breaking news
Odisha Latest News
-
నీటిగుంతలో మహిళ మృతి
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బడిగెట పంచాయతీలో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన మహిళ నీటిగుంతలో మునిగి దురదృష్టావశాత్తు మరణించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ఇర్మా పడియమి అనే వ్యక్తి తన భార్య ముకే పడియమి(35)తో పొలం పనులకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చాక ముకే పడియామి స్నానం కోసం బావి తరహా నీటిగుంత వద్దకు వెళ్లింది. అక్కడ నీటిలో కాలుజారి పడిపోయి బయటకు రాలేకపోయింది. అయితే ఎంతసేపటికీ భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఇర్మా గ్రామంలో వెదికాడు. అయితే శనివారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని బావిలో గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ప్రభుదత్తు బిశ్వల్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మృతదేహన్ని భర్తకు అప్పగించారు. గంజాయి స్వాఽధీనం రాయగడ: రాయడ నుంచి రైలుమార్గం ద్వారా ఛత్తీస్ఘడ్లోని రాయిపూర్కు గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడు జిల్లాలోని బిసంకటక్ పోలీస్స్టేషన్ పరిధి సికబంధ గ్రామానికి చెందిన ధర్మిత్ భత్రగా గుర్తించారు. అతడిని కోర్టుకు తరలించారు. దాడిలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మింజా, ఎస్ఐ సంతోష్ కుమార్ పరిడ, ఏఎస్ఐ మానిక్ చంద్రగౌడో, కానిస్టేబుల్ చిత్తరంజన్ స్వయిన్, రమేష్ కందపాణి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన సదస్సు పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్ వృషభ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం వివిధ చట్టాలపై న్యాయ అవగాహన సదస్సును జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో సంచలన తీర్పులను చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ పీపీ రాజేష్ కుమార్ మిశ్రా, సైకాలజీ స్పెషలిస్టు ప్రాణరంజన్ నాయక్, సెరంగో పోలీసుస్టేషన్ ఎస్ఐ చౌదురి శివ, సామాజిక కార్యకర్త దయా పలక తదితరులు పాల్గొన్నారు. ఉచితంగానే క్యాన్సర్ చికిత్స భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద 121 కొత్త క్యాన్సర్ చికిత్స ప్యాకేజీలను చేర్చాలని నిర్ణయించింది. దీనితో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత చికిత్స పొందే అవకాశం గణనీయంగా విస్తరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను బలోపేతం చేసి రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కొత్తగా ఆమోదించిన ప్యాకేజీల లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ విస్తరించిన కవరేజీలో కీమో థెరపీ, రేడియో థెరపీ, అనేక రకాల సంక్లిష్ట క్యాన్సర్ శస్త్ర చికిత్సలు చేర్చారు. దీనివల్ల బాధితులకు అధిక ఖర్చుల భారం లేకుండా అధునాతన చికిత్సను పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అదనపు చికిత్స ప్యాకేజీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోగులు చికిత్సను అర్ధాంతరంగా ఆపకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఏ రోగికి కూడా సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందకుండా పోకూడదనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమన్నారు. విస్తరించిన కవరేజీ కింద ఆయుష్మాన్ భారత్ కార్డుదారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ఎంప్యానెల్డ్ ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో కూడా కొత్త క్యాన్సర్ చికిత్స ప్యాకేజీలను పొందగలుగుతారు. -
● విద్యాశాఖ మంత్రి నిత్యానంద రాజీనామా డిమాండ్
కొరాపుట్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేడీ భారీ ఆందోళన చేపట్టింది. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి తరలివచ్చిన బీజేడీ పార్టీ విద్యార్థి, యువజన, మహిళ విభాగాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్సితా సాహు మాట్లాడుతూ విద్యామంత్రిని దుయ్యబట్టారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వచ్చిందన్నారు. విద్యామంత్రి సుమారు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం మెహన్ చరణ్ మజ్జి, నిత్యానంద గొండొ చిత్రపటాలకు ఎండు చేపలు బహుకరించారు. నెయ్యి వేసి దగ్ధం చేశారు. ఆందోళనలో మాజీ మంత్రి రబినారాయణ నందో, కేసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి, కొరాపుట్ జెడ్పీ చైర్పర్సన్ సస్మితా మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, అరుణ్ కుమార్ మిశ్ర, ఈశ్వర్ అల్లాడ, లలెటెందు విద్యాదర్ శెఠి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
పంచాయతీ పోరుకు సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) ఎన్నికలకు ఒడిశా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ప్రారంభించిందని ఎస్ఈసీ కార్యదర్శి సంతోష్ కుమార్ దాస్ శనివారం తెలిపారు. జాతీయ జనాభా గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జనగణన పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి నెలలో అధికారిక ప్రకటన జారీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్ పదవుల కోసం ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను ప్రచురించిన అనంతరం ఎస్ఈసీ ప్రాథమిక పనులను ప్రారంభిస్తుంది. రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసిన తర్వాత కమిషన్ తదుపరి ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను చేపడుతుంది. రిజర్వేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ రాష్ట్రంలో 35 పట్టణ పాలక సంఘాల అధ్యక్షుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా ఉత్తర్వును జారీ చేసింది. సాధారణ ప్రజలు 15 రోజుల్లోపు తమ అభ్యంతరాలు, సూచనలు ఇవ్వవచ్చని ప్రకటించారు. ఈ సూచనలను మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కానుండగా, ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో జారీ అయ్యే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఏప్రిల్–మే నెలల్లో ఏకకాలంలో నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ప్రస్తుతం ఎస్ఈసీ వద్ద మున్సిపల్ ఎన్నికల కోసం సుమారు 12,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) ఉన్నాయి. అదనంగా 6,000 మెషీన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేసిన తర్వాత ఇంటింటి సర్వే కూడా నిర్వహించబడుతుంది. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీ)లో సులభమైన మరియు అవాంతరాలు లేని ఓటింగ్ను నిర్ధారించడానికి ప్రతి వార్డులో ఒక పోలింగ్ బూత్ ఉంటుందని పేర్కొన్నారు. -
అడపా మండపానికి జగన్నాథుడు
భువనేశ్వర్: జగన్నాథుని రథయాత్ర కీలక దశ శనివారం ఆరంభమైంది. స్వామివారు గుండిచా మందిరం అడప మండపంపై కొలువుదీరడం యాత్ర ప్రధాన ఆకర్షణ. ఈ మండపంపై శ్రీమందిరం రత్న వేదికపై నిత్యం అందుకునే సేవాదులు, అలంకరణలతో స్వామివారు భక్త జనులకు దర్శనం ప్రసాదిస్తాడు. అడప మండపంపై స్వామి దర్శనం పూర్వ జన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. రథాలపై వేంచేసిన మూల విరాటులు గుండిచా మందిరం ఆవరణ శారదా బాలి ప్రాంగణంలో ఆరుబయట గత 3 రోజులుగా రాత్రింబవళ్లు సర్వ జనులకు కనులనిండా దర్శనం కల్పించారు. శనివారం సాయంత్రం రథాల పైనుంచి దిగి అడప మండపానికి చేరారు. రథాలకు అమర్చిన కొయ్య గుర్రాల్ని తొలగించి, రథాలకు చారుమళ్లు అమర్చి మూల విరాటులను సురక్షితంగా కిందకు దించారు. మందిరంలోకి ప్రవేశింపజేసే పొహండి బృహత్తర ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. -
● చెక్ బౌన్స్ కేసుల పరిస్కారం
జయపురం: నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీల ఆదేశాల మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జిల్లా న్యాయస్థానం జయపురం ప్రాంగణంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో చెక్ బౌన్స్ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. మొత్తం 16 కేసుల్లో 10 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి, అదాలత్ శాశ్వత విచారపతి ప్రద్యుమయి సుజాత, ప్రథమ శ్రేణి జడ్జి హరమోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల అక్రమ రవాణా అరికట్టాలి
పర్లాకిమిడి: బాలల అక్రమ రవాణా అరికట్టాలని వక్తలు అన్నారు. గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ జిరంగో గ్రామంలో బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జన సచేతన కార్యక్రమం జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సమావేశానికి చైల్డ్లైన్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ లక్ష్మీదేవి, పంచాయతీ సర్పంచ్ రిసపా భుయ్యాన్, పంచాయతీ ఈవో రసపాత్రో, వార్డు మెంబర్లు హాజరయ్యారు. ఇటీవల జిరంగో పంచాయతీలో కొంతమంది బాలలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా వెట్టి చాకిరీ కోసం రవాణా చేస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు బాలలను పనికి పంపుకుండా బడికి పంపాలని డీసీపీవో అరుణ్ త్రిపాఠి సూచించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సత్యబాన్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన మల్కన్గిరి యువకుడు
మల్కన్గిరి: జిల్లా కేంద్రానికి చెందిన సౌభాగ్య సుందర్ నాయక్ నీట్ పరీక్షలో సత్తాచాటాడు. 720 మార్కులకు గానూ 671 మార్కులు సాధించాడు. అలాగే ఎంవీ 37 గ్రామానికి చెందిన బిప్లబ్ ఠాకూర్ 720 మార్కులకు గానూ 621 మార్కులు సాధించాడు. దీంతో వీరిని పలువురు అభినందించారు.రైలు మార్గానికి భూములు అప్పగింత జయపురం: జయపురం – నవరంగపూర్ నూతన రైలు మార్గం కోసం ఎంపిక చేసి సేకరించిన భూములను రైల్వే అధికారులకు అప్పగించే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బొరిగుమ్మ తహసీల్ ఆధీనంలోని బొరగాం, అవుళి మౌజాల్లో 30.410 ఎకరాల భూమిని రైల్వే అధికారులకు అప్పగించారు. భూమిని అప్పగించిన 34 మంది రైతులకు పరిహారం పంపిణీ చేసినట్లు తహసీల్దార్ బెహర వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్ ఉద్యోగులు సంజీవ్ టక్రి, అవులి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సబితా నాయిక్, బాలాజీ సంగ్, రైల్వే అశికారి సాయి రామకృష్ణ, జూనియర్ ఇంజినీర్ గోవింద బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
మల్కన్గిరి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వక్తలు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ అధ్యక్షతన బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లాస్థాయి ప్రత్యేక అమలు శిక్షణా కార్యక్రమం, సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన జిల్లా యాక్షన్ ప్లాన్ 2026–2029 పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, ముఖ్య అభివృద్ధి శాఖ అధికారి దాశరథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోదన్ బోయి, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి సుచితా పండా, యూనిసెఫ్ వనరుల వ్యక్తి ఘాసిరామ్ పండా, జిల్లా ఆస్పత్రి వైద్యుడు రణసింగ్, జిల్లా శిశు సంరక్షణ అధికారి నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
పవిత్ర రథాలు
గుండిచా ఆవరణకు● నేడు అడప మండప విజేభువనేశ్వర్: రాత్రి విరామం తర్వాత శ్రీ జగన్నాథుని రెండో రోజు వార్షిక రథ యాత్ర తిరిగి శుక్ర వారం ప్రారంభమైంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలు గుండిచా ఆలయం ముందున్న శారదా బాలికి సురక్షితంగా చేరుకున్నాయి. ఉదయం వేలాది మంది పోలీసు సిబ్బంది, లక్షలాది మంది భక్తులు చేతులు కలిపి బొడొ దండొ వెంబడి 3 భారీ చెక్క రథాలను లాగడంతో రథ యాత్ర తిరిగి ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి ఊరేగింపు మిగిలిన మార్గాన్ని పూర్తి చేస్తుండగా పుణ్యక్షేత్ర పట్టణం జై జగన్నాథ్ భక్తి నినాదంతో ప్రతిధ్వనించింది. ఉత్సవ పొహండి ఊరేగింపులో జాప్యం కారణంగా గురువారం యాత్ర అసంపూర్తిగా మిగిలిపోయింది. ఫలితంగా సూర్యాస్తమయం సమయానికి ముందుగా ఏ ఒక్క రథం తమ గమ్య స్థానం చేరుకోలేకపోయింది. దీంతో అధికారులు ఆ రోజు ఊరేగింపును నిలిపి వేశారు. దేవతా మూర్తులు రాత్రంతా తమ తమ రథాలపైనే కొలువై ఉన్నారు. మొదటి రోజు ఊరేగింపు ముగిసే సరికి బలభద్రుని తాల ధ్వజ రథం దాదాపు 700 మీటర్లు ప్రయాణించి మార్కెట్ చౌరస్తాకు చేరుకోగా, సుభద్ర దేవి దర్ప దళన్ రథం సుమారు 400 మీటర్లు ప్రయాణించి మారీచికోట్ ఛక్ వద్ద ఆగిపోయింది. జగన్నాథుని నందిఘోష రథం శ్రీ జగన్నాథ ఆలయ సింహ ద్వారం నుంచి కొద్ది దూరం మాత్రమే కదలగా ఊరేగింపును నిలిపివేశారు. శుక్రవారం ఉదయం యాత్ర పునః ప్రారంభం కావడంతో మిగిలిన దూరాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసి మూడు రథాలను గుండిచా ఆలయం ముందున్న శారదా బాలి వద్ద నిలిపారు. శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి మాట్లాడుతూ చతుర్థా మూర్తులు శుక్రవారం రాత్రి తమ రథాలపైనే గడుపుతారని తెలిపారు. గుండిచా ఆలయంలోకి అడపా మండప విజేగా ప్రసిద్ధి చెందిన ఉత్సవ ప్రవేశ ఊరేగింపు జూలై 18 శనివారం నాడు జరగనుంది. బహుడా యాత్ర సమయంలో శ్రీ జగన్నాథ ఆలయానికి తిరిగి వచ్చే ముందు చతుర్థా మూర్తులు కొన్ని రోజులపాటు గుండిచా ఆలయంలోనే కొలువుదీరుతారు. -
పర్లాకిమిడి రైల్వే స్టేషన్ ప్రారంభం
పర్లాకిమిడి: అమృత్భారత్ స్టేషన్ల యోజన పథకం కింద రాష్ట్రంలో పునరాభివృద్ధి పనులు పూర్తిచేసుకున్న ఏడు రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవాలు శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి. వాటిలో పర్లాకిమిడిలో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లో జలంధర్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ వర్చువల్ కార్యక్రమాన్ని పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో రాయగడ రైల్వే డివిజన్ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ ఏర్పాటుచేసి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రారంభగీతం పాడారు, అనంతరం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సంబల్పురి నాట్యం, రాయగడ చిన్నారుల కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ శ్రీజగన్నాథునికి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయగడ రైల్వే డివిజన్ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ మాట్లాడుతూ, పర్లాకిమిడి మహారాజా గౌరచంద్ర గజపతి 1900 సంవత్సరంలో ఏడు లక్షలతో పర్లాకిమిడి రైల్వే స్టేషన్ను నిర్మించి ప్రారంభించగా, తదనంతరం ఆయన కుమారుడు కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ 1929–31లో నౌపడకు పొడిగించారని.. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయలతో రైల్వే స్టేషన్ నిర్మించామన్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ, పర్లాకిమిడి నుండి విశాఖపట్నం, హైదరాబాద్, భువనేశ్వర్, కోల్కతాకు నూతన ట్రైన్లు వేయాలని, అలాగే పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్రగజపతి దేవ్ ప్రతిమూర్తిని స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, కట్రా, పంజాబ్కు క్రొత్త రైలుబండితో పాటు, దేశంలో 75 పునర్మించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమం అనంతరం అమృత్ భారత్ స్టేషన్లనపై రాయగడ డివిజన్ నిర్వహించిన వివిధ సెల్ఫీ ఫొటోలు, రచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితికి సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నలుపు రంగు టీ–షర్ట్ ధరించిన వ్యక్తి రక్తపు మడుగులో రహదారి పక్కన పడి ఉండడంతో స్థానికులు వెంటనే కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడి వైద్యుడు అభిషేక్ సాహు వైద్య పరీక్షలు నిర్వహించి సదరు వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే మల్కన్గిరి ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ రీగాన్ కీండోకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం లభ్యమైన చోట ఒక ఎరుపు రంగు కారు ఉంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఈ యువకుడు ఎక్కడినుంచి వచ్చాడో ఎటువంటి వివరాలు లేవు. మృతదేహాన్ని మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు. -
స్ట్రీట్లైట్ల కొనుగోలులో అవినీతిపై దర్యాప్తునకు డిమాండ్
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర, కొట్పాడ్, బొయిపరిగుడ సమితుల్లో బిజూ కేబీకే పథకంలో స్ట్రీట్ లైట్ల కొనుగోలు వ్యవహారంలో అనేక ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని కొరాపుట్ జిల్లా యువ సంఘటన ఆరోపించింది. కొరాపుట్ జిల్లా యువ సంఘటన జిల్లా ఆర్గనైజర్ రవీంధ్ర కుమార్ మహాపాత్రో నేతృత్వంలో యువసంఘటన కార్యకర్తలు కొరాపుట్ రీజనల్ విజిలెన్స్ విభాగం జయపురం ఎస్పీని కలిసి సమితుల్లో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బిజూ కేబికె యోజనలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు బిల్లు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే అనేక చోట్ల లైట్లే లేవని పలు చోట్ల లైట్లు వెలగటం లేదని ఆరోపించారు. కుంద్రా సమితిలో 368 స్ట్రీట్ లైట్లు కోసం రూ.74.36 లక్షలు, ఎమ్మెల్యే నిధి నుంచి 284 స్ట్రీట్ లైట్ల కోసం రూ.57.04 లక్షలు ఖర్చు చేశారని, కానీ నేడు వాటిలో సగం కూడా లైట్లు లేవని ఆరోపించారు. అలాగే కొట్పాడ్ సమితిలో 25 గ్రామ పంచాయతీల్లో 425 స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కోసం రూ.89.25 లక్షలు మంజూరు చేయగా, బొయిపరిగుడ సమితిలో 304 స్ట్రీట్ లైట్లు నెలకొల్పేందుకు రూ.63.74 లక్షలు మంజూరు కాగా వాస్తవంగా అనేక చోట్ల లైట్లు ఏర్పాటు కానరాలేదని మెమొరాండంలో ఆరోపించారు. అలాగే బొరిగుమ్మ సమితిలో ప్రతి స్ట్రీట్ లైట్ రూ.8 వేలు చొప్పన ఖరీదు చేయగా కుంధ్ర, కొట్పాడ్, బొయిపరిగుడ సమితుల్లో రూ.21 వేలు చొప్పున ఖరీదు చేశారని ఆరోపిస్తూ అంత ఎక్కువ పైకానికి ఎలా ఖరీదు చేశారని ప్రశ్నించారు. నియమం ప్రకారం టెండర్లు పిలిచి ఖరీదు చేయాలని, అయితే టెండర్లు పిలవ కుండా ఎలా ఖరీదు చేశారని ప్రశ్నించారు. -
బీజేపీలోకి గుణుపూర్ మున్సిపల్ చైర్మన్
● వైస్ చైర్మన్ కూడా..రాయగడ: జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుణుపూర్ మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ సన్నో గౌడోలు తమ మద్దతుదారులతో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఇది జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చే పరిణామంగా మారింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సమక్షంలో వారు కాషాయం కండువ కప్పుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన మమత గౌడో, సన్నో గౌడోలు ప్రజల మద్దతుతో విజయం సాధించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లుగా పదవులను చేపట్టారు. ఇప్పుడు అధికారిక బీజేపీలో చేరడంతో గుణుపూర్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం మరింత పెరగనున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ చేరిక కీలక మైలురాయిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భామిస్తున్నారు. స్థానికంగా బలమైన నాయకత్వం కలిగిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడం వల్ల పార్టీ గ్రామీణ, పట్టణ స్థాయిలో సంస్థాగత బలాన్ని మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ చేపడుతున్న విస్తరణ వ్యూహానికి గుణుపూర్ నుంచి ఊపిరి లభించనట్లేనని, ఈ పరిణామం జిల్లాలోని రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లొ చర్చ సాగుతుంది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలొ జరిగిన చేరికల్లో మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్లతోపాటు పది మంది వార్డు కౌన్సిలర్లు, సమితి చైర్మన్, సమితి సభ్యులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చేరికల సమయంలో రాయగడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపిఆనంద్, శివశంకర్ ఉలక ఉన్నారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ పోలీసులు నీటిపంపు చోరీ కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ సమితి తుముసాపల్లి పంచాయతీ ఎంవీ 12 గ్రామానికి చెందిన నారాయణ్ గైన్ అనే వ్యక్తి తన ఇంటికి తాళంవేసి పనిమీద మత్తిలికి వెళ్లారు. దీంతో ఈనెల 11వ తేదీన అదే గ్రామానికి చెందిన అవినాష్ సర్కార్ అనే వ్యక్తి ఇంటి తాళం పగలుగొట్టి ఇంట్లో నీటిపంపును దొంగలించాడు. 12వ తేదీన వచ్చిన నారాయణ్ తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి కోరుకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఎస్ఐ నీలాంచల్ శరబ్ కేసు నమోద్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని నాలుగు రోజుల్లో అరెస్టు చేశారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. -
బాలుడు అనుమానాస్పద మృతి
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరం వద్ద రఽథయాత్ర సందర్భంగా మీనా బజార్ను ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో రంగులరాట్నం నుంచి ఒక బాలుడు కిందకు దిగి వచ్చినప్పుడు అక్కడ విద్యుత్ తీగలు తగిలి అస్వస్థతకు గురై అచేతనంగా పడిపోయాడు. వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి బాలుడిని తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన బాలుడు స్థానిక 15వార్డులో మహిళా కళాశాల సమీపంలో ఆటో నడుపుతున్న మోహన్ బెహరా కుమారుడు వినోద్ బెహరా (17)గా పోలీసులు గుర్తించారు. రాత్రి అయినందున ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగలేదు. అయితే మృతిచెందిన బాలుడు వినోద్ బెహరా హార్టు సమస్యలో మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా, లేదు తమ కొడుకు రంగులరాట్నం వద్ద విద్యుత్ఘాతంలో మరణించాడని తండ్రి మోహన్ బెహరా చెబుతున్నాడు. వచ్చేనెల తమ కుమారుడు పాలిటెక్నిక్లో డిప్లమా కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉందని తండ్రి విలేకరుల వద్ద విలపించాడు. అయితే గురువారం పొద్దుపోయిన తర్వాత ఆస్పత్రి నిబంధనల మేరకు పోస్టుమార్టం జరగలేదు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ జిల్లాకేంద్రం ఆస్పత్రి వద్ద మృతుడు వినోద్ బంధువులు, తల్లిదండ్రులు, వీఽధిజనం విచ్చేసి తమకు నష్టపరిహారం అందేవరకూ పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని ఆస్పత్రి, పోలీసులతో ఘర్షణ పడ్డారు. దీంతో మధ్యాహ్నం వరకూ పోస్టుమార్టం జరగలేదు. అనంతరం జిల్లా కలెక్టర్ వద్ద ఆటోమోహాన్ బెహారా మృతుని వివరాలు, ఆధార్ కార్డు అందజేశారు. అనంతరం పోస్టుమార్టం జరిపి శవాన్ని వారి బంధువులకు అందజేశారు. -
తహసీల్దార్ దురుసు ప్రవర్తన
● న్యాయవాదుల సంఘం ఆగ్రహంరాయగడ: రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయ్ వ్యవహార శైలిపై రాయగడ బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ను కలిసేందుకు వెళ్లిన ఒక న్యాయవాదితో ఆమె దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్కు బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రజ సుందర్ నాయక్ నేతృత్వంలో న్యాయవాదులు అదనపు కలెక్టర్ను కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. వినతిపత్రం స్వీకరించిన నవీన్ నాయక్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు బ్రజ సుందర్ నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన న్యాయవాది టి.నాగరాజు ఒక కేసుకు సంబంధించిన అంశంపై తహసీల్దార్ను కలిసేందుకు ఆమె కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. అయితే తహసీల్దార్ ఆయనతో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనను బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయవాదుల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది నాగరాజు మాట్లాడుతూ కోర్టు వ్యవహారాలకు సంబంఽధించిన సమాచారం కోసం సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడం న్యాయవాదుల విధుల్లో భాగమని చెప్పారు. అలాంటి సందర్భంలో తహసీల్దార్ తన చాంబర్ నుంచి బయటకు వెళ్లాలని, లేకపొతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం బాధకరమని పేర్కొన్నారు. తనతో పాటు వచ్చిన క్లయింట్ సమక్షంలో తహసీల్దార్ అనుచితంగా ప్రవర్తించడం విచారకరమని, ఇటువంటి ఘటనలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
పక్కా పథకంతో.. డబ్బులు నొక్కేశారు!
● ఉపాధి కూలీలకు వచ్చిన నిధులను కాజేసిన కూటమి నేతలు ● ఒక్కో వేతనదారు నుంచి రూ.500 చొప్పున స్వాహా శ్రీకాకుళం రూరల్ : ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి వేతనదారులకు కమిషన్ రూపంలో వచ్చిన సొమ్మును కూటమి నేతలు మింగేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కల్లేపల్లి పంచాయతీ జాలారీపేట, మోపసుబందరు గ్రామాలకు మూడు నెలల కిందట రోడ్డు మంజూరైంది. మోపసుబందరు రామాలయం నుంచి శ్మశానవాటిక వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షలతో ఈ రోడ్డు వేశారు. ఇదే గ్రామానికి కొందరు కూటమి నాయకులు ఈ పనులను దక్కించుకున్నారు. ఆ సమయంలో సుమారు 275 మంది ఉపాధి వేతనదారులను తీసుకెళ్లి రోడ్డు పనులు జరుగుతున్న చోట వారితో ఫోటోలు తీయించారు. వాస్తవానికి వేజ్ కాంప్రూట్ (కూలీలు ఏర్పాటుకు)కు పది శాతం వేతనదారులకు ఇవ్వాలి. అంటే రూ.10 లక్షల్లో లక్ష రూపాయలు వేతనదారులకు అందించాల్సి ఉంది. ఆ సొమ్ములు కాజేసేందుకు కూటమి నాయకులు పక్కా ప్లాన్ వేసి ఓ మహిళా నాయకురాలిని రంగంలోకి దించారు. ఆమె ద్వారా వేతనదారుల అకౌంట్ల లో పడిన డబ్బులను దౌర్జన్యంగా లాగేసుకున్నారు. ఒక్కో వేతనదారుకు రూ.600 చొప్పున పడగా ఏకంగా రూ.500 చొప్పున లాగేసుకున్నారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం సదరు మహిళను నిలదీయగా వారినే తిరిగి తిట్టడం గమనార్హం. నాకు తెలియదు.. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి లక్ష్మి వద్ద ప్రస్తావించగా పనులు జరిగిన వాస్తవమేనన్నారు. కూలీలకు వచ్చిన వేతనాలు పక్కదారి పట్టిన విషయం తనకు తెలియదన్నారు. -
●రూ.500 ఇచ్చాం
ఉపాధి హామీ పథకం పనికి వెళ్లనివ్వకుండా రోడ్డు పనులకు వస్తే రూ.600 ఇస్తామని మా గ్రామానికి చెందిన సవధల సుధ ఆశ చూపడంతో అక్కడికి వెళ్లాను. నా అకౌంట్లో డబ్బులు పడ్డాక రూ.500 తీసుకుంది. – కొండపల్లి పెంటమ్మ, మోపసుబందరు మూడు రోజులు క్రితం నా అకౌంట్లో రూ.600 పడ్డా యి. మా గ్రామానికి చెంది న సుధ వచ్చి దౌర్జన్యంగా డబ్బులు లాగేసుకుంది. ఇదేంటని ప్రశ్నిస్తే రూ.100 మాత్రమే చేతిలో పెట్టింది. – ఎం.గంగమ్మ, మోపసుబందరు రోడ్డు పనుల్లో ఫొటో దిగకపోతే ఉపాధి పనుల్లో మస్తర్లలో పేరు తొలగిస్తానని బెదిరించింది. మేము చెప్పినట్లుగానే ఉపాధి పనులు జరుగుతాయని, తమను ఎవరూ అడిగేవారు లేరని చెప్పింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. – కె.శిమ్మన్న, మోపసుబందరు -
మత్స్య అవతారంలో జగన్నాథుడి దర్శనం
రాయగడ: రథయాత్రలో భాగంగా స్థానిక గోపబంధు మార్గ్ వద్ద గల గుండిచా మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రదేవతా మూర్తులు కొలువయ్యారు. స్వామివారు శుక్రవారం మత్స్య అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కళకళలాడగా, భజనలు, హరినామ సంక్తీరణలతో ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంది. స్వామి వారి మత్స్యరూప దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలగించిందని భక్తులు తెలిపారు. కొరాపుట్ జిల్లా బీజేపీ మహిళా మోర్చ కార్యదర్శిగా భవానీరెడ్డి జయపురం: కొరాపుట్ జిల్లా బీజేపీ మహిళా మోర్చ కార్యదర్శిగా కె.భవానీరెడ్డి నియమితులయ్యారు. దీంతో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె నియామకంపై కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా భవానీరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 17 శాతం అధిక వర్షపాతం ● పొంగి ప్రవహిస్తున్న నదులు భువనేశ్వర్: ఈ ఏడాది జూలై ఒకటి నుండి 17వ తేదీ వరకు రాష్ట్రంలో 17 శాతం అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నత ఇంజినీర్ దిలీప్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. బొలంగిర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరద పరిస్థితి ఏర్పడిందన్నారు. సపువా నదిలో వరద మధుసూదప ట్న, కకుడియా గ్రామాలను ముంచెత్తింది. నదిలో నీటి మట్టం పెరిగితే ఢెంకనాల్, అఠొగొడొపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. శనివారం నాటికి హీరాకుడ్ జలాశయంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జలకా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. బాలాసోర్ జిల్లా బొస్తా మండలం మథానిలో ప్రమాద స్థాయి 6.50 మీటర్లు కాగా ప్రస్తుతం అక్కడ 6.52 మీటర్లకు పైగా నీరు ప్రవహిస్తోంది. నేడు అడప మండపం ప్రవేశం భువనేశ్వర్: శ్రీ మందిరం నుంచి యాత్రగా తరలి వచ్చిన దేవతా మూర్తులు శని వారం శ్రీ గుండిచా మందిరం అడప మండపంపై ఆశీనులు కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదాబాలి ప్రాంగణానికి చేరుకున్న దేవతలు రథాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకమార్గ దర్శన విధానంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ గుండిచా మందిరం పరిసరాల్లో ఏర్పాట్లు ఆయన శుక్ర వారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రథాలపై కొలువై ఉన్న దేవుళ్లు ఏక మార్గంలో వరుస క్రమంలో సునాయాసంగా దర్శించుకుని సంతృప్తి చెందే దిశలో సన్నాహాలు చేసినట్లు వివరించారు. శనివారం సాయంత్రం రథాలపై కొలువై ఉన్న చతుర్థా మూర్తులను అడప మండపానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది శారదాబాలి ప్రాంగణంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం ముందు జాగ్రత్తలతో ఆచితూచి అడుగు వేస్తుందన్నారు. భక్తులకు క్రమబద్ధమైన దర్శనం కల్పించడంలో పూరీ జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. -
పాలిథిన్ కట్టడికి చర్యలు
జయపురం: పట్టణాన్ని పాలిథిన్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని పలు దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజరౌత్, రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు విభాగాలు సంయుక్తంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా దాదాపు 2 క్వింటాళ్లకు పైగా పాలిథిన్ కవర్లు సీజ్ చేసి, జరిమానా విధించినట్లు వెల్లడించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో మున్సిపల్ సిబ్బంది సత్యనారాయణ పాత్రో, భవానీ హల్వ, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అదుపులోకి ఎలుగుబంటి
కొరాపుట్: మనుషులపై దాడి చేస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ బంధించింది. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి కుసిమి గ్రామ సమీపంలో శ్మశానం వద్ద బబ్లున్ గౌడ (40) అనే వ్యక్తి పశువులు మేపడానికి తెచ్చాడు. ఇదే సమయంలో రెండు పిల్లలతో వచ్చిన ఎలుగుబంటి బబ్లున్పై దాడి చేసి చంపేసింది. దీంతో సమీప గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వెంటనే అటవీ శాఖ ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. గాలింపులు చర్యలు చేపట్టి ఎలుగుబంటిని గుర్తించింది. వెంటనే మత్తు ఇంజక్షన్ని దూరం నుంచి ఎలుగు బంటిపై కొట్టారు. కొద్దిసేపటికి ఎలుగు ఆ ప్రాంతంలో మత్తులో తూలుతూ వెళ్లింది. వెంటనే అటవీ సిబ్బంది కాగడాలు, వలలతో వెళ్లి ఎలుగుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక బోనులో పెట్టి అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఎలుగుకి చికిత్స అందజేసి అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని ప్రకటించారు. మరోవైపు ఎలుగుతో వచ్చిన రెండు పిల్లలు ఎక్కడున్నాయోనని పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోలనలు గురవుతున్నారు. వాటి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
బ్రౌన్ షుగర్తో ఇద్దరు అరెస్టు
జయపురం: జయపురంలో మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ పోలీసులు జయపురం మున్సిపాలిటీ పరిధి జయనగర్ భూతనాథ్ మందిర ప్రాంతంలో బ్రౌన్ షుగర్ పొట్లాలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో రామ ఛత్రియ, లలన్ కుమార్ సామంతరాయ్లు ఉన్నట్లు వెల్లడించారు. వారి నుంచి 5.140 మిల్లీ గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఏఎస్ఐ గోవింద హసద పోలీసులతో పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు భూత మందిరం వద్ద బ్రౌన్ షుగర్ అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టారు. ఆ సమయంలో ఒక స్కూటీ వద్ద నిల్చున్న ఇద్దరు వ్యక్తులను చూసి వారిని విచారించారు. వారిని శోధించగా ఒక కాగితంలో బ్రౌన్ షుగర్ కనుగున్నారు. స్కూటీతో వచ్చి అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. వారి నుంచి రూ.800ల నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
భూసేకరణ ప్రక్రియ ప్రారంభం
రాయగడ: జిల్లాలో జాతీయ రహదారి–326 విస్తరణ పనులకు కీలక అడుగు పడింది. ముకుందపూర్ హటొపడ నుంచి కై లాస్పూర్ ఎస్ఎస్డీ ఉన్నత పాఠశాల వరకు రహదారి విస్తరణ కోసం భూముల గుర్తింపు, సర్వే ప్రక్రియను జాతీయ రహదారుల అధికారులు, రెవెన్యూ శాఖ సర్వే బృందం సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు. ఈ పరిణామంతో స్థానికుల్లో అభివృద్ధిపై ఆశలు పెరుగుతుండగా.. భూసేకరణ, నష్ట పరిహారంపై భూ యజమానుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సర్వేలో భాగంగా ఖాతా నంబర్లు, ప్లాట్ నంబర్లు, భూమి రకం, యజమానుల వివరాలు, సేకరించాల్సిన భూమి విస్తీర్ణాన్ని నమోదు చేస్తున్నారు. అలాగే రహదారి వెంట ఉన్న ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర శాశ్వత నిర్మాణాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. సర్వే పనులకు స్థానికులు సహకరించాలని కోరారు. రహదారి విస్తరణ పూర్తయితే పెరుగుతున్న వాహన రద్దీకి ఉపశమనం లభించడంతో పాటు.. ప్రమాదాలు తగ్గి అత్యవసర సేవలు, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారమే భూసేకరణ చేపడతామని, ప్రభావిత భూ యజమానులకు చట్టం ప్రకారం తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. సర్వే పూర్తయిన అనంతరం తుది భూసేకరణ జాబితాను ప్రకటించి, తదుపరి దశలో జాతీయ రహదారి –326 విస్తరణ పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
జయపురం: ఒక దుకాణం తాళాలు బద్దలుగొట్టి దొంగతనం చేసిన వ్యక్తిని జయపురం పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు జయపురం సమితి ఛొటాగుడ ప్రాంతానికి చెందిన కె.రబిరావుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూన్ 20వ తేదీన గొడియమాలిగుడ వీధిలో అజిత్ కుమార్ సామంతరాయ్ దుకాణం తాళాలు పగులగొట్టి డబ్బుతో పాటు సామగ్రి దొంగిలించుకుపోయాడని వెల్లడించారు. దీంతో పట్టణ పోలీసుస్టేషన్లో బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ కేపీసీహెచ్ మిశ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన సామగ్రిని సీజ్ చేశారు. కాగా పోలీసుల విచారణలో అతడు గతంలో పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ప్రభుత్వ క్వార్టర్లో కూడా దొంగతనం చేసినట్లు నిర్ధారించారు. -
భక్తుల వద్దకే భగవంతుడు
● రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథయాత్రమల్కన్గిరి: జిల్లా కేంద్రంలో గురువారం జగన్నాథ స్వామి రథయాత్రను కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజాశిర్కే చేతులమీదుగా సాంప్రదాయ పూజ అనంతరం ప్రారంభించారు. ముందుగా సాయంత్రం 4 గంటల సమయంలో రథంపై కలెక్టర్ ప్రథమేశ్ చేత ప్రత్యేక పూజలు, చెరా పహార నిర్వహించి యాత్రకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొరాపుట్లో... కుంభవృష్టి వర్షం మధ్య కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో రథయాత్ర జరిగింది. ఉదయం నుంచి భారీవర్షం పడుతున్నప్పటికీ ప్రజలు రథాలను జగన్నాథ మందిరం నుంచి గుండిచా మందిరాల వరకు తోడ్కొని వెళ్లారు. దక్షిణ ఒడిశా పూరీక్షేత్రంగా పేరుగాంచిన కొరాపుట్ శబరి శ్రీక్షేత్రంలో జగన్నాథ, సుభద్ర, బలభద్ర రథాలు లక్ష్యం చేరుకున్నాయి. రాయగడలో... రథయాత్ర వేడుకలు రాయగడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జగన్నాథ మందిరం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను మధ్యాహ్నం 12 గంటల నుంచి పొహోండి ద్వారా రథంపైకి సేవకులు, భక్తులు ఎక్కించారు. అనంతరం 4 గంటలకు రథాన్ని లాగే కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయ్ల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక దంపతులు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, ఎస్డీసీ వైస్ చైర్పర్సన్ మంజుల మినియాక తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా తొలుత బలభద్రుడిని మందిరం నుంచి బయటకు తీసుకొచ్చి పొహోండి జరిపారు. అనంతరం సుభద్ర దేవి, చివరగా జగన్నాథుని పొహోండి జరిపి రథాలపై ఎక్కించారు. సేవాయత్లు, పండితుల శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ, పూజలు అనంతరం గజపతి వంశీయుల యువరాణి కల్యాణీ దేవి గజపతి విచ్చేసి జగన్నాథ స్వామి రథంపై పూజలు జరిపి బంగారు చీపురుతో శుభ్రం చేశారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవుళ్లను రథాలపై ఎక్కించడానికి సహాయపడ్డారు. సాయంత్రం మూడు రథాలను గుండిచా మందిరం వైపు భక్తులు లాగారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జయపురంలో రథయాత్ర నేడు జయపురం: పట్టణంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం జరుగుతుంది. గురువారం జగన్నాథ మందిరం నుంచి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను భక్తిశ్రద్ధలతో రఘునాథ్ మందిర కూడలి వద్దనున్న నూతన రథం వరకు సేవాయత్లు తోడ్కొని వచ్చి రథంపై ఆసీనులను చేశారు. మార్గమధ్యలో ప్రజలు దేవతామూర్తులకు ఫలపుష్పాలు, భోగాలతో పూజలు చేశారు. దేవతామూర్తులను రథంపైకి తీసుకెళ్తున్న సమయంలో వేలాది మంది భక్తులు కనుల పండువగా తిలకించారు. గురువారం రాత్రంతా భక్తులు పూజలు చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం రథాలను గుండిచా మందిరం వరకు తీసుకెళ్తారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాగా గురువారం జయపురం పూర్ణఘడ్లో రథయాత్ర జరిగింది. రథయాత్ర శుభాకాంక్షలు భువనేశ్వర్: పవిత్ర రథయాత్ర రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రకాశవంతమైన వ్యక్తీకరణగా అభివర్ణించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. -
సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్గా శ్రీనివాసరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పి.శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈయన కోనసీమ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా మేనేజర్గా పనిచేసిన వేణుగోపాల్ను మాతృభాషకు పంపించారు. ‘కేజీబీవీల్లో ఖాళీలు భర్తీ చేయాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి బోధనా సిబ్బంది నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఖాళీలను భర్తీ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల చదువు తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నోటిఫికేషన్ ప్రకారం కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నీలకంఠేశ్వర ఆలయంలో హుండీ చోరీ పాతపట్నం: పాతపట్నం మహేంద్రతనయ నదీ తీరాన ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. దుండగులు ఆలయం ప్రహరీ దూకి లోపలకు వచ్చారు. ఆలయం గర్భగుడి నుంచి బయటకు వచ్చే దారిలోని సేఫ్టీ గిల్స్కు ఉన్న రెండు తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు వచ్చినట్లు సీసీ పుటేజ్లో కనిపిస్తోంది. దుండగులు ముసుగులు వేసుకున్నారు. గురువారం ఉదయం ఆలయ అర్చకులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సేఫ్టీ గ్రిల్స్కు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు తెలిపారు. ఎస్ఐ కె.మధుసూదనరావు, క్లూస్ టీం బృందం వచ్చి, ఆధారాలు సేకరించారు. సుమారు రూ.20 వేలు నగదు ఉంటుందని అర్చకులు తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం పలాస, శ్రీకాకుళం క్రైమ్ : పూండి – నౌపడ రైలు మార్గంలోని వల్లభరావుపేట రైలు ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పోల్ నంబర్ 28/30 వద్ద డౌన్లైన్ ట్రాక్పై సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళ ఛామన ఛాయ రంగు, నెరిసిన జుట్టు, కుడి ముంజేటిపై ఒడియా లిపిలో జై శ్రీరామ్ అని పచ్చబొ ట్టు రాసి ఉందని తెలిపారు. ఈమె యాచకురాలై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు పలాస రైల్వే స్టేసన్ ఎస్ఐ డి.శ్రీనివాసరావును 9492250069 నంబర్ ద్వారా ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య టెక్కలి రూరల్: స్థానిక జగతి మెట్ట సమీపంలో నివాసముంటున్న ధవళ అనిత(43) అనే అనే వివాహిత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనిత విజయనగరం జిల్లా జీఎస్టీ కార్యాలయం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త జన్ని హరి సంతబొమ్మాళి మండలంలో డీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ జగతిమెట్ట సమీపంలో నివాసముంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని క్లూస్ టీం పరిశీలించిన తర్వాత శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతురాలికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నా డు. అనంతరం టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
జయపురం: అయోధ్య రామ మందిరంలో విరాళాలు చోరీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ భవనంలో కాంగ్రెస్ నాయకులు గురువారం మాట్లాడుతూ.. విరాళాల చోరీపై తక్షణమే ప్రధానమంత్రి లేదా ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, రాష్ట్ర విధాన సభలో విపక్ష నేత పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు జయపురం: స్థానిక క్రిస్టియన్పేట 26వ జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఒక వ్యాన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తులను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటల సమయం 26వ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రమాద సమాచారం అందిన పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ నుంచి అతివేగంగా వస్తున్న వ్యాన్ రోడ్డుపక్కన నిలిపి ఉన్న బైక్లను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్న సీజ్చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో కర్రతో దాడి.. వ్యక్తి మృతి కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవ పడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉద యం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీ సులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది. -
● గమ్యం చేరని రథాలు
యాత్ర సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో అవాంఛనీయ జాప్యం కారణంగా రథాలు నిర్ధారిత వేళలో గమ్యం చేరలేకపోయాయి. సాయంత్రం 5.10 గంటల నుంచి రథాల కదలిక ఆరంభించి 7.25 గంటల వరకు రథాలు లాగడం కొనసాగించారు. అయితే చీకటిపడడంతో ఆలయ సంస్కారాల ప్రకారం రథాలు లాగడం మర్నాటికి వాయిదా వేశారు. తొలుత బలభద్ర స్వామి రథం కదలగా వెంబడి దేవీ సుభద్ర రథం యాత్ర ప్రారంభమైంది. చివరగా శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం నెమ్మదిగా మొదలైంది. మొదట బయల్దేరిన బలభద్ర స్వామి రథం జనతా సినిమా హాలు సమీపంలో నిలిపివేశారు. దేవీ సుభద్ర రథం దర్పదళనం మారీచ్కోట్ వరకు ఆగిపోయింది. చివరగా బయల్దేరిన జగన్నాథుని నందిఘోష్ రథం లాంచనంగా కొద్దిదూరం కదిలిన తర్వాత నిలిపివేశారు. -
శ్రీమందిరంలో డిజిటల్ హుండీ ప్రారంభం
భువనేశ్వర్: పవిత్ర రథయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పూరీలోని జగన్నాథ ఆలయ పరిపాలనా కార్యాలయంలో సమర్పణ్ అత్యాధునిక డిజిటల్ హుండీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను జగన్నాథునితో అనుసంధానించే కీలక చర్యల్లో భాగంగా దీనిని పేర్కొన్నారు. పూర్తి భద్రత, పారదర్శకతతో విరాళాలు అందించడానికి వీలుగా ఈ సురక్షిత డిజిటల్ ప్లాట్ఫామ్ను అధికారిక ఎస్జేటీఏ పోర్టల్తో అనుసంధానించారు. ఈ వ్యవస్థ ద్వారా సేకరించిన విరాళాల డబ్బును ఆలయ అభివృద్ధి, నిర్వహణకు వినియోగిస్తామని సీఎం తెలిపారు. డిజిటల్ హుండీ – సమర్పణ్ కేవలం సాంకేతికత ఆధారిత ఆవిష్కరణ మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న కోట్లాది జగన్నాథ భక్తుల భక్తిని ఆలయంతో అనుసంధానించే ఒక పవిత్రమైన, స్వచ్ఛమైన వారధి అని పేర్కొన్నారు. మహా ప్రభువు జగన్నాథుని సంప్రదాయాన్ని పరిరక్షణ, ఆలయ సమగ్ర అభివృద్ధిలో ఈ చొరవ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. దీనికోసం ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి చేశారు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, వాట్సాప్ ద్వారా విరాళాలు అందించేందుకు వీలవుతుంది. భక్తులు రూ.1 మొదలుకొని అపరిమితంగా విరాళం ఇవ్వవచ్చు. దాతలు విరాళం చెల్లింపు చేసిన వెంటనే వారి డిజిటల్ రశీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు. విరాళాలు ఆదాయపు పన్ను మినహాయింపునకు అర్హమైనవిగా ప్రకటించారు. ఈ యాప్ పూరీని సందర్శించే యాత్రికుల కోసం ఆలయ సమాచారం, రోజువారీ పూజల ప్రకటనలు, తాజా సమాచారం, భక్త నివాస్ అతిథి గదులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
నీలిమేఘశ్యాముడు నేల మురిసేలా గర్భగుడి వదిలి భక్తుల వద్దకు కదిలి వచ్చాడు. శ్రీమందిరం పరిసరాలను పావనం చేస్తూ చిరు మందహాసుడై రథాన్ని అధిరోహించాడు. ఆకాశాన్ని తాకే జై జగన్నాథ నినాదాలు మార్మోగగా బలభద్రుడు, సుభద్రతో కలిసి గుండిచాకు బయల్దేరాడు. రథాలు ముందుకు కదలడం మొదలవ్వగానే భక్తులు మురిసిపోయారు. దేవ దేవుడిని కనులారా చూసుకొని.. మనసారా మొక్కుకొని పరవశించిపోయారు. భక్తుల వద్దకు దారుబ్రహ్మ నందిఘోష్ రథంపై వస్తున్న దృశ్యాన్ని వరుణుడు సైతం వీక్షించాడు. అనంతరం కొంతదూరం కదిలిన పతితపావనుడు.. మిగతా దూరం మరుసటి రోజు వెళ్దామని భక్తులకు సందేశమిచ్చాడు. జగన్నాథుడి రథయాత్ర జయప్రదం అయ్యేందుకు ముందుగా రథ ప్రతిష్టని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆచారం. ఆధ్యాత్మిక వాతావరణంలో మూడు రథాలపై పతాకాలు, కలశాలను ప్రతిష్టించి గురువారం 8.45 గంటలకు రథత్రయం ప్రతిష్ట పూర్తి చేయడంతో, గర్భగుడి నుంచి మూల విరాటులు వరుస క్రమంలో రథాలపైకి వేంచేశారు. ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాలు రథయాత్ర ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. గత 48 గంటల్లో పూరీ నగరంలో 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం పూరీ నగరంలో గంటకు 1 నుంచి 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కొనసాగుతోంది. అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు బొడొ దండొకు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొని ఉన్న అల్పపీడన వ్యవస్థ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రథయాత్రలోని అత్యంత విశిష్టమైన సంప్రదాయాల్లో డాహుక డక్కువా ఒకటి. రథ డాహుకాలు అనే వారు పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో సేవచేసే వంశపారంపర్య సేవాయతుల బృందం. రథయాత్ర సమయంలో వారు దేవతామూర్తులతో పాటు రథాలపై సవారీ చేస్తూ ఈ పవిత్ర యాత్రకు నాంది పలుకుతారు. శతాబ్ధాల నాటి లయబద్ధమైన పద్య గానమైన డాహుక డక్కొ (డాహుక బోలి)ను ప్రదర్శిస్తారు. డాహుక తన లయబద్ధమైన గానంతో ఉద్బోధను ప్రారంభించేంత వరకు రథాలు కదలవని నమ్ముతారు. రథంపై నిలబడి ప్రాచీన శ్లోకాలను పఠిస్తూ, తన చేతిలోని కరత్రో రథాన్ని లాగే ప్రక్రియకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. పరోక్షంగా వీరి నుంచి సంకేతం రథాల కదలికకు సానుకూల పరిస్థితులని నిర్ధారించి సుగమం చేస్తుంది. యాత్ర శోభతో శ్రీమందిరం పరిసరాలు పుష్పాల సుగంధంతో గుభాళించాయి. సింహద్వారం నిలువెత్తు పుష్ప సోయగం ఆహ్లాదభరితంగా పలకరించింది. యాత్ర ఆద్యంతాలు స్వామి కళకళలాడుతూ భక్త జనులను మురిపిస్తుంటాడు. రథాలపై ఆసీనుడు కావడంతో నుదుట వజ్ర వైడూర్య తదితర రత్న ఖచిత చిత్తాభరణం ధరించి మెరిసిపోయాడు. ప్రత్యేక తిథులు, ఉత్సవాలు సందర్భంగా మూలవిరాటుల నుదుట రత్నాలు పొదిగిన ఈ అమూల్య ఆభరణం అలంకరిస్తారు. భువనేశ్వర్: శ్రీమందిరం వదిలి భక్తుల వద్దకు బయల్దేరిన జగతినాథుడికి నింగి, నేల స్వాగతించాయి. సుగంధ భరిత పుష్పాదుల మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం దాటి నేలంతా విస్తరించిన ఆశేష భక్తజనం మధ్య ప్రత్యక్షమై జనులకు నల్లనయ్య తొలి దర్శనం అనుగ్రహించాడు. ఈ అపురూప క్షణాల్లో ఆకాశం నుంచి వర్షపాతం శీతల పుష్పాంజలిగా నేల జారింది. అత్యంత భక్తిపూర్వక వాతావరణంలో సేవాయతుల సమూహం గర్భగుడి నుంచి మూలవిరాటులను వరుస క్రమంలో రథాలపైకి తరలించి గొట్టి పొహండి కార్యక్రమం జయప్రదం చేశారు. వరుస క్రమంలో మొదటిగా చక్రరాజ ప్రభువు సుదర్శనుడు దేవదళన్ రథంపైకి తరలివెళ్లాడు. పుష్ప మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం గుండా తాళధ్వజ రథంపైకి బలభద్ర స్వామి చేరిన తర్వాత, దేవీ సుభద్రమూర్తిని దర్ప దళనంపై ఆసీనం చేశారు. చివరగా శ్రీజగన్నాథుడు భక్త జనాన్ని తన్మయం చేస్తూ జై జగన్నాథ్ నినాదాల మధ్య నందిఘోష్ రథానికి చేరాడు. సుదీర్ఘంగా 5 గంటల పాటు నిరవధికంగా కొనసాగిన గొట్టి పొహండిలో చతుర్థామూర్తుల మూల విరాటులు సురక్షితంగా రథాలపైకి చేరాయి. శంఖ ధ్వని, ఘంటానాదాల గంభీర ప్రతిధ్వనులు, మృదంగ వాద్యాల మంగళ నినాదాలు, భక్త జనుల హరిబోల్ నామ సంకీర్తనలు, మహిళల పవిత్ర హుల్హులీ (ఉల్లాలు) ధ్వనులతో దిక్కులన్నీ దివ్యమైనవేళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్తుకు నాథుడైన శ్రీజగన్నాథ మహా ప్రభువు తన అగ్రజుడు బలభద్రుడు, సోదరి దేవి సుభద్రతో కలిసి గుండిచా మందిరం వైపు మహోన్నత రథయాత్రకు బయల్దేరాడు. ఏటా మాదిరి ఆషాఢ శుక్ల ద్వితీయ పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో ప్రారంభమయ్యే వార్షిక రథయాత్ర వైభవోపేతంగా ఆరంభమైంది. జగన్నాథుని అనేక మానవీయ దివ్యలీలల్లో ఇది అత్యంత అపూర్వమైన, అత్యంత హృద్యమైన ఘట్టంగా భావించబడుతుంది. తొమ్మిది రోజుల ఈ నవ దినాత్మక దివ్య యాత్రలో చిత్ర విచిత్రమైన లీలావిలాసాలతో ఆలయ గర్భ గృహాన్ని విడిచి భక్తుల మధ్యకు విచ్చేసే జగన్నాథుడు జాతి, మత, వర్ణ, భాష భేదాలకు అతీతంగా సమస్త జీవ రాశులకు తన కరుణాకటాక్షాలను ప్రసాదించి వారిని పుణీతులను చేస్తాడు. అందుకే రథయాత్రను కేవలం ఒక ఉత్సవంగా కాకుండా సర్వజనోద్ధారణకు, సమానత్వానికి, విశ్వబాంధవ్యానికి ప్రతీకగా భక్తజనం భావిస్తారు. శ్రీ మందిరంలో మంగళ హారతి, మైలమ్, ప్రభాత శుద్ధిసేవ, అలంకరణ పూర్తి చేసి సూర్యపూజ, ద్వార పాలకుల పూజ, గోపాల వల్లభ పూజాదులు నిర్వహించారు. ఆలయం వెలుపల దేవతలు యాత్ర చేసే 3 రథాల ప్రతిష్ట ముగించి చతుర్థామూర్తుల మూల విరాటులను ఒక్కోటిగా రథాలపైకి వరుస క్రమంలో తరలించారు. అనంతరం మదన మోహనుడు, రామకృష్ణులు తదితర ఉత్సవమూర్తులను సంబంధిత రథాలపై ఆసీనం చేశారు. రథాలపై దేవుళ్ల అలకంరణ పూర్తి కావడంతో పూరీ గజపతి మహారాజా స్వామి సేవకు జన సమూహంలో కదులుతున్న దేవీ సుభద్ర భువనేశ్వర్: పూరీ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. భారీ జన సమూహం మధ్య జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతి చెందాడు. ఈ విచారకర ఘటనలో పలువురు గాయపడ్డారు. వారందరినీ చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రికి సుమారు 1 కిలోమీటరు దూరంలో ఉన్న మారీచ్ కోట్ చౌరస్తా ప్రాంతంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఒక పురుషుడు, ఒక మహిళ కింద పడిపోయారు. ఈ తొక్కిసలాటలో చాలామంది భక్తులు గాయపడ్డారు. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు భక్తుడు మరణించినట్లు ధ్రువీకరించారు. మృతుడు కటక్ జిల్లాకు చెందిన అనిల్ దాస్గా పేర్కొన్నారు. కాగా చికిత్స పొందుతూ మరో భక్తుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై యంత్రాంగం అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. బంధువులు ఆస్పత్రి ప్రాంగణానికి పోటెత్తారు. పోలీసు యంత్రాంగం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి నిశితంగా పర్యవేక్షిస్తోంది. గతేడాది జూన్ నెలలో జరిగిన రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పూరీ శ్రీజగన్నాథుని రథయాత్రలో యాత్రికులు మరణించిన విషయమై పూర్తి సమాచారం అందలేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిని ఆదేశించారు. పూర్తి వివరాలు అందిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. పవిత్ర ఘోష యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శ్రీమందిరం సింహద్వారం సమీపంలో టొంకొ తొరాణి (పుల్లని గంజి పానీయం) పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ పానీయం లాంచనంగా పంపిణీ చేశారు. సైడ్లైట్స్ నిగా 3 రథాలను బంగారు పిడి చీపురుతో ఊడ్చి శుచి కర్మలు శాసీ్త్రయంగా నిర్వహించారు. ఈ తంతు ముగియడంతో రథాలకు కొయ్య గుర్రాలు, ద్వార పాలకులు, రథ సారథులు ఏర్పాటు చేసి చారుమళ్లు (తాత్కాలిక తాటి మట్టల మెట్లు) తొలగించి యాత్రకు సిద్ధం చేశారు. శుక్రవారం ప్రాతఃకాల సేవాదులు పూర్తి చేసిన తర్వాత రథాలు లాగడం పునరుద్ధరిస్తారు. అంతవరకు ఆగిన చోటే రథాలపై దేవుళ్లకు నిత్య, దైనందిన, యాత్ర సేవాదులు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ నిడివిలో రథాలపై దేవుళ్లని యాత్రికులు, భక్తులు దర్శించుకునే అవకాశం కలిసి వస్తుంది. -
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధులు అధికారులే
భువనేశ్వర్: ప్రభుత్వం, ప్రజల మధ్య సమర్థవంతమైన వారధులుగా ప్రభుత్వ అధికారులు నిలవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. ప్రజలకు మెరుగైన సేవల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. బుధవారం జరిగిన ఒడిశా పరిపాలనా సర్వీస్ – ఓఏఎస్ (డీఆర్ 2023) బ్యాచ్ ప్రొబేషనరీ అధికారుల సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. స్థానిక లోక్ భవన్ అభిషేక్ హాల్లో 31 మంది ఓఏఎస్ ప్రొబేషనరీ అధికారులతో ఆయన మాట్లాడారు. అధికారులకు విధాన లక్ష్యాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలపై కూడా గట్టిపట్టు ఉండాలని గవర్నర్ సూచించారు. సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు, అర్హులైన లబ్ధిదారులకు గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా చూడటానికి ఇటువంటి పరిజ్ఞానం అక్కరకు వస్తుందన్నారు. పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, పీఎం సూర్య ఘర్, ముఫ్త్ బిజ్లీ యోజన వంటి కీలక కార్యక్రమాలపై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా సేవల పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి చక్కని అవగాహనతో అధికారుల చురుకుదనం కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. సంబంధిత సామాజిక భద్రతా పథకాలలో తాము నమోదు చేసుకుని, ఆయా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని చురుకుగా ప్రోత్సహించాలని శిక్షణార్థులకు సలహా ఇచ్చారు. కోవిడ్ 19 మహమ్మారికి భారత దేశం స్పందించిన తీరును గుర్తుచేసుకుంటూ ఆత్మ నిర్భరత, ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన ద్వారా దేశం సవాళ్లను అవకాశాలుగా సమర్థవంతంగా మార్చుకుందని డాక్టర్ కంభంపాటి పేర్కొన్నారు. విదేశీ మాదక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం తగ్గింపు వంటి విచక్షణతో కూడిన ఖర్చులలో వివేకంతో వ్యవహరించాలన్నారు. గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మోనాలిసా లెంకా స్వాగతోపన్యాసం చేసి శిక్షణ ఉద్దేశాన్ని వివరించారు. -
గంభీర రథాల్లో ఘనమైన యాత్ర
భువనేశ్వర్: మూడు గంభీరమైన రథాల్లో చతుర్థా మూర్తుల మూల విరాటుల యాత్ర చేయడంతో ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక దృశ్యాలలో ఒకటిగా పూరీ జగన్నాథని రథయాత్ర వాసికి ఎక్కింది. గురువారం జరగనున్న రథయాత్రలో ఇవి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ రథాల వివరాలను గమనిస్తే.. శ్రీ జగన్నాథుని రథం నందిఘోష ఎత్తు: 45.6 అడుగులు చక్రాలు: 16 రంగులు: ఎరుపు – పసుపు రథ సారథి: దారుక ద్వారపాలకులు: జయ – విజయ గుర్రాలు (శ్వేత వర్ణం): శంఖ, బలాహక, సువేత – హరిదాశ్వ -
చోరీ కేసులో నిందితుల అరెస్టు
రాయగడ: తాము పోలీసులమని చెప్పి ఒకరి ఇంట్లో దౌర్జన్యంగా చొరబడి 4.75 లక్షల రూపాయల నగదు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను గుణుపూర్ ఆదర్శ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులు రామనగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడొగుడ గ్రామానికి చెందిన డుబులా పతిక, లవుగుడ గ్రామానికి చెందిన తన్మయ్ పతిక, సులిడి గ్రామానికి చెందిన సండా సబర్లు ఉన్నారు. బుధవారం నిందితులను కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల ఎనిమిదో తేదీన రామనగుడ సమితి గురుండ పంచాయతీలొని లగుడిగుడ గ్రామంలో నివసిస్తున్న తమన హుయిక ఇంటిలోకి పోలీసుల మని పరిచయం చేసుకుని ఆరుగురు గుర్తు తెలియని దుండగులు దౌర్జన్యంగా చొరబడ్డారు. గంజాయి వ్యాపారం చేస్తున్నారని బెదిరించి ఇంటి యజమానిని బెదిరించారు. అనంతరం ఇంటిలోని అలమెరను తెరవమని అందులో ఉన్న 4.75 లక్షల రూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు ఈ నెల పదో తేదీన గుణుపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 54 వేలు స్వాధీనం చేసుకున్నారు. పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ప్రారంభం రేపు పర్లాకిమిడి: అమృత్ భారత్ యోజనలో భాగంగా దేశంలో అనేక రైల్వేస్టేషన్లు అప్గ్రేడ్ అవుతున్న సమయంలో పర్లాకిమిడి రైల్వేస్టేషన్కు మహర్దశ పట్టింది. ఈనెల 17వ తేదీన రాయగడ రైల్వే డివిజన్ డీఆర్ఎం అబిమాత్ సింఘాల్ లాంఛనంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు స్టేషన్లో షామియానాలు, డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. అయితే నౌపడ–పర్లాకిమిడి–గుణుపురం రైల్వేస్టేషన్ అప్పటి గజపతి మహారాజా గౌరచంద్రగజపతి, కుమారుడు శ్రీక్రిష్ణచంద్రగజపతి నారాయణదేవ్ తోలుత స్టీమ్ ఇంజిన్ బ్రిటీషు కాలంలో ప్రవేశపెట్టారు. రెండేళ్ల క్రితం లోకసభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పర్లాకిమిడి రైల్వేస్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో రైెల్వే సహాయమంత్రి పర్లాకిమిడి మహారాజా గజపతి విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలో నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. దీనిపై పర్లాకిమిడి సీనియర్ సిటిజన్, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు ఇతర న్యాయవాదులు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖలు రాశారు. అయితే ప్రస్తుతానికి ప్రారంభోత్సవ సమయంలో మహారాజా క్రిష్ణచంద్రగజపతి ప్రతిమూర్తి లేకపోవడంతో స్థానికులు, న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్ పరిధిలోని సిరిజులి సర్కిల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సుశాంత్ మల్లిక్ను 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రాష్ట్ర విజిలెన్స్ అధికారులు బుధవారం రెడ్ హ్యాండడ్గా పట్టుకున్నారు. వారసత్వ భూమికి సంబంధించిన మ్యూటేసన్ కేసులో అనుకూల విచారణ నివేదిక సమర్పించి, ఆర్వోఆర్ (భూపట్టా) జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు ఉచ్చుపన్ని అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లొకి వెళితే.. ఫిర్యాదుదారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసి, అవసరమైన ఫీజులు చెల్లించినప్పటికీ, ఎలాంటి కారణం లేకుండా దరఖాస్తును పెండింగ్లో ఉంచిన ఆర్ఐ సుశాంత్ మల్లిక్ రూ. 25 వేలు లంచం కొరినట్లు తెలిసింది. దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించగా వారి ప్రణాళిక ప్రకారం బుధవారం తన కార్యాలయంలో లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 25 వేలు లంచం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కోణంలో సుశాంత్ మల్లిక్కు సంబంధించిన మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కొరాపుట్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. -
హైటెక్ రథయాత్ర ఆస్పత్రి ప్రారంభం
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర సందర్భంగా ఈ ఏడాది కూడా హైటెక్ వైద్య కళాశాల అత్యవసర, తాత్కాలిక ఆస్పత్రిని ప్రారంభించింది. శ్రీ మందిరం ఉత్తర ద్వారం సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో హెచ్డీయూ సౌకర్యాలతో 25 పడకలు ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన, సీనియర్ వైద్యులు రాత్రింబవళ్లు ఆరోగ్య సంరక్షణను అందిస్తారు. ప్రాథమిక చికిత్స తర్వాత తీవ్రమైన రోగులను భువనేశ్వర్లోని హైటెక్ ఆసుపత్రికి తరలిస్తారు. అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంది. కంటి, దంత చికిత్స కోసం మొబైల్ వ్యాన్ అదనంగా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం రథయాత్ర సందర్భంగా 12,335 మంది రోగులకు చికిత్స అందించారు. శ్రీ మందిరం ఉత్తర ద్వార్ వద్ద జరిగిన అత్యవసర ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూరీ లోక్సభ సభ్యుడు డాక్టరు సంబిత్ పాత్రో, సెంట్రల్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ సత్యజిత్ నాయక్, హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ మిశ్రా, రాధా వల్లభ మఠం మహంత్ రామకృష్ణ దాస్ మహారాజ్, ఉత్తర పార్శ్వ మఠం మఠాధిపతి నారాయణ్ రామానుజ్ దాష్, శ్రీ మందిరం పాలక మండలి సభ్యులు, సీనియర్ సిబ్బంది హాజరయ్యారు. ఆరోగ్య సేవలను నిబద్ధతగా భావించి, మహాప్రభువు ఆశీస్సులతో ఈ పనిని కొనసాగిస్తామని హైటెక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. -
తొలి నిజ రూప దర్శనం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపాద తిథి పురస్కరించుకుని మంగళవారం పూరీ శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుని నిజ రూప దర్శనం భక్తులు, యాత్రికులకు లభించింది. స్నాన యాత్ర వెంబడి 15 రోజుల విరామం తర్వాత ప్రధాన దేవతలు నవ యవ్వన అలంకరణలో భక్తులకు తొలి దర్శనం ప్రసాదించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యాత్రలో భాగంగా సర్వ జనుల మధ్య జగతి నాథుడు సరికొత్త అలంకరణతో నవ యవ్వనునిగా ప్రత్యక్షం కానున్నాడు. అంతకు ముందుగా శ్రీ మందిరంలో దర్శనం ప్రసాదించడంపట్ల భక్తజనం పులకించి పోయారు. ఒనొసొరొ చతుర్దశి, ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయ నియమాల ప్రకారం దత్త మహా పాత్రో శ్రీ విగ్రహాల శ్రీ ముఖాలకు వన్నె దిద్ది నవ యవ్వన అలంకారానికి సర్వం సిద్ధం చేశారు. చిత్ర పటాల దేవుళ్ల తొలగింపు పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపద తిథి సందర్భంగా మంగళ వారం ఉదయం మంగళ హారతి, దైనందిన, నిత్య అలంకరణ కార్యక్రమాలు ముగించి దశావతార దేవతలలో శ్రీ బలభద్రుని ఆవరణలో నృసింహ, రామ, కృష్ణులను, శ్రీ జగన్నాథుని ఆవరణలో డోల గోవింద, శ్రీ మదననమోహనులను దక్షిణ గృహానికి తరలించారు. దేవీ సుభద్ర ఆవరణలో పూజలందుకున్న శ్రీ దేవి, భూ దేవి ఉత్సవ మూర్తులను శయన మండపానికి తరలించారు. ఆ తర్వాత మూల విరాటులు తెరు మరుగు కావడంతో దర్శనం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పొట్టా చిత్ర దేవుళ్లు శ్రీ బలభద్రుని ప్రతినిధి వాసు దేవుడి ఆవరణలో, దేవీ సుభద్ర ప్రతినిథి భువనేశ్వరి, శ్రీ జగన్నాథుని ప్రతినిథి నారాయణుడి పటాలను శ్రీ మందిరం సముదాయంలో నెలకొని ఉన్న విమలా మాత పీఠం సమీపంలో మండుణి గృహానికి తరలించారు. ఇలా ఒణొసొరొ ప్రాంగణంలో దేవతా సామగ్రి తొలగించడంతో కొఠొ సుంవాసియా వర్గం సేవకులు లోపలికి ప్రవేశించి ఒణొసొరొ తెరలు తొలగించారు. ఆ ప్రాంగణం జల సింఛనంతో శుద్ధి చేసి మూల విరాటుల సర్వ దర్శనానికి అనుమతించారు. అమావాస్య రాత్రి మూడు ఘడియలు ముగియడంతో ఆచార్య స్నానం అనంతరం పొట్టా చిత్రాల దేవుళ్ళ విసర్జనకు శ్రీకారం చుట్టడం ఆచారం. ఇదంతా పొద్దు పోయేంత వరకు నిరవధికంగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో కొలువై ఉన్న కుడ్య ప్రతిమ పతిత పావనుని సన్నిధిలో కూడ పొట్టా చిత్రం ఏర్పాటు తొలగించారు. వేకువ జాము నుంచి శ్రీ జగన్నాథుని నవ యవ్వన అలంకార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేయడంతో సుదీర్ఘ 15 రోజుల తర్వాత భక్తజనం స్వామిని కనులారా తిలకించి తన్మయం పొందారు. పరిమిత దర్శనం శ్రీ మందిరంలో నవ యవ్వన శోభలో శ్రీ జగన్నాథుని దర్శించేందుకు విశేష సంఖ్యలో యాత్రికులు తరలి వచ్చారు. శ్రీ క్షేత్రం కిటకిటలాడింది. ముందస్తు ప్రకటనం ప్రకారం యాత్ర సన్నాహాల నేపథ్యంలో నవ యవ్వన దర్శనం నిడివి పరిమితం చేశారు. పరమాణిక్ (ఆర్జితం) దర్శనం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి నామ మాత్రంగా అరగంటకు పరిమితం చేసి 5.30 గంటలకు ముగించారు. వెంబడి సర్వ దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 7.15 గంటల వరకు భక్తులకు ఈ దర్శన సౌకర్యం కల్పించారు. లోపలి ఆవరణ నుంచి దేవతా మూర్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతించారు. బుధవారం ఉభా యాత్ర కారణంగా శ్రీ మందిరంలో సర్వ దర్శనం మూసివేస్తామని ప్రకటించారు. మహా ప్రసాదం కోసం భక్తులు శ్రీ మందిరం ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు తిరిగి అదే ద్వారం గుండా నిష్క్రమించాలని శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద్ కుమార్ పాఢి ప్రకటించారు. -
విద్యార్థుల ధర్నా
జయపురం: fĶæ$-ç³#-Æý‡…ÌZ° Ñ{MýSÐ]l$ BÆŠætÞ A…yŠæ {M>‹œt MýSâê-Ô>-ÌSÌZ yìl{X, Ýë²™èlMýS MøÆý‡$ÞË$ {´ëÆý‡…-À…-^éÌS° yìlÐ]l*…yŠæ ^ólçÜ*¢ {ç³çÜ$¢™èl ѧéÅ-Æý‡$¦-ÌS-™ø-´ër$ ç³NÆý‡Ó ѧéÅ-Æý‡$¦Ë$ yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. C§ól ÑçÙ-Ķæ$OÐðl$ fĶæ$-ç³#Æý‡… çÜ»Œæ-MýS-ÌñæMýStÆŠ‡ M>Æ>Å-ÌSĶæ$… G§ýl$r Ð]l$…VýS-âýæÐéÆý‡… «§ýlÆ>² ^ólç³-sêtÆý‡$. ç³ÏM>Æý‡$zË$ ^ól™èl-ç³sìæt, Ð]lʆMìS ¯]lÌSÏ Çº¾¯]l$Ï MýSr$t-Mö° Ô>…†-Ķæ¬-™èl…V> °Æý‡-çܯ]l ™ðlÍ-Ķæ$-gôæÔ>Æý‡$. MýSâê-Ô>ÌS ç³NÆý‡Ó ѧéÅ-Æý‡$¦ÌS çÜ…çœ$… ¯ól™èlË$ fĶæ$-ç³#Æý‡… çÜ»Œæ-MýS-ÌñæMýSt-ÆŠ‡¯]l$ MýSÍíÜ Æ>çÙ‰ Ð]l¬QÅÐ]l$…-{†MìS Æ>íܯ]l yìlÐ]l*…-yýlÏ™ø MýS*yìl¯]l ÌôæQ¯]l$ A…§ýl-gôæÔ>Æý‡$. 1946ÌZ {´ëÆý‡…À…_¯]l ీ MýSâê-Ô>ÌS Æ>çÙ‰…ÌZ¯ól {ç³£ýl-Ð]l$-Ð]l$-°, A…™ól M>MýS$…yé §ýl„ìS׿ Jyìl-Ô>ÌZ _{™èl MýSâê ѧýlÅÌZ {ç³Ð]l¬Q MýSâêÔ>-ÌSV> E¯]l²-ç³µsìæMîS ¯ólsìæMîS yìl{X MøÆý‡$ÞË$ {´ëÆý‡…-À…-^ól…-§ýl$MýS$ {糿¶æ$™èlÓ A¯]l$Ð]l$† ÌSÀ…-^èl-Ìôæ§ýl° ѧéÅ-Æý‡$¦Ë$ Ðé´ù-Ķæ*Æý‡$. A…§ýl$-Ð]lÌSÏ {M>çœ#tÌZ E¯]l²™èl Õ„ýS׿, E§øÅ-V>ÌS MøçÜ… G¯ø² Cº¾…-§ýl$Ë$ ç³yýl$™èl$-¯é²Æý‡° ÑÐ]lÇ…-^éÆý‡$. Cç³µ-sìæOMð ¯]l yìl{X ´ëu>Å…-Ô>Ë$ {´ëÆý‡…-À…-^ól…§ýl$MýS$ {糿¶æ$™èlÓ… A¯]l$Ð]l$† CÐéÓÌS° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. AÌêVóS MýSâê-Ô>ÌSÌZ RêäV> E¯]l² sîæ^èlÆŠ‡ ´ùçÜ$tÌS¯]l$ Ððl…r¯ól ¿ýæÈ¢ ^ólĶæ*-ÌS-°, ÝûMýS-Æ>ÅË$ Ððl$Æý‡$-VýS$ç³-Æý‡^é-ÌS°, B«§ýl$-°MýS çÜ»ñæ-MýS$tË$ {ç³ÐólÔèæ ò³sêÏÌS° MøÆ>Æý‡$. -
జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలో ఆర్థిక అవకతవకలు
రాయగడ: స్థానిక జిల్లా పరిషత్ పరిధిలోని జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు పది లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో డుడాలొ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) స్పెషలిస్ట్గా పనిచేస్తున్న వినయ్ హరిజన్ నిధులను తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసి పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి వినయ్ పరిజన్ కార్యాలయానికి హాజరు కాకపోగా, గత మూడు రోజులుగా ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సొమవారం నాడు కూడా కార్యాలయానికి తాళం వేసి ఉండగా, టీమ్ లీడర్ సందీప్తో పాటు ఇతర ఉద్యోగులు కార్యాలయం బయట వేచి ఉండటం కనిపించింది. అయితే ఈ వ్యవహారంపై వారు మీడియా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ స్పందిస్తు నిధుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై విభాగ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయలేదని దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు పది లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను వినయ్ హరిజన్ తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన డూడా పరిధిలో వీధి ద్వీపాలు, ఎల్ఈడి టీవీల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ వాహనాల ఇంధనం, ఉద్యోగుల వేతనాలు తదితర ఖర్చుల పేరుతో కూడా నిధులు దుర్వినియోగం జరిగి ఉండవచ్చని అధికారులను అనుమానిస్తున్నారు. అయితే మొత్తం ఎంత మేర నిధుల గోల్మాల్ జరిగిందన్న దర్యాప్తు పూర్తయిన తరువాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే వినయ్ హరిజన్పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అక్షయ్ కుమార్ ఖెముండొ స్పష్టం చేశారు. -
5 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
● ఇద్దరు అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోలీసులు ఐదు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి మల్కన్గిరి నుంచి సుకుమ వెళ్లే మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వేగంగా వస్తున్న ట్రక్ తారసపడింది. దాన్ని ఆపి అందులో ఉన్నవారిని ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారు. దీంతో అనుమానంతో వాహనాన్ని పరిశీలించగా గుట్టలుగా ఉన్న గంజాయితో ఉన్న బస్తాలు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఐఐసీ రీగాన్కీండో సమక్షంలో పోలీసుస్టేషన్కు తరలించారు. మంగళవారం ఉదయం నిందితులను విచారింగా గంజాయిని ఛత్తీస్గఢ్కు కు తరలిస్తున్నట్టు అంగీకరించారు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కు తరలించాలని భావించినట్టు నిందితులు అంగీకరించారు. పట్టుబడిన నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోనాపూర్ గ్రామానికి చెందిన కమల్హసన్, విమల్ కుమార్గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అలాగే పరారీలో ఉన్న ఛత్తీస్గఢ్కు చెందిన రోహిత్ ప్రజాపతి, మల్కన్గిరికి చెందిన దీపంకార్ హల్ద్ర్, సౌరబ్ మల్లిక్, జగన్నాథ్ బిశ్వాస్లపై కూడా కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా ఐదు క్వింటాళ్లు ఉందని.. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 50 లక్షలు వుంటుందని ఐఐసీ రీగాన్ కీండో తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
జయపురం: పెన్షన్ డబ్బుల కోసం బ్యాంక్కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి టంగినిగుడ గ్రామ సమీప డాల్ఖాయి మార్గంలో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి బొయిపరిగుడ సమితి దసమంతపూర్ గ్రామ పంచాయతీ పకుల్పడ గ్రామానికి చెందిన దొశెయి ఖొర(75)గా పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం దొశెయి ఖొర తన పెన్షన్ డబ్బులు బ్యాంకు నుండి తీసుకునేందుకు టంగిణిగుడలోని బ్యాంకుకు వెళ్లాడు. డబ్బులు తీసుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో టంగిణిగుడ గ్రామ సమీప డాల్ఖాయి మార్గంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. వెంటనే స్థానికులు అంబులెన్స్ సాయంతో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రి జయపురం తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృతుడి వివరాలు లభ్యం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మత్స్యకార కార్యాలయంలో గుర్తు తెలియని మృతదేహం సోమవారం బయటపడిన విషయం తెలిసిందే. మృతుడు పార్వతీపురం–మన్యం జిల్లా పాలకొండ మండలం వడమకు చెందిన తాపీ మేసీ్త్ర బొద్దాన సింహాద్రి (48)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మొబైల్ విడిచిపెట్టి ఈ నెల 8న బయటకొచ్చిన సింహాద్రి నగరంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని ఓ పాడుబడిన గదిలో తలదాచుకున్నాడు. నిద్రాహారాలు లేక మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం కుటుంబసభ్యులు వచ్చి గుర్తించారు. సింహాద్రికి ఇద్దరు భార్యలు. వీరిలో మొదటి భార్య సరస్వతి అంగన్వాడీ కార్యకర్త, రెండో భార్య ఆరుద్ర గృహిణి. ఈ ఘటనపై రెండో పట్టణ ఎస్ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీఓ 329 రద్దు చేయాలి
సోంపేట : బీల ప్రాంతంలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల నిర్మాణానికి విడుదల చేసిన జీఓ 329 రద్దు చేసి చిత్తడి నేలల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని పర్యావరణ పరిరక్షణ సంఘ నాయకులు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. థర్మల్ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెంది 16 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మంగళవారం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ చిత్తడి నేలల మనుగడతోనే మానవ మనుగడ సాగుతుందన్నారు. భూమికి కిడ్నీలు వంటి చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యదర్శి తమ్మినేని రామారావు మాట్లాడుతూ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ బీల ప్రాంతంలో చేపల చెరువుల నిర్మాణానికి ఏర్పాటు చేసిన గట్లు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, సూరాడ చంద్రమోహన్, సనపల శ్రీరామమూర్తి, వైశ్యరాజ్ నాగు, సత్యరాజ్, డిక్కల దామోదరం, బెందాళం వెంకటరమణ, సింహాచలం పాడి, బి.బాబూరావు, టి.కోదండ, బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ధారాసింగ్ విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం
భువనేశ్వర్: 1999లో ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు మైనర్ కుమారుల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ధారా సింగ్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా ఈ ఆదేశాలు అమలు జేయాలని ఒడిశా ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ అయినట్లు అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ధారా సింగ్ను విడుదల చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. యావజ్జీవ ఖైదీ ధారా సింగ్ అసలు పేరు రవీంద్ర కుమార్ పాల్. గ్రాహం స్టెయిన్స్, అతని కుమారులు ఫిలిప్, తిమోతిల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని శిక్షా కాలం తగ్గింపు పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో ఒడిశా ప్రభుత్వానికి ఆదేశించింది. రాష్ట్ర శిక్షా సమీక్షా బోర్డు (ఎస్ఎస్ఆర్బీ) ఈ ఏడాది జూలై 6న సమావేశమై ధారా సింగ్తో సహా 56 మంది జీవిత ఖైదీల శిక్షా కాలం తగ్గింపు దరఖాస్తులను పరిశీలించి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తాను 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించినందున మరింత ఉదారమైన శిక్షా తగ్గింపు విధానం ప్రయోజనం కల్పించాలని కోరుతూ ధారా సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ కేసులో సహ–దోషి, దారా సింగ్ సహచరుడైన మహేంద్ర హెంబ్రమ్ను మంచి ప్రవర్తన ఆధారంగా జైలు నుండి ముందస్తు విడుదల మంజూరు చేశారు. ఈ హత్యలు 1999 జనవరి 21వ తేదీ రాత్రి ఒడిశాలోని కియోంఝర్ జిల్లా మనోహర్పూర్ గ్రామంలో జరిగాయి. గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారులు ఒక క్రైస్తవ సమావేశానికి హాజరైన తర్వాత వారి స్టేషన్ వ్యాగన్లో నిద్రిస్తుండగా ధారా సింగ్ నాయకత్వంలో ఉన్నారని ఆరోపించిన ఒక గుంపు ఆ వాహనానికి నిప్పు అంటించింది. దీంతో ముగ్గురూ ఘటనా స్థలంలో సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఒడిశా పోలీస్ డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్న అప్పటి మయూర్భంజ్ పోలీస్ సూపరింటెండెంట్ యోగేష్ బహదూర్ ఖురానియా 2000వ సంవత్సరం జనవరి 31న దారా సింగ్ను అరెస్టు చేశారు. ఈ కేసులో దారా సింగ్, మహేంద్ర హెంబ్రమ్తో సహా 14 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. వారిలో 12 మంది తదనంతరం నిర్దోషులుగా విడుదలయ్యారు. ముగ్గురి హత్య కేసులో ధారా సింగ్ను ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంటూ 2003లో సీబీఐ కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. 2005లో ఒడిశా హై కోర్టు ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చగా 2011 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఆ యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్, కళ్యాణసింగుపూర్ సమితుల పరిధుల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యగుడ గ్రామ ప్రధాన రహదారిపై బైకు, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుణుపూర్ పాత పోస్టాఫీసు వీధికి చెందిన బైక్మెకానిక్ చింతాడ రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. గుణుపూర్ శివానంద డెప్పొవీధికి చెందిన పంచానన్ హోతా తన భార్యతో కలిసి పులుగుమి సమీపంలొ వనదుర్గ ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఎరుదుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలొ పంచనన్హొత ఆయన భార్యతో పాటు మరొ మరో వ్యక్తి చిన్నా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను గుణుపూర్ ఆస్పత్రికి తరలించగా, రమేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్రగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ప్రమాదానికి గురైన రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బస్సు –బైకు డీ: మరో యువకుడి మృతి మరో ఘటనలో కళ్యాణసింగుపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–45 పై బెలకణ సమీపంలో బస్సు, బైకు ఢీకొన్న ఘటనలో పెదిరు ఎలుజ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గడ్దిశెశికల్ ప్రాంతం నుంచి తన భార్యను తీసుకురావడానికి సికరపాయికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. -
ముఖ్యమంత్రికి రథయాత్రకు ఆహ్వానం
భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర ప్రత్యక్షంగా తిలకించేందుకు రావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకులు డాక్టరు అరవింద కుమార్ పాఢి ప్రత్యేకగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహాప్రభు ఘోష యాత్రను క్రమబద్ధంగా, సజావుగా నిర్వహించేందుకు సేవా ప్రదాతలతో మంచి సమన్వయం పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి అటవీ శాఖ సిబ్బంది సోమవారం రాత్రి పేట్రోలింగ్ నిర్వహిస్తుండగా కలపను అక్రమంగా తరలిస్తున్న ముఠా పట్టుబడింది. పెట్రోలింగ్ సిబ్బంది అతివేగంగా వస్తున్న ఓ పికాప్ వ్యాన్ ఆపి తనిఖీ చేయగా కలప తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. కోరుకొండ ప్రాంతం నుంచి ఆంధ్రాలోని డంకరాయి ప్రాంత్రానికి అక్రమంగా కలపను తరలిస్తున్నట్టు అటవీ సిబ్బంది గుర్తించి వ్యాన్లో ఉన్న పది టేకు దుంగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. క్రికెట్ టోర్నమెంట్ విజేతగా మలాలిగుడ జట్టు జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడలో నిర్వహిస్తున్న భాయిభాయి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 16 టీములు పాల్గొన్నాయి. వీటిలో మల్కన్గిరి జిల్లా మలాలిగుడ టైజర్ లెవెన్ టీమ్, బొయిపరిగుడ నిరో లెవెన్ టీమ్లు ఫైనల్కు చేరాయి. ఫైనల్లో మలాలిగుడ టైజర్ లెవెన్ బొయిపరిగుడ టీమ్ను ఓడించి చాంపియన్గా నిలిచింది. బహుమతుల ప్రధాన ఉత్సవంలో కొరాపుట్ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళికా బోర్డు అధ్యక్షుడు రఘురాం మచ్చ, నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి హరి ప్రధాని, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి జోగా బిశాయి, త్రిలోచన జెన, కిరణ్ స్వైయ్, మనోజ్ నాయిక్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులు రాయగడ: పవిత్ర రథయాత్ర పురస్కరించుకొని స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో విస్తృత స్థాయిలో స్వచ్ఛతపై అవగాహన, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్ నేతృత్వంలో సఫాయి అప్నావో.. భీమరీ భగావో నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్య నిర్వాహక అధికారి కుల్దీప్ కుమార్ మాట్లాడుతూ.. రాయగడ నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు. నగర పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అనంతరం రాయగడ మున్సిపాలిటీ తరుపున జిల్లా ప్రజలకు పవిత్ర రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. -
టేకు దుంగల అక్రమ రవాణా
● ముగ్గురు అరెస్టు పర్లాకిమిడి: దిగపోహాండి (గంజాం జిల్లా) నుంచి అక్రమంగా గజపతి జిల్లాకు ట్రాక్టర్పై తరలిస్తున్న టేకు దుంగలను సోమవారం రాత్రి మహేంద్రగిరి అటవీ డివిజన్ అధికారి మోజేష్ శోబోరో కాపుకాసి గజపతి జిల్లా శియ్యాలిలోట్టి గ్రామ పంచాయతీ హరిదబద జంక్షన్ బీట్ పోయిపాణి వద్ద పట్టుకుని సీజ్ చేశారు. మహేంద్రగిరి రేంజ్ అధికారులకు నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా మోహనా నుంచి టేకు దుంగలు రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు కాపుకాసి పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లో 7 కలప దుంగలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అంచనా. స్మగ్లర్లు ట్రాక్టరులో టేకును లోడు చేసి బైకుపై మరో ఇద్దరు ఫాలో అవుతున్నారు. మొత్తం ముగ్గురు ట్రాక్టరుతో సహా పట్టుబడ్డారు. వారిని అటవీ చట్టప్రకారం మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. -
ముగిసిన క్రికెట్ టోర్నీ
● విజేత మల్లిగాం జట్టు రాయగడ: సదరు సమితి అమలాభట్ట డిగ్రీ కళాశాల వెనుకగల మైదానంలో నెల రోజుల జరుగుతున్న శ్రీలక్ష్మీనృసింహ క్రికెట్ టోర్నెమెంటు మంగళవారంతో ముగిసింది. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ క్రీడాకారుడు తన లక్ష్యాన్ని చేరుకొవాలంటే ఇటువంటి తరహా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. క్రీడల్లో మన రాష్ట్రం ఎంతొ ముందుకు వెళుతుందని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి తరహా వేదికలను సద్వినియోగపరుచుకొవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టోర్నెమెంటులో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 33 జట్లు పాల్గొన్నాయని శ్రీక్షేత్ర టౌన్ షిప్ అధినేత దూడల శ్రీనివాస్ వివరించారు. ఫైనల్స్ పోటీలొ మల్లిగాం, అమలాభట్ట జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయని వివరించారు. మల్లిగాం జట్టు విజేతగా నిలవగా రన్నర్గా అమలాభట్ట జట్టు నిలిచిందని అన్నారు. విజేత జట్టుకు 33,333 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ, రన్నర్ జట్టుకు 22,222 నగదుతో పాటు ట్రోఫీని ముఖ్యఅతిధిగా హాజరైన నెక్కంటి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పెద్దింటి తపన్, రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హెపురక, జిల్లా పరిషత్ సభ్యురాలు సంద్యా పులక, రాష్ట్ర మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరక పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్
నందిగాం: మండల కేంద్రం నందిగాంలో విద్యుత్ స్తంభాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రఽహదారి నుంచి బీసీ కాలనీ మీదుగా నందిగాం వచ్చే మార్గంలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని శ్రీకాకుళం నుంచి పెంటూరు కర్రల లోడ్తో వెళ్తున్న వ్యాన్ ఆటోను తప్పించబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగిపోయి కళ్లాల వైపు వాలిపోయింది. అదే రోడ్డు వైపు ఒరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేది. గమనించిన స్థానికులు విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు వచ్చి సరఫరాను పునరుద్ధరించారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ పరిశీలన టెక్కలి రూరల్: రావివలలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను మంగళవారం టెక్కలి డీఎల్డీఓ అలివేలు మంగమ్మ పరిశీలించారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో సమీప ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పంటలు నాశనం అవుతున్నాయని, మూగజీవాలకు వింత వ్యాధులు వస్తున్నాయని కొందరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో క్షేత్రస్థాయిలో పకరిశీలించి ఆరా తీశారు. ఆమెతో పాటు ఎంపీడీఓ ఎం.రేణుక, డిప్యూటీ ఎంపీడీఓ కె.సింహాద్రి తదితరులు ఉన్నారు. ఇంటింటి సర్వే గడువు 24 వరకు పొడిగింపు శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సర్వే గడువును జూన్ 15 నుంచి జూలై 24 వరకు పొడిగించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, సవరించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను జూలై 24 లోగా పూర్తి చేయాలని, జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 28 లోగా వాటి పరిష్కారాన్ని పూర్తి చేసి, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాల పరిధిలో 18,97,405 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 17,30,748 ఓటర్ల దరఖాస్తుల (91.22 శాతం) కంప్యూటరీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. ఇంకా అనుసంధానం కావా ల్సిన 79,396 మంది ఓటర్ల ప్రక్రియను, మిగిలిన ఇతర సాంకేతిక లోపాలను యుద్ధప్రాతిపదికన సవరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతు శంకరరావు (వైఎస్సార్ సీపీ), పీఎంజే బాబు (టీడీపీ), పి.సురేష్ సింగ్ (బీజేపీ), ఐటీ.కుమార్ (వైఎస్సార్ సీపీ), ఎస్. సత్యనారాయణ (వైఎస్సార్ సీపీ), ఈశ్వరి (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఐటీఐ కౌన్సెలింగ్ ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగించారు. 657 సీట్లకు గాను 285 మంది హాజరయ్యారు. వీరిలో 162 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి పడవ ప్రయాణం
కొరాపుట్: కటాఫ్ గ్రామంలో సమస్యలు తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు పడవ ప్రయాణం చేశారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బిలాపుట్ గ్రామ పంచాయతీ జోలాపుట్ రిజర్వాయర్లో ఉన్న సబున్ గ్రామానికి అధికారులు తరలివెళ్లారు. జన జీవన స్రవంతికి దూరంగా ఉన్న ఈ గ్రామం గతంలో గంజాయి పంటకు పేరు గాంచింది. అయితే ఈ గ్రామం కోసం విన్న కలెక్టర్ సత్యవాన్ మహాజన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జిల్లా ముఖ్య పశువైద్యాధికారి వేణుధర్ సబర్, ఐటీడీఏ పీవో స్నేహప్రభ మజ్జి తదితర అధికారులతో కలిసి పడవ మీద ఈ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఘాట్ నుంచి గ్రామానికి రోడ్డు నిర్మాణం, అదే ప్రాంతంలో ఉన్న సబున్–లమాదర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం, విద్యుత్ కనెక్షన్, ఈ ప్రాంతంలో ఉన్న కటాఫ్ గ్రామాలకు ప్రాథమిక విద్య సౌకర్యం తదితర సమస్యలు గ్రామస్తులు విన్నవించారు. దీంతో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ ప్రకటించారు. కటాఫ్ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దీంతో ఈ గ్రామానికి ఇంతవరకు ఏ కలెక్టర్ కూడా ఇలా రాలేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
జనసుణాని శిబిరంలో వినతుల స్వీకరణ
జయపురం: fĶæ$-ç³#Æý‡… çÜ»Œæ-yìl-Ñ-f¯ŒS MýS$…{§é çÜÑ$† M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ çÜÑ$† Ýë¦Æ‡$$ f¯]lçÜ$-×ê° Õ¼-Æ>°² A«¨-M>Æý‡$Ë$ ÝùÐ]l$ÐéÆý‡… °Æý‡Ó-íßæ…^éÆý‡$. D çÜ…§ýlÆý‡Â…V> MóSÐ]lÌS… ¯]lË$-VýS$Æý‡$ Ð]l*{™èlÐól$ ѯ]l-™èl$Ë$ A…§ýl-gôæ-Ô>Æý‡$. MýS$…{§é ½yîlÐø í³.Ð]l$¯]líÜÙèl A«§ýlÅ-™èl¯]l Õ¼Æý‡… fÇ-W…-¨. MðSÆ>-Ð]l$sìæ Ð]l˜ã MýS*yýlÍ ¯]l$…_ Mö§ýl-Î-VýS$yýl {V>Ð]l$… Ð]lÆý‡MýS$ E¯]l² Æøyýl$z¯]l$ {糫§é-¯]lÐ]l$…{† çÜyýlMŠS ç³£ýl-MýS…ÌZ ^ólÆ>a-ÌS-°, Rñæ…§ýl$-VýS$yýl ĶæÊï³ çÜ*P-ÌŒæÌZ ™èlW-¯]l…™èl Ð]l$…¨ E´ë-«§éÅĶæ¬-ÌS¯]l$ °Ä¶æ$Ñ$…^é-ÌS-°, çÜÑ$-†ÌZ A°² {V>Ð]l*-ÌSÌZ AÆý‡$áÌSMýS$ CâýæÏ ç³sêtË$ A…§ýlgôæ-Ķæ*-ÌS-°, º…§ýl¯é-´÷-§ýlÆŠ‡ {V>Ð]l$…ÌZ M>…{MîSsŒæ Æøyýl$z ÐólĶæ*ÌS° MøÆý‡$™èl* Ý린-MýS$ÌS ѯ]l-™èl$Ë$ A…§ýl-gôæ-Ô>Æý‡$. ѯ]l™èl$Ë$ ç³Ç-Ö-Í…-_¯]l ½yîl-Ðø Ð]l$¯]líÜÙèl Ððl…r¯ól ™èlVýS$ ^èlÆý‡ÅË$ ¡çÜ$-MøÐéÌS° çÜ…º…-«¨™èl A«¨M>-Æý‡$-ÌS¯]l$ B§ól-Õ…^éÆý‡$. Õ¼Æý‡…ÌZ çÜÆý‡µ…^Œl Ð]l*×ìæMŠS Ô>…™èl, ¯éÄñæ$MŠS çÜÆý‡µ…^Œl Ððl¬¯ö Ô>…™èl, ÐéÆý‡$z çÜ¿¶æ$ÅË$ çÜ$gê™èl »Ÿ-Æý‡çÜ, IïÜ-ీ-G‹Ü çÜ*ç³-ÆŠ‡-OÐðl-fÆŠ‡ »êÌS-Ð]l$×ìæ çßæÇ-f¯Œl, ÐérÆŠ‡ çÜOò³Ï Ñ¿êVýS C…h±ÆŠ‡ X™é…fä çßæ$Ƈ$$MýS, ï³DÐø Æý‡Ò…-{§ýl-ç³N-gêÇ, H½DÐø çÜ…™ø‹Ù MýS$Ð]l*ÆŠ‡ »ñæçßæÆý‡, þ°-Ķæ$ÆŠ‡ C…h-±ÆŠ‡ Æ>Ð]l$-^èl…{§ýl »ñæçßæÆý‡ ´ëÌŸY¯é²Æý‡$. -
గాయకుడు సౌరవ్ భరద్వాజ్కు గవర్నర్ శుభాకాంక్షలు
భువనేశ్వర్: ప్రఖ్యాత ఒడియా గాయకుడు సౌరవ్ భరద్వాజ్కు రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి శుభాకాంక్షలు తెలిపారు. సౌరవ్ భరద్వాజ్ లోక్ భవన్లో గవర్నర్ను కలిశారు. జగన్నాథ స్వామిపై భక్తితో కూడిన ఆయన సంగీత ప్రయాణం ఎంతోమంది శ్రోతల ఆదరణను పొందింది. ఆయనకు మరిన్ని విజయాలు లభించి ఒడిశా యొక్క సుసంపన్నమైన సంగీత సంప్రదాయాన్ని సుదీర్ఘ కాలం పరిపుష్టం చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు. మలేరియాతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి రాయగడ: జిల్లాలో మలేరియా వ్యాధి బారినపడి మరో విద్యార్థి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సదరు సమితి పరిధిలోని వత్తాడ ప్రభుత్వ ఉన్నత ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి జయసేన్ కండగిరి (9) మలేరియా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బడకొసాపాడు గ్రామానికి చెందిన జయసేన్ గత నెల 27వ తేదీన జ్వరంతో బాధపడగా రక్తపరీక్షల్లో మలేరియా నిర్ధారణ అయ్యింది. తొలుత జిమిడిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మలేరియా మెదడుకు వ్యాపించడంతో (సెరెబ్రల్ మలేరియా) మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ వైద్య కళాశాల ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. విద్యార్థి మృతదేహాన్ని ఆంబులెన్స్లో స్వగ్రామమైన బడకొసాపాడుకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై 18 వరకు చేపల వేట నివారణ భువనేశ్వర్: సముద్రంలో అలజడి వాతావరణం అలముకుంది. రాగల 5 రోజుల్లో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. ఒడిశా తీరంలోని మత్స్యకారులు సముద్రం లోనికి వెళ్ళ వద్దని ఐఎండీ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఈ సమాచారం ప్రకారం మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు ఒడిశా తీరం వెంబడి, పరిసరాల్లో ఈదురు గాలులతో కూడిన వాతావరణం తాండవించే అవకాశం ఉంది. ఈ వ్యవధిలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వరకు పుంజుకుని గరిష్టంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలుల కారణంగా ఈ 5 రోజుల పాటు ఒడిశా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా లేదా అత్యంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఈ నెల 14 నుండి 18 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎమ్డి రాష్ట్ర తీర ప్రాంత మత్స్యకారులకు సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వీలైనంత త్వరగా ఒడ్డుకు తిరిగి రావాలని కోరింది. తీరప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల కోసం ఈ హెచ్చరికను అన్ని తీరప్రాంత జిల్లాల పరిపాలనా యంత్రాంగాలకు తెలియజేశారు. అక్రమాస్తుల కేసులో మాజీ జూనియర్ ఇంజినీర్కు మూడేళ్ల జైలు రాయగడ: అక్రమాస్తుల కేసులో రాయగడ జిల్లా గుణుపూర్ సహాయ మట్టి సంరక్షణ కార్యాలయం మాజీ జూనియర్ ఇంజినీర్ (జేఈ) అశోక్ కుమార్ పాడికి కోర్టు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. ఒడిశా విజిలెన్స్ నమోదు చేసిన కేసులో దర్యాప్తు అనంతరం అశోక్ కుమార్ పాడిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేసింది. తను చట్టబద్ధఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ కేసును విచారించిన బరంపురం విజిలెన్స్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అశోక్ పాడిని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు అతడికి మూడేళ్ల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అశోక్ ప్రస్తుతం పదవీ విరమణ చేసినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనకు అందుతున్న పెన్షన్ను నిలిపివేయాలని సంబఽంధిత శాఖ అధికారులకు విజిలెన్స్ కోరినట్లు వెల్లడించింది. -
పాఠశాలలో అగ్నిప్రమాదం
● సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని జగన్నాథ మందిరం వద్ద ఉన్న శ్రీసత్యసాయి విద్యామందిర్ పాఠశాలలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్ గదిలో పోగ రావడాన్ని గమనించిన విద్యాలయం సిబ్బంది అప్రమత్తమై అక్కడ నుంచి విద్యార్థులను బయటకు తరలించారు. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్పిమాపకదళం ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంతో కంప్యూటర్ గదిలో కొన్ని వస్తువులు కాలిబూడిదయ్యాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంతవరకూ తెలియరాలేదు. -
ప్రత్యేకమైన రంగుల కలయిక వస్త్రాల అలంకరణ
తొలినిజరూప దర్శనం జగన్నాథుడి తొలి నిజరూప దర్శనం జరిగింది. భారీగా భక్తులు వచ్చారు. –8లోu5 క్వింటాళ్ల గంజాయి.. 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. –8లోuశ్రీమందిరం ఆదాయం లెక్కింపు భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుక రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,352లు వచ్చాయని అధికారులు తెలిపారు.బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026విభిన్న వన్నెల వస్త్రాల మేళవింపుతో అందంగా 3 రథాలు భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా పాలుపంచుకుని స్వామి యాత్రని దిగ్విజయం చేయడంలో పాత్రధారులుగా నిలుస్తారు. ఈ క్రమంలో దర్జీల సేవలు అనన్యంగా నిలుస్తాయి. పవిత్ర దేవతలు యాత్ర చేసే రథాలకు దర్జీ సేవలు చిరునామాగా ఆకట్టుకుంటాయి. ఒక్కో రథానికి విభిన్న వర్ణాల వస్త్రాల మేళవింపుతో ఆకర్షణీయంగా కుట్టి రథాలకు క్రమ పద్ధతిలో చుట్టడంతో మూల విరాటుల రథాల పరిచయం సుస్పష్టం అవుతుంది. దర్జీ మూడు రథాలకు అవసరమైన వస్త్రాలు సిద్ధం చేసే పనులు పూర్తి చేయడంతో రథం వస్త్రాలంకరణ చకచకా తుది మెరుగులు దిద్దుకుంటుంది. తొలి దశలో 3 రథాల ద్వారబంధాల అలంకరణకు అవసరమైన చంద్ర శాలి వస్త్రాల్ని కొఠొ సుంవాసియా సేవకులకు అందజేశారు. మూడు రథాలపై ఆశీనులు కానున్న దేవతల కోసం సౌకర్యవంతమైన దిండ్లు, ఉడా చందువా కట్టు పనులు తుది దశలో రూపుదిద్దుకుంటున్నాయి. మరో వైపు కొఠొ సుంవాసియా సేవకులు 3 రథాల 12 ద్వారాలకు వస్త్రాలంకరణ పూర్తి చేశారు. చందువా విభిన్నం క్రమ పద్ధతిలో ఆకర్షణీయమైన రంగుల మేళవింపుతో దర్జీలు కుట్టి సిద్ధం చేసిన వస్త్రం చందువాగా ప్రతీతి. పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతం చందువాకు ప్రసిద్ధి. నైపుణ్యం కలిగిన కళాకారులు రంగురంగుల వస్త్ర ముక్కలను చేతితో కత్తిరించి, కుట్టడం ద్వారా రథాలను అలంకరించే అద్భుతమైన పైకప్పులను, ఆకర్షణీయమైన వస్త్ర కప్పులను రూపొందిస్తారు. దర్జీల ప్రతి కుట్టులో హృదయ పూర్వక భక్తి, అద్భుతమైన పనితనం మరియు సంప్రదాయం మిళితమై ఉంటాయి. ఒడిశాకు చెందిన శతాబ్దాల నాటి చందువా కళా సంస్కృతి ఆప్లిక్ కళగా జీఐ ట్యాగ్ సాధించింది. దీన్ని పూరీ రథ యాత్ర కోసం ప్రత్యేకంగా చేతి పనితో తయారు చేయడం విశేషం. రథాల యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో పిప్పిలి చందువా ఉనికి ప్రత్యేకం. పిప్పిలి ప్రాంతపు దర్జీలు యాత్ర రథాల వస్త్రాలంకరణలో ముందంజ పాత్ర పోషిస్తారు. చందువా ప్రతి రథానికి అలంకార వస్త్ర పైకప్పులుగా చూడ ముచ్చట గొలిపిస్తాయి. ఈ బహుళ వన్నెల వస్త్రాల అమరికతో సామాన్యుడు సైతం ఏ రథం ఏ దేవునిదో సులభంగా గుర్తించగలుగుతాడు.శ్రీ జగన్నాథుని పవిత్ర రథాల తొలి పరిచయం ఆయా రథాల వస్త్రాలంకరణ. వార్షిక యాత్రలో మూల విరాట్లు 3 వేర్వేరు రథాల్లో శ్రీ గుండిచా మందిరానికి తరలి వెళ్తారు. ఒక్కో రథం ఒక్కో వన్నెతో కనులు మిరమిట్లు గొలిపిస్తుంది. విభిన్న రంగుల వస్త్రాల్ని ప్రత్యేకమైన మేళవింపుతో జోడించి రథాల పైభాగం నిండుగా కప్పడంతో చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. రథాల వర్ణం ఆధారంగా దేవతా మూర్తుల రథాల్ని గుర్తు పెట్టుకునే భక్తులు, యాత్రికులు కోకొల్లలు. ఈ మూడు రథాలను అలంకరించడానికి మొత్తం మీద 1,250 మీటర్ల వస్త్రాన్ని ఉపయోగిస్తారు. శ్రీ జగన్నాథుడు యాత్ర చేసే నందిఘోష రథం అలంకరణలో 425 మీటర్ల వస్త్రం వినియోగిస్తారు. ఈ అలంకరణలో ఎరుపు, పసుపు వర్ణాల వస్త్రం వినియోగిస్తారు. బలభద్ర స్వామి ఆశీనుడయ్యే తాల ధ్వజం ఎరుపు మరియు ఆకుపచ్చని రంగుల మేళవింపుతో 425 మీటర్ల వస్త్రంతో చుట్టుకుని ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది. దేవి సుభద్ర యాత్ర చేసే దర్ప దళనం 400 మీటర్ల సువిశాల ఎరుపు, నలుపు రంగుల కలయికతో కుట్టి సిద్ధం చేసిన వస్త్రాలతో ముస్తాబు అవుతుంది. -
భద్రతకు సన్నద్ధత
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథ యాత్ర పకడ్బందీగా నిర్వహించాలని విభాగాల వారీగా అధికారులు, సిబ్బంది ఇతరేతర అనుబంధ యంత్రాంగం రాత్రింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. యాత్ర ఆద్యంతాలు సుఖాంతంగా కొనసాగించాలని సకల యంత్రాంగాలు భద్రత, రక్షణపు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ప్రధానంగా పోలీసు, అగ్ని మాపక అనుబంధ వర్గాలు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమ వారం ఉదయం రథ యాత్ర నిర్వహణ కసరత్తు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రలో రథాలు లాగడం, కదలిక, నిరాటంకంగా గమ్యం చేరడం అంశాలపై దృష్టి సారించారు. రథాలకు రక్షణ మొదలుకొని వడివడిగా కదలడంతో తొక్కిసలాట వంటి ప్రమాదాల నివారణతో గమ్యం చేరే దిశలో సాధన నిర్వహించారు. ఈ సమగ్ర ప్రక్రియ రథ యాత్రని తలపింప జేసింది. రథ యాత్రకు ముందు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు, జనసందోహ నియంత్రణ మరియు వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పరీక్షించేందుకు ఒడిశా పోలీసులు పూరీలో సమగ్రమైన అభ్యాస విన్యాసం (మాక్ డ్రిల్) నిర్వహించారు. ఈ విన్యాసాల్లో 13,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. భక్తులందరికీ సురక్షితమైన, ప్రశాంతమైన ఉత్సవ అనుభవాన్ని కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. -
రూ.30 లక్షలతో రథం తయారీ
జయపురం: జయపురంలో చారిత్రాత్మక రథాయాత్రకు ఈ ఏడాది శ్రీక్షేత్ర పూరీ రథయాత్ర రథం మో డల్లో అతి సుందరంగా రథం రూపుదిద్దుకుంటున్నది. జయపురం దేవాదాయ విభాగం వారు దాదాపు రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. రథాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎత్తు, వెడల్పు తో తయారు చేస్తున్నారు. మహారాజుల సమయం నుంచి జయపురంలో జరుగుతున్న రథయాత్రలో తయారుచేసిన రథాలను మరిపించేలా ఈ ఏడాది రథం ఎత్తు 44 అడుగులకు పెంచారు. శిఖరంపై ఉండే జండాతో రథం ఎత్తు 50 అడుగులు. రథం దిగువ మట్టం వెడల్పు 30 అడుగులకు పెంచారు. రథం దిగువ అంతస్తు నేల నుంచి 4 అడుగుల ఎత్తు, రథ చక్రాల వ్యాసం సుమారు 7 అడుగులు, నేటి జయపురం రథానికి మరో ప్రత్యేకత రథానికి వినియోగించే కలప అంతా కొత్తది కావటం గమనార్హం. ఆదివారం రథంపై శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్ర మూల మూర్తులను రథోరోహణ చేస్తారు. ఈ నెల 17వ తేదీన అంగరంగవైభవంగా జయపురంలో రథయాత్ర నిర్వహిస్తారు. -
తోటాద్రి పీఠాధిపతి పూరీ సందర్శన
భువనేశ్వర్: తమిళనాడు నంగునేరి తోటాద్రి పీఠాధిపతి, రామానుజ సమాజం జగద్గురు శ్రీ మధుర కవి పొన్న పాపన్న రామానుజ జీయర్ స్వామిజీ పూరీ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర స్వామి ఛారిటబుల్ ట్రస్ట్ వర్గీయులు సాదరంగా స్వాగతం పలికారు. లోక్నాథ్ ఆలయం సమీపంలోని శ్రీ బాలాజీ ఆలయ ప్రాంగణంలో పాదుక పూజ, పుష్పాల సమర్పణ, వేద విద్యార్థులు వేద గానంతో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా స్వామిజీ శ్రీ బాలాజీని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సాధువులను ఆశీర్వదించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం పూరీకి వేంచేసిన స్వామి మధుర్ కవిని బాలాజీ ఆలయ ప్రాంగణంలో వివిధ మఠాధిపతులు, సాధువులు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలాజీ ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ ఛైర్మన్ మరియు జీయర్ స్వామి మఠం మహంత్ స్వామి ఇందిరా రమణ రామానుజ దాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూరీ ఉత్తర పార్శ్వ మఠం మహంత నారాయణ్ రామానుజ దాస్ మరియు అనేక మంది సాధువులు, ఆచార్యులు, శిష్యులు ట్రస్ట్ సభ్యులు స్వామి సుదర్శన్ రామానుజ దాస్, సురేష్ శర్మ, సీనియర్ పాత్రికేయుడు విష్ణుదత్త దాస్ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. -
పూరీ జిల్లా పోలీస్, మేజిస్ట్రేట్ సమన్వయ సమావేశం
భువనేశ్వర్: దగ్గర పడుతున్న పూరీ శ్రీ జగన్నాథ మహా ప్రభువు రథ యాత్ర సజావుగా జరిపించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చే యాత్రికులకు సురక్షిత సుదర్శనం ప్రసాదించాలని జిల్లా అధికార వర్గం చురుగ్గా పని చేస్తోంది. ఈ లక్ష్య సాధనకు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేసేలా నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక టౌన్ హాల్లో పోలీస్, మేజిస్ట్రేట్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సిబ్బంది మోహరింపు, ట్రాఫిక్, జన సందోహ నియంత్రణ, అత్యవసర స్పందన, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సురక్షితమైన, భద్రమైన, ప్రశాంతమైన యాత్రను నిర్వహించడానికి ఒడిశా పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి కట్టుబడి ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలన కార్యనిర్వాహక అధికారులు, న్యాయాధికారులు, పోలీసు శాఖ అధికారులు సమన్వయంగా సమావేశమయ్యారు. -
నేడు నేత్రోత్సవం
భువనేశ్వర్: శ్రీ క్షేత్రం యాత్ర సందడితో కళకళలాడుతోంది. మరో వైపు స్వామి యాత్ర కోసం ఉవ్విళూరుతున్నాడు. యాత్రకు మరో రెండు రోజులు ఉండగానే స్వామి శోభాయమానంగా భక్త జనుల మధ్య ప్రత్యక్షం కావాలని సమాయత్తం అవుతున్నాడు. పవిత్ర ఒనొసొరొ లేదా అనవసర త్రయోదశి తిథి పురస్కరించుకుని సోమ వారం శ్రీ మందిరంలో తెర చాటున దేవతా మూర్తులకు ఘొణా లగ్గి, శ్రీ పాయర్ ముద్దా సేవలు నిర్వహించారు. ఈ సేవలో దేవతా మూర్తుల శ్రీ అంగం ఉదరం నుంచి చికిత్స సమయంలో వస్త్రాలు తొలగించి నూతన బాసుంగ పట్టొ (చికిత్స సమయంలో వినియోగించే ప్రత్యేక వస్త్రం) ధరిస్తారు. ఇంతటితో అనారోగ్య సేవలకు ముగింపు పలుకుతు శ్రీ విగ్రహాలకు శ్రీ పాయర్ ముద్దా సేవ నిర్వహిస్తారు. ●ఈ ఘొణా లగ్గి సేవలో స్వామి వారికి ప్రత్యేక సుగంధ లేపనం, చందనం, కర్పూరం, కస్తూరి మొదలైన ఔషధీయ సుగంధ ద్రవ్యాలను పూస్తారు. ఒణొసొరొ కాలంలో జరిగిన వైద్య సేవల చివరి దశలో భాగంగా ఇది నిర్వహిస్తారు. దీని ద్వారా స్వామివారు సంపూర్ణ ఆరోగ్యంతో, దివ్య కాంతితో భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని భావిస్తారు. ●అలాగే శ్రీ పాయర్ ముద్దా సేవ కూడా ఒణొసరొ ముగింపు దశలో జరిగే ఒక ప్రత్యేక ఆలయ ఆచార సంప్రదాయం. ఇందులో స్వామి వారి సింగారం, వస్త్రాలంకరణ, అంతర్గత ఏర్పాట్లు పూర్తయ్యాయని సూచిస్తూ సంప్రదాయబద్ధంగా ముగింపు సంకేతం ముద్ర, సీలుకు సంబంధించిన ఆచారం ముద్దా నిర్వహిస్తారు. ●ఈ రెండు ఆచారాలు భగవంతుడు అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడనే భావాన్ని ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన ఆచారాలు. అనంతరం నేత్రోత్సవం నవయౌవన దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తవుతాయి. ఏకాంత గదిలో గోప్య సేవలు తర్వాత అనారోగ్యంతో ఉన్న మహా ప్రభువు కోలుకున్నారు. ఈ విషయాన్ని సేవకులు గజపతి మహారాజ్కు కూడా తెలియజేశారు. రథ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభించాలని రాజా వారు అభ్యర్థించారు. సోమవారం శ్రీ మందిరంలో ఘొణా లగ్గి సేవ నిర్వహించారు. ఘొణా లగ్గి నియమం ప్రకారం మహా ప్రభువుపై కప్పిన పాత బాసుంగ పట్టు వలువను తొలగించి పటరా వర్గం సేవకులుతో తయారు చేసిన కొత్త బాసుంగ పట్టు వలువని ప్రతిష్ఠించడం ఒక సంప్రదాయం. దీని తర్వాత శ్రీ అంగంపై శ్రీ ముఖ హొత్తా (మూల విరాటుల ముఖ కాంతుల పునరుద్ధరణ) నిర్వహించడం క్రమ పద్ధతి. దీని కోసం దైతపతి సేవకులు ముందు రోజు రాత్రి నుంచి పొద్దుపోయేంత వరకు నిరవధికంగా సన్నాహాలు చేశారు. సోమవారం వేకువ జాము వరకు ఈ సన్నాహాలు కొనసాగాయి. మరో వైపు ఈ రోజు మహా ప్రభువు దేహాన్ని ప్రకాశింపజేయడానికి శుద్ధ సువార్ సేవకుని ఇంటి నుండి ఖొల్లి ప్రసాదం అనే దివ్య లేపనాన్ని సమర్పించారు. దీనితో పాటు ఖొడి ప్రసాదానికి సంబంధించిన ఒక ఆచారాన్ని కూడా నిర్వహించారు. దీని తర్వాత అనారోగ్యంతో ఉన్న మహా ప్రభువు తన యవ్వనాన్ని తిరిగి పొందుతారు. ●శ్రీ జగన్నాథ సంస్కృతి శాసీ్త్రయ ఆధారాలతో ఫులూరి తైలం, ఓష లగ్గి, దశ మూలికల లగ్గి, సర్వాంగ చందనం, రాజ ప్రసాదం సమర్పిండంతో పక్షం రోజుల అస్వస్థత నుంచి స్వామి క్రమంగా కోలుకున్నాడు. ఆపై శుద్ధ సువార్ వర్గీయులు తయారు చేసిన దివ్య లేపనం (ఖొల్లి) ఒక వెండి పాత్రలో ఉంచి ఖొల్లి ప్రసాదంగా దైతపతి సేవకులకు అందజేయడంతో మహా ప్రభువు దేహానికి పూయడంతో స్వామి దేదీప్య శోభ క్రమంగా కాంతులీనుతుంది. ఖొల్లీ పూయడానికి ముందు భగవంతునికి దేహానికి సంబంధించి ఒక రహస్య ఆచారంలో భాగంగా గోప్యతను పాటిస్తూ దైతపతి, పతి మహా పాత్రో సేవకులు విగ్రహ దేహాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో రక్త వర్ణం వస్త్రంతో కప్పుతారు. దీని తర్వాత అమావాస్యకు ముందు చివరి ఘట్టంగా దైవ విగ్రహం దేహానికి ఖొల్లి దివ్య లేపనం పూత పూర్తి చేయడం ఆచారం. ●ఈ ఖొల్లీని శుద్ధ సువార్ వర్గం తమ ఇళ్లలోనే శుచి శుభ్రతతో తయారు చేస్తారు. ముందు రోజు రాత్రి సంధ్య ధూపం తర్వాత ఖొల్లీ తయారు చేసి శుద్ధ సువార్ కుటుంబంలో మహిళలు మట్టి పాత్రలో శుచిగా భద్రపరుచుతారు. ఘంటానాదం చెవిన పడడంతో రక్షణ కోసం స్వామిని ప్రార్థించి ఛాత్ర ఛాయలో సురక్షితంగా తరలించేందుకు సేవక వర్గానికి అందజేస్తారు. ఘంటానాదంతో ఛాత్ర ఛాయలో ఖొల్లీ పాత్రని అత్యంత జాగరూకతతో శ్రీ మందిరం ఏకాంత గదికి తరలించారు. జగన్నాథుడు, బలభద్ర స్వామి, దేవీ సుభద్ర అనే ముగ్గురు దేవతలకు ఒక్కో ప్రతినిధిగా ముగ్గురు సేవకులు ఊరేగింపుగా ఖొల్లీ తరలించి దైతపతి సేవకులకు అప్పగించిన తర్వాత రాత్రి పూట ఖొల్లీని స్వామి చవారి దేహంపై పూసి ఆపై రహస్య సేవలు నిర్వహిస్తారు. దేదీప్య కాంతులతో అశేష భక్త జనానికి ఏడాదిలో తొలి సారిగా ప్రసాదించే దర్శనం కావడంతో ఒణొసొరొ అనంతర తొలి దర్శనం నవ యవ్వన శోభతో నేత్రోత్సవంగా భక్త జన హృదయాల్లో నిత్యం కాంతులీనుతుంటుంది. ఘొణా లగ్గి సేవలో భాగంగా మూల విరాట్ల దేహానికి ఖొల్లీ దివ్య లేపనం పూర్తి కావడంతో శారీరక దారుఢ్యం నిర్ధారించుకుని శ్రీ ముఖ శృంగారాానికి మెరుగులు దిద్దడంతో స్వామికి నవ యవ్వన శోభ రంగరించుకుంటుంది. దీని కోసం దత్త మహా పాత్రో సేవకులు తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసిన ఖొడి ప్రసాదాన్ని సమర్పిస్తారు. -
సరిహద్దులో కోవిడ్ జాగ్రత్తలు
భువనేశ్వర్: పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో కోవిడ్ సంబంధిత రెండు మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒడిశా తన సరిహద్దు జిల్లాల్లో కోవిడ్ 19 నిఘాను ముమ్మరం చేసింది. వార్షిక రథ యాత్రకు ముందు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న ఒడిశాలోని అన్ని జిల్లాల ముఖ్య జిల్లా వైద్య అధికారులకు (సీడీఎంఓ) సూచనలు జారీ చేసినట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాథ్ మిశ్రా సోమ వారం తెలిపారు. నిఘాను ముమ్మరం చేసి కోవిడ్ 19 అనుమానిత కేసులన్నింటికీ జిల్లా కేంద్ర ఆస్పత్రులలో పరీక్షలు జరిగేలా చూడాలని వారిని కోరారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం కేసులు తగ్గినప్పటికీ ఒడిశా నిరంతర కోవిడ్ 19 నిఘాను కొనసాగిస్తోంది. అనుమానిత రోగులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.రాష్ట్రంలోనే అతి పెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటైన పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు పూరీని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 పట్ల నిఘా ప్రాముఖ్యత సంతరించుకుంది. యాత్ర సమయంలో ఎవరికై నా కోవిడ్ వంటి లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న కోవిడ్ 19 చికిత్సా విధానాలకు అనుగుణంగా పటిష్టమైన చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు జిల్లాలన్నిటినీ అప్రమత్తంగా ఉంచాలని ఆయా జిల్లాల ముఖ్య జిల్లా వైద్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ 19 వ్యాప్తి కట్టడి తప్పనిసరి నివారణ కార్యాచరణ కావడంతో ప్రజలు అనవసర సామాజిక సమావేశాలకు దూరంగా ఉంటు అవసరమైనప్పుడు మాస్కులు ధరించి తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు. జ్వరం, దగ్గు, నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు లేదా కోవిడ్ 19 అనుమానిత రోగితో సన్నిహితంగా మెలిగిన వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలి. వారు సూచించిన చికిత్సా విధానాలు మరియు ఆరోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి అని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాథ్ మిశ్రా అన్నారు. ఈ చర్యలు కేవలం ముందు జాగ్రత్త కోసమే. యాత్ర సీజన్లో ప్రజల భద్రతను నిర్ధారించడమే వీటి లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అవాంఛిత భయాందోళనకు గురి కావద్దని కోరారు. సరిహద్దు ప్రాంతాలు లేదా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి నివేదించబడిన ఏవైనా అనుమానిత కేసులపై అప్రమత్తంగా ఉంటూ తక్షణమే స్పందించాలని ఆరోగ్య శాఖ స్థానిక అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం మారుతున్న పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తగిన వైద్య మౌలిక సదుపాయాలు, పరీక్షా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది. -
చిత్రకొండ సమితిలో గ్రీవెన్స్కు 72 వినతులు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి కప్పతుటి పంచాయతీ కార్యాలయం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవా రం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 72 వినతులు స్వీకరించారు. వీటిలో కొన్ని వినతులను అక్కడికక్కడే పరిష్కరించాగా.. మరికొన్నింటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రధమేశ్ చిత్రకొండ సమితిలోని గుంఠబేఢ పంచాయతీ కందగూఢ గ్రామంలో ముఖ్యమంత్రి మక్కా మిషన్ కింద సాగు చేస్తున్న మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ,మెకనైజ్డ్ సీడ్–కమ్–ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ద్వారా నిర్వహిస్తున్న విత్తనాలు, ఎరువుల విత్తే ప్రక్రియపై సమీక్షించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతులకు వివరించారు. జిల్లా ఎస్పీ వినోద్, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరాథి సరబు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
ట్రక్ ఢీకొని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కొరాపుట్: ట్రక్ ఢీ కొని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. సోమవారం సాయంత్రం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి దబ్లాపారా గ్రామం వద్ద ఒకే బైక్ పై ఐదుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఇదే సమయంలో రాయిఘర్ నుంచి చత్తీస్గఢ్ వెళ్తున్న సీజీ 04 ఎంవై 1502 అనే ట్రక్ ఢీకొంది. సంఘటన స్థలంలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరిని ఉమ్మర్కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చత్తీస్గఢ్ రాష్ట్రం కరతాబెడా గ్రామానికి చెందిన బాబులాల్ గొండో (50) కస్కాంగా పంచాయతీ హిరి గ్రామానికి వచ్చారు. తిరిగి తన గ్రామానికి తన కుటుంబ సభ్యులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో తన ఆరు, ఏడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు అక్కడే చనిపోయారు. వెంటనే కుందేయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రక్ని స్వాధీనం చేసుకున్నారు. -
కేరళంలో రోడ్డు ప్రమాదం
● రాయగడ జిల్లావాసి మృతి రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితికి చెందిన వలస కార్మికుడు కేరళంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు చంద్రగిరి గ్రామపంచాయతీ పరిధిలోని తలపత్రి గ్రామానికి చెందిన జులార మాఝి (55)గా గుర్తించారు. గత ఏడాది కేరళంలోని పాలక్కాడ్ ప్రాంతంలో ఉన్న క్రషర్ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. ఈ నెల 12వ తేదీన విధులు ముగించుకుని ఇతర కార్మికులతో కలిసి తమ వసతి గృహానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఎదురుగా ప్రయాణికులతో వచ్చిన బస్సు జులార మాఝిను బలంగా ఢీట్టడంతో సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. ప్రమాద సమాచారాన్ని రాయగడ జిల్లా కార్మిక శాఖ అధికారికి బాధిత కుటుంబీకులు తెలియజేశారు. స్పందించిన కార్మిక శాఖ అధికారి విష్ణు నాయక్ కేరళం సంబంధిత శాఖ అధికారులను సంప్రదించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్మిక శాఖ తెలియజేసింది. -
న్యాయ స్థానాలకు బాంబు బెదిరింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో సోమవారం 2 న్యాయ స్థానాలకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. యంత్రాంగాన్ని పరుగులు తీయించింది. న్యాయ స్థానం ఆవరణలో సాధారణ ప్రజానీకం, సిబ్బంది బెంబేలెత్తారు. పోలీసులు, బాంబు నిర్వీర్య సిబ్బంది హుటాహుటిన బాంబు బెదిరింపు ప్రాంగణాలకు చేరారు. అంగుల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపుతో కూడిన ఒక ఈ–మెయిల్ కలకలం రేపింది. ఆ ఈమెయిల్ అందిన తర్వాత కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. బాంబు నిర్వీర్య బృందంతో డాగ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణానికి చేరి తనిఖీలు చేపట్టారు. సంబల్పూర్ కోర్టుకు బెదిరింపు సంబల్పూర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపుతో కూడిన ఒక ఈ–మెయిల్ వచ్చింది. రిజిస్ట్రార్కు బెదిరింపు ఈ–మెయిల్ అందింది. కోర్టు ప్రాంగణంలో పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలను మోహరించారు. కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, గాలింపు చర్యలు చేపట్టారు. -
వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ బ్లాక్ అల్లడ పంచాయతీలో పలు సమస్యలను సోమవారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్యటించి తెలుసుకున్నారు. అల్లడ గ్రామపంచాయతీలో ఘనసాగర్ గ్రామం, లెంతగుడ, మంజిల్ గుడ, కోడాగుడ, డిడింగుడ, వంటి అనేక ఆదివాసీ గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ముఖ్యంగా అల్లడ గ్రామ పంచాయతీ నుంచి అరమొడా గ్రామం వరకు పక్కా రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే రూపేష్ వద్ద ప్రజలు విన్నవించారు. కాశీనగర్ బ్లాక్లో ఉన్న అల్లడ పంచాయతీలో ప్రాథమిక విద్య, రవాణా, ఆరోగ్యం, తాగునీరు, రోడ్డు సౌకర్యం, సాగునీరు, డ్రైనేజీ నిర్మించాల ని కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మను కోరారు. సర్పంచ్ గోపాల్ శోబోరో, సమితి సభ్యురాలు పద్మినీ శోబోరో, జగన్నాథ సాహు, తదితరులు పాల్గొన్నారు. జయపురం: జయపురం సమితి పుట్రగుడ గ్రామంలో జయపురం తెలుగు సంస్కృతిక సమితి వారి సిటీ ఉన్నత పాఠశాల ఎకో క్లబ్, ఎనర్జీ క్లబ్ విద్యార్థులు, జయపురం షోషియల్ ఎన్విరోన్మెంటల్, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అషో షియేషన్ (సీవా)స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఆదివారం వనమహోత్సవం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీవా కార్యకర్తలు, గ్రామస్తులు కలిసి పుట్రగుడ పరిసరాలలో వివిధ జాతుల మొక్కను నాటారు. పాఠశాల ఎకో క్లబ్ ఇన్చార్జి ఉపాధ్యాయుడు, సీవా కార్యదర్శి ప్రతాప్ కుమాఇర్ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. భువనేశ్వర్: స్థానిక చంద్రశేఖర్ పూర్ ప్రాంతంలో సోమవారం ఒక నివాస అపార్ట్మెంట్ సముదాయ ప్రాంగణంలో 11వ తరగతి విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తోటి విద్యార్థినిని కలిసిన తర్వాత దాక్కునే ప్రయత్నంలో ఆ బాలుడు సర్వీస్ డక్ట్ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుడిని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రోఫాన్ ఖురేషిగా గుర్తించారు. భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా కథనం ప్రకారం.. తన తోటి బాలిక విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను కలవడానికి అతను జల వాయు అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఇంతలో మధ్యాహ్నం పూట బాలిక తల్లి ఇంటికి తిరిగి రావడంతో అక్కడ కలకలం రేగింది. రోఫాన్ బాత్రూంలో దాక్కుని ఎవరికీ కనపడకుండా ఉండేందుకు దాని పక్కనే ఉన్న సర్వీస్ డక్ట్లోకి ప్రవేశించి ఉంటాడని అనుమానిస్తున్నారు. దర్యాప్తు సమయంలో తొమ్మిదో అంతస్తులోని సర్వీస్ డక్ట్ సమీపంలో వేలాడుతున్న బాలుడి బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతను ఆ ప్రాంతం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉండవచ్చనే అనుమానం బలపడింది. శాసీ్త్రయ బృందం అపార్ట్మెంట్ సముదాయానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించింది. మృత దేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపారు. ఆ బాలుడి మరణానికి దారి తీసిన సంఘటనల కచ్చితమైన క్రమాన్ని నిర్ధారించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పర్లాకిమిడి: ఒడిశా పి.సి.సి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆదేశాల మేరకు స్థానిక సోండివీధి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్, కాశీనగర్ ఎన్.ఏ.సి కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. గంజాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రశ్మిరంజన్ పట్నాయక్, గజపతి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రధాన్, రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడు శుబేంధు మహాంతి, టౌను షెడ్యుల్డ్ ట్రైబ్ జిల్లా అధ్యక్షుడు పాపారావు, బసంత్ పండా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రంజితా పాణిగ్రాహిలను సన్మానించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు రశ్మిరంజన్ పట్నాయక్, అనంతరం కొత్తగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్వీకరించిన బ్లాక్, టౌన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎన్.ఏ.సి. (కాశీనగర్) నాయకులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పర్లాకిమిడి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ పాత్రో, రాయఘడ బ్లాక్ అధ్యక్షులు జి.శ్రీనివాస రావు, కాశీనగర్ నగరపాలక అధ్యక్షులు బసంత పండా, రాంప్రసాద్ పట్నాయక్, బి.జనార్దన రావు, లలిత్ మోహాన్ దండసేన, సుదర్శన పండా, అభిమన్యు పండా, తదితరులు పాల్గొన్నారు. -
విద్యావిధానంలో లోపాలపై బీజేడీ ఆందోళన
రాయగడ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) పాఠ్యపుస్తకాలలొ చోటు చేసుకున్న తప్పిదాలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై బీజేడీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక నేతృత్వంలో జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టింది. స్థానిక కపిలాస్ కూడలి నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఊరేగింపుగా నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో బీజేడీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద సుమారు గంట సమయం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠ్య పుస్తకాల్లో జాల్ముడి, నిముడ వంటివి చోటు చేసుకోవడం విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందని జగన్నాధ సరక అన్నారు. సుమారు రెండు వేలకుపైగా తప్పులు వెలుగు చూడటం అత్యంత బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతపెద్ద ఎత్తున తప్పిదాలు ఎలా జరిగాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని అన్నారు. ఈ కేసులో బాధ్యులపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండో, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిల దిష్టిబొమ్మలను దహనం చేసిన బీజేడీ నాయకులు విద్యావ్యవస్థను గందరగోళానికి గురిచేసిన బాధ్యతను స్వీకరిస్తు ఇద్దరు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేడీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, పృథ్వీరాజ్ సాహు, పట్నాన గౌరీశంకర్, బినాయక్ పోలాయ్, దేశాశీష్ ఖడంగ, జగదీష్ పాత్రో, గుణుపూర్ శాసనసభ నియోకజవర్గం మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గోమాంగో తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
రాయగడ: ఓటరు జాబితాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతతో పాటు ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని అర్హులను గుర్తించి ఓటరు జాబితాలో చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతీ పోలింగ్ బూత్లో అర్హులైన యువ ఓటర్లు, నమోదు కాని ఓటర్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం అమలాభట్ట మోడల్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటీఐలో యువ ఓటర్ల అవగాహన, నమోదు శిబిరాలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమర్ జెన్న ఆధ్వర్యంలో రాయగడ బిడిఓ సుజిత్ కుమార్ మిశ్రో, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఓటరు నమోదు ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని సెక్షన్ 16, 19 ప్రకారం ఓటరుగా నమోదు కావడానికి అవసరమైన అర్హతలు, అనర్హతలు, సెక్షన్ 17, 18 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ఉన్న నిబంధనలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామ్ మహాపాత్రో, రాజకీయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంయుక్త మాఝి ఓటరు గురించి వివరించారు. ముసాయిదా ఓటరు జాబితా జులై 5న విడుదల కాగా.. కొత్తగా పేరు నమోదు, సవరణలు, అభ్యంతరాల కోసం ఆగష్టు 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
పర్లాకిమిడి గుండిచా మందిరం వద్ద ఆక్రమణల తొలగింపు
పర్లాకిమిడి: రథయాత్ర సమీపిస్తుండంతో పట్టణంలో గుండిచా మందిరం వద్ద ఉన్న ఆక్రమణలను జిల్లా అధికారులు పోలీసులు, సబ్ కలెక్టర్, తహసీల్దార్, మేజిస్ట్రేట్ సహకారంతో సోమవారం తొలగించారు. రాజవీధిలో కూడా అనేక ఆక్రమణలు ఉన్నాయని వాటిని మంగళవారం నోటీసులు ఇచ్చి తొలగిస్తామని సబ్కలెక్టర్ అనుప్ పండా అన్నారు. రాజవీధి శ్రీజగన్నాథ మందిరం నుంచి ఫర్లాంగు దూరంలో ఉన్న గుండిచామందిరం వరకూ ఉన్న ఆక్రమణలు, తోపుడు బండ్లు, మెకానికల్ గ్యారేజిలను తొలగించి జగన్నాథ రథాలు సురక్షితంగా గుండిచా మందిరానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తహసీల్దార్ నారాయణ బెహారా తెలియజేశారు. ఈ తొలగింపులో మోడల్ పోలీస్స్టేషన్ అధికారి (ఐఐసి) ప్రశాంత భూపతి, పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొన్నారు. -
అందరి అభిమానంతోనే ‘బిజు స్వాభిమాన్ మంచ్’
రాయగడ: బీజేడీ గుడ్ బై చెప్పి బిజు స్వాభిమాన్ మంచ్ను ఏర్పాటు చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. అందరి అభిమానంతోనే బీఎస్ఎం ఆవిర్భవించిందన్నారు. సోమవారం జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్లో నిర్వహించిన భారీ సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజు స్వాభిమాన్ మంచ్ తన ఉనికిని చాటుకునేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. అందుకు అందరి సహాయ, సహాకారాలు అవసరమన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎన్నో పదవులను అలంకరించానన్నారు. బీజేడీకి గుడ్ బై చెప్పడంతో తన వెంట ఉన్నవారి కోసం తాను నిరంతరం పోరాడటంతోపాటు వారిని ఒక తాటిపై నడిపించాలన్న సదుద్దేశంతోనే బిజు స్వాభిమాన్ మంచ్ను ప్రారంభించానన్నారు. తనపై నమ్మకాన్ని ఉంచుకున్న అభిమానుల వెంట తాను ఉండేందుకు ఆవిర్భవించిన ఈ పార్టీ ద్వారా రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించారు. బిజుపట్నాయక్ ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించిన బిజు స్వాభిమాన్ మంచ్ ఇకపై ఎన్నికల రంగంలో కూడా దూసుకువెళుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి అనూమ్యమైన స్పందన లభించడంతో బిజు స్వాభిమాన్ మంచ్ కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు నడుం బిగించామన్నారు. జిల్లాలో గల 11 సమితుల్లో సమావేశాలను నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే రాయగడ, కొలనార సమితుల్లో బిజు స్వాభిమాన్ మంచ్ సమావేళాలను నిర్వహించడం పూర్తయ్యిందన్నారు. మీరు నా వెంట ఉంటే నేను మీ రాజకీయ భవిష్యత్ను మార్చి వేస్తానని ప్రకటించారు. తనకు ఎటువంటి పదవులపై ఆశలేదని స్పష్టం చేశారు. తన జీవితాన్ని తనను నమ్ముకుని ఉన్న వారికి అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. సమాయత్తమవ్వాలి.. రాష్ట్ర మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక మాట్లాడుతూ.. బిజు స్వాభిమాన్ మంచ్లో ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే నెక్కంటి ఏర్పాటు చేశారన్నారు. అతని వెంటే తామంతా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్ఎం (బిజు స్వాభిమాన్ మంచ్) కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. తన ఉనికిని చాటుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. అందుకు అంతా సమాయత్తమవ్వాలని పిలపునిచ్చారు. అందరి వాడిలా.. చంద్రపూర్లో జరిగిన సమావేశంలొ పాల్గొన్న మాజీ ఎంపి నెక్కంటి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరికలు సమావేశానికి ముందు చంద్రపూర్ చేరేసరికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ గల ఒక చిన్న టీ దుఖానంలో టీ తాగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అందరి వాడిలా తాను మీ వాడినేనని నిరూపించుకున్నారు. కార్యక్రమంలో బిజు స్వాభిమాన్ మంచ్ నాయకులు రాయగడ సమితి ఛైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్, జిల్లా పరిషత్ సభ్యురాలు సంధ్యా పులక, దూడల శ్రీనివాస్, సామల్, అభిమానులు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న ఫోన్లు యజమానుల చేతుల్లోకి..
● 100 ఫోన్లు గుర్తించి అప్పగించిన పోలీసులు రాయగడ: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లు తిరిగి దొరకదనే భావనలో ఉన్న బాధితులకు జిల్లా పోలీసులు తీపి కబురు చెప్పారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిల్లో పోయిన లేదా చోరీకి గురైన వంద మొబైల్ ఫోన్లను సైబర్ విభాగం సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకుని.. వాటిని అసలైన యజమానులకు సోమవారం అందజేశారు. జిల్లాలోని చందిలి రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజ్ ప్రసాద్ సమక్షంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో మోబైల్ ఫోన్లను బాధితులకు పంపిణీ చేశారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ సెల్ అధికారులు మోబైల్ ఫోన్లను ట్రాక్ చేసి వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజ్ప్రసాద్ మాట్లాడుతూ.. ఎవరిదైనా మోబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్లో కూడా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోయిన మోబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోయిన ఫోన్లను తిరిగి అందించిన పోలీస్ శాఖకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రీవెన్స్సెల్లో 71 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సమావేశం హాల్లొ సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 71 వినతులను స్వీకరించారు. ఇందులొ 21 గ్రామ సమస్యలు కాగా మిగతా వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. 13 సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు. మరో ముగ్గురుకి రెడ్ క్రాస్ నుంచి రూ. 5 వేల చొప్పున్న ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఎస్పీ రాజ్ ప్రసాద్, జిల్లా పరిషత్ అదనపు ముఖ్యకార్యనిర్వాహక అధికారి క్షీరాబ్ధి తనయ సాహు పాల్గొన్నారు. సృజనాత్మకత పోటీలపై అవగాహన జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్ పోటీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పోటీ 2026 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వ విద్యాలయ పీజీ కోర్సు అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు పెంచుకోవాలని, స్థానిక, సామాజిక సమస్యల పరిష్కారానికి కొత్త పరిష్కారాలు కనుగొనాలని ఉద్బోధించారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ వాణిజ్య విభాగ ఆచార్యులు, పోటీ 2025 కోఆర్డినేటర్ సచిన్ కుమార్ నాయిక్ ఒడిశా ప్రభుత్వ స్టాఫ్ ఆఫ్ పోటీ 2026 లక్ష్యాలను వివరించారు. పోటీల్లో పోటీ ప్రక్రియ, అర్హతలు, విభాగాలు, మూల్యాంకనం, ప్రతిపాదన సమర్పణ ఉంటాయని ఇవి మూడు దశలలో నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో సింగిల్ పాయింట్ కాంట్రాక్ట్ అధికారి డాక్టర్ అరుణ కుమార్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వివిద విభాగాల నుంచి 100 మందికిపైగా డిగ్రీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్ సెల్కు స్పందన
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ జాయింట్ గ్రీవెన్స్ సెల్కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్ సి.డి.ఓ దయామయ పాడీ, జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీఓ అంశుమాన్ మహాపాత్రో, తదితరులు హాజరయ్యారు. 31 వినతులు అందాయి. అందులో వ్యక్తిగతం 14, వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 17 ఉన్నాయి. జిల్లా సామాజిక సురక్ష, దివ్యాంగుల సశక్తీకరణ విభాగం ద్వారా ముగ్గురికి మధుబాబు పింఛన్లను కలెక్టర్ అందజేశారు. ప్రజా వినతులను త్వరితగతిన పరిష్కరించాలని రాయఘడ బ్లాక్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్కు రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, వైస్ చైర్మన్ జ్యోతి ప్రసాద్ పాణి, బి.డి.ఓ సురేష్ కుమార్ బారిక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ మాజీ ఈఈ ఆస్తులపై విజిలెన్స్ దాడులు
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో గతంలో ఐటీడీఏ ఈఈగా పనిచేసిన సంజయ్ కుమార్ కసిపట్టా ఆస్తుల లక్ష్యంగా విజిలెన్స్ విభాగం దాడులు చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల ఈ దాడులు జరిగాయి. సంజయ్ ప్రస్తుతం ఓసీసీ లిమిటెడ్, భువనేశ్వర్లో ఈఈగా పనిచేస్తున్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో సొంత నివాసం, పట్టణంలో నాలుగంతస్తుల భవనం, కుంబా–2 నిర్మితం అవుతున్న భవనం, సుందర్గఢ్లో తల్లితండ్రుల నివాసం, సుందర్గఢ్లో నిర్మితం అవుతున్న మరో భవనం, భువనేశ్వర్, బలంగీర్ లలో ప్రభుత్వ నివాస గృహాల్లో దాడులు జరిగాయి. జయపూర్ విజిలెన్స్ కోర్టు ప్రత్యేక అనుమతి తో ఆరుగురు డీఎస్పీలు, 8 మంది ఇన్స్పెక్టర్లు, ఏడుగురు ఏఎస్ఐలు ఈ దాడుల్ల పాల్గొన్నారు. ఈ దాడుల్లో 23 గదుల మరో భవనం, 8 అత్యధిక విలువ గల జాగాలు, ఒక నాలుగు చక్రాల వాహనం గుర్తించారు. 2011 లో కేవలం రూ..9,300 జీతానికి కొరాపుట్ జిల్లా నారాయణపట్న లో ప్రభుత్వ విధులలో చేరిన సంజయ్ కోట్లాది రూపాయల అక్రమార్జన విజిలెన్స్ అధికారులను నివ్వెర పరిచింది.ఈ దాడులు ఇంకా కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రకటించారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
ఇచ్ఛాపురం పట్టణంలోని ప్రరభుత్వ పాఠశాలలో 1991–92లో చదివిన పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 35 సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులంతా ఒకరినొకరు పలకరించుకుని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరపటి రాజలక్ష్మి, కేశరావు, కె.మోహన్రావు, ఢిల్లీరావు, శంకర్రావు, రాము, తాయారమ్మ, జ్ఞానేశ్వరి, ఉమామహేశ్వరి, ద్రాక్షావతి, లక్ష్మి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. – ఇచ్ఛాపురం -
ఫుట్బాల్ చాంపియన్గా మల్కన్గిరి
జయపురం: జయపురం జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అవిభక్త కొరాపుట్ జిల్లా ఫారెస్టు డిపార్ట్మెంట్ నిర్వహించిన ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలలో మల్కన్గిరి ఫారెస్ట్ డివిజన్ టీమ్ విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. మల్కన్గిరి, నవరంగపూర్, కొరాపుట్, రాయగడ, జయపురం జిల్లాల ఫారెస్టు డివిజన్ల నుంచి 8 టీములు పోటీల్లో పాల్గొన్నాయి. మల్కన్గిరి ఫారెస్ట్ డివిజన్ మాస్టర్స్ టీమ్, కొరాపుట్ జిల్లా ఫారెస్ట్ విభాగ హైలాండర్ష్ టీమ్లు ఫైనల్కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలలో రెండు టీమ్లు హోరాహోరీగా పోరాడాయి. నిర్ణీత సమయానికి రెండు టీమ్లు ఒక్కొక్క గోలు చేయక పోవటంతో ఆట డ్రా అయింది. తరువాత ఫెనాల్టీ షూట్ ఔట్లో కూడా గెలుపు లక్ష్యంతో ఆడాయి. మల్కన్గిరి ఫారెస్టు డివిజన్ మాస్టర్స్ టీమ్ను విజయం వరించింది. మల్కనగిరి టీమ్ 4–3 గోల్స్తో చాంపియన్గా నిలిచింది. ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఫారెస్ట్ సర్కిల్ రీజనల్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ డాక్టర్ పశుపతి చాంపియన్ టీమ్కు ట్రోఫీని అందజేశారు. రన్నర్ జట్టుకు ట్రోఫీ అందజేసి సత్కరించారు. -
ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం
జయపురం: తెలుగు సాంస్కృతిక సమితి జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ‘జనాభా మరియు పర్యావరణ అవగాహణ’ అనే అంశంపై చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలుగా స్వేతా సింగ్(9 వ తరగతి) వి.సుప్రియ (10వ తరగతి), ఎ.జ్ఞానేశ్వరి(10వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. 9వ తరగతి విద్యార్థినికి ప్రత్యేక బహమతి లభించింది. ఇకో క్లబ్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయక్ పర్యవేక్షణంలో నిర్వహించబడిన కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి.సుజాత, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు పి.శశిభూషణ పట్నాయక్, ఉపాధ్యాయులు సుశ్మిత పాత్రో, కె.పద్మాదేవి, వందిత పాణిగ్రహి, సి.హెచ్.మానసి పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం, పాత బాలాజీ ఆలయ ప్రాంగణంలోనూ విద్యార్థులు మొక్కలు నాటారు. -
జానకి మృతికి గవర్నర్ సంతాపం
భువనేశ్వర్: శ్రోతల హృదయాల్లో చోటు చేసుకున్న దిగ్గజ గాయని ఎస్.జానకి మరణం తీవ్రంగా కలిచి వేసిందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. లెజండరీ సింగర్ మృతికి సంతాపం తెలియజేశారు. సౌందర్యం, గాంభీర్యం, భావోద్వేగం కలగలిసిన తన కంఠంతో ఆమె సృష్టించిన వారసత్వం తరతరాల మధుర స్మృతులలో చెరగని ముద్ర వేసిందని శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాన కోకిల మృతికి సంతాపం పర్లాకిమిడి: గాన కోకిల సిట్ల జానకి మృతి సినీప్రపంచానికి తీరని లోటని చైతన్య సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు కోండా రామారావు అన్నారు. జానకి సంతాప సభను కేవుటివీధిలోని ఆయన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేశారు. పలువురు చైతన్య సమితి సభ్యురాలు రేణుక.. జానకి పాడిన మధురమైన పాటలను ఆలపించారు. తెలుగు, మళయాలం, తమిళం, ఒడియా, హిందీ, కన్నడ తదితర భాషలో 48 వేలకు పైగా పాడిన మధురగాయనీ జానకి మృతి అభిమానులకు తీరని లోటని కార్యదర్శి బర్నాల జనార్దనావు అన్నారు. అల్యాన వినయ్కుమార్, మురళీ బెహారా, ఎన్.రేణుక, గణేష్ పట్నాయిక్, గంటా నానాజీ, ఎన్. సంపత్కుమార్ పాల్గొన్నారు. -
రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు గంజాయి అక్రమ రవాణా గుట్టును రట్టు చేసి భారీ విజయం సాధించారు. శనివారం రాత్రి ఐఐసీ ప్రభుదత్త బిస్వల్ ఆదేశాలతో ఎస్ఐ ప్రశాంత్ కుమార్ సాబత్ నాయకత్వంలో పోలీసుల ప్రత్యేక బృందం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అటవీ ప్రాంతంలో గంజాయిని దాచిపెట్టినట్టు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బోడిగేటా–బేజాంగ్వాడ గ్రామాల మధ్య అడవిలో గంజాయి బస్తాలు తరసపడ్డాయి. దీంతో 41 బస్తాల్లో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కలిమెల తహసీల్దార్ రామకృష్ణ సత్య రాజగురు సమక్షంలో తూకం వేయగా మొత్తం ఒక 1015 కిలోలు ఉన్నట్లు తేల్చారు. దీని విలుల బహిరంగ మార్కెటో సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ గంజాయి ఎవరిదో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రమాదాల నివారణపై శిక్షణ ప్రమాదాల నివారణపై శిక్షణ ఇచ్చారు. రాయగడలో శిక్షణ సాగింది. –8లోu
జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరిగింది. జయపురంలో కార్యక్రమం నిర్వహించారు. –8లోu● జయహో జగన్నాథభువనేశ్వర్: పూరీలో శ్రీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. చక్రాల నుంచి శిఖరం వరకు ప్రధాన పనులు దాదాపు ముగిశాయి. రథాల శిఖరంపై వాలు మెడ పచ్చని చిలుకలు, కలశం ఏర్పాటు పూర్తి చేశారు. శిఖరంపై చిట్ట చివరి ఈ ఏర్పాటు అత్యంత కీలంగా భావిస్తారు. ఈ దశ పనులు విజయవంతం కావడంతో సేవకుల వర్గం శ్రీ జగన్నాథుని జయహో జగన్నాథ నినాదంతో గుండెలు మారుమోగినట్లు ప్రార్థించారు. రథాలకు అమర్చిన ప్రభలు కొత్త కాంతులతో కళకళలాడుతున్నాయి. -
యాప్సోపాలు
అన్నదాతకు..● యూరియా, డీఏపీ కొనేందుకు కష్టాలు ● ఓటీపీ వస్తేనే ఎరువుల విక్రయం ● కౌలు రైతులకు పూర్తిగా ఎరువులు లేనట్లే.. గార : కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతునే ఉన్నాయి. ముఖ్యంగా ఖరీఫ్లో ఎరువులు(యూరియా, డీఏపీ) అందడం పెద్ద ప్రహసనంగా తయారయ్యింది. గంటల తరబడి క్యూలైన్లో ఉండటం, బస్తా యూరియా కావాలంటే అదనంగా రూ.300 చెల్లించడం వంటివి రెండేళ్లుగా కొనసాగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కలగడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్లో యూరియా, డీఏపీ అమ్మకాలను శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు అందించాలని నిర్ణయించి ఏపీఏఐంఎస్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) 2.ఓ అనే యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా మాత్రమే ఎరువులు అమ్మాలని నిర్దేశించింది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 30 మండలాల్లో 3,62,325 మంది రైతులుండగా, ఈ ఏడాది 5లక్షల 60 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వెబ్సైట్లో ఆధార్ ఎర్రర్, భూ విస్తీర్ణంలో తక్కువ చూపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జాయింట్ ఎల్పీఎం రైతుల వివరాలు యాప్లో నమోదు చేయకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. 20 సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పూర్తిగా ఎరువు ఇవ్వడం లేదు. వారంతా కాంప్లెక్సు ఎరువులపైనే ఆధారపడాల్సిందే. ఓటీపీ ఇస్తేనే.. యాప్ ఆధారిత ఎరువుల పంపిణీలో రైతు భూమి వివరాలు పక్కాగా నమోదై ఉండాలి. కచ్చితంగా ఆధార్ సీడింగ్లో ఏ ఫోన్ నంబర్ ఉందో, వాటికే ఓటీపీ వస్తుంది. వాస్తవానికి సగం మంది రైతుల వద్ద ఫోన్ సౌకర్యం తక్కువే ఉంటోంది. వారి కుటుంబ సభ్యులకు నంబరుకు ఓటీపీ వెళ్లడంతో సకాలంలో చెప్పే వీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా వేలిముద్రలు ద్వారా పంపిణీ చేయాలని కోరుతున్నారు. భూమి విస్తీర్ణంలో కొంతే.. రైతుల భూమి విస్తీర్ణం పూర్తిస్థాయిలో పాస్బుక్లో నమోదు కావడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ శాఖ రైతు యాప్ డౌన్లోడ్ చేసుకొని భూమి విస్తీర్ణం నమోదు చేసుకోవచ్చని బెబుతున్నా క్షేత్రస్థాయిలో కష్టతరంగా ఉంది. దీంతో యాప్లో చూపిన భూమికి మాత్రమే ఎరువు అందిస్తారు. కౌలు రైతులకు మొండిచెయ్యి.. కొత్త విధానం ద్వారా కౌలు రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది 90,600 మంది కౌలు రైతులు 2లక్షల 50 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని ప్రాథమిక అంచనా. వీరిలో సగం మందికి ఎరువులు అందే పరిస్ధితి లేదు. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో 9650 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేస్తున్నారని అంచనా. వీరికీ ఎరువులు అందడం అనుమానమే. -
● తీపి కబురు
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు సోదర సోదరీ సమేతంగా ఆరోగ్యంతో కోలుకున్నాడు. జ్యేష్ట పూర్ణిమ మొదలుకొని స్వామి అస్వస్థతకు గురై తెర చాటున గోప్య సేవలు, ఉపచారాలు పొందుతున్న విషయం తెలిసిందే. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షనలో రాజ వైద్య వర్గం అందించిన సేవలతో స్వామి కోలుకున్నాడు. జగతి నాథుని ఆరోగ్యం పట్ల కలవరపరడుతున్న పూరీ గజపతి మహా రాజాకు రాజ వైద్య వర్గం తీపి కబురు చేర్చింది. పవిత్ర త్రయోదశి పురస్కరించుకుని ఆది వారం రాజ ప్రసాద్ విజే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గజపతి మహా రాజాకు శ్రీ జగన్నాథుడు ఆరోగ్యంతో కోలుకున్న విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ అంగాలకు సమర్పించిన ఇతర వస్తువులను గజపతి మహా రాజాకు అందజేశారు. -
రథయాత్ర భద్రతపై సమీక్ష
భువనేశ్వర్: ఈ నెల 16న జరగనున్న ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథ యాత్ర ఆటంకాలు లేకుండా, క్రమబద్ధంగా జరిగేలా చూడాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన పూరీలోని టౌన్ హాల్ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ పోలీసు, పరిపాలనా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రథ యాత్రను శాంతియుతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని డీజీపీ ఖురానియా తెలిపారు. ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు పూరీని సందర్శిస్తారని అంచనా. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరంలోని 8 వేర్వేరు ప్రదేశాలలో కొత్త పార్కింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేశారు. భక్తులకు సరైన సేవలు, భద్రత కల్పించడానికే ప్రాధాన్యత ఇస్తామని డీజీపీ తెలిపారు. రథ యాత్ర విధులకు అనుభవజ్ఞులైన పోలీసు అధికారులను నియమించారు. ఉత్తర ఛక్, పూరీ–కోణార్క్ రోడ్, నగరంలోని ఇతర ప్రధాన వీధుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రముఖుల రాకపోకలు, జన సందోహం నిర్వహణ, కార్డన్ వ్యవస్థపై ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆర్. పి. కోచె ప్రసంగించారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టంగా, సమన్వయంతో తీర్చిదిద్దేందుకు అధికారులందరూ ఒకరితో ఒకరు నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని, భక్తుల పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని ఆధునీకరణ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సౌమేంద్ర ప్రియదర్శి కోరారు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు కేటాయించిన పోస్టులను విడిచిపెట్టకూడదని ఆయన అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరంగా, క్రమశిక్షణతో ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, జన సమూహ నియంత్రణ, ప్రముఖుల పర్యటనలు, ప్రజా భద్రత పరస్పరం ముడిపడి ఉన్నాయని రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ అన్నారు. సమావేశానికి అదనపు డైరెక్టర్ జనరల్ (ఎస్ఏపీ) రాజేష్ కుమార్, ఇనస్పెక్టర్ జనరల్ (క్రైమ్) డాక్టర్ సార్థక్ షడంగి, ఇనస్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) డాక్టర్ దీపక్ కుమార్, ఇనస్పెక్టర్ జనరల్ (శిక్షణ) అనూప్ కుమార్ సాహు, ఇనస్పెక్టర్ జనరల్ (నార్త్ సెంట్రల్) సత్యబ్రత్ భోయ్, డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ (ప్రొవిజనింగ్) చరణ్ సింగ్ మీనా, డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ (ఎస్టీఎఫ్కె) విశాల్ సింగ్, డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ (తూర్పు) పినాక్ మిశ్రా మరియు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ (క్రైమ్) బి. గంగాధర్, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్, ఇనస్పెక్టర్ జనరల్ (సెంట్రల్) డాక్టర్ సత్యజిత్ నాయక్ హాజరయ్యారు. -
14న పరిమితంగా నవ యవ్వన దర్శనం
● 15న ఆలయ సందర్శన నిలిపివేతభువనేశ్వర్: ఆచారపరమైన అవసరాల కారణంగా ఈ సంవత్సరం పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో సోదర దేవతల నవ యవ్వన దర్శనం వ్యవధి సాధారణం కంటే తక్కువగా ఉంటుందని శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆలయంలో నిర్దేశించిన ఆచారాల కారణంగా జూలై 14వ తేదీ సాయంత్రం జరగాల్సిన నవ యవ్వన దర్శనం భక్తులకు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. ఆలయ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఉభ అమావాస్య కారణంగా జూలై 15న దేవతా దర్శనం మూసివేస్తామని ప్రకటించారు. అనధికారిక వ్యక్తులకు కట్టడి ఈ ఏడాది రథాలపైకి అనధికార వ్యక్తులను ఎవరినీ అనుమతించరు. రథాల వద్దకు అనధికారికంగా ప్రవేశించడానికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కార్డన్ పాస్ విధానాన్ని యంత్రాంగం కఠినంగా అమలు చేస్తుందన్నారు. అనుమతి లేకుండా నిషేధిత కార్డన్ ప్రాంతంలోకి ప్రవేశించిన వారిని గౌరవప్రదంగా బయటకు తొలగిస్తారు. రథాలపై మొబైల్ ఫోన్లపై ఆంక్షలను పునరుద్ఘాటిస్తూ సేవకులతో సహా రథాలపై ఎవరినీ మొబైల్ పరికరాలను ఉపయోగించడానికి అనుమతించరు. యాత్ర సమయంలో ఈ ఆదేశం అమలు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని నియమించారు. ఈ సంవత్సరం పూజా కార్యక్రమాలు అధికంగా ఉన్నందున జూలై 14న నవ యవ్వన దర్శనం లేదా నేత్రోత్సవం దర్శన సమయం తక్కువగా ఉంటుంది. ఈ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామి వారి రథ యాత్ర సమీపిస్తున్నందున సేవకులు, ఛొత్తీశా నియోగులు మరియు శ్రీ మందిరం నిర్వహణ కమిటీ స్వామి వారి పూజా కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందువల్ల గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం నేత్రోత్సవం లేదా నవ యవ్వన దర్శనం కోసం టిక్కెట్లతో కూడిన ఆర్జిత దర్శనం లేదా సహన మేళ (సర్వ దర్శనం) తక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఇందు కోసం ప్రతి ఒక్కరూ సహకరించి, సహాయపడి, సమన్వయం పాటించాలని సీఏఓ వినయ పూర్వకంగా అభ్యర్థించారు. ఉత్సవ సన్నాహాల్లో భాగంగా ఈ ఏడాది రథం లాగేందుకు 2 సెట్ల తాళ్లను ఏర్పాటు చేసినట్లు ఎస్జేటీఏ ముఖ్య నిర్వాహకుడు తెలిపారు. -
గాయని జానకి మృతికి సంతాపం
పాతపట్నం: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతి తెలుగు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అని డి.వి.సుబ్బారావు కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏ.హరిబాబు అన్నారు. పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలోని షిర్డీగిరిపై సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ ఆదివారం నిర్వహించారు. జానకి చిత్రపటానికి పూలుమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ సుమారు 50 వేల పాటలు పాడిన జానకి గొప్ప గాయకురాలిగా చరిత్రలో చిరస్మరణీయురాలిగా నిలిచిపోతారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దింటి మోహన్దాస్, ప్రధాన సలహాదారుడు శాసనపూరి మధుబాబు, వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ట ఆంజనేయులు, సహాయ కార్యదర్శి బాడాన షణ్ముఖరావు, కార్యనిర్వహణ అధ్యక్షుడు కొన వెంకటరమణ, సింగర్ ఎస్పీ మిశ్రా, సంపతరావు, కృష్ణారావు, సోమేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఆమ్లెట్ గొడవ
శ్రీకాకుళం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలోని ఆదివారంపేటలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మేన్గా పనిచేస్తున్న కోనాడ నాగరాజు పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందిన షర్మిల(26)ను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. నాగరాజు తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారంపేటలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమ్లెట్ వేయనందుకు..! నాగరాజు కాస్త అమాయకుడు కావడంతో అత్త దమయంతితో షర్మిలకు తరచూ తగాదాలొచ్చేవి. ఈ క్రమంలో ఈ నెల 8న షాపులో విధులు ముగించుకుని వచ్చిన భర్తకు భోజనంతో పాటు ఆమ్లెట్ పెట్టింది. పక్కనే తింటున్న చిన్న కుమారుడికి ఆమ్లెట్ పెట్టలేదని అత్త దమయంతి ప్లేట్ విసిరికొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో భర్త నాగరాజు స్పందించకపోవడంతో శనివారం మరోసారి గొడవపడింది. దీంతో షర్మిల మనస్థాపానికి గురై అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య -
ప్రాచీన కట్టడాల కూల్చివేత సరికాదు
మందస: మందసలో చారిత్రక మండపం, దాని చుట్టూ ప్రత్యేక రాతితో నిర్మించిన కట్టడాన్ని ధ్వంసం చేయడం సరికాదని కళింగ సీమ సాధన కమిటీ నాయకుడు డాక్టర్ దువ్వాడ జీవితేజేశ్వరరావు అన్నారు. ఇటీవల ధ్వంసమైన ఈ ప్రదేశాన్ని ఆదివారం పరిశీలించారు. 2100 ఏళ్ల కిందట ఖారవేలుడి పాలనా కాలంలో జరిగిన ఇటువంటి ప్రాచీన నిర్మాణాలను పరిరక్షించుకోవాలని బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గోపాలసాగర్ అభివృద్ధిలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఓపెన్ జిమ్ నిర్మాణానికి కావలసిన ఖాళీ ప్రదేశం పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడం చరిత్రహీనుల లక్షణమన్నారు. ఇక్కడి శివాలయం గోడపై ఉన్న 23వ జైన తీర్థంకరుడైన వృషభనాథుడి విగ్రహం వరకు తవ్వకాలు జరిపారంటే, ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయాలన్న కుట్రకోణం అందులో దాగి ఉందనే అనుమానం వ్యక్తంచేశారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మామిడి కోదండరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రాచీన కట్టడాలను కాపాడాలని, ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిన్ని తిరుపతి రెడ్డి, కంచి బెహరా, పట్నాయక్, కురేష్, నిరంజన్, సంతోష్, చిన్నరెడ్డి, మల్లారెడ్డి, హేమరాజు, గొంగా బెహరా, బాసుదేవ, హేమంత్, గంట గోపి, గణపతి బెహరా పాల్గొన్నారు -
ప్రమాదాల నివారణపై శిక్షణ
రాయగడ: వరదలు, చెరువులు, నదుల్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగే ఘటనలను తగ్గించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం, జిల్లా అత్యవసర విభాగం, ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన స్విమ్మింగ్ అండ్ డ్రౌనింగ్ సర్వైవల్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది మొత్తం 10 బ్యాచ్లలో 300 మంది యువతకు ఈతతోపాటు ప్రాణరక్షణ నైపుణ్యాల్లో శిక్షణ అందించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో చివరి బ్యాచ్కు చెందిన 30 మంది శిక్షణార్థులకు ప్రశంసించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి దశలో మూడు బ్యాచ్లు నిర్వహించారు. ఈ ఏడాది మే 11 నుంచి మరో ఏడు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చారు. దీంతో మొత్తం 10 బ్యాచ్లలో 300 మంది యువకులు, యువతులు శిక్షణ పొందారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఐదు బ్యాచ్లను బాలురుకు, మరో 5 బ్యాచ్లను బాలికలకు ప్రత్యేకంగా నిర్వహించారు. శిక్షణలో ప్రాథమిక ఈత నైపుణ్యాలు, సీపీఆర్ విధానం, నీటి ప్రవాహం, పరిస్థితులను అంచనా వేయడం, స్థానికంగా అభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నీటిలో మునిగే వారిని సురక్షితంగా రక్షించే పద్ధతులపై ప్రాయోగిక శిక్షణ అందించారు. -
పశువులు పట్టివేత
రణస్థలం: లావేరు మండలం రావివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం శ్రీకాకుళం వైపు వెళుతున్న లగేజ్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న ఏడు గేదెలను పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి కథల పోటీలకు ఆహ్వానం శ్రీకాకుళం కల్చరల్: బండికల్లు వేంకటేశ్వరులు ఫౌండేషన్, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో 10వ జాతీయ స్థాయి కథల పోటీలకు కథలను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షులు బండికల్లు జమదగ్ని, కలిమిశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు కథకులు ఎక్కడ ఉన్నా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. కుటుంబ గౌరవం, నైతిక విలువలను తెలియజేసే కథలు, సమాజంలో తాజా మార్పులు, సమస్యలు చూపుతూ వాటికి చక్కని పరిష్కారాలను తెలిపే కథలను ‘బండికల్లు జమదగ్ని, ఫ్లాట్ నెం.402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు –522002’ చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 98482 64742 నంబరును సంప్రదించాలని కోరారు. -
నేడు పెన్షనర్ల వైద్య శిబిరం
శ్రీకాకుళం కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం ఏపీ ఎన్జీవో హోంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాశరావు, జిల్లా అధ్యక్షుడు సోమసుందరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జెమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, 2–డీ ఇకో టెస్టులు ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. పెన్షనర్లంతా ఈహెచ్ఎస్ కార్డులతో వచ్చి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు యాసిడ్ తాగి మహిళ ఆత్మహత్య పొందూరు : మండల కేంద్రం పొందూరులో లావేటివీధికి చెందిన అల్లాడ సత్యవతి(45) ఆదివారం యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సత్యవతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపానికి గురై యాసిడ్ తాగడంతో వెంటనే కటుంబసభ్యులు రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవతి మృతిచెందింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిధర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరించి అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్ అధికార సిబ్బంది పాల్గొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లీలావరప్రసాద్ మృతి టెక్కలి: ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంట లీలావరప్రసాద్ (49) శనివారం రాత్రి మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామంలో లీలావరప్రసాద్ భౌతికకాయానికి భార్య మాధవి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన సీనియర్ జర్నలిస్టుగా, రచయితగా, విశ్లేషకునిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుపరిచుతులు. ఈయన రచనల్లో సిక్కోలు రాజకీయ చరిత్ర పుస్తకం ఎంతగానో ఆదరణ పొందింది. ఉత్తరాంధ్ర జర్నలిజం ఆవిర్భావం, వికాసం, పయనం, ఉత్తరాంధ్ర సాహితి శిఖరాలు, వర్క్ కండీషన్స్, జాబ్ శాట్సిఫికేషన్ అండ్ జర్నలిస్ట్, ఏ స్టడీ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ విశాఖ, కళింగాంధ్ర కలం యోధులు, సిక్కోలు రాజకీయ చరిత్ర తదితర రచనలు చేశారు. పలు పత్రికల్లో 300కు పైగా వ్యాసాలు రాసి నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. లీలావరప్రసాద్ మృతి పట్ల టెక్కలికి చెందిన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు జి.వి.రెడ్డి మాస్టారు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి నరసన్నపేట: నడగాం –గొనబుపేట మధ్య ఆర్అండ్బీ రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో పశ్చిమబెంగాల్కు చెందిన షేక్ ఇబ్రహీం(30) మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు మండలంలో ఆర్డీఎస్ఎస్(విద్యుత్ ప్రత్యేక లైన్) పనులు చేస్తున్నారు. శనివారం పనులు ముగించిన అనంతరం రాత్రి మద్యం సేవించి ట్రాక్టర్పై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి గాయపడిన షేక్ ఇబ్రహీంను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోదరుడు షేక్ ఇవాదుల్ ఆశిన్ ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్సై–2 లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అలలో చిక్కుకున్న వారిని కాపాడిన లైఫ్ గార్డులు
భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడితో నడి సముద్రం లోనికి కొట్టుకు పోయిన పర్యాటకులను ప్రాణాలతో కాపాడారు లైఫ్గార్డులు. సెక్టార్ 9 బీచ్ సమీపంలో ఆదివారం సముద్రంలో స్నానం చేస్తుండగా ముగ్గురు పర్యాటకులు అలల తాకిడిలో చిక్కుకున్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. సముద్ర తీరంలో పహారాలో నియమితులై ఉన్న లైఫ్ గార్డులు, అగ్ని మాపక సిబ్బంది తక్షణమే అలల మధ్యకు చేరి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న పర్యాటకులను సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. యువకుడు అరెస్టు మల్కన్గిరి: మొబైల్ ఫోన్లు దొంగిలించిన యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2023లో బలిమెల పట్టణంలో మీనా బజార్ నిర్వహించారు. అక్కడ ఉన్న షెడ్లో ఓ వ్యాపారి వద్ద నుంచి మూడు ఫోన్లు ఎవరో దొంగిలించారు. బలిమెల మెడికల్ వీధికి చెందిన సంతోష్ నాగ్ అనే యువకుడు ఈ ఫోన్లు దొంగిలించినట్లు నేరం అంగీకరించడంతో అతడిని అరెస్టు చేశారు. పేకాట శిబిరంపై దాడులు పర్లాకిమిడి: ఆదర్శ పోలీసు స్టేషన్ సిబ్బంది జామి గ్రామానికి సమీపంలో కొండ ప్రాంతంలో నడుస్తున్న జూద శిబిరంపై దాడిచేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 3 మొబైల్ ఫోన్లు, రెండు మోటారు సైకిళ్లు, పేకపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట శిబిరంలో సుమారు 15 మంది ఉన్నారు. పోలీసుల రాకతో వారు పారిపోయినట్లు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. అరెస్టయిన వారిలో తేజేశ్వరరావు, అలియాన హాడ్డి (55), కటడ బసు (36) ను అదుపులోకి తీసుకుని ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. రూ.100 కోట్లతో వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్ జయపురం: జయపురం మునిసిపాలిటీలో వ్యర్ధ పదార్థాల నిర్వహణలో పెనుమార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమైన ప్రాజెక్టును నెలకొల్పనున్నట్లు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి శనివారం వెల్లడించారు. రూ.100 కోట్ల వ్యయం అంచనాతో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఉందని తెలియజేశారు. అందుకు అధికారుల పరిధిలో సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆ ప్రాజెక్టు కోసం అవసరమైన 10 ఎకరాల స్థలం గుర్తించే కార్యక్రమంతోపాటు గుర్తించబడే ఆ స్థలం కేటాయించే ప్రక్రియ ప్రారంభమైందని బాహిణీపతి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాము జిల్లా కలెక్టర్ మనోజ్ మహాజన్తో చర్చించటం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జయపురం పట్టణ శివారులో 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వెంటనే 10 ఎకరాల స్థలం సమకూర్చాలని కలెక్టర్ జయపురం సబ్కలెక్టర్కు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల జయపురం పట్టణంలో వ్యర్ధాల నిర్వహణలో శాసీ్త్రయ మార్పులు వస్తాయన్నారు. -
దొంగల ముఠా అరెస్టు
రాయగడ: మద్యం (ఎఫ్ఎల్) దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను ఝార్సుగుడ పోలీసులు అరెస్టు చేశారు. ఓరియంట్, బణహార్పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు చోరీ కేసులను ఛేదించారు. అందుకు సంబంధించి గంజాం జిల్లాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 8,9 తేదీల్లో రాత్రి ఓరియంట్లోని దుకాణంలో కాపలా దారిపై దాడి చేసి అతడిని కట్టేసి, మొబైల్ ఫోన్ను ధ్వంసం చేసి నగదు, మద్యం సీసాలు దోచుకుని నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు గంజాం, గజపతి జిల్లాల్లో విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో గంజాం జిల్లాకు చెందిన ప్రశాంత్ బెహర, కిషన్ పాండే, నారాయణ జెన్న అలియాస్ మిఽథున్, చిత్రసేన్ జెన్నలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.35,700 నగదు, చోరీకి ఉపయోగించిన మహీంద్ర బొలేరో, రెండు క్రొబార్లు, ఒక డీవిఆర్, మూడు మొబైల్ ఫొన్లు, ధ్వంసమైన తాళాలు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గంజాం, నయాఘడ్, ఖుర్ధా, భువనేశ్వర్ ప్రాంతాల్లొ ఇప్పటికే పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. వీరు ఇతర జిల్లాలు, పోరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
ధ్రువీకరణ పత్రాలు అందజేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి పరసనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో భీమాభోయి దివ్యాంగ సాధికరత శిబిరం నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలు, సేవల అమలుపై సమీక్షించారు. దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించారు 77 మందికి చలన వైకల్య ధ్రువపత్రాలు, 8 మందికి మోధో వైకల్య, 23 మందికి దృష్టి వైకల్య, 31 మందికి వినికిడి, దృష్టి, మాట వైకల్య ధ్రువపత్రాలను అందజేశారు. ఏడుగురికి భద్రతా పెన్షన్, నలుగురికి బస్ పాస్లు పంపిణీ చేశారు. -
రథయాత్ర వేడుకలకు పటిష్ట భద్రత
● ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఝార్సుగుడ ఎస్పీ రాఘవేంద్ర రాయగడ: రాబోయే రథాయాత్ర ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఝార్సుగుడ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యలను సమీక్షించేందుకు ఎస్పి జిఆర్ రాఘవేంద్ర స్వయంగా పాదయాత్ర నిర్వహించి రథయాత్ర కమిటీలు, స్థానిక ప్రజలు, వ్యాపారులతొ సమావేశమై పలు కీలక సూచనలు చేసారు. ఉత్సవ నిర్వాహకులకు సిసీటీవి కేమేరాల ఏర్పాటు ,తగిన బ్యారికేడ్లు, ప్రవేశ –నిష్క్రమణ మార్గాల నియంత్రణ ,పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ,అత్యవసర పరస్ధితులకు ముందస్తు ఏర్పాట్లు, అగ్నిమాపక భద్రత,ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ, తగిన లైటింగ్, జనసందొహన నియంత్రణ కొసం వాలంటీర్ల నియమకం వంటి అంశాలపై ప్రత్యేక సూచనలు ఆయన చేసారు. ఉత్సవ కమిటీలు పోలీసులకు పూర్తిస్ధాయిలొ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. -
మల్కన్గిరిలో కేంద్ర ఇన్చార్జి అధికారి పర్యటన
● అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలనమల్కన్గిరి: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, మల్కన్గిరి జిల్లా కేంద్ర ఇన్చార్జి అధికారి మహ్మద్ అహ్మద్ శనివారం మల్కన్గిరిలో పర్యటించారు . ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జిల్లాస్థాయి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉదయం చిత్రకొండ సమితిలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే గిరిజనులు సాగు చేస్తున్న డ్రాగన్ఫ్రూట్ తోటలను పరిశీలించారు. గిరిరైతుల సంక్షేమానికి సహకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలానే అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె నుంచి పంచాయతీల అభివృద్ధి మిషన్ కార్యక్రమం పురోగతిని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దవాఖానా.. నిర్వహణ ఇలాగేనా..?
● అధ్వానంగా పోస్టుమార్టం గది ● పట్టించుకోని అధికారులు నరసన్నపేట: పందులు.. పంది కొక్కులు.. చెత్తాచెదారం..మురుగునీరు.. ఇదంతా చూసి ఇదేదో డంపింగ్ యార్డు అనుకునేరు. ఇది అచ్చంగా నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలోని ఓ గది వద్ద పరిస్థితి. ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. గదిలో మృత దేహాలు ఉంచేందుకు ఎలాంటి సదుపాయాలు లేవు. దీనికి తోడు గది శ్లాబ్ పెచ్చులూడుతోంది. పిచ్చి మొక్కలు, మురుగు నీరు గది చుట్టూ ఉండటంతో దుర్వాసన వస్తోంది. పోస్టుమార్టం చేసేందుకు వస్తున్న వైద్యులు, సిబ్బంది నరకం చూస్తున్నారు. ప్రక్రియ అయ్యాక చేతులు కడుగుదామంటే నీరు కూడా ఉండని దుస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. నిరుపయోగంగా ఫ్రీజర్.. ఆస్పత్రికి వచ్చే మృతదేహాలు భద్రపరిచేందుకు ఇటీవల ప్రభుత్వం ఫ్రీజర్ మంజూరు చేసింది. రెండు మృత దేహాలు ఇందులో ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పీఎం షెడ్ దాన్ని పెట్టేందుకు అనువుగా లేకపోవడంతో ఆక్సిజన్ ప్లాంట్ గదిలో పెట్టారు. దీంతో ఫ్రీజర్లు నిరుపయోగమయ్యాయి. నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి వెళ్తే సిగ్గేస్తోంది. కనీస సదుపాయాల్లేవు. చుట్టూ మురుగు నీరు ఉంది. పందులు, పందికొక్కులు తిరుగుతున్నాయి. పోస్టుమార్టం షెడ్ ఇలానే ఉంటుందా. అధికారులు చర్యలు తీసుకోవాలి. – వై.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు -
క్రీడలతో మానసిక ఉల్లాసం
జయపురం: క్రీడలు శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతాయని ముఖ్యఅతిథిగా హాజరైన కొరాపుట్ రీజనల్ చీఫ్ కంజెర్వేటింగ్ ఆఫ్ ఫారెస్టర్ యజ్ఞదత్ పాడి అన్నారు. శనివారం జయపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో అవిభక్త కొరాపుట్ జిల్లాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాలుగు జిల్లాల ఫారెస్టు ఉద్యోగుల మధ్య ఫుట్బాల్ ప్రీమియం లీగ్ పోటీలను ప్రారంభించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని ఫారెస్టు ఉద్యోగుల మధ్య క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఫుట్బాల్ ప్రీమియం పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లభించకపోయినా అటవీ విభాగాల ఉద్యోగులు తమ సొంత డబ్బులను చందాలు వేసుకొని నిర్వహించటం అటవీ విభాగం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల్లో కనిపిస్తున్న ఉత్సాహం తనను అబ్బురపరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జయపురం అటవీ డివిజన్ డీఎఫ్ఓ ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కనగిరి జిల్లాల్లో వివిధ రేంజ్ల నుంచి 8 టీమ్లు పూల్గొన్నాయని వెల్లడించారు. ఈ పోటీల్లో రేంజర్ సచీంద్ర పొరిడ, సందీప్ పాణిగ్రహి, దేవేంద్ర మఝి, గొవింద నాయక్, మానస రంజన్ నాయక్, ఛబి రొంధారి తదితరులు ఫుట్బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవంలో అతిథిలుగా జయపురం డీఎఫ్ఓతోపాటు డీఎఫ్ఓలు ఉదయన్ సుబుద్ధి, సిద్ధాంత జైన్, సచిన్ ఓయల్, సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్నను దర్శించుకున్న ప్రముఖులు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఒడిశా మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి గోకులానంద్ మల్లిక్, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, గిరిజన సహకార సంస్థ వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అర్చకులు ఆయన పేరిట అష్టోత్తరశతనామావళి పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదంని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అందజేశారు. -
క్రీడలతో మెరుగైన ఆరోగ్యం
● బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ టెక్కలి: క్రీడలతో ఆరోగ్యం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరికీ క్రీడలు అలవాటుగా మారాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్లో విజేతలకు శనివారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో క్రీడలను తప్పనిసరి చేయాలన్నారు. కాగా, క్రికెట్ పోటీల్లో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించగా, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ జట్టు రన్నర్గా నిలిచింది. వాలీబాల్లో రఘు ఇంజినీరింగ్ కళాశాల విజేతగా నిలవగా, ఆదిత్య కళాశాల రన్నర్గా నిలిచింది. త్రోబాల్లో దువ్వాడ విజ్ఞాన్ కళాశాల విజేతగాగా, విజయనగరం ఎంవీజీఆర్ రన్నర్గా నిలిచాయి. మహిళా విభాగం చెస్లో ఆదిత్య కళాశాల విన్నర్గా నిలిచింది. పురుషుల చెస్లో విశాఖకు చెందిన సాంకేతిక విద్యా పరిషత్ విజేత కాగా, శ్రీకాకుళం ఎర్రన్నాయుడు అగ్రి కల్చరల్ కళాశాల రన్నర్గా నిలిచాయి. అధ్యాపకుల క్రికెట్ పోటీల్లో పర్లాఖిమిడి సెంచూరియన్ యూనివర్శిటీ విజేత కాగా, జీఎంఆర్ఐటీ కళాశాల రన్నర్గా నిలిచాయి. వాలీబాల్, త్రోబాల్లో జీఎంఆర్ఐటీ కళాశాల విన్నర్ కాగా, ఆదిత్య కళాశాల రన్నర్గా నిలిచాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, డైరెక్టర్ వి.వి.నాగేశ్వర్రావు, కె.మధుకుమార్, టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ డి.శ్రీరాములు, ఎం.సంతోష్కుమార్, ఎస్టేట్ మేనేజర్, పి.రమేష్, పీడీలు ఎస్.లక్ష్మణమూర్తి, మురళీమోహన్, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 12 శాతం అధిక వర్షపాతం
భువనేశ్వర్: రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 341.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ సగటు వర్షపాతం కంటే 12 శాతం అధికం కావడం విశేషం. అయితే సుందర్గఢ్, దేవ్గఢ్, కలహండి, నవరంగ్పూర్ అనే 4 జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ వర్షపాతం లోటుగానే ఉంది. ఈ నెల 14న బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా చత్తీస్గఢ్ వైపు కదలడం వల్ల ఉత్తర, పశ్చిమ ఒడిశాలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నెల 16 వరకు భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. జటానీలో యువకుడి దారుణ హత్య భువనేశ్వర్: జటానీ ఖుదుపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో దారుణంగా దుండగులు నరికి చంపేశారు. మృతుడిని ఖుదుపూర్ గ్రామానికి చెందిన మార్కండ బలియార్సింగ్ (జొగ్గా)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మార్కండ బలియార్సింగ్ చౌరస్తాలో నిలబడి ఉండగా గుర్తు తెలియని దుండగుడు అతనిపై అకస్మాత్తుగా దాడి చేశాడు. అతని కడుపు, ఛాతీపై పలుమార్లు కత్తితో పొడిచి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందడంతో జటానీ ఠాణా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విచారణ కోసం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు మల్కన్గిరి: చోరీ కేసులో అజయ్ బిశోయ్ను అనే నిందితుడుని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. డీఎన్కే కెనాల్ కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్లో పద్మావతి జేనా ఉంటున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆమె ఇంటిలో లేని సమయంలో అజయ్ బిశోయ్ను చోరబడి లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు అభరణాలను చోరీ చేశారు. తరువాత ఇంటికి వచ్చిన పద్మావతి జేనా చోరీ జరిగినట్టు గుర్తించి మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాధు చేశారు. కేసు నమోదు చేసిన ఐసీ రీగాన్ కీండో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అజయ్ బిశోయ్ను శనివారం పోలీసులకు పటుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి విచారించగా తానే చోరీకి పాల్పడినట్టు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే చోరీ చేసిన బంగారంలో కొన్ని రవిభత్ర అనే వ్యక్తికి ఇచ్చినట్టు పోలీసులకు తెలియజేయడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో 28 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు రాయగడ: ఒక హత్య కేసుకు సంబంఽధించి 28 ఏళ్ల అనంతరం నిందితుడిని ఝార్సుగుడ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జిఆర్ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం... జిల్లాలోని రెంగాలి పోలీస్ స్టేషన్ పరిధిలో 1998, అక్టోబరు 9 వ తేదీన అరెస్టయిన నిందితుడు కస్టడీ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. మద్యం మత్తులో ఉన్న దుర్యోధన్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేశారు. దీనిపై మృతుడి కొడుకు రెంగాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నీలమణి మహానందియా, రామ్ ఖదియా, విశ్వనాధ్ కుహరోలను అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన వారిలొ నీలమణి అనే నిందితుడు సౌచాలయానికి వెళ్లి వస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. మిగతా ఇద్దరు ఈ కేసుకు సంబంధించి బెయిల్ పై విడుదలయ్యారు. సుమారు మూడు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నీలమణిని పోలీసులు చత్తీస్గఢ్లో అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న నీలమణి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి రాజగొండగా చెలామణి అవుతుండేవాడని ఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. -
‘ఉపా’ కేసును ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ‘ఉపా’ చట్టం కింద నమోదు చేసిన కేసును తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ ఉపా చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే ఒక నల్ల చట్టమని, దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా ప్రయోగించడం సరైంది కాదన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాధరావు మాట్లాడుతూ నేరం చేయని వారిపై కూడా ఈ దారుణమైన చట్టాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగుల వల్ల చేయని నేరానికి ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సి వస్తోందని చెప్పారు. ప్రశ్న రావణ్పై పెట్టిన కేసు భవిష్యత్తులో ప్రశ్నించే గొంతులను భయపెట్టడానికి, సామాజిక మాధ్యమాలను అదుపు చేయడానికి ప్రభుత్వం వేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్రి దానేష్, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ డి.గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటరావు, డి.టి.ఎఫ్. పూర్వ జిల్లా అధ్యక్షుడు కోత ధర్మారావు, ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి శాంతారావు, బీటీఏ నాయకుడు శ్రీనివాసరావు, జె.వి.వి. చిన్నారావు, రెల్లి సంక్షేమ సంఘం నేత అర్జి కోటి, రైతు కూలీ సంఘం నాయకుడు బి.కూర్మారావు, బుడుమూరు వెంకటరమణ, అంబేడ్కర్ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ, పైడి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నిమ్మల అనంతరావు, రాకోటి చిన్నికృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. రావిచెట్టు పడి మూడు ఇళ్లు ధ్వంసం ● నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో నిలిచిన విద్యుత్ సరఫరా నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని ఆదివరపుపేటలో శనివారం రావిచెట్టు కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లపై పడటంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. బోయిన జనార్దనరావు, తంగుడు ఆంజనేయులు, తంగుడు కృష్ణ, సుబుద్ధిల ఇళ్లపై చెట్టుకొమ్మలు పడటంతో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంచాయతీ, విద్యుత్ సిబ్బంది స్పందించి చెట్లు కొమ్మలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం ఎచ్చెర్ల : ఐటీఐలలో ప్రవేశాలకు సంబంధించి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో శనివారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు 584 మందిని పిలవగా 255 మంది హాజరయ్యారు. వీరిలో 141 మందికి సీట్లు కేటాయించారు. ఆదివారం కూడా కౌన్సెలింగ్ కొనసాగించనున్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు. టెక్కలి సీఐపై తప్పుడు వీడియో పోస్టింగులు ● పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తరుణ్కుమార్పై రౌడీషీట్ టెక్కలి: పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న టెక్కలి కోదండ రామవీధికి చెందిన కొమ్ము తరుణ్కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో పోస్టింగులు పెట్టాడని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం టెక్కలి పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తరుణ్కుమార్ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటమే కాకుండా రిమాండ్కు కూడా వెళ్లాడని చెప్పారు. ప్రస్తుతం బెయిల్పై ఉంటూ వ్యసనాలకు బానిసగా మారి పలు మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. మోసాలు బట్టబయలు కావడంతో తదుపరి నేరాలు చేసే అవకాశం ఉండదని భావిస్తూ సీఐ విజయ్కుమార్పై సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పోస్టింగ్లు చేశాడని పేర్కొన్నారు. చట్ట విరుద్దమైన నేరాలు, చట్ట వ్యతిరేక పనులు చేస్తుండటంపై టెక్కలి పోలీస్ స్టేషన్లో తరుణ్కుమార్పై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్కుమార్ ఉన్నారు. -
రథాల తయారీదారులకు సత్కారం
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని జగన్నాథ మందిరం వెలుపల రథయాత్ర కోసం తయారవుతున్న మూడు రథాలను తిలకించడానికి శనివారం ఉద యం ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. పట్ట చిత్రాలలో ఉన్న ఆదినారాయణ, అనంతవాసుదేవుడు, భుభనేశ్వరీ దేవదేవుళ్లును దర్శించుకున్నారు. ఈ మూడు రథాల శిల్పకారుడు అశోక్ మహారాణాను కలిసి మాట్లాడారు. రథం నందిఘోషకి 16 చక్రాలు, రథసారధిగా దారుక, బలరాముని తాల ధ్వజ రథానికి 14 చక్రాలు, రథసారథి మాతలి, సుభ ద్ర రథం దర్పదళన 12 చక్రాలతో స్వయాన అర్జునుడు రథసాఽరధిగా వ్యవహారిస్తాడు. వచ్చే సోమవారంతో ఈ మూడు రథాలకు చివరిగా రాహు, కేతు లు, గుర్రాలు, అనేక దేవతలు, విమలా దేవి, వన దుర్గ, ఉగ్రతార, చండీ, మంగళ, ఇతర శక్తుల చిత్రపటాలును అతికిస్తున్నారు. రథాల తయారీకి రాత్రింబవళ్లు పనిచేస్తున్న కారగార్ (శిల్పులు)కు ఎమ్మెల్యే ఉత్తరీయం, ఇత్తడి ప్లేటును ఇచ్చి సత్కరించారు. -
ప్రమాదకర ప్రయాణం..
కొరాపుట్: విధి నిర్వాహణ కోసం మహిళల ప్రమాదకర ప్రయాణం సాగుతుంది. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి మంచాగాం గ్రామ పంచాయతీ కెందుగుడ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నువా డెప్పుగుడ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. నువా డెప్పుగుడ అప్పర్ ఇంద్రావతి హైడ్రో పవర్ ప్రోజెక్ట్ కోసం నిర్మించిన భారీ రిజర్వాయర్ మధ్య కొండ ఉంది. ఈ గ్రామంలో పలు గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామం వెళ్లడానికి ఎటువంటి మార్గం లేదు. కనీసం ఇంధన పడవ సౌకర్యం కూడా లేదు. దీంతో ఆశ కార్యకర్త ద్రౌపది జానీ, అంగన్వాడీ కార్యకర్త టిల్ శాంత నిత్యం నాటు పడవతో ఆ గ్రామానికి వెళ్లి పిల్లల సంరక్షణ చూస్తున్నారు. ఇటువంటి ప్రమాదకర ప్రయాణం చేస్తున్న మహిళల వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. -
కారులో వచ్చి ఇల్లు దోపిడీ
కొరాపుట్: దర్జాగా కారులో వచ్చి ఆయుధాలు చూపించి దోపిడీ చేసిన ఘటన నబరంగ్ఫూర్ జిల్లా జొరిగాం సమితి బనగుడ గ్రామంలో జరిగింది. గ్రామంలోని లక్ష్మణ్ ఠాకూర్ ఇంటికి అర్ధరాత్రి ఆయుధాలతో నలుగురు వ్యక్తులు వచ్చారు. తలుపులు విరగ్గొట్టి ఇంటిలో చొరబడ్డారు. లక్ష్మణ్కి తుపాకీ చూపించి బీరువా తాళాలు తీసుకున్నారు. ఇంటిలో ఉన్న రూ.15 లక్షలు విలువ గల బంగారం, నగదు పట్టుకునిపోయారు. మహిళల ముక్కు, చెవిలో ఉన్న బంగారం పట్టుకుపోయారు. పురుషులు ధరించిన ప్యాంట్లు, షర్టుల లోని డబ్బులు కూడా తీసుకెళ్లిపోయారు. దోపిడీ సమయంలో ఇంటి సభ్యులందరినీ ఒకే చోట కూర్చోబెట్టారు. దొంగలు హిందీ, బెంగాళీ భాషల్లో మాట్లాడుకున్నారని బాధితులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ పార్ధవ్ కశ్యప్ బాధితుల ఇంటికి చేరుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.రాష్ట్ర సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కొత్త రైల్ మార్గానికి రీఅలైన్మెంట్ సర్వే చేయాలి
రాయగడ: దాదాపు లక్షన్నర మంది ప్రజలు రైల్వే సౌకర్యానికి దూరంగా ఉన్న రాయగడ జిల్లాలోని గుడారి ప్రాంతానికి రైల్వే అనుసంధానం కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిపాదిత గొపాల్పూర్–రాయగడ కొత్త రైల్వే మార్గాన్ని గుడారి మీదుగా రియలైన్మెంట్ చేసి సర్వే నిర్వహించేందుకు ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక లేఖ పంపించారు. గుడారితొ పాటు పరిసర ప్రాంతాల్లొ నివసిస్తున్న సుమారు 1.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే రైల్వే సౌకర్యానికి నొచుకొలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్ధిక అభివృధ్దికి రైల్వే అనుసంధానం అత్యంత అవసరమని వివరించారు. ప్రతిపాదిత గొపాల్పూర్–రాయగడ కొత్త రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా అఖకుసింగి,నైరా,గుడారి, బంకిలి లేదా దుర్గి మార్గాన్ని పరిశాలించి దానిని ప్రతిపాదిత గుణుపూర్ –తెరువలి రైల్వే మార్గంతొ అనుసంధానం చేసే అవకాశాలను అధ్యయనం చేయాలని కొరారు. గుడారి రైల్వే సౌకర్యం అందుబాటులొకి వస్తే ప్రజలకు వైద్య సేవలు, ఉన్నత విద్య, వ్యవసాయ అలాగే తదితర ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు ,ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని పేర్కొన్నార. అంతేకాకుండా ఈ ప్రాంత ఆర్ధికాభివృధ్ది కి, రవాణా వ్యవస్ధ బలొపేతానికి కూడా ఈ ప్రాజెక్టు దొహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
శ్రీ జగన్నాథునికి దశమూలిక మోదకాల సమర్పణ
భువనేశ్వర్: స్నానోత్సవం సందర్భంగా 108 కలశాల సుగంధ జలాలతో స్నానం చేసి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు సోదర, సోదరి సమేతంగా ఏకాంత గృహంలో గోప్య సేవలు పొందుతున్నాడు. కోట్లాది భక్త జనుల ఆరాధ్య దైవమైన శ్రీ జగన్నాథుడు సోదర సోదరీ సమేతంగా త్వరగా కోలుకోవాలని వివిధ ఉపచారాలతో స్వామికి సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురై చీకటి గదిలో స్వామి గత 12 రోజులుగా రాజ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ మందిరంలో సంప్రదాయం ప్రకారం ద్వాదశి నాడు దశ మూలికల మోదకాలను స్వామికి చికిత్సలో భాగంగా సమర్పించాలని రాజ వైద్య వర్గం నిర్ణయించింది. ఆయుర్వేద పద్ధతులు స్వామి వారికి స్వస్థత చేకూర్చేందుకు రాజ వైద్యులు ఆయుర్వేద పద్ధతులు, శాస్త్రాల ప్రకారం దశమూలికల మోదకాలను తయారు చేశారు. వంశపారంపర్యంగా తరతరాలుగా శ్రీ మందిరంలో రాజ వైద్యులు మహా ప్రభువుకు సేవలు కొనసాగిస్తున్నారు. ఈ మహా ఔషధి తయారీ కోసం ముందుగా శాలపర్ణి, గుమ్మడి టేకు, నాగదమని, కృష్ణ పర్ణి, అగరు, మారేడు, గోక్షురం, లవంగం వంటి అటవీ ఉత్పత్తులను సేకరించి బాగా ఎండబెడతారు. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దంచి పొడి చేస్తారు. ఆ పొడిని గుడ్డలో జల్లెడ పడతారు. ఇలా సిద్ధం చేసిన చూర్ణంను కోవా, పంచదార, పాల మీగడ, తేనె, నెయ్యి, భంగు మొదలైన వాటి మిశ్రమంతో తయారు చేసిన పాకంలో కలిపి ముద్దగా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో కొత్త కట్టెల పొయ్యిని వినియోగిస్తారు. పాకం బట్టిన ముద్దని అరటి ఆకులపై పరచి చల్లారిన తర్వాత గుండ్రని మోదకాలుగా చేసి 3 కుండలలో ఉంచుతారు.దానిపై కర్పూరం చల్లి, చింత ఆకులతో కప్పి ఆలయానికి సమర్పిస్తారు. ఇందుకు అవసరమైన దశ మూలికల మోదకాలను ఒక రోజు ముందుగా ఖొల్లిలగ్గి ఏకాదశి నాడు శ్రీ మందిరానికి తరలించారు. ఈ ఆచారం ఖొల్లి లగ్గి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ద్వాదశి నుంచి శ్రీ జగన్నాథుని చికిత్సలో ఈ మూలికల్ని సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది. -
ప్రభుత్వం వాటా రూ. 1.17 కోట్లు
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026ఓటీడీసీ లాభంలోభువనేశ్వర్: ఒడిశా పర్యాటక అభివృద్ధి సంస్థ ఓటీడీసీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం రూ. 1.17 కోట్ల లాభం వాటా చెల్లించింది. పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఓటీడీసీ సీనియర్ అధికారుల సమక్షంలో మేనేజింగ్ డైరెక్టర్ దీపంకర్ మహా పాత్రో నుంచి లాభం వాటా చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఓటీడీసీ పని తీరును ప్రశంసిస్తూ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, వృత్తిపరమైన నిర్వహణ, పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతం, సందర్శకుల అనుభవాలను మెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడటంలో ఓటీడీసీ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవల పంపిణీని మెరుగుదల మరియు పర్యాటక సౌకర్యాల విస్తరణ రంగాల్లో ఓటీడీసీ చేస్తున్న ప్రయత్నాలను ఆమె అభినందించారు. ఓటీడీసీ ప్రస్తుతం 14 పంథ్ నివాస్ హోటల్ యూనిట్లు, ప్రామాణిక ఒడియా వంటకాల రెస్టారెంట్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సేవలందించే విలాసవంతమైన పర్యాటక రవాణా సముదాయాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక, అమలు, ఉన్నతీకరణ, నిర్వహణకు బాధ్యత వహించే ఒక ఎయిర్ టికెటింగ్ విభాగం, ఇంజినీరింగ్ విభాగాన్ని నడుపుతోంది. మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ, కార్యాచరణ సామర్థ్యం పటిష్టత, వైవిధ్యమైన పర్యాటక సేవలు, పంథ్ నివాస్ నెట్వర్క్ మరియు ఇతర కార్యాచరణ విభాగాల్లో మెరుగైన సేవలతో టర్నోవర్, లాభాలు పెంచే లక్ష్యంతో ఒడిశా పర్యాటక అభివద్ధి సంస్థ ప్రతిష్టాత్మకమైన 3 ఏళ్ళ ప్రణాళికతో రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందని అధికారులు తెలిపారు. -
‘తల్లి’డిల్లిన మనసు
మనసు నిండా ఒంటరితనం. ప్రపంచంలో తమకెవరూ లేరన్న బాధ.. కుటుంబంలో ముగ్గురు ఉన్నా.. అందరం అనాథలమే అన్న భావన.. 62 ఏళ్ల వయసులో ఆ ఆలోచన ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్ల ప్రాణాలను బలి కోరింది. వారి మృతదేహాల వద్ద నాలుగు కన్నీటి చుక్కలు రాల్చే వారు లేకపోవడం ఇంకా విషాదం అనిపించింది. జలుమూరు మండలం మర్రివలసకు చెందిన ముద్ద దాలప్పమ్మ (62), తన ఇద్దరు కుమార్తెలు దాలమ్మ(45), సరస్వతి (32) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట దాలప్పమ్మ భర్త చనిపోయిన నాటి నుంచి ఈ కు టుంబం మానసికంగా ఆందోళనలో ఉంది. దాలప్పమ్మకు మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. వారు దూరంగానే ఉన్నారు. గురువారం రాత్రి ఇంటి లో తల్లీకూతుళ్లు గడ్డి మందు తాగేశారు. శుక్రవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించే సరికి దాలప్పమ్మ కొన ఊపిరితో ఉన్నారు. 108 వచ్చేలోపు ఆమె చనిపోయారు. దాలమ్మ, సరస్వతిలు రిమ్స్లో చికిత్స పొందు తూ మరణించారు. – జలుమూరు -
జగతి నాథునికి ఫలహార కావడి
భువనేశ్వర్: జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని భారీగా స్నానం ఆచరించిన శ్రీ జగన్నాథ స్వామి అస్వస్థతతో తెరమరుగు అయ్యాడు. కనులారా స్వామిని దర్శించుకోవాలని భక్త జన వర్గం ఆరాట పడుతోంది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో తెర చాటున నిశ్శబ్ద వాతావరణంలో దేవతా మూర్తులు గోప్యంగా వైద్య సేవలు, ఉపచారాలు పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రియతమ దైవం శ్రీ జగన్నాథ స్వామి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భక్త జనం రాజ వైద్యుల సూచన మేరకు ఫలాహారం సమర్పించేందుకు నడుం బిగించారు. భారీ కావళ్లతో వివిధ రకాల పండ్లు శ్రీ మందిరానికి చేర్చడంలో తలమునకలై ఉన్నారు. కటక్ జిల్లా నియాలి ప్రాంతం మాధవానంద ఆలయం నుంచి శ్రీ క్షేత్రానికి పండ్ల (ఫలాహారం) కావళ్లు భుజాన వేసుకుని బయలుదేరారు. కావడిలో వివిధ రకాల పండ్లు, మూలికలు, తులసి దళం, సుగంధ పువ్వులు రవాణా చేశారు. సంకీర్తనాలాపనతో ఊరేగింపుగా బయల్దేరారు. స్వామి కోసం తరలించే పండ్ల కావడిని ఒణొసొరొ భారొగా వ్యవహరిస్తారు. -
ఝరపడా సెంట్రల్ జైలులో హెచ్ఐవీ కలకలం!
● మరో ఖైదీకి పాజిటివ్ నిర్ధారణ భువనేశ్వర్: స్థానిక ఝరపడా సెంట్రల్ జైలులో మరో ఖైదీకి హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆ జైలులో హెచ్ఐవీ సోకిన ఖైదీల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ పరిస్థితి తోటి ఖైదీల్లో ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఖండగిరి ఠాణా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టారు. న్యాయస్థానం అనుమతి మేరకు అతడ్ని జ్యుడిషియల్ కస్టడీ కోసం ఝరపడా జైలుకు పంపారు. జైలు నిబంధనల ప్రకారం అతడిని జైలులోకి ప్రవేశపెట్టే ముందు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు, వైద్య స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ స్క్రీనింగ్లో ఆ ఖైదీకి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది.ఈ సంఘటనకు ముందు జైలులోని ఎనిమి ది మంది ఖైదీలు ఇప్పటికే హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించబడ్డారు. ఈ కొత్త కేసుతో వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా హెచ్ఐవీ పాజిటివ్గా తేలిన ఖైదీకి ఇతరుల మాదిరిగానే సరైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ అందిస్తామని జైలు అధికారులు తెలిపారు. జైలు ప్రాంగణంలో నిరంతర ఆరోగ్య తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగుతున్నాయని వివరించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పర్లాకిమిడి: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో (డీహెచ్హెచ్) గుర్తు తెలియని వ్యక్తి (40) మృతిచెందాడు. ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు పోలీసుస్టేషన్కు సంప్రదించాలని ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి చెప్పారు. -
మత్స్యకారులు మెలకువలు తెలుసుకోవాలి
పర్లాకిమిడి: మత్స్యకారులు చేపల పెంపకంలో మెలకువలు తెలుసుకోవాలని, ముఖ్యమంత్రి మత్స్యజీవి కల్యాణ యోజన పథకం ద్వారా లభిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముఖ్య ప్రాణి చికిత్స అధికారి తుషారేందు నాయక్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఒడిశా జీవికా మిషన్ అధికారి టిమోన్ బోరా, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, ప్రభుత్వ మట్టి సంరక్షణ అధికారి సోనాలీ స్వయిని తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పలువురు మత్స్యకారులకు పురస్కారాలు అందజేశారు. -
దయా నదిలో మత్స్యకారుడు గల్లంతు
భువనేశ్వర్: పూరీ జిల్లా కొణాస్ మండలం జగులపడ వద్ద శుక్రవారం దయా నదిలో పడిన మత్స్యకారుడు గల్లంతయ్యాడు. చేపలు పడుతుండగా పడవ నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుడు దిబానా బెహెరాగా గుర్తించారు. ఈ వర్షాకాలంలో దయా నదిలోకి తొలిసారిగా వరద నీరు చేరడంతో అతను తన తండ్రి ప్రకాష్ బెహెరాతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చేపలు కోసం వల విసురుతున్నప్పుడు అదుపు తప్పి నదిలో పడిపోయినట్లు సమాచారం. తక్షణమే రక్షించడానికి అతని తండ్రి ప్రయత్నించి నీటిలో వెతికాడు. కొడుకు జాడ కొరవడడంతో స్థానికులకు సమాచారం చేరదీసి సాయం కోరాడు. సహాయక సిబ్బంది నది వద్దకు చేరి స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అడవి పిల్లిని రక్షించిన అటవీశాఖ మల్కన్గిరి: జిల్లాలోని బలిమెల పట్టణం రహదారి పక్కన ఒక గాయపడిన అడవి పిల్లిని గురువారం సాయంత్రం స్థానికులు చూశారు. వెంటనే బలిమెల అటవీ శాఖకు సమాచార ఇవ్వడంతో బలిమెల అటవీ శాఖ రేంజర్ లిస్మితా కౌర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కోరుకొండ పశువైద్య శాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బలిమెల అటవీ కార్యాలయంలో 10 రోజులు ఉంచి, అనంతరం పూర్తి ఆరోగ్యంతో అడవిలో విడిచిపెడతామని తెలిపారు. సోంపేట: మాకన్నపురం పంచాయతీ శారదాపురంలో శుక్రవారం సాయంత్రం కోతులు దాడి చేయడంతో కోనారి నారాయణరావు, దాసరి నారాయణమ్మ, సార వల్లమ్మతో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అధికారులు స్పందించి కోతుల బారినుంచి రక్షణ కల్పించా లని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి పలాస: కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన బి. సోమశేఖరరావు (48) అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద మృతి చెందాడు. ఈ విషయాన్ని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అంతరకుడ్డలో గల తన అత్తవారింటికి మూడు రోజుల కిందట వెళ్లాడు. భార్యాపిల్లలను చూసి తిరిగి వచ్చాడు. అతనికి మద్యం అలవాటు బాగా ఉందని, మద్యం తాగడం వల్ల, సరైన ఆహారం లేక పోవడం వల్ల డ్రీహైడ్రేషన్కు గురై మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ ఎస్ఐ సునీల్ చెప్పారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం చేశారు. మృత దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించామన్నారు. పలాస: కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పరిశీలించారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ‘అర్హుల ఓట్లు పోకూడదు’ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన వారి ఓట్లు పోవడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలనలో భాగంగా అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్తో కలిసి శుక్రవారం శ్రీకాకుళం విచ్చేసిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ విశ్వేశ్వరరావు, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈఆర్వోలు తప్పకుండా తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించాలని, తక్కువ ఫలితాలు నమోదైన చోట క్షేత్రస్థాయి పర్యటనలు చేసి లోపాలను విశ్లేషించుకోవాలని ఆదేశించారు. అనంతరం 8 నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో తొలుత జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ప్రకారం జిల్లాలో 9,31,640 మంది పురుష ఓటర్లు, 9,48,299 మంది మహిళా ఓటర్లు, 126 మంది ఇతర ఓటర్లతో కలిపి మొత్తంగా 18,80,065 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. -
భక్తులతో పెనవేసుకున్న బంధం
భువనేశ్వర్: భక్త జన హదయాల్లో కొలువైన స్వామి శ్రీ జగన్నాథుడు. వార్షిక యాత్రలో అడుగడుగునా భక్త జనుల భక్తి శ్రద్ధలు పెనవేసుకుని ఉంటాయి. ఇంధన, సాంకేతిక, యాంత్రిక మద్దతు లేకుండా నింగిని తాకే నిలువెత్తు భారీ రథాలు వడివడిగా ముందుకు సాగడం అందుకు తార్కాణంగా నిలుస్తుంది. రథాలు లాగేందుకు బలాన్ని ఇచ్చే కొబ్బరి పీచు తాళ్ల తయారీ వెనుక ఆధ్యాత్మిక భావన, అంకిత భావంతో చిత్త శుద్ధిగా సేవలు అందించే అదృశ్య హస్తాలు ఎన్నో శ్రమిస్తాయి. ఈ ప్రక్రియ యాత్రకు దాదాపు 6 నెలల ముందుగానే మొదలు అవుతుంది. ఒడిశా వ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు స్వహస్తాలతో పలుచని కొబ్బరి తాడులను తయారు చేస్తాయి. ఆ తర్వాత వాటిని ఒడిశా కోఆపరేటివ్ కాయిర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓసీసీసీ)కు పంపిస్తారు. పూరీలోని వీరప్రతాప్ పూర్ ఫ్యాక్టరీలో భారీ తాడులుగా నేస్తారు. శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాటిని తయారు చేసి సకాలంలో అందజేస్తారు. శాకాహారంతో సేవలు మహిళా స్వయం సహాయక బందాలు, ఓసీసీసీ కార్మికులు రథాల తాళ్ల తయారీ స్వామి సేవగా భావిస్తారు. తాడులు తయారు చేసే ప్రక్రియ ఆద్యంతాలు వారు మహా ప్రభువు పట్ల భక్తికి చిహ్నంగా ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కఠినమైన శాకాహారాన్ని పాటిస్తారు. ఓసీసీసీ ఒడిశా వ్యాప్తంగా ఉన్న జగన్నాథ ఆలయాలకు కొబ్బరి తాడులను సరఫరా చేస్తుంది. రథాలను లాగే ఈ సాంప్రదాయ కొబ్బరి పీచు తాళ్లు మహా ప్రభువుకు, లక్షలాది భక్తులకు మధ్య ఉన్న భక్తి పూర్వక బంధానికి ప్రతీకగా నిలుస్తాయి. జన సంద్రంలో రథాల కదలికకు దోహదపడే తాళ్లు తాకిన సాక్షాత్తు భగవంతుని ఆలింగనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందిన తన్మయంతో మనసారా ఉప్పొంగి పోతారు. -
బైక్పై బాలిక మృతదేహం తరలింపు
కొరాపుట్: పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోయింది.. ఊరేమో అంత్యక్రియలు చేయాలంటే డబ్బులు అడుగుతోంది.. మరో చోటకు వెళ్దామంటే అంబులెన్స్ అద్దెకూ డబ్బుల్లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాలిక మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని 12 కిలోమీటర్ల దూరం తరలించిన ఘటన ఉమ్మర్కోట్లో జరిగింది. ఉమ్మర్కోట్ సమీపంలో సన్న బరండి గ్రామంలో అనితా లోహర (10) అనే బాలిక తన బంధువుల ఇంటిలో అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. ఆమె వైద్యం కోసమే సన్నబరండి వచ్చి దురదృష్టవశాత్తు కన్ను మూసింది. ఉమ్మర్కోట్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చి తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసి ఇతర బంధువులు వచ్చి ఆమె స్వస్థలం చికల్పోదర్ తీసుకొని వెళ్లడానికి ప్రయత్నం చేశారు. బాలిక మృతి చెందిన సన్న బరండి లో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రామస్తులు అడ్డుకున్నారని బాలిక బంధువులు అరోపించారు. ఇతర గ్రామ ప్రజలు తమ గ్రామంలో అంత్య క్రియలు చేస్తే రూ.7000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. అంత డబ్బులు ఇచ్చుకోలేక, అంబులెన్స్కి అద్దె చెల్లించలేక తాము బైక్ మీద తరలించామని బాలిక బంధువులు ప్రకటించారు. బాలిక మృతదేహాన్ని బైక్ మీద తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర విద్యా మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గం కావడంతో విమర్శలు వినిపించాయి. -
అలసిపోయింది ప్రాణం
70 ఏళ్ల వయసు.. సేద్యంపై ఆధారపడిన బతుకు. ఇంటి పనులు, పొలం పనులతో నిత్యం సందడిగా ఉండే జీవితం. కష్టపడి పనిచేసే ప్రాణం. బస్తా ఎరువు కోసం చేసిన నిరీక్షణ ఆమె ప్రాణం తీసింది. నందిగాం మండలంలో ని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన పినకాన కాంతమ్మ(70) శుక్రవారం యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేశారు. పెద్దలవుని పల్లి రైతు సేవా కేంద్రంలో ఎరువులు పంపిణీ చేశారు. కొత్త నిబంధన ప్రకారం యూరియా పంపిణీ చేసేందుకు భూమి ఉన్న ప్రతి రైతు ఆర్ఎస్కేకు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. దీంతో కాంతమ్మ తన కుమార్తెతో కలిసి ఆర్ఎస్కేకు వెళ్లారు. అంత చిన్న గదిలో స్లిప్పులు రాయించుకోవడం, బయోమెట్రిక్ వేయడం, ఎరువు కోసం వేచి ఉండడంతో గాలి ఆడని స్థితి. ఎలాగోలా అవన్నీ చేయించుకున్న కాంతమ్మ బయటకు వచ్చిన కాసేపటికే కుప్పకూలిపోయారు. టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించే లోగానే ఆమె మృతి చెందారు. – నందిగాం -
తెలుగు సంఘాల నిరసన
రాయగడ: రాయగడ రైల్వే డివిజన్గా ఎదుగుతున్న వేళ స్థానిక రైల్వేస్టేషన్ సూచిక బోర్డులో తెలుగు భాషను తొలగించడం వివాదాస్పదంగా మారింది. దశాబ్ధాలుగా సూచిక బోర్డుపై ఉన్నటువంటి తెలుగును ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం తెలుగు భాషాభిమానుల మనోభావాలను దెబ్బతీసిందని స్థానిక తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు తెలుగును యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వే డీఆర్ఎం పేరిట ఒక వినతిపత్రాన్ని ఏడీఈఎన్ రాజేంద్ర కుమార్కు శుక్రవారం సమర్పించారు. జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు నేతృత్వంలో స్థానిక కళింగ వైశ్య సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం, ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్, స్వర్ణకారుల సంఘం తదితర తెలుగు సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా రాయగడ రైల్వేస్టేషన్ సూచిక బోర్డులో తెలుగు భాషకు స్థానం ఉన్నప్పటికీ.. ఇటీవల దానిని తొలగించడం సరికాదని ప్రతినిధుల బృందం పేర్కొంది. మజ్జిగౌరి మందిరానికి పొరుగున తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని, ఈ క్రమంలో ఈ సూచిక బోర్డు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా స్టేషన్లో రైళ్ల రాకపోకలకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా తెలుగులో చెప్పాలని కోరారు. కార్యక్రమంలో కింతలి అమర్నాథ్, టంకాల జయరాం, బొచ్చ శ్రీనివాస్, చిన్నారి విజయ్ మోహన్, సీహెచ్ రాంబాబు, పొట్నూరు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా లలితాదేవి అమ్మవారి వార్షికోత్సవం
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని ఉమారామలింగేశ్వర ఆలయంలో ఉన్న శ్రీలలితా దేవి ఎనిమిదో వార్షికోత్సవాన్ని శనివరాం మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పైడిశెట్టి సుధ దంపతులు అమ్మవారికి ఘనంగా పూజలు జరిపించారు. ఆలయ పూజారి దుర్గా దాస్ పలువురు మహిళచే శ్రీలలితాదేవికి సహాస్ర నామావళి, కుంకుమ పూజలు జరిపించారు. సాయంత్రం అమ్మవారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో విశాలాక్షి అయ్యంగర్, జోస్యుల ప్రదీప్ కుమార్ శర్మ పాల్గొన్నారు. శ్రీలలితాదేవి అమ్మవారి పూజలు చేస్తున్న పైడిశెట్టి దంపతులు ఆశీర్వాచవచనం. -
సమీక్ష
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026భువనేశ్వర్: పూరీలో జరగనున్న శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర దగ్గర పడుతుంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్ర వారం లోక్ సేవా భవన్లో రథ యాత్ర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ బృహత్తర యాత్ర నిర్వహణలో సమన్వయం, పటిష్టమైన ఏర్పాట్లుపై దష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ యాత్ర సజావుగా జరిగేందుకు వివిధ శాఖల మధ్య నిరంతర సంప్రదింపులు, సహకారం అవసరమన్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చే యాత్రికుల రద్దీ నియంత్రణ పటిష్టంగా నిర్వహించేందుకు ప్రతి స్థాయిలో సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా సమాచారాన్ని పంచుకోవడం చాలా కీలకమని అన్నారు. సమయపాలన, జన సమూహ నిర్వహణ, అగ్ని భద్రత, భక్తులు, రథాల భద్రత యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన అధికారులు ఈ ఉత్సవాన్ని విజయవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని కోరారు. భద్రతా విధుల కోసం ఒడిశా పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి సుమారు 12,000 మంది సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్, భారత నౌకా దళాన్ని కూడా అప్రమత్తం చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెరుగైన సమాచార ప్రసారం, పర్యవేక్షణ కోసం, పూరీ అంతటా 473 సీసీ టీవీ కెమెరాలు, 65 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఒడియా, హిందీ, ఆంగ్ల భాషలలో సమాచారం అందిస్తారు. బల్క్ మెసేజింగ్ సేవలతో పాటు, పదహారు శాశ్వత, అనేక తాత్కాలిక మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. గుండిచా ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ భక్తుల దర్శనాన్ని సులభతరం చేయడానికి సహాయ కేంద్రాలతో సహా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి ఒక సమీకత కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవం కోసం 1,700 బయో టాయిలెట్లను ఏర్పాటు చేసి పరిశుభ్రతను నిర్ధారించడానికి ప్రతి 5 టాయిలెట్లకు ఒక వలంటీర్ను నియమిస్తారు. తక్షణ వైద్య సహాయం అందించడానికి 8 తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. రథయాత్ర సందర్భంగా పూరీకి 300కు పైగా రైళ్లు నడవనున్న నేపథ్యంలో, ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించాలని, రద్దీని సమర్థంగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశానికి పనులు, న్యాయ మరియు అబ్కారీ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, హోం, సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, అగ్ని మాపక సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర సుధాంశు షడంగి, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాస్వత్ మిశ్రా, శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద కుమార్ పాఢి, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ పోలీసు అధికారులు, పూరీ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. రథయాత్ర సన్నద్ధతపై పూరీ వ్యాప్తంగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు 12,000 మంది భద్రతా సిబ్బంది మోహరింపు 300కు పైగా ప్రత్యేక రైళ్లు -
కేజీబీవీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్విద్ రాజ్శిర్కే ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లా ఆరోగ్యశాఖ కీలక ఆరోగ్య సేవాకార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఏడు కస్తూర్బాగాంధీ ళబాలికా విద్యాలయాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగాంగా కేజీబీవ్లో చదువుతున్న 1320 మంది విద్యార్థినులను మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది. ఇప్పటి వరకు రెండు పాఠశాలల్లోని విద్యార్థినులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. విగిలిన ఐదు పాఠశాలల్లో కూడా రెండు..మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రతి విద్యారి్థనికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం, మందులు, ఆరోగ్య సలహాలు అందించేందుకు ఆరోగ్య శాఖాబృందాలు పనిచేస్తున్నాయి. కలెక్టర్ మాట్లాడూతూ.. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా చేయడమే లక్ష్యమన్నారు. గంజాయి పట్టివేత మల్కన్గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు గురువారం రాత్రి 92 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం బలిమెల – చిత్రకొండ ముఖ్య రహదారి వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాటిని ఆపకుండా అతివేగంగా వెళ్లారు. దీంతో వాటిని పోలీసులు వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన దుంగడులు వాహనాలను వదిలి పరారయ్యారు. అనంతరం కారులో తనిఖీ చేయగా 4 బస్తాల్లో గంజాయిని గుర్తించారు. వెంటనే కారు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. అక్కడ చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ భత్ర నేతృత్వంలో ఐఐసీ దేవదత్త మల్లిక్ పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 92 కేజీలు ఉంది. దీని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న 91 ఆవులు పట్టివేత జయపురం: అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న 91 ఆవులను జయపురం పట్టణ పోలీసులు హిందూ సమాజ్ యువకుల సహకారంతో శుక్రవారం రక్షించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసుస్టేషన్ అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. సబ్ఇన్స్పెక్టర్ రాజేంద్ర పంగి నేతృత్వంలో పోలీసు బృందం వెంటనే దాడి జరిపి పశువులను రవాణా చేస్తున్న కంటైనర్ వాహనాన్ని అడ్డగించారు. దాన్ని పరిశీలించగా అందులో 91 ఆవులు బయటపడ్డారు. కంటైనర్ డ్రైవర్ను అదుపులోనికి తీసుకొని విచారించగా తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రషీద్ అనే వ్యక్తి ధర్మఘడ్లో పశువులను కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆవులను కుంత్రకల్ గ్రామం వద్ద గల జయపురం మున్సిపాలిటీ వారి గోశాలకు తరలించినట్లు వెల్లడించారు. అచ్చట గోసంరక్షకులు ఆవులకు వైద్యం చేయించి ఆహారం సమకూర్చారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అసమానతలు లేని సమాజమే లక్ష్యం
పలాస: అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పాటుపడాలని, అందుకు శాసీ్త్రయ విజ్ఞానం చాలా అవసరమని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరప్పడు అన్నారు. కాశీబుగ్గలోని టి.కె.ఆర్. కల్యాణ మండపంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర విద్యావైజ్ఞానిక శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా పి.డి.ఎస్.యు. పతాకాన్ని సంఘం అధ్యక్షుడు కె.భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సూరప్పడు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, దోపిడీ పీడన లేని సమాజం కోసం ఈ జిల్లాలో గొప్ప ఉద్యమం జరిగిందని, అందులో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ఇక్కడ ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం శుభపరిణామమని చెప్పారు. పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్, ఎం.వినోద్ మాట్లా డుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాటిని అమలు చేయ డం లేదని దుయ్యబట్టారు. ఉన్నత విద్యా ఉపాధి సవాళ్లు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్పట్నాయక్, సామాజిక మార్పు విద్యార్థుల పాత్ర అంశంపై ఎ.పి.టి.ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పి.డి.ఎస్. యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.రాజశేఖర్, ఎం.సునీ ల్, అంకన్న, సహాయ కార్యదర్శి రాజేష్, నాని, వీరుంద్ర, ప్రసాద్, లోకేష్, కోశాధికారి మహేంద్ర, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సొర్ర రామారావు, ఎస్.సోమేశ్వరరావు, కృష్ణవేణి, పి.వో.డబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.ఈశ్వరమ్మ, పి.కుసుమ, ఇఫ్టూ నాయకులు జుత్తు వీరాస్వామి, గొరకల బాలకృష్ణ పాల్గొన్నారు. -
‘బండ’బారుతున్న బతుకులు
● క్వారీల్లో వరుస ప్రమాదాలు ● భద్రతా చర్యలు ప్రశ్నార్థకం టెక్కలి: కూలి పనుల కోసం వెళ్తున్న బారి బతుకులు అర్ధంతరంగా కూలిపోతున్నాయి. యజమానుల లాభాపేక్ష, యంత్రాంగం నిర్లక్ష్యం కలగలిపి బడుగు జీవుల ప్రాణాలు తీస్తున్నాయి. టెక్కలి మైన్స్ కార్యాలయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీల్లో ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే అధికారుల హడావుడి చేస్తున్నారు తప్ప భద్రతా ప్రమాణాలపై ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు. మెళియాపుట్టి మండలం గంగరాజపురంలో ముగ్గురు, దబ్బగూడలో మరో ము గ్గురు, టెక్కలిలో ఇద్దరు, తాజాగా కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు సమీపంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇవి పాటించాల్సిందే.. ● గ్రానైట్ క్వారీ నిర్వహణలో ముఖ్యంగా హెల్మెట్లు, సేఫ్టీ షూస్, గ్లోవ్స్, సేఫ్టీ గాగుల్స్ లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం తప్పనిసరి. ● భద్రతా సిగ్నల్స్, హెచ్చరికలతో సరైన హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ● సురక్షిత విధానాలు (సేఫ్టీ ప్రొటోకాల్) పాటించడం వాటిపై కార్మికులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించడం, మిషన్ల తగిన రక్షణ కవచాలు (గార్డింగ్స్) ఏర్పాటు చేసి, సరైన నిర్వహణ జరపాలి. ● ప్రమాదాలతో కూడిన ప్రమాద నిరోధక బోర్డులను ఏర్పాటు చేసి విపత్తుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ● ముఖ్యంగా మైన్స్ మేనేజర్ పర్యవేక్షణ ఉండాలి. ● బ్లాస్టింగ్ అనుమతులు కలిగిన క్వారీల్లో పోలీసులు తరచూ తనిఖీలు చేయాలి. -
యువతకు ఉద్యోగాలు కల్పించాలి
● జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి డిమాండ్ జయపురం: అవిభక్త కొరాపుట్ యువతకు ఉద్యోగాలు కల్పించాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పనకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. శుక్రవారం స్థానికి పారాబెడలోని ఓ కల్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగాల నియామకంలో అవిభక్త కొరాపుట్ యువకులపై పాలకులు చూపుతున్న పక్షపాత వైఖరిని తూర్పార పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా స్థాయిలో ఉద్యోగాల నియామకాలు జరిగేవని గుర్తు చేశారు. బీజేడీ, బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నాయన్నారు. యువత ఉద్యోగాలకు దూరమై వలస కార్మికులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో లక్ష్మిపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీనతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రూపక్ తురుక్, మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్, పార్టీ సీనియర్ నేతలు బినోద్ మహాపాత్రో, నిహారీ బిశ్వాల్, బసంత నాయిక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపాలిటీ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సమితి కాంగ్రెస్ అధ్యక్షులు బసంత నాయిక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నళినీరథ్ పాల్గొన్నారు. -
నర్సింగ్ కళాశాల విద్యార్థినుల నిరసన
● పొలంలో మొసలి పిల్ల కలకలం నబరంగ్పూర్ జిల్లాలో వ్యవసాయ పొలంలో మొసలి పిల్ల కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మర్కోట్ పట్టణ సమీపంలోని దర్గాగుడ గ్రామంలో భఘీ శెఠి అనే వ్యక్తి ట్రాక్టర్తో పొలం చదును చేయిస్తున్నాడు. అంతలో బురదలో మొసలి పిల్ల కదలికలు కనిపించాయి. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ యజమానికి సమాచారం ఇచ్చాడు. భఘీ శెఠి అప్రమత్తమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు వచ్చి మొసలి పిల్లని స్వాధీనం చేసుకున్నారు. అది 70 గ్రాముల బరువు, 28 అంగుళాల పొడవు ఉంది. వయసు ఒక నెలలోపు ఉందని గుర్తించారు. ఈ ప్రాంతంలో భస్కల్ నదితో పాటు అనేక చెరువులు ఉన్నాయి. దీంతో వాటిలో తల్లి మొసలి ఉంటుందని అధికారుల అనుమానిస్తున్నారు. నీటిలోకి దిగేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మొసలి పిల్లను అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం నదిలో విడిచి పెడతామని ప్రకటించారు. కొరాపుట్:● ఫకీర్ మోహన్ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల ఆందోళన భువనేశ్వర్: బాలాసోర్లోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి అశాంతి నెలకొంది. తమపై దాడి జరిగిందని ఆరోపిస్తూ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నిరసనకు దిగారు. విశ్వ విద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థినులు తమను కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆందోళనకు దిగిన విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నంలో వైస్ చాన్సలర్ స్పహ కోల్పోయారు. పరీక్షలు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయం ఏడు, ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వారు ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు. మంగళవారం రాత్రి వైస్ చాన్సలర్తో జరిగిన చర్చ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. -
ఉసురు తీసిన నిర్లక్ష్యం
అతడు వృద్ధుడు.. వయసు 62 ఏళ్లు.. అయినా గ్రానైట్ క్వారీలో ఒళ్లు హూనం చేసుకుని బతకడం అలవాటైన మనిషి. యజమానుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం అతడి ప్రాణాలు తీశాయి. కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు సమీపంలో గల అరసవల్లి గ్రానైట్ క్వారీలో రేగులపాడు గ్రామానికి చెందిన పల్లి ఎర్రయ్య (62) బండరాయి కింద పడి నలిగిపోయాడు. ఒంటి మీద ఎలాంటి రక్షణ కవచం లేకుండా పనిచేస్తున్న ఎర్రయ్యపై అమాంతం దూసుకువచ్చిన బండరాయి ప్రాణాల్ని నలిపేసింది. గ్రానైట్ రాయికి రంధ్రాలు చేస్తున్న సమయంలో రాయి దొర్లుకుంటూ వచ్చి అతడిపై పడింది. ఎర్రయ్యకు భార్య పార్వతి, వివాహితులైన కుమార్తెలు కింజరాపు ఉమా, దేశల్ల హేమలత ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదంలో మరికొంత మంది కార్మికులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. – టెక్కలి రూరల్ -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
సంతబొమ్మాళి: జీవనోపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కూలీ సంతబొమ్మాళిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లా దడకా గ్రామానికి చెందిన పుష్పరాజ్ సింగ్, ధర్మపాల్ సింగ్లు ఆరు నెలల క్రితం భద్రాచలం నాగేశ్వరరావుకు చెందిన రంగనాథ బోర్ వెల్స్లో దినసరి కూలీలుగా చేరారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి సంతబొమ్మాళిలో బోరు వేసేందుకు వచ్చారు. భోజనాలు చేసి బహిర్భూమికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న పుష్పరాజ్సింగ్ మృతి చెందగా..వెనుక ఉన్న ధర్మపాల్సింగ్కు గాయాల య్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొ మ్మాళి ఎస్సై వై.సింహాచలం గురువారం తెలిపారు. -
జగన్నాథ్ రథ నిర్మాణ పనులు పరిశీలన
జయపురం: ప్రపంచ ప్రసిద్ధ ఘోషయాత్ర(రథయాత్ర) కోసం జయపురంలో జగన్నాథ్, బలబధ్ర, సుభద్రల కోసం నిర్మాణాధీనంలో ఉన్న రథాల నిర్మాణ పనులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గురువారం పర్యవేక్షించారు. దేవాదాయ అధికారి, జయపురం తహసీల్దార్ సబ్యసాచి జెన, దేవాదాయ ధర్మాదాయ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి, కమిటీ సభ్యులు డాక్టర్ పరేష్ రథ్లతో రథాలు నిర్మాణం జరుగుతున్న శ్రీరఘునాథ్ మందిర కూడలి వద్దకు వచ్చి రథాల నిర్మాణ పనులు పరిశీలించారు. రథాలు చేస్తున్న వడ్రంగి టీమ్తో పనుల పురోగతిపై చర్చించారు. రథ యాత్రకు ఇంకా కొద్ది దినాలే సమయం ఉండటం వలన యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు. మొక్కలతో పర్యావరణ పరిరక్షణ మల్కన్గిరి: మల్కన్గిరి సమితి సెరపల్లి పంచాయతీలో గల లక్ష్మణ్ వీర హైస్కూల్లో గురువారం ఔషధ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి వివిధ రాకాల మొక్కలు నాటి, మొక్కల అవసరాల గూర్చి వివరించారు. పర్యావరణం సమతుల్యతను కాపాడాలన్నారు. జిల్లా శారీరక వైద్యాధికారి కార్తీక్ చంద్ర బెహరా, జూనియర్ రెడ్క్రాస్ అధికారి నిరంజన్ మహరాణా, తదితరులు పాల్గొన్నారు. దేశ సేవలో యువత భాగస్వామ్యం కావాలి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా యంత్రాంగం విస్తృత అవగహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్ వైమానిక దళంలో జిల్లా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అగ్నివీర్ వాయు నియామకాల కోసం జరుగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను జిల్లా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు చేరవేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ షర్వింద్ రాజశిర్కే అధ్యక్షతన జిల్లా స్థాయి వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జిల్లా నైపుణ్యభివృద్ధి, ఉపాధి అధికారి గుప్త మాడి నిర్వహించారు. జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ సంస్థల ప్రిన్సిపాళ్లు, అధికార్లు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడూతూ జిల్లాలోని ప్రతి విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు భారత వైమానిక దళంలో సేవ చేయడం కోసం ప్రోత్సహించాలన్నారు. ఆన్లైన్ ప్రక్రియను పూర్తిచేయ్యాలన్నారు. కొత్తూరు: కొత్తూరు రాజవీధికి చెందిన లోతుగెడ్డ ధనుంజయ్ ఇంట్లో ఈ నెల మూడో తేదీ రాత్రి జరిగిన దోపిడీ కేసులో నిందితులను గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. వీరిలో కొత్తూరుకు చెందిన సొంట్యాన నవీన్(దాస్), టొంపల వినయ్కుమార్, సిరువాడ గ్రామానికి చెందిన కొన్న తరుణ్, ఎల్ఎన్పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన కురమాన శ్రీనివాసరావులకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారని చెప్పారు. నలుగురు నిందితులను జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
శాంతిభద్రతలు కాపాడాలి
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణ ముదిలికి బొయిపరిగుడ ఆదివాసీ మహా సంఘం కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఆదివాసీ మహాసంఘ్ అధ్యక్షుడు భక్త రామ్ నాయక్, కార్యదర్శి సను తెంతులిపొడియ నేతృత్వంలో సంఘ్ కార్యకర్తలు పోలీసు అధికారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బొయిపరిగుడ పోలీసు అధికారితో సమితిలో శాంతిభద్రతలపై చర్చించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దొంగతనాలు, నేరాలు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ మహాసంఘ్ అద్యక్ష, కార్యదర్శులతో పాటు లలిత పూజారి, లక్ష్మణ పూజారి, ధనపతి నాయక్,అభి నాయక్, ధనసాయి పొరజ, కృష్ణ శాంత, సురేంద్ర ముదులి తదితరులు అధికారికి స్వాగతించారు. -
నేడు పీడీఎస్యూ విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు
పలాస: కాశీబుగ్గలోని టి.కె.ఆర్.కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పి.డి.ఎస్.యు. విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ చెప్పారు. గురువారం పలాస సూదికొండ కాలనీలోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.వినోద్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులు, శాసీ్త్రయ, లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణపై విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పి.డి.ఎస్.యు.రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.ప్రసాద్, భారత విద్యాహక్కుల వేదిక నాయకులు రమేష్ పట్నాయక్, ఎ.పి.టి.ఎఫ్. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. -
ఎన్హెచ్ అధికారులు సెలవులపై వెళ్లిపోండి
కొరాపుట్: జాతీయ రహదారి విభాగ అధికారులు తక్షణమే సెలవులపై వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డీఎన్కే సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లా ప్రణాళిక సంఘం సమావేశం వద్ద మీడియాతో మాట్లాడారు. సునాబెడా–కొరాపుట్ జాతీయ రహదారి పరమ అధ్వానంగా మారిందన్నారు. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుకు కనీస మరమ్మతులు చేయాలనే ఆలోచన రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనులు చేయని అధికారులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజల చేత తాము విమర్శలు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో నేతృత్వంలో ప్రణాళిక సంఘం సమావేఽశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎమ్మెల్యేలు పవిత్ర శాంత, రుపుధర్ బోత్ర, జెడ్పీ చైర్పర్సన్ సస్మిత మెలక తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
శ్రీకాకుళం రూరల్: కేంద్రియ విద్యాలయంలో మెరు గైన ఫలితాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాల ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చా రు. పీఎం కేంద్రియ విద్యాలయంలో గురువారం నిర్వహించిన విద్యాలయ నిర్వాహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తీర్ణత, క్రీడాపోటీలు, ఫ్యాకల్టీ తదితర అంశాలపై ఆరా తీశారు. జేఈఈ, బిట్సాట్, ఎంసె ట్, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత వివరాలు అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు ప్రతినెలా ఆరోగ్య తనిఖీలు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. శ్రీకాకు ళం నుంచి కేంద్రియ విద్యాలయానికి ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, డీఈవో రవిబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
రాయగడ: సదరు సమితిలోని ఒడ్డుగుడ గ్రామ సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం 77వ వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మేజిస్ట్రేట్ దామోదర్ రథో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. జీవనాధారమైన మొక్కలను ప్రతీ ఒక్కరూ నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్పెషల్ జడ్డి సంజిత్ కుమార్ బెహరా, అదనపు జిల్లా జడ్డి అల్పన స్వయి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా స్థానిక ప్రేమ్ పహాడ్ వద్ద లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో క్లబ్ మహిళలు పెద్ద సంఖ్యలొ పాల్గొని పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. క్లబ్ అధ్యక్షురాలు కస్తూరీ సాహు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలకాదాస్, కార్యదర్శి జ్యోతి ప్రభ మహాపాత్రో, కోశాధికారి బి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఐడీఎస్పీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వైద్య ఆరోగ్య శాఖలో ఐడీఎస్పీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డేటా మేనేజర్– 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ – 1, లేబొరేటరీస్– 1 పోస్టు లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. srikakulam.nic.in లో నోటిఫికేషన్ అందుబాటులో ఉందని వివరించారు. దరఖాస్తుల ను ఐడీఎస్పీ విభాగం, 3వ అంతస్తు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం, శ్రీకాకుళంలో జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని కోరారు. టెక్కలి రూరల్: బన్నువాడ గ్రామానికి చెందిన బొడ్డ గేయామృత మహిళా బాక్సింగ్ కోచ్ శిక్షణకు ఎంపికై నట్లు శిక్షకుడు నర్శిపురం శేఖర్ గురువారం తెలిపారు. ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి చెందిన ఈ విద్యార్థిని ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయగా అందులో గేయామృత ఒకరు. వీరిని ఉత్తమ సర్టిఫైడ్ కోచ్లుగా తీర్చిదిద్దుతారు. ఈ నెల 13 నుంచి పంజాబ్ రాష్ట్రం పటియాలాలో జరగబోయే శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారని శేఖర్ తెలిపా రు. గేయామృత శిక్షణకు కావాల్సిన సామగ్రిని జిల్లా క్రీడా అధికారి మహేష్బాబు అందించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : సమాజంలో దివ్యాంగులైన పిల్లలకు సమాన గుర్తింపు, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. నగరంలోని ఏపీహెచ్ బీ కాలనీలో బెహరా మనోవికాస కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. చిన్నారు ల ప్రతిభ, వారు నేర్చుకుంటున్న విద్య, శిక్షణ, వినోద కార్యక్రమాలను పర్యవేక్షించారు. థెర పీ, కౌన్సెలింగ్ సేవలను అడిగి తెలుసుకున్నా రు. శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి చిన్నారులు ముందడుగు వేసేలా సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో వికాస కేంద్ర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అడ్డగుట్ట : ఈ నెల 7న శబరి ఎక్స్ప్రెస్లో భార్య కళ్ల ముందే భర్త, మరో మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ(36) గురువారం మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. భర్త పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎచ్చెర్ల : సనపలవానిపేట సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం మురపాక పంచాయతీ నాజానపేట గ్రామానికి చెందిన జగ్గురోతు రామారావు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన తన భార్యతో కలిసి ఉదయం ఇంటి నుంచి బైక్పై బయల్దేరి పండిపేట వద్ద భార్యను దించాడు. డ్యూటీ నిమిత్తం సనపలవానిపేట వచ్చి తిరిగి వెళ్తుండగా చిలకపాలెం నుంచి రాగోలు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. రామారావుకు భార్య వరలక్ష్మీ, ఇద్దరు కుమారులు గిరిధర్, వెంకటేష్ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రమాదకరంగా బొరిగుమ్మ–కొరాపుట్ మార్గం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి రాణిగఢ్ మీదుగా బొరిగుమ్మ వెళ్లే మార్గం అత్యంత ప్రమాదకరంగా మారింది. గత పది రోజులుగా కురుస్తున్న భారా వర్షాలకు ఈ మార్గం బాగా దెబ్బతింది. ఈ విషయం తెలియని అనేక భారీ వాహనాలు జీపీఎస్ను అనుసరిస్తూ ఈ గోతులలో కూరుకు పోతున్నాయి. విశాఖ పట్నం–రాయ్పూర్ జాతీయ రహదారి పై ప్రయాణం చేసే వాహనాలు 13 కిలో మీటర్ల దూరం తగ్గుతుండడంతో జయపూర్ వెళ్లకుండా రాణిఘఢ్ మార్గం ఎంచుకుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. అనేక ఇతర రాష్ట్రాల వాహనాలు బురదలో చిక్కుకు పోయాయి. వాహన దారులను రక్షించే నాథుడు కరువయ్యాడు. నిత్యం కొరాపుట్ నుంచి మెకానిక్లు వెళ్లి వాహనాలు వెలికి తీయడానికి రాత్రింబవళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. -
పేదల భూములు పేదలకే అప్పగించాలి
రణస్థలం: పేదల కోసం కేటాయించిన భూములను పేదలకే అప్పగించాలని, పెద్దల పేరుతో రాయించుకున్న వాటిని తక్షణమే రద్దు చేయాలని సుమారు 200 మంది జీరుపాలెం గ్రామస్తులు తహసీల్దార్, ఎస్సైల ఎదుట డిమాండ్ చేశారు. వారం రోజులుగా జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురంలో గ్రామపెద్దలకు, గ్రామస్తులకు మధ్య తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. 13 మంది గ్రామపెద్దలు వారి కుటుంబ సభ్యుల పేరుతో 271, 272, 273 సర్వే నంబర్లలో రాయించుకున్న సుమారు 20 ఎకరాల భూమిని రద్దు చేసి పేదలకు అందజేయాలని మహిళలు, యువత, గ్రామస్తులు గురువారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సనపల కిరణ్కుమార్ మాట్లాడుతూ భారీగా గ్రామస్తుల చేరుకుని నినాదాలు చేస్తే గందరగోళం జరగడం తప్ప సమస్యకు పరిష్కారం జరగదన్నారు. ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సై ఎస్. చిరంజీవి మాట్లాడుతూ గ్రామం మొత్తం తరలివస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇరుపక్షాలు ఈ భూమిపైకి రాకుండా చూస్తామని, కొన్ని రోజులు శాంతియుతంగా ఉంటే సమస్య పరిష్కరించే చొరవ తీసుకుంటామని హామీఇచ్చారు. -
ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత విద్యార్థి ఫెడరేషన్ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రతినిధులు నిరాహార దీక్ష చేపట్టారు. రిటైర్డ్ డిప్యూ టీ డీఈవో కొత్తకోట అప్పారావు, సీఐటీయూ ప్రధా న కార్యదర్శి పి.తేజేశ్వరరావులు శిబిరాన్ని ప్రారంభించి విద్యార్థులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు, కార్యదర్శి పి.ఖగేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ జన తా పార్టీ 19 రోజులుగా, సోనమ్ వాంగుక్, విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 11 రోజులు పూర్త య్యిందన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వంద లాది మంది విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నా రని చెప్పారు. వారికి మద్దతుగా శ్రీకాకుళంలోనూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. -
ఉప రాష్ట్రపతికి గవర్నర్ విందు
భువనేశ్వర్: ఒక రోజు రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి గురువారం నాడు లోక్ భవన్న్యూ అభిషేక్ హాల్లో అధికారిక విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రథమ మహిళ డాక్టర్ జయశ్రీ కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), అదే శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, డిప్యూటీ స్పీకర్ భబానీ శంకర్ భోయ్, న్యాయ, ప్రజా పనులు, అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్, ఉన్నత విద్య, క్రీడలు – యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం – సంస్కృతి శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, సహకార, చేనేత, వస్త్ర, హస్త కళల శాఖ మంత్రి ప్రదీప్ బల్ సామంత, మత్స్య, పశు సంపద అభివృద్ధి, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి గోకులానంద మల్లిక్, ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విందు అనంతరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి ఉప రాష్ట్రపతికి, ఇతర ప్రముఖులకు మహా ప్రభువు శ్రీ జగన్నాథుని పవిత్ర రథాన్ని పోలిన తారొకొసి (వెండి తీగల అల్లిక) హస్త కళా స్మారక చిహ్నాలను బహూకరించారు. -
ఏఐపై శిక్షణ
రాయగడ: స్థానిక పితామహాల్లో గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో కొత్తగా చేరిన 11వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిసి గురువారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాడి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, సమయపాలన, నిరంతర కృషి ఫలితమే విజయానికి మూల సూత్రాలన్నారు. ఆధునిక విద్యాలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యాన్ని వివరించి, దానిని సానుకూలంగా వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్లో ఏఐ ఆధారిత కేరీర్ అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయన్నారు. విద్యలోనే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల నిబంధనలు, క్రమశిక్షణ, సీబీఎస్ఈ మార్గదర్శకాలు, హాజరు, బోధన, హోంవర్క్, అంతర్గత మూల్యాంకనం, పరీక్షల విధానం, తదితర విషయాలపై తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సెంచూరియన్ స్కూల్ మోబైల్ యాప్ను పరిచయం చేశారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల రోజువారి హాజరు, తరగతి పనులు, పరీక్షల షెడ్యూల్, ఫలితాలు, నోటిఫికేషన్లు, పాఠశాలకు సంబంధించిన ముఖ్య సమాచారం తల్లిదండ్రులు ఇంటి నుంచే సులభంగా తెలుసుకునే వీలుంటుందని వివరించారు. ఈ ఆధునిక డిజిటల్ వ్యవస్థపై తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు. -
13న కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ మహాధర్నా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని క్రాంతి భవన్లో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.సోమశేఖర్, సీహెచ్ రవి మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి రెండేళ్లవుతున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం తగదన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు దాదాపు రూ.10వేల 700 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటిస్తున్నారే తప్ప విద్యార్థుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కావడం లేదన్నారు. రెండేళ్లుగా రూ 2,200 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. వసతి దీవెన పథకం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు చెల్లించేవారని గుర్తు చేశారు. తక్షణమే తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కమాటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు అశోక్, హర్షవర్ధన్, ఉదయ్, సాయి, భవాని తదితరులు పాల్గొన్నారు. -
హిరాకుద్ జలాశయం వరద నీరు విడుదల
భువనేశ్వర్: హిరాకుద్ జలాశయం నుంచి ఈ సీజను తొలి విడత వరద నీటిని గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం హిరాకుద్ జలాశయం నీటి మట్టం 611.23 అడుగులుగా ఉంది. తొలుత ఉదయం 4 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేశారు. తదుపరి మద్యాహ్నం వేళలో మరో 6 గేట్లు ద్వారా లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేశారు. ఇలా తొలి రోజున మొత్తం 10 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేశారు. తొలి విడత కింద 4 గేట్ల ద్వారా 94 వేల క్యూసెక్కులు, మలి విడత కింద 6 గేట్లు తెరిచి 1 లక్ష 89 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విడులైన వరద నీరు 48 గంటల్లో దిగువ ప్రాంతంలో ముండలి జలాశయానికి చేరుతుందని అధికారులు తెలిపారు. హిరాకుడ్ జలాశయం 47 గేట్ల ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయని జల వనరుల శాఖ ఉన్నత ఇంజనీర్ దిలీప్ రౌత్ తెలిపారు. జలాశయంలో నీటి మట్టం నిర్వహణ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేయడం సాధారణ ప్రక్రియగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు అన్నారు. ఏబీవీపీ 78వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని గుమ్మబ్లాక్ పద్మపూర్ వద్ద బినోదినీ ప్లస్ టు ఆర్ట్స్ కళాశాలలో మొక్కలను గురువారం నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ పట్నాయిక్, అధ్యాపకులు రబి పాణిగ్రాహి, కళాశాల ఆర్ట్స్ విభాగం అధ్యాపకులు బాలకృష్ణ జెన్నా, సామాజిక కార్యకర్త మనోజ్ దాస్, హరప్రియ, ఇందు, చండీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని మహిళా కళాశాలలోనూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. నేమ్ బోర్డులో తెలుగు తొలగింపు రాయగడ: రాయగడ రైల్వేస్టేషన్లో స్టేషన్ పేరును సూచించే బోర్డు నుంచి తెలుగు భాషను తొలగించి, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లిష్, హిందీ భాషలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఈ మార్పుపై స్థానికంగా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక అభ్యంతరాలు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు తొలగింపుపై ప్రశ్నించగా ఇప్పటివరకు ప్రజల నుంచి లేదా ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ అంశంపై అభ్యంతరాలు లేదా వినతులు అందితే పరిస్థితిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న రాయగడ జిల్లాలో గణనీయమైన సంఖ్యలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై తెలుగు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాటుసారా బట్టీలపై విస్తృతంగా దాడులు జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంధ్రా సమితిలో ఎకై ్సజ్ సిబ్బంది పోలీసుల సహకారంతో నాటుసారా బట్టీలపై విస్తృతంగా దాడులు కొనసాగిస్తున్నారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుంధ్ర సమితి ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో గురువారం వివిధ గ్రామాల్లోని బట్టీలపై దాడులు నిర్వహించి వేలాది లీటర్ల నాటుసారాతో పాటు, సారా వంటకానికి సిద్ధం చేసిన ఊటను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. అలాగే బట్టీల్లో వంట సామగ్రి, సారా డ్రమ్ములను సీజ్ చేసినట్లు తెలిపారు. యువకుని ఆత్మహత్య రాయగడ: స్థానిక రామకృష్ణ నగర్లో నివసిస్తున్న థొపా సుందర్ కుమార్ (16) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అతని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలియజేశారు. -
ఆశా కార్యకర్తల ఆందోళన
పర్లాకిమిడి: తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు కోరుతున్నారు. ఈ మేరకు ఒడిశా రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం గజపతి జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. వీరికి భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు సుజిత్ ప్రధాన్ మద్దతు పలికారు. ఆశా వర్కర్లకు వేతనం రూ.18 వేలకు పెంచాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సామాజిక సురక్ష సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతినెనా 10వ తేదీ నాటికి వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృత్యువాతపడిన ఆశాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, గాయపడినవారికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఏడీఎం ఫల్గునీ మాఝికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ ఉష, కార్యదర్శి సమాఖ్య గోమాంగో పాల్గొన్నారు. రోడ్డెక్కిన ఆశ కార్యకర్తలు మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఉద్యోగాలను శాశ్వతం చేయడం, ప్రస్తుతం నెలకు అందుతున్న రూ.7 వేల పారితోషికాన్ని రూ.26వేలకు పెంచడం, సామాజిక భద్రత, పెన్షన్, బీమా సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. అనంతరం కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్కు వినతి పత్రం అందజేశారు. ఆశ కార్యకర్తకు బహిష్కరణ బెదిరింపులు పర్లాకిమిడి: మతం పేరుతో ఒక ఆశ కార్యకర్తను ఒక మైనార్టీ సంఘం నుంచి బహిష్కరిస్తామని బెదిరించిన సంఘటన గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ జిరంగో గ్రామంలో వెలుగుచూసింది. బాఽధితురాలు ఎస్పీ కార్యాలయం వద్ద తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయఘడ సమితి జిరంగో గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త సునందినీ మిశాల్ ఆ గ్రామంలో ఉన్న ఒక మతానికి చెందిన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి సేవలు అందించారు. ఆమె సొంత మైనార్టీ సంఘం (క్రిష్టియన్) సొసైటీ సభ్యులు ఆమెకు రూ.5వేల జరిమానా విధించటంతో పాటు సంఘం నుంచి బహిష్కరించారు. కొద్దిరోజుల కిందట జిరంగో గ్రామ మత సొసైటీ ఒక నియమం పెట్టింది. అయితే గత నెల 12 వతేదీని గ్రామంలో వేరే వర్గానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు రావడంతో వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి వారికి తగు సలహా ఇచ్చింది. అలాగే ప్రభుత్వం ఆదేశించిన జనగణన నివేదిక సేకరించడానికి వెళ్లడంతో సంఘం నేతలు ఆమెకు జరిమానా విధించటమే కాకుండా గ్రామ బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఆశ వర్కరు సునందినీ ఆందోళన వ్యక్తం చేసి రాయగడ పోలీసు స్టేషన్కు ఒక కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆమె ఫిర్యాదును తీసుకోలేదు. దీంతో ఆమె జిల్లా ముఖ్యవైధ్యాధికారి, జిల్లా ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని విన్నవించింది. అయితే జిరంగో మైనారిటీ సంఘం నేతలు గురువారం పర్లాకిమిడి విచ్చేసి ఆశావర్కరు సునందినీ మిశాల్ చెప్పిందంతో బూటకమని ఆమె మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనాకు ఒక మెమొరాండమ్ అందజేశారు. అనంతరం స్థానిక రోడ్లు–భవనాల శాఖ బంగళా వద్ద జిరంగో మైనార్టీ సంఘం విలేకరులతో సమావేశమై ఆశావర్కరు సునందినీ కులసంఘంపై వ్యతిరేకంగా ఇచ్చిన నివేదిక తప్పు అని వివరణ ఇచ్చారు. -
వికసిత్ భారత్కు పునాది
● భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్భువనేశ్వర్: శాసీ్త్రయ వైజ్ఞానిక సామర్థ్యం ఐచ్ఛికం కాదు, వికసిత భారత్కు పునాది అని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ ప్రబోధించారు. ప్రపంచంలో వేగవంతమైన మార్పులకు విజ్ఞాన శాస్త్రం విధానాలకు మార్గ నిర్దేశం చేసి సుస్థిరతను నిర్ధారించాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జాతీయ విజ్ఞాన విద్య, పరిశోధన సంస్థ నైజర్ 15వ స్నాతకోత్సవంలో ఉత్తీర్ణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. శాసీ్త్రయ విజ్ఞానం, ఆవిష్కరణ, మేధో నాయకత్వంలో భారత దేశ ఆకాంక్షలకు నైజర్ ప్రతీకగా నిలుస్తుందని ఉప రాష్ట్రపతి అన్నారు. బలమైన పునాదితో ప్రాథమిక వైజ్ఞానిక శాస్త్రాలలో కొత్త తరాలకు మార్గ దర్శకంగా నిలవడంలో నైజర్ భారత దేశపు దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. డాక్టర్ హోమీ భాభాకు నివాళులర్పిస్తూ.. ఆయన మరణం భారత దేశ అణు పరిశోధనకు ఒక పెద్ద ఎదురు దెబ్బ అని ఉప రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. ఆ విషాదం నుంచి భారత దేశం మరింత బలంగా పుంజుకుని నేడు అణు పరిశోధనలో ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులైన విద్యార్థులపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉత్తీర్ణుల్లో చాలా మంది భవిష్యత్లో డాక్టర్ హోమీ బాబాలుగా ఎదిగి భారత దేశ శాసీ్త్రయ, సాంకేతిక పురోగతికి గణనీయమైన కృషి చేస్తారని భారత ఉప రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. స్నాతకోత్సవం పురస్కరించుకుని కేవలం విద్యా అర్హత పత్రాన్ని మాత్రమే పొందడం లేదు. మీ భుజాలపై సమాజం పట్ల ఒక పెద్ద బాధ్యతను మోసేందుకు సన్నద్ధతని అంగీకారబద్ధంగా స్వీకరించారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం కేవలం విజ్ఞాన శాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యమని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఉత్తీర్ణులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పట్టభద్రులుగా ఉత్తీర్ణత సాధించిన యువత విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, దేశ నిర్మాణ ప్రక్రియకు విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాల పురోగతి ఒక సంపన్న దేశానికి పునాది. భారతీయ యువ పరిశోధకులు, పట్టభద్రులు ఉత్తీర్ణతతో సాధించిన డిగ్రీల ప్రతిఫలాన్ని దేశాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అణుశక్తి శాఖ కార్యదర్శి డాక్టర్ అజిత్ కుమార్ మహంతి, నైజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ హిరేంద్రనాథ్ ఘోష్ హాజరయ్యారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సందర్శన
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ, ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల డీన్ ఎస్పీ నందా, సి.సి.డి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజుతో సహా నలుగురు ఉద్యానవనశాఖ అధ్యాపకులు బృందం రాయఘడ బ్లాక్ మండలసాయి పంచాయతీలో సింధిబా గ్రామంలో ఉన్న ఐ.టి.డి.ఎ గజపతి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించారు. జిల్లాలో ఏకై క పైనాపిల్ ఫుడ్ స్లయిసెస్ యూనిట్ను ప్రభుత్వం రూ.60 లక్షలతో నిర్మించింది. దీనిని మిషన్ శక్తి మహిళా స్వయం సహాయక గ్రూపు నడిపిస్తుంది. జిల్లాలో 70 గ్రామాల్లో పండుతున్న పైనాపిల్ పంట రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో అనాస పనస ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మూతబడింది. దీనిని సెంచూరియన్ వర్సిటీ కొనుగోలు చేయాడానికి ముందుకు రావడంతో కొంతమంది బృందం సింధిబా గ్రామానికి వెళ్లి అధ్యయనం చేశారు. ప్రస్తుతం సాధారణ నేల అనాస వంద పండ్లు రూ.400 మాత్రమే ధర పలుకుతుంది. అదే క్వీన్ రకం అనాస రూ.50లు (ఒకటి) పలుకుతుంది. త్వరలో అనాస పనస ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను సెంచూరియన్ వర్సిటీ కొనుగోలు చేసి అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థుల పరిశోధనకు వినియోగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు వర్సిటీ అధ్యయన బృందం సభ్యుడు డాక్టర్ ఎస్పీ నందా తెలిపారు. -
‘పది లక్షల మొక్కలు నాటుదాం’
పర్లాకిమిడి: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా మనం చూడాలని, అందువల్ల ప్రతి విద్యార్థి ఒక మొక్కను మన తల్లి పేరున నాటాలని జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు అన్నారు. గుసాని బ్లాక్ దేవితి గ్రామంలో ఉన్న ఓ.యస్.ఏ.పి. పోలీసు 3వ బెటాలియన్ మైదానంలో 77వ జిల్లా స్థాయి వన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, ఓ.యస్.ఏ.పి.కమాండంటు దీప్తి రంజన్ జెన్నా, డి.ఎఫ్.ఓ. కె.నాగరాజు, ఏ.సి.ఎఫ్. షైనీశ్రీ దాస్, ఏ.సి.ఎఫ్ అరుణ్ కుమార్ సాహు పాల్గొన్నారు. ఈ ఏడాది జిల్లాలో 10 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించామని, అలాగే అర్బన్ ప్రాంతాలైన పర్లాకిమిడి, కాశీనగర్ ఎన్ఏసీలో పదివేల మొక్కలను నాటడానికి కృత నిశ్చయంతో ఉన్నామని డీఎఫ్ఓ కె.నాగరాజు అన్నారు. అలాగే ఏనుగులు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఒక ఆశ్రయం నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని డీఎఫ్ఓ అన్నారు. ఫారెస్టు కాకుండా ఇతర ప్రాంతాల్లో 770 హెక్టార్లలో ఐదు వేల మొక్కలు రంప పంచాయతీలో వనమహోత్సవాల సందర్భంగా నాటుతామని ఏసీఎఫ్ అరుణ్ కుమార్ సాహు అన్నారు. జిల్లాలోని ఉత్తమ వనసంరక్షణ సమితి (వి.యస్.యస్.) గా ఎంపికై న దేవగిరి రేంజ్ పరిధి గోటై (నారాయణపూర్) వి.యస్.యస్.కు రూ.50వేల రూపాయల చెక్కును అధికారులు అందజేశారు. -
సుందర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
● ఇద్దరు దుర్మరణం భువనేశ్వర్: సుందర్గడ్ జిల్లా పట్కిజోర్ ఘాటి సమీపంలో మంగళ వారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బొలెరో, కమాండర్ వాహనాలు ముఖాముఖి ఢీకొన్నాయి. ఢీకొన్న తర్వాత బొలెరో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లగా కమాండర్ వాహనం నుజ్జునుజ్జు అయింది. దీంతో ఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు పైబడి వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సుందర్గఢ్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు -
గజపతి జిల్లాలో డాక్టర్ల కొరత
● స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆయుర్వేదిక్ కళాశాల నిర్మిస్తామని రాష్ట్రఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ గజపతి రాయగడ పర్యటనలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ గజపతి జిల్లాలో కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఈ విషయాన్ని మంగళవారం భువనేశ్వర్లో జరిగిన విధానసభ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిలదీశారు. అలాగే గజపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో ఏసీలు, ఐసీయూ పనిచేయడం లేదని, జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టులు చాలా ఏళ్లుగా భర్తీ కాకుండా ఉన్నాయని ప్రస్తావించారు. రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే బిభూతీ భూషన్ ప్రధాన్ అధ్యక్షత వహించగా, శాసనసభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశాంత బెహారా, ఎమ్మెల్యే ఉమాచరణ్ మల్లిక్, ప్రకాష్ చంద్ర శెఠి, సుభాషిణీ జెన్నా, సత్యజిత్ గోమాంగో, స్వస్థ్య సెక్రటరీ పాల్గొన్నారు. -
కర్రలు చేతబట్టిన మహిళలు
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంధ్రా సమితిలో కొంత కాలంగా మహిళలు చేపట్టిన మదుముక్తి (మద్యం ముక్తి) ఆందోళన సోమవారం తారస్థాయికి చేరుకుంది. సోమవారం కుంధ్రా సమితి కార్యాలయంలో జన సునాణిలో పాల్గొనేందుకు కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ కుంధ్ర గ్రామానికి వచ్చారు. కలెక్టర్ను చూసిన మధు ముక్తి మహిళా ఆంధోళన కారులు కర్రలు చేత పట్టి ఆయనను చుట్టు ముట్టారు. కొంత సమయం కలెక్టర్ ఆందోళనకారులకు వాగ్వాదం జరిగింది. మహిళలు దేశీ, విదేశీ మద్యం దుకాణాలను, బీహారీ సారాదుకాణాలను మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు కలెక్టర్ కుంధ్ర లోగల బిహారి సారా దుకాణానికి తాళాలు వేసి సీల్ వేయమని జయపురం సబ్ కలెక్టర్, కొరాపుట్ జిల్లా అబ్కారీ అధికారులను ఆదేశించారు. -
జనజీవనం అస్తవ్యస్తం
కొరాపుట్: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత మూడు రోజులుగా కురిసిన వర్షం మంగళవారం తెరిపివ్వడంతో నష్టాలు వెలుగులోనకి వచ్చాయి. కొరాపుట్ జిల్లా పొట్టంగి నుంచి సుంకి మార్గం అధ్వానంగా మారింది. విశాఖపట్నం–రాయ్పూర్ జాతీయ రహదారి కావడంతో నిత్యం ఈ మార్గంలో వందలాది వాహనాలు ప్రయాణిస్తాయి. భారీ గోతులు ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. నందపూర్లో భారీ చెట్టు నేల కులడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి చెట్టును తొలగించారు. భవానీపట్న మెయిన్ రోడ్డులో మరో చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కెంజోర్ జిల్లా టెల్కోయ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. హనుమతియా కాలువలో తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ వంతెన దాటడానికి ప్రయత్నం చేసిన ఏనుగు నీటిలో పడింది. వరద నీటిలో సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. -
అంబులెన్స్లో ప్రసవం
రాయగడ: అంబులెన్స్లో గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. జిల్లాలోని గుడారి సమితి పరిధి చాకుండా గ్రామానికి చెందిన భాను జగరంగా అనే గర్భిణికి సోమవారం ప్రసవ వేదన ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. పద్మపూర్ నుంచి అత్యవసర వైద్య సిబ్బంది (ఈ.ఎం.టి) యుగళ్ కిశోర్ సబర్, డ్రైవర్ ఎం.మాధవ్, సహాయకుడు రవి సబర్, ఆశా కార్యకర్త జ్యొతి మాఝి పద్మపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మార్గమధ్యలో బడనాల సమీపానికి చేరుకునే సరికి ప్రసవ వేదనలు తీవ్రంగా పెరగడంతో అంబులెన్స్ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈఎంటీ, ఆశ కార్యకర్త సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. తల్లి, శిశువును వెంటనే పద్మపూర్ సీహెచ్సీకి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయగడ వంటి మారుమూల ప్రాంతాల్లో రవాణా సమస్యలు కారణంగా గర్భిణిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యలో 108 అంబులెన్స్ సిబ్బంది ఇద్దరి ప్రాణాలను కాపాడటంపై ప్రజలు అభినందనలు తెలిపారు. క్షతగాత్రుడిని రక్షించిన వైద్యుడు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి బైక్పై వస్తూ అకస్మాతుగా పడిపోయాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వైద్యుడు దేవీప్రసాద్ నాథ్ వెంటనే సంఘటన స్థలాని చేరుకుని స్థానికుల సహయంతో క్షతగాత్రుడిని పరీక్షించారు. సృహ లేకపోవడంతో వెంటనే ప్రాథమిక చికిత్స అందజేశారు. కొద్ది సమయం తరువాత సృహలోకి రావడంతో అటుగా వస్తున్న విద్యుత్శాఖ వాహనం ఆపి మైరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు చేసిన ఈ సహాయాన్ని స్థానికులు అభినందించారు. -
అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై శిక్షణ
రాయగడ: సదరు సమితి సమావేశం హాల్లో సోమవారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్–జిపిడిసి) రూపకల్పనపై ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని బీడీఓ సుజిత్ కుమార్ మిశ్ర ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. సమితి వైస్ చైర్మన్ హర ప్రసాద్, జీపీడీఓ సృతిరేఖ నాయక్, పేసా సమన్వయకర్త యోగేంద్ర నాయక్, సీనియర్ ఉపాధ్యాయుడు నీలాంచల్ మిశ్రా, తదితరులు హాజరయ్యారు. సదరు సమితి పరిధిలో గల పితామహాల్, కొత్తపేట, కుముటిలపేట, కొంధొ మల్లిగాం గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కార్డు సభ్యులు, కార్యనిర్వాహక అధికారులు, జిఆర్ఎస్లు, విద్య, ఆరోగ్యం, సరఫరా, జీవిక మిషన్ తదితర శాఖలకు చెందిన అధికారులు ప్రతినిధులు శిక్షణలో పాల్గొన్నారు. వికసిత ఒడిశా లక్ష్య సాధనలో భాగంగా గ్రామ పంచాయతీ నుంచే శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని, 16వ ఆర్థిక సంఘం నిధులను అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని బీడీఓ వివరించారు. వివిధ శాఖల అభివృద్ధి పథకాలు, అమలు విధానాలపై చర్చించారు. -
మంత్రి జాదవ మజ్జికి ఘన నివాళి
కొరాపుట్: మాజీ మంత్రి జాదవ మజ్జి జయంతి ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా చందాహండిలో జాదవ మజ్జి విగ్రహానికి బీజేడీ కార్యకర్తలు నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ హయంలో జాదవ మజ్జి పరిశ్రమల మంత్రిగా కొనసాగారు. మాజీ మంత్రి రమేష్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మజ్జి, తదితరులు పాల్గొన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరం రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు వ్యవస్ధాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్యుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ట్రస్టు కార్యాలయం ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పితామహాల్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతొ నిర్వహించిన శిబిరంలో 170 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాయగడ పరిసర ప్రాంతాలకు చెందిన వారు శిబిరంలొ పాల్గొన్నారు. ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని శిబిరాన్ని పర్యవేక్షించారు. ప్రథమ చికిత్సపై అవగాహన మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా రెడ్క్రాస్ సొసైటీలో సోమవారం భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఒడిశా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమితి స్థాయి ఒక్కరోజు అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కన్గిరి, కలిమెల, పోడియా సమితుల కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో పీఎం శ్రీప్రభుత్వ నోడల్ హైస్కూల్ మల్కన్గిరిలో శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమితి విద్యా అధికారి మమతా సాయ్, ముఖ్య వక్తగా రంజాన్ కుమార్ స్వాయి హాజరయ్యారు. రెడ్క్రాస్ చరిత్ర, సీపీఆర్, ప్రథమ చికిత్స, విపత్తుల నిర్వహణ, రహదారి భద్రత తదితర అంశాలపై అవగహన కల్పించారు. నిరంజన్ మహరణ, మార్కండ్ దాస్, కార్తీక్ చంద్ర బెహరా, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం పొందూరు: మండలంలోని వావిలపల్లిపేట కూడలి వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రాజాం వైపు నుంచి చిలకపాలెం వైపు వెళ్తున్న ఊకలారీ కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కూడలి చిన్నది కావడంతో భారీ లారీ మలుపును దాటుతున్న సమయంలో అదుపుతప్పి తొలుత ఒరిగి నెమ్మదిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రెండు వైపులా ప్రయాణిస్తున్న వాహనదారులు గమనించి, వారి వాహనాలను నెమ్మదిగా చేయడంతో ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు. ఘటనలో లారీలో ఉన్న డైవర్, క్లీనర్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఊక లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటరు కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయాయి. కళాశాల బస్సులు, స్కూలు బస్సులు, అంబులెన్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. సుమారు గంట సమయం పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పొందూరు ఎస్ఐ సత్యనారాయణ రెండు క్రేన్లు తెప్పించి లారీని పక్కకు తీయించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. మోడ్రన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మోడ్రన్ పెంటాథ్లెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడ్రన్ ఫెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు గురువారం జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వర్షం కారణంగా పోటీలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజాంలోని జీసీఎస్ఆర్ డిగ్రీ కళాశాల వేదికగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాస్థాయి ఎంపికలు ఉదయం 9 గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఎంపికలకు హాజరవ్వాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో బాలుడు మృతి
రాయగడ: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వెళ్లిన 15 ఏళ్ల బాలుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి చేరకపొవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు రాయగడ జిల్లా బేడ్పదర్ గ్రామానికి చెందిన కడు మాఝి కొడుకు కమలాలోచన్ మాఝిగా గుర్తించారు. నెల రొజుల క్రితం నిర్మాణ కార్మికుడిగా పని చేసేందుకు విశాఖ వెళ్లిన కమల్ ఈ నెల నాలుగో తేదీన ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న సమయంలొ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించకపొవడంతో కటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారు. ఈ ఘటనపై స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు స్పందించి, మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొరుతున్నారు. కార్మిక శాఖ అధికారి బిష్ణు నాయక్, అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కార్యదర్శి సదన్ మాఝి, కాంగ్రెస్ నాయకుడు తుంబేశ్వర్ నాయక్ తదితరులు కలిసి మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకురావాలని కార్మిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఘటన స్వగ్రామంలో విషాదం -
దోపిడీ కేసులో నలుగురు అరెస్టు
రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదు, మోటారు సైకిల్, మోబైల్ఫోన్లు, ఇంటి తాళాలు పగులగొట్టేందుకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చందిలి ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు తెలియజేసిన వివరాల ప్రకారం.. జూన్ 28, 29 తేదీల మధ్యరాత్రి సుమారు మూడు గంటల సమయంలో ముకుందపూర్ గ్రామానికి చెందిన నమకీన్ వ్యాపారి తపన్ కుమార్ ప్రుష్టి ఇంటిపై ఎనిమిది మంది దుండగులు దాడి చేశారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకి చొరబడి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించి రెండు తులాల బంగారు గొలుసు, బంగారు మంగళసూత్రం, 80 వేల రూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు చందిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు జులై ఐదో తేదీన టును మాఝి, మను మాఝి, జితేంద్ర నాయక్లను అదుపులొకి తీసుకున్నారు. వారి నుంచి టీవీఎస్ అపాచి మోటార్ సైకిల్, నగదు, మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా జితేంద్ర నాయక్ ఈ దోపిడీతో పాటు మరో రెండు చోరీ కేసుల్లో కూడా ప్రమేయాన్ని అంగీకరించడంతొ దొంగిలించిన నగదులొ కొంత భాగాన్ని పోలీసులు రికవరీ చేసారు. అనంతరం సమాదేవ్ ఛత్రియాను కూడా అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 17,500 నగదును స్వాఽధీనం చేసుకున్నారు. -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో బాలాజీ ఆలయ 17వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఆలయం నుంచి మెయిన్ రోడ్డులో స్వామి వారిని ఊరేగించారు. తెలుగు ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామి వారికి తిరుమంజనం, కల్యాణ మహోత్సవాలు జరిగాయి. మధ్యాహ్నం అన్నప్రసాద సేవనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం పక్కనే నిర్మిస్తున్న కల్యాణ మండపం పని తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. సాయంత్రం సాముహిక కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో డాక్టర్ ధనుంజయ్ పట్నాయక్, రవి రెడ్డి, నందికేశ్వర్, అట్టి సురేష్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.


