది జనగణన చేసి ఇంటి గోడలపై నంబర్లు వేశారు. అనంతరం ఒడిశా అధికారులు, పోలీసులు వచ్చి ఆ నంబర్లను చెరిపివేశారు. ఇళ్లలో ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. తాము చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నామని గిరిజనులు ఆవేద న వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి సవర గురునాథ్, రైతుల సంఘం కార్యదర్శి పి.దేవేంద్ర, మట్ట ధర్మారావు, ఎన్.భాస్కరరావు, ఎస్.విప్రో, ఎస్.మధుసూదన్, ఎస్.సుదన్ పాల్గొన్నారు. సారవకోట: మండలంలోని కిడిమి సచివాల య కిటికీ అద్దాలను నాలుగు రోజుల కిందట ఆకతాయిలు పగలగొట్టారు. సచివాలయ సిబ్బంది తమ విధులు ముగించుకుని ఇంటికెళ్లిన తర్వాత రాళ్లతో కొట్టడంతో అద్దాలు పగిలి పోయాయని వీఆర్వో రాము తెలిపారు. అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. ఆమదాలవలస: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసా య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవే శాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తొగ రాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిప ల్ సీపాన నీలవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు. దరఖాస్తులు ఆచార్య ఎనన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.angrau.ac.in ద్వారా సమర్పించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7702394824 నంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. -
క్షతగాత్రులపై ఎమ్మెల్యే ఔదార్యం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీ సింగుపురం గ్రామం సమీపంలో ఒక రోడ్డు దుర్ఘటనలో పడి ఉన్న క్షతగాత్రునికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి తన కారును ఆపి సాయం చేశారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ ఖండవ గ్రామానికి ఒక ప్రారంభోత్సవానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వెళుతుండగా ఈ సంఘటన గురువారం జరిగింది. సింగిపురం గ్రామ సమీపంలో స్టేట్ హైవే వద్ద ఒక మోటారు సైకిల్ పర్లాకిమిడి నుండి వస్తున్న కారును ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉండటం చూసి తాగునీటిని అందజేశారు. అలాగే వెంటనే అంబులెన్స్ 108కి ఫోన్ చేసి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. కె.సీతాపురం పంచాయతీ సర్పంచ్ తేజేశ్వరరావు కూడా క్షతగాత్రునికి సహకారం అందజేశారు. -
యువకుడి దారుణ హత్య
● నిందితుడు అరెస్టు రాయగడ: ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలుముండ గ్రామంలో బుధవారం తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన 12 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఝార్సుగుడ జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి లాలుముండ గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్ భొయ్ (25)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన నిందితుడు అదే గ్రామానికి చెందిన నీలమణి భొయ్గా గుర్తించారు. బుధవారం రాత్రి ప్రదీప్ కుమార్ భొయ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో నీలమణి భొయ్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. తెల్లవారి లేచి చూసేసరికి ప్రదీప్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని సోదరుడు ఉత్తమ కుమార్ భొయ్ గమనించి లఖన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అనంతరం ఎస్పీ రాఘవేంద్ర, ఎస్డీపీఓ, లఖన్పూర్ ఐఐసీ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన నీలమణి భొయ్ను అరెస్టు చేశారు. అతని నుంచి హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఉత్తమ్ కుమార్ భొయ్ను హత్య చేయాలనే క్రమంలోనే వరండాలో నిద్రిస్తున్న నీలమణి భొయ్ను పొరపాటున ప్రదీప్ భొయ్గా భావించి హత్య చేసినట్లుగా నిందితుడు నీలమణి భొయ్ పోలీసుల సమక్షంలో అంగీకరించినట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం సాయంత్రం 6 గంటలకు నిందితుడుని అరెస్టు చేశామన్నారు. -
దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాలల నుంచి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2026’ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక విభాగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన బాలలు ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. 5 ఏళ్లు పైబడి, 31 జూలై 2026 నాటికి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలలు వ్యక్తిగతంగా లేదా ఏదైనా సంస్థ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వివరించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పత్రికా క్లిప్పింగ్స్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేయడానికి జూలై 31 తేదీ వరకు గడువు ఉందని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతిభావంతులైన బాలలు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కుక్కకాటుతో ఆటోడ్రైవర్ మృత్యువాత..? శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక ఆటో డ్రైవర్ బుధవారం మృత్యువాత పడ్డాడు. భామిని మండలం గొరండికి చెందిన నిమ్మల ప్రసాద్ (30) కొంతకాలం క్రితం కుక్కకాటు వేయడంతోనే అనారోగ్యం పాలయ్యాడని, అందుచేతనే చనిపోయివుంటాడని భావిస్తున్నట్లు మృతుని కుటుంబీకులు తెలిపారు. అయితే ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా తమ దృష్టికొచ్చిందని, ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు. -
పక్క రాష్ట్రానికి పరుగు..!
● మనకంటే ఒడిశాలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ● అక్కడికే వెళ్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు ● వెలవెలబోతున్న బంకులు ధర తక్కువే.. ఆంధ్రాలో కంటే ఒడిశాలోని పర్లాకిమిడిలో పెట్రోల్ ధర తక్కువ. లీటర్ పెట్రోల్కు రూ.7లు తక్కువగా ఉంటుంది. అందుకే పర్లాకిమిడి వెళ్లినప్పుడు పెట్రోల్ వేయిస్తాను. ఇక్కడి ధర, నాణ్యతతో పోల్చితే ఆర్థికంగా మిగిలే ఉంటుంది. – బొంగు శ్రీరాములు, ఆర్.ఎల్.పురం, పాతపట్నం నాణ్యత బాగుంటుంది ఒడిశాలో పెట్రోల్ బంక్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. కల్తీ లేని పెట్రోల్ విక్రయిస్తారని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. ఆంధ్రా కంటే ఒడిశాలో తీసుకున్న పెట్రోల్ నాణ్యత బాగుంటుంది. వాహనాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని మోకానిక్లు చెబుతున్నారు. అందుకే ఒడిశా వెళ్లి పెట్రోల్ వేయించుకుంటాం. ఎన్ని లీటర్ల పెట్రోల్ పోయిమన్నా పోస్తున్నారు. – గణపతి మధుబాబు, కాగువాడ, పాతపట్నం సమాధానం చెప్పాలి ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరలపై చంద్రబాబు, లోకేష్లు హడావుడి చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయో సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మన రాష్ట్రంలో కొరత లేకుండా చూడడంతో పాటు ధరల తగ్గించాలి. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం పాతపట్నం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ మాటనే మరిచారు. యువగళం పాదయాత్ర సమయంలో పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని, కేవలం మన రాష్ట్రంలోనే ఎక్కువని విమర్శించిన మంత్రి లోకేష్.. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ధరలపై కనీసం నోరు మెదపడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉంది. కొత్తూరు, మెళియాపుట్టి మండలాలు సైతం సరిహద్దులో ఉన్నాయి. అలాగే పది, పదిహేను కిలోమీటర్ల దూరంలోనే హిరమండలం ఉంది. అయితే ఒడిశా రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ధరలు లభిస్తుండడంతో ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు అక్కడికే వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. పెట్రోల్లో లీటర్కు రూ.7లు, డీజిల్లో లీటర్కు రూ.3లు ఆ రాష్ట్రానికి మనకు తేడా ఉండడం గమనార్హం. దీంతో ఇక్కడి వాహనదారులు నిత్యం పర్లాకిమిడి పట్టణంలోని పెట్రోల్ బంక్లను ఆశ్రయించి, వాహనంలోకి పెట్రోల్ నింపుకుంటున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు చెందిన వేలాది మంది వినియోగదారులు అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు నిత్యం ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి పట్టణానికి వెళ్తుంటారు. దీంతో ఒడిశాలో తక్కువ ధరకు దొరుకుతున్న డీజిల్, పెట్రోల్కు గిరాకీ ఏర్పడుతోంది. తరచూ ఒడిశాకి వెళ్లలేని కొందరు వాహనదారులు పది లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకుని వచ్చి ఇంటి వద్ద నిల్వ ఉంచుకుంటారు. డీజిల్ కంటే పెట్రోల్ కోసం వెళ్లే వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. అయితే పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా ఇంధనం ఆంధ్రాలో ఒడిశాలో తేడా పెట్రోల్ రూ.109.96లు రూ.102.62లు రూ.7.34లు డీజిల్ రూ.97.73లు రూ.94.19లు రూ.3.54లు రోజుకు వినియోగం(లీటర్లులో..) మండలం పెట్రోల్ పెట్రోల్ డిజిల్ పాతపట్నం 2 3,000 3,800 మెళియాపుట్టి 2 2,500 1,800 కొత్తూరు 4 3,100 3,900 హిరమండలం 3 2,500 2,900 ఎల్.ఎన్.పేట 2 1,400 1,900 -
పారా లీగల్ వాలంటీర్లు వారధిలా పనిచేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, వారికి న్యాయ సహాయం అందేలా చేయడంలో పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్వీ) వారధిలా పనిచేయాలని మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్లో మూడు రోజుల పాటు జరిగిన పీఎల్వీల అడ్వాన్సడ్ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా మోటారు వాహనాల చట్టం, విద్యా హక్కు, పోక్సో, పర్యావరణ సమస్యలతో పాటు కార్మికులు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితుల హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. విపత్తుల సమయంలో న్యాయ సేవా సంస్థల ద్వారా బాధితులకు అందే సేవల గురించి వివరించారు. ఈ చట్టాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాలంటీర్లను కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ఎంవీఐ గంగాధర్, ప్యానల్ న్యాయవాది అన్నేపు భువనేశ్వరరావు, ఇన్స్పెక్టర్ నారాయణి, విద్యా ఫౌండేషన్ ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సామూహిక ఉపనయనాలు
రాయగడ : స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్ కల్యాణ వేంకటేశ్వర కల్యాణ మండపంలో బుధవారం సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కింతలి అమర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 180 మంది యువకులు పాల్గొన్నారు. వీరందరికీ ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ముందుగా కళింగ వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకాపరమేశ్వరి చిత్రపటంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉపనయనాలు అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి టంకాల జయరాం, ఉపాధ్యక్షుడు ఈశ్వర గోపాల్ శెఠి, కోశాధికారి వడ్డి మురళి, సహకార్యదర్శి చిన్నారి విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బెల్ట్ దుకాణాల నిర్వాహకులపై బైండోవర్
పాతపట్నం: మద్యం బెల్టు దుకాణాల నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం పాతపట్నం మండలంలోని పాతపట్నం, ప్రహరాజపాలెం, దోమదల, జగ్గిలిబొంతు గ్రామాలకు చెందిన ఐదుగురు బెల్టుషాపు నిర్వాహకులను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి, తహసీల్దార్ ఎన్.ప్రసాదరావుతో బైండోవర్ నమోదు చేశారు. ప్రజారోగ్యానికి హానిచేసే నాటుసారా అమ్మకాలు చేయడం గానీ, బెల్టు దుకాణాలను నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఏడాది పాటు బైండోవర్ ఉంటున్న నేపథ్యంలో మరలా బెల్టు షాపులు నిర్వహంచినా, నాటుసారా అమ్మకం చేస్తున్నట్లు తెలిసినా రూ.2 లక్షలు జరిమానా వేస్తామని సీఐ కృష్ణారావు హెచ్చరించారు. ఎకై ్సస్ కానిస్టేబుల్స్ శివకుమార్, కల్పన పాల్గొన్నారు. -
పనస కాయంత కష్టం..!
ఉద్దాన రైతుల జీవనాధారమైన పంటల్లో ఒకటైన పనస పంటకు ప్రస్తుతం ధర లేకపోవడంతో పంట రోడ్డు పాలవుతోంది. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎంతో ఆదరణ ఉన్న ఈ పంట సీజన్ ప్రారంభంలో కేజీ ధర అత్యధికంగా రూ.25లు పలికింది. తర్వాత కాయ సైజు ఆధారంగా కేజీ రూ.15ల నుంచి రూ.16లకు వ్యాపారులు కొనుగోలు చేశారని రైతులు తెలిపారు. అయితే ప్రస్తుతం పసన కాయలకు గిరాకీ పూర్తిగా తగ్గడంతో పాటు వర్షాలు కురవడంతో కాయ నాణ్యత తగ్గిందని వ్యాపారులు కొనని పరిస్థితి నెలకొంది. దీంతో చెట్టు మీద కాయలను తొలగించిన రైతులు, వాటిని అమ్మలేక పలు ప్రాంతాల్లో రోడ్డుపైనే పడేస్తున్నారు. బెండి గేటు, బెండి, సీతాపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు గ్రామాల రోడ్లపై కాయలు పడివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు కాయలను మోసుకెళ్తున్నారు. ఈ ఏడాది పనస ధర దారుణంగా పతనం కావడంతో నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. – వజ్రపుకొత్తూరు రూరల్ -
రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్రగాయాలు
కంచిలి: మండల కేంద్రం సోంపేట రైల్వేస్టేషన్లో రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగులూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ సోంపేట రైల్వేస్టేషన్లో ఆగింది. ఒడిశా రాష్ట్రం అంకుల చండిపడ గ్రామానికి చెందిన ప్రభంజన్ నాయక్ అనే ప్రయాణికుడు సోంపేటలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరవ్వడానికి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వచ్చాడు. దిగేటప్పుడు తన బ్యాగు జారిపడి ఆగి ఉన్న రైలు పట్టాల కిందకు చేరింది. దీంతో ఆ బ్యాగ్ తియ్యబోయి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. -
కేసీసీ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
జయపురం: రైతులకు వ్యవసాయ రుణాలు ఇవాల్సిన రూ.కోటి 8 లక్షల 75 వేలను స్వాహా చేసిన కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్) బ్రాంచ్ మేనేజర్ను కొరాపుట్ ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. అరెస్టు చేసిన వ్యక్తి కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ జయపురం పరిధిలో గల మల్కనగిరి కేసీసీ బ్యాంక్ మేనేజర్ సుధాంశు ఖొర. ఈయన మల్కనగిరి జిల్లాలో గల 5 లేంపుల రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ రుణాల మొత్తం రూ.86 లక్షల 80 వేలు, 90 మంది రైతులకు ఇచ్చిన రుణాలు రూ. 21 లక్షల 95 వేలు కలిపి రూ.కోటి 8 లక్షల 75 వేలు స్వాహా చేసినట్లు ఆరోపణ. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ సొమ్మును బంధువులు, తెలిసిన వారి ఖాతాలకు బదిలీ చేశారనే ఆరోపణ. లేంపుల పరిచాలన కమిటీల డైరెక్టర్లు మల్కనగిరి కేసీసీ బ్యాంక్ మేనేజర్ ఖొర డబ్బు స్వాహా చేశారని జయపురంలో గల కేసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం జయపురం విజిలెన్స్ విభాగానికి అప్పగించారు. దర్యాప్తు జరిపేందుకు విజిలెన్స్ డీఎస్పీ సదానంద పాణి, అజయ పాణితోపాటు ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. దర్యాప్తు జరిపిన విజిలెన్స్ టీమ్ మల్కనగిరి కేసీసీ బ్యాంక్ మేనేజర్ సుదాంశు ఖొర.. రైతులకు చెందాల్సిన నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించింది. టీమ్ నివేదికపై సుధాంశు ఖొరపై రెండు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జయపురం విజిలెన్స్ ఎస్పీ రవీంద్ర కుమార్ పండా తెలియజేశారు. -
● విషాదం
భువనేశ్వర్: స్థానిక లక్ష్మీసాగర్ బర్గడ్ కెనాల్ రోడ్ ప్రాంతం బసంత్ విల్లా అపార్ట్మెంట్లో బుధవారం వేకువ జామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు ఘటనా స్థలంలో తుది శ్వాస విడిచారు. మరో బాలిక తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ కటక్ వైద్య బోధన ఆస్పత్రిలో మృతిచెందింది. ఘటనా స్థలంలో మృతి చెందిన వారిలో ఒకరు కేర్టేకర్ సులభ్ బెహరా, మరొకరు సెక్యూరిటీ గార్డు బిశ్వజిత్ బెహరాగా గుర్తించారు. సెక్యురిటీ గార్డ్ రూమ్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో చిక్కుకున్న 27 మందిని అగ్నిమాపక దళం సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో బైక్లు, కార్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు మృతదేహాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన ఈశ్వరాంబ వారోత్సవాలు
శ్రీకాకుళం కల్చరల్: భగవాన్ సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా బాలవికాస్ పిల్లలు, గురువులతో జిల్లాలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ఆధ్వర్యంలో పీఎన్ కాలనీలోని సత్యసాయి భజన మందిరం ఆధ్వర్యంలో బాలవికాస్ చిన్నారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పూర్తి చేసినట్లు తెలియజేశారు. సోంపేట, పలాస, పాతపట్నం, హిరమండలం, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మొత్తం తొమ్మిది జోన్లలో బాలవికాస్ చిన్నారులతో వివిధ సేవా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా పదాధికారులు పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి, శశికాంత్, లాడి చంద్రశేఖర్, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సదరు సమితి పరిధిలోని కొత్తపేట వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో జేకేపూర్ ప్రాంతానికి చెందిన మేకానిక్ రమేష్ (42) ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న రమేష్ను జిల్లా కేంద్రాస్పత్రికి ఆంబులెన్స్లో తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి స్కూటీపై జేకేపూర్కు వెళుతున్న సమయంలో కొత్తపేట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో అతనిని అదుపుతప్పి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కిందపడిపొయిన రమేష్ తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోయాడు. విశ్రాంత టీచర్కు రెండేళ్ల జైలుశిక్ష జయపురం: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుట్టుమిషన్ ఉపాధ్యాయుడికి జయపురం స్వతంత్ర విజిలెన్స్ కోర్టు మంగళవారం శిక్ష విధించింది. విజిలెన్స్ కోర్టు జడ్జి మానసకుమార్ పండా కేసు విచారించారు. రాయగడ జిల్లా ఆదివాసీ డెవలప్మెంట్, సమాజ కళ్యాణ విభాగ ఉన్నత పాఠశాల విశ్రాంత టైలరింగ్ ఉపాధ్యాయుడు రాజేంద్రపాత్రోను దోషిగా నిర్ణయించి రెండేళ్ల జైలు శిక్ష రూ.50 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో 4 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. 2023లో రాజేంద్ర పాత్రో ఆస్తులపై విజిలెన్స్ విభాగం దాడులు జరిపింది. అవినీతి నిరోధక చట్టం పరిధిలో పలు కేసులు పెట్టారు. కేసుల దర్యాప్తు అధికారి తాత్కాలిక విజిలెన్స్ డీఎస్పీ రంజన్కుమార్ దాస్ దర్యాప్తు జరిపారు. 2026లో జయపురం స్వతంత్ర విజిలెన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశిభూషణ పట్నాయిక్, ఉదిత్ భట్టాచార్యలు కేసు వాదించారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ముప్పుతిప్పలు పెట్టారని, రబీలో సైతం అదే పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. రబీ సీజన్లో మొక్కజొన్న పంటలతో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేయలేదన్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేని అచ్చెన్నాయుడు ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించడంతో రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ముందస్తు ప్రణాళిక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సాగునీటి కాలువల మరమ్మతుల విషయంలో సమీక్షలు నిర్వహించకుండా, కేవలం వర్షాలు పడే సమయానికి తూతూమంత్రంగా పనులు చేసి కోట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఖరీఫ్లో రైతులు పడిన ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు ఎందుకు రూపకల్పన చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అసమర్ధత ప్రభుత్వానికి రైతులు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయం
రాయగడ: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేవిధంగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశం హాల్లో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రసంగించారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులు ఆయా దిశగా కృషి చేయడంతో పాటు వారి పరిధుల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా గత ఏడాది పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, రవాణ, తాగు,సాగునీరు వంటి సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా అంతా కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో డ్రాపవుట్ సంఖ్య నివారణ కోసం ప్రజాప్రతినిధులు మరింత చొరవ తీసుకుని నివారణ కోసం ప్రయత్నించాలని సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మధ్యలో బడికి వెళ్లకుండా ఆగిపొయిన విద్యార్తులను గుర్తించి తిరిగి పాఠశాలలకు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమితి విద్యాశాఖ అధికారి ఛబీలాల్ సింహ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అదే తరహా ప్రయత్నంలో ఉన్నామని వివరించారు. వేసవి సెలవుల కారణంగా విద్యార్థులకు అన్లైన ద్వారా పాఠాలు చెప్పే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి పంచాయతీ పరిధిల్లో మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అలాంటి గ్రామాలను గుర్తించి తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచాలని సర్పంచులు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలాఉండగా సమితి పరిధిలో మంజూరు చేస్తున్న మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందివ్వడం లేదని దీనిపై దృష్టి సారించాలని కుంభికొట సమితి సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు హరప్రసాద్ హెప్రుక, ఏబీడీవో కాలుచరణ్ నాయక్, ఎంపీ ప్రతినిధి భూషణ్ బిడిక, ఎంఎల్ఏ ప్రతినిధి సత్యవాన్ మండంగి, జిల్లా పరిషత్ సభ్యురాలు పద్మవతి మండంగి పాల్గొన్నారు. -
బాలుడి తల
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026బండరాళ్ల మధ్య ..భువనేశ్వర్ : నయాగఢ్ జిల్లా కణిపొడా అడవిలో రాతిబండల సందులో ఓ బాలుడి తల ఇరుక్కుపోయింది. బుధవారం తేనె సేకరిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కణిపొడా గ్రామానికి చెందిన బాలుడు శిబా ప్రధాన్ పెద్ద నాన్నతో కలిసి తేనె సేకరించడానికి అడవికి వెళ్లాడు. బండ రాతుల సందులో తేనె తుట్టెను గుర్తించి సేకరించేందుకు ప్రయత్నించగా బాలుడి తల ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న పెద్ద నాన్న కాపాడటానికి శాయశక్తులా చేసిన ప్రయత్నాలు నీరుగారి పోయాయి. పరిస్థితి చేయి దాటినట్లు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు పరిస్థితి తెలియజేశాడు. గ్రామస్తుల ఉమ్మడి ప్రయత్నాలు ఫలించకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. బాలుడిని రక్షించేందుకు ఒడొగాంవ్, నయాగఢ్ నుంచి 2 యూనిట్ల అగ్ని మాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారితో కలిసి స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరారు. బాలుడిలో మానసిక స్థైర్యాన్ని ప్రేరేపిస్తు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సన్నాహాలు కొనసాగుతుండగా బాలుడి తల ఇరుక్కుపోయిన రాతి సందులో కొండచిలువ చుట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. దీంతో పరిస్థితి మరింత సమస్యాత్మకంగా పరిణమించింది. ఈ తరుణంలో అగ్ని మాపక బృందం సుమారు 10 గంటలపాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాలుడికి ఆరోగ్య పరీక్షలు చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఎం అభినందనలు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందిస్తూ అగ్ని మాపక దళం సమర్ధంతమైన సహాయక చర్యల్ని అభినం్చదించారు. -
అభివృద్ధి పనులపై సమీక్ష
మల్కన్గిరి: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ నాయక్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షంచారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం జనమన్, ఆదర్శ గ్రామ యోజన, బిజు పక్కా ఘర్ యోజన, కొత్త స్పెషల్ పక్కా ఘర్ యోజన వంటి గ్రామీణ గృహ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు. సమావేశంలో నవరంగ్పూర్ ఎంపీ బలభద్ర మాఝి, కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి, జిల్లా అభివృద్ధి అధికారి దశరాథి సరాభు తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
● దాడిలో నలుగురికి గాయాలు హిరమండలం: స్థానిక అంగురు వీధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలపై దాడిచేసి నలుగురిని గాయపరచింది. దీంతో వారిని హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యసేవలందించారు. ఉదయం పిచ్చికుక్క స్థానికులపై ఎగబడింది. కనిపించిన వారిపై దాడి చేసింది. గత నెలలలో కూడా పది మందిపై దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను కొట్టి చంపేశారు. వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని సీతాపురంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్కు స్వైర విహారం చేస్తూ పలువురు మహిళలపై దాడి చేసింది. ఈ దాడిలో కె.ప్రశాంతి, టి.సీతమ్మ, టి.తులసమ్మ, టి.పద్మ, బి.శ్యామలకు గాయాలయ్యాయి. అలాగే నువ్వలరేవుకు చెందిన మహిళ చేపలు అమ్ముతుండగా ఒక్కసారిగా దాడి చేయగా ఆమె తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. కాగా పిచ్చికుక్క నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం చేతికర్రలు పట్టుకొని గ్రామంలో తిరుగుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం మెళియాపుట్టి: మండలంలోని బురద రామచంద్రాపురం గ్రామానికి వెళ్లే రహదారికి ఆనుకుని ఒక వృద్ధుడి మృతదేహాన్ని కొంతమంది పాదచారులు బుధవారం ఉదయం గుర్తించారు. వారిద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఆనవాలు ఉన్నాయని, ప్రమాదానికి కారణమైన వ్యక్తుల చెప్పులు, ఇతర వస్తువులు సంఘటనా స్థలంలో లభ్యమయ్యాయన్నారు. వృద్ధుడి వివరాలు తెలియడం లేదన్నారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధాశ్రమానికి మతిస్థిమితం లేని యువకుడు కవిటి: మండలంలోని కుసుంపురం పంచాయతీ జుత్తుపుట్టుగలో గత కొన్ని రోజులుగా చిరునామా తెలియని ఒక మతిస్థిమితం లేని యువకుడు సంచరిస్తున్నాడు. గ్రామంలో ఆలయ నిర్మాణ వేళలో అక్కడ సంచరించాడు. దీంతో ఉదారమైన మనసుతో గ్రామస్తులు అతడికి ఆహారం, తాగునీరు అందించి ఆదరించారు. తాజాగా అతడి మానసిక స్థితిని గుర్తించి నర్తు సారధి తదితర గ్రామ పెద్దలు మానవతా దృక్పథంతో స్పందించి, మతిస్థిమితం లేని వ్యక్తిని తలతంపర సమీపంలోని వృద్ధాశ్రమం(సీతయ్య ఫౌండేషన్) నిర్వాహకులతో మాట్లాడి వారికి బుధవారం అప్పగించారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఎచ్చెర్ల: మండలంలోని కుశాలపురం గ్రామం బైపాస్ కూడలి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న బ్యాటరీల వ్యాను బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ౖను ఢీకొనడంతో వ్యాన్ బోల్తా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాను నుజ్జనుజ్జయ్యింది. వ్యానులో ఉన్న డ్రైవర్, క్లీనర్తో పాటు ఒక బాలిక చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యాన్ బీహార్ నుంచి రాజమండ్రికి బ్యాటరీలతో వెళ్తోంది. ఎచ్చెర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్ను నియంత్రించారు. ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాటు తుపాకులు స్వాధీనం
రాయగడ: ఆపరేషన్ నేత్ర కార్యక్రమంలో భాగంగా ఝార్సుగుడ పోలీసులు ఇటు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు అటు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మారణాయుధాలను రవాణా చేసే ముఠాఆటను కూడా కట్టిస్తున్నారు. జిల్లా ఎస్పీ గుండాల రాఘవేంద్ర ఆదేశాల మేరకు బ్రజరాజ్నగర్, ఒరియంట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో నాటు తుపాకీల అక్రమ రవాణాకు సంబంధించి ఆదర్శ దుబే అలియాస్ బిట్టు, మహమ్మద్ రఫీ అన్సారీలను పట్టుకుని వారి నుంచి నాలుగు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. బిహార్ నుంచి నాటుతుపాకీలను రవాణా చేసి వాటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తుపాకులతో పాటు నాలుగు రౌండ్ల ఎమ్యూనేషన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు జయపురం: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు జయపురంలో మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత గౌతమ సామంతరాయ్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతమొందించి బీజేపీ చారిత్రిక విజయం సాధించిందని అన్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో తాజాగా జరిగిన ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ అపూర్వ విజయం సాధించి అధికారంలోనికి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వించదగ్గ విషయమన్నారు. సామంతరాయ్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక రాజనగర్ కూడలి వద్ద బాణసంచా కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు. మిఠాయి పంచి సందడి చేశారు. జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎస్.మనోజ్కుమార్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంతరాయ్, మహిళా మోర్చ కార్యకర్తలు, యువమోర్చ నాయకులు పాల్గొన్నారు. కత్తితో మహిళను బెదిరించి మంగళ సూత్రం దోపిడీ రాయగడ: మహిళను కత్తితో బెదిరించి ఆమె వద్ద గల బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించిన ఘటన జిల్లాలోని గుణుపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుణుపూర్లోని బబులినగర్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి .. మహిమానగర్కు చెందిన టి.బాలేశ్వరి ఆచారి అనే మహిళ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వ్యక్తిగత పనిపై బబులినగర్ పార్క్ వైపు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమెను ఆపి కత్తిచూపి బెదిరించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు మంగళసూత్రాన్ని తెంపుకొని పరారైనట్టు చెప్పారు. ముగిసిన నీలమ్మ సంబరాలు పర్లాకిమిడి: స్థానిక తొమ్మిదో వార్డు మార్కెట్ జంక్షన్ వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామదేవత నీలమ్మ సంబరాలు బుధవారం అనుపోత్సవంతో ముగిశాయి. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఘటాలతో వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. -
పదిలో ప్రతిభావంతులకు అభినందన
మల్కన్గిరి: పది ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 32 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. 22 మంది 90 శాతం పైగా మార్కులు పొందడంతోపాటుగా కాలుతో పరీక్ష రాసిన లక్ష్మీ ఖేముండుకి కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంకల్పమే ఆమె ధర్యంతో ముందడుగు వేసింది. చేతులు పని చేయక కాలుతో పరిక్ష రాసి 66 శాతం మార్కులు సాధించింది. ఆమె కాలేజీ చదువుకు ప్రభుత్వ సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కర్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ , జిల్లా వైద్యాధికారి బోజా, జిల్లా విద్యశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరథి సరబు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
బడుగులపై పిడుగు
● పిడుగుపాటుకు నలుగురు మృతి ● మృతిచెందిన ఆవు ● గెడ్డవలస, చిన్నయ్యపేటలో విషాదం ● మృతుల్లో ఇద్దరు తోడికోడళ్లు అందరివీ కూలిబతుకులే... రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి... కూలి చేసుకుంటూ కుటుంబాలను గుట్టుగా నెట్టుకొస్తున్నవారిని పిడుగు రూపంలో మృత్యువు కాటేసింది. కష్టపడేవారిని కుటుంబాలకు దూరం చేసింది. కుటుంబ ఆధారాన్ని అందని లోకాలకు తీసుకుపోయి ఆవేదన మిగిల్చింది. మంగళవారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మృతిచెందడం జిల్లా వాసులను కలచివేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. రాజాం సిటీ: విజయనగరం జిల్లాలోని రాజాం మండలం గెడ్డవలస, తెర్లాం మండలంలోని చిన్నయ్యపేటలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు తోటికోడళ్లు ఉన్నారు. గ్రామస్తులు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... గెడ్డవలస గ్రామ సమీపంలోని పొలంలో దొండకాయలు ఏరేందుకు మజ్జి సత్యవతి (55), మజ్జి అప్పలనర్సమ్మ (50), పైల రాము (45)లు మంగళవారం ఉదయం వెళ్లారు. సాయంత్రం పిడుగులతో కూడిన వాన ఆరంభం కావడంతో భయపడ్డారు. పొలం నుంచి గట్టుకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అంతే... పెద్దశబ్దంతో ముగ్గురిపైనా పిడుగు పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని దూరం నుంచి చూసిన రైతులు పరుగున చేరుకుని సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామస్తులకు తెలియడంతో ఘొల్లుమన్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు కార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అన్నీ తానై.. మృతుల్లో ఒకరైన మజ్జి అప్పలనర్సమ్మ కుటుంబానికి అన్నీతానై ముందుకు నెట్టుకొస్తోంది. పదిహేనేళ్ల కిందట భర్త రాము మృతిచెందాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తెలను కూలి పనులు చేసుకుంటూ పెంచుతోంది. తల్లికి తోడుగా కుమారుడు రామకృష్ణ కూడా కూలి పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉంటుంటున్నారు. కాస్త ఆర్థిక ఆసరా కలిగిందన్న దశలో తల్లి మృతిచెందడంతో కుమారుడు, కుమార్తెలో బోరున విలపించారు. ఆశ నెరవేరకుండానే... పైల రాముకు ఇద్దరు కుమారులు. కూలి పనులు చేస్తూనే వారిని సాకింది. తనవలే కుమారులు కష్టపడకూడదని, ఉద్యోగాలు సాధించాలని ఆశ పడింది. పనులు చేస్తూనే ఉద్యోగ శిక్షణ కోసం వారికి కావాల్సిన డబ్బులు పంపించేది. పెద్దకుమారుడు జగన్నాథం ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ పరీక్షలో ఒక్క మార్కులో ఉద్యోగ సాధనలో వెనుకబడ్డాడు. ఉద్యోగం సాధించాలన్న తపనతో హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటున్నాడు. డిగ్రీ చదువుకున్న రెండో కుమారుడు వాసు కూడా విజయనగరంలో ఉంటూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాడు. తల్లి మృతితో ఇద్దరూ కన్నీరు పెడుతున్నారు. పిల్లలు ఉద్యోగ కల నెరవేరకముందే మృత్యువు రామును కబలించిందంటూ గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. -
ఆర్అండ్బీ స్థలాల్లో ఆక్రమణల పర్వం
పాతపట్నం: నియోజకవర్గం కేంద్రం పరిధిలో ప్రభుత్వ స్థలాలు దర్జాగా ఆక్రమిస్తున్నారు. సొంత స్థలాలు లాగే విక్రయాలు కూడా చేస్తున్నారు. అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటంతో రోజురోజుకూ ఆక్రమణలు పర్వం పెరుగుతుంది. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ఆక్రమణ స్థలాల్లో పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆల్ఆంధ్రా రోడ్డు జంక్షన్ నుంచి మెళియాపుట్టి, పలాస ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆర్అండ్బీ స్థలంలోను తాజాగా ఆక్రమణలు చేసి విక్రయాలు చేపట్టారు. బ్రాహ్మణవీది మెయిన్రోడ్డు నుంచి యశోదనగర్ వెళ్లే వరకు కొంత మంది స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. వీరు ఒక్కో దుకాణానికి సరిపోయే స్థలాన్ని రూ.50వేల నుంచి రూ.80 వేలు చొప్పున చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన స్థలం కాదా అని బీటీ రోడ్డుకు వీరు నిర్మాణాలు జరిపించి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆల్ఆంధ్రా రోడ్డులో తిడ్డిమికి వెళ్లె రహదారిలో ఎక్కువ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ స్థలాల్లో ఆక్రమ నిర్మాణాలు చేస్తుండడం విశేషం. సాయంత్రం ఐదు గంటలకే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఆల్ఆంధ్రా కూడలిలో రద్దీగా ఉంటుంది. రహదారి పక్క స్థలాలను అమ్ముతున్న మొదట్లోనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేసి ఆక్రమణలను తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. -
మృత్యువులోనూ వీడని తోటికోడళ్ల బంధం
దొండపంటలో కూలి పనికి వెళ్లిన మజ్జి సత్తెమ్మ, మజ్జి అప్పలనర్సమ్మలు తోటికోడళ్లు. అంత వరకు మాటామంతి ఆడుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోటికోడళ్లు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఘటనా స్థలం రోదనలతో మిన్నంటింది. అమ్మా.. లే అమ్మా... మృతురాలు సత్తెమ్మకు భర్త నర్సింహులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో దివ్యాంగురాలైన పెద్దకుమార్తె రమణమ్మ భర్త మూడేళ్ల కిందట మరణించడంతో కన్నవారి ఇంటివద్దనే తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. వారిని కూలిపనులు చేస్తూ సత్తెమ్మ సాకుతోంది. ఇప్పుడు ఆమెను పిడుగు రూపంలో మృత్యువు కాటేయడంతో కుమార్తె రమణమ్మ బోరున విలపించింది. మృతదేహాన్ని పట్టుకుని అమ్మా... లే అమ్మా అంటూ రోదించిన తీరు అక్కడివారిలో కన్నీరు తెప్పించింది. పొలం వద్దే తనువు చాలించిన అప్పలనర్సమ్మ మృతిచెందిన సత్తెమ్మ -
గిరిజన సమస్యల పరిష్కారానికి చర్యలు
కొత్తూరు: గిరిజన సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. మండలంలోని ఓండ్రుజోల గ్రామంలో గిరిజనులతో మాటామంతీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గిరిజనులు పడుతున్న పలు రకాల సమలస్యలను పీఓకు వివరించారు. భూ సమస్యలు, రహదారులు, తాగునీరు వంటి సమ్యలు పరిష్కరించాలని కోరారు. పీఓ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆధారాలతో కూడిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందజేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం మండల పరిషత్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులకు నిధులు కేటాయించి, చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సామాజిక వెత్త బామిడి రాజు, సుందర నారాయణ, తిరుపతిరావు, సచివాలయ ఉద్యోగులు, గిరిజనులు పాల్గొన్నారు. -
తింటే అనారోగ్యం!
● గడువు ముగిసిన, నిల్వ ఉంచిన పదార్థాల విక్రయం ● ప్రజారోగ్యంతో చెలగాటం ● అధికారులు తనిఖీ సమయంలోనే వెలుగులోకి.. సాక్షి, పార్వతీపురం మన్యం: ● నాలుగు రోజుల కిందట కలెక్టర్ డాక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశాలతో ఆహార భద్రత అధికారులు గుమ్మలక్ష్మీపురంలోని పలు దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేశారు. గడువు దాటిన ప్రముఖ సంస్థలకు చెందిన శీతల పానీయాలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పది దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ● ఇటీవల కొంతమంది యువకులు పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేయగా.. అందులోని చికెన్ రుచిమారి, దుర్వాసన వస్తోంది. నిల్వ ఉన్నదిగా గుర్తించిన వినియోగదారులు.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు తొలుత బుకాయించారు. గట్టిగా అడిగేసరికి మరొకటి తెచ్చి ఇస్తామని సముదాయించారు. ● గతంలో పార్వతీపురం, కురుపాం, సీతంపేట ప్రాంతాల్లో ఆహార భద్రత అధికారులు చేపట్టిన తనిఖీల్లో కాలం చెల్లిన బిస్కెట్లు, శీతల పానీయాలు, ప్యాకింగ్ తేదీలు స్పష్టంగా లేని ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్న ఘటనలు నమోదయ్యాయి. కొన్ని కిరాణా షాపులకు జరిమానాలు విధించారు. ● ఇటీవల ఓ ఉద్యోగి పార్వతీపురం పట్టణంలోని రహదారి పక్కన విక్రయాలు సాగిస్తున్న చిన్న దుకాణానికి వెళ్లి, వండిన కోడిగుడ్ల కూరను తీసుకున్నాడు. భోజనం దగ్గర కూర్చునేసరికి.. గుడ్ల కూర రుచిలో తేడాగా ఉండటాన్ని గమనించారు. అవి ముందు రోజు వండిన గుడ్లుగా నిర్ధారించుకున్నారు. ప్రముఖ సంస్థకు చెందిన వాటర్ బాటిల్ అని దుకాణంలో కొనుగోలు చేస్తాం.. తీరా తాగక, రుచి వేరేగా ఉంటుంది! శీతల పానీయం తాగుదామంటే.. తాగాక, కడుపులో తేడా కొడుతుంది. అసలేదో, నకిలీ ఏదో కనిపెట్టలేని పరిస్థితి. వస్తువుల మీద గడువు తేదీలు కూడా స్పష్టంగా కనిపించవు. జిల్లాలో హోటళ్లు, దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు, పానీయాల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలు వ్యాపార సంస్థల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం, పరిశుభ్రత లోపాలు వెలుగులోకి రావడం ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల గుమ్మలక్ష్మీపురం మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా దుకాణాలు, చిన్న ఫుడ్ స్టోర్లలో బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ గడువు ముగిసినా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సంబంధిత వ్యాపారులకు నోటీసులు జారీ చేసి, కొంతమందిపై జరిమానాలు విధించారు. ఇందులో ప్రముఖ సంస్థలకు చెందిన శీతల పానీయాలు కూడా ఉండడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలో ఈ తరహా మోసాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. తనిఖీల సమయంలోనే వెలుగులోకి.. చిన్న వ్యాపారులకు అవగాహన లోపం, ఖర్చు తగ్గించుకోవాలనే ప్రయత్నం, నిల్వ సదుపాయాల కొరత వల్ల ఆహార పదార్థాల విషయంలో తప్పు చేస్తున్నారు. పెద్ద రెస్టారెంట్లలో మిగిలిపోయిన పదార్థాలను పారబోయకుండా, కక్కుర్తితో ఫ్రిజ్లో దాచి, విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారుల దాడుల సమయంలో మాత్రమే బయటపడుతున్నాయి. ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. – జిల్లా ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. గడువు తేదీలు, నిల్వ పరిస్థితులు పరిశీలించి మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. తినుబండారాలు, శీతలపానీయాలపై గడవుతేదీ పరిశీలించాలని, తేడా ఉంటే ఫిర్యాదు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు కోరుతున్నారు. జిల్లాలోని కొన్ని హోటళ్లలో పరిశుభ్రత లోపాలు కూడా బయట పడుతున్నాయి. వంటకు పాత నూనె వినియోగం, నిల్వలో నిర్లక్ష్యం, పాడైపోయిన కూరగాయల వినియోగం వంటి అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. వేసవి కాలంలో నిల్వ సదుపాయాల లోపం కారణంగా ఆహార పదార్థాలు త్వరగా పాడైపోయే పరిస్థితి నెలకొంటోంది. ప్రధాన రెస్టారెంట్లలో సైతం వారం రోజులపాటు నిల్వ ఉంచుతున్న చికెన్, గుడ్లు వంటివి వేడి చేసి విక్రయించే పరిస్థితులు ఉన్నాయి. కృత్రిమ రంగులు వాడుతున్నారు. వీధి ఆహార విక్రేతల విషయంలోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. హైజీన్ ప్రమాణాలు పాటించకపోవడం, కలుషిత నీటి వినియోగం వంటి కారణాలతో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ స్టాళ్లలో చేతులు కడగకుండా వంట చేయడం, కలుషిత నీరు వాడటం, కప్పులు/ప్లేట్లు సరిగా శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలు తరచూ వెలుగు చూస్తున్నాయి. -
బోరు కప్పేసి..షాపులు కట్టేసి..!
● పైడి భీమవరం పంచాయతీలో యథేచ్ఛగా ఆక్రమణలు ● పక్కా షాపులు నిర్మించిన కబ్జాదారుడు రణస్థలం : పైడిభీమవరం పంచాయతీలో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన ఈ రెండేళ్లలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. తాజాగా పైడిభీమవరం పంచాయతీలోని కాజా వీధిలో నారువ వైపు వెళ్లే రహదారి పక్కన సర్వే నంబర్ 91–1లో ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి అడ్డగోలుగా ఆక్రమించేశాడు. అందులో ప్రభుత్వానికి చెందిన చేతిపంపు(బోరు) ఉంటే అది కూడా కప్పేసి స్థలం చదును చేసేశాడు. దీనికి తోడు పక్కనే ఉన్న కాలువపైన పలకలు వేసి చదును చేసి కబ్జా చేశాడు. తదుపరి దర్జాగా పక్కా షాపుల నిర్మాణ పనులు ప్రారంభించి 90 శాతం పూర్తి చేశాడు. ఇంత జరుగుతున్నా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారి జగదీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పి.అజయ్బాబు వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ స్థలంలో బోరు కప్పేసి అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి పనులు నిలిపివేయమని చెప్పామని, ఇంకా ఆపకుండా నిర్మిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పిడుగు పాటుకు వేతనదారు బలి..
తెర్లాం: చెరువులో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై ఉపాధి హామీ పథకం వేతనదారు మృతి చెందగా, మరో వేతనదారు అస్వస్థతకు గురయ్యాడు. తెర్లాం పంచాయతీ మధుర గ్రామమైన చిన్నయ్యపేటలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన జమ్మల సూర్యనారాయణ(71) ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చి భోజనం చేసిన తరువాత రెండో పూట ఉపాధి పనికి వెళ్లాడు. పని చేస్తుండగా భారీ వర్షం కురవడంతోపాటు, పిడుగు పడడంతో చెరువులోనే సూర్యనారాయణ మృతిచెందాడు. ఆయనకు దగ్గరలో ఉన్న గణపతి అస్వస్థతకు గురికావడంతో వేతనదారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సత్యవతి, వివాహితుడైన కుమారుడు ఉన్నారు. ఉపాధి వేతనదారు పిడుగుపడి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కార్యాలయం ఏఓ వెంకటరమణ, ఉపాధి ఏపీఓ సుశీల, మండల టీడీపీ అధ్యక్షుడు, తెర్లాం పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ మర్రాపు శంకరరావు గ్రామానికి వెళ్లి సూర్యనారాయణ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిడుగుపడి ఆవు మృతి మండలంలోని లింగాపురం పంచాయతీ పరిధి అంట్లవార గ్రామంలో పిడుగుపడి ఓ ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన సోపేటి పకీరు ఆవు పొలంలో మేత మేస్తుండగా పిడుగుపడి మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపాడు. -
బొలెరో ఢీకొని ఇద్దరికి గాయాలు
మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ, కోట బొమ్మాళికి చెందిన టి.శ్రీనివాసరావు, ఎన్.ధనలక్ష్మి బంధువులు. మందస మండలం సొండిపూడి గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి బైక్ వస్తుండగా బాలిగాం జాతీయ రహదారిపై కోళ్లు రవాణా చేస్తున్నా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు, ధనలక్ష్మిలు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. సూర్యనారాయణ నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : హయాతినగరానికి చెందిన ముగుల సూర్యనారాయణ (85) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఫణికిరణ్ తదితరులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయడంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది పి.సుజాత, ఎం.ఉమాశంకర్లు కార్నియాలను సేకరించి విశాఖపట్నం తరలించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
వజ్రపుకొత్తూరు: చినపల్లివూరు గ్రామానికి చెందిన గర్తం ఇందు(25) అనే వివాహిత సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. అమలపాడు పంచాయతీ చింతవానిపేటకు చెందిన ఇందుకు.. చినపల్లివూరుకు చెందిన గర్తం శంకరరావుతో 2017లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కవలలు (బాబు, పాప) ఉన్నారు. ఇందు తండ్రి లోకనాథం చిన్న వయస్సులోనే మృతి చెందగా తల్లి మోహిని అన్నీ తానై పెంచింది. కట్న లాంచనాలతో వివాహం చేసింది. ఇందు భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శంకరరావు దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఇందు సోమవారం రాత్రి ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న తల్లి మోహిని, సోదరుడు సందీప్ హుటాహుటిన వెళ్లి విగతజీవిగా పడి ఉన్న ఇందుని చూసి బోరున విలపించారు. కాగా, ఇందు ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిది కాదని, కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మోహిని, సోదరుడు సందీప్ ఆరోపించారు. కొద్దిసేపటి కిందటే ఇందుతో వీడియో కాల్లో మాట్లాడామని, ఇంతలో ఏం జరిగిందో తెలియదని చెప్పారు. భర్త శంకరరావు, అత్త వరలక్ష్మి చాలా రోజులుగా తమ కుమార్తెను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వైకుంఠరావు తెలిపారు. -
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్
భువనేశ్వర్: వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో తరచూ కాలవైశాఖి తాండవించి బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడికక్కడ చెట్లు, ఇతరేతర కట్టడాలు కూలి విద్యుత్ పంపిణీ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు వేసవి తాపం తీవ్రత పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఏమాత్రం అంతరాయం లేకుండా సన్నద్ధతని విద్యుత్ విభాగం బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ సమీక్షించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం స్థానిక లోక్సేవా భవన్లో విద్యుత్ శాఖ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి విశాల్ కుమార్ దేవ్, ఓపీటీసీఎల్ సీఎండీ భాస్కర్ జ్యోతి శర్మ, ఒడిశాలోని అన్ని డిస్కామ్ల సీఈవోలు హాజరయ్యారు. ఫిర్యాదులు పరిష్కరించాలి వేసవి కాలం, కాల వైశాఖి తుఫానుల విపత్తుపై సన్నద్ధతను సమీక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించాలని ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ డిస్కాంలను ఆదేశించారు. వినియోగదారుల నుంచి వచ్చే అన్ని ఫిర్యాదులను అత్యవసర ప్రాతిపదికన పరిగణించి నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. పునరావృతం అయ్యే లోపాలను నివారించడానికి పటిష్టమైన వ్యవస్థ నిర్వహణ, పునరుద్ధరణ కార్యకలాపాల్లో నాణ్యమైన ఉపకరణాలు, సామగ్రిని మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అన్నిస్థాయిల ఉద్యోగులు వినియోగదారులతో మర్యాదగా, చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు, వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించే ప్రత్యేక బృందాల సంఖ్యను పెంచాలన్నారు. -
నీటి ఎద్దడిపై నిరసన
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా బొలంగీర్ జిల్లాలో నీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి నివారణకు అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అత్యంత అవసరమైన తాగునీరు కల్పించలేని దయనీయ పరిస్థితుల్లో దైనందిన జీవనం దుర్భరం అవుతుందని ఆగ్రహించిన స్థానికులు తాగునీటి పంపిణీ శాఖ అదనపు చీఫ్ ఇంజినీర్ని ముట్టడించారు. దీనిలో భాగంగా మహిళలు ఖాళీ మట్టి కుండలను చీఫ్ ఇంజినీర్ టేబుల్పై ఉంచి నిరసన తెలిపారు. నీటి ఎద్దడి ఇక్కట్లు అధికారికి వివరించారు. దీనిపై అధికారులు స్పందించడం లేదని వాపోయారు. తమ సమస్యను ఇప్పటికై నా పరిష్కరించాలని కోరారు. -
పారా మెడికల్ నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యం
భువనేశ్వర్: ఆరోగ్య సేవా రంగంలో పారా మెడికల్ సిబ్బంది పాత్ర అత్యంత ప్రాధాన్యమని, ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలు పైబడి పారా మెడికల్ సిబ్బంది అవసరం ఉందని హైటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. అందువలన ప్రపంచవ్యాప్తంగా పారా మెడికల్ నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైటెక్ అలైడ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లో రెండు రోజుల మెడివర్స్–2026 కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్ అలైడ్ సైన్సెస్ సంస్థ నుంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రోగులకు ఉత్తమ సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని ఏ మూలలో పనిచేసే అత్యుత్తమ పారామెడికల్ సిబ్బంది అయినా హైటెక్ అభ్యర్థులే అయి ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు. హైటెక్ గ్రూప్ సీఈవో, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ విద్యార్థులు మానవీయ లక్షణాలతో ఎదిగి రోగుల సేవకు అంకితం కావాలని కోరారు. హైటెక్ అలైడ్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మధుస్మిత త్రిపాఠి మాట్లాడుతూ ఆరోగ్య సేవా రంగంలో పారా మెడికల్ పనితీరు విభిన్నంగా ఉంటుందన్నారు. అంకిత భావం ప్రామాణికంగా ఈ రంగంలో సేవలు అందించే వారికి ఉజ్వల భవిష్యత్ చేరువవుతుందన్నారు. కార్యక్రమానికి యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి, అనిల్ పాణిగ్రాహి, మెడికల్ కాలేజ్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ దేబానంద మహాపాత్రో, డీన్, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాధా మాధవ్ త్రిపాఠి, వైస్ చైర్మన్ డాక్టర్ లీసా షడంగి, ప్రొఫెసర్ కుమరవర దాస్, సీవోవో జ్యోతిర్మి పండా, డాక్టర్ చిత్తరంజన్ సహాణి హాజరయ్యారు. -
‘పది’ టాపర్స్కు సత్కారం
పార్వతీపురం: పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా వరసగా నాలుగోసారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మన్యం కళావేదికలో నిర్వహించిన జిల్లాస్థాయి టాపర్స్ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పాల్గొని విద్యార్థులను సన్మానించి, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. జిల్లాలో 10500మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9వేల మంది విద్యార్థులు ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. అంతేకాకుండా సుమారు 500మంది విద్యార్థులు 590 మార్కులకు పైగా సాధించి జిల్లా గర్వపడేలా చేశారని గుర్తుచేశారు. విద్యాశాఖ ప్రవేశపెట్టిన వందరోజుల ప్రణాళిక విజయవంతమై ఈ ఫలితాలకు దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి, డీఇఓ పి.బ్రహ్మాజీరావు, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సీఎం కప్ క్రీడలు
మల్కన్గిరి: స్థానిక స్టేడియంలో జరిగిన సీఎం ట్రోఫీ క్రీడలు ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బలభద్ర మాఝి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుందన్నారు. 2036 నాటికి దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని, అందువలన గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభ గుర్తించడం ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో 7 సమితుల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా ఖో–ఖో పోటీల్లో విజేతగా బలిమెల జట్టు, రన్నరప్గా చిత్రకొండ, పురుషుల విభాగంలో బలిమెల జట్టు విజేతగా, పోడియా జట్టు రన్నరప్గా నిలిచింది. కబడ్డీ పురుషుల విభాగంలో మల్కన్గిరి విజేతగా నిలిచింది. అలాగే వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి, చిత్రకొండ ఎమ్మెల్యే మాంగుఖీలో, సబ్ కలెక్టర్ దుర్యోదున్ బోయి తదితరులు పాల్గొన్నారు. -
నాడు–నేడుతో సర్కారు బడులు బలోపేతం
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: మన బడి–నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ బడులపై విశ్వాసం పెంచుకుంటున్నారని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. సర్కారు బడులు బలోపేతం అయ్యాయనేందుకు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరడమే నిదర్శనమన్నారు. పార్వతీపురం డీవీఎం ప్రభుత్వ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఓ ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థికి స్వయంగా అడ్మిషన్ ఫారం అందజేసి పాఠశాలలో ప్రవేశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల పైబడిన పిల్లలు 10,780 మంది ఉండగా.. 5,929 మందిని ప్రభుత్వ బడుల్లో చేర్పించడమే లక్ష్యం చేసుకున్నామన్నారు. ఇంత వరకు 2,810 మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు కోలాటం, డ్యాన్సు, క్రీడలు నేర్పించడం జరుగుతుందన్నారు. సర్కారు బడులు బలోపేతం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పూజలు
పర్లాకిమిడి: స్థానిక మార్కెట్ జంక్షన్లో కొనసాగుతున్న గ్రామ దేవత నీలమ్మ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సోమవారం రాత్రి అమ్మవారి శోభాయాత్ర ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజపతి జిల్లా ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వైశ్యరాజు బాలాజీ రాజు, మార్కెట్ జంక్షన్ అమ్మవారి సంబరాల కమిటీ అధ్యక్షుడు జామి ప్రశాంత్, వస్త్ర వ్యాపారి బోయిన కృష్ణ, బరాటం శ్రీకాంత్లు ఆయనను సన్మానించారు. ఆర్థిక సాయం అందజేత పర్లాకిమిడి: ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షానికి గుసాని సమితి బాగుసల గ్రామంలో రావిచెట్టు ఒక దుకాణంపై పడడంతో మృతి చెందిన చిరువ్యాపారి కె.మన్మథరావు కుటుంబాన్ని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మంగళవారం పరామర్శించారు. అలాగే ఆదే చెట్టుకింద ఆశ్రయం పొంది తీవ్రగాయాలైన వి.శ్రీనివాసరావు కుటుంబాన్ని కూడా పరామర్శించారు. రెండు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు. దుకాణంపై పడివున్న చెట్టును త్వరితగతిన తొలిగించాలని డీఎఫ్ఓ కె.నాగరాజును కోరారు. ఆయనతో పాటు గుసాని సమితి అధ్యక్షుడు ఎన్.వీర్రాజు, బాగుసల సర్పంచ్ టి.భీమరాజు, జెడ్పీటీసీ ఎస్.బాలరాజు తదితరులు ఉన్నారు. బాకై ్సట్ తవ్వకాల సామర్థ్యం పెంచాలి రాయగడ: కొడింగమాలి బాకై ్సట్ తవ్వకాల సామర్థ్యాన్ని మరింత పెంచాలని కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ కొడింగమాలి శాంతి సుభాష్ ఖని పరివాహన్ సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులోని కొడింగమాలి ప్రాంతంలో ప్రస్తుతం ఏడాదికి కేవలం 3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన బాకై ్సట్ తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ తవ్వకాల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, అదేవిధంగా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు విద్య, వైద్య సౌకర్యాలు వంటివి ప్రజలకు చేరువవుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తవ్వకాల సామర్థ్యాన్ని అదనంగా మరో 3 మెట్రిక్ టన్నుల వరకు పెంచాలని కోరారు. దీనివలన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు అంకుజ్ ఖొర నేతృత్వంలో సభ్యులు పాల్గొన్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ మల్కన్గిరి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎంపీ బలభద్ర మాఝి అన్నారు. స్థానిక జిల్లా జైలులో మంగళవారం మొక్కలు నాటారు. పలు ఔషధ మొక్కలు నాటి వాటి ప్రయోజనాలు వివరించారు. అంతకుముందు జైలు అధికారి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. జైలు పరిసరాలను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, ఎంపీ ప్రతినిధి సంజయ్ సర్కార్, జిల్లా సమాజ్ దినపత్రిక ప్రతినిధి గోపికృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
శివ హనుమాన్ మందిరం ప్రతిష్ట
పర్లాకిమిడి: గుసాని సమితి గురండి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన శివ హనుమాన్ మందిరం ప్రతిష్ట మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పాల్గొన్నారు. ఆయన హనుమాన్ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో గుసాని బీజేపీ నాయకులు రిట్టుపాత్రో, చిన్నా, మోహన్రావు, బబులా పట్నాయిక్, వాళ్ల చిట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు పార్వతీపురం: జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. దృష్టి పోర్టల్లోని ఎక్సెల్ కంటెంట్ యాప్ ద్వారా జిల్లాలోని 26 మంది ఐఈఆర్పీలు 0–16 ఏళ్ల పిల్లను గుర్తించి స్క్రీనింగ్చేసి వారి వివరాలను నమోదు చేస్తున్నారు. 15 మండలాల పరిధిలోని 2,381 హేబిటేషన్లలో జూన్ 10 వరకు సర్వే కొనసాగనుంది. పట్టణంలో నిర్వహిస్తున్న సర్వేలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఐఈఆర్టీ కోఆర్డినేటర్ భానుమూర్తి, ఎంఈఓ కె.ప్రసాద్ పాల్గొని ఆటిజం ఉన్న తోట శ్రావణ్ ప్రజ్వల్ అనే బాలుడిని గుర్తించారు. సర్వేతో దివ్యాంగ పిల్లలకు కచ్చితమైన డేటాసేకరణ, థెరపీ, విద్యాసేవలు, ఉపకరణాల పంపిణీ, అలెవెన్స్ల అమలు, తదితర కార్యక్రమాలు మెరుగుపడతాయని డీఈఓ తెలిపారు. తోటపల్లి పరిసరాల్లో ఏనుగులుగరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిసరాల్లో పంట పొలాలు, తోటల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పదిరోజుల నుంచి గిజబ, తోటపల్లి, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిసరాల్లో సంచరిస్తుండడంతో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో అరటి, మొక్కజొన్న, పామాయిల్ తదితర పంటలు నాశనం చేస్తున్నాయని రైతులంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భీతిల్లుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
గ్రీవెన్స్లో 61 వినతులు స్వీకరణ
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి లుగెల్ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే గ్రీవెన్స్ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా మొత్తం 61 వినతులు స్వీకరించారు. 23 పంచాయతీలకు చెందిన గిరిజనులు తమ సమస్యలపై వినతులు అందజేశారు. కొన్ని సమస్యలకు వెంటనే అధికారులు పరిష్కారం చూపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, కలిమెల అదనపు తహసీల్దార్ రాజీవ్ బెహరా, జిల్లా విద్యాధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి, ఏసీఎఫ్ ప్రియాంక మహుకా, డీడబ్ల్యూవో శ్రీనివాస్ ఆచారి, మోటు ఐఐసీ అర్జున్ కహార్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహం అడ్డగింత
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ పోరిడా పంచాయతీ పోరిడా గ్రామంలో సోమవారం ఒక బాల్య వివాహం జరుగుతున్న సమాచారం చైల్డ్ హెల్ప్లైన్కు అందగా, వెంటనే వారు జిల్లా శిశు సురక్షా సమితి అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే జిల్లా శిశు సురక్షా సమితి, ఐసీడీఎస్, చైల్డ్ డెవలప్మెంట్ అధికారి, సెరంగో, గైబ పోలీసు అధికారులు, సఖీ వన్స్టాప్ సెంటర్ అధికార బృందం వివాహం జరుగుతున్న గైబ గ్రామానికి చేరుకుని నిలుపుదల చేశారు. వధువుకు 18 ఏళ్ల కంటే తక్కువ ఉందని తెలిసి వివాహ వేదిక నుంచి పురోహితుడు వెళ్లిపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. అనంతరం జిల్లా స్క్వాడ్ పెళ్లికూతురు తల్లిదండ్రులకు బాల్యవివాహ నిరోధక చట్టం, జరిమానా వంటి ప్రభుత్వ నియమాలని పెళ్లి వారికి వివరించి బాల్య వివాహాన్ని రద్దు చేయించారు. -
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జయపురం: సబ్ డివిజన్లోని బొయిపరిగుడ సమితి ముండాగుడ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమైంది. మా హుండీ ఠకురాణి క్రికెట్ టోర్నమెంట్ను ప్రముఖ క్రీడాకారుడు పింటు పాణిగ్రహి ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఉపాధ్యాయుడు నిర్మల కుమార్ స్వైయ్, కృష్ణశాంత, నోరొ గౌడ, జనార్ధన నాయిక్, రామచంద్ర నాయిక్, రామచంద్ర గౌఢ, డొంబురు కర్లియలు హాజరయ్యారు. టోర్నమెంట్లో 16 టీములు పాల్గొంటున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. జిలిమిలిగుడ లెవెన్, బొయిపరిగుడ–ఎ లెవెన్ టీమ్లు మొదటి మ్యాచ్లో తలపడగా.. జిలిమిలిగుడ లెవెన్ టీమ్ విజయం సాధించింది. -
డాక్టర్ ప్రశాంత్కుమార్ మిశ్రోకు సీడీఎంఓ బాధ్యతలు
రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రాజెక్టు మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రశాంతకుమార్ మిశ్రోకు జిల్లా ముఖ్యవైద్యాధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.సరోజినిదేవి ఉద్యోగ విరమణ చేయడంతో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు మిశ్రోను సీడీఎంవోగా విధులు నిర్వహించాలని ఉత్వర్యులు జారీ చేసింది. ఈ సందర్భంగా జాతీయ స్వస్థ్య మిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి లక్ష్మకాంత్ మహాపాత్రో తదితరులు మిశ్రోక్ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఎస్బీఐ సీఎంకు పదోన్నతి రాయగడ: స్థానిక ఎస్బీఐ ఏడీబీ శాఖలో చీఫ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న సురేంద్ర కుమార్ జాల్కు పదోన్నతి దక్కింది. ఆయనకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉద్యోగోన్నతి క ల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బ్యాంక్ సిబ్బంది సోమవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది పి.శ్రీనివాస్ పట్నాయక్, సుమిత్ రాయ్, కిరణ్ సబర్, అరవింద పరిక, సునిత టప్ప, ఎస్.మహారణ, మజ్జి సాహు తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు. ఎస్బీఐ శాఖ పరిధిలోని ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ జాల్ సూచించారు. ఎంసీసీ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి కుంభారి సాహిలో ఉన్న మున్సిపాలిటీ వారి ఎంసీసీ సెంటర్లో ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో ఎంసీసీ కేంద్రంలో ఉన్న విలువైన సామగ్రి, యంత్ర పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఎంసీసీ కేంద్రంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసి పడటంతో స్థానికులు వెంటనే అగ్ని మాపక విభాగానికి తెలియజేశారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అర్పారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందీ తెలియలేదు. ఎంసీసీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై మున్సిపాలిటీ దర్యాప్తు ప్రారంభించింది. జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి పాత ఘొసరడ గ్రామంలో లొబో హరిజన్ ఇంటి గోడ పై పిడుగు పడగా ఆ గోడ కూలి ఇంద్ర హరిజన్ కుమార్తె సరస్వతీ హరిజన్(13)పై పడి ఆమె మృతి చెందింది. ఈ సంఘటన ఆమె కుటుంబాన్నే కాకుండా గ్రామ వాసులను శోకంలో ముంచింది. ఆ గ్రామంలో ఇంద్ర హరిజన్ కుమార్తె సరస్వతీ హరిజన్ గుండాలి ఆదర్శ విద్యాలయంలో 7 వ తరగతి చదువుతోంది. ఆమె తన గ్రామంలో ఉంటున్న మామ లొబొ హరిజన్ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి వెనుక ఆరవేసిన బట్టలను తీసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఉరుములు, గాలులతో వర్షం ఆరంభమైంది. వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఆ ధాటికి ఇంటి వెనుక ఓ గోడ కూలి సరస్వతి తలపై పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూచిన వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసి వెంటనే సరస్వతి హరిజన్ను జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కానీ బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొయిపరిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
కోర్టులో లొంగిపోవాలని నోటీసులు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్లో భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అమానుషంగా హత్య చేసిన నలుగురు నిందితులు కోర్టు సమక్షంలో లొంగిపోవాలని నిందితుల ఇంటి ముందు నోటీసులు అతికించారు. ఈ మేరకు కోర్టు ఆదేశించిన మేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది పద్మపూర్లో చోటు చేసుకున్న ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులుగా అదే ప్రాంతానికి చెందిన సుశాంత సాహు, ప్రశాంత సాహు, సునీల్ సాహు, ప్రశాంత్ కుమార్ సాహులను గుర్తించారు. అయితే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టు సమక్షంలో తెలియజేశారు. ఈ మేరకు శనివారం కేసు విచారించిన కోర్టు నిందితులు జూన్ 18వ తేదీలోగా కోర్టు ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో నిందితులపై ఆస్తులను జప్తుచేసే అవకాశం ఉందని నోటీసులో పేర్కొంది. -
త్వరితగతిన సమస్యల పరిష్కారం
● అధికారులకు ఆదేశించిన కలెక్టర్ కులకర్ణి రాయగడ: ప్రజల నుంచి స్వీకరించిన అభియోగాలు, సమస్యలకు సంబంధించి వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, డీఎఫ్వో సచీన్ అన్నాసాహెబ్ అహాలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ప్రశాంత మిశ్రో, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి 41 వినతులు అందాయి. ఇందులో 31 వ్యక్తిగత, ఆరు సామూహిక గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. రెడ్ క్రాస్ నిధుల నుంచి కలెక్టర్ నలుగురుకి 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితిలో సోమవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు చేరింది. సమితి కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఈపీడీపీ కాలనీలోని ఇళ్లలో నీరు చేరిపోయాయి. రహదారి, ఇళ్ల ముందు ద్వారాల వరకు నీరు వచ్చింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
అమ్మవారి పండుగల్లో లక్ష్మీ, మృత్యుంజయ హోమం
పర్లాకిమిడి: స్థానిక కోమటివీధిలో కోనసాగుతున్న నీలమ్మ దేవి గ్రామ దేవత అమ్మవారి పండుగల్లో భాగంగా సోమవారం అమ్మవారి సన్నిధానంలో లక్ష్మీ హోమం, మృత్యుంజయ హామం శాస్త్రోక్తంగా జరిపించారు. మొత్తం 42 మంది దంపతులు ఈ హోమాల్లో కూర్చున్నారు. కార్యక్రమాన్ని పండితులు ఎ.రాజగోపాలచారి ఆధ్వర్యంలో జరిపించారు. అమ్మవారి సంబరాల పండుగ కమిటీ సభ్యులు సహకరించారు. సాయంత్రం వివిధ దుర్గా అవతారాల్లో రామభద్రపురానికి చెందిన కళాకారులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ అమ్మవారి సంబరాలు చూడటానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. -
ఆండ్ర భూముల ఆక్రమణ
● జేసీబీతో చదును చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం ● ఆవేదనలో నిర్వాసిత గిరిజనులు ఇదెక్కడి అన్యాయం నా భూమి 5 ఎకరాలు రిజర్వాయర్లో కలిసిపోయింది. సెంటు భూమి కూడా మిగల్లేదు. రిజర్వాయర్ ఒడ్డున ఎప్పుడూ నీటి ముంపునకు గురికాని భూములను వ్యవసాయం చేద్దామంటే అధికారులు కుదరదని వెళ్లగొట్టారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూములను కొనుగోలుచేసి చుట్టు పక్కల ప్రభుత్వ భూములను, రిజర్వాయర్ భూములను ఆక్రమించేస్తున్నా అతడిని మాత్రం రెవెన్యూ అధికారులు ఏమీ అనడంలేదు. పేదలకో న్యాయం... డబ్బున్న వాళ్లకో న్యాయమా?. – ఇంటి నరసింహులు, నిక్కలవలస, ఆండ్ర రిజర్వాయర్ నిర్వాసిత రైతు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డపోరంబోకు భూములు, రిజర్వాయర్ భూములు ఆక్రమించడం చట్టరీత్యా నేరం. ఆక్రమిస్తే క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – విజయభాస్కర్, తహసీల్దార్, మెంటాడ రిజర్వాయర్ భూమిని జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం మెంటాడ: మండలంలోని ఆండ్ర రిజర్వాయర్ ముంపు భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. జేసీబీతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడంలేదు. భూముల ఆక్రమణల వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, నిక్కలవలస, ఆండ్ర గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యిఎకరాల విస్తీర్ణంతో ఆండ్ర రిజర్వాయర్ను నిర్మించారు. అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించారు. రిజర్వాయర్ బయట ఖాళీగా ఉన్న భూములను అప్పుడు భూములిచ్చిన రైతులే సాగుచేస్తున్నారు. అయితే, రిజర్వాయర్ వల్ల పూర్తిగా భూములు కోల్పోయిన గిరిజనులు రిజర్వాయర్లో ముంపు కాకుండా ఖాళీగా ఉన్న భూముల్లో వ్యవసాయం చేయడానికి సిద్ధపడితే అప్పటి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. నిక్కలవలస రెవెన్యూలో అధికంగా భూములున్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాగులు, గెడ్డపోరంబోకు ప్రభుత్వ భూములన్నింటినీ చదునుచేసి కలిపేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వాయర్ భూములపై అతని కన్ను పడింది. కిందటి వేసవిలో రిజర్వాయర్లో నీరు తగ్గగానే భూములను చదును చేయడానికి ప్రయత్నిస్తే గిరిజన నిర్వాసితులు అడ్డుకున్నారు. మళ్లీ రెండు రోజుల నుంచి జేసీబీతోల చదును చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నిడగల్లు నడిచెళ్లాయ్!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో మాయమైన టేకు చెట్లు.. దుంగల రూపంలో సీతానగరం మండలం నిడగల్లు వద్ద ఓ సామిల్లులో ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు దీనిమీద ఒక కేసు గాని కేసు నడుస్తున్నా.. నియోజకవర్గ పెద్దలు మాత్రం దర్జాగా దానిని కోత కోసం మిల్లుకు తరలించడం గమనార్హం. ఎక్కడ అడారు.. ఎక్కడ నిడగల్లు! దగ్గరలో ఉన్న మిల్లులో అయితే ఎవరికై నా అనుమానం వస్తుందని కాబోలు... కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సీతానగరం మండ లం నిడగల్లు ఊరి చివరన చిన్ని సామిల్లుకు తరలించారు.ఆ కలపే నడిచి వెళ్లిందో.. లేదా కర్రి మహేష్ కు చెందిన ట్రాక్టర్లో రాత్రికి రాత్రి తరలించారో మరి! ఈ విషయం ఊరంతా కోడై కూస్తున్నా అధికారులకు తెలియకపోవడం విడ్డూరం.. వింత!! నియోజక వర్గానికి చెందిన ముఖ్యనేత అడిగీ అడగడంతోనే పార్వతీపురం, సీతానగరం మండలాల ‘తెలుగు తమ్ముళ్లు’ దగ్గరుండి పాఠశాలలకు సెలవు ఇచ్చిన మరుసటి రోజే ఏళ్ల కిందటినాటి టేకు చెట్లను కొట్టించి తీసుకువెళ్లిపోయారు. ఇంటి నిర్మా ణం కోసం.. ప్రభుత్వ స్థలంలో, పాఠశాల ఆవరణలో.. అటవీ శాఖ అనుమతి కూడా లేకుండా రాత్రికి రాత్రే చెట్లు నరికి తరలించుకోవడం గమనార్హం. ఫిర్యాదుకు వెనకడుగు.. పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు నరికేసి తరలించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.గోపమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో గత శుక్రవారం ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన చెట్లు కొట్టివేశారని.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా తులసమ్మ భర్త ఇచ్చిన సమాచారం మేరకు తాను సహచర ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించానని ఆమె చెప్పారు. 12 టేకు చెట్లను నరికించి తరలించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొనగా.. రెండు రోజుల కిందట ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టిన తహసీల్దార్ సీహెచ్ సత్యనారాయణ 14 చెట్లు అని చెప్పడం గమనార్హం. మండలానికి చెందిన టీడీపీ నాయకులే దగ్గరుండి చేయించారని.. వారి పేర్లు సైతం పాఠశాల యాజమాన్య కమిటీకి తెలుసని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు. అంతా గ్రామ దేవత పండగ హడావిడిలో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోయారని తెలుస్తోంది. పత్రికల్లో కథనాలు వచ్చినంత వరకూ అధికారులు పరిశీలనకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఏళ్ల నాటి, రూ.లక్షల విలువ చేసే టేకును తరలించినా.. అటవీ శాఖ స్పందన లేదు. కేసు నమోదైనా పోలీసుల నుంచి పురోగతి లేదు. అటవీశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని పరిశీలించినా.. అక్క డ నుంచి ముందుకు వెళ్లకపోవడం.. అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. విష యం బహిర్గతం అయినా.. కేసు నమోదైనా సరే... టేకు దుంగలను దర్జాగా సీతానగరం మండలం నిడగల్లు ఊరి చివరన ఉన్న సామిల్లుకు ట్రాక్టర్లో తరలించారు. వాటికి కోత పూర్తి చేశాక.. నామరూపాలు పోయాక.. తీరిగ్గా విచారణ ముందుకు తీసుకువెళ్తారేమో అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం కనీసం కలప కూడా కొనుగోలు చేసుకోలేని పేదరికంలో టీడీపీ పెద్దలు ఉన్నారని విమర్శిస్తున్నారు.టేకు చెట్ల దొంగల వెనుకున్న వారిని పట్టుకొని శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు రామస్వామి డిమాండ్ చేశారు. అడారు ఎంపీ పీ స్కూల్ ఆవరణలో దొంగతనంగా నరికిన 14 టేకు చెట్లను సోమవారం పరిశీలించారు. దీని వెనుక చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని అను మానం వ్యక్తం చేశారు. వెంటనే వారిని శిక్షించాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నా యకులు పాలమెట్ట రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.వరాలు పాల్గొన్నారు. అడారు గ్రామ పాఠశాల ఆవరణలో ఏళ్లుగా పెంచుతున్న టేకు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. -
టాపర్కు సత్కారం
పర్లాకిమిడి: ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలోని గుసాని సమితి బుసుకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుర్రం చేతనకు 550/600 వచ్చి ఏ1 గ్రేడ్ సాధించినందుకు పాతపట్నానికి చెందిన పారశెల్లి రామరా జు చారిటబుల్ ట్రస్టు పర్లాకిమిడిలో ఆమె నివాసంలో ఘనంగా సత్కరించారు. జి.చేతనకు మె మెంటో, నగదు పురస్కారాన్ని పి.రామరాజు అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు గుర్రం గోవిందరాజు, కోమలి దంపతులకు ట్రస్టు తరఫున ఘనంగా సన్మానించారు. జి.చేతన తండ్రి బుసుకిడి ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ తన కూతుర్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అభినందనీయనం అన్ని పారశెల్లి రామరాజు అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీమసేన్పండా, విశ్రాంత ఐ.టి.డి.ఏ.అధికారి జనార్ధనరావు ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. రాయగడ: ఇటీవల ప్రకటించిన మెట్రిక్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. వారికి పుష్పగుచ్ఛాలతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. భవిష్యత్ ఉజ్వలంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భజన్లాల్ మఝి తదితరులు ఉన్నారు. మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతిసీతంపేట: మండలంలోని జి.గుమ్మడ గ్రామానికి చెందిన ఆరిక సోమయ్య (63) అనే వృద్ధు డు మెట్లపై నుంచి జారిపడి శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు దోనుబాయి ఏఎస్సై త్రినాథరావు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా జారి పడడంతో సోమ య్య తలకు బలమైన గాయమైందన్నారు. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించి ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సీతంపేట: స్థానికంగా నిర్వహిస్తున్న ఐటీడీఏ పెట్రోల్ బంకులో సోమవారం పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం వారపు సంత కావడంతో ఎక్కువ మంది వాహనదారులు సీతంపేటకు రావడం, పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో బయట మార్కెట్లో కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలియజేశారు. గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మండలంలోని నందివానివలసలో తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం సుంకి గ్రామ పరిసరాల్లోని నాగావళినది ప్రాంతంలో గల పంప్హౌస్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ గ్రామంలో చొరబడి ఎవరికి హాని కలగజేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, సోమవారం ప్రారంభించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ హాల్లో ఈ శిబిరం నిర్వహిస్తారని, ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపు లక్ష్యమని పేర్కొన్నా రు. డీఎంహెచ్ఓ భాస్కరరావు, జిల్లా ఎన్సీడీ అధికారి డా.జగన్మోహన్రావు పాల్గొన్నారు. -
కళ్యాణసింగుపూర్ ల్యాంప్ డైరెక్టర్ సస్పెన్షన్
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ ల్యాంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ తరణీ ప్రసాద్ త్రిపాఠిపై సస్పెన్సన్ వేటు పడింది. ల్యాంప్స్కు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణపై జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశానుసారం డిప్యూటీ రెజిస్ట్రార్ ఆఫ్ కోపరేటీవ్ సొసైటీ (డీఆర్సీఎస్) జన్మజయ్ మహాపాత్రో, జి.కృష్ణమూర్తిలు ఈ మేర కు ల్యాంప్స్ కార్యాలయంపై ఆకస్మిక దాడులను నిర్వహించారు. దాడుల్లో భాగంగా అన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ల్యాంప్స్ ఎండీ త్రిపాఠిని సస్పెండ్ చేస్తున్న ట్లు ఉత్వర్యులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు తన వ్యక్తిగత పేరుమీద, బంధు వు పేరుమీద సుమారు 75 లక్షల రూపాయల వర కు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారు లు వెల్లడించారు. ల్యాంప్స్కు సంబంధించి వివిధ పనుల పేరిట తప్పుడు లెక్కలు చూపించి నిధులు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు తెలుస్తాయని డీఆర్సీఎస్ జన్మజయ్ మహాపాత్రో తెలిపారు. -
గ్రీవెన్స్సెల్కు 67 వినతులు
జయపురం: జయపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు 67 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబా న్ మహాజన్ అధ్యక్షతన వినతులు స్వీకరించారు. వీటిలో 11 కమ్యూనిటీ వినతులు కాగా 56 వ్యక్తిగత వినతులని అధికారులు వెల్లడించారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్య క్రమంలో కొరాపుట్ జిల్లా పోలీసు అధికారి రోహిత్ వర్మ, కొరాపుట్ జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధి కారి వేణుదర్ శబర, జయపురం సబ్కలెక్టర్, జాదుమణి నాయిక్, జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్, జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రభీంద్రనాథ్, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ తృప్తి బొరాయి, జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి బెహర, జిల్లా విద్యాధికారి ప్రశాంతకుమార్ మహంతి, జయపురం బ్లాక్ అధికారి చందన కుమా ర్ నాయిక్, శిశు వికాశ్ విభాగ అధికారి సంగీత రాణి పాణి, ఆర్టీసీ అధికారి, ఆర్అండ్బీ అధికారి ప్రియరంజన్ బెహర ఉన్నారు. -
చరిత్రను మర్చిపోవద్దు
ఆమదాలవలస: వంశధార రెండో దశ నిర్మాణ పనుల సాధనలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం ప్రధాన పాత్ర పోషించారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ స్పష్టం చేశా రు. ఆయన ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వంశధార ప్రాజెక్ట్ చరిత్రను రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల ఆధారంగా చూడాలని కోరారు. 1961లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్కు అదే సంవత్సరం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేయగా, ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలనే లక్ష్యం అప్పుడే నిర్ణయించారని గుర్తుచేశారు. తర్వాతి కాలంలో ఒడిశా అభ్యంతరాల కార ణంగా ప్రాజెక్ట్ దశాబ్దాల పాటు నిలిచిపోయిందని, 2010లో ఏర్పాటు చేసిన వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ 2017 సెప్టెంబర్ 13న ఇచ్చిన తుది తీర్పుతో ప్రాజెక్ట్కు చట్టబద్ధ మార్గం ఏర్పడిందన్నా రు. ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు నేరడి బ్యారే జ్ నిర్మాణానికి అనుమతి లభించినప్పటికీ, ఒడిశా లో 106 ఎకరాల భూసేకరణ, పునరావాసం వంటి షరతులు అమలు చేయాల్సి ఉందని వివరించారు. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒడిశాలో భూసేకరణ కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు డిపాజిట్ చేయడం, న్యాయపరమైన అడ్డంకులను తొలగించే చర్యలు చేపట్టడం వంటి కీలక నిర్ణయా లు తీసుకుందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఒడి శా నుంచి భూమి అప్పగింతలో ఆలస్యం కారణంగా 2026 నాటికి నేరడి బ్యారేజ్ నిర్మాణం ప్రారంభం కాలేదని తెలిపారు. వంశధార రెండో దశ సాధనలో తమ్మినేని సీతారాం కృషి మర్చిపోలేనిదని చిరంజీవినాగ్ తెలపారు. కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఉన్న సమయంలో, అప్పటి ప్రధానమంత్రి వీపీ సింగ్, జలవనరుల శా ఖ మంత్రి మునుభాయ్ కొటాడియా తదితరులను కలిసి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సూచనల మేరకు తమ్మినేని సీతారాం నేతృత్వంలో చౌదరి తేజేశ్వరరావు, తమ్మినేని శ్యామల రావు, బలగ అప్పలనాయుడు, మొదలవలస రామమూర్తి తది తరులతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించిందని గుర్తుచేశారు. అదేవిధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ల మధ్య ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో వంశధార రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పచ్చజెండా ఊపిందన్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య వి వాదాలు తలెత్తడంతో అంశం ట్రిబ్యునల్, న్యాయస్థానాల వరకు వెళ్లినా, చివరికి రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా పరిష్కార మార్గం ఏర్పడిందని వివరించారు. ఇలాంటి చారిత్రక వాస్తవాలను విస్మరిస్తూ కొందరు నాయకులు ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నా రు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఒడిశాలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నేరడి బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాయగడ యువజన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోహన్ నాయక్
రాయగడ: జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోహన్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఒడిశా ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఉత్వర్వులు జారీ చేసింది. ఒడిశా ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి మహేష్ దేశ్ముఖ్, అసిస్టెంట్ ఇన్చార్జి రియానా రాజుల పేరుతో విడుదలైన ప్రకటనలో భాగంగా పార్టీని మరింత బలొపేతం చేయడానికి యువత ముందుకు రావాలని పేర్కొన్నారు. అదేవిధంగా అనుగుల్ జిల్లాకు బిశ్వరంజన్ పాణిగ్రహి, భద్రక్ జిల్లాకు బలరాం రౌత్, బలంగీర్కు అంకిత్ సాహు, కటక్ సిటికి బిప్లవ్ శిలియాదిత్య, డెంకానాల్కు సుభం దాస్ అధ్యక్షుడిగా, భిభూతిభూషన్ మహాంతి వర్కింగ్ ప్రెసిడెంట్గా, జగత్సింగ్పూర్ జిల్లాకు కుమార్ ప్రీతమ్ పరిజ, కేంద్రపడ జిల్లాకు లక్ష్మీప్రియ నాయక్, ఖుర్ధ జిల్లాకు స్వాగత్ కర్, మయూర్భంజ్ జిల్లాకు అధ్యక్షునిగా సరోజ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్గా మహమ్మద్ నజీరుల్ హక్, సుందర్ఘడ్ జిల్లాకు అషీప్ రాజ, బౌధ్ జిల్లాకు మహేశ్వర్ ప్రధాన్ లు నియమితులైనట్లు ప్రకటనలో వెల్లడించారు. -
బృందావన్ సువారో సంసద్ బంధుమిలన్
పర్లాకిమిడి: స్థానిక కవిచంద్ర వీధిలో కార్యాలయంలో అనేక మంది కవులు బంధుమిలన్ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ బృందావన్ సువార్ జీవిత చరిత్ర, ఆయన కవితలు, పుస్తకాలుగా ప్రచురించాలని అధ్యక్షులు ప్రసాద్ సువార్, నిర్ణయించారు. ఈ బంధుమిలన్ కార్యక్రమంలో బినోదిని కళాశాల అధ్యక్షులు మనోజ్ పట్నాయిక్, ప్రగతి మహిళా సంఘటన కార్యదర్శి తనూజా శతపతి, బిజయకుమార్ పండా, సురేష్ కుమార్ పండా, తదితరులు పాల్గొన్నారు. మెట్రిక్యులేషన్లో గజపతి రికార్డు పర్లాకిమిడి: మెట్రిక్యులేషన్ పరీక్ష ఫలితాల్లో గజపతి జిల్లా విద్యార్థులు 99.31 శాతం ఉత్తీర్ణత సాధించి మరోసారి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా ముఖ్య శిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, బ్లాక్ శిక్షాధికారులు, ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో కేకును కోసి వేడుక జరుపుకున్నారు. గజపతి జిల్లాలో గోతఖెల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆద్యషరాణీ ప్రధాన్ టెన్త్లో 600 మార్కులకు 559 మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచింది. గుసాని సమితిబుసుకిడి ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థిని జి.చేతన 550/600 సాధించగా, మార్తీ గోమాంగో (నువాగడ), ఛెలిగడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్ష్మీరాణి పాణి, రండివ ఉన్నత పాఠశాల విద్యార్థి రుద్ర ప్రసాద్ పోరిచ్చా, ఆర్.ఉదయగిరి బ్లాక్కు చెందిన లుధియారాణీ రయితో 540 మార్కులు సాధించారు. జిల్లాలో ఏ1 గ్రేడ్ ర్యాంకులు ఆరుగురు విద్యార్థులు సాధించారు. మొత్తం గజపతి జిల్లాలో 3,939 బాలురు, 3988 మంది బాలికలు పాసయ్యారు. దగ్గుమందు అక్రమ రవాణా రాయగడ: ఝార్సుగుడ జిల్లా పరిధిలోని రెంగాలి పోలీస్ స్టేషన్ సమీర్బాగ్ సమీపాన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేటు లేని ఒక కారును గుర్తించి దానిని ఆపేప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో కారును ఆపకుండా చవదకుడు అతివేగంగా వెళ్లిపోవడంతో అనుమానించిన పోలీసులు వెంటనే కారును వెంబడించి పట్టుకున్నారు. కారుని తనిఖీ చేయగా అందులో 480 సీసాల దగ్గు మందు పట్టుబడింది. దీనికి సంబంధించి కారు డ్రైవరు మహమ్మద్ ఆలాప్ అన్సారి అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఝార్సుగుడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర తెలిపారు. ఎస్ఐ చిత్రసేన్ డెహురి నేతృత్వంలొ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారన్నారు. రాంచి నుంచి దగ్గు మందు సీసాలను కొనుగొలు చేసి ఛత్తీస్ఘఢ్కు అక్రమంగా తరలిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. అలరించిన సప్తగిరి సంకీర్తనలు భువనేశ్వర్: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 618వ జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి సప్తగిరి సంకీర్తన ఆలాపన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన గాయకులతో సమితి సభ్యులు సంకీర్తనాలాపనలో ఉత్సాహంతో పాలుపంచుకున్నారు. వినోద్ (ఇచ్ఛాపురం) మృదంగం, దుంపల ఈశ్వర రావు (శ్రీకాకుళం) వయోలిన్ వాద్య సహకారం అందజేశారు. సమితి కార్యవర్గ సభ్యుల సమన్వయంతో కొనసాగిన కార్యక్రమం శ్రోతలను అలరించిందని అధ్యక్షుడు గన్నవరపు ఆనంద రావు తెలిపారు. -
మలిసంధ్యలో ఒకరికొకరై..
భువనేశ్వర్: అతడికి ఎవరూ లేరు. కష్టం వచ్చినా.. కన్నీరు వచ్చినా తనకు తానే తోడు. మలి సంధ్య వరకు ఒంటరిగానే బతుకు నావ సాగించాడు. ఆమెకూ ఎవరూ లేరు. దుఖం వచ్చినా.. బాధ కలిగినా ఆమెను ఆమే ఓదార్చుకోవాలి. అతడికి 70 ఏళ్లు.. ఆమెకు 65 ఏళ్లు. కుటుంబాలకు దూరంగా కష్టాలకు దగ్గరగా బతుకుతూ.. ఒకరికొకరు పరిచయమయ్యారు. నా అనే తోడు లేని బతుకులో ఒకరికొకరుగా బతకాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి ప్రవేశించారు. బాలాసోర్ జిల్లాలో సంఘటన ఇది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా జలేశ్వర్కు చెందిన ఇద్దరు నిరుపేద వృద్ధులు వివాహ బంధంతో జీవనంలోకి పునః ప్రవేశించారు. ప్రేమకు వయసుతో గానీ, కష్టాలతో గానీ సంబంధం లేదని వీరి వివాహ బంధం నిరూపించింది. హతిగొడొ ప్రాంతానికి చెందిన 70 చైతన్య సోరెన్ కుష్టు వ్యాధి పీడితుడు. తన ఇంటికి, కుటుంబానికి దూరమై జలేశ్వర్ పట్టణంలో నివసిస్తున్నాడు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి తనలాగే ఇబ్బంది పడుతూ జీవనం సాగిస్తున్న రైబొణియా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల చంపా సోరెన్ పరిచయమైంది. సాధారణ సంభాషణలతో మొదలైన వీరి పరిచయం క్రమంగా భావోద్వేగ బంధంగా వికసించింది. కుటుంబాలను వదిలి, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ ఒకరిలో ఒకరు ఓదార్పును, సాంగత్యాన్ని కనుగొని తమ జీవితాలను కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. వారి సంకల్పానికి భోలా భండారి స్వచ్ఛంద సంస్థ సహాయసహకారాలు అందజేసి అండగా నిలిచి ఆదరించింది. వారి వివాహానికి ఏర్పాట్లు చేసింది. జలేశ్వర్లోని పంచఘంట ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వర మహాదేవ్ ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో వివాహం ధూమ్ధామ్గా జరిగింది. పెళ్లి మండపంలో పూలమాలలు మార్చుకుని వృద్ధ ప్రేమ జంట గానా బజానా, విందు వినోదాల మధ్య నవ దంపతులుగా మారి కొత్త జీవనానికి శ్రీకారం చుట్టారు. ఈ అసాధారణ వివాహం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ హృద్యమైన వేడుకను వీక్షించేందుకు ఆలయం వద్ద గుమిగూడిన జనం సమక్షంలో నవ దంపతులుగా ఒక్కటైన చైతన్య, చంపా జీవితంలోని సవాళ్లలో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గౌరవంగా, శ్రద్ధగా కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. -
బహుముఖ పురోగతికి విద్య పునాది
భువనేశ్వర్: దేశ నిర్మాణానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక లోక్ సేవా భవన్ స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన ఒడిశాలో జాతీయ విద్యా విధానం 2020 అమలు, ఉన్నత విద్యా సంస్కరణలు శీర్షికతో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్షాప్లో ఆయన ప్రసంగించారు. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, సాహిత్యం వంటి రంగాల్లో జ్ఞానం, వివేకం, మేధో నాయకత్వానికి భారత దేశం ప్రపంచ కేంద్రంగా చారిత్రాత్మకత సంతరించుకుందన్నారు. భారత దేశాన్ని ప్రపంచ విజ్ఞాన అగ్రరాజ్యంగా తీర్చి దిద్దడం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యంగా పేర్కొన్నారు. 2036 నాటికి వికసిత్ ఒడిశా, 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికత సాకారానికి దారితీస్తుందని ఆయన తెలిపారు. ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, ప్రపంచ నాయకత్వం రూపకల్పనలో భారత దేశ జనాభాను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు జాతీయ విద్యా విధానం 2020 బలమైన మార్గదర్శకం అవుతుందన్నారు. జాతీయ పురోగతి, మానవ అభివృద్ధికి పునాది అయిన విద్యను బలోపేతం చేయడానికి ఈ వర్క్షాప్ సామూహిక నిబద్ధతగా ప్రతిబింబిస్తుందని గవర్నర్ అభివర్ణించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), బయోటెక్నాలజీ, డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో ప్రపంచంలో శర వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్ని దక్షతతో ఎదుర్కొనేందుకు విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, అనుకూలత, అంతర్విషయక అభ్యసనం అవసరం. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా, బట్టీ పద్ధతి నుంచి అనుభవ పూర్వక అభ్యసనం, సంపూర్ణ అభివృద్ధి, బహుళ విషయక విద్య వైపు ఎన్ఈపీ 2020 నిర్ణయాత్మక మార్పును ఆవిష్కరిస్తుందన్నారు. నైపుణ్య ఆధారిత అభ్యసనాన్ని ప్రోత్సహించడం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమ్మిళిత వృద్ధిని నిర్ధారించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని డాక్టర్ కంభంపాటి అన్నారు. యువత ఉద్యోగ అన్వేషణకు పరిమితం కాకుండా, వినూతన ఆవిష్కరణలు మరియు సరికొత్త అవకాశాల రూపకర్తలుగా విద్య సాధికారత కల్పించే దిశలో ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. ఎన్ఈపీ 2020ని క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వ విద్యాలయాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సమీప గ్రామాలను దత్తత తీసుకుని కృషి చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. విద్యార్థుల మేధస్సు, శక్తి సామర్థ్యాలు సామాజిక, జాతీయ అభివృద్ధికి దోహహదపడే రీతిలో మళ్లించాలని గవర్నరు విజ్ఞప్తి చేశారు. -
వృద్ధుని హత్య కేసులో నిందితుడి అరెస్టు
జయపురం: జయపురం సడితి కుములిపుట్ గ్రామ పంచాయతీ కుములిపుట్లో రఘునాధ్ గౌఢ(60) హత్య కేసులో జయపురం సదర్ పోలీసులు ఆదివారం ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి కుమారి అర్చిత మిత్తల్ పత్రికల వారికి తెలిపారు. అరెస్టు అయిన వ్యక్తి కుమిలిపుట్ టున పొరజ(25)అని ఆమె వెల్లడించారు. వృద్ధుని హత్య సందర్భంగా జయపురం సదర్ పోలీసు అధికారులు సదర్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ నెల 27వ తేదీ సాయంత్రం రఘునాథ్ గౌఢ పంపుణి గ్రమంలో ఒక టీ దుకాణంలో టీ తాగేందుకు వెళ్లాడు. అయితే టీ తాగేందుకు వెళ్లిన రఘునాథ్ తిరిగి ఇంటికి రాలేదు. టీ తాగేందుకు వెళ్లిన తండ్రి రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో అతడి కుమారుడు భగవాన్ గౌడ అన్ని చోట్లా వెతికాడు. అనంతరం కుములి గ్రామం సమీపంలో ఒక కాలువలో రఘునాథ్ గౌడ మృతదేహం చూసిన వారు ఆ విషయం భగవాన్ గౌడకు తెలియజేశారు. అతడు వెళ్లి చూడగా తన తండ్రి మృతదేహం కనిపించింది. శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆయన జయపురం సదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన సదర్ పోలీసులు వెంటనే ససంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించి సైంటిఫిక్ టీమ్కు సమాచారం అందించి రప్పించారు. పోలీసులు సైంటిఫిక్ టీమ్ సహకారంలో దర్యాప్తు ప్రారంభించారని ఎస్డీపీఓ అర్చిత మిత్తల్ వెల్లడించారు. మృతుని కుమారుడు భగవాన్ గౌఢ లిఖిత ఫిర్యాదుపై సదర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు పోలీసులు కుమిలిపుట్ గ్రామం టును పొరజను అరెస్టు చేసారని తెలిపారు. తమదైన శైలిలో టున పొరజను విచారించగా పూర్వ వైరం వల్ల రఘునాథ్ను హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ముందు రఘునాథ్పై రాయితో కొట్టి కాలువలో పడవేసి అనంతరం ఒక కత్తితో అతడి గొంతు కోసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిపారు. అతడిపై హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాదు ప్రారంభించినట్లు ఎస్డీపీఓ వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో సదర్ పోలీసు స్టేషన్ అధికారి సచింద్ర ప్రధాన్, పోలీసు అధికారి కేబీ రామదాస్, కేసు దర్యాప్తు అధికారి ఎస్ఐ ప్రమోద్ పాణి పాల్గొన్నారు. -
‘డబ్బు కట్టినా బావులు తవ్వలేదు’
జయపురం: తమ పంట పొలాలకు సాగునీటి కోసం ప్రభుత్వ నియమం ప్రకారం తమ వంతు డబ్బు రూ.20 వేలు చొప్పున ఎంతో కాలం కిందట కట్టినా నేటికీ గొట్టపు బావుల తవ్వకాలు జరుపలేదని జయపురం సబ్బిజన్ కొట్పాడ్ సమితి ఛతర్ల గ్రామ పంచాయతీ రైతులు శనివారం జయపురం కలెక్టర్ను కలసి వినతి పత్రం సమర్పించినట్లు నేడు ‘సాక్షి’కి తెలిపారు. చతర్ల గ్రామ పంచాయతీకి చెందిన 23 మంది రైతులు రూ.20 వేలు చొప్పున సంబంధిత అధికారులకు డబ్బు చెల్లించినట్లు కలెక్టర్కు విన్నవించారు. డబ్బు కట్టి ఎంతో కాలం అయినా నేటికీ ఆగు నీటి గొట్టపు బావులు తవ్వకాలు ప్రారంభించలేదని రైతులు కలెక్టర్కు సమర్పించిన వినతిపత్రంలో ఆరోపించినట్లు తెలిపారు. గొట్టపు బావులు తీయక పోతే తాము కట్టిన డబ్బు తిప్పి ఇవ్వాలని కోరినా అధికారులు జవాబు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. ఈ విషయం గతంలో కొట్పాడ్లో జరిగిన జన సునానీ అభియోగ శిబిరంలో తాత్కాలిక కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. అందుకే మరోసారి తమ సమస్యను విన్నవించామని పేర్కొన్నారు. -
43 యూనిట్ల రక్తం సేకరణ
రాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో బజరంగదళ్, శ్రీరామ మందిరం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో 43 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో రక్త నిల్వలు కొరత ఏర్పడటంతో గుర్తించిన ఈ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సంస్థలకు చెందిన సభ్యులు, ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానాన్ని చేశారు. డీహెచ్ హెచ్ బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షులు వినయ్ ద్వివేది, కమల్ కుమార్ సింగ్, ప్రకాష్కుమార్ సింహ్, విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ ఉపాధ్యక్షులు ప్రఫుల్ల పాత్రో, శశ్యజ్యోతి బెహర పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ పదవులకు నామినేషన్లు
కొరాపుట్: నబరంగ్పూర్ బార్ అసోసియేషన్ పదవులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 9 పదవులకు గాను 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆదేశాల మేరకు 30 శాతం పదవులు మహిళలకు రిజర్వ్ చేశారు. అధ్యక్ష పదవికి సంతోష్ మిశ్ర, సిరాజుద్దిన్ అహ్మద్ నామినేషన్లు దాఖలు చేశారు. రానున్న 5వ తేదీ నామినేషన్ పత్రాలు పరిశీలన, 8వ తేది ఉపసంహరణ జరుగుతుంది. ఈ ఎన్నికల పరిశీలకులుగా న్యాయ వాదులు సరోజ్ కుమార్ బెహరా, కిశోర్ పట్నయక్, ప్రదీప్ కుమార్ సాహుల వ్యవహరిస్తున్నారు. -
1104 యూనియన్ రీజనల్ కార్యదర్శిగా లోకేశ్వరరావు
అరసవల్లి: ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రీజనల్ కార్యదర్శిగా నక్క లోకేశ్వరరావు, అధ్యక్షునిగా టీవీ సుబ్రహ్మణ్యం (సుబ్బు) ను ఎన్నుకున్నారు. ఈమేరకు డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, ఏవీ రాంప్రసాద్ సంయుక్త అధ్యక్షతన ఆదివా రం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఎమర్జెన్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీర్మానించారు. తదుపరి ఎన్నికల వరకు వీరిని తాత్కాలిక ప్రతినిధులుగా ఎన్నుకున్నట్లుగా ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇటీవల 1104 సంఘ రీజనల్ కార్యదర్శిగా ఉన్న ఎంవీ గోపాలరావును ప్రాఽథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రాప్తికి ఇప్పటివరకు శ్రీకాకుళం రీజనల్ అధ్యక్షునిగా ఉన్న లోకేశ్వరరావును రీజన ల్ కార్యదర్శిగానూ, టీవీ సుబ్రహ్మణ్యాన్ని రీజనల్ అధ్యక్షునిగా తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఈ సమావేశంలో డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ను చండ్ర రాజే శ్వరరావు 1959 మే 3న ఢిల్లీలో స్థాపించారని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వై.వేణు, ఎస్.అన్నాజీలు అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 67 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం వారు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని యువత, నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడే ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ యువజన సమాఖ్యను స్థాపించినట్లు తెలిపా రు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం నిర్విరామ ఉద్యమంలో సమాఖ్య భాగస్వామ్యమైందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులకు వయో పరిమితిని పెంచాలని, వలంటీర్లును యథాతథంగా కొనసాగిస్తూ నెలకు రూ 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, నిరుద్యోగులకు రూ 3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి గార: శ్రీకూర్మం కూర్మనాథుడిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి అధికారులు, అర్చకులు ఎదురేగి స్వాగతం పలికారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్ర మహత్యాన్ని అర్చకులు కిశోర్బాబు, శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి. వాసుదేవరావు, బోర సింహాచలం మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్యవతి శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.సత్యవతి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆదివారం బీసీ ఉద్యోగుల సంఘ సమావేశంలో సత్యవతికి సంఘ అధ్యక్షుడు ఆవుల నరసింహారావు సమక్షంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అందజేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తానన్నారు. సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు చౌదరి పురుషోత్తమనాయుడు ఉన్నారు. మెళియాపుట్టి: పెద్దమడిలో ఉన్న గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల (బాలుర)లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఒక్కో గూపులో 40సీట్లు ఉన్నాయని, చేరడానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సిలింగ్ నిమిత్తం ఈనెల 26న సీతంపేటలోని ఏపీటీడబ్ల్యూ జూనియర్ కళాశాలకు రావాలని తెలిపారు. -
రూ.వంద కోట్ల విలువైన గంజాయి నూనె స్వాధీనం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో నషాముక్త ఒడిశా కార్యక్రమంలో భాగంగా మల్కన్గిరి పోలీసులు ఒక పెద్ద విజయాన్ని సాధించారు. జిల్లా చిత్రకొండ సమితిలో గంజాయి నూనె తయారవుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో ఎస్ఆర్ కంపెనీ సమీపంలో ఆదివారం ఉదయం చిత్రకొండ ఎస్డీపీఓ ప్రదోష్ ప్రధాన్ నాయకత్వంలో ఓ బృందం పోలీసులు పెట్రోలింగ్ ప్రారంభించారు. ఆ సమయంలో వాహనం తనిఖీ చేస్తుండగా స్మగ్లర్ల గుంపు తప్పించుకున్నారు. వాహనంలో మొబైల్ తయారీ యూనిట్తో పాటు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్లో సుమారు 800 లీటర్ల కెమికల్స్, స్వాల్వెంట్లు, 50 కిలోల గంజాయి, 2 లీటర్ల గంజాయి నూనె స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా 800 లీటర్లు గంజాయి నూనె తయారు చేయవచ్చని, దీని విలువ మార్కెట్లో రూ.100 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
వైభవంగా అమ్మవారి పండుగ
● మూడురోజులు జరగనున్న ఉత్సవాలు పర్లాకిమిడి: స్థానిక క్లాత్ మర్చంట్స్, కోమటి వీధిలో నీలమణి దుర్గ అమ్మవారి సంబరాలు ఆదివారం ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వీధిలోకి ఆహ్వానించడానికి మహిళలు పెద్ద ఎత్తున పసుపునీళ్లతో ఒకే రంగు చీరలు కట్టుకుని కాలేజీ రోడ్డులోని గ్రామదేవత నీలమ్మ మందిరానికి సంప్రదాయ నృత్యాలు, డప్పులతో బయలుదేరి వెళ్లారు. నీలమ్మదేవి గుడిలో అమ్మవారికి పూజలు జరిపి పసుపునీళ్లతో అమ్మవారికి చల్లదనం చేశారు. అనంతరం అమ్మవారి అనుగ్రహంతో బుట్టలో పువ్వు పడగానే అందరూ సంతోషించారు. మూడు రోజులపాటు జరిగే అమ్మవారి పండుగలు పదేళ్ల తరువాత మార్కెట్ జంక్షన్ వ్యాపారులు నిర్వహిస్తున్నారు. నీలమ్మదేవి కమిటీ సభ్యులంతా కలసికట్టుగా అమ్మవారి సంబరాలు జరిపించడం విశేషమని ఆడ్వకేటు వి.ఎస్.ఎన్.రాజు, జామి పోలిశెట్టి అన్నారు. -
భర్త తీరుకు విసిగిపోయి..
● వివాహిత ఆత్మహత్య ● భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు జి.సిగడాం: మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన కిమిడి రాజేశ్వరి(27) భర్త వేధింపులు తట్టుకోలేక ఆదివారం 3 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆనందపురం గ్రామానికి చెందిన కొంచాడ సూర్యారావు, యశోదల కుమార్తె రాజేశ్వరిని విశాఖపట్నంలో పోలీస్ బ్యారక్స్ ఎంటీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న కిమిడి శ్యామలరావుకు ఇచ్చి 2019లో వివాహం చేశారు. శ్యామలరావు మద్యం, పేకాట, బెట్టింగ్ ఇతర వ్యసనాలకు బానిసై రాజేశ్వరి దగ్గర ఉన్న బంగారం తీసుకుని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపా రు. భర్త వేధింపులు తట్టుకోలేక రాజేశ్వరి గతనెల 26న వైజాగ్ నుంచి కన్నవారింటికి వచ్చింది. కానీ భర్త తీరుకు విసిగిపోయిన ఆమె ఈ నెల 2న భర్తకు ఫోన్ చేసి ‘నువ్వు వ్యసనాలు మానకపోతే చనిపో తాను’ అని చెప్పింది. శ్యామలరావు ‘చనిపోతే చనిపో..’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఆమె తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కుంది. ఈ దంపతులకు 18 నెలల బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కోరుకొండ రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. జేఆర్ పురం సీఐ అవతారం దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తే కారణమంటూ.. తన కుమార్తె రాజేశ్వరి మృతికి తన భర్త, అత్తమామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు యశోద, సూర్యారావు ఆరోపించారు. భర్త తీరుకు విసిగిపోయే ఆమె ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ కేఏ సూరి, ఏఎస్ఐ రామకృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజేశ్వరి భర్త శ్యామలరావు,అత్త మామలు, చిన్నమ్మడు, తవిటినాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. -
10వ తరగతి ఫలితాలు విడుదల
● జిల్లా టాపర్గా శుభశ్రీ నాయక్ మల్కన్గిరి: ఒడిశా బోర్డు పదవ తరగతి పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మల్కన్గిరి జిల్లా టాపర్గా 94 శాతం మార్కులు సాధించి బలిమెల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని శుభశ్రీ నాయక్ (94/16 శాతం) జిల్లా టాపర్గా నిలిచింది. మల్కన్గిరి జిల్లాలో 22 మంది విద్యార్థులు 90 శాతం ఎక్కువ మార్కులు సాధించగా, 66 మంది 80 శాతం కంటే పైగా మార్కులు సాధించారు. దక్షిణ ఒడిశా ఇతర జిల్లాల్లో కూడా అధిక శాతంలో పాస్ అయ్యారు. విజయంపై జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులను సాధించారని అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అభినందించారు. -
స్వాధీనం చేసుకున్నవి..
నిందితులైన సాహు, బిహారీ, బారిక్, తపన్ల నుంచి రూ. 31.50 లక్షల విలువైన 243 గ్రాముల బంగారు ఆభరణాలు, తిరుమల పాత్రో నుంచి రూ. 3.41 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాహు నుంచి 9 ఎం.ఎం. పిస్టల్, కాట్రిడ్జ్ లు ఐదు, బారిక్ నుంచి 7.65 ఎం.ఎం. పిస్టల్, రెండు మ్యాగ్జీన్లు, 11 కాట్రిడ్జ్లు స్వాధీనం చేశా రు. 11 మొబై ళ్లు, ఒక మహేంద్ర నియోకార్తో పాటు బంగా రం అమ్మగా వచ్చిన సొమ్ముతో ఒడిశాలో కొన్న డస్టర్, ఎక్స్యూవీ, బొలేనో కారులను స్వాధీ నం చేసుకున్నామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ వెల్లడించారు. -
నేటినుంచి అమ్మవారి సంబరాలు
పర్లాకిమిడి: స్థానిక 9వ వార్డు మార్కెట్ క్లాత్ మర్చెంట్స్ వీధిలో నీలమ్మ అమ్మవారి సంబరాలు ఆదివారం నుంచి ప్రారంభవుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ దేవత నీలమ్మను ఆదివారం వీధిలో కోలువు ఉంచుతారు. సోమవారం నుంచి అమ్మవారికి కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తారు. బుధవారం వేకువజామున అమ్మవారి అనుపోత్సవం ఉంటుందని కమిటీ తెలియజేశారు. వైశాఖ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంలోని చిన్నబజారులో ఉన్న దూదివారి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. తులసి, కుసుమాల మాలలతో గోవిందుడు కనువిందు చేశాడు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా.. గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు. – శ్రీకాకుళం కల్చరల్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస గ్రామంలో జాతీ య రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఐసర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధు డు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల రామ్మూర్తి (91) తన పొలంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే గుర్తు తెలియని వాహ నం శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి లావేరు ఎస్ఐ వెళ్లి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అనంతరం హైవేపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఐసర్ వ్యాన్గా గుర్తించారు. నరసన్నపేట సమీపంలో టోల్ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్కు చెందిన ఐసర్ వ్యానుగా గుర్తించి పట్టుకున్నారు. మృతుడికి భార్య నారాయణమ్మ, కుమార్తె ఈశ్వర మ్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీర్ పరివార్ సహాయత యోజన–2025’ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని లీగల్ సర్వీస్ అథారిటీ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సైనిక కుటుంబాలకు ఎదురయ్యే ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర న్యాయపరమైన చిక్కులను ఈ పథకం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. జిల్లా, రాష్ట్ర జాతీయ సైనిక సంక్షేమ బోర్డుల సమన్వయంతో ఈ పథకం పనిచేస్తుందని, ఇందులో అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయవాదులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండి తగిన న్యాయ సలహాలు అందిస్తారని ఆయన వివరించారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న దోపిడీ నేర ఘటనల నేపథ్యంలో బంగారం దుకాణాల వర్తకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్ప ష్టం చేశారు. ఆయన శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఉంచుకోవాలన్నా రు. పూండి గోవిందపురానికి చెందిన భారీ కేసుకు సంబంధించి బీహార్కు చెందిన గ్యాంగు ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో ఉన్నారని అక్కడి పోలీసులతో సమన్వయం చేస్తున్నామన్నారు. నరసన్నపేటలో భారీ చోరీ కేసుకు సంబంధించి అక్కడి డీజీతో మాట్లాడామని చెప్పారన్నారు. బంతి నా కోర్టులోనే ఉంది.. అరసవల్లి వీవీఐపీ పాసులు కేసు ముగియలేదని ఎస్పీ తెలిపారు. బంతి తన కోర్టులోనే ఉందని, సరైన సమయంలో స్పందిస్తామని అన్నారు. సారవకోట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా త్వరలో యూపీఐ పేమెంట్స్కు అవకాశం కల్పించనున్న ట్లు డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ తెలిపారు. శనివారం ఆయ న మండల కేంద్రంలోని డీసీసీ బీ బ్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా యూపీఐ పేమెంట్స్ నిర్వహించేందుకు ఆర్బీఐ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని రెండు, మూడు రోజుల్లో యూపీఐ పేమెంట్స్కు అవకాశం క ల్పించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 28 చోట్ల ఏటీఎం కేంద్రాల ను ఏర్పాటు చేశామని వాటిలో చాలా వరకు యంత్రాలు పాడై పోవడంతో వాటిని తొలగిస్తామని 5 చోట్ల మాత్రమే ఏటీఎం కేంద్రాలను ఉంచనున్నామన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి అండర్ –11 బాలబాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపి కై న క్రీడాకారుల జాబితాను చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్, చెస్ ఇన్స్కూ ల్స్ రాష్ట్ర కన్వీనర్ సనపల భీమారావు సంయుక్తంగా వెల్లడించా రు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం నగగరంలోని పీఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా నాలుగు రౌండ్ల పాటు జరిగిన జిల్లాస్థాయి అండర్–11 బాలబాలికల చెస్ ఎంపిక పోటీల్లో రాణించి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలు విశాఖపట్నం వేదికగా ఈనెల 9,10 తేదీల్లో జరగనున్నాయి. ఈ పోటీలకు జిల్లా నుంచి బాలురు విభాగంలో అన్నెపు శశాంక్, బోయిన సూర్యజతిన్, బాలికల విభాగంలో ఎం.రిత్విక, మెట్ట తీక్షణ ఎంపికై న వారిలో ఉన్నారు. -
ఘనంగా బెజ్జిపురం యూత్ క్లబ్ వార్షికోత్సవం
రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురంలో యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం 45వ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరై స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావులు జెండా ఆవిష్కరణ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తూ దేశీయ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, యూత్ క్లబ్ బెజ్జిపురం అధ్యక్షుడు మేడూరి ప్రసాదరావు, సభ్యులు ఇజ్జాడ శ్రీనివాసరావు, పి.మధుబాబు తదితరులు పాల్గొన్నారు. -
కొండపై కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తల సర్వే
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని నారాయణపురం రెవెన్యూ పరిధిలో ఉన్న కొండపై కేంద్ర భూగర్భ ఖనిజాల సర్వే బృందం గ్రాఫైట్ వంటి ఖనిజాలు వెలికితీతకు శనివారం సర్వే చేపట్టింది. తొలుత స్థానిక తహశీల్దార్కు గానీ, గ్రామ రెవెన్యూ అధికారికి గానీ, స్థానిక అధికారులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం రైతులకు తెలియజేయకుండా సర్వే చేపట్టడం గమనార్హం. దీనిని గమనించిన స్థానిక రైతులు అధికారులకు సమాచారం అందించారు. గ్రామ రెవెన్యూ అధికారి వచ్చి ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యాలయానికి వీరిని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నారాయణపురం భూములు తరతరాలుగా సాగుచేస్తున్న స్థానిక రైతులు పుట్టా మల్లేసు, తోనంగి నందోడు, కోరాడ అప్పన్నలు మాట్లాడుతూ ఇక్కడ ఖనిజాలు ఉన్నాయంటూ తమ భూములను లాక్కోవాలని చూస్తే పోరాడుతామన్నారు. వీటినే నమ్ముకుని దళిత, బీసీ, పేద రైతులు తరతరాల నుంచి బతుకుతున్నామని చెప్పారు. కొండకు ఆనుకుని ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యాలయం, అంబేడ్కర్ వర్శిటీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలు, చుట్టూ గ్రామాలున్నాయన్నారు. కొండ ప్రాంతంలో మైనింగ్ చేస్తే పర్యావరణం నాశనం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మైనింగ్కు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. -
వినూత్నంగా కార్మిక దినోత్సవం
జయపురం: సహజంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులే ఘనంగా నిర్వహిస్తారు. జయపురం ఏనుగుల శాల ప్రాంతంలో గల సెయింట్ జావియర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో వినూత్నంగా మే డే నిర్వహించారు. కార్మికులు అంటే ఫాక్టరీలలో, భవణ నిర్మానం చేసేవారు, కూలీలు, శ్రామికులే కాదని పాఠశాలలో పిల్లలకు విద్యాభోదన చేసేవారు కూడా కార్మికులేనన్న భావనతో ఆ పాఠశాల యాజమాన్యం భావించింది. దేశ ప్రగతికి, సమాజ ఉన్నతి కోసం శ్రమించిన వారంతా కార్మికులేనన్నారు. మేడే సందర్భంగా ఉపాధ్యాయులను పాఠశాల ప్రధాన మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాస పట్నాయక్ సత్కరించారు. -
డెకాయిట్లు కేరాఫ్ ఒడిశా, యూపీ
● వీడిన కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యుయలరీ షాపు దొంగతనం కేసు ● పట్టుబడిన ఒడిశా డెకాయిట్లు ●ప్లాన్ చేసిన యూపీ గ్యాంగ్ కోసం గాలింపు ● 243 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : ఒడిశా డెకాయిట్లకు యూపీ దొంగలు జత కలి శారు. పక్కాగా స్కెచ్ వేసి, ఆపై రెక్కీ చేసి బంగా రం కొల్లగొట్టారు. గత నెల 7న కాశీబుగ్గ నిత్యానందనగర్ కాలనీలో మారుమూలనున్న శ్రీవేంకటేశ్వర జ్యూయలర్స్ దుకాణంలోకి పట్టపగలు చొరబడి దోపిడీకి ఎగబడ్డారు. చోరీకి ఎగబడిన వారిలో ఒడిశాకు చెందిన డెకాయిట్లు ఐదుగురు కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో కేసు మిస్టరీ వీడింది. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత నెల 7న కాశీబుగ్గ నిత్యానందనగర్లో శ్రీవెంకటేశ్వర జ్యూయలర్స్లో పట్టపగలు పోలీసు అధికారులమని లోపలకు ప్రవేశించి యజమాని చేతులకు బేడీలు వేసి 800 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత నగదు దోచేసి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీనిపై యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ దర్యాప్తులో 4 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఉపయోగించిన వాహనాల వివరాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ముందుగా కారును ట్రేస్ చేసిన పోలీసులు క్రయ విక్రయాలు, ఆధార్, మొబైల్ నంబర్లు సేకరించి మిగతా నిందితుల ఫోన్ నంబర్లు గుర్తించి కేసును ఛేదించారు. ఒడిశా నుంచి వలస వచ్చి.. ఒడిశాలోని అస్కాలో గోల్డ్షాపు రన్ చేసిన పొట్నూ రు తిరుమల పాత్రో (56) వ్యాపారం సరిగా సాగక నాలుగేళ్ల క్రితమే కాశీబుగ్గ చేరి జీడిపప్పు క్రయవిక్రయాలు జరుపుతూ స్థానికులతో నమ్మకంగా మెలిగాడు. దొంగలు తెచ్చే బంగారాన్ని కాశీబుగ్గలోని వివిధ నగల దుకాణాలకు అమ్ముతూ ఆ సొమ్మును దొంగలకు చేరుస్తూ కొంత భాగం తాను ఉంచుకుంటూ పబ్బం గడుపుతుండేవాడు. ఇక్కడి షాపుల వివరాలు డెకాయిట్లకు చెబుతుండేవాడు. దీనిలో భాగంగా రామకృష్ణ షాపుపైనా కన్నేసి పథకం రచించి తోటి సహచరులతో రెక్కీ చేయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఒడిశా గంజాం జిల్లాకు చెందిన కూన బారిక్ (36), రామచంద్రసాహు, మరికొందరితో గత ఏడాది డిసెంబరు 25న, ఈ ఏడాది మార్చి 22, 24 తేదీల్లో తిరుమల పాత్రో రెక్కీ చేశాడు. నిందితులు గత నెల 5న భువనేశ్వర్ నుంచి బయల్దేరి మహేంద్రగిరి చేరి అక్కడ రాత్రి బస చేశారు. 6న ఉదయం బయల్దేరి కేదారిపురం వద్దకు 3 ద్విచక్రవాహనాలు, ఓ నల్లని కారులో చేరారు. కారును కేదారిపురం సమీప లేఅవుట్లో పార్కింగ్ చేసి బైక్లపై కాశీ బుగ్గ పట్టణానికి ఉదయమే చేరినా షాపు త్వరగా మూసేయడంతో వెనుదిరిగారు. 7న అదే మార్గంలో వచ్చి పక్కా గా ప్లాన్ను అమలు చేసి ఉడాయించేశారు. అయితే ఏడుగురు నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారని, యూపీ గ్యాంగు కూడా వెనకుండటంతో వారు ఎ లా ఎస్కేప్ అయ్యారు. ఎవరికి బంగారాన్ని చేర్చా రన్నదీ ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. అందరూ డెకాయిట్లే.. ఒడిశా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దోపిడీ నేరాలకు పాల్పడిన అనుభవమున్న వీరందరిపై 32 కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో రామచంద్రసాహు, బనోజ్ బిహారీ పట్నాయిక్ లపై చెరో 6 డెకాయిట్ కేసులుండగా పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భంలో ఇరువురూ ఫైరింగ్ చేసిన ఘనత కూడా ఉంది. అత్యధికంగా కూన బారిక్పై 14 డెకాయిట్, 8 చోరీ కేసులుండగా, తపన్ మహరాణాపై ఒక డెకాయిట్, ఒక హర్ట్ కేసు ఉంది. కాశీబుగ్గలో పాతుకుపోయిన పాత్రోపై 4 డెకాయిట్ కేసులుండటం గమనార్హం. -
రాజకీయ కక్షతో పింఛన్ల నిలిపివేత
పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో రాజకీయ కక్షతో అర్హులైన వారి పింఛన్లను నిలుపుద ల చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఏడుగురు లబ్ధి దారులు తమ పింఛన్లు కోల్పోయారు. శనివారంతో మూడు నెలలు గడువు ముగియడంతో బాధిత పింఛన్దారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయం వద్ద పడిగాపులు కాశారు. ఎన్ని రామారావు, సంపతిరావు వేదాంతినాయుడు, గురుగుబెల్లి బంతమ్మ, సీపాన సూర్యనారాయణ, యారబాటి దాలయ్య, సంపతిరావు నేపాలరాజు, పాతిన జగన్నాథంలు పంచాయతీ కార్యదర్శిని, ఎంపీడీఓను పలుమార్లు కలిసినప్పటికీ పింఛన్లు పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని, కనీసం ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదని బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. దీంతో సచివాలయం వద్దే తమ నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ జరుపకుండానే తమ పింఛన్లను నిలుపుదల చేశారని వాపోతున్నారు. ఇదే విషయంపై వివరణ కోరేందుకు ఎంపీడీఓకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
ఆటో ప్రమాదం తీరని ఆవేదన మిగిల్చింది
పాలకొండ రూరల్: సీతంపేట మండలం మేడకో ట, పాలకొండ మండలం జంపరకోట మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఆటో ప్రమాద ఘటనలో నలుగురు మృత్యువాత పడటం తీరని ఆవేదన మిగిల్చిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శనివా రం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ నాయకులతో కలిసి జంపరకోట, డోమల గ్రామాలకు వెళ్లారు. ప్రమాద ఘటనలో మరణించిన ఆరిక లక్ష్మి, కొండగొర్రి శ్రావణి, ఉర్లక శాంతి, ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులు, క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డి.నీలం ఆనందరావు, టి.భుజంగరావు, బి.పైల ప్రభాకర్, జంప రకోటకు చెందిన ఎ.నారాయణ, జి.శ్రీనివాసరావు, రాజాన క్రిష్ణ, వైస్ ఎంపీపీ కనపాక సూర్యప్రకాష్, నాయకులు రణస్థలం రాంబాబు, పి.దవళేశ్వరావు, కె.బాబురావు నాయుడు, పి.వాసునాయుడు, ఎల్.శ్యాంబాబు, పి.శ్రీను, ఎం.శశిభూషణ్, ఆర్.లక్ష్ముంనాయుడు, పి.సురేష్, ఉదయ్కుమార్, వై.గౌరినాయుడు, కొత్తకోట అనంతరావు తదితరులున్నారు. -
గ్రాఫ్ పెయింటింగ్పై తర్ఫీదు
పాలకొండ రూరల్: పాలకొండ శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు గ్రాఫ్ పైయింటింగ్పై డ్రా యింగ్ ఉపాధ్యాయుడు జి.మురళీ తర్ఫీదు అందించారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం లైసిడా అనే పద్ధతిలో హ్యాండ్ రైటింగ్పై పట్టు సాధించటంపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు బబ్బూరి గణేష్బాబు మాట్లాడుతూ.. పఠనంతో అనంత విజ్ఞానం పొందవచ్చన్నారు. సున్నాలు గీయటం వలన చేతి కదలికలు స్పష్టంగా మారి చక్కటి చేతి రాతను సొంతం చేసు కోవచ్చని ఉపాధ్యాయులు నూకాల నగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయు లు వెంకటరమణ, రాకోటి మల్లేష్, ఈశ్వర్ తదితరులు చరిత్ర సంబంధిత కథలను పిల్లలకు వినిపించారు. -
ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, శ్రీకాకుళం అర్బన్లో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్నందున ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్డీవో సాయిప్రత్యూష ఆదేశించారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో శనివారం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్)–2026లో భాగంగా 2022 ఓటర్ల జాబితాతో 2026 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేయాలన్నారు. ఇప్పటివరకు గార 77.74 శాతం, శ్రీకాకుళం రూరల్ 79.86 శాతం, శ్రీకాకుళం అర్బన్లో 47 శాతం పూర్తయ్యిందన్నారు. పారదర్శక జాబితా తయారీకి సలహాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం తహసీల్దార్ ఎస్.గణపతిరావు, గార తహసీల్దార్ చక్రవర్తి, అర్బన్ ఎఈఆర్వో జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు రౌతు శంకరరావు, ఈశ్వరి, ఎం.వెంకటేష్, శ్రీనివాసరావు, రాధాకృష్ణ రెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు.


