యువత నిబద్ధతతోనే వికసిత్ భారత్
● గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: దేశ నిర్మాణంలో యువత నిర్ణయాత్మక పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. వికసిత్ భారత్ వైపు భారత దేశం ప్రయాణం సాఫల్యత యువ పౌరుల పాత్ర, సామర్థ్యం, నిబద్ధతపై ఆధారపడి ఉందని అన్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) బృందం కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. లోక్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్సాహభరితమైన, క్రమశిక్షణ కలిగిన ఎన్సీసీ క్యాడెట్లను స్వాగతిస్తూ, డాక్టర్ కంభంపాటి లోక్ భవన్లో వారికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భం దేశభక్తి, ఐక్యత, యువత సంకల్పం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి మీరు కేవలం క్యాడెట్లు కాదు, మీరు భారత దేశ గర్వానికి, మన దేశ భవిష్యత్కు మార్గదర్శకులు అని కొనియాడారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్లో వారు పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ క్యాడెట్ల అంకితభావం, క్రమశిక్షణ, జాతీయ సేవ పట్ల నిబద్ధతకు ప్రతీక అని గవర్నర్ అన్నారు. పరేడ్ కేడెట్ల చాతుర్యం, దోషరహిత కసరత్తు, అచంచలమైన స్ఫూర్తి, వ్యక్తిగత శ్రేష్టతను మాత్రమే కాకుండా ఎన్సీసీ శాశ్వత విలువలను ప్రదర్శించాయని ఆయన పేర్కొన్నారు.
ఐక్యత, క్రమశిక్షణ అనే ఎన్సీసీ నినాదం యువతకు జీవితాంతం మార్గదర్శకంగా పని చేస్తుందన్నారు. ఎన్సీసీ శిక్షణ, శిబిరాలు, కవాతులకు మించి వ్యకిత్వ రూపకల్పన, నాయకత్వ లక్షణాల బలోపేతం, సమాజం పట్ల లోతైన బాధ్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎన్సీసీ క్యాడెట్లతో సంభాషించారు. రక్షణ సేవలలో చేరడం, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యను కొనసాగించడం వంటి వారి ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాడెట్లు ఈ సంభాషణలో చురుకుగా పాలుపంచుకున్నారు. ఒడిశా ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమోడోర్ విక్రమ్ సింగ్ ఈ సభలో ప్రసంగించారు. కార్యక్రమానికి క్రీడలు, యువజన సేవల శాఖ కమిషనర్, కార్యదర్శి సచిన్ రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి.
యువత నిబద్ధతతోనే వికసిత్ భారత్
యువత నిబద్ధతతోనే వికసిత్ భారత్


