breaking news
Odisha News
-
మృతదేహాలకు భద్రతేదీ..!
మౌలిక సదుపాయాలు లేని మార్చురీ విభాగం వైద్యం దయనీయం మంత్రి అచ్చెన్నాయుడి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యం దయనీయంగా మారిందని చెప్ప డానికి మార్చురీ విభాగం దుస్థితి ఒక నిదర్శనం. కొన్ని నెలల క్రితం కొత్త ఆస్పత్రి వద్ద మార్చురీ భవనం పనులు ప్రారంభించినప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నా యి. దీంతో పాత ఆస్పత్రి వద్ద మార్చురీ విభాగంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట మృతదేహాలను భద్రపరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా అధికార యంత్రాంగం స్పందించాలి. – సత్తారు సత్యం, వైఎస్సార్సీపీ నాయకుడు, టెక్కలి టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనం వద్ద మార్చురీ విభాగం పూర్తిగా దీనావస్థకు చేరుకుంది. కొత్త ఆస్పత్రిలో మార్చురీ విభాగం పనులు పూర్తి కాకపోవడంతో, పాత ఆస్పత్రికి ఆనుకుని మార్చురీ విభాగం కొనసాగుతోంది. అయితే ఇక్కడ విద్యుత్, ఫ్రీజర్ సదు పాయం, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఒక్కోసారి చీకటిపడిన తర్వాత మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలకు కనీసం భద్రత లేని దుస్థితి చోటు చేసుకుంటోంది. దీనిపై పలు సందర్భాల్లో మృతుల బంధువులు ఆస్పత్రి సిబ్బంది బహిరంగంగానే ఆందోళన చేసినప్పటికీ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు. మార్చురీ వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో మృతుల బంధువులే కాపలా కాసుకునే దుస్థితి దాపురిస్తోంది. నత్తనడకన పనులు ఇదిలా ఉండగా కొత్త ఆస్పత్రిలో మార్చురీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతే కాకుండా ఆస్పత్రికి వెనుక వైపు మార్చురీ నిర్మాణం చేయాలని సూచనలు ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా పాత గేటు మార్గంలో ఓపీకి ఎదురుగా మార్చురీ భవనం నిర్మాణం చేస్తుండడంతో అనేక విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మార్చురీ విభాగంలో ఎటువంటి మౌలిక సదుపాయలు లేక దీనావస్థలో ఉండడం, మరోవైపు కొత్త ఆస్పత్రి వద్ద మార్చురీ భవన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంతో మృతదేహాల భద్రతపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. పనులు పూర్తయితే తరలిస్తాం కొత్త ఆస్పత్రిలో ఆగస్టు నెలాఖరులోగా మార్చురీ భవనం పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ భవ న నిర్మాణం పనులు పూర్తయితే మార్చురీని తరలిస్తాం. – సూర్యారావు, ఆస్పత్రి సూపరింటెండెంట్, టెక్కలి -
బలవంతపు భూసేకరణ నిలిపేయాలి
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, బలవంతపు భూసేకరణ నిలిపేయాలని కోరుతూ ఎయిర్పోర్టు బాధిత గ్రామాల్లో రైతులు, వామపక్ష నాయకులు, వివిధ సంఘాల నేతలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రతిఘటన తప్పదని వారంతా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒంకులూరులో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలుస్తూ వారికి ప్రయోజనాలను చేకూర్చేలా పాలన సాగించాలే తప్ప.. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి ప్రజల భూములను లూటీ చేసేలా వ్యవహరించడం తగదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కార్గోఎయిర్ పోర్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యవసాయ శాఖ మంత్రివా లేక విధ్వంస శాఖ మంత్రివా అంటూ అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. కొబ్బరి, జీడి, మామిడి, పనస లాంటి పచ్చని పంటలతో విరాజిల్లుతున్న ఉద్దాన ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఢిల్లీలాంటి మహానగరంలో 150 ఎకరాల్లో మాత్రమే కార్గో ఎయిర్పోర్టు ఉంటే ఇక్కడ 1,400 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఉద్దానం జీడి పంటను కార్గో ఎయిర్పోర్టు పేరుతో నాశనం చేస్తే పర్యవరణంలో పాటు లక్షలాది మంది రైతులు, జీడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్రావు, సీపీఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఎం.రామారావు, పీఓడబ్యూ జిల్లా కార్యదర్శి పి.కుసుమ తదితరులు పాల్గొన్నారు. భళా మోక్షశ్రీ శ్రీకాకుళం: బలగలో నివాసముంటున్న వంజరాపు సాయికుమార్, రమ్య దంపతుల కుమార్తె మోక్షశ్రీ ప్రపంచ రికార్డు సాధించింది. రెండేళ్ల ఎనిమిది నెలల వయసులోనే కెమిస్ట్రీ సబ్జెక్టులోని 30 మూలకాలను 23.37 సెకెండ్లలో చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. జూలై 16న ఆన్లైన్ విధానంలో ఈ ఘనత సాధించింది. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రం మంగళవారం తల్లిదండ్రులకు చేరింది. మోక్షశ్రీ తల్లి రమ్య మత్స్యశాఖలో సాగర మిత్రగా పనిచేస్తుండగా, తండ్రి సాయికుమార్ సిమెంట్ బొమ్మలను తయారు చేస్తుంటారు. వీరి స్వస్థలం హిరమండలం అయినప్పటికీ ఉద్యోగరీత్యా దంపతులు బలగలో నివాసముంటున్నారు. -
అధికారులకు అవార్డులు
రాయగడ: రాజధాని భువనేశ్వర్లోని లోక్సేవా భవనంలో బుధవారం ఆకాంక్ష జిల్లాల కలెక్టర్లు, సమితి కేంద్రాల అధికారులకు ముఖ్యమంత్రి మోహన్చరణ్ మఝి బుధవారం పురస్కారాలు అందజేశారు. రాయగడ జిల్లాలోని మునిగుడ, పద్మపూర్ సమితుల బీడీఓలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి కూడా పాల్గొన్నారు. గర్భిణుల నమోదు ప్రక్రియ, మధుమేహ స్క్రీనింగ్ పరీక్షలు, బీపీ, మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆరోగ్య కార్డుల పంపిణీ తదితర అంశాల్లో సమర్థంగా బాధ్యతలను నిర్వర్తించినందుకు మునిగుడ బీడీఓ కృష్ణ చంద్ర దలపతికి కాంస్య పథకం, పద్మపూర్ బీడీఓ కురేష్కుమార్ జానీకి రజత పతకం ప్రదానం చేశారు. ● పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత నాలుగు పతకాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. నీతి అయోగ్ ద్వారా 2018లో గుర్తించిన ఆకాంక్ష బ్లాకులు గుమ్మాబ్లాక్ బి.డీ.ఓ. దులారాం మరాండికి రజత పతకం, ఆర్.ఉదయగిరి బ్లాక్ బీడి.ఓ.లారీమాన్ ఖర్సల్కు కాంస్య పతకం, పూర్వ కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్కు ప్రత్యేక పురస్కారం అందజేశారు. ● మల్కన్గిరి: ఆరు విభాగాల్లో మల్కన్గిరి జిల్లా అధికారులు పతకాలు సాధించారు. పతకాలు అందుకున్న వారిలో పూర్వ కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పాటిల్, జిల్లా అభివృద్ధిఅధికారి నరేశ్చంద్ర శబర్, చిత్రకొండ సమితి బీడీఓ ప్రీతాకుమారీ, ఖోయిర్పూట్ బీడీఓ ఉమా శంకర్ కోయా, మత్తిలి బీడీఓ ప్రమోద్ కుమార్ బెహరా పతకాలు అందాయి. -
● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలు కీలకం ● చర్యలు తీసుకోవాలని అధికారుల సూచనలు
కవిటి: ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ వరిసాగు విస్తృత స్థాయిలో సాగుతోంది. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంటల్లో అధిక దిగుబడుల సాధనకు రైతులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే పంటల పెరుగుదలకు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతో అవసరమని సోంపేట సబ్ డివిజన్ ఏడీఏ టి.భవానీశంకర్ తెలిపారు. నత్రజని, భాస్వరం, పొటాష్ అందుబాటులో ఉన్నా, సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. జింక్, ఇనుము, బోరాన్, రాగి, మాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ వంటి మూలకాలను సూక్ష్మపోషకాలు అంటారు. నేలలో ఏ ఒక్క సూక్ష్మ పోషక పదార్థం లోపం ఉన్నా సరైన ఫలితం ఇవ్వదు. అందువలన నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని పంట లోపాలు నివారించుకోవాలని సూచించారు. జింక్: మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాల సమర్థ వినియోగానికి జింక్ చాలా అవసరం. లోపం: జింక్ లోపం ఉంటే మొక్క పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. నాటి న రెండు నుంచి నాలుగు వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇది మిగతా ఆకు అంతటా వ్యాపిస్తుంది. ఆకులు గిడసబారి దుబ్బు చేయవు. పైరుకు నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చగా ఉండదు నివారణ చర్యలు: వరి పండించే భూముల్లో ప్రతీమూడు సార్లుకు ఒకసారి, రబీ సీజన్ రెండు పంటలు పండించే భూముల్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చల్లుకోవాలి. భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ కలిపి వేయరాదు. వీటి మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. జింక్ సల్ఫేట్ వేయలేని పరిస్థితుల్లో పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి ఐదు రోజుల -
సూక్ష్మంతోనే.. దిగుబడులకు మోక్షం..!
ఖరీఫ్ వరినారులో కనిపిస్తున్న సూక్ష్మధాతు లోపం సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలు మట్టి పరీక్ష: నేలలో ఏ సూక్ష్మధాతువు లోపించిందో తెలు సుకునేందుకు పంటకాలం ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఎరువుల యాజమాన్యం:మట్టిపరీక్ష ఫలితాల ఆధారంగా సూక్ష్మధాతువులను అందించే ఎరువులను అందించాలి. పచ్చిరొట్ట పైర్లసాగు: సూక్ష్మధాతు లోపాల నివారణ కు సేంద్రియ వ్యవసాయ విధానాలు మేలు చేస్తా యి. ఇందులో ప్రధానంగా పంట సీజన్ ప్రారంభంలో కుళ్లిన పశువుల గత్తం, వర్మీ కంపోస్టును భూమి లో చల్లుకొని కలియదున్నాలి. జీలుగు, పిల్లిపెసర, నవధాన్యాల సాగువంటి విధానాలతో పచ్చిరొట్ట పైర్లను పెంచి దమ్ము సమయంలో వీటిని భూమిలో కలియదున్నాలి. దీనికి అదనంగా ఎకరానికి కనీసం 100 కిలోల సింగిల్ సూపర్ఫాస్పేట్ను పైపాటుగా వేసుకుంటే పచ్చిరొట్ట పైరును బాగా కుళ్లిస్తుంది. దీనిద్వారా ఆ భూమిలో సేంద్రియ కర్బనంతో పాటుగా సూక్ష్మధాతువుల స్థిరీకరణకు సహాయపడుతుంది. వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇనుము: ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇను ము ఆధారం. ఇది పిండి పదార్థం తయారీకి ఉపయోగపడుతుంది. అధిక క్షార భూముల్లో, సున్నపు రాయి పాలు ఎక్కువగా గల నేలలు, తేలిక నేలల్లో, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో ఇనుప దాతు లోపాలు కనిపిస్తాయి. మెట్టవరి, మెట్ట నారుమళ్లలో ఇనుప దాతులోపం సాధారణంగా కనిపిస్తుంది. నివారణ చర్యలు: ఒక లీటర్ నీటికి 20 గ్రాముల అన్న భేది, రెండు గ్రాముల నిమ్మ ఉప్పులో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మిగతా సూక్ష్మ పోషకాలు తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. మార్కెట్లో అన్ని సూక్ష్మ పోషకాల మిశ్రమం ఆగ్రోమినిమార్క్స్ రూపంలో ఫార్ములా–4 రూపంలో లభ్యమవుతాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని బట్టి పైరులో వీటిని తగిన సమయంలో వాడి అధిక దిగుబడి పొందవచ్చు. -
ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
ఎచ్చెర్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపోను విడదీసి, టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి 3 తరాలుగా డిపోలో పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టవద్దని కోరారు. ఈ మేరకు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు బుధవారం ధర్నా నిర్వహించారు. 1986లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి 100 మంది దళిత కుటుంబాలకు చెందిన 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకొని, ఎచ్చెర్ల లో యారక్ బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేసింద ని గుర్తు చేశారు. ప్రభుత్వం సారా తయారీ కేంద్రంలో దళిత కుటుంబాలకు కార్మికులుగా, హమాలీలు గా ఉపాధిని కల్పించారన్నారు. అనంతరం ఐఎంఎల్ డిపోగా మారిన ఈ కేంద్రంలో పనిచేస్తూ 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నా రు. ఎచ్చెర్లలో సొంత గోడౌన్లలో మద్యం సరఫరా చేస్తుంటే, అదనంగా టెక్కలిలో మరో డిపో అద్దెకు తీసుకుని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. దీనివలన అద్దెల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసి నా, వినతిపత్రాలు అందించినా ప్రభుత్వంలో చల నం లేకపోవడం శోచనీయమన్నారు.కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ నాయకులు టి.రామారావు, ఎం.సురేష్, రాము, జి.గురుమూర్తి, పట్నాన రామారావు,ఎల్.సీతారాం, ముద్దాడ రాజు, కేవీ రమణ పాల్గొన్నారు. -
లోకాయుక్త ఫిర్యాదుపై సర్వే
జి.సిగడాం: మండల కేంద్రంలోని 92/8 సర్వే నంబరులో ఉన్న భూమిని కొంతమంది ఆక్రమించి కల్యాణ మండపంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇటీవల పి.జగదీశ్వరరావు అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 14వ తేదీన మండల సర్వేయర్, తహసీల్దార్ సమక్షంలో సర్వే చేపట్టారు. వీరు చేసిన సర్వే సక్రమంగా లేదని, జిల్లాస్థాయి అధికారులతో సర్వే చేపట్టాలని జగదీశ్వరరావు మరలా కోరారు. దీంతో బుధవా రం లోకాయుక్త అధికారి సమక్షంలో ఆ భూమిని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఏడీలు కె.రమే ష్, కె.రమణమూర్తి, డీఐవోలు అనుపోజు వెంకటేశ్వరరావు, ఎ.మన్మథరావు అధ్వర్యంలో సర్వే చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు. -
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం
జయపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు తొమ్మిదో తేదీన ఘనంగా నిర్వహించాలని జయపురం ఆదివాసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ విషయమై స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో ఆదివాసీ సంఘ అధ్యక్షులు జితేంద్ర నాయిక్ అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించి చర్చించారు. సమావేశంలో జయపురం సమితి, మున్సిపాలిటీ ప్రాంతాలలోని ఎనిమిది ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హాజరై చర్చచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు సూర్యమహల్ కూడలి నుంచి పట్టణ ప్రధాన మార్గం మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయం వరకు భ్యారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ర్యాలీలో కొరాపుట్ జిల్లాలోనిఅన్ని ఆదివాసీ తెగల ప్రజలు తమ సంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఏటా లాగనే ఈసారి కూడా ఉత్సవాలను అంగరంగ వైభవంగా.. ధూం ధాంగా నిర్వహించాలని నిశ్చయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సూర్యమహాల్ ప్రాంతానికి బొండా బాగ్ మందిరం వద్ద గదబ, పరజ, పెండియ, అమనాత్య, భొత్ర, కంధ, భూమియ మొదలగు సాంప్రదాయ ఆదివాసీ ప్రజలు చేరుకోవాలన్నారు. అక్కడ బొండాబాగ్కు పూజలు చేసి బయలు దేరే ర్యాలీలో ఆదివాసీ ప్రజలు సంప్రదాయ దుస్తులతో పాల్గొనేలా చూడాలని సమావేశం వెల్లడించింది. అలాగే వివిధ ఆదివాసీ నృత్య, వాయిద్యాలు, సంగీతాలతో పాల్గొంటాయని సమావేశంలో పాల్గొన్న సంఘ నాయకులు వెల్లడించారు. ర్యాలీ సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరిన తరువాత ఆదివాసీ ప్రజల వివిధ సమస్యలపై సబ్కలెక్టర్ మెమోరాండం సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో జయపురం సమితి చైర్మన్ తిలోత్తమ ముదులి, అమనాత్య సమాజ్ ఉపాధ్యక్షులు ప్రఫుల్ల అమనాత్య, పెండియ సమాజ్ ఉపాధ్యక్షులు టంకుధర హల్వ, జయపురం పట్టణ పరజ సమాజ్ బాసుదేవ్ నాయిక్, రొండాపల్లి సర్పంచ్ ఆనంద హల్వ, అంత గ్రామ సర్పంచ్ బాబుల దిసారి, సౌర సమాజ్ అధ్యక్షులు దొయితారి సౌర, కార్యదర్శి చరణ సౌర, పొరజ సమాజ్ ప్రతినిధి బేణు నాయిక్, గదబ సమాజ్ ప్రతినిధి జుదిష్టర్ గదబ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి తిమింగలం గోవిందరాజులు
● ఆయనకు వైఎస్ జగన్ను విమర్శించే అర్హత లేదు ● మండిపడిన వైఎస్సార్సీపీ నాయకులు టెక్కలి: కోటబొమ్మాళి మండలంలో బోయిన గోవిందరాజులు అనే వ్యక్తి ఒక అవినీతి తిమింగలమని, అతడికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదని మేజర్ పంచాయతీ సర్పంచ్ కాళ్ల సంజీవరావు, ఎంపీటీసీ కె.శ్రీనివాస్రెడ్డి, నాయకులు కె.విశ్వనాథరెడ్డి, డబ్బీరు ప్రదీప్లు మండిపడ్డారు. ఇటీవల టీడీపీ నాయకుడు గోవిందరాజులు చేసిన విమర్శలను ఖండిస్తూ బుధవారం కోటబొమ్మాళిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను తాకట్టుపెట్టిన నాయకులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులు అని, అందుకే ఈరోజు వారికి రాష్ట్ర, కేంద్రమంత్రి పదవు లు ఇచ్చారని పేర్కొన్నారు. కోటబొమ్మాళిలో సర్వే నంబర్ 280/6లో 20 ఎకరాలు కొనుగోలు చేసుకు ని, ఆ స్థలానికి ఆనుకుని ఉన్న సుమారు 10 ఎకరా ల కొండ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి గోవిందరాజులు అని మండిపడ్డారు. కోటబొమ్మాళి పంచాయతీలో సుమారు 28.34 ఎకరాల చెరువులో దాదాపు 8 ఎకరాలు ఆక్రమించుకుని, ఆ భూమిలో గోవిందరాజులు రైస్ మిల్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. సుమారు 40 ఏళ్ల టీడీపీ పాలనలో కింజరాపు కుటుంబం అండతో ప్రజలు, రైతులను మోసం చేసి, బ్యాంకులను బురిడి కొట్టించి కోట్లాది రూపా యుల సొమ్మును కాజేసిన వ్యక్తి గోవిందరాజులు అని దుమ్మెత్తిపోశారు. విమర్శలు చేయడం విడ్డూరం బ్యాంకు రుణాలు తీసుకుని, వాటిని కట్టకుండా రాజకీయ అండతో అక్రమాలకు పాల్పడిన గోవిందరాజులు వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ఆయనతో పాటు ఆయన సోదరుడికి ఎంత అప్రతిష్ట ఉందో రైస్ మిల్లర్లకు తెలుసునని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాలో చేసిన అభివృద్ధి కనిపించలేదా అని నిలదీశారు. మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పత్రి, ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన నీరు వంటి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేశారు. కింజరాపు కుటుంబం దోచుకుంటున్న సొమ్ముతో పావలా వడ్డీకి డబ్బులు తెచ్చుకొని, వాటితో దోపిడీలు చేస్తున్న గోవిందరాజులు వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే అతని అవినీతి బండారం మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల నాయకులు రోణంకి ఉమా మల్లయ్య, బి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడి జయిస్తేనే విజయం
రాయగడ: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురైతే చదువుతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రాకేష్ రంజన్ పాడి అన్నారు. స్థానిక పితామహాల్లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బుధవారం మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. మానసిక ఇబ్బందులను ముందుగానే గుర్తించి వాటి నివారణకు సహకరించాలని సూచించారు. టొల్ ఫ్రీ నంబరు 14416 ద్వారా కూడా సలహాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో నర్శింగ్ విభాగం అధ్యాపకులు పి.రవితేజ, సునీల్ కర్, ప్రణతిదాస్, హిమాన్షు బెహరా తదితరులు పాల్గొన్నారు. -
భాండాగారం చిత్రాల విడుదలపై ఆగ్రహం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం సముదాయంలో జగన్నాథుని రత్న భాండాగారం చిత్రాలను భారత పురావస్తు సర్వే సంస్థ ఏఎస్ఐ సాంఘిక మాధ్యమంలో విడుదల చేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద కుమార్ పాఢి ఏఎస్ఐకి లేఖ రాశారు. రహస్యంగా ఉండాల్సిన శ్రీ మందిరం లోపలి ప్రాకారం ఫొటోలు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రసారం చేసిన వారిని గుర్తించి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే పర్లాకిమిడి: గజపతి జిల్లా కొత్త కలెక్టర్ మధుమితను బుధవారం మోహానా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు దాశరథి గోమాంగో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజపతిజిల్లాలో ఆర్.ఉదయగిరి బ్లాక్ ఆకాంక్ష సమితిగా ముఖ్యమంత్రి పురస్కారం పొందినందుకు అభినందనలు తెలియజేశారు. చెరువు పనులపై ఎమ్మెల్యే సమీక్ష పర్లాకిమిడి: స్థానిక కొత్త బస్టాండ్ రోడ్డు శంకర్బాస్ చెరువు పునరుద్ధరణ పనులపై బుధవారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సమీక్షించారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న శంకర్బాస్ చెరువు, చుట్ట పక్కల పార్క్ పనులు సుమారు రూ.70 లక్షలతో పునరుద్ధిరిస్తున్నారు. ఈ పనులను పీడబ్ల్యూడీ శాఖకు అందజేశారు. ఈ శంకర్బాస్ పనులను సకాలంలో పూర్తిచేయాలని రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. సాంకేతికతను సద్వినియోగపరచుకోవాలి ఇచ్ఛాపురం రూరల్: వరి సాగులో మూస ధోరణికి స్వస్తి పలుకుతూ రైతులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ ఉప సంచాలకులు టి.భవానీశంకర్ అన్నారు. బిర్లంగిలో రైతులకు డ్రోన్ వినియోగంపై బుధవారం అవగాహన కల్పించారు. ఒక ఎకరానికి మందు పిచికారీ చేసేందుకు కేవలం పది నిమిషాల సమయం పడుతుందన్నారు. -
కొత్త కలెక్టర్ను కలిసిన జెడ్పీ ప్రెసిడెంట్
కొరాపుట్: ఇటీవల కొరాపుట్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యవాన్ మహాజన్ను జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వెనుకబడిన గిరిజన జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రి జిల్లా సమాచార, ప్రజాసంపర్క అధికారి ప్రమిళామాఝి గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల నివేదికను చదివి వినిపించారు. ఈ ఏడాది కూడా ఆమె నేతృత్వంలోనే దూమ్ధమ్గా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7.30 నుండి ఎనిమిది గంటల్లోపు ప్రతి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలపై జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం డీఎన్కే క్రీడా మైదానంలో నిర్వహించే జెండా ఆవిష్కరణ కోసం అతిథులను స్వాగతిస్తామన్నారు. ఈ ఏడాది పది, 12 తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను సత్కరించడం, పరేడ్ నిర్వహణపై చర్చించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఉపాధ్యాయుడు అరెస్టు రాయగడ: ఒడిశా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఓటీఈటీ) ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనకు సంబంధించి ఓ ఉపాధ్యాయుడిని ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్న వార్తలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఈ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. జిల్లాలోని మునిగుడ సమితి పరిధిలో గల డొంగొరొబొడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బిజయ మిశ్రాను క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ భువనేశ్వర్: బొగ్గు ఉత్పత్తి రంగంలో జాతీయ స్థాయిలో ఒడిశా అగ్రగామిగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 269.36 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 254.63 మిలియన్ టన్నుల బొగ్గు ్జ పలు ప్రాంతాలకు ఎగుమతి చేసింది. గత మూడు సంవత్సరాలలో ఏ విద్యుత్ ప్లాంట్ బొగ్గు కొరతను ఎదుర్కొలేదు. ఒడిశాలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదల దేశానికి ప్రయోజనకరంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి.కిషన్ రెడ్డి పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భద్రక్లో పాఠశాలలకు సెలవు భువనేశ్వర్: భద్రక్ జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ధామ్నగర్, తిహిడి, బాసుదేవ్పూర్ ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు. -
విషాహారం తిని మహిళ మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి బేజాంగివాడ పంచాయతీ బటినీగూడలో విషాహారం తిని ఓ మహిళ మృతిచెందింది. భీమే ముసాకి(50) అనే మహిళ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. అర్ధరాత్రి వేళ ఆమె కేకలు వేయడంతో అందరూ వెళ్లి పరిశీలించారు. అప్పటికే నోటి నుంచి నురగలు రావడంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషాహారం తినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందింది. ఐఐసీ ముకుందో మేల్క దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య విమాన సౌకర్యం భువనేశ్వర్: రాష్ట్రంలో విమానయాన సౌకర్యాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. త్వరలో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఝార్సుగుడ ప్రాంతానికి ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యం ఆగస్టు 16 నుంచి అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బుధవారం తెలిపారు. బి–మాన్ కార్యక్రమం కింద ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెడుతన్నట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్ – ఝార్సుగూడ మధ్య వారానికి 5 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వారం పొడవునా ఈ సేవలు కల్పించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. -
అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
● రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయలాంటే అందరి సహకారం అవసరమని జిల్లా నయతన కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అతనికి రాయగడ పాత్రికేయుల సంఘం బుధవారం కలెక్టర్లో అభినందించింది. సంఘం సాధారణ కార్యదర్శి శివాజీ దాస్ ఆధ్వర్యంలో సభ్యులు సురేష్ నాయక్, రాజేష్ కుమార్ మహాంతి, అమూల్య నిషాంక, మనోజ్ మిశ్రా, ధరణీధర్ పట్నాయక్, సంఘం ముఖ్య సలహాదారుడు సురేష్ దాస్ తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కాసేపు కలెక్టర్ పాత్రికేయులతో ముచ్చటించి ఇక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయుల దృష్టికి వచ్చిన సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని.. అందుకు అంతా సహకరించాలని కలక్టర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మౌలిక వసతులకు సంబంఽధించి దృష్టికి వచ్చే సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. -
అధికారుల తీరుపై అసంతృప్తి
జయపురం: సర్పంచ్లను అనేక విషయాలలో అధికారులు పట్టించుకోవటంలేదని కొట్పాడ్ సమితి సర్పంచ్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొట్పాడ్ సమితి సతరంగ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొట్పాడ్ సమితి సర్పంచ్ సంఘ సమావేశం బుధవారం జరిగింది. సంఘం అధ్యక్షుడు దేవ మఝి అధ్యక్షతన జరిగిన సమావేశం కొట్పాడ్ సమితిలోని అన్ని పంచాయతీల అభివృద్ధి, పంచాయతీ ప్రజలను అన్ని ప్రభుత్వ పథకాలలో మమేకం చేసే విషయంపై చర్చించింది. సర్పంచ్లను అనేక రంగాలలో నిర్లక్ష్యం చేస్తున్నారని పలువరు సర్పంచ్లు సమావేశంలో వెల్లడించగా సంఘం తీవ్రంగా స్పందించింది. సర్పంచ్ల పట్ల అధికారుల తీరుపై సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొట్పాడ్ సమితిలో ఉద్యోగులు, ఇంజినీర్లతో సర్పంచ్లు మంచి సంబంధాలు కలిగి, అభివృద్ధి కార్యక్రమాలలో సహకరించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. పంచాయతీ సిబ్బంది సర్పంచ్లకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేయాలని విజ్ఞప్తి చేసింది. రానున్న రోజులలో పీఈఓల (పంచాయతీ కార్యనిర్వాహక అధికారి) అందరితో ప్రతి నెలా సమావేశం నిర్వహించాలని సర్పంచ్ల సంఘం నిర్ణయింది. పంచాయతీలలో అన్ని అభివృద్ధి పనులు సమైఖ్యంగా అందరం కలిసి చేయాలని, అందుకు సర్పంచ్లు అందరూ ఐకమత్యంగా ఉండి ప్రజల డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని సమావేశం తీర్మానించింది. ఇందుకు సర్పంచ్లు అందరూ సహకరించాలని అధ్యక్షుడు దేవ మఝి విజ్ఞప్తి చేశారు. -
జయపూర్ మహారాజతో గిరిజనులు భేటీ
కొరాపుట్: జయపూర్ మహారాజు విశ్వేశ్వర చంద్రచుడ్తో నందపూర్ గిరిజనులు భేటీ అయ్యారు. సూర్యవంశం రాజులు నందపూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అనంతరం నారాయణ పట్న, చివరకు జయపూర్ను రాజధానిగా మార్చుకొని పాలన సాగించారు. నందపూర్ రాజధానిగా ఉన్నప్పుడు 1932లో 32 మెట్ల సింహాసనం నిర్మించారు. దాని పైనుంచి రాజ దర్బార్ కొనసాగింది. ఇప్పటికీ ఈ సింహాసనం ఉంది. ఆ సింహాసనంపై 32వ మహారాజు వినాయక్ దేవ్, లీలావతి దంపతుల విగ్రహాలు పెట్టాలని గిరిజనుల విజ్ఞప్తి చేశారు. దీనిపై రాజు సానుకూలంగా స్పందించి విగ్రహాల ఏర్పాటుకు నిధులు పంపిస్తానన్నారు. అప్పట్లో రాజదర్బార్ ఉన్న భవనాన్ని బ్రిటీషర్లు ట్రెజరీ, తహశీల్దార్ కార్యాలయాలుగా వినియోగించుకున్నారు. నూతన భవనంలోకి ప్రభుత్వ కార్యాలయాలు మారడంతో ఆ రాజ భవనాన్ని మ్యూజియంగా మార్చాలని గిరిజనుల విజ్ఞప్తి చేశారు. రాజును కలిసిన వారిలో నందపూర్కి చెందిన మున్న దళపతి తదితరులు ఉన్నారు. -
జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా సమితి సీంద్రమాల పంచాయతీ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బిభూతి ముండాగుడియాను పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రహి మంగళవారం సన్మానించారు. ఇట్టివల మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయ స్థాయి హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచింది. ఆటలపై ఉన్న ఇష్టాన్ని గమనించి కోరుకొండ సమితిలో స్వామీ శివానంద పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయురాలు జ్యోత్స్న మహంతి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. కస్తూర్బా పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు సనాతన్ ప్రదాన్ కూడా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వంసతి పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
పక్కాగా సహాయక చర్యలు
● వరద ప్రాంతాల ఏరియల్ వ్యూలో సీఎం మోహన్చరణ్ మాఝి ● 3 జిల్లాల్లో 8 మండలాలు మునక ● 81 గ్రామాల్లో 30 వేల మందిపై ప్రభావం భువనేశ్వర్: వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బాలాసోర్, భద్రక్, జాజ్పూర్ జిల్లాల్లో వరద పరిస్థితిపై బుధవారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయనతో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్, ప్రత్యేక సహాయ కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్ ఉన్నారు. ప్రభావిత జిల్లాల్లో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ నేపథ్యంలో స్థానిక లోక్ సేవాభవన్లో అనుబంధ విభాగాల, శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. 3 జిల్లాల్లో 8 మండలాల 81 గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లాలో 4 మండలాలు బొస్తా, బలియాపాల్, భొగరాయ్, జలేశ్వర్, భద్రక్ జిల్లాలో ఽ2 మండలాలు దామ్నగర్, భండారిపొఖొరి, జాజ్పూర్ జిల్లాలోని 2 మండలాలు జాజ్పూర్,దశరథ్పూర్ ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వరదల వల్ల దాదాపు 30 వేల మంది ప్రభావితం అయ్యారని చెప్పారు. వరద ముంపుతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి 5,869 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ప్రస్తుతం వివిధ నదులలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోందని, బాలాసోర్ జిల్లాలో సువర్ణ రేఖ, జలకా నదులలో నీటి మట్టం తగ్గుగుముఖం పడుతోందన్నారు. ప్రస్తుతానికి వరద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, కెందుఝొరొ, మరికొన్ని జిల్లాల్లో వరదలు వచ్చినప్పటికీ గణనీయమైన ప్రభావాన్ని చూపలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి బాధిత ప్రజలకు అటుకులు, బెల్లం పొడి పదార్థాలు, అవసరమైతే వండిన తాజా ఆహార సరఫరా మరో 7 రోజులపాటు నిరవధికంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాలాసోర్లో 16, భద్రక్లో 10, జాజ్పూర్లో 3 ఉచిత వంట శాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటి ఆధ్వర్యంలో 10 వేల మంది బాధిత ప్రజలకు వండిన ఆహారాన్ని అందజేస్తుమన్నారు. వరదల తదనంతర సమస్యలు నేపథ్యంలో యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అతిసార, ఇతర నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ, నీటి వనరులను శుద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సత్వర నివేదిక ఆదేశాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని తక్షణ అంచనా వేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్ల నివేదిక ఆధారంగా బాధిత ప్రజలకు తగిన సహాయం అందజేస్తామన్నారు. కూలిన ఇల్లు, పాడి పశువుల పరిహారం, గ్రామీణ ప్రాంతాల్లో వరద కోతకు గురైన రహదారుల మరమ్మతులు, ప్రధాన మార్గానికి అనుసంధాన కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపుతో ప్రాణ నష్టం జరగకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బాలసోర్ జిల్లాలో 17 ఒడ్రాఫ్, 13 అగ్నిమాపక బృందాలను, భద్రక్ జిల్లాలో 1 ఎన్డీఆర్ఎఫ్, ఒక ఒడ్రాఫ్, 13 అగ్నిమాపక బృందాలను, జాజ్పూర్ జిల్లాలో 1 ఒడ్రాఫ్, 14 అగ్నిమాపక బృందాలను మోహరించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. -
హే జగన్నాథా..!
● శ్రీమందిరానికి భద్రత లోపం ● సోషల్ మీడియాలో రత్న భాండాగారం ఫొటోలు వైరల్ ● ఫొటోలు పోస్టు చేసిన భారత పురావస్తు శాఖ ● విస్మయం వ్యక్తం చేస్తున్న భక్తజనం భువనేశ్వర్: ప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామివారి శ్రీమందిరం అభద్రతా వ్యవస్థ నడుమ కొట్టుమిట్టాడుతోంది. గత కొద్దికాలంగా ఈ దేవస్థానంపై ఉగ్రవాదులు కన్నువేసి ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల కాలంలో శ్రీమందిరం కనీస భద్రతని కూడా నోచుకోలేని దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయి. భద్రత సంబంధిత లోపాలు తలెత్తిన ప్రతిసారీ శ్రీమందిరం పాలకవర్గం, రాష్ట్ర న్యాయశాఖ ఇతర అనుబంధ బాధ్యతాయుతమైన అధికార వర్గాలు బాధ్యులైన వారికి వ్యతిరేకంగా చర్యలు చేపడతామని మీడియాలో అట్టహాసంగా ప్రకటించి, విస్తృత ప్రచారం తర్వాత అంతా సద్దుమణగడం ఆనవాయితీగా మారింది. దీంతో ఆలయం లోపలి ప్రాంగణానికి పరిమితం కావాల్సిన ఆచార వ్యవహారాలు, ఆలయ కట్టడాలు వగైరా బాహ్య ప్రపంచంలో సోషల్ మీడియా వేదికగా బట్టబయలవుతున్నాయి. ఈ చర్యలపై బాధ్యతాయుతమైన అధికార వర్గాల చర్యల నిర్వీర్యత ప్రభావంతో ఈసారి మరో పెద్ద ఘోరం తెరకెక్కింది. సోషల్ మీడియాలో వైరల్ పూరీ జగన్నాథుడు సిరిమంతుడు. స్వామివారి ఆస్తులు, నగలు, ఆభరణాలు వగైరాకు సంబంధించి వాస్తవ లెక్కలు, జమలు దాదాపు ఎవరికీ తెలియవు. అలాగే అత్యంత అమూల్యమైన స్వామి ఆభరణాలు ఇతర సొత్తు గోప్యంగా రత్న భాండాగారంలో పదిలపరచి ఉంటుంది. ఇది నిత్యం అగణిత భక్తులు, యాత్రికులు సందర్శించే శ్రీమందిరం ప్రాంగణంలోనే నెలకొని ఉంది. అయితే ఎక్కడ ఉంది అనే విషయం ఇంతవరకు సాధారణ భక్తజనులకు తెలియదు. అంతటి గోప్యమైన రహస్య రత్న భాండాగారం ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్రసారానికి సాక్షాత్తు భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ సారథ్యం వహించింది. పురాతన కట్టడాలు, ప్రాముఖ్యత, అనుబంధ విలువల పరిరక్షణలో కీలక పాత్రధారిగా వెలుగొందుతున్న ఏఎస్ఐ ఇటువంటి బహిర్గతానికి పాల్పడడం భక్తజన హృదయాల్ని కలచి వేస్తోంది. రాష్ట్రంలో సాధారణ ప్రజలకు కనీస భద్రత, రక్షణ కొరవడిందని గగ్గోలు ఎత్తుతున్న తరుణంలో, సాక్షాత్తు జగతినాథునికి రక్షణ, భద్రత కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలువునా విఫలమైందనే ఆరోపణలతో దద్దరిల్లుతోంది. జగన్నాథ స్వామివారి రత్న భాండాగారం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రత్న భాండాగారం పవిత్రతను భక్తులు ఎంతో గౌరవిస్తారు. భారత పురావస్తు శాఖ శ్రీమందిరం ప్రాంగణం లోపలి ప్రాకారంలో రత్న భాండాగారం చిత్రాలను బాహ్య ప్రపంచానికి బహిరంగపరచడం ఉద్దేశపూర్వక చర్యగా కాకపోయినా, మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాల ప్రసారంపై రేగిన మనోభావాలకు ప్రతిస్పందనగా భారత పురావస్తు శాఖ చిత్రాలను తొలగించి పారదర్శకత చాటుకునే దిశలో పావులు కదుపుతోంది. తీవ్ర విచారం మహాప్రభు జగన్నాథునిపై భారత పురావస్తు సర్వే సంస్థ, భారత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రత్న భాండాగారం చిత్రాలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఘోర అపచారమని విపక్ష బిజూ జనతా దళ్ నాయకుడు డాక్టర్ అమర్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సువిశాల శ్రీమందిరం ప్రాంగణంలో రత్న భాండాగారం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. మహాప్రభు ఆభరణాలు మరియు అమూల్యమైన సంపద భద్రతకు భంగం కలిగించేలా భారత పురావస్తు శాఖ భాండాగారం ఉనికిని సమగ్ర ప్రపంచానికి ప్రచారం చేసినట్లు అయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, శ్రీజగన్నాథ ఆలయ అథారిటీ (ఎస్జేటీఏ), పూరీ అధికార వర్గాలు ఇతరేతర సమస్త విభాగాలు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిపై అంకిత భావంతో సేవలు అందిస్తారని సమగ్ర భక్త జన వర్గం పూర్తిగా విశ్వసిస్తుంది. ఏఎస్ఐ దుశ్చర్యతో ఈ విశ్వాసం బీటలు వారింది. ఈ విశ్వాసాన్ని కూడగట్టుకునే ప్రయత్నంలో సాంఘిక మాధ్యమం వేదిక నుంచి రహస్యమయమైన ఫొటోలు తొలగించింది. అయితే ఇంతలోనే జరగరాని నష్టం జరిగి పోయిందని డాక్టర్ అమర్ పట్నాయక్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరించారు. ఒడియా ఆత్మ గౌరవం (అస్మిత)ను రక్షించడం కోసమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, ఈ విచారకర సంఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం వెంటనే నిందితులకు వ్యతిరేకంగా ఎప్ఐఆర్, కేసులు నమోదు నమోదు చేస్తుందా అని నిలదీశారు. ఈ సంఘటనపై ప్రత్యక్షంగా చొరవ కల్పించుకునేందుకు పూరీ గజపతి మహారాజా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించడం అనివార్యమని హితవు పలికారు. -
దర్జాగా ప్రభుత్వ స్థలం కబ్జా
టెక్కలి: కోటబొమ్మాళి మండల కేంద్రంలో ప్రకాశ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ కార్యకర్తలు కొంత మంది దర్జాగా అక్రమ నిర్మా ణం చేస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటంతో కాలనీవాసులు స్పందించి సర్పంచ్ కాళ్ల సంజీవరావు సహకారంతో మంగళవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడ మే కాకుండా ఆందోళన చేపట్టారు. ప్రకాశ్నగర్ కాలనీలో కొంత మంది అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆందోళన బాట పడతామంటూ హెచ్చరించారు. -
కారు ఢీకొని ఇద్దరు మృతి
జయపురం: సబ్ డివిజన్ బొరిగుమ్మ పోలీసుస్టేషన్ పరిధి 26వ జాతీయ రహదారి పిండాగుడ జంక్షన్లో కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు బొరిగుమ్మకు చెందిన రోహితేశ్వర బెహర(55) కాగా, మరోవ్యక్తి పిండాగుడ గ్రామానికి చెందిన గోపాల హరిజన్(57)గా గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రోహితేశ్వర బెహర, గోపాల్ హరిజన్లు పిండాగుడ గ్రామం జంక్షన్ 26వ జాతీయ రహదారి పక్కన నిలుచొని మాట్లాడుతుండగా, జయపురం నుంచి బొరిగుమ్మ వైపు వేగంగా వస్తున్న ఒక ఇండికా కారు వారిని ఢీకొంది. దీంతో ఇరువురూ దూరంగా ఎగిరిపడ్డారు. సమాచారం అందిన వెంటనే బొరిగుమ్మ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన స్థలంలోనే ఇరువురూ మృతి చెందారని బొరిగుమ్మ పోలీసులు వెల్లడించారు. అయితే కారు డ్రైవర్ పరారైనట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కారు డ్రైవర్ను త్వరలోనే పట్టుకుంటామని దర్యాప్తు అధికారి సస్మిత నాయక్ వెల్లడించారు. బీజేడీ ఎంపీల నిరసన భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా బిజూ జనతా దళ్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మంగళవారం నిరసన తెలిపారు. వర్షం కురుస్తున్నా గొడుగులు వేసుకుని ప్లకార్డులతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒడిశా ప్రభుత్వం నిష్క్రియాత్మకతను వీరంతా ఖండించారు. జవాబుదారీతనం, బలమైన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఒడిశా రక్త సిక్తం, గాడ నిద్రలో బీజేపీ’ ‘ఒడిశా ప్రభుత్వం మౌనం సిగ్గుచేటు’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలాసోర్ నుంచి బొలంగా వరకు మహిళలపై దారుణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురిపై కేసు నమోదు భువనేశ్వర్: బొలంగీరు జిల్లా టిట్లాగడ్ బాగ్డేర్ గ్రామంలో పసికందు అమ్మకం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. చిన్నారిని కన్న తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతులను దర్యాప్తు బృందం ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఈ ఘటనపై టిట్లాగడ్ సీడీపీవో స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బిడ్డ ను కన్న తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతుల వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారు. కాపుగోపాలపురంలో చైన్స్నాచింగ్ పాతపట్నం : చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా దాడులకు ఎగబడుతున్నారు. పాతపట్నం మండలం కాపు గోపాలపురంలో సోమవారం సాయంత్రం చైన్స్నాచింగ్ చోటుచేసుకుంది. పాతపట్నం మేజర్ పంచాయతీ కోటగుడి కాలనీకి చెందిన దంపతులు కాళ్ల జ్యోతి, నారాయణరావులు పశువులకు కుడితి పెట్టడానికి కాపుగోపాలపురంలోని నీలకంఠేశ్వర ఆలయం సమీపంలోని పశువులశాల వద్దకు బైక్పై వెళ్లారు. భార్యని దించేసి నారాయణరావు కాపుగోపాలపురం వచ్చేశారు. జ్యోతి పశువుల శాల వైపు కుడితి పెట్టడానికి బకెట్తో వెళుతుండగా వెనుక నుంచి బైక్పై ఇద్దరు దొంగలు వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. జ్యోతి కేకలు వేసేసరికే పర్లాకిమిడి వైపు పారిపోయారు. రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ జరిగిందని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ బి.లావణ్య తెలిపారు. -
రైలు ఢీకొని యువకుడు మృతి
నరసన్నపేట : కామేశ్వరిపేట సమీపంలో రైల్వే ట్రాక్పై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఉర్లాం రైల్వేస్టేషన్ మాస్టర్ నుంచి సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించగా మృతుడు శ్రీకాకుళం టౌన్ బలగ పరిధిలోని బుచ్చిపేటకు చెందిన జడుగుల చిట్టిబాబు(31)గా గుర్తించినట్లు హెచ్సీ మదుసూదనరావు తెలిపారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందన్నారు. సోమవారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
34 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి ముంబైకి 34.32 కిలోల గంజాయి తరలిస్తున్న సంతున్ దాసు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు, పోలీసు సిబ్బంది మంగళవారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్, చిదంబరీశ్వర ఆలయ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం ఖరియాగూడా ప్రాంతానికి చెందిన సంతున్దాసు అనుమానాస్పదంగా కనిపించడంతో లగేజీని తనిఖీచేశారు. అందులో 34.32 కిలోల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారించారు. తన గ్రామంలోని రైతుల వద్ద గంజాయి కొని ముంబైలోని లొబొకుండ అనే వ్యక్తికి అందజేసేందుకు వెళ్తున్నట్లు గుర్తించారు. గంజాయితోపాటు ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. -
జె.ఆర్.పురంలో వ్యాన్ బీభత్సం
రణస్థలం: రణస్థలంలో జాతీయ రహదారిపై ఐషర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం వైపు నుంచి నరసన్నపేట వెళ్తున్న ఈ వ్యాన్ మంగళవారం సాయంత్రం దన్నానపేట వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న ఈసర్ల రాంబాబు అనే వ్యక్తిని ఢీకొట్టింది. కొంతదూరం ముందుకొచ్చి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా అత్యంత రద్దీగా ఉండే రామతీర్థాలు కూడలి వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వ్యాన్ ఆగకపోతే పెను ప్రమాదం జరిగేది. జె.ఆర్.పురం పోలీసులులు స్పందించి జేసీబీ సాయంతో వ్యాన్ను పక్కకు నెట్టారు. ఈ ఘటనలో లావేరు మండలం పైడియ్యవలసకు చెందిన ఈసర్ల రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో రణస్థలం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ, రెండు బైకులను ఢీకొట్టిన వైనం డ్రైవర్కు దేహశుద్ధి చేసిన స్థానికులు -
హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన
రాయగడ: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హాస్పిటల్ సఫాయి, హౌస్ కీపింగ్ సిబ్బంది మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బారిజొల వద్దనున్న జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన సిబ్బంది, తమ డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సఫాయి, హౌస్ కీపింగ్ చేస్తున్న సిబ్బందికి గుత్తేదారు సంస్థ సకాలంలో వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ప్రతీ నెలలో జమచేయాలన్నారు. ఆల్ ఒడిశా హాస్పిటల్ సఫాయి కర్మచారి రాయగడ శాఖ అధ్యక్షులు నేహా సింహ్, కస్తూరీ నాయక్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు జోగేశ్వర్ దాస్, కార్యదర్శి గణేష్ కుమార్ సాహు, ఉపాధ్యక్షుడు మాధవ ఘొష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీజగన్నాథుని ముఖ చిత్రాలతో డోర్మ్యాట్లు
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని ముఖ పోలికలతో రూపొందించిన డోర్మ్యాట్ల విక్రయ ప్రకటన వివాదాస్పదం అయింది. ఆలీ ఎక్స్ప్రెస్ అనే వెబ్సైట్ శ్రీజగన్నాథుని ముఖం ఉన్న డోర్మ్యాట్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నట్లు ప్రసారం చేసింది. ఈ ప్రసారం బహిరంగం కావడంతో వివాదం చెలరేగింది. పవిత్ర స్వరూపంగా భావించే శ్రీజన్నాథుని చక్ర నయనాలపై కాలు మోపడం, తుడుచుకోవడం అపచారంగా పరిగణించిన భక్తజనం విచారం వ్యక్తం చేసింది. ఈ చర్యకు వ్యతిరేకంగా తక్షణమే చర్యలు చేపట్టాలని పలు సేవా సంస్థలు స్థానిక సింహద్వారం ఠాణాలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జగన్నాథుని ప్రతిమను సాధారణ వస్తువుగా ఉపయోగించడం హిందూమతంపై ఉన్న అగౌరవాన్ని స్పష్టం చేస్తుంది. ఈ దారుణమైన తప్పును సరిదిద్దడానికి తక్షణ చర్యలు తప్పనిసరి అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. చర్యలు తీసుకోవాలని భక్తుల ఆగ్రహం -
విద్యార్థిని మృతిపై దర్యాప్తునకు ఆదేశం
రాయగడ: సదరు సమితి కూలిలోని ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థిని దివ్య మండంగి మలేరియా వ్యాధితో మృతి చెందిన ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్గా సోమవారం బాధ్యతలు చేపట్టిన అశుతోష్ కులకర్ణి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, మూడు రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ఈ కమిటీలో ఉన్నారు. ఈ దర్యాప్తు కమిటీ ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అక్కడ వాస్తవాలను పరిశీలిస్తారు. అదేవిధంగా మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను కలిసి వారి అభిప్రాయాలను సైతం సేకరిస్తారు. కొద్దిరోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని దివ్య మండంగి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి నిర్వాహకులు చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బరంపురం తరలించాలని జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు చెప్పడంతో అప్పుడు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు బరంపురం తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థిని మృతి చెందిందని కుటుంబీకులు, గ్రామస్తులు ఆశ్రమ పాఠశాల వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. -
భారీగా గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్ మూడో నంబర్ ప్లాట్ ఫారంలో గంజాయితో ఒక యువకుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెన వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రోహన్గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు సోమవారం రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్లాట్ ఫారం నంబర్ మూడులో అనుమానాస్పదంగా కనిపించిన ఒక యువకుడి బ్యాగు తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు. అంగన్వాడీ కేంద్రానికి తాళాలు జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి ఝడిగుడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి స్థానికులు తాళాలు వేశారు. కేంద్రానికి అంగన్వాడీ కార్యకర్త సక్రమంగా రాకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని ఆగ్రహించారు. సదరు కార్యకర్త వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారని ఆరోపించారు. పౌష్టికాహారం పిల్లలకు, మహిళలకు సరఫరా చేయకుండా స్టోర్ రూంలో ఉంచుతున్నారని, దీంతో అవి పురుగులు పడుతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని ఇదివరకే ఐసీడీఎస్ సూపర్వైజర్కు తెలియజేశామన్నారు. సీడీపీవో, సూపర్వైజర్లు గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరించేవరకు తాళాలు తెరవనివ్వమని స్పష్టం చేశారు. దీనిపై సీడీపీవో సబిత బ్రహ్మ స్పందించి గ్రామస్తుల ఆరోపణలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విదేశీ మద్యం స్వాధీనం రాయగడ: అక్రమంగా కారులో విదేశీ మద్యాన్ని తరలిస్తున్న ఒక యువకుడిని మునిగుడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 123.480 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, రవాణాకు వినియోగించే కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. మునిగుడలో విదేశీ మద్యం జోరుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మూల విరాటులకు మహాస్నానం భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై మూల విరాటులకు మంగళవారం మహాస్నానం చేయించడం అనివార్యం అయింది. ఆలయం లోపల ఒక సేవకుడు పడిపోయి రక్తస్రావం కావడంతో ఆలయం పవిత్రతకు భంగం వాటిళ్లినట్లు పరిగణించి ఈ చర్య చేపట్టారు. దీంతో సాధారణ భక్తుల సర్వ దర్శనం ప్రభావితం అయింది. తాత్కాలికంగా కొన్ని గంటల పాటు దర్శనం నిలిపి వేశారు. స్వామివారి ప్రాతఃకాల ధూప సేవ కోసం సువారొ బొడు సేవకుడు శ్రీమందిర గర్భగుడిలో పూలు మరియు పాత్రలను అమర్చుతుండగా జారిపడిపోయాడు. ముఖానికి గాయమై రక్తం నేలపై చిమ్మింది. పొహడొ ఉఠా మహాస్నానంగా పేర్కొనే ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా ప్రధాన దేవతలు మరియు ఆలయం స్వచ్ఛత పునరుద్ధరణకు మహాస్నానం నిర్వహించారు. ఆలయ ఆచారాల ప్రకారం ఆలయ ప్రాంగణంలో రక్తస్రావం, వాంతులు ఇతరేతర అపరిశుభ్రతకు సంబంధించిన ఏదైనా సంఘటన చోటుచేసుకుంటే ఆలయం, దేవతల పవిత్రతను పునరుద్ధరించేందుకు మహాస్నానం నిర్వహిస్తారు. -
అధ్యాపకులకు శిక్షణ శిబిరం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయం మానవ వనరుల వికాస కేంద్రం ఆధ్వర్యంలో దాదాపు 70 కళాశాలల అధ్యాపకులకు శిక్షణ శిబిరం మంగళవారం నిర్వహించారు. మానవ వనరుల విభాగ వికాస కేంద్రం డైరెక్టర్ చీఫ్ డాక్టర్ దేవదత్త ఇండోరియా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ విద్యా విధానం ఆధారంగా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ మిశ్ర ముఖ్య అతిథిగా పాల్గొని మానవ వనరుల వికాస విభాగ అధికారులను ప్రశంసించారు. స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో మాట్లాడుతూ.. అనేక కళాశాలల్లో అవసరమైనంత మంది అధ్యాపకులు లేకపోవడం వలన సమస్యగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ కార్యదర్శి మహేశ్వర చంద్ర నాయిక్, కొరాపుట్ కేంద్ర విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ రమేంద్ర కుమార్ పాడీ, రెవెన్సా వర్సిటీ విశ్రాంత అధ్యాపకులు గోరంగ చంద్రనంద తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి
● డైట్ విద్యార్థుల నిరసన జయపురం: స్థానిక జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(డైట్)లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థినిని ఒక అధ్యాపకురాలు మానసికంగా వేధిస్తోందని డైట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డైట్ ప్రధాన గేట్ ముందు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి నిరసన తెలుపుతూ అధ్యాపకురాలిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డైట్ ప్రిన్సిపాల్ రూపచంద్ర సొరెన్ విద్యార్థుల వద్దకు వచ్చి చర్చించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. అధ్యాపకురాలు స్వాతి 7 నెలలుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. డైట్ అధికారులు ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయగా, ఆమె అన్ అఫీషియల్గా మరో గ్రూప్ రూపొందించారని వెల్లడించారు. ఆ గ్రూపులో అర్థరాత్రి వివిధ రకాల మెసేజ్లు చేస్తున్నారని, వ్యక్తిగతంగా ఆక్షేపిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు లేకపోతే ఎందుకు చదువుతున్నారని ఒక విద్యార్థినిని అందరి ఎదుట అవమానించారని పేర్కొన్నారు. దీంతో సదరు విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించిందని వాపోయారు. ఈ విషయంపై శనివారం ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అయితే సోమవారం చర్చిద్దామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారని, చర్చలకు అందరూ వచ్చినా అధ్యాపకురాలు స్వాతి రాకపోవడంతో సాయంత్రం 6 గంటల వరకు చూసి ఆందోళనకు దిగామని పేర్కొన్నారు. -
ఫార్మా, హెల్త్కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ
పర్లాకిమిడి: ఒడిశాకు చెందిన విద్యార్థులకు ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకాకుళం బొల్లినేని మెడ్స్కిల్స్తో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నామని గజపతి జిల్లా డీఎస్డీఈవో సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు మంగళవారం పర్లాకిమిడిలో కలెక్టరేట్ వద్ద జిల్లా స్కిల్ డవలప్మెంట్, ఎంప్లాయీమెంట్ శాఖ అధికారి కార్యాలయంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు పెట్టారు. ఎన్యూవీ ఒడిశా శిబిరంలో భాగంగా 240 మంది విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పేషెంట్ రిలేషన్ అసోసియేట్, ఎస్ఎస్సీ, ప్లస్ టూ, ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అసోసియేట్ స్టోర్ ఫార్మా కోర్సులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సదుపాయం, యూనిఫామ్ స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 7331118019, 7680945357, 7995013422 నంబర్లను గానీ, శ్రీకాకుళం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గానీ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బొల్లినేని మెడ్స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, గజపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
బోల్ భం భక్తుల వ్యాన్ బోల్తా
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ సమితి మహేంద్రగిరికి వ్యాన్లో సోమవారం సాయంత్రం గంజాం జిల్లా ఛత్రపురం నుంచి 20 మంది బోల్ భం భక్తులు వెళ్లారు. అక్కడ ౖగోకర్ణేశ్వర మందిరంలో మహాదేవుడిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో బుర్ఖాత్ పాస్కు సమీపంలోని ఘాటి మలుపు వద్ద వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు బోల్ భం భక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గారబంద పోలీసులు సంఘటన స్థలానికి విచ్చేసి వారిని తొలుత గారబంద ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో చేర్చారు. అనంతరం పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వారిలో శుభం ఆచార్య, డి.నారాయణరావులు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించినట్లు గారబంద పోలీసుస్టేషన్ ఐఐసీ ప్రశాంత నిసిక వెల్లడించారు. ఘటనతో మహేంద్రగిరి వెళ్లేదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆరుగురు భక్తులకు గాయాలు -
మజ్జిగౌరికి శ్రావణ మాసం సారె
రాయగడ: ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారికి స్థానిక కస్తూరీనగర్కు చెందిన మహిళలు అత్యంత ప్రీతికరమైన మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. కస్తూరీనగర్లోని సత్యనారాయణ స్వామి మందిరం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి అమ్మవారికి శ్రావణమాసం సారెను మంగళ వాయిద్యాల నడుమ అందజేశారు. పిండి వంటలు, గాజులు, పసుపు, కుంకుమ, చీర వంటి వస్తువులను అమ్మవారికి సమర్పించారు. మజ్జిగౌరి అమ్మవారి ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ బెరుకొ ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇకపై ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారికి సారెను సమర్పించడం సాంప్రదాయంగా కొనసాగిస్తామని కస్తూరీనగర్ ప్రాంత మహిళలు తెలియజేశారు. ఇదివరకు బుదరావలస, కళాశాల రోడ్డు తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు అమ్మవారికి ఆషాడ మాసం సారెను సమర్పించుకున్న సంగతి తెలిసిందే. -
అదుపుతప్పిన పికప్ వ్యాన్
రాయగడ: జేకేపూర్ నుంచి రాయగడ వైపు వస్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపుతప్పి సమీపంలోని అంగన్వాడీ కేంద్రం ప్రహరీని ఢీకొంది. దీంతో అంగన్వాడీలో ఉన్నటువంటి చిన్నారులు భయపడ్డారు. అయితే ఘటన స్థలంలోనే వ్యాన్ను వదిలి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం జేకేపూర్ నుంచి రాయగడ వైపు వెళ్తున్న పికప్ వ్యాన్ నాయుడుపేట వద్ద ఎదురుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్ను ఢీకొనబోయి అదుపుతప్పింది. -
ఎరువుల కృత్రిమ కొరత తగదు
ఆమదాలవలస : ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు బస్తా యూరియా కోసం రోజూ గంటల తరబడి పనులు మానుకొని అధికారులు, ఆర్ఎస్కేల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు వస్తున్న ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని, టీడీపీ నాయకులు ఎరువులను తమ ఇళ్ల వద్ద దాచుకొని బయట అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆమదాలవలస నియోజకవర్గంలో సాగు చేస్తున్న 53,000 ఎకరాల సాగుకు 2850 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వం 1600 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. పొందూరు మండలంలో 4000 ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్క జొన్న పంటకు అదనంగా 600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవేవీ పట్టకుండా విహార యాత్రలు చేస్తూ సొంత ఆదాయాలు చూసుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, నాయకులు సాకేటి శ్రీనివాసరావు, అన్నపు కృష్ణ, ధనుజయరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రహస్య కెమెరాతో చిక్కిన యువకుడు
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దేవస్థానం భద్రత వ్యవస్థ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. శ్రీమందిరంలోనికి ప్రవేశించే ముందు తనిఖీలు నిర్వహించి స్వామి దర్శనం కోసం బారులుతీరిన భక్తులను అనుమతిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రధానంగా ఆలయ పరిమితుల పరిరక్షణలో భక్తులు, యాత్రికులు అవకతవకలకు పాల్పడకుండా నిఘా వేసేందుకు ప్రత్యేక రక్షక భటుల వ్యవస్థని శ్రీమందిరం నిర్వహిస్తోంది. మరోవైపు శ్రీమందిరం ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్, డ్రోన్ వ్యతిరేక జోన్గా ప్రకటించారు. ఈ బందోబస్తు ఉన్నప్పటికీ తరచూ ఏదో రకంగా శ్రీమందిరంలోని పరిమితులు అధిగమించి పలు లోపలి ప్రాంగణాల దృశ్యాల డ్రోన్ చిత్రీకరణ, వీడియో రికార్డింగు, ఫొటోలతో బాహ్య ప్రపంచం వెలుగులోకి వస్తున్నాయి. కళ్లద్దాల చాటున రికార్డింగ్ తాజాగా మంగళవారం కంటి అద్దాల చాటున శ్రీమందిరం లోపలి దృశ్యాలను గుట్టురట్టు కాకుండా బంధిస్తున్న ప్రయత్నంలో యాత్రికుడు రహస్య కెమెరాతో పట్టుబడ్డాడు. పోలీసులు బేహరొణొ ద్వారం దగ్గర అనుమానంతో అతడిని పట్టుకున్నారు. రహస్యంగా రికార్డ్ చేయగల రే–బాన్ మెటా కళ్లజోడు ధరించిన యువకుడి కదలికపై సందేహం కలిగిన శ్రీమందిరం ప్రత్యేక రక్షక భటుల వర్గం నిలదీసింది. వీరి పరిశీలనలో యువకుడు ధరించిన కళ్లద్దాలపై రహస్య కెమెరా అమరిక ఉన్నట్లు ఖరారు అయింది. దీంతో ఆలయ లోపల చిత్రాల్ని చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. ఈ సమగ్ర వ్యవహారంపై ఆరా తీసేందుకు రక్షక భటులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పూరీ గజపతి నగరంలో ఉంటున్నట్లు సమాచారం. సింహద్వారం ఠాణా పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. -
విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులకు గాయాలు
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో మంగళవారం ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో గాయాలుపాలయ్యారు. త్రినాథ్ ఖీలో, ఉద్దవ్ దాస్నాగ్ అనే ఇద్దరు యువకులు ఒక భవనంపై నుంచి సెల్ఫీ తీసుకున్నారు. అయితే అదే సమయంలో భవనంపై నుంచి వెళ్తున్న 33 కేవీ విద్యుత్ తగలడంతో పైనుంచి కింద పడిపోయారు. దీంతో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఉద్ధవ్ దాస్కి పరిస్థితి విషమంగా ఉండడంతో మల్కన్గిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్సను అందజేస్తున్నారు . -
వీఐపీ దర్శనం ముసుగులో మోసం
భువనేశ్వర్: పూరీలో కొలువుదీరిన జగన్నాథుడు ప్రపంచవ్యాప్తంగా అశేష భక్తజనుల ఆరాధ్య దైవం. స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శ్రీమందిరంలో అత్యంత చేరువలో మూల విరాటులను కళ్లారా దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈ భక్తిభావాన్ని సొమ్ము చేసుకునే దిశలో చాటుమాటున ఆన్లైన్లో వీఐపీ దర్శనం పేరుతో నిలువు దోపిడీ ప్రారంభం అయింది. హరి ఓం యాప్లో వీఐపీ దర్శనం చేసుకోవచ్చని తప్పుడు ప్రచారం ఊపందుకుంది. రూ.1,000లకు వీఐపీ దర్శనం చేసుకోవచ్చని ఈ యాప్ ప్రచారం చేస్తున్న విషయం బట్టబయలైంది. స్లాట్ బుకింగ్ కోసం హెల్ప్లైన్ నంబర్ కూడా జారీ చేసింది. ఒక భక్తుడు స్లాట్ బుక్ చేసుకుని మోసపోయిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ ఠాణాలో ఫిర్యాదు శ్రీమందిరంలో మూల విరాటుల వీఐపీ దర్శనం పేరుతో భక్తులను హరి ఓం యాప్ మోసం చేసిందని ఆరోపిస్తూ శ్రీమందిరం అధికార వర్గం (ఎస్జేటీఏ) సైబర్ ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేసింది. శ్రీమందిరం ఆధ్వర్యంలో వీఐపీ దర్శనం కోసం ఎటువంటి వ్యవస్థ పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనం పేరిట భక్తులను మోసగిస్తున్న హరి ఓం యాప్పై చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ట్రాక్కు మరమ్మతులు.. నిలిచిన వాహనాలు
ఇచ్ఛాపురం రూరల్: కేదారిపురం–పురుషోత్తపురం మధ్య ఎల్సీ గేట్ను రైల్వే అధికారులు మంగళవారం సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేశారు. ట్రాక్ మరమ్మతుల సమాచారాన్ని వాహనదారులకు ముందుగానే అధికారులు తెలియజేశారు. దీంతో కేదారిపురం, ముచ్ఛింద్ర, బెన్నుగానిపేటకు చెందిన విద్యార్థులను రెండో పూటే ఇళ్లకు పంపించేశారు. మిగిలిన వాహనాలు బెన్నుగానిపేట మీదుగా ఇచ్ఛాపురం చేరుకున్నాయి పూడిలంక వంతెన పనులు పూర్తిచేస్తాం వజ్రపుకొత్తూరు: పూడిలంక వంతెన పనులు స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రూ.4 కోట్లతో నిర్మించనున్న పూడిలంక వంతెన నిర్మాణ పనులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచినీళ్లపేట జెట్టీ నిర్వహణకు కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పూడిలంక వంతెన పనులు పూర్తి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిమ్మల కృష్ణారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కణితి సురేష్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు, సైని భాస్కరరావు, టి.గణపతి, రంగారావు, హేమారావు తదితరులు పాల్గొన్నారు. ‘గోవిందరాజులు వ్యాఖ్యలు అర్ధరహితం’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ వైఎస్సార్సీపీపై బోయిన గోవింద రాజులు చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితమని, ఇదే సంఘంలో వైఎస్సార్సీపీ ప్రతినిధులుగా ఉన్న తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్ర వైఎస్సార్ సీపీ కళింగ వైశ్య బీసీ అనుబంధ సాధికార కమిటీ అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా వైఎస్సార్సీపీ కోశాధికారి తంగుడు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కోరాడ చంద్రభూషణగుప్త, వైఎస్సార్సీపీ నాయకులు తంగుడు జోగారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరికి పదవులు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఏ రాజకీయ పార్టీ ఇలాంటి అవకాశాలు కల్పించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వంతో సీట్లు సర్దుబాటు చేసుకొని మిత్రపక్షంగా ఉంటూ విజయం సాధించిన తర్వాత టీడీపీ కేంద్ర క్యాబినెట్లో చేరకపోవడానికి కారణాలను మీ పార్టీ పెద్దలను అడిగి తెలుసుకొని సమాజానికి తెలియజేయాలని కోరారు. బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన ఏకై క పార్టీ వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కళింగవైశ్యుల కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, 10 కుల కార్పొరేషన్ డైరక్టర్లను, నాలుగు బిజినెస్ కార్పొరేషన్ డైరక్టర్లను, బీసీ కళింగ వైశ్య మహిళకు శ్రీకాకుళం సుడా చైర్మన్ ఇచ్చి కళింగ వైశ్యులను గుర్తించారన్నారు. కూటమి పాలన 14 నెలల్లో పలాసలోని ఒక్క ఏఎంసీ పదవి తప్ప గతంలో ఉన్న మల్లా శ్రీనివాసరావుని కూడా తిరిగి నియమించలేదన్నారు. టి.డి.వలసలో జ్వరాలపై సర్వే జి.సిగడాం: టంకాల దుగ్గివలస గ్రామంలో జ్వరాలపై వైద్యసిబ్బంది మంగళవారం ఇంటింటా సర్వే చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జ్వరపీడితుల వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామని ఎంపీడీఓ జి.రామకృష్ణారావు, వైద్యాధికారి బి.యశ్వంత్కుమార్ తెలిపారు. ఇప్పటికే గ్రామంలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. 3న జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్ట్ 3న నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు బగాది కిషోర్, జామి రమేష్ మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం కొత్త రోడ్డు సమీపంలో ఉన్న సీఎస్ఎన్ ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగే ఈ ఎంపికలకు 19 ఏళ్లలోపు బాలబాలికలు అర్హు లని పేర్కొన్నారు. విజేతలను త్వరలో కర్నూలు వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలకు పంపిస్తామని ఆల్ ఇండియా చెస్ ఇన్ స్కూల్ కమిటీ సభ్యులు సనపల భీమారావు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన బాలబాలికలు జనన ధృవీకరణ పత్రం, రూ.300 ఎంట్రీ ఫీజుతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 9912559735 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
138 కేసులు పరిష్కారం
జయపురం: ఒడిశా న్యాయ సేవా ప్రదీకరణ ఆదేశం మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు సోమవారం కొరాపుట్ జిల్లా స్థాయి లోక్ అదాలత్ను నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్లో ఎన్ఐ చట్టపు కేసులు మాత్రమే పరిష్కరించారు. ఎన్ఐ చట్టం సెక్షన్ 138 కేసులను ఉభయ వర్గాల మధ్య అవగాహన కల్పించి వారి సమ్మతితోనే కేసులు పరిష్కరించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ ేసేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి, సివిల్ కోర్టు రిజిస్ట్రార్ విష్ణు ప్రసాద్ దేబత, శాశ్వత లోక్ అదాలత్ విచారపతి ప్రద్యోమయి సుజాత, సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరమోహణ దాస్ కేసులను పరిష్కరించారు. జిల్లా స్థాయి లోక్ అదాలత్లో 49 ఎన్ఐ కేసులలో 12 కేసులు పరిష్కరించి రూ.37,45,777 జరిమానా రూపంలో వసూలు చేసినట్లు ప్రద్యోమయి సుజాత వెల్లడించారు. -
గ్రీవెన్స్సెల్కు 48 వినతులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ అమెడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ మధుమితతోపాటు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్వో కె.నాగరాజు, ముఖ్యకార్యనిర్వాహణాధికారి (జిల్లా పరిషత్తు) శంకర కెరకెటా, ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. అంగార్సింగి, లోబ, అమెడా, పోత్తురో గ్రామ పంచాయతీల నుంచి 48 వినతులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వీటిలో వ్యక్తిగతం 19, గ్రామ సమస్యలపై 29 వినతులు ఉన్నాయి. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికారులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు గుర్తింపుకార్డులను అందజేశారు. అనంతరం రాయఘడ బ్లాక్ ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. రాయఘడ సమితి అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ పాల్గొన్నారు. -
నిరాహార దీక్ష
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ ప్రభుత్వ ఎస్.ఎస్.డి (ఆశ్రమ) ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవంత్సరంలో చేపట్టిన అడ్మిషన్లలో ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ సాహుకార్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని సర్పంచ్ దీప్తీ ప్రభాలాల్ శోబోరో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష సోమవారం చేపట్టారు. హెచ్ఎం సురేష్ సాహుకార్ వల్ల అనేక మంది ఆదివాసీ, దళిత విద్యార్థులు అడ్మిషన్లు పొందకుండా మిగిలిపోతున్నారని మాజీ సర్పంచ్ ఆరోపించారు. 2022లో కూడా దళిత, అదివాసీ అనాథ విద్యార్థులు ఇద్దరిని సెలక్షన్ లిస్టులో తొలిగించిన ఉదంతం జిల్లా సంక్షేమ శాఖ అధికారికి విన్నవించినా పాఠశాల హెచ్ఎంపై అధికారులు చర్యలు చేపట్టలేదని మాజీ సర్పంచ్ దీప్తి ప్రభాలాల్ శోబోరో తెలిపారు. జిల్లా కలెక్టర్ మధుమిత రాయఘడ ఆశ్రమ పాఠశాల హెచ్ఎంపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. -
పూర్వ విద్యార్థుల ఔదార్యం
వజ్రపుకొత్తూరు: గోవిందపురం ఉన్నత పాఠశాలలో 1989–1990 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదవిన పూర్వ విద్యార్థులు ఔదర్యాన్ని చాటుకున్నారు. తోటి మిత్రుడు రవిశంకర్ పాడి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుకుసున్న స్నేహితులు రూ. 30 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా నవరంగాపూర్ బ్లాక్ అంబోధరలో ఉంటున్న అతని ఇంటికి సోమవారం వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మద్దిల హరినారాయణ, బొడ్డేపల్లి మోహన్, కీలు లోకనాథం, పుచ్చ అప్పలస్వామి, జామి మధు ఉన్నారు. -
రావిశాస్త్రి ప్రసంగానికి శరత్బాబు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమానికి నగరానికి చెందిన రచయిత జంధ్యాల శరత్బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న రావిశాస్త్రి జయంతి పురస్కరించుకొని ‘సామాన్యుడి అండదండ రావిశాస్త్రి’ అంశంపై ప్రసంగం చేయనున్నారు. యువతి ఆత్మహత్య తడ: అనారోగ్యంతో శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలం, గొల్లవూరు గ్రామానికి చెందిన జీరు పూజిత(21) అనే యువతి ఆదివారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఎస్ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసే పూజిత తడకండ్రిగలోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అద్దెకు నివసిస్తోంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను అదే పరిశ్రమలో పని చేసే ఆనంద్ కృష్ణన్ అనే మిత్రుడు తరచూ పరామర్శిస్తుండేవాడు. ఈ క్రమంలో చనిపోయిన రోజు కూడా ఆనంద్ కృష్ణన్ ఆమెను ఉదయం పలకరించి వెళ్లాడు. సాయంత్రం వచ్చిన అతను పూజిత గదిలో సీలింగ్ ఫ్యాన్కి చున్నీతో ఉరి వేసుకుని ఉన్నట్టు గమనించి, అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న మరో వ్యక్తి సాయంతో తలుపులు పగుల కొట్టి ఆమెను కిందకు దించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మృతురాలి తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం ఇవ్వడంతో సోమవారం తడకు వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొడపనాయుడు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి శ్రీకాకుళం రూరల్: మండలంలోని పెదపాడు పంచాయతీ పరిధి ధర్మాన లే అవుట్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన తీవ్ర మనస్పర్థలు ఓ వివాహిత ప్రాణాలను బలిగొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మాన లే అవుట్లో నివసిస్తున్న యవ్వారి రాజేష్ కుటుంబంలో ఒక శుభ కార్యానికి సంబంధించి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో తన అభిప్రాయానికి విలువ లేకుండా భర్త మాటే నెగ్గుతుందని భావించిన భార్య అనూష(30) తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈనెల 23వ తేదీన దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న అనూష సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పాలవలస మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ కె.రాము తెలిపారు. వృద్ధుడు అదృశ్యం రణస్థలం: మండలంలోని పైడి భీమవరం గ్రామానికి చెందిన కంఠస్ఫూర్తి కనకరాజు ఈనెల 21వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని జే.ఆర్.పురం పోలీసులు సోమవారం తెలిపారు. వయస్సు 78 సంవత్సరాలు, మతి స్థిమితం సరిగ్గా లేదని చెప్పారు. ఈ మేరకు కుమారుడు సత్తిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్.చిరంజీవి వెల్లడించారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి దూసి – పొందూరు రైల్వేస్టేషన్ల మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి సుమారు 65 ఏళ్ల వయస్సు ఉంటుందని, నీలం, ఎరుపు రంగు గీతల షర్టు, నీలం గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. ముద్దాయికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరు పంచాయతీ పరిధి కొత్త కొత్తూరులోని ఉమామల్లిఖార్జున స్వామి ఆలయం తాళాలను, హిరమండలంలోని సుబలాయి గ్రామానికి చెందిన రాగోలు బాలకృష్ణ 2019లో పగలుగొట్టి రూ.20 వేల నగదును చోరీ చేశాడు. ఈ ఘటనలో ముద్దాయి బాలకృష్ణపై నేరం రుజువు కావడంతో ఆయనకు కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి సోమవారం రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు స్థానిక సీఐ చింతాడ ప్రసాదరావు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై 2019వ సంవత్సరంలో కొత్తూరు ఎస్ఐగా పని చేసిన బాలకృష్ణ కేసు నమోదు చేశారు. కేసును ఎస్ఐలు బాలకృష్ణ, కె.గోవిందరావులు దర్యాప్తు చేశారన్నారు. ఏపీపీగా ఎల్.నాగభూషణరావు వ్యవహరించారు. -
ఘనంగా సహీద్ దినోత్సవం
రాయగడ: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ వ్యవస్థాపకుడు చారుమజుందార్ 53వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొలనార సమితి పరిధి కెరేడీ గ్రామంలో సహీద్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేరేడి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మజూందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దళిత, బడుగు వర్గాల అభ్యున్నతికి మజూందార్ పోరాడారని గుర్తు చేశారు. -
మలేరియాతో బాలిక మృతి
కంచిలి: మండలంలోని కొనక గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలిక గాయత్రి దొండియా మలేరియా జ్వరంతో మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. ఈ బాలిక గ్రామ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ జ్వరం బారిన పడింది. ఈ నెల 17వ తేదీన మఠం సరియాపల్లి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయడంతో మలేరియా జ్వరంగా తేలింది. పరిస్థితి విషమించడంతో సోంపేట సీహెచ్సీకి రిఫర్ చేయగా, అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించినట్లు పీహెచ్సీ వైద్యురాలు సుస్మితారెడ్డి వివరించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మృతురాలి తండ్రి బైలోడు, తల్లి తిలోత్తమలు కూలీలుగా జీవిస్తున్నారు. వీరికి మృతి చెందిన బాలికతోపాటు రెండేళ్ల కుమారుడు నితిన్ ఉన్నాడు. బాలికకు మలేరియా పాజిటివ్ రావడంతో గ్రామంలో వైద్యశిబిరాన్ని కూడా నిర్వహించారు. -
బీజేపీ నాయకుల మాటలు అర్థరహితం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి కత్తలకవిటి పంచాయతీ డాక్టరు బంజిరి గ్రామంలో 43 ఎకరాల భూవివాదంపై బీజేడీ పార్టీపై మాజీ ఎమ్మెల్యే (బీజేపీ) కోడూరు నారాయణరావు చేసిన వివాదాస్పద వాఖ్యలను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ ఖండించారు. వాటి మాటలు అర్థరహితమన్నారు. బీజేడీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టరు బంజరి గ్రామంలో 50 ఎకారాల ప్రైవేట్ భూమిలో 5 ఎకరాల భూమి బరంపురం పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్రియాంకా సాబత్ పేరిట రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని జెడ్పీటీసీ ఎస్.బాలరాజు తెలియజేశారు. ఆర్నెళ్లుగా డాక్టరు బంజిరి భూములు ఆదివాసీ, దళిత ప్రజలకు చెందాలని పోరాడుతుండగా.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మేల్కోని తమ పార్టీ నేతల హాస్తం ఉందని ఆరోపించడం సబబు కాదని జెడ్పీటీసీ (గుసాని) బాలరాజు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, డాక్టరు బంజిరిలో వంద మంది ఆదివాసీ, దళిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా పోరాడితే మంచిదని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ప్రస్తుతం తాము డాక్టరు బంజిరి వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, దీనిపై తుదివరకు పోరాడతామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. గజపతి కలెక్టర్తో డాక్టరు బంజిరి భూముల వివాదంపై మాట్లాడతామని ఎమ్మెల్యే పాణిగ్రాహి తెలియజేశారు. విలేకరుల సమావేశంలో గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, ఆర్.ఎం.సి. ప్రెసిడెంట్ ఎస్.గజపతిరావు, తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి -
కారులో నాటుసారా రవాణా
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు కంచిలి: ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాలకు విచ్చలవిడిగా నాటుసారా రవాణా అవుతోంది. ఏకంగా కార్లలోనే దర్జాగా నాటుసారాను పాలిథిన్ సంచుల్లో, చిన్నసైజు ప్యాకెట్ల రూపంలో పల్లెలకు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ రవాణాపై పటిష్ట నిఘా పెట్టారు. ఒడిశా – ఆంధ్ర అంతర్రాష్ట్ర కార్ల కదలికల మీద నిఘా ఉంచారు. ఈ నిఘాలో భాగంగా ఒడిశా సరిహద్దు గ్రామమైన కేసరపడ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని పరిశీలించారు. దీంతో ఆ కారులో ఆరు ప్లాస్టిక్ గోనె సంచుల్లో ఒక్కొక్కదానిలో 150 నాటుసారా ప్యాకెట్లను ప్యాక్చేసి, మొత్తంగా 900 నాటుసారా ప్యాకెట్లు(90 లీటర్లు) తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సారాతోపాటు కారును సీజ్చేసి, నాటుసారా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం మునిసిపేటకు చెందిన మొగిలి కుమార్ను, నాటుసారా తెప్పించిన పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లోట్ల జోగారావును అరెస్టు చేశారు. నాటుసారా పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది మార్కారావు, భాను, అరుణ్, ఉమాపతిలను సీఐ అభినందించారు. -
యువకుడి మృతిపై ఆందోళన
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన పినిమింటి శ్రీరాములు(20) అనే యువకుడు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శ్రీరాములు ఈనెల 25వ తేదీన కొంతమంది యువకులతో కలిసి ద్విచక్ర వాహనంపై సారవకోట మండలం వైపు వెళ్లాడు. అయితే అదేరోజు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కానీ శ్రీరాములుది రోడ్డు ప్రమాదం కాదని, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తీవ్రగాయాలతో బ్రెయిన్ డెడ్ కావడంతో చికిత్స పొందుతూ శ్రీరాములు 27వ తేదీన మృతి చెందాడని, తన కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి లక్ష్మణరావు, తల్లి లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం మృతదేహంతో పెద్దబమ్మిడి వద్ద ర్యాలీ చేపట్టారు. అయితే ఇదే విషయంపై సారవకోట పోలీసులను ప్రశ్నించగా మృతి చెందిన యువకుడు ఈనెల 25వ తేదీన సారవకోట మండలం జగ్గయ్యపేట వద్ద రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొన్నట్లు పేర్కొన్నారు. ఇది గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108లో శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27వ తేదీన మృతి చెందినట్లు తెలిపారు. కాగా శ్రీరాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జెమ్స్ ఆస్పత్రి సిబ్బంది ఆ యువకుడి అవయవాలను దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఎచ్చెర్ల మండలానికి చెందిన ఎంపీపీ మొదలవలస చిరంజీవిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం వేకువఝామున ఫరీదుపేటలోని ఆయన స్వ గృహానికి జిల్లా పోలీసుల సహకారంతో ఒడిశా పోలీసులు చేరుకుని వారెంటు చూపించి అరెస్టు చేసినట్లు జేఆర్ పురం సీఐ అవతారం పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1999లో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దమన్జోడి పోలీస్ స్టేషన్ పరిధిలో నాల్కో కంపెనీ తరఫున కాంట్రాక్ట్ పనులు చేయించారని, వ్యాపార లావాదేవీల్లో అక్కడ గొడవ రావడంతో చిరంజీవిపై కేసు నమోదైందన్నారు. చిరంజీవిని రిమాండ్కు తరలించారని పేర్కొన్నారు. ‘కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రహదారు లు, భవనాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్తో కలసి ఆయన నూతన కలెక్టరేట్ భవనాన్ని, అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతపై ఎక్కడా రాజీ పడకూడదన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై రైతుల కన్నెర్ర
కొత్తూరు: కొత్తూరు మండలంలోని బలద ఇసుక ర్యాంపు పేరుతో వసప గ్రామం సమీపంలో వంశధార నది వద్ద నిర్వహిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రైతులు సోమవారం కన్నెర్ర చేశారు. భారీ వాహనాలు తమ పొలాల దారి మీదుగా వెళ్తుండడంతో నిత్యం భయపడుతున్నామని తెలిపారు. ఇసుక టిప్పర్లు వెళ్లకుండా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. ఇసుక వాహనాల రాకపోకల వల్ల తాము కనీసం బైక్పై ఎరువులు కూడా తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సంఘీభావం తెలపడం విశేషం. బలద రెవెన్యూ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపు నిర్వహించాలని ప్రభు త్వం మంజూరు చేస్తే వసప గ్రామం వద్ద ర్యాంపు నిర్వహించడం తగదన్నారు. ఇసుక ర్యాంపును నిలుపుదల చేయాలని తహసీల్దార్ను ఫోన్లో కోరారు. వసపలో ఇసుక వాహనాలు అడ్డుకున్న రైతులు అక్రమ తవ్వకాలు ఆపాల్సిందేనని డిమాండ్ -
వినతుల వెల్లువ..
జయపురం: జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాభియోగాల శిబిరంలో 36 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 27 ఫిర్యాదులు వ్యక్తిగతం కాగా.. 9 ఫిర్యాదులు కమ్యూనిటీ పరంగా వచ్చాయి. కొరాపుట్ నూతన కలెక్టర్ మనోజ్ సత్యభాను మహాజన్ మొదటి సారి పాల్గొన్న ప్రజాభియోగ శిబిరంలో జయపురం సిటిజన్ కమిటీ వారు చేసిన ఫిర్యాదులో జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్లో స్పెషలిస్టు డాక్టర్లను తగినంత మందిని నియమించాలన్నారు. పోస్టాఫీసులో రైల్వే టికెట్ కౌంటర్ ప్రారంభించాలని, టంకువ నుంచి రైల్వే స్టేషన్ వరకు సిటీ బస్సు వేయాలని, జనన, మరణ ధ్రువపత్రాలు మునిసిపాలిటీలోనే ఇవ్వాలని, తదితర డిమాండ్లతో కమిటీ అధ్యక్షురాలు బినోదిని శాంత వినతిపత్రం సమర్పించారు. బరిణిపుట్ పంచాయతీ ముండిగుడ ఒసీసీ కాలనీలో 2 వందల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయాని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, సీడీఎంఓ రబఅంద్రనాథ్ మిశ్ర, ఎస్పీ రోహిత వర్మ, ఐఏఎస్ ప్రొహిబిషన్ సంతోష్ పడర్, తదితరులు పాల్గొన్నారు. పద్మపూర్లో.. రాయగడ: జిల్లాలోని పద్మపూర్లో జిల్లా అదనపు కలక్టర్ నిహారి రంజన్ ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 60 వినతులను స్వీకరించారు. వాటిలో 53 వ్యక్తి గత సమస్యలుగా, మిగతా 6 గ్రామ సమస్యలుగా గుర్తించారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ప్రధాన్, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరొజిని దేవి, పద్మపూర్ సమితి అధ్యక్షులు మణిమాల సబర్, తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
ప్రభుత్వ సంరక్షణలో పసికందు ● బొలంగీరులో ఘటన భువనేశ్వర్: రాష్ట్రంలో ఇంకా పసికందుల విక్రయం వంటి ఘటనలు కనిపిస్తున్నాయి. పేదరికం కారణంగా తండ్రి నవజాత శిశువును రూ.20,000 కు అమ్మేసిన విచారకర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బొలంగీర్ జిల్లాలో తీవ్ర పేదరికం కారణంగా ఆడ పసికందును రూ.20,000కి అమ్మేశారు. ఈ నెల 1న కనక్ రాణా ప్రసవించిన ఆడ శిశువును తండ్రి నీలా రాణా బర్గడ్ జిల్లా పాయికమల్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తికి అమ్మేశాడు. బొలంగీర్లోని టిట్లాగడ్ మండలం నుంచి పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు వెలువడుతున్న ఆరోపణలకు ఈ సంఘటన నిలువెత్తు రుజువుగా నిలిచింది. తీవ్ర పేదరికం మధ్య రెండో కుమార్తెను పెంచే స్థోమత లేక ఆ కుటుంబం శిశువును అమ్మకానికి పెట్టినట్లు కన్న తండ్రి తెలిపాడు. అయితే తన అంగీకారం లేకుండా పురిటి బిడ్డని నిర్దాక్షిణ్యంగా గుర్తు తెలియని మరొకరి చేతిలో పెట్టడాన్ని తట్టుకోలేక పోతున్నాను అని కన్న పేగు కోతతో బాలింత ఉసూరుమంటోంది. ‘మేము పేదవాళ్లం, వలస కార్మికులుగా పనిచేస్తూ మా జీవనం సాగించేవాళ్లం. ఆరు నెలల తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మా సర్పంచ్ నా రేషన్ బియ్యం అందుబాటులో లేదని చెప్పారు. మేము పేదరికంలో జీవిస్తున్నాము. అందుకే, రెండవ బిడ్డను అమ్మేశాను‘ అని బిడ్డ తండ్రి నీలా రాణా వాపోయాడు. ‘నేను పిపలాపొదర్ ఆస్పత్రిలో ఒక ఆడపిల్లని ప్రసవించాను. ఆ తర్వాత నా భర్త ఆ బిడ్డను నాకు తెలియని వ్యక్తికి నా అంగీకారం లేకుండా అమ్మేశాడు’ అని తల్లి కనక్ చెబుతున్నారు. ప్రభుత్వ సంరక్షణలో పసికందు అమ్ముడుపోయిన పసికందును జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. జిల్లా బాలల రక్షణ విభాగం, టిట్లాగడ్, పాయికమల్ ఠాణాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో రూ. 20,000 కి అమ్ముడుపోయిన పసికందును బర్గడ్ జిల్లా పాయికమల్ బస్తాన్పడాలో సంజయ్ అనే వ్యక్తి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మృత శిశువుని ప్రసవించిన బాలిక జగత్సింగ్పూర్ జిల్లా కుజంగ్ పోలీస్ ఠాణా గండకిపూర్ ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మృత శిశువును ప్రసవించింది. సందిగ్ధ రక్తస్రావం గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను కుజంగ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెను 4 నెలల గర్భవతిగా నిర్ధారించారు. ఇంతలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జగత్సింగ్పూర్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో బాలిక మృత శిశువును ప్రసవించింది. కౌమార బాలింత ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థిషతులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు అత్యవసరం. ● బొలంగీరులో ఘటన న్యూస్రీల్ -
జయపురం రైల్వేస్టేషన్ ముట్టడి
జయపురం: విశాఖపట్నం–కిరండూల్ ప్రయాణికుల రైలును వెంటనే కొరాపుట్–జగదల్పూర్కు పునరుద్ధరించాలని బీజేడీ శ్రేణులు డిమాండ్ చేస్తూ సోమవారం జయపురం రైల్వే స్టేషన్ను ముట్టడించాయి. రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో నేతృత్వంలో వందలాది మంది బీజేడీ నేతలు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పార్టీ జెండాలతో రైల్వే స్టేషన్ముఖ ద్వారం ముంగిట బైఠాయించారు. ఈ సంద్భంగా రైల్వే అధికారికి మెమోరాండం సమర్పించారు. గత 27 రోజులుగా కొరాపుట్ నుంచి జగదల్పూర్ మధ్య ప్రయాణికుల రైళ్ల రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయని, అయినా రైల్వే అధికారులు రైళ్లు నడిపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గత నెల 2 నుంచి జగదల్పూర్–కొరాపుట్ మధ్య ప్రయాణికుల రైళ్లు నిలిచిపోవటం వల్ల విశాఖపట్నం, రూర్కెలా, హౌరా, భువనేశ్వర్లకు రైళ్ల రాక పోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వారు వెల్లడించారు. మరో పక్క గూడ్స్ రైళ్లు యథాతదంగా నడుస్తున్నాయని తెలియజేశారు. రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే జయపురం–జగదల్పూర్ల మధ్య ఒక కొత్త రైలును వేయాలని, అలాగే జగదల్పూర్ నుంచి సంబల్పూర్, అనుగోల్, కటక్, భువనేశ్వర్ మీదుగా పూరి వరకు ప్రతిదినం రైలు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే జయపురం–మల్కన్గిరి, జయపురం– నవరంగపూర్ ల రైలు మార్గాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు. పాసింజర్ రెళ్లు కొరాపుట్ వరకు వస్తున్నాయని, కొరాపుట్ నుంచి జగదల్పూర్ వరకు రైళ్లు నిలిచి పోయాయని వారు గుర్తు చేశారు. జయపురం–జగదల్పూర్ల మధ్య రైలు నడపాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. -
మల్కన్గిరి ప్రజలు సౌమ్యులు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ప్రజలు ఎంతో సౌమ్యులని కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ అధ్యక్షతన వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్గా 11 నెలలు అందించిన సేవలను వివిధ శాఖల అధికారులు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పటేల్ చేసిన కృషిని ప్రశంసించారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేయందుకు చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. మల్కన్గిరి జిల్లాలో పని చేసింది కొద్ది నెలలైనప్పటికీ తన హృదయంలో ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అమాయక గిరిజనుల ప్రేమ, గౌరవం ఎప్పటికీ గుర్తుగా ఉంటుందన్నారు. కార్యాలయ సిబ్బంది ఎంతోగానో సహకరించారన్నారు. అందరి సహకారంతోనే జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ డివిజన్ అధికారి సాయికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, జిల్లా అభివృద్ధి అధికారి నరేశ్చంద్ర పటేల్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బఓణి, జిల్లా అదనపు ఎస్పీ రష్మి రంజన్ సేనపతి తదిరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది -
ఖుర్దారోడ్ కొత్త డీఆర్ఎంగా అలోక్ త్రిపాఠి
భువనేశ్వర్: అలోక్ త్రిపాఠి తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం కొత్త మండల రైల్వే అధికారి (డీఆర్ఎమ్)గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ హోదాలో అంకితభావంతో సేవలందించిన హెచ్ఎస్ బజ్వా నుంచి బాధ్యతలు స్వీకరించారు. 1974 జనవరి 12న జన్మించిన త్రిపాఠి 1999 సెప్టెంబర్ 20న భారతీయ రైల్వే సేవా రంగంలో అడుగు పెట్టారు. ఇంతకు ముందు అలోక్ త్రిపాఠి న్యూఢిల్లీలోని రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫ్రైట్ మార్కెటింగ్), నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జనరల్ మేనేజర్, అహ్మదాబాద్లో అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ (ఏఓఎం), వదోదరలో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ (డీఓఎం) , పశ్చిమ రైల్వేలో ఏరియా రైల్వే మేనేజర్ (ఏఆర్ఎం), రాజ్కోట్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (సీనియర్ డీసీఎం)గా , రాజ్కోట్ , రత్లాం ప్రాంతాల్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ (సీనియర్ డీఓఎం)గా పలు హోదాల్లో కీలకమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. -
నదిలో మునిగి బోల్భమ్ భక్తుడు మృతి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి భీమ్పూర్ పంచాయతీలోని దీనబంధుపూర్ వద్ద గల మహేంద్రతనయ నదిలో మునిగి బోల్భం భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు గజపతి జిల్లా నువాగడ సమితి కేజాలర్సింగ్ గ్రామానికి చెందిన కన్హా బొడొదలాయి (24)గా గుర్తించారు. సొమవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బోల్భమ్ దీక్షను తీసుకున్న 30 మంది భక్తులు సొమవారం వేకువజామున భీమపూర్లోని శివుని మందిరానికి వెళ్లి జలంతో అభిషేకం చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో బొడొదలాయి కూడా భక్తులతో పాటు అక్కడకు వెళ్లాడు. అంతా నదీలో స్నానాలు చేసుకుని జలాలను కలశంతో పట్టుకుని సిద్ధంగా ఉన్న సమయంలో బహిర్భూమికని వెళ్లిన బొడొదలాయి ఇంకా తిరిగి రాకపొవడంతో భక్తులు అనుమానించి నదిలో మునిగిపొయినట్లు గుర్తించి సమీపంలోని గ్రామస్తులను సహాయం కొరారు. దీంతొ కొందరు గ్రామస్తులు నదిలో దూకి సుమారు రెండు గంటలపాటు వెతికి బొడొదలాయి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. -
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్కు బీజేడీ ఫిర్యాదు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ సీనియర్ ప్రముఖ కార్యదర్శి, ప్రతినిధి డాక్టర్ లేఖశ్రీ సామంత్ సింగార్పై అధికార పక్షం భారతీయ జనతా పార్టీ సిటింగు ఎమ్మెల్యే సంతోష్ ఖటువా లైంగికంగా వేధించే, అవమానకరమైన, సీ్త్ర ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో న్యూ ఢిల్లీ లోని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్కు విజయ రహత్కర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ అవమానకర సంఘటనపై బాలాసోర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి సంతోష్ ఖటువాని అరెస్టు చేసేందుకు పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. నిందితుల నుంచి బెదిరింపుల కారణంగా పీడిత డాక్టర్ లేఖశ్రీ సామంత్ సింగార్కు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. డాక్టర్ సామంత్ సింగర్ను సిటింగు ఎమ్మెల్యేను వేశ్యగా పేర్కొని ఆమె సెక్స్ రాకెట్ నడుపుతోందని ఆరోపించి వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, పౌరులు అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బాధిత నాయకురాలు భువనేశ్వర్ మహిళా పోలీస్ ఠాణాలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్పై ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కమిషను దృష్టికి తీసుకునివెళ్లారు. మూడు వారాలు గడిచినా భువనేశ్వర్ మహిళా పోలీసులు లేదా బాలసోర్ జిల్లా పోలీసు సూసపరింటెండెంటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలను ప్రారంభించలేదని జాతీయ మహిళా కమిషన్కు వివరించారు. ఈ పరిస్థితుల పట్ల రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించి సాటి మహిళకు సత్వర న్యాయం కల్పించేందుకు చొరవ కల్పించుకోవాలని బీజేడీ ప్రతినిధి బృందం కోరింది. -
సత్వర సహాయానికి హామీ: సీఎం
భువనేశ్వర్: ప్రజా ఫిర్యాదులపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సత్వర స్పందనకు చర్యలు చేపడుతున్నారు. స్థానిక యూనిట్–2 ప్రజాభియోగాల కేంద్రంలో సోమవారం జరిగిన 13వ ప్రజా ఫిర్యాదుల విచారణ పురస్కరించుకుని పీడిత వర్గంతో ముఖాముఖి చర్చించి ఫిర్యాదుల్ని స్వీకరించారు. ఈ విచారణ కార్యక్రమంలో తొమ్మిది మంది క్యాబినెట్ మంత్రులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన క్లిష్టమైన రోగులకు అక్కడికక్కడే తక్షణ వైద్య సహాయం అందించారు. 12వ విడత వరకు అందిన ఫిర్యాదులలో 91 శాతం ఫిర్యాదుల్ని పరిష్కరించారు. దాఖలైన 11,516 ఫిర్యాదుల్లో 10,502 ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 51 మందికి రూ. 55 లక్షలు సాయం అందజేశారు. బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్టు మల్కన్గిరి : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిఫ్ట్ ఇస్తానని పిలిచి అఘాయిత్యానికి పాల్పడిన 45 ఏళ్ల దయమాడిని అరెస్టు చేసి ఎస్పీ రస్మీ రంజన్ అసేనపతి ఎదుట హాజరుపరిచారు. శ్రీనివాసరావుకు పురస్కారం ప్రదానం జయపురం: జయపురం వర్ధమాన కవి, పాత్రికేయులు సింహాద్రి శ్రీనివాసరావుకు శ్రీశ్రీ కళావేదిక పురస్కారం వరించింది. ఈ నెల 27వ తేదీన విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ కళావేదిక 150వ జాతీయ కవితా సమ్మేళనంలో శ్రీనివాసరావును ‘కవితా పురస్కారం’తో ఘనంగా సన్మానించారు. మెగా రక్తదాన శిబిరం రాయగడ: గుణుపూర్లోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ ) విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 107 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. హైదరాబాద్లోని ఎండర్మైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఆర్) ఉపాధ్యక్షులు ఎ.వేంకటేశ్వరులు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.జె.రావు, మధు బడలమణి తదితరులు శిబిరంలో పాల్గొన్నారు. విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గుణుపూర్లోని బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర లక్ష్మణ్ పాత్రో, టెక్నీషియన్ చంద్ర శేఖర్ పాత్రో, రాకేష్ కుమార్ పండ, నర్సింగ్ విభాగం అధికారి సుభస్మిత చౌదరి సహకరించారు. విధి నిర్వహణలో అంకితభావానికి సత్కారం భువనేశ్వర్: రాత్రింబవళ్లు నిరవధికంగా పరుగులు తీసే రైళ్లు సురక్షితంగా గమ్యం చేరడలంలో పట్టాల పటిష్టత అత్యంత కీలకం. పట్టాల నిర్వహణ, పర్యవేక్షణ నిరంతర ప్రక్రియ. ఈ కార్యకలాపాల్లో అంకితభావంతో సమయ స్ఫూర్తి ప్రదర్శించి విపత్కర పరిస్థితుల్ని నివారించిన క్షేత్ర స్థాయి సిబ్బందికి తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ నలుగురు రైల్వే ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించారు. దబ్పాల్లో ట్రాక్ మెయింటెయినర్ – 4 బీరేంద్ర ప్రసాద్ గోరైన్, కుంహర్ సోద్రాలో ట్రాక్ మెయింటెయినర్ – 4 రోహిత్ కుమార్, జఖాపురాలో ట్రాఫిక్ పాయింట్స్మన్ అభిమన్యు దొలై, జరపడాలో ట్రాక్ మెయింటెయినర్ – 1 గౌతమ్ మాఝి జనరల్ మేనేజరు ప్రత్యేక సత్కారం పొందిన వారిలో ఉన్నారు. -
మృతదేహం కలకలం!
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కుడుములగుమ్మ పంచాయతీలోని ఆరోగ్య కేంద్రం వెనుక సోమవారం ఉదయం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు ఖోయిర్పూట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖోయిర్పూట్ ఐఐసీ కృష్ణచంద్ర హియల్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. అయితే చనిపోయిన వ్యక్తి తన గ్రామానికి చెందినవారు కాదని స్థానికులు తెలియజేశారు. అయితే వారం రోజులుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు కొంతమంది చెప్పడంతో ఆ దిశగా ఆరా తీశారు. బంధువుల ఇంటికి వచ్చి ఉంటారని భావించి విచారణ చేయగా.. మల్కన్గిరి సమితి ఎం.వి.6 గ్రామానికి చెందిన మహదేవ్ ముర్ము (50)గా గుర్తించారు. కుడుములగుమ్మలో ఉంటున్న తన చెల్లిలు ఇంటికి ఈ నెల 20వ తేదీన వచ్చినట్టు తేలింది. ఆదివారం ఉదయం చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే మల్కన్గిరి వెళ్లిపోయి ఉంటాడనుకొని చెల్లెలు కూడా పట్టించుకోలేదు. సోమవారం ఉదయం తన అన్నయ్య శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా రోదించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ కృష్ణచంద్ర హియల్ చెప్పారు. -
భర్తృహరి మహతాబ్కు సంసద్ రత్న పురస్కారం
భువనేశ్వర్: కటక్ లోక్ సభ నియోజక వర్గం సభ్యుడు డాక్టరు భర్తహరి మహతాబ్కు సంసద్ రత్న పురస్కారం లభించింది. ఈ ఏడాది పార్లమెంటులో సంసద్ రత్న పురస్కారానికి అర్హత పొందిన 17 మంది సభ్యుల్లో ఆయన ఒకరు కావడం విశేషం. సభలో జరిగిన చర్చలు, లేవనెత్తిన ప్రశ్నలు, ప్రవేశ పెట్టిన బిల్లుల ఆధారంగా ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. నిత్యావసర సరుకుల పంపిణీ రాయగడ: సదరు సమితి పరిధిలోని మల్లిగా, కొత్తపేట పంచాయితీల్లో సుమారు వంద మంది నిరుపేద వృద్ధు మహిళలకు సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు రూ. 1500 విలువ చేసే బియ్యం, పప్పు, నూనె, బంగాళదుంపలు వంటి నిత్యావసరాల వస్తువులను ఆదివారం పంపిణీ చేశారు. సత్యసాయిబాబా 100 జయంతిని పురస్కరించుకుని అమృత కలషం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సమితి కన్వీనర్ ప్రసాద్ పట్నాయక్ తెలిపారు. పేదల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ అమృత కలషం వారి ఆకలిని తీర్చేందుకు ఎంతగానో దోహడ పడుతుందన్నారు. కార్యక్రమం అనంతరం సాయిభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న సమారాధన జరిపించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో సాయి, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. కళింగ ఆటో గ్యారేజ్లో అగ్ని ప్రమాదం రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకే రోడ్డులో ఉన్న కళింగ ఆటో సిండికేట్ గ్యారేజీలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా మరో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల సమయం వరకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మహిళా మావోయిస్టు లొంగుబాటు రాయగడ: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా మావోయిస్టు లొంగిపొయారు. లొంగిపోయిన ఆమె శాంతి సికక వురఫ్ పారొ అని సమాచారం. రాయగడ జిల్లాలొని నియమగిరి పర్వతప్రాంతానికి చెందిన డొంగిరియా తెగకు చెందిన ఆమె 2015లో నాగావళి, వంశధార, ఘుంసూర మావోయిస్టుల దళంలో చేరింది. వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెను పట్టుకున్న వారికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. రెండు రోజుల కిందటే ఆమె భర్త మాలూన్ పోలీసులకు లొంగిపోయారు. ముప్పై ఏళ్ల వయసులో ఆయన మావోలతో కలిసి పనిచేశారు. అక్కడ పరిచయం కావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కార్యకలాపాల రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉండి విధులు నిర్వహిస్తుండేవారు. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుని ఇలా లొంగిపోయారు. -
గజపతి జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్గా మధుమిత పర్లాకిమిడి కలెక్టరేట్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన బిజయకుమార్ దాస రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదనపు శాసన కార్యదర్శిగా భుభనేశ్వర్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ మధుమితకు పలువురు ప్రభుత్వ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను లబ్ధిదారులకు చేరువయ్యేలా కృషిచేస్తానని చెప్పారు. అలాగే సాధారణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించటంలో కూడా ముందుంటానని అన్నారు. కలెక్టర్ మధుమితను కలిసిన వారిలో జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, ఏడీఎం. ఫాల్గునీ మఝి, జిల్లా పరిషత్తు సీడీవో శంకర కెరకెటా, రోడ్లుభవనాల శాఖ ఎస్ఈ అభిషేక్ శెట్టి, వాటర్ షెడ్ డిపార్టుమెంటు పీడీ సురేష్ పట్నాయక్ ఉన్నారు. -
అమ్మో ఇన్ని ఆస్తులా..?
జయపురం: జయపురం ఫారెస్టు డివిజన్లో డిప్యూటీ రేంజర్ రామచంద్ర నేపక్ తన ఆదాయానికి మించి 501 శాతం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు కొరాపుట్ విజిలెన్స్ డివిజన్, జయపురం ఎస్పీ నరేంద్ర కుమార్ శనివారం సాయంత్రం జయపురం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అతడి ఇంటిలో రూ.1 కోటి 43 లక్షల 34 వేలతో పాటు బ్యాంకులలో బీమాలో డిపాజిట్లు రూ.1 కోటి 32 లక్షల 85 వేల 754 ఉన్నాయని తెలిపారు. జయపురం ఎస్కేటీ రోడ్డులో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, 3 ప్లాట్లు, 2 హై వాల్యూ ప్లాట్లు, భువనేశ్వర్ యుఎమ్ఎస్ భాగభటి మాన్సన్ రఘునాథ్పూర్ జాలిలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3–బికెహెచ్ ప్లాట్, జయపురం ప్రసాదరావు పేట గోల్డెన్ హైట్ రెసిడెన్సియల్ అపార్ట్ మెంట్లో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బికెహెచ్కే ప్లాట్లు, 1.504 కేజీల బంగారం, 4.6 కేజీల వెండి, 2 నాలుగు చక్రాల కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, రూ.15.50 లక్షల విలువైన గృహ పరికరాలు కనుగొనటం జరిగిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. -
మహానది కోల్ఫీల్డ్తో జిల్లా యంత్రాంగం ఒప్పందం
రాయగడ: మహానది కోల్ఫీల్డ్ కంపెనీతో జిల్లా యంత్రాంగం మూడు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. అందుకు సంబంధించి కోల్ఫీల్డ్ కంపెనీ మేనేజరు సుబ్రజ్యోతి సాహుతో జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి శనివారం ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టారు. కంపెనీ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రాయగడ జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచాలు, పరుపులు, ఇతరత్ర సౌకర్యాలు అందించడానికి సీఎస్ఆర్ నిధి కింద రూ. 4.5 కోట్లు ఖర్చు చేసేందుకు మహానది కోల్ఫీల్డ్ కంపెనీ ఒప్పందం చేసింది. ఈ మొత్తం వ్యయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ఖర్చు చేసేందుకు అవగాహన కుదుర్చుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని మునిగుడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సుమారు రూ. 58 లక్షలతో డయాల్సిస్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు కోల్ఫీల్డ్ కంపెనీ అంగీకరించింది. దీని ద్వారా మునిగుడ పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ప్రజలు మెరుగైన వైద్య సౌకర్యాలు పొందుతారు. జిల్లాలోని కాసీపూర్, పద్మపూర్ మునిగుడ సమితుల్లో గర్భిణుల ఆరోగ్య సంరక్షణతో పాటు వారికి సకాలంలో పౌష్టికాహారం అందించడం, అలాగే పిల్లలకు పౌష్టికాహారంతోపాటు వారి ఆరోగ్య భద్రతను మెరుగు పరిచేందుకు కంపెనీ తరఫున సమారు 3 కోట్ల 96 లక్షల 21 వేల రూపాయలను ఖర్చు చేసేందుకు అంగీకరించారు. -
68 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం రోటరీ క్లబ్ ఆఫ్ ఫ్రైడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్కేటీ రోడ్డు వాసవీ భవనంలో ఆదివారం స్వచ్ఛంద శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 68 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటలకు రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్ పాణిగ్రహి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయండి ఇతరుల ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో శిబిరాలను తరచూ నిర్వహిస్తామని ప్రకటించారు. రక్తదానం చేసేవారికి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, రక్త ప్రసరాన్ని పెంచుతుందని, కొత్త బ్లడ్ సెల్స్ పెరుగుతాయని, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని పిలుపు నిచ్చారు. శిబిరంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రబినారాయణ నంద, జయపురం సబ్డివిజన్ రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కొంత సమయానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సుమారు ఒక గంటపాటు రక్త దాతలకు ఇబ్బంది కలిగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగిన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్బ్యాంకు అధికారి డాక్టర్ ఎస్.ఎస్.మిశ్ర నేతృత్వంలో టెక్నీషియన్లు అమలాన్ జ్యోతి, ప్రమోద్ ఖిలోలు దాతల నుంచి రక్తం సేకరించారు. విక్రమదేవ్ విశ్వ విద్యాలయ విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లు సహకరించారు. రక్త దాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
నిండుకుండలా జలాశయాలు
జయపురం: కొరాపుట్ జిల్లాలో 15 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్పర్ కొలాబ్ జల విద్యుత్ ప్రాజెక్టు, తెలింగిరి సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం అప్పర్ కొలాబ్ ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతంలో 36 మిల్లీ మీటర్ల వర్షం పడింది. విరామం లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. శనివారం నాటికి జలాశయంలో నీరు 851.74 మీటర్లకు చేరింది. గత ఏడాది ఈ సమయానికి 851.75 మీటర్లు ఉండేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అధిక వర్షాల కారణంగా ప్రతి నిమిషానికి 168.275 క్యూసెక్కులు నీరు జలాశయంలోనికి చేరుతుండగా.. జలాశయం నుంచి బయటకు 52.4 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. ఇదిలా ఉండగా..జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలోని తెలింగిరి సాగునీటి ప్రాజెక్టు డ్యామ్ మరమ్మతులు పూర్తయిన తరువాత ఆ జలాశయంలోనికి నీరు చేరటం ప్రారంభమైంది. ఆదివారం జలాశయంలో నీటి 628.2 మీటర్ల నీటిమట్టం ఉంది. జలాశయం డ్యామ్ సగటు నీటి మట్టం 633 మీటర్లు కాగా గత ఏడాది ఇదే సమయానికి 625.1 మీటర్లు ఉండేది. కాగా ఖరీఫ్ పంటలకు రెండు ప్రాజెక్టుల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు విడిచి పడుతున్నారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
● పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ ● మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాల ఎదుట ఉంచి ఆందోళనరాయగడ: సదరు సమితి కూలిలో గల ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న దివ్యా మండగి అనే విద్యార్థిని మృతి చెందింది. ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాల వద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కూలి ఆశ్రమ పాఠశాలలో దివ్యా మండంగికి ఈ నెల 19వ తేదీన తీవ్రమైన జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు తెలియజేయలేదు. కుమార్తె ఆరోగ్యం బాగులేదని తెలుసుకున్న విద్యార్థిని తండ్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. చికిత్స కోసం తీసుకువెళ్తానని, తనతో పంపించాలని అడిగినా అటువంటిదేమీ లేదని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పి పంపించేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జిల్లా కేంద్రా ఆస్పత్రికి శుక్రవారం పాఠశాల నిర్వాహకులు చికిత్స కోసం తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి ఆందోనకరంగా ఉందని, వెంటనే బరంపురం తరలించాలని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి.. వెంటనే బరంపురం హస్పిటల్కు మెరుగైన చికిత్స కోసం ఆదివారం ఉదయం తరలించారు. బరంపురంలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. వెంటనే మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబీకులు ఆశ్రమ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. బాలికపై లైంగిక దాడి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం బాలికపై లైంగిక దాడి జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ఒంటరిగా వస్తున్న సమయంలో ఓ యువకుడు బైక్పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి కొంతదూరం తీసుకెళ్లి నిర్మానుష్యమైన ప్రాంతలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆ సమయంలో రహదారి పక్కన ఓ చోట బాలిక ఏడుస్తూ కూర్చుంది. బాలిక మేనమామ బలిమెల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ ధీరజ్ పట్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాటేసిన నాగుపాముతో ఆస్పత్రికి.. భువనేశ్వర్: విష సర్పం కాటుతో గాయపడిన చేతికి గుడ్డ, మరో చేతిలో కాటేసిన 4 అడుగుల పొడవైన పాముతో ఓ యువకుడు ఆస్పత్రిలో ప్రత్యక్షం అయ్యాడు. యువకుని అవతారం చూసి అక్కడి వైద్యులు, సిబ్బంది అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన అంగుల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిషా పోలీస్ ఠాణా పరిధిలోని కలియాకొట గ్రామస్తుడు బుబుల్ భోయ్ (25) పాము కాటుకు గురయ్యాడు. బంధువులలో ఒకరి ఇంట్లో చొరబడిన పామును పట్టుకునే ప్రయత్నంలో అతడి కుడి చేతికి గాయమైంది. విషపూరిత పాము కాటుకు గురైన తర్వాత ఆ పామును పట్టుకున్న వీడియోను రికార్డ్ చేసి స్వయంగా స్థానిక ఆస్పత్రికి చేరాడు. అతని ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున ప్రథమ చికిత్స చేసి జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక! ● నిందితుడు అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో ఘోరం జరిగింది. ఖోయిర్పూట్ సమితి ముదిలిపోడ పోలీసుస్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చినప్పటికీ కారణకులెవరో చెప్పకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అయితే నెలలు నిండకముందు శనివారం మగ బిడ్డకు జన్మనివ్వడంతోపాటు కారకుడెవరో చెప్పడంతో తల్లిదండ్రులు మేల్కొన్నారు. ఆదివారం ముదిలిపోఢ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన యువకుడు బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొవడంతో అతన్ని అరెస్టు చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
రాయగడ: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన స్థానిక గాంధీనగర్ రెండో వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు కె.భారతి (62)గా గుర్తించారు. ఉదయం ఆరు గంటల సమయంలో తడి బట్టలను మేడపై ఉన్న ఇనుప తీగపై ఆరవేస్తున్న సమయంలో విద్యుత్షాక్ తగిగి ఆమె కింద పడిపొయారు. బట్టలు ఆరవేసేందుకు వెళ్లిన ఆమె కిందకి దిగిరాకపొవడంతో మేడ మీదకు వెళ్లి చూసిన కుటుంబీకులకు భారతి ఆపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబీకులు ఆమైపె ఇనుప తీగ పడి ఉండడంతో విద్యుత్షాక్కు గురైనట్లు గుర్తించారు. సమీపంలో గల విద్యుత్ తీగను ఎలుక కొరికేయడంతో అది సరాసరి బట్టలు ఆరబెట్టేందుకు ఉన్న ఇనుప తీగపై పడిందని అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
ఆదిత్యా నమోస్తుతే!
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాస మొదటి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈవో ప్రసాద్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఉచిత మంచినీటిని పంపిణీ చేయించారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక తులసీదళాలతో ఆదిత్యుని మూలవిరాట్టును అలంకరించి భక్తుల సర్వదర్శనాలకు ఉదయం 6 గంటల నుంచే అనుమతించారు. విశిష్ట, ప్రత్యేక దర్శనాలతో పాటు ఉచిత దర్శనాల క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరారు. ఆదిత్యుని సన్నిధిలో డ్రాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ది డెబ్ట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డ్రాట్–కోల్కత్తా) జస్టిస్ అనిల్కుమార్ శ్రీవాత్సవ్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు వేదమంత్రోఛ్చారణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనాలతో అనివెట్టి మండపంలో స్వామి వారి శేషవస్త్రాలను కప్పి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టతను, స్వామి వారికి జరుగుతున్న సేవల వివరాలను శంకరశర్మ వివరించారు. -
యువకుని దారుణ హత్య
రాయగడ: జిల్లా పరిధిలోని కుంభికోట పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొడామర్ గ్రామానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘనటకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం పొడామర్ గ్రామానికి చెందిన సంజయ్ కందపాణి (30) అనే యువకుడు ఏదో పనిపై కుంభికొట బస్టాండ్ వద్ద నిలబడ్డాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు అతనిపై ఆకస్మాతుగా మరణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కందపాణిని అక్కడి వారు కొందరు కుంభికొట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని కుటుంబీకులు ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల అదుపులో నిందితులు -
పోలీసులకు చిక్కిన రీల్స్ సోగ్గాడు!
భువనేశ్వర్: నడి రోడ్డు మీద విలాసవంతమైన మోటారు సైకిల్పై తుపాకీ పట్టుకుని రీల్స్ చిత్రీకరిస్తున్న సోగ్గాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి విన్యాసాలు పరిసరాల్లో తిరుగాడుతున్న ప్రజలను భయాందోళకు గురి చేస్తున్నాయని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఉత్సాహవంతమైన రీల్స్ చిత్రీకరణ ముగియక ముందే పోలీసులకు చిక్కాడు. అంగుల్ ప్రాంతం ప్రధాన రహదారిపై హెల్మెట్ లేకుండా రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తు చేతిలో తుపాకీ పట్టుకుని వీరత్వం ప్రదర్శించి ఒంటి చేతితో రాయల్ ఎన్ఫీల్డు గాలి వేగంతో నడుపుతూ వీడియో చిత్రీకరించాడు. ఈ దృశ్యాన్ని సాంఘిక మాధ్యమంలో ప్రసారం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి రీల్స్ హీరోని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకుడు వినియోగించిన రాయల్ ఎన్ఫీల్డు వాహనం, వీరత్వ ప్రదర్శనకు వినియోగించిన బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకుని అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఖండపడా ఠాణా పోలీసులు తెలిపారు. -
షిర్డీసాయి ఆలయంలో చోరీ
శ్రీకాకుళం రూరల్: పెదగనగళ్లవానిపేట పంచాయతీ గాంధీనగర్ కాలనీలో షిర్డీసాయిబాబా ఆలయంలో రెండు రోజులు కిందట చోరీ జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు జతల వెండి కిరీటాలు, వెండి పాదాలు, దీపం కుందెలు పట్టుకుపోయారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ రూ.43,500 ఉంటుందని ప్రాథమిక అంచనా వేసారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరీక్షల పరిశీలన ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణను జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం పర్యవేక్షించారు. జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకూ రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీశివానీ కాలేజీలో మొదటి రోజు జరిగిన పరీక్షకు 190 మంది అభ్యర్థులకు గాను 163 మంది హాజరయ్యారు. డీఆర్వోతోపాటు ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి భోగీశ్వరి, పద్మప్రియ, హెచ్–సెక్షన్ సూపరింటెండెంట్ జోగారావు పర్యవేక్షించారు. తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం వజ్రపుకొత్తూరు రూరల్: నువ్వలరేవు సముద్రతీరానికి ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం చేరింది. అక్కుపల్లి గ్రామానికి చెందిన మడ్డు ధనరాజు కొంతకాలంగా మానసిక సమస్యలు, ఫిట్స్తో బాధపడుతున్నారు. ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరుకోలేదు. ఈ క్రమంలో సముద్రంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఆదివారం నువ్వలరేవు తీరానికి మృతదేహం చేరడంతో సోదరుడు వాసు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ధనరాజు తల్లిదండ్రులు 18 ఏళ్ల క్రితం మృతి చెందడంతో సోదరి హైమా వద్ద ఉంటున్నాడు. అంబులెన్సుకు ప్రమాదం టెక్కలి రూరల్: మండలంలోని చాకిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్కు చెందిన అంబులెన్స్ పలాస వచ్చి తిరిగి వెళ్తుండగా చాకిపల్లి కొత్తూరు సమీప జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అంబరాన్నంటిన సంబరం ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం లొద్దపుట్టిలో పూజలందుకుంటున్న ధనరాజుల తులసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆంధ్రా, ఒడిశా గ్రామాలకు చెందిన భక్తులు సంబరాలు పేరిట మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కాళీమాత వేషధారణలు, కోయ నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. – ఇచ్ఛాపురం రూరల్ -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా, హుషారుగా సాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అండర్–14, 16, 18, 20 నాలుగు వయో విభాగాల్లో రన్స్, త్రోస్, జంప్స్ ఈవెంట్స్లో సత్తాచాటారు. వచ్చే నెల 9 నుంచి 11 వరకు చీరాలలో జరగనున్న రాష్ట్రపోటీలకు విజేతలను పంపిస్తారు. క్రీడాకారుల ట్రాక్ రికార్డు బట్టి తుది జాబితాను ప్రకటిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, అథ్లెటిక్స్ సంఘ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, కె.మాధవరావు, కె.హరిబాబు, తవిటయ్య, శ్రీనివాసరావు, ఆనంద్, మురళి, పద్మనాభరెడ్డి, గోవింద్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. –శ్రీకాకుళం న్యూకాలనీ -
రాష్ట్రంలో సముద్ర రవాణా పెరుగుతోంది
భువనేశ్వర్: దేశంలోని ప్రధాన సముద్ర రవాణా కేంద్రంగా రాష్ట్రం ఆవిర్భవించనుంది. సముద్ర వాణిజ్యం, సరుకుల రవాణా గణనీయంగా పెరుగుతుండడం ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధానేతర ఓడ రేవుల సరుకు రవాణా సామర్థ్యం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 80 మిలియన్ టన్నులకు చేరుకుంది. దీనిలో ధామ్రా ఓడ రేవు వాటా అత్యధికంగా 46.08 మిలియన్ టన్నులు కాగా.. గోపాల్పూర్ ఓడ రేవు సామర్థ్యం 6 మిలియన్ టన్నులకు చేరుకుంది. దీనివల్ల 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.306.15 కోట్ల ఆదాయం చేకూరింది. 2024–25లో 150.41 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయడం ద్వారా పారదీప్ ఓడ రేవు దేశంలోని ప్రధాన ఓడరేవులలో అత్యధిక మొత్తంలో సరుకును రవాణా చేసిన ఘనత సాధించింది. సాంకేతికత, లోతైన బెర్త్లు, ఇతర ఆధునిక సౌకర్యాల ఓడరేవుగా రాష్ట్రంలో సుమద్ర మార్గ వాణిజ్యానికి కొత్త అవకాశాలు కల్పిస్తుంది. ధామ్రా, గోపాల్పూర్ ఓడ రేవులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అనుసంధానంతో పురోగతి సాధిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన, ప్రధానేతర ఓడ రేవుల సామర్థ్యం క్రమంగా పెరుగుతున్నందున ఒడిశా ప్రపంచ సముద్ర వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా మారనుందని అనబంధ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తీరప్రాంత షిప్పింగ్ ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలతో అనుసంధానం మెరుగుపడుతుంది. 80 మిలియన్ టన్నుల సరుకు రవాణా -
సహాయ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం
భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ విశ్వ విద్యాలయం క్యాంపస్లో సహాయ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం జరిగింది. అధ్యాపకుల క్వార్టర్స్లోకి చొరబడి ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. ఈ మేరకు బాధితురాలు రెముణా పోలీస్ ఠాణాలో ఈ ఫిర్యాదు చేసింది. నిందిత యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. క్యాంపస్ భద్రత పెంపు సహాయ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం తర్వాత బాలాసోర్లోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో భద్రతను పెంచారు. సంఘటన జరిగిన సమయంలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డును తొలగించారు. ప్రతి గేటు వద్ద 2 మంది చొప్పున సెక్యూరిటీ గార్డులను నియమించారు. క్యాంపస్లో పనిచేసే కార్మికులు తమ ఆధార్ కార్డులను చూపించి లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. క్యాంపస్ భద్రత పటిష్టత కోసం ఏర్పాట్లు చేయాలని డీజీపీకి లేఖ రాస్తామని వైస్ చాన్స్లర్ తెలిపారు. -
అథ్లెటిక్స్ సమరానికి వేళాయె
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈనెల 27వ తేదీన జరగను న్నాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపిక ల ప్రక్రియ మొదలుకానుంది. అథ్లెటిక్స్ అసో సియేషన్ రాష్ట్ర, జిల్లా చైర్మన్ కొన్న వెంకటేశ్వరావు(వాసు) సూచనల మేరకు జిల్లా అథ్లెటి క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి నేతృత్వంలో జిల్లా సంఘ ప్రతినిధులు, పీడీ, పీఈటీలు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. నాలుగు వయో విభాగాల్లో పోరు.. సౌత్జోన్ నేషనల్స్లో పాల్గొనే అథ్లెటిక్స్ క్రీడా కారుల ఎంపికలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో చేపట్టనున్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా 100 మీటర్ల పరుగుపందాలు, హర్డిల్స్, 200 400, 800, 1000, 2వేలు, 3వేలు, 5వేల మీటర్ల పరుగు పందాలు, నడక, లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, హేమర్త్రో, పోల్వాల్ట్ తదితర అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పోటీలు నిర్వహించి అందులో రాణించిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేయనున్నారు. ఇక్కడ రాణిస్తే రాష్ట్ర పోటీలకు.. ఏపీ జూనియర్ స్టేట్మీట్(అంతర్జిల్లాల) అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలు బాపట్ల జిల్లా (చీరాల) వేదికగా ఆగస్ట్ 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఇక్కడ జరిగే ఎంపికల్లో రాణించిన అథ్లెట్లను బాపట్లలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నారు. అక్కడ మూడు రోజులపాటు పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేస్తారు. గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులు సౌత్జోన్ నేషనల్స్కు నేరు గా అర్హత సాధించనున్నారు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు సౌత్జోన్ జూనియర్ నేషనల్స్ జరగనున్నాయి. క్రీడాకారులు వివరాల కో సం సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్య దర్శి కె.మాధవరావు (9346903771)ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు ఎంపిక ప్రతిభే ఆధారంగా.. క్రీడాకారుల ప్రతిభే ఆధారంగా ఎంపికల ను నిర్వహిస్తాం. ఇక్కడ రాణించిన బాల బాలికలను బాపట్లలో జరిగే స్టేట్మీట్కు ఎంపిక చేస్తాం. అక్కడ రాణిస్తే సౌత్జోన్ నేషనల్స్కు నేరుగా అర్హత సాధిస్తారు. – మెంటాడ సాంబమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సద్వినియోగం చేసుకోవాలి సౌత్జోన్ మీట్ షెడ్యూల్ వెలువడింది. 27న శ్రీకాకుళంలో జరిగే జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమ ప్రతిభను నిరూపించుకోవాలి. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు -
కవితల పోటీల్లో అ‘ద్వితీయ’ ప్రతిభ
పర్లాకిమిడి: ఒడిశా సాహిత్య అకాడమీ తరఫున నిర్వహించిన కవితల పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న స్థానిక గాంధీ మెమోరియల్ ప్రాథమిక ఉన్నత విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాస్మిన్ బోరాడో.. రాష్ట్రస్థాయిలోనూ ద్వితీయ స్థానం కై వసం చేసుకుంది. ఒడిశా సాహిత్య అకాడమీ 68వ స్వర్ణజయంతి వేడుకల (జూలై 25) సందర్భంగా భువనేశ్వర్లోని రవీంద్ర మండపంలో ఏర్పాటుచేసిన సభలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ చేతులమీదుగా జాస్మిన్ బోరాడోకు బహుమతి ప్రదానం చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగులు చేనేత దుస్తులు ధరించాలి
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి భువనేశ్వర్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఏదో ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విజ్ఞప్తి చేశారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం తొలి ఒడిశా టెక్స్టైల్ సమ్మేళనం ప్రారంభోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద వస్త్ర సమ్మేళనంమని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగత్సింగ్పూర్, భద్రక్లో 2 జౌళి, పాదరక్షల పార్కులను ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేశారు. ఈ సమ్మేళనంలో సమగ్రంగా 33 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. దీంతో రూ.7808 కోట్ల పెట్టుబడి హామీ లభించింది. ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో 53,300 ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఏటా క్రమం తప్పకుండా ఒడిశా టెక్స్టైల్ సమ్మేళనాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. వస్త్ర పరిశ్రమలో పని చేసే వారి మజూరు నెలకు రూ.1,000 పెంచడంతో ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రూ.6,000 బదులుగా నెలకు రూ.7,000, పురుష ఉద్యోగులకు రూ. 5,000 బదులుగా నెలకు రూ.6,000 చెల్లిస్తారు. ఒడిశా పెట్టుబడిదారులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని సమగ్ర దేశీయ పెట్టుబడులలో 40 శాతం ఒడిశాకు రావడం గర్వకారణం. పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం పట్ల కూడగట్టుకున్న నమ్మకాన్ని పదిలపరచుకోవడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు వివరించారు. ఒడిశా వస్త్ర పరిశ్రమ పురాతనమైనది. వస్త్రాలు, వస్త్రధారణతో మన సంస్కృతి, సంప్రదాయంతో ముడిపడి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పశ్చిమ ఒడిశా సంబల్పురి, బరంపురం పట్టు తదితర జౌళి ఉత్పాదనలు తార్కాణంగా పేర్కొన్నారు. వీటిని ప్రోత్సహించి ఒడిశాను వస్త్ర హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో వస్త్ర రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించి రానున్న దశాబ్దంలో 5 వస్త్ర, దుస్తులు పార్కులను అభివృద్ధి చేయడం ప్రభుత్వ యోచన అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముడి పదార్థాల లభ్యత, ఓడ రేవుల అనుసంధానంతో సహాయక కార్యశైలి ఒడిశా వస్త్ర , దుస్తుల పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారిందని రాష్ట్ర చేనేత, జౌళి, హస్తకళల మంత్రి ప్రదీప్ బాల సామంత అన్నారు. రాష్ట్ర చేనేత వారసత్వాన్ని బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందన్నారు. -
ప్రైవేట్ బస్సుల సేవలు అభినందనీయం
జయపురం: ప్రైవేట్ బస్సు యజమానులు కొరాపుట్ జిల్లా ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జిల్లాలో బస్సు సౌకర్యాలు అంతగాలేని గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు వేసి ప్రజలకు సముచిత సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జయపురంలోని ఓ కల్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన జయపురం ప్రైవేట్ బస్సు యజమానుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జయపురం ప్రైవేట్ బస్సుల యజమానులతోపాటు జయపురం మీదుగా ఇతర ప్రాంతాలకు నడిచే ప్రైవేటు బస్సు యజమానులు అనేక మంది పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత జరిగిన ప్రైవేట్ బస్సు యజమానుల ఆత్మీయ సమావేశంలో బస్సు యజమాన సంఘ సలహాదారు బస్సు యజమాని బసంత కుమార్ బిశ్వాల్, రామ చంద్ర పాడీ, న్యాయ సలహాదారు, న్యాయవాది సుశాంత అధికారి, జయపురం బస్సు యజమానుల సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పాత్రో, కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి, బరంపురం ప్రైవేట్ బస్సు యజమానుల ప్రతినిధి టుటుభాయి పాల్గొన్నారు. కార్యదర్శి నరేంద్ర కుమార్ మహంతి మాట్లాడుతూ.. కొరాపుట్ ప్రజలకు సముచిత బస్సు సౌకర్యాలు కల్పించటమే తమ లక్ష్యం అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాము ప్రైవేట్ బస్టాండ్లో ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -
ఉచిత నేత్ర వైద్యశిబిరం
రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం, హింజిలికట్లోని శంకర్ నేత్ర వైద్యశాల సంయుక్తంగా శుక్రవారం స్థానిక కళింగ వైశ్య సంఘం కార్యాలయం ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన 85 మందికి వైద్యం అందించారు. శంకర్ ఐ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ హృషి కేష్ రథ్, క్యాంప్ మేనేజరు నళిని కాంత్ రౌత్, సిబ్బంది శుభశ్రీ తదితరుల నేతృత్వంలో నిర్వహించిన శిబిరంలో 13 మందికి నేత్ర పరీక్షలు చేసి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వీరిని శంకర్ హస్పటల్కు చెందిన యాజమాన్యం ఖర్చులతో వారికి ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తారని శిబిరం నిర్వాహకులు కలింగ వైశ్యసంఘం అధ్యక్షులు కింతలి అమర్ నాథ్, కార్యదర్శి టంకాల జయరాం, సహకార్యదర్శి చిన్నారి విజయ్ మోహన్ తెలిపారు. కళింగ వైశ్య సంఘం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఇటువంటి తరహా ప్రజాహిత కార్యక్రమాలు భవిష్యత్లో మరిన్ని నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నామని అధ్యక్షులు అమర్ నాథ్ తెలిపారు. -
ఒడిశా మహిళా కూలీ దుర్మరణం
కశింకోట: రోడ్డు ప్రమాదంలో ఒడిశా మహిళా కూలీ (54) దుర్మరణం చెందింది. అనకాపల్లి జిల్లా కశింకోట వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం.. ఒడిశాలోని జైపూర్కు చెందిన కళావతి కొంతకాలంగా స్థానిక ఇటుకల బట్టీల్లో పని చేస్తోంది. ఈ క్రమంలో కశింకోట కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్న ఆమెను బొలేరో వ్యాన్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇటుకల బట్టీ యజమాని ఇదగల మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన పూరీ కలెక్టర్ దివ్య జ్యోతి పరిడా పూరీ జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువుదీరిన చతుర్థామూర్తుల్ని దర్శించుకుని ఆయన కార్యాలయంలో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు. – భువనేశ్వర్/పూరీ కలెక్టర్ పట్వారికి ఘనవీడ్కోలు రాయగడ: జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారికి బదిలీ కావడంతో జిల్లా యంత్రాంగం ఆమెకు శుక్రవారం స్థానిక కలక్టర్ సమావేశం హాల్లో ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడీఎం నిహారి రంజన్ కుహోరో ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్వహించిన వీడ్కోలు సభలో ఆమె జిల్లాకు చేసిన సేవలను సిబ్బంది కొనియాడారు. అనంతరం దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం కలక్టర్ పట్వారి కార్యాలయం సిబ్బందితో గ్రూపుఫొటో దిగారు. తన విధుల్లో భాగంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో కలెక్టర్గా తాను సేవలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ పిఎం చంద్రకాంత్ మాఝి తదితరులు పాల్గొన్నారు. జీడి రైతుకు సత్కారం కాశీబుగ్గ: వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్టు (ఓడీఓపీ) కార్యక్రమానికి జిల్లా పలాస జీడిపప్పు ఎంపికై న సందర్భంగా.. పారిశ్రామిక వేత్తలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన రైతు యంపల్లి నారాయణను సత్కరించారు. ఆలిండియా కాష్యూ అసోసియేషన్ చైన్నె మహాబలిపురంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాష్యూ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆహ్వా నం మేరకు రైతు వెళ్లారు. పలాస పరిసర ప్రాంతంలో ఉద్దానంలో రైతులు పండించిన జీడి పంట కారణంగా పేరుప్రఖ్యాతలు వచ్చాయ ని ఏపీసీఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లా కాంతారావు తెలిపారు. అబ్బాయిపేటలో చోరీ జలుమూరు: జోనంకి పంచాయతీ అబ్బాయిపేటకు చెందిన ఉప్పాడ నరసమ్మ ఇంటిలో దొంగతనం జరిగింది. చోరీలో రూ.60వేల విలువై న బంగారం పోయినట్లు ఆమె తెలిపారు. పది రోజుల కిందట ఆమె హరిదాసుపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉద యం తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంది. అందులో బంగారంతో పాటు కొన్ని వస్తువులు కనిపించలేదు. -
మౌలిక వసతులపై దృష్టి పెట్టండి: కలెక్టర్
బూర్జ: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో గల కొల్లివలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యాలయంలో శుక్రవారం జిల్లాలోగల అన్ని హాస్టళ్ల అనుబంధ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, వసతులు, డార్మిటరీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిటికీల వద్ద దోమ తెరలు అమర్చాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా హాస్టల్ జిల్లా అధికారుల తో సమీక్ష నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయాల ఎస్ఎం పురం, వమ్మరవెల్లి కళాశాల ప్రిన్సిపాల్స్, కేజీబీవీ విద్యాలయాల ఏపీసీ ఎస్.శశిభూషణరావు, ఏపీ మోడ ల్ విద్యాలయాలు ఏడీ శ్రీనివాసరావు, డిప్యూటీ ఈఓ కె.విజయకుమారి, కన్వీనర్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి జిల్లా ప్రజారవాణా అధికారి హనుమంతు అమరసింహుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి ఆగస్టు నెల 9వ తేదీ లోపు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు
పర్లాకిమిడి: పట్టణంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమారామలింగేశ్వర మందిరంలో పార్వతీదేవి మందిరంలో భక్తులు కుంకుమపూజలు చేశారు. ముత్తయిదవలకు పసుపు, కుంకుమ పెట్టి, దక్షిణ తాంబూలాలు అందించారు. లలితా దేవి అమ్మవారి వద్ద భక్తులు పండ్లు, పువ్వులతో పూజించారు. కొత్త బస్టాండ్ వద్ద వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కుంకుమపూజలను అర్చకులు వనమాలి మణిశర్మ మహిళలతో నిర్వహించారు. రాయగడలో.. రాయగడ: శ్రావణ మాసం మొదటి శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీనగర్లో గల వేంకటేశ్వర కళ్యాణ మండపంలో లక్ష కుంకుమ పూజలు చేశారు. కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరిగాయి. శ్రావణ మాసం విశిష్టతను ఈ సందర్భంగా భాస్కరాచార్యులు భక్తులకు వివరించారు. అత్యంత పవిత్రమైన ఈ నెలలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయని వివరించారు. -
హిరాకుద్ జలాశయానికి వరదపోటు
భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం. -
గజపతి కలెక్టర్ బిజయకుమార్ దాస్కు ఘనంగా వీడ్కోలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు శాసన కార్యదర్శిగా భువనేశ్వర్కు పదోన్నతిపై బదిలీ అవ్వడంతో ప్రభుత్వ ఉన్నత అధికారులు, కలెక్టరేట్, రెవెన్యూ, జిల్లా పరిషత్ సిబ్బంది వీడ్కోలు సభను ఆర్శెట్టి భవనంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ను ప్రభుత్వ అధికారులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు సభకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝి అధ్యక్షత వహించారు. కలెక్టర్ బిజయ కుమార్ దాస్ గజపతి జిల్లాలో 11 నెలల 15 రోజులు పనిచేశారు. ఆయన ఒక మిత భాషి అని, మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారని ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా అన్నారు. ఆయన 11 నెలల పరిపాలనలో అందరు అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయడమే కాకుండా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమలు జరిగాయని అన్నారు. -
నలుగురు నిందితుల అరెస్టు
జయపురం: భారతమాల ప్రాజెక్టు క్యాంప్లో జరిగిన దొంగతనం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజన్లోని బొరిగుమ్మ పోలీసు అధికారి సత్యభ్రత లెంక శుక్రవారం వెల్లడించారు. బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో బొరిగుమ్మ పోలీసులు నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరిస్తూ.. అరెస్టు అయిన వారు బొరిగుమ్మ ప్రాంతం మీనా హరిజన్, దైతేరీ ఘాసి, త్రిపతి హరిజన్, ఒక మైనర్ ఉన్నాడన్నారు. మైనర్ నిందితుని జేజే బోర్డులో హాజరుపరచి అనంతరం అతడిని బాల రక్షక గృహానికి పంపినట్లు అధికారి వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. బొరిగుమ్మ సమితి కమర గ్రామ ప్రాంతంలో భారత మాల ప్రాజెక్టు కంపెనీలో క్యాంప్ ఉంది. కార్మికులు, సూపర్వైజర్లు ఉంటున్నారు. 2024 అక్టోబర్ 1వ తేదీ రాత్రి 3 గంటల సమయంలో నలుగురు దుండగులు క్యాంప్లో ప్రవేశించారని, భయంకర వాతావరణం సృస్టించి సూపర్వైజర్తోపాటు కార్మికులను తాళ్లతో బంధించారని వెల్లడించారు. వారి వద్దగల రూ.8 వేల నగదు, బైక్, మూడు ఫోన్లు, రెండు కటింగ్ మిషన్లు దొంగిలించుకుపోయారన్నారు. ఈ సంఘటనపై సూపర్వైజర్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో లిఖిత ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. దర్యాప్తు అధికారి ఏఎస్ఐ ద్రోణాచార్య బాగ్ గురువారం నలుగురు నిందితులను అరెస్టు చేశారని వెల్లడించారు. వారి నుంచి రెండు ఫోన్లు స్వాధీనపరచుకున్నట్లు ఎస్డీపీఓ తెలిపారు. బొరిగుమ్మ పోలీసు అధికారి పాల్గొన్నారు. కొండచిలువ కలకలం రాయగడ: స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం సుమారు 12 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. కార్యాలయం ముందు నుంచి కొండచిలువ వెళ్తుండగా సిబ్బంది చూసి వెంటనే స్నేక్ స్నాచర్ ప్రమోద్ సేనాపతికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సేనాపతి.. అర గంట వ్యవధిలో పామును పట్టుకున్నారు. పామును చూసేందుకు సిబ్బందితోపాటు సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్నా కూడా వచ్చారు. పామును స్నేక్ స్నాచర్ సమీపంలో గల అడవుల్లో విడిచిపెట్టాడు. -
ప్రజల చెంతకు సహకార సేవలు
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ల సమావేశం శుక్రవారం జరిగింది. కెసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జయపురంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో బ్యాంక్ అమలు చేస్తున్న కార్యకలాపాలు.. వాటి ఫలితాలపై చర్చించారు. బ్యాంక్ సర్వాంగ ఉన్నతికి చేపట్టవలసి పనులపై మాట్లాడారు. అలాగే బ్యాంక్ చేపడుతున్న ప్రజాహిత పథకాలు ఖాతాదారుల చెంతకు చేర్చి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని నిర్ణయించారు. సమావేశంలో బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, భీమసేన్ సాహు, కార్యదర్శి అతుల్య కుమార్ మల్లిక్, బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హరిశ్చంద్ర బనాగడతో పాటు పలువురు డైరెక్టర్లు, బ్యాంక్ పరిశీలన కమిటీ సభ్యులు, బ్యాంక్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మొక్కల పంపిణీ
జయపురం: జయపురం సమితి బలియ గ్రామం పంచాయితీలో గురువారం జయపురం శారదా విహార్ ప్రాంత వికాశ సంకల్ప ఫౌండేన్, కేశవ సేవా ట్రస్టులు సంయుక్తంగా వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా బలియ పంచాయతీ కుంతరకాల్ గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తుల్లో ఒక్కక్కరికీ రెండు మొక్కలు చొప్పున పంపిణీ చేసి వాటిని పెంచే బాధ్యతను తెలియజేశారు. మొక్కల పెంపకం జన జీవనానికి, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. వందలాది ఔషధ మొక్కలతో పాటు మునగ, బొప్పాయి, జామి, జీడి మామిడి మొక్కలను అందజేశారు. గ్రామీణులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు స్వీకరించారు. నిర్వాహకులు గ్రామీణులకు మొక్కలతో పాటు ఎరువులు అందజేశారు. ప్రతి గ్రామ వాసి కాయకూరలు, పండ్ల తోటలు పెంచి ప్రతి దినం ఆర్థికంగా లబ్ధి పొందాలని అందుకు తమ సంస్థలు సహకరిస్తాయని గ్రామస్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో కేశవ సేవా ట్రస్ట్, వికాశ సంకల్ప ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర, నిరాకర చౌదరి, డొంబురు పాణిగ్రహి, పార్ధసారధి, సుభ్రత పండ పాల్గొన్నారు. -
వంతెనపై వరద నీరు
ఎఫ్టీఏలో ఉనికి కోల్పోయిన ఒడిశా యువతి అనుమానాస్పద మృతి రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో గల చంద్రశేఖర్పూర్ పోలీసులు చంద్రశేఖర్పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ● పట్టుబడిన రూ. 2.44 కోట్ల నగదు, విలువైన బంగారు ఆభరణాలు ● విలువైన భవనాలు ఉన్నట్టు గుర్తింపు జయపురం: కొరాపుట్ జిల్లా జయపురం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపక్ విజిలెన్స్ వలలో పడ్డారు. పట్టణం సోంబారు తోట వీధిలోని అతని భవవనంలో, ప్రసాదరావుపేటలోని ఇంటిపైన బిజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అతనికి సోంబారుతోటతోపాటు ప్రసాదరావుపేటలో ఇల్లు, ఎన్కేటీవో రోడ్డులో ఒక ఇల్లు, మరో అపార్ట్మెంట్, భువనేశ్వర్లో మరో భవనం, జయపురం ప్రాంతంలో 26 ఎకరాల పంట భూమి ఉన్నట్లు ఇంతవరకు ఆధారాలు లభించినట్లు కొరాపుట్ ప్రాంతీయ బిజిలెన్స్ ఎస్పీ నరేంద్రకుమార్ పాఢీ సూచనప్రాయంగా వెల్లడించారు. ఇంకా మరికొన్ని ప్రాంతాలోని అతని ఆస్తులపై జయపురం విజిలెన్స్ విభాగ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇంతవరకు రెండు కోట్ల 44 లక్షల రూపాయల నగదు, 500 గ్రాముల బంగారు నగలు, రెండ కేజీల వెండి, వాటితో పాటు మరికొని విలువైన బంగారు నగలు సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. భువనేశ్వర్: యునైటెడ్ కింగ్డమ్తో భారత దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుతుర్చుకుంది. ఈ ఏడాది జూలై 24న ఈ చారిత్రాత్మక ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రముఖుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం వ్యవసాయ ఉత్పాదనలు, వస్త్రాలు, క్రీడా సామగ్రి, నగలు, ఆభరణాలు, బొమ్మలు, పింగాణి, తోలు, పాదరక్షలు, రబ్బరు వంటి ఉత్పాదనల క్రయవిక్రయాలకు మార్గం సుగమమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ, పేరొందిన ప్రాంతీయ ఉత్పాదనలు యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి అవుతాయి. ఈ జాబితాలో ఒడిశాకు స్థానం లభించక పోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో 25 పైబడి భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు పొందిన ఉత్పత్తులు పేరొందాయి. ఈ జాబితాలో కంధమల్ పసుపు నుంచి ప్రత్యేకమైన వస్త్రాలు, హస్తకళల వరకు, కంధమాల్ హల్ది, సంబల్పురి చీర, రఘురాజ్పూర్ విభిన్న కళాకృతులు (పొట్టా చిత్రాలు), కటక్ వెండి తీగల అల్లిక సామగ్రి తదితర పలు ఉత్పాదనలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటీ యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) జాబితాలో చోటు చేసుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి అరకు కాఫీ ఈ ఒప్పందంలో చోటు చేసుకుంది. వాస్తవానికి అరకు వ్యాలీ అరబిక కాఫీగా ఉభయ ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాకు సంయుక్తంగా భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు మంజూరైంది. ఎఫ్టీఏ ఒప్పందం జాబితాలో ఈ ఉత్పాదనని ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి స్థానం కల్పించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రం నుంచి 20 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులతో రాష్ట్ర మహిళ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. భారత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఘనమైన బలం ఉన్న రాష్ట్రంలో స్వదేశీ ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం ఉనికిని పరిరక్షించడంలో తమ సమర్థతని ప్రదర్శించడంలో విఫలమైనట్లు విమర్శలు పుంజుకుంటున్నాయి. 2.63 యూఎస్ బిలియన్ డాలర్లు టర్నోవరుతో ఒడిశా యూఏఈ యొక్క 8వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ పరిస్థితులు యునైటెడ్ కింగ్డమ్తో ఒప్పందం సందర్భంగా పరిగణనలోకి తీసుకోకపోవడం తాజా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో రాష్ట్రం ఉనికి కనుమరుగైపోయింది. ఈ పరిస్థితిని సవరించే దిశలో ఉభయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. ఒడిశా ఇటీవల మామిడి, బొప్పాయి, పసుపు వంటి ఆహార ఉత్పాదనల్ని యునైటెడ్ కింగ్డమ్కి ఎగుమతి చేయడం ప్రారంభించింది. దీని విస్తరణ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ రకాల ఆహార, వస్త్ర తదితర దైనందిన జీఐ ఉత్పాదనలు పుష్కలంగా ఉన్నాయి. వాటి ప్రపంచ వ్యాప్త ప్రోత్సాహానికి సరైన ప్రాతినిధ్యం లేదని తాజా ఎఫ్టీఏ ఒప్పందం స్పష్టం చేసింది. సంస్థాగత మద్దతుతో వ్యవసాయ ఉత్పాదన ఎగుమతి సంస్థలతో అనుసంధానం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఉనికి బలపడుతుంది. మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల, పోడియా సమితుల మధ్య ఉన్న కన్యాశ్రమం వద్ద గల వంతెన నీట మునిగింది. మల్కన్గిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంతెన పై శుక్రవారం ఉదయానికి 2 అడుగుల వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం 9 గంటల నుంచి నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అయి మల్కన్గిరి నుంచి కలిమెల, ఎంవీ 79, మోటు వైపు నుంచి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పొడియా సమితికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. వాన కొనసాగితే శనివారానికి పోట్టేర్, ఎంవీ 90 గ్రామం, కంగుర్కొండ, ఎంవీ 96 గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వంతెనలు కూడా నీట మునిగే అవకాశం ఉంది. -
జవాబుదారీతనం తప్పనిసరి
భువనేశ్వర్: బాలల సంరక్షణ సంస్థలు నిబద్ధత, జవాబుదారీతనంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఆదేశించారు. ఆయన అధ్యక్షతన స్థానిక లోక్ సేవా భవన్లో రాష్ట్ర స్థాయి బాలల రక్షణ, సంక్షేమ పర్యవేక్షణ సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో బాలల రక్షణ, సంరక్షణ కార్యకలాపాల్లో సంస్థాగత, సంస్థేతర వర్గాల పని తీరుని సమీక్షించారు. బాలల సంరక్షణ సంస్థలలో నిర్వహించే యోగా సెషన్లపై వివరణాత్మక చర్చ జరిగింది. ప్రస్తుతం 41 బాలల సహాయ యూనిట్లు, హెల్ప్ డెస్క్లు, రాష్ట్ర కంట్రోల్ రూమ్ పిల్లలకు మద్దతు అందించడానికి సమర్థంగా పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ వాత్సల్యను రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో బాలల రక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలలో మూడు అంచెల బాలల సంక్షేమం, రక్షణ కమిటీలు రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తున్నాయని మహిళా, శిశు అభివృద్ధి డైరెక్టర్ మోనిషా బెనర్జీ తెలిపారు. దాదాపు 8,150 మంది పిల్లలు సంస్థాగత సంరక్షణలో ఉండగా, 6,317 మంది పిల్లలు సంస్థాగతేతర సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా దత్తత ఽఅభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం బాలుర కంటే బాలికలను దత్తత తీసుకోవడం పెరుగుతుంది. రాష్ట్రంలో 160 బాలల గృహాలు, 33 ప్రత్యేక దత్తత సంస్థలు, 12 ఓపెన్ షెల్టర్లు, 7 పరిశీలన గృహాలు మరియు 7 ప్రత్యేక గృహాలు పని చేస్తున్నాయి. చైల్డ్ కేర్ సంస్థలలోని 8,150 మంది పిల్లలలో 98 శాతం మంది ఆధార్ కోసం నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం, 672 మంది పిల్లలు వృత్తి విద్యను అభ్యసిస్తున్నారు. 8,130 మంది వ్యక్తులు 264 వేర్వేరు కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందారు. 211 మంది పిల్లలు ఉపాధి పొందగా, 79 మంది స్వయం ఉపాధి పొందారు. సంస్థాగత సంరక్షణ నుంచి బయటకు వచ్చిన పిల్లలకు వివాహ సహాయం అందిస్తున్నారు. అర్హులైన పిల్లలకు ఆశీర్వాద్ యోజన కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు, 51,000 మందికి పైగా పిల్లలు ఆశీర్బాద్ యోజన పరిధిలోకి వచ్చారు. వీరంతా వివిధ ప్రయోజనాలు, సహాయం పొందుతున్నారు. సత్వర పిల్లల రక్షణ సహాయం కోసం చైల్డ్ హెల్ప్లైన్ 1098, మహిళా హెల్ప్లైన్ 181 మరియు అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ 112 లను అనుసంధానించినట్లు వివరించారు. యశోద పథకం కింద ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అనాథ సర్వేలు నిర్వహణ కొనసాగుతుంది. అన్ని వర్గాల పిల్లల సంరక్షణ, రక్షణ సమాచారం వివరాలు డిజిటల్గా నవీకరించడానికి అమొరి శిశు పోర్టల్ పని చేస్తుంది. వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులను వారి జిల్లా పర్యటనల సమయంలో పాఠశాలలు, పిల్లల సంరక్షణ సంస్థలను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ సూచించారు. సమీక్ష సమావేశంలో పలు శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, కమిషనర్ కమ్ కార్యదర్శులు, వివిధ విభాగాల సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా రాష్ట్ర స్థాయి బాలల రక్షణ, సంక్షేమ పర్యవేక్షణపై సమీక్ష -
మలుపు తిరగనున్న మహానది జల వివాదం
భువనేశ్వర్: మహా నది జలాలపై ఇరుగు పొరుగు ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటి బిజూ జనతా దళ్ ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయ స్థానం న్యూ ఢిల్లీ కేంద్రంగా మహా నది జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ట్రిబ్యునల్ అధీనంలో వివాదం విచారణ దశలో గింగుర్లు కొడుతుంది. త్వరలో ఈ కేసు విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో చత్తీస్గఢ్ ప్రభుత్వం సంప్రదింపులతో మహా నది జలాల పంపిణీ వివాదం కొలిక్కి రానుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రజల జీవ నాడి మహా నది. ఈ నదీ జలాలు రాష్ట్ర ప్రజల బహుముఖ జీవన శైలితో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెర దించి అడ్డగోలు వ్యవహారానికి నడుం బిగిస్తుందా అని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మహా నది జలాల పంపిణీ వివాద పరిష్కారంపై తీర్మానం తీసుకున్నట్లు ప్రకటించారు. కేంద్రం సహాయంతో ఛత్తీస్గఢ్తో చర్చలు జరుగుతాయని, కేంద్ర జల కమిషన్ సాంకేతిక సహాయంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెర పడుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యలో ఉభయ రాష్ట్రాల జలవనరుల విభాగం మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర అడ్వకేటు జనరల్ పీతాంబర ఆచార్య సోషల్ మీడియా ఖాతాలో సందేశం జారీ చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా సమస్యను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ఈ ప్రకటనలపై నవీన్ పట్నాయక్ కొన్ని కీలకమైన సందేహాల్ని లేవనెత్తారు. రాష్ట్ర ప్రజలకు సంతృప్తికర వివరణ ఇచ్చి తదుపరి కార్యాచరణకు ఉపక్రమించాలని హితవు పలికారు. ఏ ప్రాతిపదికన చత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వంతో రాజీని పరిశీలిస్తున్నారో వివరించడానికి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అత్యవసరంగా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మహా నది జల వివాదాల ట్రిబ్యునల్ ముందు కేసు విచారణ ఆగస్టు 2న జరగనుంది. కీలకమైన విచారణ చేరువలో పరస్పర ఒప్పందం కోసం రాష్ట్ర ప్రభుత్వం పావులు కదపడం ప్రభుత్వం చట్టపరమైన పోరాటం నుంచి వైదొలగుతన్న సంకేతాల్ని బలపరుస్తుందని వేలెత్తి చూపారు. ఈ చర్యలు ఒడిశా నీటి హక్కులను దెబ్బతీసేలా తారసపడుతున్నాయి. వివాదస్పద పరిస్థితుల్లో ప్రభుత్వం వాటాదారులు, రాజకీయ పార్టీలు, ప్రజల విశ్వాసం కూడగట్టుకోకుండా చత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంటుందా అని సందేహం లేవనెత్తారు. ఈ విషయంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదం చట్టం కింద ఈ వివాదంపై తీర్పు ఇవ్వాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు 2018 సంవత్సరం జనవరి 23న కేంద్ర ప్రభుత్వాన్ని మహా నది జల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని నవీన్ పట్నాయక్ గుర్తుచేశారు. బీజేడీ స్థిరమైన ప్రయత్నాలు, బలమైన ప్రజా ఒత్తిడి చివరికి కేంద్ర మంత్రివర్గం ట్రిబ్యునల్ ఏర్పాటును ఆమోదించేలా చేసింది. తదనంతరం, ఈ ఆదేశాల ప్రకారం 2018 సంవత్సరం మార్చి 12న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా న్యూ ఢిల్లీలో మహానది జల వివాదాల ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసింది. దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న చట్టపరమైన పోరాటం నీరుగార్చి ప్రభుత్వం అకస్మాత్తుగా పరస్పర రాజీని అన్వేషించడం రాష్ట్ర ప్రజల ప్రగాఢ విశ్వాసాన్ని నిలువునా నీట గలిపినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహించిన విపక్షం అఖిల పక్ష సమావేశానికి ప్రతిపాదన -
తప్పని ప్రసవ వేదన
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి పెండిలి పంచాయతీలోని పంచుపాండవ గ్రామంలో నివసిస్తున్న సంతొష్ సొబొరొ భార్య జొసమంతి సొబొరొ నిండు గర్భిణి. నెలలు నిండటంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను గుడారి ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే పంచేపాండవ గ్రామానికి రోడ్డుకు మధ్య నది ఉండటంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని సుమారు కిలోమీటరు దూరం వరకు ఉన్న నదిని దాటిస్తూ అంబులెన్స్ వరకు చేర్పించారు. నడవలేని స్థితిలొ ఉన్న ఆమెను కిలొమీటరు దూరం వరకు గల నదిని నాటించేందుకు గంట సమయం పట్టింది. ఓపికను కూడగట్టుకుని ఎంతో ప్రయాసపడి గర్భిణి అంబులెన్స్ వరకు చేరుకోగలిగింది. అనంతరం ఆమెను గుడారి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల మధ్య చోటు చేసుకుంది. ఇలాంటి తరహా సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. రహదారులు లేక నానా అవస్థలు పడి గర్భిణులను నడిపించుకుని తీసుకువస్తున్నారు. -
మండీల్లో అక్రమాలపై ఫిర్యాదు
జయపురం: జయపురం సమితి జాముండ పంచాయతీలో ముత్యాలమ్మ స్వయం సహాయక గ్రూపు అక్రమాలకు పాల్పడుతోందని, వాస్తవ రైతుల నుంచి కాకుండా దళారుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని జిల్లా కృషక మంచ్ రైతులు ఆరోపించారు. జిల్లా కృషక మంచ్ నేతృత్వంలో పలువరు జాముండ పంచాయతీ రైతులు గురువారం జయపురం సబ్కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డిని కలసి ఒక మెమొరాండం సమర్పించారు. అలాగనే డీఆర్ డీఎస్ భీమసేన్ సాహు, కలెక్టర్ వి.కీర్తి వాసన్లకు మెమొరాండంలు సమర్పించినట్లు తెలిపారు. జాముండ పంచాయతీలో మండీలో ధాన్యం కొనుగోలుకు, రైతులకు గుర్తింపు కార్డులను ఇచ్చే బాధ్యతను ముత్యాలమ్మ ఎస్హెచ్జీ గ్రూపునకు అప్పగించారని, ఆ గ్రూపును గ్రూపు కార్యదర్శి సుజాత పాణిగ్రహి, ఆమె భర్త బిద్యాధర కిశోర్ నిర్వహిస్తున్నారని, వారు మిగతా సభ్యులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక రైతులను విస్మరించి కుసుమి, పుట్ర, హడియ, కొంగ, ఖొయిరముండ, కుములిపుట్, జయంతిగిరి ప్రాంతాల రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. గ్రూపు వారికి బదులుగా రైతుల గుర్తింపు, ధాన్యం కొనుగోలు బాధ్యతలను కుములిపుట్ ల్యాంప్నకు అప్పజెప్పాలని కోరారు. -
పాఠశాల ప్రహరీ వెనుక అస్థిపంజరం లభ్యం
భువనేశ్వర్: కటక్ జిల్లా బైదేశ్వర్ పోలీస్స్టేషన్ పరిధి కొలాపొత్తర్ గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ వెనుక మానవ అస్థిపంజరం గుర్తించారు. ఇది స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. పాఠశాల ఆవరణకు వెలుపల ఉన్న మర్రిచెట్టు వద్ద అస్థిపంజర అవశేషాలు స్థానికుల దృష్టికి వచ్చింది. ప్లాస్టిక్ దారంతో చుట్టిన కాగితంలో కట్టి ఇక్కడ పడేసినట్లు భావిస్తున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలక్రమేణా కాగితపు పొట్లాం చిరిగిపోయి పుర్రె మరియు ఎముకలు బయటపడ్డాయి. అవశేషాలను గమనించిన స్థానికులు బైదేశ్వర్ ఠాణాకు సమాచారం అందజేయడంతో పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి దర్యాప్తు కోసం అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అవశేషాలను శరీర నిర్మాణ అధ్యయనాల కోసం ఉపయోగించే మానవ శరీరానికి చెందినవా.. లేదా ఏదైనా దుశ్చర్య జరిగిందా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతామని పోలీసు అధికారులు తెలిపారు. -
ప్రాథమిక ఆరోగ్యం పరిశీలన
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి డెప్పాగుడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మమత చౌదరి బుధవారం పరిశీలించారు. దీనిలో భాగంగా అక్కడి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గత రెండేళ్లుగా ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యుడి పోస్టు భర్తీ కాకపోవడంతో చికిత్స కోసం వస్తున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా ఇతరత్రా సమస్యలు కూడా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె త్వరలో వైద్యుడి పోస్టు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. అనంతరం ఆమె ఆరోగ్య కేంద్రం సిబ్బందితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల డంప్ స్వాధీనం కొరాపుట్: జిల్లాలోని జయపూర్ సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరిలో 180వ బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో డంప్ బయటపడిందని వెల్లడించారు. గుప్తేశ్వరం పంచాయతీ శబరి నది సమీపంలో గుటాఘాట్ మీద పెద్ద రాయికింద ఈ డంప్ గుర్తించామన్నారు. దానిలో 27 జిలెస్టిక్స్ బయటపడ్డాయని పేర్కొన్నారు. వీటిని బీఎస్ఎఫ్ క్యాంప్కి తరలించారు. విచారణ అనంతరం బొయిపరిగుడ పోలీస్స్టేషన్కి తరలించనున్నారు. ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి బురిడిగూఢ గ్రామంలో బుధవారం రాత్రి ఎలుగు దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బురిడిగూఢ గ్రామంలో నివాసం ఉంటున్న చైతన్య నాయక్ అనే వ్యక్తికి బుధవారం రాత్రి సమీపంలోని పొలానికి వెళ్లాడు. రాత్రి 11 గంటలైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వైపునకు వెళ్లి చూడగా అక్కడ ఎలుగు దాడి చేయడం గమనించి వెంటనే ఆయనను మత్తిలి ఆరోగ్యకేంద్రానికి తరలించారు. గురువారం కొరాపుట్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన భువనేశ్వర్: పశ్చిమ ఒడిశాలో కుండపోత వర్షాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నువాపడా జిలా సునాబెడా వన్యప్రాణుల అభయారణ్యంలో వంతెన కూలిపోవడంతో కీలకమైన ఆవలి ప్రాంతంలో గ్రామీణులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సునాబెడా పంచాయతీ కొమనా మండలం సునాబెడా, గతిబెడా గ్రామాలను కలిపే తెంతులిఖుంటి కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో అనేక గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ కుప్పకూలింది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వైద్య, అత్యవసర సేవలు దూరం కావడం పట్ల బాధిత వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితి పట్ల అధికారుల స్పందన కొరవడింది. కొట్టుకు పోయిన వంతెన పునరుద్ధరణ పనులు అగమ్య గోచరంగా పరిణమిస్తున్నాయి. -
పచ్చని ఉద్దానాన్ని రాళ్లురప్పలతో పోల్చొద్దు
మందస: నిత్యం పంటలతో పచ్చగా కళకళలాడే ఉద్దానాన్ని రాళ్లురప్పలతో కూడిన శంషాబాద్ ఎయిర్పోర్టు భూములతో పోల్చడం సరికాదని కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అన్నారు. గురువారం మందస మండలం గంగువాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ ఉద్దానాన్ని శంషాబాద్ ప్రాంతంతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం బత్తిన లక్ష్మణ్ మాట్లాడుతూ కొబ్బరి, జీడి, పసన, మామిడి, మునగ, అరటి, జామ, నిమ్మ తదితర పంటలతో కూడిన పచ్చని నేలతల్లిని విడిచి వెళ్లిపోవాలని ఎలా అనగలుగుతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పొట్టి ధర్మారావు, ఎర్రయ్య, నారాయణ, దున్న హరికృష్ణ, శాంతారావు, శంకర్, చలపతి, సోమేశ్వరరావు, దున్న రామారావు, సంతోష్, శ్యామ్ పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి ఆదివాసీల సమస్యలు
కొరాపుట్: ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జికి నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి నివేదిక ఇచ్చారు. గురువారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో లోక్ సేవా భవన్లో జరిగిన 11వ ఆదివాసీ జిల్లాల సమీక్షాలో ఈ నివేదిక అందించారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై ఆదివాసీ నేతల అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నివేదిక అనుసారంగా రాష్ట్రంలో ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వ పథకాలు అమలు కానున్నాయి. ఈ సమావేశంలో నబరంగ్పూర్ జిల్లాకి చెందిన రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి నిత్యానంద గోండో పాల్గొన్నారు. -
ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో విభజన తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను ఎవరి ప్రయోజనాల కోసం విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేస్తున్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.కృష్ణమూర్తి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలో వామపక్షాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, మహిళా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిపోను విభజిస్తే అనేక దళిత, పేద హమాలీ కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడును జిల్లా ప్రజలు శివారు భూములకు నీరు ఇమ్మని అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వామపక్ష, వివిధ సంఘాల నాయకులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, సంతోష్, ఎం.గోవర్ధనరావు, కె.సూరయ్య, ఎల్.రామప్పడు, ఎం.రమణ, పి.సుధాకర్బాబు, కేదారేశ్వరరావు, ఆర్.ప్రకాష్, హమాలీ యూనియన్ నాయకులు నిడిగంట్ల రమణ, గజిని శ్రీనివాసరావు, సీతారాం, లింగాల రాము, శొంఠ్యాన శ్రీనివాసరావు, నవిరి సురేష్ పాల్గొన్నారు. -
ఆరున్నర కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజాం జిల్లా అస్కాకు చెందిన ప్రశాంత్కుమార్పాఢీ, బెర్హంపూర్కు చెందిన కందులు పూర్ణచంద్ర సెనాపతిలు అదే రాష్ట్రంలోని కందమాల్ జిల్లా టికాబలి గ్రామానికి చెందిన బపూని డిఘాల్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. బెంగళూరులోని ఓ వ్యక్తి అందజేసేందుకు బస్సులో ఇచ్ఛాఫురం చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్కి వస్తుండగా ఇచ్ఛాపురం పట్టణ పోలీస్లు తనిఖీలు చేపట్టి 6.600 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
వితరణ..
కొరాపుట్: జయపూర్ రోటరీ క్లబ్ ప్రభుత్వ పాఠశాలకి వితరణ చేసింది. గురువారం పట్టణంలోని డెప్పిగుడ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ద్వారాన్ని అందజేశారు. గేటు లేకపోవడంతో రాత్రి వేళ అసాంఘిక శక్తులకు ఈ పాఠశాల ప్రాంగణం అడ్డాగా మారింది. ఇది తెలుసుకొని క్లబ్ సభ్యులు స్టీల్ గేటు, గదులకు ప్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఈఓ చందన్ కుమార్ నాయక్, హెడ్ మాస్టర్ శంకరి దళపతి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అమర్ బుధవార్, కార్యదర్శి నారాయణ నిశాంక్, నిసాన్ పట్నాయక్, బి.శ్రీనివాసరావు, శివాజి పట్నాయక్, గణేష్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధుడు మృతి కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని చైనా మార్కెట్ సమీపంలో వాటర్ ట్యాంక్ లైన్లో నివసిస్తున్న చెల్లూరి సూర్యనారాయణ (106) గురువారం వేకువజామున మృతి చెందారు. గతంలో జిల్లా కలెక్టర్లుగా వచ్చినవారు సూర్యనారాయణను కలిసి ఆరోగ్య రహస్యాన్ని అడిగేవారు. తన పని తాను చేస్తూ, దైవ చింతనలో ఎక్కువగా సూర్యనారాయణ ఉండేవారు. ఇతని మృతి వార్త విని మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, తదితరులు అంతిమ కార్యక్రమంలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపుపై నిరసన కొరాపుట్: జయపూర్ పట్టణంలోని పారాబెడాలో విక్రమ్ దేవ్ క్రీడా మైదానానికి ఆనుకుని బ్లాక్ ఆఫీస్ మార్గంలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు గురువారం ఉపక్రమించారు. పెద్ద ఎత్తున పోలీసులు, జేసీబీలతో మున్సిపల్ సిబ్బంది తరలి వచ్చారు. తొలగింపులు ప్రారంభం కాగానే వ్యాపారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంలో అధికారులు ఆక్రమణల తొలగింపుని వాయిదా వేసి వెనుతిరిగారు. మావోయిస్టు నేతకు మాతృవియోగం వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యులు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మాతృమూర్తి మెట్టూరు చినపిల్లమ్మ (92) గురువారం మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. చినపిల్లమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడో సంతానం జోగారావు. చినపిల్లమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం అదే గ్రామంలో చేపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
నర్సింగ్ విద్యార్థుల ప్రమాణ స్వీకారం
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు గురువారం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డా.మహేంద్ర కుమార్ భుయ్యాన్ విద్యార్థులతో ప్రమాణం చేయించారు. నర్సింగ్ కోర్సును వృత్తిగా స్వీకరిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలని వైస్ ప్రిన్సిపాల్ (నర్సింగ్ స్కూల్) ప్రొఫెసర్ ఎస్.ఎన్.సంధ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ డైరెక్టర్ ప్రొ.సునీల్ కుమార్ ఝా, ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, జిల్లా మెడికల్ ఆఫీసర్ డా.శంతను పాఢి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
అచ్యుతానందన్ మృతి తీరని లోటు
రణస్థలం: కార్మిక, కర్షక, పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత పోరాట యోధుడు కామ్రేడ్ అచ్యుతానందన్ మరణించడం కార్మిక పోరాటాలకు తీరని లోటు అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్కు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసలోని శ్యాంపిస్టన్ ప్లాంట్–3 పరిశ్రమ వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 102 ఏళ్ల జీవన ప్రయాణంలో 85 ఏళ్ల తన జీవితాన్ని ప్రజలు, కార్మికులు కష్టజీవుల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం వెచ్చించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎం.అశోక్, ఎల్.నాగరాజు, జె.సురేష్, ఎం.సునీల్, పి.శ్రీను, కృష్ణారావు, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్’
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళల రక్షణ, న్యాయం కోసం తక్షణ చర్యల్లో భాగంగా మహిళా న్యాయమూర్తి ఆధ్వర్యంలోని న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో 8 మిత్రపక్ష పార్టీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్కు అభ్యర్థించింది. మహిళలపై నేరాలకు కారణాలు, వ్యవస్థాగత వైఫల్యాలను పరిశోధించి 60 రోజుల్లో కమిషన్ నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ ప్రతినిధి బృందం గురువారం రాజ్ భవన్లో గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటిని కలిసి సమావేశమైంది. రాష్ట్ర పాలనలో పారదర్శకతతో ప్రజా విశ్వాసాన్ని కూడగట్టేందుకు పలు సంస్థాగత సంస్కరణలు చేపట్టడం అనివార్యంగా ప్రతినిధి బృందం పేర్కొంది. పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని అంతమొందించడం ప్రధానమైనదిగా తెలిపారు. ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నియామకం విస్మరించిన పరిస్థితిని తొలగించి దీర్ఘకాలంగా పేరుకుపోయిన పెండింగ్ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఉమ్మడి ప్రతినిధి బృందం అభ్యర్థించింది. పోలీస్ ఠాణాల్లో అత్యాచారం, లైంగిక నేరాల రికార్డుల కోసం ప్రత్యేక సెల్లు, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ వ్యవస్థ, మహిళలపై క్రిమినల్ కేసులను 6 నెలల కాల పరిమితిలో పరిష్కారం, విపత్కర పరిస్థితుల్లో మహిళల తక్షణ రక్షణ కోసం టోల్–ఫ్రీ హెల్ప్లైన్వ్యవస్థని ప్రతిపాదించారు. మహిళలపై అత్యాచారాలు వంటి నేర సంబంధిత కేసుల్లో నిందితుల వ్యతిరేకంగా శిక్ష విధింపు రేటు నామ మాత్రంగా 8.3 శాతానికి పరిమితం అయిందని, ఈ పరిస్థితిని పటిష్టపరచాల్సి ఉందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెసు ప్రముఖులు, డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సంఘ్వీ జయంత్ దాస్, సురేష్ చంద్ర పాణిగ్రాహి, యుధిష్ఠిర్ మహాపాత్రొ, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి రంజన్ మహాపాత్రొ, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విక్రమ్ స్వంయి, సమాజ్వాది పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ బారిక్, రాష్ట్రీయ జనతా దళ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి హేమంత్ కుమార్ రాష్ట్ర గవర్నరుని కలిసి వినతి పత్రం సమర్పించారు. -
శాకంబరిగా రాజరాజేశ్వరిదేవి
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వర దేవాలయంలో రాజరాజేశ్వరీ అమ్మవారిని ఆషాఢ మాసం, మాస శివరాత్రిని పురస్కరించుకొని గురువారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి, చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఉదయం అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఔట్పోస్టు టెండర్లు ఖరారు శ్రీకాకుళం పాతబస్టాండ్: అగ్నిమాపక కార్యాలయాల నిర్వహణకు సంబంధించి పొందూరు, మందస ఔట్ పోస్ట్ టెండర్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెరిచారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ ఉన్న టెండర్లను ఖరారు చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక జిల్లా అధికారి జె.మోహనరావు, అటవీ శాఖ సబ్ డీఎఫ్ఓ నాగేంద్ర, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పద్యకవితా చక్రవర్తి జాషువా శ్రీకాకుళం కల్చరల్: పద్య కవితా చక్రవర్తి గుర్రం జాషువా అని వక్తలు కొనియాడారు. సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితీ ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో గురువారం జాషువా వర్ధంతి సభ నిర్వహించారు. కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, ఆకాశవాణి కేంద్రం(విశాఖ) వ్యాఖ్యాత, రచయిత డాక్టర్ బండి సత్యనారాయణ ప్రసంగిస్తూ జాషువా ఆశయాలను, వర్తమాన స్థితిగతుల్ని వివరించారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కథానిలయం ట్రస్టు కార్యదర్శి దాసరి రామచంద్రరావు, రచయిత చింతాడ తిరుమలరావు, తెలుగు అధ్యాపకులు బాడాన శ్యామలరావు, రచయిత కలమట దాసుబాబు, డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్సు విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.శ్రీనివాసరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సహాయ కార్యదర్శి సుధాకర్, ప్రజా సాహితీ కార్యదర్శి పి.మోహనరావు, యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, సాహితీ స్రవంతి సభ్యులు కె.భుజంగరావు, పి.దివాకర్, ఎన్.రమణారావు, భానుప్రసాద్, కె.ఉదయ్కిరణ్, లీలావరప్రససాద్, పొన్నాడ వరాహ నరసింహులు, కవీశ్వరరావు, సిహెచ్ రామచంద్రరావు, సన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తప్పిన ప్రాణాపాయం రణస్థలం: రణస్థలం కొత్త పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న కారును వెనుకనే వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు మలుపులు తిరుగుతూ లారీ ముందుభాగంలో ఉండిపోయి కొంతదూరం ముందుకు దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ ఆప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. కారు డ్యామేజ్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. 31 మద్యం బాటిళ్లు స్వాధీనం సారవకోట: మండల కేంద్రం సారవకోటలో వైన్షాపు నుంచి 31 మద్యం బాటిళ్లను తరలిస్తున్న కుమ్మరిగుంట గ్రామానికి చెందిన లక్కోజు వెంకటరావును టాస్క్ఫోర్స్ సిబ్బంది బుధవారం రాత్రి పట్టుకున్నారు. అనంతరం సారవకోట పోలీస్స్టేషన్కు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ అనిల్కుమార్ గురువారం తెలిపారు. -
గుడారి సమితి చైర్పర్సన్పై అవిశ్వాసం
రాయగడ: జిల్లాలోని అత్యంత ప్రాధాన్యత గల గుడారి సమితిలో రాజకీయాలు వేడెక్కాయి. సమితి చైర్పర్సన్ లక్ష్మీ సోభోరోపై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహట ఆదేశానుసారం గురువారం సమితి కార్యాలయంలో ఓటింగ్ జరిగింది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరుకు కొనసాగింది. తహసీల్దార్ ఎ.స్నేహలత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. సమితి ఈఓ ప్రసన్న కుమార్ పాడీ మేజిస్ట్రేట్గా వ్యవహరించారు. సమితి సభ్యులు, ఎంపి, ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 20 మంది ఓటర్లు ఉండగా.. 16 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేసేందుకు హాజరుకాలేదు. పోలీసుల బందోబస్తు మధ్య ఓటింగ్ జరిగింది. ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. -
అంధకారంలో ఆశ్రమ పాఠశాల హాస్టల్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కదంగూడలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో చాలా కాలంగా విద్యుత్ సమస్య వేధిస్తోంది. హాస్టల్ సిబ్బంది విద్యుత్ శాఖకు ఫిర్యాధు చేస్తే.. ఏదో ఒక వైరు పేట్టి వారం రోజులు విద్యుత్ వచ్చేలా చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సమస్య మళ్లీ మొదలైంది. బుధవారం రాత్రి విద్యార్థులు చీకటిలోనే ఉన్నారు. గురువారం కొంతమంది విద్యార్థులు మట్లాడుతూ.. తమ పాఠశాల చుట్టూ పాముల భయం ఉందన్నారు. రాత్రి సమయంలో చీకటిల్లోనే భోజనాలు చేయాల్సి వచ్చిందన్నారు. సరిగా నిద్ర పట్టడం లేదన్నారు. తమకు ఏమైనా అయితే పూర్తి బాధ్యత ఉపాధ్యాయులుదేనేన్నారు. మోటారు లేక నీరు కూడా రావడంలేదని, రోజువారీ కార్యక్రమాలకు బయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వంటవారు గ్రామంలో బోరు నీరు తెచ్చి వంట చేస్తున్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఇద్దరు యువకులు అరెస్టు
కొరాపుట్: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఫొటోలు వైరల్ చేసిన ఘటనలో నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి డుమ్రిముండ గ్రామానికి చెందిన కల్పనా రాయ్ అనే నర్సింగ్ విద్యార్థిని విషంతాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఘటనలో ఆమె ఫొటోలు తీసిన ఉద్దవ్ బోడ నాయక్ని జయపూర్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జయపూర్లోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బాధిత యువతికి దగ్గరి బంధువు కావడం విశేషం. అందుకే ఆమె వ్యక్తిగత ఫొటోలు తీయగలిగాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బొడనాయక్ని రాయిఘర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫొటోలు వైరల్ చేసిన సత్యజిత్ సర్కార్ తప్పించుకొని బస్సులో పారిపోయాడు. అయితే నయాగఢ్ జిల్లా దసపల్లా వద్ద రాయిఘర్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఇతనిని కూడా రాయిఘర్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. సత్యజిత్ ఈనెల 13వ తేదీన జయపూర్లో బాధితురాలిపై దాడిచేసి ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. మరోవైపు బాధితురాలిని అధికారులు భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. గురువారం వేకువజామున 4 గంటలకు ఆమెను ఐసీయూలో చేర్చారు. ఆమె ఎరువుల మందు తాగడం వలన పేగులు, కిడ్నీ, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు ప్రకటించారు. -
కొత్త కలెక్టర్ల నియామకం
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలకు నూతన కలెక్టర్లు రానున్నారు. ప్రస్తుత కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తి వాసన్ను గంజాం జిల్లాకు బదిలీ చేసింది. 2018 బ్యాచ్కి చెందిన సుందర్ఘడ్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ని కొరాపుట్ జిల్లాకు కలెక్టర్గా నియమించారు. ఈయన స్వస్థలం మహారాష్ట్రలోని జలగాం జిల్లా. పేదరికం నుంచి వచ్చిన మనోజ్ పుణే యునివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తండ్రి ఉపాధ్యాయుడు. నబరంగ్పూర్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపత్రో సుందర్ఘడ్కి బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో 2014 బ్యాచ్కి చెందిన డాక్టర్ మహేశ్వర్ స్వయ్ పంచాయతీరాజ్ డైరెక్టర్ హోదా నుంచి నబరంగపూర్ కలెక్టర్గా రానున్నారు. పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ బిజయకుమార్దాస్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంసంక్షేమశాఖ అదనపు కార్యదర్శిగా పదోన్నతిపై రాజధానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గంజాం జిల్లా ఛత్రపురం జిల్లా పరిషత్ సి.డి.ఒ., ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుమితను గజపతి కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన మధుమిత గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. రాయగడ: రాయగడ జిల్లా కొత్త కలెక్టర్గా సి.అశుతొష్ కులకర్ణి నియమితులయ్యారు. రౌర్కళాలో అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఈయన్ను రాయగడ జిల్లా కలెక్టర్గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు రాయగడ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన ఫరూల్ పట్వారి ఎస్ఎస్ఈపీడీ డైరెక్టర్గా నియమితులయ్యారు. గుణుపూర్ సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ దీప్ కౌర్ సహాట కటక్ మున్సిపాలిటీ కమిషనర్గా నియమితులయ్యారు. -
నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ
● మూలవిరాటులకు నుదుట ఆభరణం అలంకరణ ● సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత భువనేశ్వర్: శ్రావణ కృష్ణ పక్ష అమావాస్య తిథి పురస్కరించుకుని గురువారం శ్రీ మందిరంలో చిత్తా లగ్గి సేవ నిర్వహిస్తున్నారు. జగన్నాథుని సంస్కృతిలో ఈ తిథి చిత్తా లగ్గి అమావాస్యగా ప్రతీతి. ప్రధానంగా రైతు కుటుంబాలు ప్రత్యేక పబ్బంగా జరుపుకుంటారు. శ్రీ క్షేత్రంలో శ్రీమందిరం రత్న వేదికపై దేవతా త్రయం జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర నుదుట వజ్ర, రత్న, వైడూర్య కచిత ప్రత్యేక ఆభరణాలతో శోభిల్లుతారు. బయట సాధారణ ప్రజలు ప్రత్యేక వంటకాలతో భగవంతునికి నివేదించి ఆరాధిస్తారు. కొన్ని వర్గాలు చిత్తా లగ్గి అమావాస్యని లలాట అమావాస్యగా వ్యవహరిస్తారు. ఈ తిథి పురస్కరించుకుని రత్న వేదికపై మూల విరాటులకు లలాటంపై ప్రత్యేక ఆభరణం బాసికం తొడుగడంతో దీనిని లలాట అమావాస్యగా పేర్కొంటారు. శ్రీ మందిరంలో జగన్నాథుని రోజువారీ ఉదయం పూట ధూపదీపాదుల పూజలు ముగియడంతో లలాట ఆభరణ అలంకరణ ప్రారంభిస్తారు. ఆలయ ఆచారం ప్రకారం పతి మహాపాత్రో సేవాయత్ వర్గం మూల విరాటుల నదుటి ఆభరణం శుద్ధి చేసిన తర్వాత దైతపతి వర్గం ఒక్కో మూల విరాటు నుదుట ఆభరణాన్ని అలంకరిస్తారు. ఇదంతా పూర్తయ్యాక జగతి నాథునికి మహా స్నానం చేయించి సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రక్రియ పూర్తయ్యే వరకు శ్రీ మందిరంలో సాధారణ భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తారు. భక్తులకు ఏడాది పొడవునా స్నాన పూర్ణిమ వరకు స్వామి లలాటం వజ్ర కాంతులతో దర్శనం లభిస్తుంది. జ్యేష్ట మాసం పూర్ణిమ పురస్కరించుకుని జగతి నాథుని మహా జలాభిషేకం పురస్కరించుకుని నుదుట ధగేలుమనే రత్న ఖచిత బాసిక ఆభరణం తొలగిస్తారు. రథయాత్ర పూర్తయిన తర్వాత ఏటా శ్రావణ కృష్ణ పక్ష అమావాస్య నాడు తిరిగి బాసికం ఆభరణాన్ని స్వామి నుదుట యథాతథంగా అలంకరిస్తారు. జగన్నాథుని లలాటంపై వజ్రం పొదిగిన తెల్లని బాసికం, బలభద్ర స్వామి నుదుట నీలి రంగు రత్నం పొదిగిన బాసికం, దేవీ సుభద్ర నుదుట ఎర్రని మాణిక్యం పొదిగిన బాసికం అలంకరిస్తారు. తదుపరి జ్యేష్ఠ పౌర్ణమి వరకు మూల విరాటుల నుదుట ఈ ఆభరణం నిత్య శోభాయమానంగా తళుక్కుమంటుంది. రైతుల పండగ.. శ్రావణ మాసం అమావాస్య నాడు రైతాంగం ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తారు. సాగు జలాశయాలు, చిత్తడి పంట పొలాల్లో కీటకాల బారి నుంచి రక్షణ పొందే సంకల్పంతో ప్రత్యేక ఆచారాలు వ్యవహరిస్తారు. ఈ తిథి పురస్కరించుకుని ప్రత్యేక పిండి వంటలు చిత్తౌ, గొంయిఠా తయారు చేసి చిత్తడి పంట పొలాలు, సాగు జలాశయాల్లో విడిచి పెడతారు. ఈ వంటల్ని కంద ఆకుల్లో చుట్టి భద్రంగా జలాశయాల్లో విడిచి పెడతారు. సాగు భూముల్లో నీటి కింద సంచరించే నత్తలు, జలగలు వంటి కీటకాల బారి నుంచి రక్షణ పొందేందుకు ఈ పిండి వంటలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సాగు పనుల సమయంలో ఈ కీటకాలు సాధారణంగా రైతుల కాళ్లను స్వల్పంగా గాయపరుస్తుంటాయి. ఈ ముప్పు నుంచి విముక్తి కోసం నత్తలు వంటి కీటకాల తాకిడి నివారణ ఉద్దేశంతో అమావాస్యని ప్రత్యేకంగా జరుపుకోవడంతో దీనిని గెండాకొట్టా ఒసాగా పేర్కొంటారు. బాలాసోర్, మయూర్భంజ్, కెంజొహర్ వంటి ప్రాంతాలలో, ఈ పబ్బం గెండాకొట్టా అమావాస్యగా జరుపుకుంటారు. సాగు భూముల్లో నత్తలు వంటి కీటకాల్ని శాంతింపజేయడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో గిరిజనులు జరుపుకునే పండుగలలో ఇది ఒకటి కావడం విశేషం.నేడు సర్వ దర్శనం నిలిపివేత లలాట అమావాస్య ప్రత్యేక పూజాదులు పురస్కరించుకుని శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాటుల దర్శనం గురువారం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికార వర్గాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురు వారం తొలి భోగ మండప సేవ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సర్వ దర్శనం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఘనంగా నెక్కంటి జన్మదిన వేడుకలు
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, జిల్లా బీజేడీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు 73వ జన్మదిన వేడుకలు బుధవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక తేజస్వీ సమీపంలోని బీజేడీ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నెక్కంటి ప్రారంభిస్తూ ప్రసంగించారు. రక్తదానం మహాదానమని పేర్కొన్నారు. స్థానిక జిల్లా కేంద్రాసుపత్రి బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్, సిబ్బంది పరివేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 75 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. నెక్కంటి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం సభ్యులు నెక్కంటిని గజమాలతొ సత్కరించి ఆశీర్వదించారు. సమాజం అధ్యక్షుడు వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ, కార్యదర్శి భళ్లమూడి నాగరాజు, భాస్కరాచార్యులు గణపతి శాస్త్రి, రేజేటి శ్రీరామ శర్మ, టీఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు కార్మికులు మృత్యువాత
కొరాపుట్: విష ప్రయోగం కారణంగా ఇద్దరు బీహార్ కార్మికులు మృతి చెందారు. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని చకల్ పొదర్ గ్రామ పంచాయతీ భారకవతలో బీహర్ రాష్ట్రం సరస జిల్లాకు చెందిన పిరియా సదా (20), రాకేష్ సదా (18) జొరిగాంలో మెగా వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూలి పనికోసం వచ్చారు. మంగళవారం వీరిద్దరూ ఆహారం తిని నిద్రపోయారు. రెండు గంటల తర్వాత ఒక్కసారిగా వాంతులు మొదలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు స్పందించి బాధితులను జోరిగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో రాకేష్ మృతిచెందాడు. నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో షిరియా సదా మృతి చెందాడు. జోరిగాం పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిమ్స్కు బాధితురాలు తరలింపు
కొరాపుట్ : రాయ్ఘర్ బాధిత యువతిని రాష్ట్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం భువనేశ్వర్కు తరలించింది. మరోవైపు భాదిత కుటుంబం ఇచ్చి ఫిర్యాదు మేరకు రాయిఘర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సత్యజిత్ రాయ్ ఆమెని ప్రేమించమని వేధించేవాడని తెలిసింది. ఆమె మరొకరి ప్రేమతో ఉందని తెలిసి దాడికి పాల్పడినట్లు సమాచారం. దీనికితోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఫొటోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు జయపూర్ ఐఐసీ ఉలాస్ చంద్ర రౌత్, నర్సింగ్ హాస్టల్ సూపర్ వైజర్ చంద్రికా పాత్రోలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. గాయాలతో చూశా.. ఈ నెల 13న యువతి ఔటింగ్కి వెళ్లింది. రెండు గంటలైనా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేశాను. ఆమె తండ్రి ఫోన్ ఎత్తి బయట ఉన్నామని, తిరిగి వస్తామని చెప్పారు. రాత్రిపూట తండ్రితో కలిసి హాస్టల్కు వచ్చేటప్పటికే కంటి, ముక్కుపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆ రాత్రే తండ్రితో కలిసి ఇంటికి వెళ్లిపోయింది. – చంద్రికా పాత్రో, నర్సింగ్ హాస్టల్ సూపర్వైజర్ అలా అనడం సరికాదు.. ఈ నెల 15న నిందితుడు సత్యజిత్ సర్కార్ను కోర్టులో హాజరుపరిచాం. మా వరకు అతనిని అదుపులోకి తీసుకోని కోర్టులో హాజరుపరచడం వరకు చేశాం. తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోలేదనడం సరికాదు. – ఉల్లాస్ చంద్ర రౌత్, జయపూర్ ఐఐసీ -
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
విధి నిర్వహణలో విద్యుత్ కార్మికుడి మృతి కొరాపుట్: విధి నిర్వహణలో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా డాబుగాం సమితి గొడకుంటా పంచాయతీ ముండాగుడ జంక్షన్ వద్ద విద్యుత్ స్తంభంపై పని చేస్తున్న సమయంలో బొరిగాం గ్రామానికి చెందిన రామ బోత్ర (36) కింద పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడని గుర్తించారు. వెంటనే ఈ సమాచారం డాబుగాం పోలీసులకు అందించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితునికి మూడేళ్లు జైలు శిక్ష జయపురం: బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి మూడేళ్లు జైలు శిక్షను జయపురం పోస్కో స్పెషల్ కోర్టు విధించింది. 2017లో జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన అత్యాచారంపై కేసును విచారించిన పోస్కొ కోర్టు 10 మంది సాక్షులను విచారించింది. 8 రికార్డులను పరిశీలించింది. నిందితుడు బొడాపుట్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల దేబొ ఖబరకు మూడేళ్ల శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని పోస్కో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డాక్టర్ బి.గాయిత్రీదేవి బుధవారం వెల్లడించారు. 2017 అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలిక సమీప నదిలో దుస్తులు ఉతికి తిరిగి వస్తున్న సమయంలో దేబొ ఖబర నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో బాలికపై అత్యాచారానికి పాల్పడతుండగా హాహాకారాలు చేసింది. ఆమె ఆర్తనాదాలు విని బాలిక సోదరుడు అక్కడకు రావటంతో దేబొ అతడిని చూచి పరుగు తీశాడు. బాలిక జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు వివరించింది. వారు పొట్టంగి పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గురుదేవ్ కమ్రి, ఏఎస్ఐ అమినేష్ చంద్ర మాలి ఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు పంపారని, ఆ కేసుని విచారించి న్యాయాధికారి తీర్పు ఇచ్చారు. డీజీపీని కలిసిన ట్రైనీ ఐపీఎస్లు భువనేశ్వర్: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇతర సీనియర్ పోలీసు అధికారులను 77వ బ్యాచ్కు చెందిన 26 మంది ట్రైనీ ఐపీఎస్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణార్థులు వివిధ అంశాలపై వివరంగా చర్చించారు. నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించి అద్భుతమైన సేవలను అందించాలని డీజీపీ సూచించారు. దాడికి గురైన బాధితురాలిని ఇంటి నుంచి ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఇన్సెట్లో) నిందితుడు సత్యజిత్ సర్కార్ కొరాపుట్ : రాష్ట్రంలో మరో యువతిపై అమాననీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితికి చెందిన కల్పనారాయ్ అనే యువతి జయపూర్ పట్టణంలో నర్సింగ్ విద్య చదువుతోంది. ఆమె స్వగ్రామానికి చెందిన సత్యజిత్ సర్కార్ జయపూర్ వచ్చి ప్రేమ పేరుతో యువతిని వేధించేవాడు. ఆమె తిరస్కరించడంతో ఈ నెల 13న జయపూర్లో నడిరోడ్డుపై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు జయపూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ నెల 15న పిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సత్యజిత్ సర్కార్ని అదుపులోకి కోర్టులో హాజరుపరిచారు. బెయిల్బుల్ సెక్షన్లు ఉండటంతో కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. గాయపడిన బాధిత యవతి రాయిఘర్లోని ఇంటికి వచ్చేసింది. ఇదే సమయంలో సత్యజిత్ కూడా స్వగ్రామానికి వచ్చాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బాధిత యువతి మనస్థాపానికి గురై ఎరువుల మందులు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబీకులు యువతిని రాయిఘర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సమీపంలోని కాంకేర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఛత్తీస్గఢ్ రాజధానిలోని ప్రధాన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరిశీలించి యువతి బతకడం కష్టమని చెప్పడంతో తిరిగి రాయిఘర్ తీసుకొని వచ్చి ఇంటిలో వైద్యం అందజేస్తున్నారు. మంగళవారం బాధిత కుటుంబం రాయిఘర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు.. ఇటివల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం సరిగ్గా స్పందిండం లేదన్న ఆరోపణల నేపథ్యంలో పాలకులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఏఎస్పీ ఆదిత్యసేన్ను బాధితురాలి వద్దకు పంపి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మెరుగైన వైద్యం కోసం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఆమె కిడ్నీ పని చేయడం లేదని ప్రకటించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రంగం లోనికి దిగి బాధితురాలిని భువనేశ్వర్ లోని ఎయిమ్స్కి తరలించమని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం రంగంలోనికి దిగింది.న్యూస్రీల్ఈ విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జయపూర్ పోలీసులు నిందితుడిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. అందుకే ఫొటోలను వైరల్ చేశాడని వాపోయారు. విషయం తెలుసుకున్న మహిళా హక్కుల ఉద్యమకారిణి, మాఘరో సంస్థ నాయకురాలు కాదంబరి త్రిపాఠి రాయిఘర్ బయలుదేరారు. మరోవైపు అధికారులు రాయిఘర్ చేరుకుని బాధితురాలిని ఉమ్మర్కోట్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్నా త్రిపాఠీ, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మజ్జిలు బాధిత యువతిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అయితే వారిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే భైఠాయించారు. అనంతరం అనుమతించడంతో బాధితురాలిని పరామర్శించారు. ప్రేమను తిరస్కరించిందని యువతిపై నడిరోడ్డుపై దాడికి పాల్పడిన యువకుడు పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు కక్షతో యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
వారసత్వ కట్టడాలను పరిరక్షించుకుందాం
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల వారస త్వ విలువల పరిరక్షణలో భాగంగా సాంస్కృతిక పరిరక్షణ, విస్తరణ, సంరక్షణ, యాత్రికుల సౌకర్యా ల రూపకల్పన కార్యకలాపాలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బుధవారం సమీక్షించారు. స్థానిక లోక్ సేవా భవన్లో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఘొటొగాంవ్, జాజ్పూర్, ఏకమ్ర క్షేత్రాల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ తరిణి మాత ఆలయం విస్తరణ రానున్న రెండున్నర ఏళ్ళలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. రాష్ట్ర నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, నిర్మాణ శాఖ కార్యదర్శి సంజయ్ సింగ్, పర్యటన విభాగం సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
స్వశక్తీకరణ, పరివర్తన చాంపియన్పై శిక్షణ
పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ పంచాయతీ రిసో ర్సు భవనంలో బుధవారం సర్పంచ్లు, నాయిబు సర్పంచ్లకు మూడంచెల పంచాయతీరాజ్ విధానంపై పరివర్థన చాంపియన్ శిక్షణ శిబిరాన్ని జిల్లా పరిషత్తు సీడీవో శంకర కెరకెటా ప్రారంభించారు. ఈనెల 25 వరకూ మూడు రోజుల పాటు జరిగే ఈ నారీ స్వశక్తీకరణ పరివర్తన శిక్షణ శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి నాయిబు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధ, పంచాయతీ రాజ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణా శిబిరంలో ఈఆర్పీ ట్రైనర్గా మలయ మారుతీ దేవి,శ్రేయశ్రీ, సుశీలా మిశ్రా, శుభాంశు శేఖర్ పట్నాయక్ వ్యవహరించారు. -
నిరుద్యోగ యువతకు రూ.లక్ష వడ్డీలేని రుణం
పర్లాకిమిడి: స్కిల్ ఒడిశా ఆధ్వర్యంలో గజపతి జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ‘నమో యూనికార్న్ అసెస్మెంట్ స్కీమ్’ కింద రూ.లక్ష రుణాన్ని వడ్డీ లేకుండా ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి ఔత్సాహిక నిరుద్యోగ డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్థులు తమ అర్హతలతో బుధవారం కలెక్టరేట్కు విచ్చేశారు. వారికి జిల్లా ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ స్కీమ్ కింద యువతీ, యువకులకు 18 నుంచి 35 సంవంత్సరాలు వయో పరిమితి ఉండాలి.ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మరో పది సంవంత్సరాలు పొడిగింపు ఉంటుంది. నిరుద్యోగ డిప్లోమా, డిగ్రీ విద్యార్థులు తమ గ్రామాల్లో తక్కువ పెట్టుబడితో పిండి మిల్లులు, మొబైల్ రిపేరింగ్, గ్రైండర్స్, మెకానిక్ పనులకు ఈ సోమ్మును వినియోగించుకుంటామని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులు గుమ్మా, కాశీనగర్, పర్లాకిమిడి, నువాగడ, మోహానా నుంచి తొలిరోజు 21 మంది ఇంటర్వ్యూలకు విచ్చేసినట్టు జిల్లా ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి స్మృతి రంజన్ త్రిపాఠి తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలు గురువారం కూడా జరుగనున్నట్టు డీడబ్ల్యూఓ రైకా తెలియజేశారు. -
బీజేపీ యువమోర్చా నేతల నిరసన
జయపురం : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ నారాయణ ప్రధాన్పై కొరాపుట్ జిల్లాలోని బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదిత్ 19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణదాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా యువ మోర్చ సాధారణ కార్యదర్శి సరోజ్ కుమార్ పాణిగ్రహి, బొరిగుమ్మ సమితి మూడు మండలాల అధ్యక్షులు బిఘ్నేశ్వర షొడంగి, సుభిమల్ భట్ట, చక్రధర్ గదబ పాల్గొన్నారు. -
తరుణ ప్రజ్ఞా భారతి ఉత్సవాలపై సమీక్ష
జయపురం: ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షణకు 36 ఏళ్లుగా ఉద్యమిస్తున్న జయపురం తరుణ ప్రజ్ఞా భారతి సంస్థ 37వ ప్రతిష్టా ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు సంస్థ ప్రతినిధులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రసాదరావుపేటలోని అమూల్య ఆయుర్వేదిక్ కేంద్రంలో తరుణ ప్రజ్ఞా భారతి జయ పురం అధ్యక్షులు తరుణ కిరణ్ త్రిపాఠీ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహంచారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సభ్యులు తీర్మానించారు. తరుణ ప్రజ్ఞా భా రతి ప్రతిష్టా దాత స్వర్గీయ డాక్టర్ గంగాధర నందో ఆశయాలకు అనుగుణంగా ఎప్పటిలాగనే సూర్య న మస్కారాలు, యోగాసనాలు, శంఖ నాధం, హులీ హులి, గీతా పఠనం, శ్లోకాల పఠనం, ప్రబంధాలు, వ్యాసరచన, సంస్కృతంలో పరీక్షలు, ముగ్గులు, పిల్లల పాటలు, చిత్ర లేఖనం, దేశభక్తి పాటలు, సంగీతం, ఒడిస్సీ జానసద నృత్యాలు, విలువిద్య మొ దలగు పోటీలను అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థు లు, సాధారణ ప్రజలను, మహిళలు, పురుషులు, పిల్లలు, యువతీ యువకులను మమేకం చేయాల ని నిర్ణయించారు. డిసెంబర్ నేలలో నిర్వహించబడే వార్షికోత్సవంలో వివిధ పోటీలలో విజేతలకు బహుమతులతో సత్కరించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రజ్ఞా భారతి కార్యకర్తలు రామ శంకర షొడంగి, అజయ కుమార్ మల్లిక్, రవీంద్ర మహారాణ, సబిత త్రిపాఠీ, తపశ్విణీ సాహు, న్యాయ సలహాదారు న్యాయవాది జి.మహేష్, మొదలగు వారు పాల్గున్నారు. -
‘సుభద్ర శక్తి కేఫ్’ ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్లో బుధవారం సుభద్ర శక్తి కేఫ్ను జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జిల్లాలో మహిళల వికాసానికి మహిళా స్వశక్తీకరణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని జిల్లా కలెక్టర్ దాస్ అన్నారు. గుసాని సమితి మా మంగళా స్వయంసహాయక గ్రూపు మహిళలు సుభ ద్ర శక్తి కేఫ్ నడిపించడానికి ముందుకు వచ్చారు. ఈ కేఫ్లో తక్కువ ధరలకే భోజనం, టిఫిన్ అందుబాటులో ఉంటుందని మహిళా గ్రూపు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఆదనపు జిల్లా మాజిస్ట్రేటు ఫల్గుణీ మఝి, జిల్లా పరిషత్తు ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, జిల్లా సమగ్ర గిరిజనాభి వృద్ధి శాఖ, ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, ఒడిశా జీవనోపాధుల మిషన్ అధికారి టిమోన్ బోరా, తదితరులు పాల్గొన్నారు. -
బాలిక కుటుంబానికి ఓదార్పు
భువనేశ్వర్: ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పూరీ జిల్లా నిమాపడా బొలొంగా గ్రామ బాలికని ఉప ముఖ్యమంత్రి ప్రతిభా పరిడా బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితి, త్వరగా కోలుకునేందుకు కొనసాగిస్తున్న వైద్య, చికిత్స ప్రణాళిక కార్యాచరణ కోసం అనుబంధ వైద్య బృందంతో సంప్రదించారు. బాధిత బాలిక కుటుంబీకుల్ని ఓదార్చారు. భువనేశ్వర్: ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పూరీ జిల్లా బొలొంగా బాలికను కలిసి బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం పరామర్శించింది. ఆమె ప్రస్తుత ఆరోగ్యం గురించి ఈ బృందం సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కలిసి అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర ఏర్పాట్లు పరిశీలించారు. -
●ఆరోగ్య కేంద్రం జలమయం
మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జోడాంబు పంచాయతీలో ఉన్న ఆరోగ్య కేంద్రం మంగళవారం కురిసిన వర్షానికి జలమయమైంది. సుమారు నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రిలో సామగ్రి, మందులు నీట మునిగాయి. ఈ సమయంలో పది మంది గిరిజనులు చికిత్స కోసం లోపమే ఉన్నారు. దీంతో సిబ్బంది అతికష్టమ్మీద వీరిని బయటకు తరలించారు. మూడు పంచాయతీలకు చెందిన సుమారు ఐదు వేల మంది జనాభాకు ఈ ఆరోగ్య కేంద్రమే ఆధారం. అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. – మల్కన్గిరి -
తహసీల్దార్ వాహనం అడ్డగింత
కొరాపుట్: కొట్పాడ్ తహసీల్దార్ ట్వింకిల్ శెఠిని మహిళా రైతులు దిగ్బంధించారు. మంగళవారం విధి నిర్వహణ అనంతరం తిరిగి వస్తుండగా బన్సలి గ్రామ రైల్వే గేటు వద్ద గేటు పడటంతో ఆమె తన వాహనం నిలుపుదల చేశారు. సమీపంలో ఉన్న పొలాల్లో పనిచేస్తున్న మహిళలు వేగంగా వచ్చి వాహనాన్ని దిగ్బంధించారు. ధాన్యం కొనుగోలు సమయంలో నిబంధనల పేరుతో క్వింటాలుకు 15 కేజీలు కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కొట్పాడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. అనంతరం రైతులు వామనం విడిచి పెట్టారు. పేపర్ మిల్లు ఎదుట బైఠాయింపు కొరాపుట్: జయపూర్ సమీపంలో గగనాపూర్ వద్ద సేవా పేపర్ మిల్ ప్రధాన గేటును దినసరి కార్మికులు మూసేశారు. బుధవారం మధ్యా హ్నం ముకుమ్మడిగా వెళ్లి గేట్లు మూసి బైఠాయించారు. దీంతో లోపల ఉన్న పేపర్ మిల్లు యాజమాన్య, సిబ్బంది చిక్కుకుపోయారు. గత కొంతకాలంగా తాము చేసిన పనికి వేతనా లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితం లేకపోవడంతో ఈ విధమైన ఆందోళనకి దిగా రు. ప్రస్తుతం పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిపి వేశారు. వందలాది కార్మికులకు వేతనాలు చెల్లించలేదని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. ఎస్డీపీఓ కార్యాలయం ముట్టడి జయపురం: సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి ఒటాగాంలో జరిగిన హత్యకు సంబంధించి నిందితులను అరెస్టు చేయాలని, మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగన్నాద్ కాశ్యప్ కార్యాలయాన్ని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తు లు ముట్టడించారు. అనంతరం ఎస్డీపీఓకు వినతిపత్రం సమర్పించారు. ఘనంగా బ్యాంక్ ప్రతిష్ట దినోత్సవం జయపురం: బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ ప్రతి ష్టా దినోత్సవాన్ని జయపురం శాఖలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ మేనే జర్ శ్రీరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ నేతృత్వంలో స్థానిక గోపాల గోసేవా వారి ద్వారా నిర్వహించబడు తున్న మహర్షి సందిపాణి గోశాలలోని గోవుల కు ఆహారం అందజేశారు. భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీ భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. హేమంత్ శర్మకు సమాచార – ప్రజా సంబంధాల అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కేటాయించారు. సంజీబ్ కుమార్ మిశ్రాను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించారు. 17 జిల్లాల్లో కొత్త కలెక్టర్లను నియమించారు. రూపా రోషన్ సాహు రాష్ట్ర గవర్నర్కు కమిషనర్ కమ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2014 సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్ అభ్యర్థి చంచల్ రాణాను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనగా నియమించారు. -
ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత బుధవారం సందర్శించారు. వివిధ వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు, ల్యాబ్లో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ఉన్నత ఉద్యోగలు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి అవసరమైన వసతులు, పరికరాలు, మందులు విషయాలు నమెదు చేసుకున్నారు. రోగులకు అందాల్సిన సేవలలో ఎటువంటి రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. పర్యటనలో డాక్టర్ నబ కిషోర్ పండా, బీపీఎం సంతోషిని పండా, ఎంపీ ప్రతినిధి కై లాస్ చంద్ర ఖొస్లా, మెంటి ఖోరా, పేరెంట్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
విశిష్ట వ్యక్తులకు గవర్నర్ సత్కారం
భువనేశ్వర్: రాష్ట్ర సాహిత్యం, కళలు, క్రీడలు తదిత ర రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన పలువురు ప్రముఖులకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రత్యేకంగా సత్కరించారు. స్థానిక రాజ్భవన్ న్యూ అభిషేక్ హాల్లో బుధవారం జరి గిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జయశ్రీ కంభంపాటి పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, అంతర్జాతీయ బంగారు పతక విజేతలు, క్రీడాకారులు, 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ సందర్భంగా గవర్నరు సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయంకృషి, శ్రేష్ఠత, క్రమశిక్షణ, సృజనాత్మకత, జాతీయ కీర్తి కిరీటాల సమాహార సమావేశం ఈ కార్యక్రమమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
జనావాసాల్లోకి జింక పిల్ల
రాయగడ: సదరు సమితి హలువ గ్రామంలో జింక పిల్ల జనావాసాల్లోకి వచ్చింది. సమీప అడవుల్లో నివసించే వన్యప్రాణులు తాగునీటి కోసం దగ్గరున్న నదీ తీర ప్రాంతాలకు వస్తుంటాయి. జింకపిల్ల మంగళవారం సాయంత్రం హలువ గ్రామంలోకి చొరబడింది. దీనిని చూసిన కొందరు పట్టుకునే ప్రయ త్నం చేశారు. అడవుల్లోకి పారిపోయినట్లు గ్రామస్తు లు చెప్పారు. ఈ విషయాన్ని రాయగడ అటవీ శాఖ రేంజర్ కామేశ్వర్ ఆచారి దృష్టికి తీసుకువెళ్లగా.. హలువ సమీప గ్రామాలు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఇలా ఒకొక్కసారి తారసపడుతుంటాయన్నారు. ప్రజల నుంచి జింక పిల్లకు ఎటువంటి హాని కలగకుండా సమాచారం తెలిసిన వెంటనే సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించా మని చెప్పారు. సమీపంలో జంఝావతి నది ఉండటంతో ఒకొక్కసారి ఇటువంటి తరహా వన్యప్రాణు లు నీరు తాగేందుకు వచ్చి గ్రామస్తుల చేతిలో చిక్కు కుంటాయన్నారు. వాటిని మళ్లీ సురక్షింతంగా అడవుల్లోకి తరలిస్తుంటారన్నారు. -
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025
కల్పవల్లి.. అందుకో మా సారె..!రాయగడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పంటలు పుష్కలంగా పండాలని కోరుతూ గత మూడేళ్లుగా మజ్జిగౌరి అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టింటి సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక బుదరావలసకు చెందిన ఐదు లైన్లలో ఉంటున్న కుటుంబాలు అమ్మవారికి ఆషాడ మాసం సారెను మంగళవారం అందించారు. సుమారు రెండు వేల మందికి పైగా మహిళలు తమ ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలతో పాటు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. తమను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం రోజున పూజలు చేస్తే తమ కోర్కెలు నెరవేరుస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. – రాయగడ న్యూస్రీల్ -
125 మందికి కంటి వైద్య పరీక్షలు
జయపురం: స్థానిక కాళీకృష్ణ సంఘ ప్రతిష్ట దినోత్సవం, సద్గురు దేవ్ స్వామీ సశ్చిదానంద సరస్వతీ మహారాజ్ 83వ జన్మదినం పురస్కరించుకొని స్థానిక కాళీకృష్ణ మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 125 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో కాళళీకృష్ణ సంఘ అర్జున పట్నాయిక్ గిరిజానంద, ముకుంద నంద, మృత్యంజయ ఠాకూర్, అమిత మిశ్ర, దివాకర దొలాయ్, అరుణ షొడంగి, జన్మేజయ దాస్, సంతోష్ కౌర్, కాళీకృష్ణ, అనిల్ పండ తదితరులు పాల్గొన్నారు. -
సమితి చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి గుడారి సమితిలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. రాజకీయాల్లో అత్యంత ప్రధాన్యత సంతరించుకున్న ఈ సమితిలో ఈనెల 24వ తేదీన సమితి చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ సొబొరొకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తేదీ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సమితి సభ్యులు, సర్పంచ్లు, గుణుపూర్ ఎమ్మెల్యే, చైర్మన్, వైస్ చైర్మన్లు హాజరవ్వాలని కోరారు. గత నెలలో సమితి వైస్ చైర్మన్ విశ్వనాథ్ సొబొరొ నేతృత్వంలో 14 మంది సభ్యులు చైర్మన్ లక్ష్మీపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం తేదీ ఖరారు చేశారు. అయితే ఈ సమితిలో 18 మంది సమితి సభ్యులు, సర్పంచ్లు ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 20 ఓట్లు ఉన్నాయి. -
పరిమళించిన మానవత్వం
నరసన్నపేట: దాతలు తమ ఔదార్యాన్ని చాటుతూ మానవత్వాన్ని చూపుతున్నారు. నరసన్నపేట మండలం దేవాది కాలనీలో ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు దాతలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ నెల 16న ‘దేవాదిలో విషాదం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో బాలికలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. రెండు రోజుల క్రితం కంబకాయకు చెందిన దాతలు రూ.25500 అందించగా.. తాజాగా మంగళవారం సంతబొమ్మాళి మండలం గోవిందాపురానికి చెందిన శ్రీ రేయమ్మతల్లి యూత్(హెల్పింగ్ హ్యాండ్స్) సభ్యులు మరో రూ. 25 వేలు, టెక్కలి చెందిన అభయం సేవా సంఘం సభ్యులు రూ.50 వేలు వితరణ చేశారు. కార్యక్రమంలో అభయం సేవా సంఘం ప్రతినిధులు దేవాది శ్రీనివాసరావు, సింహాచలం, ధర్మారపు పూర్ణారావు, సర్పంచ్ మంతిన రాము తదితరులు పాల్గొన్నారు. -
పుస్తెల తాడు చోరీ చేసిన వ్యక్తి అరెస్టు
కొరాపుట్: పుస్తెల తాడు చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు నబరంగ్పూర్ ఎస్డీపీవో కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 2వ తేదీన డొంగ్రుబజ గ్రామంలో ప్రశాంత్ పాత్రో భార్య సరోజని పాత్రో తన కిరాణా షాపులో విక్రయాలు చేస్తోంది. అదే సమయంలో తెంతులకుంటి సమితి కూర్మాకోట్ గ్రామానికి చెందిన దిలీప్ దాస్ అమె మెడలో బంగారు పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దిలీప్ను అరెస్టు చేసి 07.55 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధి ఎంపీవీ 83 గ్రామానికి చెందిన పింటు సాన (29) అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో విద్యుత్ షాక్తో సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పింటు వరంగల్లోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అతను డ్యూటీ సమయంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం పింటు మృతదేహన్ని మంగళవారం ఉదయం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మృతుడి భార్య గర్భవతి కావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి దత్తత పర్లాకిమిడి: కటక్ జిల్లాకు చెందిన దంపతులు స్థానిక కలెక్టరేట్ నుంచి 12 ఏళ్ల బాలుడిని అదనపు జిల్లా మాజిస్ట్రేటు ఫాల్గునీ మఝి చేతులమీదుగా మంగళవారం దత్తత తీసుకున్నారు. అనాథ శిశువును శిశు సంక్షేమ సమితి అదేశాల మేరకు ఉత్కళ బాలశ్రమంలో ఉంచి సంరక్షించారు. ఈ బాలుడిని కేంద్ర దత్తత పౌష్యకేంద్రం పోర్టల్లో చూసి కటక్కు చెందిన దంపతులు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు జిల్లా నుంచి 72 మంది శిశువులను దేశ, విదేశాల దంపతులకు దత్తతగా అందజేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో, శిశు సంక్షేమ శాఖ సభ్యురాలు మమతా శతపతి, జిల్లా శిశు సంరక్షణాధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, ఉత్కళ బాలాశ్రమం కార్యకర్తలు పాల్గొన్నారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల పరిధిలోడిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు వర్శిటీ పరీక్షల యూజీ డీన్ డాక్టర్ జి.పద్మారావు మంగళవారం తెలిపారు. రెగ్యులర్ విధానంలో 6,972 మందికి గాను 42.47 శాతం మంది, సప్లిమెంటరీలో 4,837 మందికి గాను 55.53 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి హిరమండలం: ఎల్ఎన్పేట మండలం బొత్తాడిసింగి గ్రామానికి చెందిన గుమ్మడి రామకృష్ణ (44) పాముకాటుకు గురై సోమవారం రాత్రి మృతి చెందాడు. రామకృష్ణ భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లారు. రామకృష్ణ పని చేస్తుండగా పాము కాటు వేయడంతో వెంటనే ఎల్ఎన్పేట పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈయనకు భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీతాల సమస్య పరిష్కరించాలి శ్రీకాకుళం న్యూకాలనీ : వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, టీచర్లు, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు జీతాల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి త్వరితగతిన జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
సారా స్థావరాలపై విస్తృత దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, పలాస మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, కుయారా, పెద్ద బురుజోల, చిన్న బురుజోల పరిసరాల్లో 160 లీటర్ల సారా, 12,700 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్న ం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ సూపరిటెండెంట్లు మురళీ, రామచంద్ర కుమార్, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహూ, ఎన్ఫోర్స్మెంట్స్ వింగ్, పాతపట్నం, నరసన్నపేట, పొందూరు, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, పర్లాకిమిడి, కాశీనగర్, గురండి, గారబంద ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మైనర్ బాలికపై లైంగిక దాడి
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో ఒక మైనర్ బాలికపై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మల్కన్గిరి పోలీసుస్టేషన్ పరిధికి చెందిన ఒక బాలిక తన స్నేహితురాలి పుట్టినరోజుకు సోమవారం ఉదయం వెళ్లింది. కానీ సాయంత్రం అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఐఐసీ రీగాన్కీండో తన సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. కాగా బిజఘాటీ వద్ద మంగళవారం ఉదయం బాలిక నడవలేని స్థితిలో ఉండడంతో అటుగా వస్తున్న కొంతమంది గమనించారు. అక్కడికి దగ్గరలో ట్రక్ డ్రైవర్ను చూసి అనుమానంతో పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే పోలీసులు వచ్చి డ్రైవర్ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికపై డ్రైవర్తో సహా మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం బాలికను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో మండిపడ్డారు. బీజేపీ పాలనలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరగుతున్నాయని దుయ్యబట్టారు. నలుగురు నిందితులు అరెస్టు -
టికెట్ల విక్రయంలో ఖుర్దారోడ్ టాప్
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వేలో ఖుర్దారోడ్ మండలం టికెట్ల విక్రయంలో అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. టికెట్లు కొనుగోలు కోసం ప్లాట్ఫారాల ప్రాంగణాల్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎంలు) వాడకంలో ప్రయాణికులను గణనీయంగా ప్రోత్సహిస్తోంది. మండల వ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఏటీవీఎంలు, టచ్ స్క్రీన్ ఆధారిత కియోస్క్లు దూర ప్రాంతాల ప్రయాణికులకు చిటికెలో సాధారణ టికెట్లని అందజేస్తున్నాయి. వాటితో ప్లాట్ఫామ్ టిక్కెట్లు, నెలవారీ మరియు త్రైమాసిక సీజన్ టిక్కెట్లను ఈ వ్యవస్థ అందజేస్తుంది. స్మార్ట్ కార్డులు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులతో సహా బహుళ చెల్లింపు విధానాలతో ప్రయాణికులకు ఇబ్బందిరహితంగా టికెట్లు విక్రయిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖుర్దారోడ్ మండలం ఏటీవీఎంల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణించే 41,28,866 మంది ప్రయాణికులకు 27,24,298 టిక్కెట్లను జారీ చేసి సమగ్రంగా రూ.30.69 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆదాయం ఈ ఏడాది మరింత పుంజుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) గత ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి ఏటీవీఎం 7,99,760 మంది ప్రయాణికులకు 5,40,447 టిక్కెట్లు జారీ చేయగా ఈ ఏడాది ప్రయాణికులకు 7,97,340 టికెట్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదాయం సగం పైబడి పుంజుకుంది. గతేడాది రూ.5.93 కోట్లకు పరిమితమైన ఆదాయం ఈ ఏడాది 65.5 శాతం పెరుగుదలతో రూ.9.82 కోట్లు ఆర్జించింది. తొలి త్రైమాసికంలో గణనీయంగా పెరిగిన ఆదాయం -
పారదర్శకంగా సర్వే
గార: బంగారు కుటుంబాలు సర్వే పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం గారలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్తో కలిసి గ్రామసభలో పాల్గొని సర్వే తీరును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సంక్షేమ కార్యక్రమాలు అమలును అడిగి తెలుసుకున్నారు. కొత్తూరు సైరిగాం వద్ద ఆటోలో యూరియా బస్తాలు వెళ్తుండటంతో వాటి వెనుకనే గ్రామంలోకి వెళ్లి 16 బస్తాలు ఒకేసారి ఎందుకు వెళ్తున్నామని ప్రశ్నించారు. ఎనిమిది మంది రైతులు తెచ్చుకున్నామని తెలియజేశారు. అనంతరం సమీపంలోని ఎంపీయూపీ పాఠశాలను సందర్శించి విద్యార్థుతో ముచ్చటించారు. మౌలిక వసతులపై హెచ్ఎం ఆర్.రమణమూర్తితో మాట్లాడగా.. అదనపు తరగతి భవనాలు అవసరమని తెలియజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ ఏ.రఘు తదితరులు పాల్గొన్నారు. -
నవజీవన ఆశ్రమంలో తనిఖీలు
గార: మౌలిక వసతుల కల్పనతో పాటు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా నిర్వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. మంగళవారం శ్రీకూర్మంలోని నవజీవన ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. విద్యార్థుల హాస్టల్, తరగతి గదులు, వంటశాల పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేపట్టారు. ఏమైనా సమస్యలుంటే పరిశీలనకు వచ్చే అధికారులకు తెలియజేయాలన్నారు. కార్డన్ సెర్చ్ కలకలం టెక్కలి రూరల్: టెక్కలి మండల కేంద్రంలోని గొల్లవీధిలో సీఐ ఎ.విజయ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులు, నిషేధిత పదార్థాలకు సంబంధించి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్టేషన్కు తరలించారు. కాగా, ఇతర పత్రాలు సక్రమంగా ఉన్నా సీ బుక్లో ఉన్న వ్యక్తి లేకపోయినా వాహనం తీసుకువెళ్లిపోయారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శభాష్ అయ్యవార్లు! జి.సిగడాం: మండలంలోని కొత్తపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పొగిరి పండు అప్పలనాయుడు, మక్క లక్ష్మునాయుడు, వి.మమత స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో కాకుండా అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి అభినందనలు అందుకుంటున్నారు. వీరి పిల్లలు పొగిరి నూతన్కుమార్(6వ తరగతి), మక్క మోక్ష వర్షిణిచ, వేదిత్లను కొత్తపెంట స్కూల్లోనే చేర్పించడంతో ప్రధానోపాధ్యాయులు ఎస్.భానుమూర్తి, వి.రవి, గ్రామస్తులు అభినందించారు. కర్షకులకు కొనసాగుతున్న కష్టాలు ● ఎరువుల కోసం తప్పని పాట్లు కొత్తూరు: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. కొత్తూరు రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం 20 టన్నులు యూరియా కేటాయించింది. తక్కువ మొత్తంలో రావడంతో రైతులు రెండు రోజులుగా ఆర్ఎస్కేల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం యూరియా విక్రయిస్తారని గ్రామ వ్యవసాయ సహాయకులు చెప్పడంతో పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. అడంగల్ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తామని చాలామంది నిరాశతో వెనుతిరిగారు. పెన్కాక్సిలాట్లో పతకాల పంట శ్రీకాకుళం న్యూకాలనీ: సౌత్జోన్ నేషనల్స్ పెన్కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఉన్న కొంగునాడు ఇంజినీరింగ్ కాలేజీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు 6వ సౌత్జోన్ పెంకాక్సిలాట్ పోటీలు జరగగా.. అంధవరపు సాయి ప్రశాంత్, దున్న సుచెరిత, కొండేటి హరీష్, బంగారు పతకాలు సాధించారు. దున్న సుమన, రెడ్డి యోగామృత, అంధవరపు లలిత్మిదిన్, పి.షాన్, కె.దీక్సిత రజత పతకాలు, బి.నాగేశ్వరి, బి.జ్యోతి సాయి ప్రసాద్, సాన సుజిత్ శంకర్, ఎస్.సహస్ర, బి.కార్తికేయ, పి.పవన్, పి.రాకేష్ నాయుడు, మండా రామ్సాయి, విహాన్ శర్మ కాంస్య పతకాలు సాధించారు. వీరిని పెన్కాక్సిలాట్ సంఘ జిల్లా అధ్యక్షులు రేగిడి దయమయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు, శ్రీ పరశురామ యుద్ధకళా క్షేత్రం కోచ్ లింగాల ఈశ్వర్రావు అభినందించారు. హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ హేమంత్ యాదవ్, హరీష్ పాల్గొన్నారు. -
ఐరాస రికార్డుల్లో చోటు
ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో స్థానిక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) స్థానం చేజిక్కించుకుంది. గిరిజన యువతకు సాధికారత కల్పించడంలో తిరుగులేని సంస్థగా ప్రాధాన్యత సంతరించుకుని ఈ ప్రతిష్టాత్మక గుర్తింపుని సాధించడం విశేషం. పరివర్తనాత్మక, ప్రయోజనకర విద్యా బోధనతో గిరిజన మరియు ఇతర వెనుకబడిన యువతకు సాధికారత కల్పించడంలో కిస్ నిరంతర కృషిని ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ఈసీఓఎస్ఓసీ) గుర్తించింది. గిరిజన సమూహాల నుంచి బాలలను అక్కున చేర్చుకుని కిస్ సంస్థ బాహ్య ప్రపంచంలో హుందాగా ఉనికిని ప్రదర్శించే రీతిలో తీర్చిదిద్దుతోంది. – భువనేశ్వర్ -
క్రిమినల్స్పై ఉక్కుపాదం
● నేరస్తుల కట్టడిలో రాజీలేని చర్యలు ● ఎస్పీ రోహిత్ వర్మ వెల్లడి కొరాపుట్: జయపూర్ పట్టణాన్ని నేర రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ జయపూర్ పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. దశాబ్దాలుగా ఉన్నటువంటి నేరస్తుల ఏరివేతలో రాజీలేని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ ఏడాది మార్చి నుంచి దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో 81 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ కేసుల్లో 30 ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్, 40 బంగారు రింగులు, 10 మంగళసూత్రాలు, రూ.6.75 లక్షల నగదు సీజ్ చేశామన్నారు. బెదిరింపు ఘటనల్లో మరో పదిమందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాలో 31 మంది కరుడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేసి 2,501 కేజీల గంజాయి, 585 ఇంజెక్షన్లు, 7 కార్లు, 3 తుపాకీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరికొన్ని దాడుల కేసుల్లో మరో 19 మందిని అరెస్టు చేశామన్నారు. అనుక్షణం పోలీసు నిఘా పట్టణంలో అనుక్షణం పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నేరస్తులు తమ నేర ప్రవర్తన వదలి సామాన్య జీవితం గడపాలని పిలుపునిచ్చారు. బెయిల్ మీద వచ్చిన వారి మీద కూడా పోలీసు నిఘా ఉంటుందన్నారు. నేరస్తుల పాత కేసుల జాబితా సిద్ధం చేసి కోర్టులకు సమర్పించి బెయిల్ అడ్డుకుంటామన్నారు. ఎక్కడైనా బెదిరింపులకు పాల్పడితే 94389 16918 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇకపై గంజాయి అక్రమ రవాణా చేసి పట్టుబడితే వారి పేరు మీద ఉన్న ఆస్తులు ప్రభుత్వపరం చేసే చర్యలు ఉంటాయని గుర్తు చేశారు. కాగా జయపూర్ చరిత్రలో తొలిసారిగా అత్యధిక 15 మంది నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్ వర్మ నేరస్తుల అరెస్టులను అధికారికంగా ప్రకటించారు. సమావేశంలో ఎస్డీపీవో పార్ధవ్ కశ్యప్ తదితరులు ఉన్నారు. -
నేరాలను నియంత్రించాలి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని, పెండింగ్ వారెంట్లు త్వరితగతిన అమలుకు పంపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు, పరిష్కారం, మాదకద్రవ్యాల నియంత్రణ, నాన్బెయిల్బుల్ వారెంట్ల అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విజిబుల్ పోలీసింగ్, కార్టన్ అండ్ సెర్చ్ సోదాలు వంటి అంశాలపై జిల్లాలో గల డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా కమిటీలను సన్నద్ధం చేయాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టి గంజాయి అక్రమ రవాణా, క్రయవిక్రయాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించాలని, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కళాశాలలు, పాఠశాలల పరిధిలో ఎలాంటి ర్యాగింగ్, ఇతర నేరాలు జరగకుండా చూడాలన్నారు. -
డబుల్ రోడ్డు పనులు పునఃప్రారంభం
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస నియోజకవర్గంలో బెండి గేటు నుంచి బెండి మీదుగా నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదగా కాశీబుగ్గ వరకు అధ్వానంగా మారిన రోడ్లు దుస్థితిపై ‘ఎన్నాళ్లీ రహదారిద్య్రం?’ అనే శీర్షికతో ఈ నెల 19న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు అభివృద్ధి పనులు పునఃప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నువ్వలరేవు–రేగిలపాడు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.23 కోట్లు, వజ్రపుకొత్తూరు అక్కుపల్లి మీదుగా కాశీబుగ్గ వరకు సుమారు రూ.21 కోట్లు వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు సిద్ధం చేస్తామని చెప్పి ఏడాది కాలం దాటిన తర్వాత పనులు మళ్లీ ప్రారంభించడం కొసమెరుపు. -
కోర్టు భవనం ప్రారంభం
పర్లాకిమిడి: ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్ టాంటన్ వర్చువల్గా గజపతి జిల్లా కాశీనగర్లో గ్రామ న్యాయాలయం, జేఎంఎఫ్సీ నూతన కోర్టు భవనాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి గజపతి జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో జేఎంఎఫ్సీ మోనాలీ బెహరా, రిజిస్ట్రార్ ప్రసన్న కుమార్ బెహరా, ఎస్జే సాహు, పర్లాకిమిడి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిత్తు పట్నాయక్, సభ్యుడు ఎం.పృథ్వీరాజ్, న్యాయవాదులు పంటల ప్రసాదరావు, ఏకే పండా, ప్రభుత్వ న్యాయవాది శైలాడ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీ బస్సు ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ లక్ష్మీబస్సుని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత మంగళవారం ప్రారంభించారు. ఈ బస్సు ఒడియా పెంట, పంచడ, కక్కిరిగుమ్మ, చంపి, తోయాపుట్, లక్ష్మీపూర్ సమితి కేంద్రాల గుండా ప్రయాణం చేస్తుంది. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలను లక్ష్మీపూర్ చేర్చడానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి చైర్మన్ సువై కులసిక, జిల్లా పరిషత్ సభ్యురాలు పింకి హిమరిక, ఒడియా పెంట సర్పంచ్ బన్సి మండిగా, పూర్ణ మండింగా తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర తొలియ విగ్రహం ఏర్పాటు చేయండి జయపురం: సొంత గ్రామంలో జవాన్ ఈశ్వర్ తొలియ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీ బొడగుడ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీడీవోకు ఒక వినతిపత్రం సోమవారం అందజేశారు. డిసెంబర్ నాటికి అత్యంత వేగంగా విగ్రహం ఏర్పాటును పూర్తి చేయాలని విన్నవించారు. నీటికుంటలో పడి బాలిక మృతి కొరాపుట్: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి ఖోజా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక కరిస్మిత హబిక(7) తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలో నిర్మిస్తున్న మెగా తాగునీటి పథకం కోసం తవ్విన నీటికుంటలో ఆమె మృతదేహం కనబడింది. వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణపట్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో బాలుడు మృతి మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి దామాగూడ గ్రామంలో రామా కబాసీ (17) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రామా కబాసీ సోమవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం తమ ఇంటి బయట వరండాలో తండ్రితో కలిసి నిద్రించాడు. అయితే అర్థరాత్రి ఒక విష సర్పం బాలుడి ఎడమ చెవిభాగంలో కాటు వేసింది. బాలుడు కేకలు వేయడంతో తండ్రి లేచి చూస్తే నల్ల త్రాచుపాము కన్పించింది. అదే కాటు వేసింది అని తెలుసుకొని గ్రామస్తుల సాయంతో వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. కలిమెల పోలీసులు విషయం తెసుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చెరువులో మునిగి మహిళ మృతి మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి కేంద్రానికి చెందిన పార్వతీ మడ్కమి (45) మంగళవారం ఉదయం దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో కాలుజారి పడిపోయింది. మధ్యాహ్నం అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా జాడ కనిపించలేదు. అయితే అటుగా వచ్చిన కొంతమంది మహిళలకు ఆమె చీర తేలుతూ కనిపించడంతో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె కుమారుడు విజయ్ మడ్కమి చెరువు వద్దకు వచ్చి ఆమెను బయటకు తీసి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలియడంతో ఐఐసీ ముకుందో మేల్కా ఆరోగ్య కేంద్రానికి వచ్చి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నెక్కంటిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, జిల్లా బీజేడీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, అతని అనుచరులు బి.మన్మథరావు(చిట్టి), కృష్ణలపై రాయగడ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాల్ల కొండబాబు పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా గత 40 ఏళ్లుగా వ్యవహరించిన నెక్కంటి, అతని అనుచరులు సంఘానికి సంబంధించిన ఆదాయం లెక్కలు చూపించకుండా స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం తాను (కొండబాబు) లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరర్వాత ఇప్పటివరకు సంఘం పేరుమీద సుమారు రూ.2 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అయితే నలభై ఏళ్లుగా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన నెక్కంటి కనీసం ఒక్క రూపాయి ఆదాయం సంఘం పేరుమీద ఉన్నట్లు చూపించలేదని వివరించారు. ఇకపై ఆయన ఆగడాలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘానికి సంబంధించిన ఆదాయం లెక్కలను చూపించాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఎదుట కొద్దిసేపు నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం కార్యదర్శి కడుపుకూట్ల జానకీరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు శారదాపూర్ అడవుల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా శారదాపూర్ అడవుల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 199 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన రవాణాదారులు అక్కడ నుంచి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చంద్రపూర్లో... గంజాయి సాగుకు నిలయంగా గుర్తింపు పొందిన చంద్రపూర్లో పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం పోలీస్స్టేషన్ పరిధిలోని కిరమా కూడలిలో ఒక వ్యక్తి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈ మేరకు కోర్టుకు తరలించారు. -
నూతన ప్రతిజ్ఞ విధానం అమలు
కొరాపుట్: నబరంగ్పూర్ మహిళా విద్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూతన ప్రతిజ్ఞ విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. కళాశాల ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి సమాజంలో అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందుకు సాగాలన్నారు. కళాశాలలో ఉన్న యువతీ, యువకులు సామాజిక పరిరక్షణ కోసం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలేశ్వరి సాహు, అధ్యాపకులు సంజుక్తా పండా, ఉపేంద్ర ఖొస్లా, ఎన్.ఎన్.ఖోస్లా, రంజితా ప్రహరాజ్, సైరా బేగం తదితరులు పాల్గొన్నారు. -
బీజేడీ ఆందోళన
రాయగడ: రాష్ట్రంలో బీజేపీ అసమర్థత పాలనకు అద్దం పట్టేలా తరచూ మహిళలపై చోటుచేసుకుంటున్న సంఘటనలకు వ్యతిరేకంగా బీజేడీ స్పందించింది. బీజేపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. తాజాగా బాలేశ్వర్లో ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మా ఝి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బరంపురంలో గల దక్షణాంచల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) కార్యాలయం ఎదుట సోమవారం బీజేడీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆ పార్టీకి చెందిన రాయగడ నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ మా జీ ఎంపీ, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగో, అనసూయమాఝి తదితరులు బరంపురం ఆర్డీసీ కార్యాలయం ఘెరావ్లో పాల్గొన్నారు. పర్లాకిమిడి: బాలేశ్వర్ జిల్లా ఫఖీర్ మోహన్ కళాశా ల విద్యార్థిని సౌమ్యశ్రీ మృత్యుఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బరంపురం దక్షిణ మండలం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేడీ నాయకులు ప్రదీప్ మఝి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బరంపురం ఖల్లికోట్ కళాశాల గ్రౌండ్స్ నుంచి విద్యార్థి సంఘాలు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో సంజయ్ దాస్ వర్మ, గోపాల్పూర్ ఎమ్మె ల్యే విక్రమ్ పండా, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బిజద గజపతి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝికి రాసిన వినతిని దక్షిణ మండలం ఆర్డీసీకి అందజేశారు. -
ఆర్డీసీ కార్యాలయాల ఆవరణలో బీజేడీ ఆందోళన
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, బాలికలకు భద్రత, రక్షణ పూర్తిగా లోపించింది. ఈ వర్గాలపై నేరాలు నిత్యకృత్యాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళ మనుగడ క్షణ క్షణం భయం భయంగా తయారైందని విపక్ష బిజూ జనతా దళ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ జోక్యం ఆశిస్తు బిజూ జనతా దళ్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కమిషనర్ల ఆధ్వరంలో స్మారక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సోమవారం శాంతియుతంగా నిరసన ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించి ఆర్డీసీలకు స్మారక పత్రం అందజేశారు. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని సౌమ్య శ్రీ బీసీ ఆత్మాహుతి మరణం, ఢిల్లీ ఎయిమ్స్లో ఆగంతకుల నిప్పు దాడితో మృత్యు పోరాటం చేస్తున్న పూరీ జిల్లా బొలొంగా ప్రాంతపు బాలిక దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో సగటు మహిళకు రక్షణ కొరవడిన వైపరీత్య పరిస్థితులకు నిలువెత్తు తార్కాణంగా పేర్కొన్నారు. కటక్లోని సెంట్రల్ రెవెన్యూ కమిషనర్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఆందోళనలో 10 జిల్లాల నుంచి బిజూ జనతా దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒడిశాలో మహిళలపై జరిగిన నేరాలు, వారి రక్షణ, ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీ విద్యార్థి మరణంపై న్యాయ విచారణ జరపాలని వీరంతా డిమాండ్ చేశారు. రాష్ట్ర హై కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఈ విచారకర సంఘటనపై న్యాయ విచారణ జరపాలని బీజేడీ డిమాండ్ చేసింది. సంబల్పూర్, బరంపురం ఆర్డీసీ కార్యాలయాల ఆవరణలో ఈ తరహా ఆందోళనలు ఏక కాలంలో చేపట్టి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన వ్యక్తం చేశారు. -
బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన
కొరాపుట్: బొడసుక్కు వంతెన నిర్మాణ పురోగతిని రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రబినాయక్ పరిశీలించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి నిర్మితమవుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. రూ.64 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ వంతెన వల్ల దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. బొడసుక్కు గ్రామం నుంచి కొరాపుట్కి కేవలం 5 కిలోమీర్ల దూరం ఉంటుందని తెలిపారు. కానీ అడ్డంగా కొలాబ్ రిజర్వాయర్ ఉండడంతో ప్రజలు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ఇక్కడ వంతెన కోసం కొరాపుట్, నందపూర్, లమ్తాపుట్ సమితుల ప్రజలు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతానికి కనెక్టెవిటీ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో, రుపు దర్ బోత్ర, కలెక్టర్ వి.కీర్తి వాసన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రతిపక్ష బీజేడీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్రహ్మపురలో సోమవారం ఆందోళన చేపట్టారు. నబరంగ్పూర్, కొరాపుట్ జిల్లాలకు చెందిన బీజేడీ నాయకులు భారీగా పాల్గొన్నారు. బ్రహ్మపుర పట్టణంలో దక్షిణ ఒడిశా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని పార్టీ శ్రేణులు ముట్టడించారు. దక్షిణ ఒడిశాలోని పది జిల్లాల నుంచి కార్యకర్తలు ఆందోళనలో పాలొగన్నారు. బాలేశ్వర్ జిల్లాలో విద్యార్థిని సౌమ్యశ్రీ హత్యతోపాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరిగింది. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో నబరంగ్పూర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎంపీ ప్రతిప్ మజ్జి, జెడ్పీ ప్రెసిడెంట్ మెతిరాం నాయక్ హాజరవ్వగా.. కొరాపుట్ జిల్లా నుంచి మాజీ మంత్రి రబి నారాయణ నందో, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ మంత్రి పద్మిని దియాన్, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం పొడాల్, ప్రభు శాంత, ప్రపుల్ల పంగి, పీతం పాడీ, బీజేడీ నాయకులు నాగరాజు దొర, లతా రాయ్, దుర్గా మిశ్రా, బాల్ రాయ్, శివ పట్నాయక్, బాలంకేశ్వర రావు, ప్రసాద్ బిడ్డిక పాల్గొన్నారు. బ్రహ్మపురలో ఆందోళన భారీగా హాజరైన బీజేడీ పార్టీ నాయకులు