breaking news
Odisha Latest News
-
కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతి
బూర్జ: మండలంలోని కొరగాం గ్రామానికి చెందిన పిన్నింటి వెంకన్న అలియాస్ వెంకటరమణకు చెందిన 17 గొర్రెలు, ఒక మేక కుక్కల దాడిలో మృతి చెందినట్లు గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సతీష్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో గొర్రెలు, మేకల మందను ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున మందపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. మృతి చెందిన జీవాలు విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పశువైద్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత సభ్యులు కోరుతున్నారు. బొరిగిపేటలో అనుమానితుల కలకలం టెక్కలి రూరల్: బొరిగిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కొందరు అనుమానిత వ్యక్తులు సంచరించడంతో గ్రామస్తులు వెంబడించారు. ఐదుగురిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వెంటనే విద్యుత్ స్తంభానికి కట్టేసి ప్రశ్నించారు. వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాసితుల హామీ నెరవేర్చేదెప్పుడు? కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వంశధార నిర్వాసితుల సంఘం నాయకుడు, మెట్టూరు బిట్–2 సర్పంచ్ యర్లంకి ధర్మారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ అన్నారు. మెట్టూరులో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో నిర్వాసితలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకుంటామని ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కృషి మేరకు నిర్వాసితులకు అదనపు ప్యాకేజి కింద రూ. 217 కోట్లు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలతో అదనపు ప్యాకేజీలు అందుకోని 30 శాతం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందివ్వాలన్న ఆలోచన లేకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో సర్పంచ్ పెదకోట సాదుబాబు, మురపాక శంకరరావు, పార్టీ నాయకులు నిమ్మగడ్డ కృష్ణారావు, యర్లంకి ధర్మారావు, సవర రమేష్, మఠం పూర్ణ, దుర్యోధన, మణి, రమణ తదితరుఉల పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పిద్దాం శ్రీకాకుళం: ఉపాధ్యాయులతో పాటు ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపత్రావు కిషోర్కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా భారత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడిని చులకనగా తీసుకోవద్దని, ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఉచితంగా ఇస్తూ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం రణభేరీ త్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, జిల్లా కేంద్ర స్థాయి, రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, వై.ఉమాశంకర్, కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శి డి.ప్రకాశరావు, జి.నారాయణరావు, బి.శంకరరావు, జి.సురేష్, టి.భాస్కరరావు, ఎం.మురళి ప్రకాష్, గణపతరావు, జైశ్రీరామ్, ఎం.వి.రమణ, బి.గౌరీశ్వరరావు పాల్గొన్నారు -
ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్ : విద్య, ఉపాధ్యాయరంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ (1938) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత ఈ శిబిరాన్ని సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి చింతాడ దిలీప్కుమార్ ప్రారంభించారు. ధర్నాకు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, జిల్లా అధ్యక్షుడు బి.రవి, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండేళ్లు దాటినా కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, ఎన్క్యాష్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
దాతలే దిక్కు
గార : ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఆరు నెలల కిందట తల్లిని, వారం క్రితం తండ్రిని మృత్యువు కబళించింది. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చింది. గార మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన శిర్ల చిన్నారావు, చిన్నమ్మడుల దంపతులకు పవన్కుమార్, మౌనిక ఇద్దరు పిల్లలున్నారు. చిన్నమ్మడు ఆరునెలల క్రితం దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి చిన్నారావే అన్నీ తానై పిల్లలను పెంచుతున్నాడు. ఇంతలో గత బుధవారం గుండెపోటుకు గురికావడంతో చిన్నారావు మృతి చెందాడు. అరునెలల వ్యవధిలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో అన్నాచెల్లెళ్లు దిక్కుతోచని స్థితిల్లో పడ్డారు. పెదనాన్న, చిన్నాన్న సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవ్వడం, మరోవైపు విషాదంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలున్నారు. పవన్కుమార్ అంపోలు బీసీ హాస్టల్లో పదో తరగతి, మౌనిక పాతపట్నం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అనాథలైన ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యమున్నా ఆర్థికంగా అండగా నిలిచేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 8309396387 నంబరుకు సంప్రదించాలని చిన్నాన్న శిర్ల రాము విజ్ఞప్తి చేస్తున్నారు. -
వర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిపిన అక్రమ నియామకాలు తక్షణమే రద్దు చేయా లని జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు అంకడాల తవిటన్న, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, వాల్తేటి సత్యనారాయణలు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైస్ చాన్సలర్ కె.ఆర్.రజని నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ద్వారా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, మంత్రులకు కనీసం గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తూ.. జిల్లా పరువు ప్రతిష్టలు మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. వర్సిటీలో పనిచేస్తున్న తూర్పు కాపు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతికి, అవకతవకలకు, అక్రమాలకు నిలయమైన వీసీ వెంటనే డిస్మిస్ చేసి ఆమె హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.అభివృద్ధి పనులు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బహిరంగంగా దోచుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం శాసనసభ కమిటీని నియమించి సమగ్ర విచారణ జరిపించాని కోరారు. కాగా, ఇటీవల పదోన్నతులు పొందిన ముగ్గురు ఉద్యోగులను సంఘ నాయకులు సత్కరించారు. పదోన్నతులు పొందిన వారిలో టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గొంటి తిరుపతిరావు, ఉపఖజానా శాఖ అధికారులు గార నిర్మల, బోర రవీంద్రలున్నారు. కార్యక్రమంలో తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శాసపు జోగినాయుడు, మక్కా శ్రీనివాస్, దాసరి రామచంద్రరావు, కర్ణం నరిసింగరావు, లావేటి సుందరరావు, దన్నాన మోహనరావు, కురిటి దుర్గారావు, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులు డిమాండ్ -
ఆరోగ్యం..ఆదాయం
సేంద్రియ సేద్యం.. సారవకోట : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ, కలుషితమే. తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్నింటా అనారోగ్య కారకాలే. ఈ నేపథ్యంలో చాలామంది సేంద్రియ, ప్రకృతి విధానంలో తయారైన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. కారణాలు ఏవైనా సేంద్రియ సాగు చేసే రైతులు మాత్రం మన జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తనకున్న భూమిలో మొత్తం సేంద్రియ విధానంలోనే వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయం సాధించడంతో పాటు సమాజానికి ఆరోగ్యకర ఉత్పత్తులు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సారవకోట మండలం కేళవలస పంచాయతీ పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహనరావు. తనకున్న 23 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతులతో కూరగాయలు, చిరు ధాన్యాలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కిడిమి గ్రామానికి సమీపంలో కొండలకు ఆనుకుని ఉన్న తన స్థలాన్ని సాగు భూమిగా మార్చి సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో అటు నేలతల్లికి, మానవులు ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్ని హస్త్రంలను ఉపయోగించి సొరకాయలు, వంకాయలు, దొండ, బీర, సారికంద, మిరప, చిక్కుడు, బీన్స్, తోట కూర, క్యారెట్, ముల్లంగి తదితర పంటలను సాగు చేస్తున్నారు. పాడి పెంపకం సైతం.. సేంద్రియ పద్ధతులైన ఘన, ద్రవ జీవాస్త్రాల తయారీకి నాటు ఆవులు అవసరం రావడంతో 50 నాటు ఆవులు, ఇతర జాతులకు చెందిన ఆవులు, కోళ్లను పెంచుతున్నారు. నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగించి తయారు చేసిన ఎరువులతో పంటలను సాగు చేస్తున్నారు. మరోవైపు 60 సెంట్లలో ప్రత్యేకించి అంతర పంటలుగా ఒకే చోట ఏడు రకాల కూరగాయలు సొర కాయలు, దొండ, తోటకూర, క్యారెట్, కాకర, బీర, ముల్లంగి పంటలు పండిస్తున్నారు. ఇవేకాక కూరగాయలు పండిస్తున్న పంట పొలాల చుట్టు ఖాళీ ప్రదేశాలలో 600 కొబ్బరి మొక్కలు, మామిడి, సపోట, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి పంటలను పండిస్తూ వాటికి సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. తనకున్న ఖాళీగా ఉన్న భూమిలో 4 బోర్లు వేసి మూడింటికి సోలార్ పద్ధతిలో నడిచేలా మోటార్లు ఏర్పాటు చేసి స్ప్రింక్లింగ్ విధానంలో నీరు అందిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా చిరు ధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంట సారవకోట, అలుదు గ్రామాలతో పాటు నరసన్నపేటలో విక్రయిస్తున్నారు. నాటు ఆవుల గెత్తాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడకం ఎక్కువైంది. దీంతో నేలతల్లికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆ నేల తల్లిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అటు నేలతల్లికి, ఇటు మానవాళి మనుగడకు సేంద్రియ సాగు ఎంతో అవసరం. ఆహార అలవాట్లు మారడం వల్ల మానవుడు తాను సంపాదిస్తున్న ఆదాయంలో సగం వరకు వైద్య ఖర్చులకు వెచ్చించాల్సి వస్తోంది. – రావాడ మోహనరావు, రైతు, పద్మాపురం -
చంద్రగ్రహణంతో మూతబడిన దేవాలయాలు
పర్లాకిమిడి: చంద్రగ్రహణం వల్ల పట్టణంలో అన్ని దేవాలయాలు, మఠాలు ఉదయం పదిగంటల నుంచి మూసివేశారు. రాజవీధిలో ఉమారామలింగేశ్వర మందిరం, ఏకాంబరీశ్వర మందిరం, గోపీశ్వర మందిరం, శ్రీజగన్నాథ మందిరం, పెద్ద రాధాకాంత మఠంలో రాధాగోవింద ఆలయం తదితర దేవాలయాలను మూసివేశారు. తిరిగి రాత్రి సంప్రోక్షణ అనంతరం తెరువబడతాయని పూజారులు తెలియజేశారు. పెద్ద రాధాకాంత మఠంలో 24 గంటలపాటు హరేరామ.. హరే కృష్ణ భజన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో చంద్ర గ్రహణం పురస్కరించుకుని అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రాయగడ: చంద్ర గ్రహణం కారణంతో మంగళవారం పట్టణంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ప్రధానంగా మజ్జిగౌరీ మందిరాన్ని ఉదయం 6.15 గంటలకు మూసివేశారు. అలాగే స్థానిక కరణం వీధికి వెళ్లే మార్గంలో ఉన్న కోదండరామ మందిరం, మల్లికార్జున మందిరాలు మూతపడ్డాయి. స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరాన్ని కూడా మూసివేశారు. అయితే మజ్జిగౌరీ మందిరానికి కొంతమంది ఆంధ్రకు చెందిన భక్తులు రావడంతో వారు బయటే పూజలు చేసుకుని తిరుగుముఖం పట్టారు. -
బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రాఖాల్గూడ గ్రామంలో లకే పోడియామి అనే మహిళ హత్యకు గురైంది. హత్యను నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో యం.వి. 26 గ్రామంపై కొందరు వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇళ్లను కాల్చివేసి ఆస్తులను తగలబెట్టారు. ఈ సమయంలో గ్రామంలో పర్యటించిన నాయకులు బాధిత కుటుంబానికి రూ. 75 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పరిహారంగా ఇస్తామన్నారు. అయితే గ్రామం మొత్తం నాశనం కావడంతో పరిహారాన్ని గతంలో ప్రకటించిన దానికంటే నాలుగు రేట్లు అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 4,65,47,269 రూపాయలను కేటాయించినట్టు మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు. పరిహారాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే రాఖాల్గూడ గ్రామానికి చెంది.. హత్యకు గురైన లకే పోడియామి కుటుంబానికి కూడా పది లక్షల రూపాయలకు బదులు 20 లక్షల రూపాయలను అందజేస్తామన్నారు. -
5ఈ– విద్యా బోధన పుస్తకావిష్కరణ
జయపురం: స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ మానవీయ అధ్యాయన విభాగం మూడవ సభాగృహంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శాసీ్త్రయ వాతావరణంలో 5ఈ విద్యా బోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఉపాధ్యాయ శిక్షణ విభాగాధిపతి, సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్, లోకేష్ ప్రధాన్లు సంయుక్తంగా రచించిన 280 పేజీల విలువైన పరిశోధనా గ్రంథం 5ఈ విద్యా బోధన’పుస్తకాన్ని విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ మహేష్ చంద్రనాయక్, స్నాతకోత్సవం పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ప్రశాంత కుమార్ సాహులు సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇద్దరు రచయితలతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ మహారాణ పాల్గొన్నారు. రచయిత డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ పుస్తకంలోని అంశాలను వివరించారు. గుణాత్మక విద్యా బోధనకు ఎలా ఉపయోగపడుతుందో తెలియ జేశారు. ముఖ్యఅతిథి మహేశ్వర్ చంద్రనాయక్ రచయితలను అభినందించారు. ఈ పుస్తకం బీఈడీఎ, ఎంఈడీ, ఆనర్స్ ఎంఏ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అధ్యాపకులు కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయక్, అనుపమ మిశ్ర, పరిచితా మహాపాత్రో, సుజాతా బేజ్, స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు బందనా మహరాణ, శుభశ్రీ పట్నాయక్, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ పుస్తకం ఆన్లైన్తోపాటు పుస్తక విక్రయ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. -
ఘనంగా బిజూ జయంతి ఉత్సవాలు నిర్వహిద్దాం
రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ బిజూ పట్నాయక్ 110వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సుధీర్ దాస్, పట్నాన గౌరీశంకర్ రావు, అనసూయా మాఝి తదితరులు సోమవారం సమావేశమై జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల ఐదో తేదీన బీజూ జయంతిని పురస్కరించుకుని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంతో పాటు భారీ ర్యాలీని నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డవిజన్ కోట్పాడ్ కమ్యూనిటీ హాస్పిటల్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. కోట్పాడ్ ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక హెచ్పీవీ వ్యాక్సిన్ ధర బహిరంగ మార్కెట్లో రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు ఉంటుందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కోట్పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి సురేష్ మహంతి, కోట్పాడ్ వైద్యాధికారి రంజన్ దాస్, ప్రెస్క్లబ్ కార్యదర్శి, న్యాయవాది పంకజ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
కరడు గట్టిన దొంగల ముఠా అరెస్ట్
కొరాపుట్: కరడు గట్టిన దొంగల ముఠాని నబరంగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ వారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణం లో ఎస్డీపీఓ సుభేంద్ సబర్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు ప్రకటించారు. గత నెల 22వ తేదీన ఉమ్మర్కోట్ పట్టణానికి సమీపంలో కోచ్ని అంబ గ్రామంలో అమూల్య జెన్న ఇంటిలో భారీ దొంగతనం జరిగింది. ఆ రోజు ఆ కుటుంబం ఆస్తి అమ్మిన నగదు ఇంట్లో ఉందని తెలిసి దొంగల ముఠా దాడి చేసింది. వారింట్లో ఉన్న వారి పై దాడి చేసి రు.70 లక్షలు నగదు, పెద్ద మెత్తం లో బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ కేసుని చాలెంజ్గా తీసుకున్న పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఏడుగురు దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రు.21 లక్షలు నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నబరంగ్పూర్కి చెందిన బబులా, మజ్జి గూడ గ్రామానికి చెందిన రొణ, గణేష్ రానా, దీరజ్ లైచన్, ధర్నాబెడ గ్రామానికి చెందిన చిత్రసేన్ గొండో, జయపూర్ కి చెందిన సిసిఎల్ కునాల్, కొట్పాడ్కి చెందిన సుఖదేవ్ ముదలి తదితరులు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
మధ్యప్రాచ్య సంక్షోభంపై ప్రభుత్వం అప్రమత్తం
భువనేశ్వర్: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వలస ఒడియా ప్రజల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సూచనల మేరకు జరిగిన ఈ సమావేశంలో హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్పీ కోచే, ఒడిశా మో పరిబార్ డైరెక్టర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బిజయకేతన్ ఉపాధ్యాయ్, కార్మిక శాఖ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠి, వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వలస వెళ్లిన ఒడియా ప్రజలకు, వారి కుటుంబాలకు సాధ్యమైనంత మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తంగా ఉంటు అనుక్షణం మారుతున్న పరిస్థితిని నిశితంగా గమనించాలని ప్రఽముఖ కార్యదర్శి సూచించారు. విదేశాల్లో ఉంటున్న ఒడియా ప్రజలకు సకాలంలో సహాయం, విశ్వసనీయమైన సమాచారాన్ని అందజేయడంలో చక్కని సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయ పౌరులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాత్రింబవళ్లు పని చేసే 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 800–4634342, వాట్సాప్ నంబర్ +971543090571ను జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిస్పందన యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా మో పొరిబార్, రాష్ట్ర హోం (స్వరాష్ట్ర) శాఖ, రాష్ట్ర కార్మిక డైరెక్టరేట్ ప్రమఖులతో కూడిన ప్రత్యేక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. తాజా సమాచారం, సకాలంలో సహాయాన్ని సులభతరం చేసేందుకు ప్రీతీష్ పండాను ఒడిశా మో పరిబార్కు నోడల్ అధికారిగా నియమించారు. మధ్యప్రాచ్యంలోని ఒడియాలకు సంబంధించిన మద్దతు కోసం ఆయనను 9583321964 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సమావేశానికి హాజరైన రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ వై. బి. ఖురానియా తెలిపారు. సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. పరిస్థితికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని నివారించడానికి అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలియజేశారు. -
శోభాయమానంగా శ్రీ క్షేత్రంలో డోలా యాత్ర
భువనేశ్వర్: పవిత్ర శ్రీ క్షేత్రం విరజిమ్ముకున్న రంగులతో శోభాయమానంగా కళకళలాడింది. శ్రీ జగన్నాథుడు హోలీ సందర్భంగా రంగుల జాతర డోలోత్సవం ఆచారంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జరిగే ప్రముఖ యాత్రల్లో డోలోత్సవం ఒకటి కావడం విశేషం. ప్రత్యేక డోలికలో ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ప్రతినిధిగా శ్రీ దేవి, భూ దేవి సమేతంగా ప్రత్యేక ఆచార నియమాలతో పూజలందుకున్నాడు. అనంతరం ఊరేగింపుగా శ్రీ మందిరం నుంచి డోలిక మండపానికి తరలివెళ్లాడు. నయనానందంగా సాగిన ఈ ఊరేగింపు ప్రత్యక్షంగా తిలకించిన భక్తజన హృదయాలు పులకించి పోయాయి. డోలిక మండపంలో ప్రత్యేక భోగాదుల నివేదనతో పూజా కార్యక్రమం ముగియడంతో ఆ ప్రాంగణం రంగులమయమైంది. అర్ధరాత్రి అలంకరణ ఈ ఏడాది చంద్ర గ్రహణం కారణంగా స్వర్ణ అలంకరణ పగటిపూట కాకుండా మంగళ వారం అర్ధ రాత్రి నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఈ సన్నాహాలు ప్రారంభించారు. మంగళ హారతి తదితర దైనందిన సేవాదులు క్రమ పద్ధతిలో ముగించి స్వర్ణ అలంకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవుళ్ళకు ఖొయికొర భోగాన్ని సమర్పించారు. 7 రోజుల డోలోత్సవం చైత్ర మాసం (శ్రీ మందిరం పంచాంగం గణాంకాల ప్రకారం) మొదటి రోజున డోల పూర్ణిమతో ముగిసింది.యాత్రికుల నడుమ డోలోత్సవం ఊరేగింపుస్వర్ణ అలంకారం పవిత్ర డోలో పూర్ణిమ సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాట్లకు బంగారు ఆభరణాలతో రాజాధి రాజా అలంకరణ ఆచారం నిరవధికంగా కొనసాగుతుంది. ఏటా 5 సార్లు జరిగే స్వర్ణ అలంకారాల్లో ఇదొకటి కావడం విశేషం. ఇది భక్తులకు ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయ దృశ్యం. ఈ దర్శనం దైవిక ఆశీస్సులతో శ్రేయస్సు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. -
హ్యాపీ అండ్ సేఫ్ హోలీ
భువనేశ్వర్: రంగుల పండగ ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ సైకత యానిమేటర్ మానస్ కుమార్ సాహు సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు 2 గంటలు నిర్విరామంగా శ్రమించి దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఆనందం, సామరస్యం, ఐక్యత, బాధ్యత మేళవింపుల పండగ హోలీ అని అభివర్ణించాడు. సామాజిక అవగాహన, సాంస్కృతిక వ్యక్తీకరణ మాధ్యమంగా ఈ కళాఖండం ఆవిష్కరించినట్లు తెలిపారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. శాసనసభలో సంఖ్యా బలం దృష్ట్యా తొలి 2 స్థానాల్లో అనుకూలత నేపథ్యంలో పార్టీ కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. వారిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్ ఉన్నారు. ఈ ఇరువురి అభ్యర్థిత్వం ఎంపిక నిర్ణయం పార్టీ సంస్థాగత బలం మరియు ప్రాంతీయ ప్రాతినిధ్యంపై ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయి స్థితి నుంచి భారతీయ జనతా పార్టీకి అధికార హోదాకు అందలం ఎక్కించిన అనుభవజ్ఞుడుగా పేరొందిన ప్రస్తుత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్కు ఎగువ సభ ప్రాతినిథ్యం కల్పించడం రాజకీయ ప్రాముఖ్యతకు అద్దం పడుతోంది. పశ్చిమ ఒడిశా కలహండి ప్రాంతీయునిగా విధానపరమైన నేపథ్యానికి పేరుగాంచిన సుజీత్ కుమార్ ఎగువ సభలో పార్టీ ప్రాతినిధ్యానికి కొనసాగింపు ప్రాంతీయ సమతుల్యతకు ప్రాణం పోస్తుంది. అంజిపేటలో కార్చిచ్చు రాయగడ: స్థానిక జేఎస్కో సమీపంలో గల అంజిపేట వద్ద కొండపై మంటలు చెలరేగడంతో సమీపంలో గల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేసవి కాలం ప్రారంభంలో అటవీ శాఖ పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓ చోట ఇలా జరుగుతూనే ఉంది. అంజిపేటలో ఉన్న కొండపై గుర్తు తెలియని వారు ఎండిన వాటికి నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయని సమాచారం. రూ.10.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం రాయగడ: రెండు కారుల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని పద్మపూర్ పో లీసులు పట్టుకున్నారు. కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్లలో ఉన్న 105 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10.50 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు జిల్లా లోని గుణుపూర్ లొని కొమటి వీధికి చెంది న రజనీకాంత్ నాయక్గా గుర్తించారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి మరో నిందితు డు పోలీసులను చూసి కారును అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకా రం పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మిలకాపంగ గ్రామ సమీపంలో ఉన్న జీడి తోటలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు సొమవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి పట్టుబడింది. పొరుగు జిల్లా గజపతి లొని అడవా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్న గుడ్రిపొంగ అడవుల నుంచి రెండు కారుల్లొ గంజాయిని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాకుళంకు తరలిస్తుండగా పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. ఈ వివరాలను పద్మపూర్ పోలీస్ స్టేషన్ ఐఐసి ధరణీ ధర్ ప్రధాన్ తెలియజేశారు. -
ఈనెల 11న అవిశ్వాస తీర్మానం ఫలితాలు
రాయగడ: మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ శుభ్ర పండపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆరోజు ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో కౌంటింగ్ వివరాలను వీడియో ద్వారా నిక్షేపం చేసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు సంబంధించి 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో తీర్మానానికి సంబంధించి కౌన్సిలర్ల ఓటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే తనపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఏమాత్రం నిజం లేదని వైస్ చైర్పర్సన్ శుభ్రపండ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ హైకోర్టు ఆదేశానుసారం ఫలితాలను వెల్లడించలేదు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ను స్థానిక ట్రెజరీలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న సమక్షంలో భద్రపరిచారు. ఏదిఏమైనప్పటికీ ఈనెల 11వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఇప్పటికే శుభ్రపండకు వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు ఓటింగ్ వేసిన సంగతి అందరికీ తెలిసినప్పటికీ, అధికారికంగా శుభ్ర పండ వైస్ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగించే విషయంలో ఫలితాలు వెల్లడిస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
విద్యార్థిని మృతి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలలో చదువుతూ హస్టల్లో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈమె అంబొదల ప్రాంతానికి చెందిన గీతా మాఝిగా గుర్తించారు. ఆదివారం రాత్రి హఠాత్తుగా గీత అస్వస్థతకు గురైంది. దీంతో హాస్టల్ నిర్వాహకులు సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంతజరిగినా హాస్టల్ నిర్వాహకులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. ఇదంతా వారి నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని సోమవారం అంబొదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న గీతా మాఝి సొంత ఇల్లు వసతి గృహానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న కొందోబలిజోడి గ్రామంలో ఉంది. ఆదివారం తీవ్రఅస్వస్థతకు గురైన గీత విషయం హాస్టల్ నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందివ్వకపోవడం విచారకరం. ఇదిలాఉండగా హాస్టల్ ప్రధానోపాధ్యాయుడుగా విఽ దులు నిర్వహిస్తున్న కొలాబామన మూర్తి, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు నమోదు కావడంతో కేసు మలుపు తిరిగింది. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో త్రినాథస్వామి ఆలయ 69వ వార్షికోత్సవంలో భాగంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. 80 కిలోల విసురుగుండు పోటీల్లో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, గేదెల రమణ ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల తీత సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల గోవిందరావు ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు, ముద్దాడ తరుణ్ కుమార్లు ఇద్దరు 160 కిలోలు ఎత్తడంతో ఇద్దరికీ ప్రథమ స్థానం, బిల్లాడ యోగేశ్వరరావును ద్వితీయ స్థానానికి ఎంపిక చేశారు. అలాగే బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆడవరానికి చెందిన గుజ్జల వర్షిత 103 కిలోలు ఎత్తి ప్రథమ స్థానం, 95 కిలోలు ఎత్తి దూబ హేమశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. 203 కిలోల ఈడ్పు గుండు పోటీల్లో ఆవల గోవిందరావు ప్రథమ స్థానం సాధించారు. -
ఐసీయూ, ఎం.ఆర్ స్కాన్ ఏర్పాటు చేయాలి
పర్లాకిమిడి: ఎనిమిదో స్టాండిగ్ కమిటీ ముగింపు సమావేశం భువనేశ్వర్లోని లోక్సదన్లో సోమవారం నిర్వహించారు. పర్లాకిమిడి నియోజికవర్గ శాసనసభ్యులు రూపేష్ పాణిగ్రాహి పలు డిమాండ్లను ప్రతిపాదించారు. పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఎం.ఆర్ స్కాన్, ఐసీయూ ఏర్పాటు, నువాగడ బ్లాక్ ఖోజురిపద, చంద్రగిరిలో పోస్టుమర్టాం కేంద్రం నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రి, పర్లాకిమిడిలో స్పెషలిస్టు డాక్టర్లు, నర్సుల నియామకం, అంబులెన్సులు, ఆక్సిజన్ ప్లాంటు పుణరుద్ధరణ, మార్చురీ (మహాప్రయాణం) వాహనాలు కొనుగోలు చేయాలని స్టాండింగ్ కమిటీ ఎదుట డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు సారవకోట: మండలంలో అలుదు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 326–ఏ పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర (24) మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం నుంచి పెళ్లి కబుర్లు చెప్పేందుకు సారవకోట వైపు ద్విచక్ర వాహనంపై మజ్జి నరేంద్ర, మజ్జి అప్పలనాయుడు వెళ్తున్నారు. అదే సమయంలో పాతపట్నం మండలంలోని సీది నుంచి ఆటోలో గేదెల వరలక్ష్మి, ఆటో డ్రైవర్ కృష్ణ సారవకోట మండలంలోని వడ్డినవలస వెళ్తున్నారు. అలుదు గ్రామం రెల్లివీధి సమీపంలో జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో మజ్జి నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మజ్జి అప్పలనాయుడుతో పాటు ఆటోలో ఉన్న వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నరేంద్ర, అప్పలనాయుడు, వరలక్ష్మిలను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
మౌలిక సౌకర్యాలు కల్పించాలని వినతి
రాయగడ: సదరు సమితి గజ్జిగాం పంచాయతీ పరిధిలో గల డెక్కాగుడలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు కోరారు. గ్రామంలో గల సమస్యలకు సంబంధించి సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో సమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, అంతా ఆదివాసీలేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య గత కొన్నాళ్లుగా ఉందన్నారు. ఉన్న ఒక్క గొట్టపు బావి సరిపోవడం లేదని, రానున్న వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా గ్రామానికి సరైన రహదారి లేకపొవడంతో తామంతా ఇక్కట్లు పడుతున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ఫలితం లేదన్నారు. కలెక్టర్ స్పందించారు. వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న బీడీఓ సుజిత్ కుమార్ మిశ్రాను ఆ గ్రామంలో పర్యటించి పూర్తి వివరాలు తనకు సమర్పించాలని, అవసరమైన వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. -
7 నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు
రాయగడ: స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయని స్థానిక యోగా స్టోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. మేరకు సోమవారం అసోసియేషన్ అధ్యక్షుడు నృసింగ బాహిణిపతి, జిల్లా యోగా కన్వీనర్, ప్రముఖ హాస్యనటుడు ప్రభాకర్ మిశ్రో, యోగా గురు స్వాధీన పండా, ప్రదీప్ కుమార్ రౌత్, నిర్జారాణి పట్నాయక్లు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు తెలియజేశారు. రెండు రోజుల పాటుగా జరిగే ఈ పోటీల్లో జిల్లాలో గల వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వందల మందికి పైగా ఈ పోటీలకు హాజరవుతున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. వారికి భోజన, వసతి సౌకర్యాలను స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాలలో కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 ఏళ్ల లోపు వయసు గలవారు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బాహిణిపతి తెలియజేశారు. ఈ పోటీల్లో గెలిపొందినవారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వివరించారు. -
శ్రీమందిర్ కొత్త సేవా విభాగం అడ్మినిస్ట్రేటర్గా ప్రియ రంజన్
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం సేవా విభాగం ప్రముఖునిగా ప్రియ రంజన్ పృష్టి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువు దీరిన మూల విరాట్లను దర్శించుకున్నారు. శ్రీ మందిరంలో సేవాదులు సక్రమంగా సకాలంలో నిర్వహించేందుకు సాధ్యమైనంత వరకు అంకిత భావంతో కృషి చేస్తానన్నారు. సేవల విభాగంలో అన్ని వర్గాల సమన్వయం, సహకారంతో మాత్రమే ఇది సాధ్యమని పేర్కొన్నారు. శ్రీ మందిరం ఇతర విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతించారు. ముగిసిన నామ సంకీర్తన రాయగడ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి చైతన్య రాంజీ ఆధ్వర్యంలో జిల్లాలోని కొలనార సమితి దొందులి గ్రామ పంచాయతీ పాత్రపుట్ గ్రామంలో గత నెల 28 నుంచి నిర్వహిస్తున్న అష్ట్రపహారి నామ సంకీర్తన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మూడు రోజుల పాటుగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని హరేరామ నామ కీర్తనలను చేశారు. ఆధ్యాత్మికంగా అందరిలో భక్తి, భావాలు పెంపొందాలని స్వామి చైతన్య రాంజీ ప్రసంగించారు. ఉన్న సమయంలో కొంత కేటాయించి దేవుని కీర్తనల కోసం గడపాలని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికపొందూరు: త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న సైన్స్ సమగ్ర మహోత్సవ్–2026 పోటీలకు జిల్లా నుంచి పొందూరు కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాత్రుని ఐశ్వర్య రూపొందించిన ‘ఫార్మర్స్ ఫ్రెండ్లీ లైఫ్ సేవర్స్ స్టిక్’ ప్రాజెక్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్ ఎస్.లలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థినిని అధ్యాపక సిబ్బంది అభినందించారు. కౌలు రైతులను పట్టించుకోవడం లేదు సరుబుజ్జిలి: కౌలు రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించడం ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. జిల్లాలో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నా.. వారికోసం పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదనవ వ్యక్తం చేశారు. కౌలు కార్డులకు రుణాలు, అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ మండల శాఖ కార్యదర్శి అదపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో వేసిన లే–అవుట్లో ఆక్రమణలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. రియల్ దందా అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మండల సర్వేయర్ సుభాష్ ఆధ్వర్యంలో లే అవుట్ను పరిశీలించి సర్వే చేశారు. గ్రామ కంఠంకు సంబంధించి 7 సెంట్లు, వంశధార కాలువకు సంబంధించి 2 సెంట్లు కలిపి మొత్తం 9 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాడ ఉమాపతి, విలేజ్ సర్వేయర్ త్రిమూర్తులు ఉన్నారు. కాగా ఎల్పీ నంబర్ 324, 325లో భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని, దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదని పీజీఆర్ఎస్లో కె.కుసుమారెడ్డి ఫిర్యాదు చేశారు. లే అవుట్ను పరిశీలిస్తున్న సర్వేయర్ సుభాష్ తదితరులు -
వార్షిక బడ్జెట్ ఆమోదం
జయపురం: జయపురం రీజనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఆర్.సి.ఎం.ఎస్) వార్షిక బడ్జెట్ సమావేశం ఉమ్మిరి సమీప తెలిగుడ గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో సోమవారం జరిగింది. రీజనల్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు సుకాంత త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.సి.ఎం.ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. త్రిపాఠీ వార్షిక నివేదికను వివరించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. 2026–27 వార్షిక బడ్జెట్ను సమావేశం ఆమోదించింది. బడ్జెట్లో ఆర్సిఎంఎస్ కార్యాలయ ప్రాంతంలో స్టాల్స్ నిర్మాణం, ఖాళీ స్థలం పంపిణీపై చర్చించారు. స్టాల్స్ కోసం ఎవరు దరఖాస్తు పెట్టుకుంటారో వారి నుంచి సెక్యూరిటీ వసూలు చేసి వాటితో ఆర్ి.ఎం.ఎస్ స్టాల్స్ నిర్మించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమాపంలో సుదీప్ పదార్, ట్వింకిల్ మిశ్రా, అరుణ భటమిశ్రా, సుభాష్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 99 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల నుంచి వచ్చే వినతులను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలకు క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, ప్రతి అర్జీదారుడికి సంతృప్తికరమైన సమాధానం అందాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ శాఖకు 19, సెర్ప్ విభాగంలో 13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 10 వినతులు అందాయి. అలాగే జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 4 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 3 ఫిర్యాదులు అందాయి. ఆర్టీసీ, సర్వే సెటిల్మెంట్స్, బీసీ సంక్షేమం, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలపై రెండేసి చొప్పున వినతులు వచ్చాయి. వీటితో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఎన్టీఆర్ వైద్య సేవ, కాలుష్య నియంత్రణ మండలి సహా మొత్తం 22 విభాగాలకు చెందిన సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మండలాల వారీగా ఏర్పాటు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను స్వయంగా పరిశీలించారు. అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందితో కలిసి చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. భయానక పరిస్థితులు నెలకొన్నాయి శ్రీకాకుళం నుంచి ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడకు వెళ్లే రోడ్డులో వంతెన వద్ద ఇటీవల భయానక పరిస్థితులు నెలకొన్నాయని కొంగరాం, ముద్దాడ, వెంకన్నగారిపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పొన్నాడ తర్వాత సుమారుగా పది గ్రామాలు ఉన్నాయని, వారంతా పగలు, రాత్రి ఆ మార్గం గుండానే ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. ఇటీవల ఆ బిడ్జి సమీపంలో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు స్పందించి ప్రజల భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
డోలోత్సవానికి వేళాయె..!
● మూడు రోజుల పాటు కూర్మనాథుని డోలోత్సవాలు ● నేటి రాత్రి కామ దహనోత్సవం ● అధిక సంఖ్యలో దర్శించుకోనున్న భక్తులుగార: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయంలో మంగళవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల నుంచి కామ దహనోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏటా పాల్గుణ మాస త్రయోదశి నాడు మాఘ నక్షత్రంలో జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామ సమీపంలోని కామ దహన మంటపం వద్ద కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసులోని చెడు ఆలోచనలు పటాపంచలవుతాయని, మంచి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామ దహనోత్సవం ముగిసిన తర్వాత బుధవారం వేకువజాము నుంచి సమీప ఎస్.మత్స్యలేశం తీరంలో భక్తులు పవిత్ర స్నానాలచరిస్తారు. మరలా ఆలయంలోని శ్వేత పుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరిస్తారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి మూర్తులను మేళతాళాలతో ఊరేగించి, గ్రామదేవత ఆలయం సమీపంలోని డోలో మంటపం వద్దకు తీసుకెళ్లి ఉత్తరాభిముఖంగా స్వామిని వేంజేసింపజేసి బుక్కాభర్గుండతో పూజలు చేస్తారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇదీ చరిత్ర.. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారం తాబేలు(కూర్మం) రూపం. ఇక్కడ మూలవిరాట్ను బ్రహ్మ ప్రతిష్టించారని, రాత్రి వేళల్లో దేవతల నిత్యార్చన, పగలు మానవ అర్చనలు జరుగుతుంటాయని చెబుతారు. ఆలయం ఎదురుగానున్న శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వగా.. అందులో గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం లభ్యమై ఆలయంలో కూర్మనాయకిగా కొలువుంది. ఈ ఆలయం కృతయుగంలో నిర్మితమవ్వగా.. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యులు తన దిగ్విజయ యాత్ర సందర్భంగా దీన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చారని, ఈ విజయానికి చిహ్నంగా పశ్చిమాన విజయ స్థూపాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్ధంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామివారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యుల సందర్శన, 13వ శతాబ్ధంలో మద్వాచార్యులు శ్రీనరహరితీర్థుల క్షేత్రాన్ని సందర్శించి సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను బహుకరించారు. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ దేవాలయం అపురూప శిల్పకళతో ఉంటుంది. 108 రాతి స్తంభాలు ఒకదానితో ఇంకొకటి పోలిక ఉండవు. 600 ఏళ్లనాటి ఆకుపసర చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. పితృమోక్ష క్షేత్రం క్షేత్రం ఆవరణలోని శ్వేత పుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఇందులో కలిపిన మానవ అస్తికలు కొద్ది రోజుల్లో శిలలుగా మారుతాయని భావిస్తారు. మానవుల కోర్కెలు దహించి, స్వామివారిని చేరే అద్భుత ఘట్టమైన కామదహనోత్సవంలో భక్తులు పాల్గొని, సముద్ర స్నానాలాచరించి, స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శిస్తే ముక్తి లభిస్తుందని క్షేత్ర ప్రాశస్త్యం. మూడు రోజుల ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి. – సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, శ్రీకూర్మనాథాలయం మూడు రోజుల పాటు నిర్వహించే ఈ డోలోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఉచిత క్యూలైన్ను ఆలయం వెనుక వైపు నుంచి ఏర్పాటు చేశాం. ప్రత్యేక దర్శనం వద్ద అదనపు క్యూలైన్లు ఏర్పాటు జరిగింది. లడ్డూ, పులిహోర ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. – టి.వాసుదేవరావు, ఆలయ ఈవో, శ్రీకూర్మనాథాలయం -
యువకుడిని కాపాడిని మైరెన్ పోలీసులు
మందస: మండలంలోని రట్టి గ్రామంలో వల్లభనారాయణ స్వామి డోలోత్సవ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోంపేట పట్టణంలోని గాంధీ నగర్కి చెందిన యువకుడు ఆర్థి వాసుదేవ్ తన స్నేహితులతో కలిసి సోమవారం సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న బారువ మైరెన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించి, ప్రథమ చికిత్స అందించి.. 108 వాహనంలో హరిపురం పీహెచ్సీకి తరలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బారువ మైరెన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ సంఘమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోమ్ గార్డ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో గుర్తు తెలియని యువకుడు మృతి టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద సోమవారం గుర్తు తెలియని యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహరీ లోపలి భాగంలో గోడ కంటే ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్ను గోడపైకి ఎక్కి పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదని, సుమారు 38 ఏళ్లు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అదుపు తప్పిన బైక్.. పోలీసులకు గాయాలు
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి ప్రాంతంలో ముగ్గురు గంజాయి మాఫియా వ్యక్తులను వెండిస్తున్న సమయంలో ఇద్దరు పోలీసులు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన పోలీసులను వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. నేడు జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామగిరి పోలీసు స్టేషన్కు కొంత దూరంలో ముగ్గురు మాఫియా వ్యక్తులు ఒక బైక్పై వెళ్తున్న సమాచారం అందడంతో.. రామగిరి పోలీసు పంటి పోలీసులు బైక్లపై వారిని పట్టుకునేందుకు వెంబడించారు. రామగిరి పోలీసు పంటి ఏఎస్ఐ బిష్ణ్రు మడకామి, పోలీసు డ్రైవర్ డొంబురు చలాన్లు బైక్పై వారిని వెంబడించారు. పోలీసు పంటికి 11 కిలోమీటర్ల దూరంలో గల ధల్పూర్ నర్సరీ సమీపంలో పోలీసులు వెళ్తున్న బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక ప్రజలు బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు పోలీసులను అంబులెన్స్లో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి చేర్చారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కొరాపుట్ సహద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల మెడికల్కు తరలించారు. -
ఘనంగా డోలా యాత్ర
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026పట్టణంలో డోలాట్యాంకు వద్ద డోలా యాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం శ్రీజగన్నాథ మందిరం వద్ద ఉన్న రాధాగోవిందమందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ప్రభలతో డోలాయాత్ర జరుగుతున్న ప్రాంతానికి తీసుకువెళ్లడంతో భక్తులు రాధాగోవింద స్వాములను చూసి పోగో (రంగులు)జల్లుకుని హోలీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా డోలా యాత్ర వద్ద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం వల్ల రాధాగోవింద స్వామి మందిరం మూసి వేస్తారు. పర్లాకిమిడి హోలీ పండుగ బుధవారం జరుపుకుంటామని అర్చకులు తెలియజేశారు. –పర్లాకిమిడి -
దేవాంగ సామాజిక వర్గీయులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జయపురం: దేవాంగ సామాజికవర్గీయులు ఆర్థికంగా మరింత బలపడాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆకాక్షించారు. జయపురం సమీప డొంగాగుడ గ్రామంలో దేవాంగ సంక్షేమ సంఘం నూతన భవననాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మించిన భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాహిణీపతి దేవాంగ సామాజికవర్గ సంక్షేమానికి, నూతన భవనాభివృద్ధికి మరో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రస్తుత భవనం 350 దేవాంగ కుటుంబాల శుభకార్యాలకు వినియోగపడుతోందన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎం.అప్పారావు, కార్యదర్శి పి.శంకరరావు, ఉపాధ్యక్షులు పి.సోమరాజు, విజయనగరం సంక్షేమ సంఘం అధ్యక్షులు వి.నాని, రాయగడ సంఘ అధ్యక్షులు ఎం,శంకరరావు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి బడిగేటా, తెల్రాయ్ పంచాయతీలకు చెందిన వందలాది మంది రైతులు తమ ధాన్యం బస్తాలతో సోమవారం రోడ్డెక్కారు. కలిమెల సమితి ఎంవీ 90 గ్రామం వద్ద ఏర్పాటు చేసిన మాండీలో రోజుకి 3000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి 600 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రోడ్డుపై నుంచి నిరసన తెలిపారు. అలాగే గంపాకొండ పంచాయతీలో కూడా రైతులకు టోకెన్ గడువు ముగిసిందని చెప్పడంతో ఎంవీ 66గ్రామం వద్ద జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలు ఉంచి ధర్నా చేశారు. మల్కన్గిరి కలిమెల రహదారి పూర్తిగా నిలిపివేశారు. రైతులకు నాలుగు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తేలిసిన కలిమెల ఐఐసీ ప్రభుదత్తు బిశ్వాల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అలానే సరఫరా అధికారి చిన్మయ్ సాహు కూడా వచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. -
గ్రీవెన్స్సెల్లో 71 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 71 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 55 వ్యక్తిగత సమస్యకాగా తొమ్మిది గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. మరో ముగ్గురు ఆరోగ్య సమస్యలకు సంబంఽధించి విన్నవించుకున్నారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 వేల రూపాయలను కలెక్టర్ మంజూరు చేయగా మరో నలుగురుకి రెడ్క్రాస్ నిధుల నుంచి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ ఆహోలే, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. మల్కన్గిరిలో 34 వినతులు.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎఫ్ఎల్సీ హాల్లో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ గ్రీవెన్స్సెల్ను నిర్వహించారు . ఈ సందర్భంగా 34 వినతులు స్వీకరించారు. వీటిలో 26 వ్యక్తిగతం కాగా ఎనిమిది గ్రామ సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. తీసుకున్న చర్యలు వివరాలు తనకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర జిల్లాస్థాయి అధికారులు, సమితి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విన్నపాలు విన్నారు పర్లాకిమిడి: జిల్లాకలెక్టర్ కార్యాలయం మీటింగు హాలు 2 లో సోమవారం జాయింట్ గ్రీవెన్సు సెల్, స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రజాసమస్యలు వినడానికి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరులు విచ్చేశారు. రాణిపేట, పర్లాకిమిడి పురపాలకసంఘం, కత్తల కవిటి పంచాయితీల నుంచి మొత్తంగా 96 వినతులు, అభియోగాలు అందగా వాటిలో గ్రామ సమస్యలు 14, వ్యక్తిగత సమస్యలు 82 ఉన్నాయి. కొన్ని అభియోగాలను సంబంధిత శాఖలకు వెంటనే పంపించారు. గుసాని సమితి గారబంద పీహెచ్సీలో డాక్టరుగానీ, ఫార్మసిస్టు, ఇతర సిబ్బంది లేని కారణంగా రంప, లాబణ్యగడ గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రంప మాజీ సర్పంచు, ఆదివాసీ మహాసంఘ్ అధ్యక్షులు నిరోభుయ్యాన్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. వెంటనే ఏడీఎం ఆయన అభియోగాన్ని సీడీఎంఓకు పంపించారు. కొందరికి మధుబాబు వృద్ధాప్య పింఛన్కార్డులను అధికారులు అందజేశారు. నేటి గ్రీవెన్స్కు గుసాని సమితి బీడీఓ గౌరచంద్ర పట్నాయిక్, తాహాసిల్దారు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. -
‘బహుముఖ అవగాహనతో వ్యవహరించాలి’
భువనేశ్వర్: రైలు టికెటు తనిఖీ ఉద్యోగ నిర్వహణలో బహుముఖ అవగాహనతో వ్యవహరించాలని విరామం పొందిన సిబ్బంది తోటి సిబ్బందిని ప్రబోధించారు. రైల్వే నిబంధనల ప్రకారం పలు వర్గాల ప్రయాణికుల సుఖమయమైన ప్రయాణంలో టికెట్ తనిఖీ సిబ్బంది పాత్ర కీలకంగా పేర్కొన్నారు. విధుల నిర్వహణతో సిబ్బంది సంక్షేమం కోసం ముందంజలో నిలిచిన ప్రభాకర్ బొరాల్తో మరో ఇద్దరు ప్రధాన టికెటు తనిఖీ అధికారులు (సీటీఐ) రమేష్ ప్రధాన్, ఎస్సీ హంసదా రైల్వే సేవల నుంచి విరామం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు అధికారులు, కార్మిక ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు శాఖా కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది పాలుపంచుకున్నారు. ఉద్యోగం నుంచి విరామం పొందిన సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమిస్తానని ప్రభాకర్ బొరాల్ అన్నారు. -
సహజ రంగులే వినియోగించాలి
భువనేశ్వర్: రంగుల పండగ ఆనందమయం కావాలి. ఈ సందర్భంగా రసాయనపూరిత రంగులు నివారించి ప్రకృతి సహజమైన రంగులను వినియోగించాలని ఒడిశా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ కమిటీ (ఒర్మాస్) పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా స్థానిక యూనిట్ – 8 ఎస్ఐఆర్డీ క్యాంపస్లో పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ ఆధ్వర్యంలోని రంగోత్సవ్–2026 ప్రారంభించారు. ఈ నెల 4వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది. సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన రంగులతో హోలీ వేడుకలను ఆనందమయంగా జరుపుకునేందుకు ప్రేరణగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి చేసిన సహజ రంగులతో ఈ వర్గం ఉత్పత్తి చేసిన సంప్రదాయ రుచికరమైన వంటకాలు, చక్కటి హస్తకళలు, చేతితో తయారు చేసిన గృహోపకరణాలు వంటి విస్తృత శ్రేణి గ్రామీణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. లాభాపేక్ష లేకుండా గిట్టుబాటు ధరలకు ఈ ఉత్పతుల్ని నగర వాసులకు విక్రయిస్తున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగోత్సవం సురక్షితమైన రంగులు, మహిళా సాధికారత యొక్క అందమైన కలయిక అని తెలిపారు. ఎస్హెచ్జీ మహిళలు తయారుచేసిన సహజ రంగులను ఉపయోగించడం ద్వారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒర్మాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ మోనికా ప్రియదర్శిని మాట్లాడుతూ రంగోత్సవం గ్రామీణ ఒడిశా మహిళా వ్యవస్థాపకుల నైపుణ్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఒర్మాస్ వారిని ఆధునిక మార్కెట్తో అనుసంధానించడానికి, వారి పనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వడానికి నిబద్ధతతో అండగా నిలుస్తుందన్నారు. ఈ చొరవతో ఎస్హెచ్జీ ఉత్పత్తులు అధిక నాణ్యత ప్యాకేజింగ్, బ్రాండింగ్ ద్వారా ప్రధాన స్రవంతి మార్కెట్లలో ప్రవేశం పొందగలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన ఆకర్షణ ఈ ప్రదర్శనలో సహజ రంగులు పసుపు, బీట్రూట్, పువ్వుల వంటి సహజ పదార్థాల నుండి రసాయన రహిత మూలికలతో తయారు చేసిన హోలీ రంగులను గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఈ రంగులు చర్మానికి, పర్యావరణానికి పూర్తిగా సురక్షితం. -
డోలీపై బాలింత తరలింపు
కొరాపుట్: అంబులెన్స్ రాలేకపోవడంతో బాలింతని డోలీ మీద తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి మైదల్పూర్ గ్రామ పంచాయతీ కుసుంకుంట గ్రామంలో కుసుం బొత్ర అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడింది. దీంతో గ్రామస్తులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ రాలేక పోయింది. అంతలో గర్భిణి ప్రసవం జరిగి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గ్రామస్తులు డోలీ మీద కిలో మీటర్ దూరం మోసుకుని వెళ్లారు. అక్కడ నుండి ఒక ఆటో లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదల్పూర్ ఆస్పత్రికి తరలించారు. 200 తాబేళ్ల స్వాధీనం మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 అటవీ శాఖ వారు సోమవారం మధ్యాహ్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న తాబేళ్లను గుర్తించి పట్టుకున్నారు. అటవీ శాఖ వారిని చూసి మాఫియా వారు పరారయ్యారు. అటవీ శాఖ వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంవీ 62 గ్రామానికి ఈ తాబేళ్లను తీసుకువస్తున్నట్లు సమాచారం. వీటి విలువ రూ.4లక్షలకు పైగా ఉంటుందని అటవీ శాఖాధికారులు తెలిపారు. బాలికలకు ఈత శిక్షణ శిబిరం ప్రారంభం మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో తొలిసారి బాలికలకు ఈత శిక్షణ శిబిరం ప్రారంభించారు. రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం మల్కన్గిరిలో కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ జిల్లా పంచాయతీ సాధన కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా నీటిలో మునిగే ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇది 7వ విడత శిక్షణ శిబిరం ఇందులో 30 పాల్గొంటారు. ఓడ్రాఫ్ బృందం శిక్షణ ఇస్తుంది. మంగళవారం నుంచి స్థానిక బండా బాకులి చెరువు వద్ద ప్రాక్టికల్ ఈత శిక్షణ ఇస్తారు. ధాన్యం కొనుగోలు చేయాలని వినతి పర్లాకిమిడి: ఖరీఫ్ ధాన్యం ఇంకా తమవద్దే ఉన్నాయని.. వీటిని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు గుసాని సమితి ఉప్పలాడ, కొర్సండ, బుసుకిడి తదితర పంచాయతీల రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం చేరుకుని సబ్ కలెక్టర్, ఇన్చార్జి సివిల్ సప్లై అధికారి అనుప్పండాకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లకు విడుదల చేసిన టోకెన్లు మరో రెండు రోజుల్లో గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ధాన్యం ఎప్పుడు మండీల వద్ద కొనుగోలు చేస్తారో చెప్పాలని రైతులు అధికారులను అడిగారు. రైతుల వద్ద కొంత ధాన్యం కొనుగోలు చేసి మరికొంత మిగిలిపోయిందని రైతులు విన్నవించారు. వివిధ సొసైటీలలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రానందున ధాన్యం కొనుగోళ్లకు జాప్యం జరుగుతున్నట్టు సబ్ కలెక్టర్ అనుప్పండా, ఏఆర్సీఎస్ హారిహార శెఠికి వినతులు అందజేశారు. -
బంగారం, వెండికి డిమాండ్
పర్లాకిమిడి: బంగారం, వెండి ధరలు పెరుగుతున్నా వాటికి డిమాండ్ తగ్గటం లేదు. పర్లాకిమిడిలో కొత్తగా కార్పొరేట్ స్టయిల్లో బంగారం, వెండి షాపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఉన్న పాత షాపులు కొత్తకొత్త ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. పట్టణంలో ఆదివారం రాజవీధిలో రెండు బంగారం షాపులు ప్రారంభమవ్వడంతో బంగారం, వెండి వస్తువులు కొనుగోలుకు జనాలు ఎగబడుతున్నారు. ఒకవైపు గల్ఫ్ దేశాలైన బహరైన్, సౌదీ అరేబియా, దుబాయి తదితర దేశాలపై ఇరాన్ బాంబుల కురిపిస్తున్న నేపథ్యంలో బంగారం ఒక్కసారిగా పెరగటంతో ప్రజలు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. పట్టణంలో బంగారం ఒక గ్రాము 24 క్యారెట్ రూ.15,452 ధర ఆన్లైన్లో ఉండగా, పర్లాకిమిడిలో రూ.16 వేలకు పైగా పలుకుతుంది. వెండి వస్తువులు కూడా కిలో రూ. 2,95,000 ఉంది. అయినా ప్రారంభంరోజు చిన్న వస్తువు కోన్నా సిల్వర్ బహుమతి వుంటుందని, కిలో బంగారం కొంటే దానికి తగ్గట్టు బంగారం ఇస్తామని ప్రచారం చేయడంతో జనాలు కొనుగోలుకు ఎగబడుతున్నారు. సామాన్య ప్రజలు తమ పెట్టుబడులు బంగారం, వెండిపై పెట్టుబడులు పెడితే సమీప భవిష్యత్లో ఽఅధిక ధర పలుకుతుందన్న అంచనాలతో ప్రజలు కొనుగోలు చేశారు. -
మునిగుడ సమితి కార్యాలయం గేటు వద్ద యువకుని మృతదేహం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒక యువకుని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సమితిలో క్లరికల్ విభాగంలో పనిచేస్తున్న సుశాంత గౌడొ (34) గా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... ఉదయం సుశాంత్ కడుపు నొప్పిగా ఉందని ఇంటి నుంచి మునిగుడలొ గల సీహెచ్సీకి వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో సమితి కార్యాలయం గేటు వద్ద పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దోపిడీ దొంగల ముఠా అరెస్ట్ కొరాపుట్: దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా మైదల్ పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఎస్పీ ఆదిత్య సేన్ ప్రసంగించారు. సెమ్లా ప్రాంతంలో అటవీ భాగంలో అనుమానితుల సంచారం పై తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోనికి తీసుకున్నారు. వారిని విచారించగా పపడాహండి ప్రాంతంలో ఒక వ్యాపార వేత్త ఇంటి పై దాడికి సిద్ధంగా ఉన్నారని అంగీకరించారన్నారు. ఈ ఘటన లో 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా లో మరి కొందరిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. నిందితుల నుంచి కత్తులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హెచ్పీవీ టీకాలు ప్రారంభం రాయగడ: జిల్లాలోని హ్యూమన్ పాపిల్లొమా వైరస్ (హెచ్పివి) నివారణ చర్యలకు జిల్లా వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు జిల్లా ప్రధాన హస్పటల్ (డిహెచ్హెచ్) సమావేశం హాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, గౌరవ అతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రకలు హాజరయ్యారు. రాష్ట్రంలో గల 14–15 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు 3.36 లక్షల మందికి టీకా అందజేయనున్నారు. రాయగడ జిల్లాలోని 7587 మంది బాలికలకు ఈ టీకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆమె వివరించారు. గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి ఈ టీకా ఎంతో దోహదపడుతుందని అన్నారు. మహానది జల వివాద ట్రిబ్యునల్ బృందం సందర్శన భువనేశ్వర్: క్షేత్ర పరిశీలన కోసం 5 రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన మహానది జల వివాద ట్రిబ్యునల్ (ఎండబ్ల్యూడీటీ) చైర్పర్సన్, సభ్యులు పవిత్ర పుణ్య క్షేత్రం పూరీ శ్రీమందిర్ను సందర్శించి రత్న వేదికపై కొలు వై ఉన్న సోదరసోదరి సమేత శ్రీ జగన్నాథుని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య విలేకరుల సమావేశం నిర్వహించి మహానది నీటిపై ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య ఉన్న వివాదం త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. మహానది జల వివాద ట్రిబ్యునల్ బృందం ఈ నెల 7న ఛత్తీస్గఢ్ను సందర్శిస్తుంది. మార్చి 11 వరకు ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహిస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు – మోహన్ చరణ్ మాఝి, విష్ణు దేవ్ సాయి మహానది జల వివాదానికి పరిష్కారం విషయ మై చర్చించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న మహా నదీ జ లాల పంపిణీ వివాదం త్వరలో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. మహానది జల వివాద ట్రి బ్యునల్ బృందం ఒడిశాను సందర్శించి మహా నది బేసిన్లోని సమగ్ర పరిస్థితిని హెలికాప్టర్ ద్వారా విహంగ సర్వే నిర్వహింంచింది. మహా నది నీటి కొరతతో ప్రభావితమైన ప్రాంతాలను ఈ బృందం సమీక్షించింది. -
హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆదివారం ఉదయం 10 గంటలకు హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, జెడ్పీ అధ్యక్షురాలు సమారి టాంగులు, ఎంపీ ప్రతినిధి సంజయ్ సర్కార్, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధాన్, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చౌధురీ నిహర్ రంజన్ ప్రహరాజ్, అదనపు వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్య రంజన్ రణసింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టీకాను 14–15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతమైన బాలికలకు మాత్రమే ఇస్తారు. ఈ టీకా కార్యక్రమం 3 నెలలు పాటు జిల్లా ఆస్పత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. తొలి దశలో ప్రధాన ఆస్పత్రిలో రెండో దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరిస్తారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్, స్కూల్ ఐడీ తీసుకురావాల్సి ఉంటుంది. -
రచయిత నాగరాజుకు సన్మానం
రాయగడ: పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత భళ్లమూడి నాగరాజును తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవితల పోటీల విజేతలకు సత్కరించిన సందర్భంగా ఆయనకు ఈ అవకాశం లభించింది. జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని నిర్వాహకులు అందించారు. ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అక్షరాల తోవ సాహితీ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం జరిగింది. సంస్థ నిర్వాహకులు, ప్రముఖ రచయితలు నామా పురుషోత్తం, దాసరాజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త మువ్వా శ్రీనివాస్, ప్రముఖ బాల సాహితీ వేత్త ఉరిమెళ్ల సునంద, ప్రముఖ కవయిత్రి,సైకాలజీస్ట్ తాళ్లూరి లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగరాజు సతీమణి శేషసాయి అద్భుతమైన పాటలు పాడి ప్రశంసలు అందుకున్నారు. నాగరాజు రచించిన 40 కథలు, 138 కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గతంలో సాహితీ రత్న, సాహితీ శిరోమణి వంటి బిరుదులు పొందారు. ఈ సందర్భంగా స్థానిక సాహితీ సంస్థల ప్రతినిధులు నాగరాజు దంపతులను అభినందించారు. -
ఉగాది వేడుకల షెడ్యూల్ ఖరారు
● జయపురంలో 19, 20 తేదీల్లో శ్రీపరాభవ నామ ఉగాది ఉత్సవాలు ● వివరాలు వెల్లడించిన తెలుగు సాంస్కృతిక సమితి ప్రతినిధులుజయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీపరాభవ నామ ఉగాది ఉత్సవాలతో పాటు జయపురం సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం తెలుగు సాంస్కృతిక సమితి ప్రతినిధులు సిటీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ సభ్యులు శశి పట్నాయక్ ఉగాది వేడుకల కార్యక్రమాలు ప్రకటించారు. ఈ సందర్భంగా నృత్య పోటీలు, తెలుగు గీతాల ఆదారిత అంశాలతోగల నృత్య ప్రదర్శనలు, బృందగానాలు, యుగళ గీతాలు, సోలో గీతాల నృత్య పోటీలు ఉంటాయన్నారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 12వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు 81148 26451, 70089 72383 నంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు పంపాలన్నారు. వారికి 15వ తేదీన స్క్రూట్నీ నిర్వహిస్తామన్నారు. డాన్స్ అకాడమీలో నృత్యం నేర్చుకున్న వారు లేక డాన్స్ అకాడమీ వారు స్పాన్సర్ చేయబడిన కళాకారులను మాత్రమే పోటీలకు అనుమతిస్తామన్నారు. వారు డాన్స్ అకాడమీల ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈ నెల 15వ తేదీన మహిళలకు సిటీ స్కూల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తామన్నారు. పోటీలలో పాల్గొనదలచిన వారు ముగ్గుల పిండి, రంగులు, ఇతర సామగ్రి వారే తెచ్చుకోవాలని సూచించారు. ముగ్గులు పోటీలో పాల్గొన దలచిన వారు తమ పేర్లను ఈ నెల 12వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య 63702 66106, 63025 04864 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. అలాగే చిత్ర కళా పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో 12 ఏళ్లలోపు వారు జూనియర్లుగా, 12 నుంచి 18 ఏళ్లలోపు వారిని సీనియర్లుగా పరిగణిస్తామని వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు నిర్వహించే పోటీలలో జూనియర్లు పల్లెంలో వివిద ఫలాలు చిత్రం, సీనియర్లు ’సిటీ హైస్కూలు ప్రాంగణ భవనం ’చిత్రం వేయాలని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డు, ఫొటోపాటు పూర్తి వివరాలు వాట్సాప్లో పంపాలని సూచించారు. పోటీలలో పాల్గొనే వారికి డ్రాయింగ్ షీట్లు మాత్రం సమకూర్చుతామని.. రంగు పెన్సిళ్లు, బొమ్మ వేయటానికి అవసరమైన వస్తువులు వారే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పోటీలలో పాల్గొనదలచిన 63703 280837, 87639 62948 నంబర్లకు ఈ నెల 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు లోపు వాట్సాప్లో పంపాలని వెల్లడించారు. అలాగే ఉగాది రోజున ఉదయం 11కు మహిళలకు వంటల పోటీలను సైతం నిర్వహిస్తామన్నారు. గంటన్నర సమయంలో వంట పూర్తి చేయాలని, హల్వా, గోధుమ రవ్వ, బొబాయి రవ్వ, క్యారెట్, బీట్రూట్ లేదా ఆనపకాయతో హల్వా తయారు చేయాల్సి ఉంటుందన్నారు. వంటల పోటీకి కావలసిన స్టౌతో పాటు అన్ని వస్తువులు పోటీదారులే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పోటీకి అయిన ఖర్చుకు తగినట్లు విజేతలకు బహుమతులు ఉంటాయని తెలిపారు. వంటల పోటీలకు వచ్చే వారికి సహాయంగా ఇద్దరిని తీసుకురావచ్చని తెలిపారు. పోటీలో పాల్గొన దలచిన వారు 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల్లోపు 77519 24005, 93480 65395 నంబర్లకు వాట్సప్ ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు. అలాగే తెలుగు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు కూడా ఉంటాయన్నారు. పోటీలోపాల్గొన దలచిన వారు 15వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటలలోపు తమ పేర్లను 77352 19129, 95565 05571 నంబర్లకు వాట్సాప్ చేయాలన్నారు. సమావేశంలో సమితి సభ్యులు వై.శ్రీనివాసఖన్నా, పి.మహేష్రెడ్డి, దుర్గా శర్మ పాల్గొన్నారు. -
కృత్రిమ అవయవాల శిబిరం
జయపురం: జయపురం నెహ్రూనగర్లో గల అగ్రసేన్ భవనంలోఒడిశా ప్రాంత మార్వాడీ యువచంచ్ వారు దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయక సమితి రాంచి వారి సహకారంతో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవాల శిబిరంలో కృత్రిమ కాళ్లు, మెకానికల్ చేతులు, ఎల్బో స్టిక్లు, వాకింగ్ స్టిక్లు, బ్లైండ్ స్టిక్లు, ఇయర్ ఎయొడ్లు అందజేశారు. కాళ్లు, చేతులు లేని వారికి కొలతలు తీసుకుని కృత్రిమ చేతులు, కాళ్లు తయారు చేసి అందజేశారు. సోమవారం శిబిరం ముగియనుంది. అంతవరకు ఎంత మంది వచ్చినా సహాయ పరికరాలు అందజేస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ మాయంక అగ్రవాల్ తెలిపారు. శిబిరం నిర్వహణలో జయపురం మార్వాడీ యువ మంచ్ అధ్యక్షుడు కన్హ అగ్రవాల్, ప్రాజెక్టు చైర్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మయాంక్ అగర్వాల్, కన్వీనర్ వరుణ్ అగ్రవాల్, కార్యదర్శి విక్కీ అగర్వాల్, కోశాధికారి రోషన్ గోయల్, శ్రీభగవాన్ మహావీర్ వికలాంగ సమితి కార్యదర్శి నెమి చంద్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రస్థానంలో భారత్
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20262047కు ముందే ● ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండాపర్లాకిమిడి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 పిలుపుతో మన యువతరం 2036 నాటికే ప్రపంచంలో మనం అగ్రస్థానంలో నంబర్ వన్గా భారత్ నిలుస్తుందని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అభిప్రాయపడ్డారు. ఆయన స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలో ఆదివారం ఉదయం యూత్ పార్లమెంట్ను జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ వక్తృత్వానికి న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ రంజిత్ కుమార్ పతి, విశ్రాంత అధ్యాపకులు సురేంద్ర కుమార్ రథ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ సుభ్రత్ కుమార్ చౌదురీ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్, ఎన్.యస్.యస్.నోడల్ ఆధికారి డాక్టర్ సన్యాసి బెహరా, కోఆర్డినేటర్ (ఎన్.యస్.యస్.) భిఘ్నేశ్వర్ మిశ్రా, సుమంత్ బెహరా తదితరులు పాల్గొన్నారు. ‘50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ కాలంలో భారతీయ రాజ్యాంగంపై మనం తెలుసుకోవాల్సిన పాఠాలు’ అన్న అంశంపై స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను నిర్వహించారు. ఈ యూత్ పార్లమెంట్కు సెంచూరియన్ వర్సిటీ విద్యార్థులు, శ్రీరాండిగ్రీ కళాశాల, కాశీనగర్, హిల్టాప్ కళాశాల, మోహనా, మహిళా కళాశాల విద్యార్థినులు హాజరై మాట్లాడారు. జూన్ 25, 1975న జరిగిన అత్యవసర స్థితిపై విద్యార్థిని ఎ.శరణ్య డిబేటింగ్లో అన్నారు. 22 నెలలపాటు సాగిన అప్పటి ఎమర్జెన్సీపై పలువురు వక్తలు మాట్లాడారు. విజేతలకు బహుమతులు అందజేశారు. -
అరాచకాలకు వంతెన
● పొన్నాడ వంతెనకు ఇరువైపులా అసాంఘిక కార్యకలాపాలు– రాత్రి 9 దాటితే అటుగా వెళ్లడానికే భయం ● గంజాయి బాబుల క్రయ, విక్రయ సరఫరాల అడ్డాగా మారిన వైనం ● హత్య జరగడంతో భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు శ్రీకాకుళం క్రైమ్ : అభివృద్ధికి చిరునామాగా నిలిచిపోతుందన్న ఉద్దేశంతో నిర్మించిన పొన్నాడ వంతెనను కొందరు మందుబాబులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. నగరంతో అనుసంధానం కోసం కట్టిన ఈ వంతెనను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇటు శ్రీకాకుళం నగరానికి, అటు ఎచ్చెర్ల మండల పరిధి గ్రామాలకు పొన్నాడ వంతెనే దారి. వంతెనకు ఆవల, ఈవల.. ఎటు చూసినా 3 కిలోమీటర్ల పరిధిలోనే మత్తుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చెందిన వ్యక్తి పొన్నాడ రాజీవ్గారితోటలోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురికావడం తెలిసిందే.. వంతెనకు ఇవతల.. శ్రీకాకుళం నగరం పొన్నాడ వంతెన ఆరంభ శ్రీరామ మందిరం కూడలి నుంచి ఇటువైపుగా కలెక్టర్ బంగ్లా, వాంబేకాలనీ, 80 ఫీట్రోడ్డు, కేపీహెచ్బీ, కృష్ణాపార్కు, అఫీషియల్ కాలనీలతో పాటు, అటువైపుగా మంగువారితోట, గూనపాలెం, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో మత్తుబాబుల వీరంగం అధికమైంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం మత్తులో యువకులు నాలుగైదు బ్యాచ్లుగా విడిపోయి పేట్రేగిపోతున్నారు. స్పోర్ట్స్ బైక్లపై వేగంగా వెళ్తూ భయపెడుతుంటారు. రాత్రి 9 గంటలు దాటిందంటే ఇటుగా రావడానికి ఎవరైనా భయపడతారు. అనేకమార్లు దాడులు సైతం జరిగాయి. ఇటీవల వాంబే కాలనీ రాజీవ్ గృహకల్పలోని ఓ గదిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిని కొంతమంది యువకులు అద్దెగా తీసుకుని గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు వాడుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. పొన్నాడ వంతెన చక్కటి సుందర ప్రదేశం. సాయంత్రం వేళ సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అదే ఆసరాగా చేసుకున్న కూటమి ప్రభుత్వం నాయకులు సైతం సమీపంలోనే బార్అండ్ రెస్టారెంట్లు, వైన్షాఫులకు అనుమతులు ఇచ్చారు. బ్రిడ్జికి ఆవల రెండు దాబాలు కూడా ఉన్నాయి. వంతెన అవతలివైపు తోటలను మందుబాబులు అడ్డగా మార్చుకున్నారు. బ్రిడ్జి మీద కెమెరాలు పెట్టడంతో తోటల్లోకి వెళ్లిపోతున్నారు. ఎచ్చెర్ల స్టేషన్ పరిధి గ్రామాలైన పెద్ద కొంగరాం, ముద్దాడ, చిన్నకొంగరాం, వెంకన్నగారిపేట మీదుగా తోటపాలెం మార్గంలోని నీలగిరి, మామిడి, జీడి తోటల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. కొంతమంది కళాశాలల అమ్మాయిలతో సైతం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వస్తుంటారని స్థానికులంటున్నారు. కొన్ని ఘటనలు.. ●శుక్రవారం ఇదే ప్రాంతంలో హత్య జరిగింది. ●దాదాపు నెలన్నర క్రితం ఆంజనేయస్వామి టెంపుల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచేశారు. ●బ్రిడ్జి దాటాక పీడీ కన్వన్షన్ హాల్ వెనుక నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఏడాది క్రితం కాల్చారని, అదే కన్వర్షన్ హాల్ సమీప మెకానిక్ షెడ్ పక్కన పొలాల్లో ఆరునెలల క్రితం కొందరు తాగి ఘర్షణ పడి కొంగరాం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మరణానికి కారణమయ్యారని గ్రామస్తులు అప్పట్లో ఆరోపించారు. ●శుక్రవారం హత్య జరిగిన ప్రదేశానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఎస్ఎంపురం పీఎసీఎస్ బహుళ ప్రయోజన సౌకర్య గోదాం వెనక వైపు ఓ వ్యక్తి పురుగు మందు తాగేశాడు. ●ఇక్కడికి సమీపంలోనే 2023 ఆగస్టు 15న ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిందని, ఎక్కడెక్కడో చంపేసి ఇక్కడ పడేస్తుంటారని, ఎక్కడెక్కడివారో ఇక్కడ మత్తులో జోగి హత్యలు, దాడులకు ఎగబడుతున్నారని, ఈ మార్గాల్లో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఆదిత్యాలయం..భక్తజన సందోహం
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. మాఘ మాసంతో పాటు వత్సవలస రాజమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచే ప్రధాన రహదారిలో భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టగా.. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అంతరాలయంలో గోత్రనామాలతో పూజలు చేశారు. నగర కార్పొరేషన్కు కమిషనర్ బాధ్యతలు చేపట్టిన బొడ్డేపల్లి రాము కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ఓం ఫ్రీ యోగా సంస్థ ప్రతినిధి, యోగా గురువు చిలకా వెంకటరమేష్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ బి.ఎస్.రాంబాబు, ఏపీ, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి.రవీంద్రనాథ్, డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వి.ఉదయకుమార్, జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ బి.శ్రీనివాసులు, సంఘ సభ్యుడు పెదపెంకి ఉపేంద్ర తదితరులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. -
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్గా బగాది
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు రాష్ట్ర సమాఖ్య కో–చైర్మన్గా నియమితులయ్యారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ భవనంలో జరిగిన సమాఖ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. బగాది ఎంపిక పట్ల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం సేశారు. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించాలి పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నిపుణుల సహకారంతో కిడ్నీ వ్యాధిపై పరిశోధన జరగాలన్నారు. రీసెర్చ్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలన్నారు. 59 వైద్యులకు గాను 18 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. కిడ్నీ రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం అందించాలని కోరారు. 200 పడకలకు గాను 100 పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం విచారకరమని చెప్పారు. ఆస్పత్రికి బస్సు పాయింట్ దూరంగా ఉందని, ఎలక్ట్రికల్ వాహనం సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో వేదిక నాయకులు పి.ధర్మారావు, కె.మణికుమార్, ఎన్.గణపతి పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం జి.సిగడాం : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నాయకులు మొయ్యి జనార్దన్నాయుడు, మక్క సురేష్ అన్నారు. ఆదివారం జి.సిగడాంలో వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ విధానం అమలయ్యేవరకు పోరాటం ఆగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్యులు బాలి రామారావు, సామంతుల సత్యనారాయణ, జాడ వెంకటరమణ, శ్రీనివాస్ పట్నాయక్, వల్లూరు రమణ, జోగిదొర తవిటిరాజు పాల్గొన్నారు. మాజీ సైనికులకు సత్కారం శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికులు సమాజానికి ముందుకురావాలని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల రథసప్తమి నాడు అరసవల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీర నారీమణులకు చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ట్రెజరర్ ఎం.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో భక్తుల రద్దీ గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో వేకువ జామున స్వామికి పంచామృతాభిషేకం, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈఓ టి.వాసుదేవరావు భక్తుల క్యూలైన్ పర్యవేక్షించారు, -
ఉగాది ఉత్సవాలకు ముహూర్తపు రాట
రాయగడ: జిల్లా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. స్థానిక కొల్లిగుడ సమీపంలోని మైదానంలో సమాఖ్య అధ్యక్షుడు యాళ్ల కొండబాబు ఆధ్వర్యంలో ఆదివారం మూహూర్తపు రాట వేసే కార్యక్రమం జరిగింది. వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు కొండబాబుతోపాటు డి.లక్ష్మణరావు, ఆదినారాయణ, సాయిప్రియ మహిళ వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రామాదేవి, పట్టణ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 19న జరగనున్న ఉగాది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొండబాబు తెలియజేశారు. మూడేళ్లుగా ఉత్సవాలను తన ఆధ్వర్యంలో అందరి సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఉగాది వేదికగా మారిందని అన్నారు. రెండు రోజులు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు. -
22న నూతన కార్యవర్గం ఎన్నిక
పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మార్చి 19న పంచాంగ శ్రవణం, 22న ఉగాది వేడుకలు, కొత్త కార్యవర్గం ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుందని కార్యదర్శి బర్నాల జనార్దనరావు తెలిపారు. 22న ఉగాది వేడుకలు స్థానిక రాజవీధిలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తామన్నారు. ఆదివారం చైతన్య సమితి కార్యవర్గం స్థానిక శ్రీకుంజ్ హోటల్ జరిగిన సమావేశంలో ఉగాది వేడుకలు పర్లాకిమిడిలో ప్రవాసాంఽధ్రులు నిర్వహించేందుకు సన్నాహక సమావేశం జరిపారు. ఈ సమావేశంలో చైతన్య సమితి న్యాయసలహాదారు వి.ఎస్.ఎన్.రాజు, కన్వీనర్ డాక్టర్ రహింతుల్లా, సామినేని విశ్వప్రసాద్, కె.రామారావు, కోశాధికారి జి.నానాజీ, జాయింట్ సెక్రటరీ ఇసై వెంకటరావు, పి.వాసుదేవరావు, టి.కిశోర్, తదితరులు హాజరయ్యారు. -
రాజమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఐదో ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కొమరవానిపేట రాజమ్మ తల్లి ఉత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తోటలు, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వేకువజాము నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలాచరించారు. -
మందిర పరిసరాలు అభివృద్ధి..
జయపురం: జయపురం సమితి గొడొపొదర్ గ్రామంలో హనుమాన్ మందిరం ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు గొడొపొదర్ పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నడుంబిగించారు. జయపురం ప్రాంత ప్రజలే కాకుండా పలు ప్రాంతాల ప్రజలు గొడొపొదర్ హనుమాన్ మందిర ప్రాంతాన్ని పిక్నిక్ కేంద్రంగా వినియోగిస్తున్నారు. అందువల్ల ఆ పాంతాన్ని అభివృద్ధి పరచాలని భావించిన విద్యార్థులు ఆలయాన్ని సందర్శించి మొక్కలు నాటారు. గ్రామంలో ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వ్యర్థపదార్థాలు వేసేందుకు రెండు డస్ట్బిన్లు సమకూర్చారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ఆలయ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మందికిపైగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ఎస్.ఎం.సి చైర్మన్ లయిచన్ నాయక్, జయపురం సిటీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ పట్నాయక్ నేతృత్వంలో విద్యార్థులు పాల్గొని గొడొపొదర్ విద్యార్థులకు సహకరించారు. గొడొపొదర్ పాఠశాల హెచ్ఎం దిలీప్ పండా, తదితరులు పాల్గొన్నారు. -
గట్టి చేతలు!
చిట్టి చేతులు..● చిన్ననాటి నుంచే సమాజ సేవ ● పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు ● సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ● పాఠశాలల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు హిరమండలం: నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలను ఏర్పాటుచేసింది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రతి పీఎంశ్రీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటుచేస్తున్నారు. సేవాభావంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 81 పీఎంశ్రీ పాఠశాలలను ఎంపికచేసి ఆన్లైన్లో నమోదుచేశారు. తొలి విడతలో ఎంపికై న 32, రెండో విడతలో ఎంపికై న 3 పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చుతుంది. ఇప్పటివరకూ ఆ రెండు విడతల్లో రూ.4.2 కోట్లు నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకో మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో పాఠశాలల ఎంపిక జరగలేదు. ఇప్పుడు ఏడో విడతలో మాత్రం ఏకంగా 81 పాఠశాలలను ఎంపిక చేసినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో ఎంపిక చేసిన 35 పాఠశాలల్లో పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. దేశభక్తి పెంచేలా.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 35 పాఠశాలలకు సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు వంతున కేటాయించారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఇందుకు రూ.5 వేలు కేటాయించారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను, మెలకువలను విద్యార్థులతో చేయిస్తారు. ఇప్పటికే దాదాపు 800 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరారు. ఈ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతలను తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులను క్యూలైన్లో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్డే వేడుకల్లో భాగస్థులవుతారు. అయితే ప్రాథమిక స్థాయి నుంచే సేవ, దేశభక్తి అలవరచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ఏటా మరిన్ని పాఠశాలలను పీఎంశ్రీకు ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేయడం శుభ పరిణామం. సమగ్ర వసతులు.. పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రధానంగా క్రీడాంశాలకు ప్రాధాన్యమిస్తారు. క్రీడా కోర్టులు, రన్నింగ్ ట్రాక్లతో పాటు మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డులు, ఉద్యానాలు, రక్షణ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. తరగతి గదులకు సంబంధించి ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయోగశాలలో పరికరాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలు ఏర్పాటుచేస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. యూనిఫాం అందిస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు సైతం ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతోంది. విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలిగించాలన్నది పీఎంశ్రీ పాఠశాలల లక్ష్యం. దేశభక్తి, సమాజ సేవను ప్రాథమిక స్థాయిలో అలవరచాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు సైతం అలవడుతాయి. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. – కె.రాంబాబు ఎంఈఓ, హిరమండలం -
లోయలోకి దూసుకెళ్లిన లారీ
● డ్రైవర్, హెల్పర్కు గాయాలురాయగడ: సదరు సమితి గుమ్మ ఘాటీ మలుపులో కర్రల లోడుతో వస్తున్న లారీ శనివారం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ డ్రైవర్, హెల్పర్లకు గాయాలు తగిలాయి. వారిని వెంటనే అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలానికి కుంబికోట పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా బొరొగుమ్మ నుంచి కర్రల లోడుతో జేకేపూర్కు వస్తున్న లారీ గుమ్మఘాటీ మలుపు వద్ద అదుపుతప్పడంతో సుమారు 20 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ శివహరిజన్, హెల్పర్ నవీన్ భూమికలు లోయపడిపోవడతో గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న వారు కాపడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల భావిస్తున్నారు. -
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
రాయగడ: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సాయిప్రియ లేడీస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిప్రియనగర్లోని ఎన్.వి.ఆర్.విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు వేర్వేరుగా పోటీలు జరిగాయి. కంట్రిబ్యూషన్ ఆప్ ఇండియన్ సైంటిస్ట్స్ టు ద వరల్డ్ అనే అంశంపై ఆరో తరగతి విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని ప్రణయ మాఝి, ద్వితీయ బహుమతిని బి.ప్రజిషా, తృతీయ బహుమతిని శుభం మిశ్రాలు గెలుచుకోగా ప్రోత్సాహక బహుమతిని పుటుల్ బాగ్ దక్కించుకున్నారు. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థుల మధ్య బిహైండ్ ఎవిరీ డిస్కవరీ–దెరీజ్ ఎ ఉమెన్ సైంటిస్ట్ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లొ ప్రధమ బహుమతిని విక్టోరియా కడైసిక గెలుచుకోగా ద్వితీయ బహుమతిని రాణి బ్రెడిక, తృతీయ బహుమతిని సుప్రియ క్రితంగ దక్కించుకున్నారు. ప్రోత్సాహక బహుమతి భారతీ బ్రెడకకు లభించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ లక్ష్మీ నారాయణ సాహు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రామాదేవి, కార్యదర్శి మాధురి, కోశాధికారి నిర్మల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. -
చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమతి 177 బెటాలియన్ బీఎస్ఎఫ్ జవాన్లు డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా శనివారం చిత్రకొండలో ఆదర్శ విద్యాలయంలో ఆయుధ పదర్శన నిర్వహించారు. ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, బీఎస్ఎఫ్ అధికారులు ఉపయోగించే వివిధ ఆయుధాలు, గోబాబారుదాలు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు ప్రదర్శించారు. సమారు 160 మంది విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కమెండర్ ఎం.నౌషాద్ తమ శాఖ చరిత్ర, దేశానికి జవాన్లు అందిస్తున్న సేవలు వివరించారు. త్వరలో పరీక్షలు రాయనున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మిఠాయిలను పంపిపెట్టారు. తమ పాఠశాలలో జవాన్లు ఆయుధ ప్రదర్శ చేసినందుకు ఉపాధ్యాయులు విశ్వశ్రీ విశ్వస్, ప్రభాత్ దాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
రాయగడ: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారుతోందని జిల్లా సామాజిక సురక్షా అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి అన్నారు. సదరు సమతి కొమట్లపేటలోని ఉగ్రతార ఉన్నత పాఠశాలలో ‘మత్తుపదార్థాలు–యువతపై ప్రభావం’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసకాకూడదని అన్నారు . మత్తు వల్ల వారి భవిష్యత్ చిత్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి
పర్లాకిమిడి: ఒడియా భాష ఉన్నతి, ఒడిశా భాషా రాష్ట్రంగా ఏర్పాటుకు కృషిచేసిన పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్, ఇతర భాషాప్రజ్ఞులపై రాష్ట్ర స్థాయి ఇష్టాగోష్టి స్థానిక కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగినది. ఈ సభలో ఒడిశా మాతృభాష, యువపీడి’ అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. ఈ సభకు మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ రీనా సాహు అధ్యక్షత వహించారు. విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ భారతీ పాణిగ్రాహి స్వాగత ఉపన్యాసం, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇష్టాగోష్టిలో సాహితీ విమర్శకులు డాక్టర్ లంబోధర పాణిగ్రాహి (బరంపురం), డాక్టర్ అశోక్ పండా, రాయగడ జిల్లా స్వయంప్రతిపత్తి కళాశాల అధ్యాపకురాలు రాజ్యలక్ష్మీదేవి, సరిహద్దు ప్రహరి పూర్ణచంద్ర మహాపాత్రో, శ్రీకాకుళం జిల్లా బారువ ప్రభుత్వ కళాశాల ఒడియా అధ్యాపకులు డాక్టర్ రామారావు మఝి తదితరులు పాల్గొన్నారు. మాతృభాష ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, స్వాతంత్య్రంకు పూర్వం పర్లాకిమిడి, జయపురం, నవరంగ్పూర్, రాయగడ, గంజాంలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవని, తరువాత బెంగాల్లో కోన్ని జిల్లాలు కలిసిన తర్వాత బెంగాళీ భాషలో అనేకమంది కవులు పుస్తకాలు రాశేవారని లంబోధర పాణిగ్రాహి అన్నారు. తదుపరి కాలంలో సరిహద్దు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష ప్రభావం కూడా పర్లాకిమిడి సంస్థానంపై పడి ఒడిశా భాష వైభవం కోల్పోయిందని ఉత్కళ హితేషిణి కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఒడియా భాషలో వక్తృత్వం, ప్రబంధాలు, శుద్ధ ఒడియా రాయడంపై మహిళా కళాశాల నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు లంబోధర పాణిగ్రాహి బహుమతులు ప్రదానం చేశారు. అధ్యాపకురాలు బరదా ఆచార్య సభకు ధన్యవాదాలు తెలిపారు. -
దివ్యాంగులను ప్రోత్సహిద్దాం
జయపురం: దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వారికి అండగా నిలిస్తే క్రీడా పోటీల్లో రాష్ట్ర,, జాతీయ స్థాయిలో విజయఢంకా మోగిస్తారని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. శనివారం కొరాపుట్ జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను జయపురం సమితి పూల్బెడ ప్రాంతంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగంలో కొరాపుట్ జిల్లాను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు దివ్యాంగ క్రీడాకారులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లా సామాజిక సురక్షా విభాగం, దివ్యాంగ స్వసస్థీకరణ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 260 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, వీల్చైర్ రేస్, పరుగు, లాంగ్జంప్, హైజంప్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సమితి చైర్మన్ తిలోత్తమ ముదులి, జయపురం సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, జిల్లా సామాజిక భద్రతాధికారి తరుణ తపన్ ప్రహరాజ్, జయపురం సబ్ డివిజన్ సామాజిక భద్రతాధికారి సౌధామణి ప్రధాన్, అధ్యాపకులు రబి శతపతి, కొరాపుట్ బ్లైండ్ స్కూల్ క్రీడా ఉపాధ్యాయులు చంద్రశేఖర పట్నాయిక్, జయపురం సమితి అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి గగణబిహారి దాస్, పీఈటీ రంజిత్ కుమార్ ప్రధాన్, సూర్యకాంత ముదులి, శ్వణ కుమార్ మండంగీ, రమేష్కుమార్ భోల్, బొబిత ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల పరిశీలన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి శనివారం పరిశీలించారు. ఝరాపల్లి, పద్మాగిరి పంచాయతీల్లోని పాఠశాలలను డీఈవో సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే యం.వి.84, యం.వి.85 గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను కూడా సందర్శించారు. అనంతరం పద్మాగిరి పాఠశాలను సందర్శించి సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఊహాగానాలకు తెర
● బీజేడీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ● పోటీలో సంతృప్త్ మిశ్రా, డాక్టర్ దత్తేశ్వర్య హోటాభువనేశ్వర్: రాజ్యసభ ఎన్నికలకు బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం బీజేడీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. వారిలో ప్రముఖ వ్యాపార దిగ్గజం సంతృప్త్ మిశ్రా, ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ దత్తేశ్వర్ హోటా ఉన్నారు. వీరివురు భారత పార్లమెంటు ఎగువ సభలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ● ఈసారి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శాసనసభలో సంఖ్యా గరిష్టత ఆధారంగా అధికార పక్షం భారతీయ జనతా పార్టీకి తొలి 2 స్థానాలు కై వసం కావడం తథ్యం. మిగిలిన 2 స్థానాల్లో ఒకటి విపక్ష బిజూ జనతా దళ్కు వరిస్తుంది. చివరగా మిగిలిన 4వ స్థానం చేజిక్కించుకునే ప్రయత్నంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్ష బీజేడీ 3, 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రధాన పోటీకి తెర ఎత్తింది. మూడో స్థానానికి మొదటి అభ్యర్థి సంతృప్త్ మిశ్రా, 4వ స్థానానికి రెండో అభ్యర్థి డాక్టర్ దత్తేశ్వర్ను పేర్కొంది. డాక్టర్ దత్తేశ్వర్ ఉమ్మడి అభ్యర్థి. ఆయనకు సానుకూలంగా మద్దతు ఇచ్చి రాజ్య సభకు పంపాలని నవీన్ పట్నాయక్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ● ఒడిశా యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మొదటి వైస్–ఛాన్సలర్, ఎస్సీబీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హోటా ధారణ అభ్యర్థి కాబట్టి, సంతప్త్ మిశ్రా చాలా సంవత్సరాలుగా బీజేడీలో చురుకై న నాయకుడిగా, పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక వ్యూహకర్తగా పరిగణించబడుతున్నారు. ఈసారి, ఆయన కటక్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రాతినిధ్యానికి తన స్వరాన్ని జోడిస్తారు. వైద్య రంగానికి, ముఖ్యంగా యూరాలజీకి చేసిన కృషికి పేరుగాంచిన డాక్టర్ దత్తేశ్వర్ ఎగువ సభలో కూడా స్థానం సంపాదించనున్నారు. ● ఒడిశా అసెంబ్లీలో బీజేడీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే, ఆ స్థానానికి శాంట్రప్ట్ మిశ్రా అధికారిక అభ్యర్థిగా ఉంటారని, డాక్టర్ హోటాను నాలుగో స్థానానికి పోటీకి దించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ హోటాకు మద్దతు ఇవ్వాలని నవీన్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. మూడవ స్థానానికి మొదటి అభ్యర్థి సంతృప్త్ మిశ్రా, మా పార్టీ సీనియర్ సభ్యుడు. డాక్టర్ దత్తేశ్వర్ ప్రముఖ వైద్యుడు, పేరొందిన యూరాలజిస్టు, ఒడిశా యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తొలి వైస్ ఛాన్సలర్, కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా కీలక బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణలో దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన నామినేషన్ ప్రజారోగ్య విధానంలో ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంపై బీజేడీ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సంతృప్త్ మిశ్రా బిజూ జనతా దళ్లో చేరి కటక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. -
–8లోu
● ముగిసిన బ్రహ్మోత్సవాలురాయగడ జేకేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో భూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీనివాసుని పవలింపు సేవతో పూజా కార్యక్రమాలు ముగిసాయి. అంతకుముందు గజవాహన సేవ, చక్రస్నానం, వసంతోత్సవాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మందిర ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేంకటేశ్వర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. వందల సంఖ్యలో భక్తులు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించారు. – రాయగడఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 -
ఫ్లై ఓవర్పైకి అనధికార ప్రవేశం
● రెండు వాహనాలకు రు.40 వేల జరిమానారాయగడ: స్థానిక ఫ్లై ఓవర్పై అనధికారంగా ప్రవేశించిన రెండు భారీ వాహనాలకు రోడ్డు రవాణా శాఖ అధికారులు రూ.40 వేల జరిమానాను విధించారు. గత కొద్ది నెలలుగా ఫ్లైవర్ మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో బ్రిడ్జిపై వాహన రాకపోకలను జిల్లా యంత్రాంగం నిషేధించిన విషయం తెలిసిందే. శనివారం రెండు భారీ వాహనాలు బ్రిడ్జి మీదుగా వెళ్లి రహదారి లేకపోవడంతో మధ్యలో నిలిపివేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలు బ్రిడ్జిపై నిలిచి ఉండటం గమనించిన ఆర్టీఓ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో చేరుకుని వాహనాల యజమానికి సంబంధించిన కాగితాలను పరిశీలించి రెండింటికీ జరిమానను విధించారు. రెండు భారీ వాహనాలు గుజరాత్ నుంచి జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి వద్ద గల ఆదిత్యా అలూమిన కార్మాగారం నిర్మాణంలో భాగంగా అందుకు సంబంఽధించిన యంత్రాలను తరలిస్తున్నట్లు సమాచారం. స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ మీదుకు ఎటువంటి వాహనాలు రాకపోకలు కొనసాగించకూడదని జిల్లా యంత్రాంగం హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినప్పటికీ ఈ రెండు భారీ వాహనాలు నియమాలను ఉల్లంఘించి బ్రిడ్జిపైకి వెళ్లాయి. -
● టైలర్ల దినోత్సవం
పర్లాకిమిడి: ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) సందర్భంగా గజపతి జిల్లా టైలర్ల సంఘం సభ్యులు శనివారం ఉదయం స్థానిక పాతమార్కెట్ వద్ద పర్లాకిమిడి మహరాజా కృష్ణచంద్ర గజపతి విగ్రహానికి పూలమాలలు వేశారు. కుట్టు మిషన్ను కనిపెట్టిన విలియం ఎలియాస్ హోవే చిత్రపటానికి అంజలి ఘటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన టైలర్ మార్కెండయ చిత్రపటానికి దర్జీలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ సంఘం అధ్యక్షుడు కోవిల్కోండ వరదరాజులు, కార్యదర్శి ఎం.రవిరాజ్. ఉపాధ్యక్షుడు మల్లా ధర్మారావు, కోశాధికారి పి.దిలీప్, తదితరులు పాల్గొన్నారు. -
నందపూర్ సమితిలో కలెక్టర్ పర్యటన
కొరాపుట్: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ కాలినడకన నదులు దాటారు. శనివారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితిలో పర్యటించారు. ఆ ప్రాంతంలో బస్కి నదిపై వంతెన నిర్మించాలని గత కొంత కాలంగా గిరిజనులు ఎన్నికలు బహిష్కరిస్తున్నారు. ఈ సమస్య తెలుసుకోవడానిని కలెక్టర్ స్వయంగా నదిని నడుచుకుంటూ దాటారు. నది అవతల ఉన్న బెబసానందగుడ గ్రామ గిరిజనులతో సమావేశమయ్యారు. వర్షాకాలం తాము నది దాటలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనారోగ్యం చేస్తే వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. తమ పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని, అంగన్వాడీ కేంద్రాలు నడవడం లేదని వాపోయారు. కనీస ఉపాధి లేక విలవిలలాడుతున్నామని వాపోయారు. కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరలో వంతెన నిర్మాణం ప్రారంభం అవుతుందని హామీ ఇచ్చారు. -
ఆవిష్కరణలతోనే వికసిత భారత్
జయపురం: విజ్ఞాన, ఆవిష్కరణాత్మక ఆలోచనల ద్వారానే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని విద్యావేత్త, యువ శాస్త్రవేత్త, అవిభక్త కొరాపుట్ తెలుగు తేజం అములూరి విశ్వనాథ్ అన్నారు. శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్లో మాట్లాడుతూ ఈ ఏడాది జాతీయ విజ్ఞాన దినోత్సవ థీమ్ ‘విజ్ఞానంలో మహిళలు..వికసిత భారత్ నిర్మాణానికి ప్రోత్సాహం’ అని వెల్లడించారు. అవిభక్తి కొరాపుట్( కొరాపుట్, మల్కనగిరి, రాయగడ, నవరంగపూర్) అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో సమగ్ర చర్చలు, ఆధునిక సాంకేతికత అవసరమన్నారు. విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ విజ్ఞాన ప్రదర్శనలు, వర్క్షాపులు నిర్వహిస్తూ భవిష్యత్ శాస్త్రవేత్తలకు ప్రేరణ ఇవ్వాలని, అలా చేసినప్పుడే వికసిత భారత్, వికసిత ఒడిశా, వికసిత అవిభక్త కొరాపుట్లు సాధ్యమౌతాయని చెప్పారు. చనిపోయిన కోడి మాంసం తిని నలుగురికి అస్వస్థత రాయగడ: అనారోగ్యానికి గురై చనిపోయిన నాటుకోడి మాంసాన్ని వండుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలొని సనోడెంగిలి గ్రామంలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే కళ్యాణసింగుపూర్ పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుటుగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సనోడెంగిలి గ్రామానికి చెందిన పొతే కడ్రక, కుడుంజీ కడ్రక, పవులి కడ్రక, మాల కడ్రకలు వారి ఇంట్లో పెంచుతున్న ఒక నాటుకోడి చనిపోయింది. దానిని పారవేయడమెందుకని కోసి మాంసాన్ని వండుకుని అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. అర్థరాత్రి అయ్యేసరికి ఒకొక్కరికీ వాంతులు పట్టుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు చూసి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. లిక్విడ్ గంజాయి తయారీలో కేరళా స్మగ్లర్లు కొరాపుట్: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గంజాయి ఆయిల్ తయారీ పరిశ్రమపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. శనివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో దక్షిణ పశ్చిమాంచల్ ఐజీ కన్వర్ విశాల్సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న కొరాపుట్ జిల్లా జోలాపుట్ రిజర్వాయర్ మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ పరిశ్రమపై దాడి చేయగా.. 1,800 లీటర్ల గంజాయి ఆయిల్ పట్టుబడిందన్నారు. దీని విలువ రూ.200 కోట్ల పైబడి ఉంటుందన్నారు. ఈ సమయంలో నలుగురు కేరళ వాసులు ఉన్నారన్నారు. అధునాతన రసాయన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నారని చెప్పారు. ఐలాండ్కి వెళ్లడానికి బోట్లు వాడుతున్నారని, విద్యుత్ కోసం జనరేటర్లు వినియోగిస్తున్నారని తెలిపారు.ఈ మాఫియా డాన్ జయరాజ్ కేరళా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. టెన్త్ పాస్ అయిన జయరాజ్ యూట్యూబ్ చూస్తూ ఆయిల్ తయారు చేస్తున్నాడని చెప్పారు. కేరళా నుంచి వచ్చి ఒడిశాలో తయారు చేయడం వెనుక నెట్వర్క్ ఛేదిస్తామన్నారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్లో పాల్గొన్న ఎస్పీ రోహిత్ వర్మను అభినందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థిగా సత్యజిత్ గొమాంగ్
భువనేశ్వర్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెసు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం శనివారం 3 సెట్ల నామినేషన్ ఫారాలు కొనుగోలు చేసింది. పార్టీ ఎమ్మెల్యే సత్యజిత్ గొమాంగ్ ఈ దరఖాస్తులు పొందారు. రాజ్యసభ ఎన్నికల్లో 4వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపనుంది. పేలుడు ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగిన విషాదకరమైన ఫ్యాక్టరీ పేలుడు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాయగడ: జిల్లాలోని గుడారి ఎన్ఏసీ తొమ్మిదో వార్డు పరిధి శ్రీరాంనగర్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు వంశీధర సబర్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులకు ఉన్న తాళాలను విరగ్గొట్టి లోపలకు వెళ్లి ఇంటిలోని వెండి, బంగారు, నగదును దోచుకున్నారు. ఈ మేరకు బాధితుడు గుడారి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్టీంతో సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు మునిగుడ సమితిలోని బాలిజోల సేవాశ్రమంలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటికి తాళాలు వేసి ఆశ్రమ పాఠశాలకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
శ్రీకాకుళం: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆర్థిక సహకారంతో ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి ఫౌండేషన్ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరావును విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఇటీవల సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలానే లేబర్ రూమ్, ఫార్మసీ, వార్డ్, ల్యాబరేటరీ గార్డెన్లకు అత్యాధునిక సదుపాయలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బద్దెల సురేష్ పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత టెక్కలి రూరల్: స్థానిక జగతిమెట్ట సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్న నాలుగు బొలేరో వ్యాన్లను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలి సమీప ప్రాంతాల నుంచి సంతలకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 4 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిలో మూడు వాహనాల్లో మొత్తం 14 గేదెలతో పాటుగా ఒక బొలేరో వాహనంలో 4 ఆవులు ఉన్నాయి. వాహనాలను టెక్కలి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించనున్నట్లు తెలిపారు. ఇత్తడి సామగ్రి చోరీపై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండంలోని తలగాం గ్రామానికి చెందిన హనుమంతు విద్యాసాగర్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉంచిన సామగ్రి కనిపించడం లేదని టెక్కలి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. విద్యాసాగర్ తెలంగాణలోని భద్రాచలంలో పేపర్ బోర్డులో టెక్నికల్ అడ్వైజరుగా పనిచేస్తున్నారు. అయన ఈనెల 27వ తేదీన తన సొంత గ్రామమైన తలగాంలోని ఇంటికి వచ్చారు. అనంతరం స్టోర్ రూమ్కి వెళ్లి చూడగా అందులో ఉంచిన సుమారు 100 కేజీల ఇత్తడి సామగ్రితో పాటు 3 గ్రాముల బంగారు కాసులు కన్పించడం లేదని తెలిపాడు. ఈ మేరకు సామగ్రి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల వివరాలను నమోదు చేయాలి ● డీపీఎం పూజారి సత్యనారాయణ ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో కృషి మేపర్ పోర్టల్కు అనుసంధానం కోసం రైతుల వివరాలను ‘ఉర్వి’ యాప్లో నమోదు చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ సూచించారు. మండలంలోని చీమలవలస గ్రామంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ప్రక్రియ ఐసీటీఎన్ఎఫ్ఏ శివకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతోందని చెప్పారు. చీమలవలస, కట్యాచార్యులపేట, వంజంగి, జొన్నవలస, దూసి, కలివరం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సీడీఎఫ్ సురేష్ ఆధ్వర్యంలో వివరాల నమోదు ప్రక్రియను ట్రైనీ ఐసీఆర్పీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రైతుల భూ వివరాలను ఖచ్చితంగా జియోట్యాగ్ చేసి, రైతుల ఫొటోలను కూడా అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
జయపురం: స్థానిక సరస్వతి విద్యా శారదా మందిరంలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యాలయ ప్రధాన శిక్షకులు సత్యనారాయణ సెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విజ్ఞాన ప్రాజెక్టులు, తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినవారికి బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ హెచ్ఎం క్షీరోద్ కుమార్ భటమిశ్ర పాల్గొన్నారు. పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు కిశోర్ చంద్ర పండా, కార్యదర్శి బిజయ కుమార్ భట్, పాఠశాల విజ్ఞాన అధ్యాపకులు దిలీప్ కుమార్ శతపతి, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి విద్యార్థుల వికాశంలో విజ్ఞాన భూమికపై వివరించారు. పాఠశాల ఆచార్యులు అనంత నారాయణ మహాపాత్ర, కై ళాస్ చంఽద్ర పందా, రామచంద్ర మహంతి తదితరులు హాజరయ్యారు. శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో.. పర్లాకిమిడి: జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల రుసా భవనంలో సైన్స్ ప్రదర్శనలను సైంటిస్టు భువనేశ్వర్ డాక్టర్ శాంతిభూషన్ సేనాపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ రధాకాంత భుయ్యాన్, జాతీయ సైన్స్ డే కోఆర్డినేటరు నివేదిత సామల్, భిఘ్నేశ్వర్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలకు ఎస్.కె.సి.జి కళాశాల లైఫ్సైన్స్, కాశీనగర్ శ్రీరాంకళాశాల, కేంద్రీయ విద్యాలయం ప్లస్టు, మోహనా హిల్టాప్ కళాశాల విద్యార్థులు 25 ప్రాజెక్టులు ప్రదర్శించారు. లైఫ్సైన్స్ కళాశాలలో వికసిత్ భారత్లో మహిళా విజ్ఞానవేత్తలు అన్న అంశంపై కర్మశాలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్, శాంతిభూషణ్ సేనాపతిని సన్మానించారు. ప్రొఫెసర్ కీర్తిరంజన్ దాస్, పలువురు ప్రొఫెసర్లను సత్కరించారు. ఉత్తమ విజ్ఞాన ప్రాజెక్టులు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎంవివి 55 గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుక్రి సర్కార్ (55) మృతి చెందారు. ఈమె భర్త పరితోష్కు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జంట శుక్రవారం మధ్యాహ్నం బలిమెల నుంచి కలిమెల సమితి ఎంవి 81 గ్రామంలో నివసిస్తున్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం అక్కడ నుంచి బయలుదేరి తిరిగి వస్తున్న సమయంలో ఎంవివి 55 గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం చూసిన స్థానికులు రహదారి పక్కనే పడిపోయిన మహిళ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ప్రాణాలతో ఉండటంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంవి 79 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త పరితోష్కు కాళ్లు విరిగిపోవడంతో మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని ల్యాణవేంకటేశ్వర స్వామి మందిరంలో ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో మందిరం ప్రాంగణంలో శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సెపక్ తక్రా పతక విజేతకు సత్కారం భువనేశ్వర్: శ్రీలంకలో జరిగిన ఆసియా సెపక్ టక్రావ్ చాంపియన్షిప్లో భారత మహిళా, పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో భారత జట్టు 3 బంగారు పతకాలు గెలుచుకుంది. ఒడిశాకు చెందిన ఆకాష్ కుమార్ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. ఒడిశాకు కీర్తిని చాటిన ఆకాష్ కుమార్ రెడ్డిని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఒడిశాలో సెపక్ తక్రా క్రీడను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెపక్ తక్రా క్రీడా సంస్థ ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ సాహు పాల్గొన్నారు. రేపు ఎస్కేజీసీ కాలేజీలో యూత్ పార్లమెంట్ పర్లాకిమిడి: కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి (స్వయంప్రతిపత్తి) కళాశాలలో మార్చి 1న యూత్ పార్లమెంటు నిర్వహిస్తున్నట్టు కళా శాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ తెలియజేశారు. శుక్రవారం కళాశాల కౌన్సిలింగ్ హాల్లో జరిగిన ప్రెస్మీట్లో ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ మాట్లాడారు. తొలిసారిగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంటుకు జిల్లాలో కాశీనగర్, గుమ్మ, మోహన, పర్లాకిమిడి మహిళా కళాశాలల నుంచి 18 నుంచి 25 ఏళ్ల లోపు విద్యార్థులు 150 మందికి పైగా పాల్గొంటున్నారని, వీరిలో ఉత్తమంగా మాట్లాడిన యువ పార్లమెంటీరియన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి బిధ్యాధర్ శెఠి అన్నారు. -
మల్కన్గిరిలో ఉత్కళ సమ్మిళిని రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో ఉత్కళ సమ్మేళన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అధ్వైత్ కుమార్ పాత్రో, ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రత్ కుమార్ సాహు, ఇతర రాష్ట్ర స్థాయి ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. ముందుగా స్థానిక సర్క్యూట్ హౌస్కు చేరుకొని మధుసూదన్ దాస్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్తో రాష్ట్ర అధ్యక్షుడు అధ్వైత్ కుమార్ పాత్రో చర్చించారు. జిల్లాకు రైల్వే అనుసంధానం, ఆదివాసీ భాషల పరిరక్షక్షణ, వినియోగం, స్వాభిమాన ప్రాంత అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల సరైన అమలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద్మనాభ సామల్, కమల్ చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి అక్షయ్ కుమార్ దాస్, కేంద్ర సభ్యుడు రవీంద్ర బెఉరియా, జిల్లా శాఖ అధ్యక్షుడు దుష్మంత్ కుమార్ జెనా, జిల్లా ఉపాధ్యక్షుడు లంభోధర్ తురుక్, జిల్లా కార్యదర్శి అశోక్ మిశ్రో, ఇతర సభ్యులు ఉన్నారు. -
శాస్త్రవేత్తల సహకారంతోనే వికసిత భారత్
భువనేశ్వర్: వైజ్ఞానిక పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మహిళల పాత్ర వికసిత భారత్ కల సాకారానికి దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో విజ్ఞాన శాస్త్రంలో మహిళలు ఇతివృత్తంతో ఈ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) జరుపుకుంది. ఏటా భారతీయ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి. వి. రామన్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను స్మరించుకుంటూ ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక జాతీయ వైజ్ఞానిక విద్య మరియు పరిశోధన (నైజర్) డైరెక్టర్ ప్రొఫెసర్ హిరేంద్ర నాథ్ ఘోష్ క్వాంటం ప్రపంచంలో అల్ట్రాఫాస్ట్ స్పెక్ట్రోస్కోపీ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. సెమీకండక్టర్లు, అల్ట్రాఫాస్ట్ లేజర్ల నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు క్వాంటం సైన్స్ ప్రాథమికంగా ఆధునిక సాంకేతికతను మార్చిందని ప్రొఫెసర్ ఘోష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అణువులు, పదార్థాలను పరిశీలించడానికి అల్ట్రాఫాస్ట్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి 3 దశాబ్దాలకు పైగా చేసిన పరిశోధనల ఆధారంగా చేసుకుని తదుపరి తరం ఆప్టో ఎలక్ట్రానిక్ పరికరాలను అభివృద్ధి చేయడానికి ఫెమ్టోసెకండ్, అటోసెకండ్ ప్రక్రియలను అర్థం చేసుకోవడం చాలా కీలకమని చెప్పారు. నేడు దైనందిన జీవితంలో ఉపయోగించే ఎల్ఈడీలు, మొబైల్ డిస్ప్లేలు, సౌర ఘటాలు వంటి అనేక సాంకేతికతలు దీర్ఘకాలిక ప్రాథమిక పరిశోధనల ఫలితమని పేర్కొన్నారు. శాసీ్త్రయ పురోగతులను నడిపించడానికి భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, జీవ శాస్త్రవేత్తల మధ్య బలమైన అంతర్ విభాగ సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ భేండే ప్రసంగించారు. ఈ సందర్భంగా పరిశోధనావేత్తలు పోస్టర్ ప్రెజంటేషన్ల ద్వారా తమ పరిశోధనా శైలిని ప్రదర్శించారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
కొట్పాడ్ ఘఠ పర్వ్ ఉత్సవాలకు శ్రీకారం
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్లో మా శీతల ఠకురాణి ఘఠ పర్వ్ ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముందుగా మా శీతలఠకురాణి దేవికి భక్తితో అంచమాల పూజలు చేశారు. కొట్పాడ్లో ప్రతి మూడేళ్లకు ఒక సారి మా శీతల ఠకురాణి ఘఠ పర్వ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొట్పాడ్ ఘఠ జాత్రను తిలకించేందుకు చత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని ఘఠ జాత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఘఠ జాత్రకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని భక్తులకు తగు సౌకర్యాల ఏర్పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సహాయం, కొట్పాడ్లో దమయంతి సాగర్ ఘాట్ పరిశుభ్రపరచడం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. -
కొఠియా, పోలవరం ప్రాంతాల పరిశీలన
జయపురం: ఉత్కళ సమ్మిళినీ ప్రతినిధి బృందం వివాదాస్పద కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పర్యటించిందని ఉత్కళ సమ్మిళినీ అధ్యక్షుడు డాక్టర్ అద్వైతకుమార్ పాత్రో శుక్రవారం మీడియాకు తెలిపారు. ఉత్కళ సమ్మిళినీ 50వ మహాసభలో ఎన్నికై న నూతన కార్యవర్గ ప్రథమ సమావేశం ఈ నెల 25న జరిగింది. ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాక కొఠియా, పోలవరం సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఒక ప్రతినిధి బృందం ఆయా ప్రాంతాలలో పర్యటించాలని తీర్మానించిందని వెల్లడించారు. రాష్ట్ర ఉత్కళ సమ్మిళినీకి కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు, సమ్మిళినీ అధ్యక్షుడు అద్వైత కుమార్ పాత్రో నేతృత్వంలో గత రెండు దినాలు కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. ప్రతినిధుల బృందంలో పద్మనాభ సామల్, భీమసేన్ మహాపాత్రో, కమల్ చక్రవర్తి, రవీంద్ర కుమార్ మిశ్ర, బిమల్ చంధ్ర షొడంగి, గోపముద్ర మహాపాత్రో, అక్షయ కుమార్దాస్,ద దుర్గా ప్రసాద్ పాఢీ, బిరెన్ మోహణ పట్నాయిక్, ప్రకాశ్ చంధ్ర పట్నాయిక్, రవీంధ్ర కుమార్ బెహురియ, దుర్యోధన్ మహారాణ, మదన మోహణ నాయిక్, జగన్నాథ్ మహాపాత్రో,బుల్లు హత్త, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్కళ సమ్మిళినీ అధ్యక్షుడు డాక్టర్ అద్వైత కుమార్ పాత్రో పత్రికల వారికి ఒక ప్రకటనలో వివరిస్తూ ఒడిశా సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో 32 జిల్లాలలో ఒడియా ప్రజల పిల్లలకు ఒడియా భాషా బోధన, సంస్కృతి పరిరక్షణకు ఉత్కళ సమ్మిళినీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. ఆయా జిల్లాలలో ఒడిశా కళలు, నృత్య నాట్యాలపై ఒడియా ప్రజలను చైతన్యపరిచేందుకు ఒడిశా కళాకారులను, నృత్య బృందాలను తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తామన్నారు. కొఠియా, పోలవరం ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వంశధార, మహేంద్రగిరి, నాగావళి, శబరి, సీలేరు తదితర నదుల ఎగువ ప్రాంతాలలో దిగువ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని అందుచేత ఆయా నదుల ఎగువ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలు, ఆనకట్టలు నిర్మించాల్సిన అవసరంపై ఉత్కళ సమ్మిళినీ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. -
ఢిల్లీలో సీఎం మాఝి, బీజేపీ చీఫ్ నబీన్ సమావేశం
భువనేశ్వర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 స్థానాలకు రాజ్యసభ నామినేషన్లపై ఉత్కంఠ నెలకొనగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శుక్రవా రం న్యూ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీ య అధ్యక్షుడు నితీన్ నబీన్ను కలిశారు. నితీన్ నబీన్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు వీరిరువురి సమావేశం ఆజ్యం పోసింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న నితీన్ నబీన్ ఈ ఏడాది జనవరి 19న పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికార బీజేపీ త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల్లో 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష బిజూ జనతా దళ్ 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర శాసన సభలో వారి బలం ఆధారంగా ఒక స్థానాన్ని కై వసం చేసుకోనుంది. ఈ లెక్కన 4వ స్థానానికి గట్టి పోటీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి న్యూ ఢిల్లీ సందర్శన పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షునితో సమావేశం ఎగువ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహంపై చర్చలు జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ సమావేశంలో సంస్థాగ త సమన్వయం, అభివద్ధి ప్రాధాన్యతలపై సంభాషించినట్లు బీజేపీ అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సంస్థాగత సమన్వయం బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఉమ్మడి నిబద్ధతపై చర్చ కొనసాగిందని అన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సంభావ్య రాజ్య సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు పరిశీలన కోసం పంపినట్లు ముఖ్యమంత్రి ధ్రువీకరించారు. బీజేపీ రాష్ట్ర కమిటీకి అనేక సూచనలు అందాయి. అన్ని పేర్లను పార్లమెంటరీ బోర్డుకు పంపారు. అది తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ఒడిశా నుండి పోటీకి నిలబెడితే కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై వ్యూహాత్మక దష్టి సారిస్తుంది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలం గణనీయంగా దడపడుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రికి జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా పని చేసే సంబంధాన్ని బలోపేతం చేస్తుందనే దక్పథంతో రాష్ట్ర శాఖ జాతీయ అధ్యక్షునికి మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది. -
మార్చి 5న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన
భువనేశ్వర్: మార్చి 5న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. మార్చి 5న సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక వైమానిక దళ విమానంలో న్యూ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుతారు. మర్నాడు 6వ తేదీ ఉదయం కటక్ ముండులిలో జరిగే సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఖుర్దా జిల్లా జట్నీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్ యూ), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) భువనేశ్వర్ క్యాంపస్కు శంకుస్థాపన చేస్తారు. భువనేశ్వర్లోని ఎన్ఎఫ్ఎస్ యూ ట్రాన్సిట్ క్యాంపస్ను వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభిస్తారు. ఆ మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షా భువనేశ్వర్లోని ఇడ్కో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నవీన్ న్యాయ్ సంహిత ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. వివిధ విభాగాల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి పర్యటన దష్ట్యా, గొడిసాహి, ముండులి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడంతో పాటు లైటింగ్, శుభ్రపరచడం, అవసరమైన సుందరీకరణ చేయాలని ఆదేశించారు. కటక్ జిల్లా మేజిస్ట్రేట్ వర్చువల్ మోడ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శన యొక్క వివరణాత్మక షెడ్యూల్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, రూట్ ప్లాన్, వేదిక వద్ద సంబంధిత సన్నాహాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శనను సజావుగా విజయవంతం చేయడానికి నిర్ణీత సమయ వ్యవధిలో అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని, అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్ర హోం, పరిశ్రమలు, సమాచార, ప్రజా సంబంధాల అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, కేంద్ర హోం శాఖ మంత్రి రాష్ట్ర పర్యటన సన్నాహాలు గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ ఖురానియా, సహకార శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి రాజేష్ ప్రభాకర్ పాటిల్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్, ఖుర్దా జిల్లా మేజిస్ట్రేట్, సంబంధిత వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కటక్ జిల్లా కలెక్టర్ వర్చువల్ మోడ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. -
కనుల విందుగా..
● శేషవాహనంపై స్వామి వారి ఊరేగింపు ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలురాయగడ: జేకేపూర్లోని భూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్వామి వారిని పురవీధుల్లొ శేష వాహనంపై ఊరేగించారు. ఆదిశేశువుపై స్వామి శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులకు అభయమిస్తు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఊరేగింపులో స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భక్తులకు స్వామివారు దర్శనభాగ్యం కలగడంతో అంతా పులకించిపోయారు. గోవింద..గోవింద అంటూ మధురమైన నామస్మరణాలతో ప్రాంతం ఆధ్యాత్మికంగా మారుమ్రోగిపోయింది. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, వేదపారాయణం, విశేష హోమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మందిరం ప్రాంగణంలోని కల్యాణ మండపంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాల్లో దంపతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండటంతో రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న గురువారం సాయంత్రం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిర కమిటీ అధ్యక్షులు వినయ్ ద్వివేది, ఉపాధ్యక్షులు పట్నాన గౌరీశంకర్, సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి వద్ద ప్రత్యక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్న సబ్ కలెక్టర్ జెన్న మందిరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నేడు ముగింపు.. గత నెల 23వ తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. -
అనుమానాస్పద మృతి
వలస కూలిమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి అంబాగూడ గ్రామానికి చెందిన ఓ వలస కూలి మృతి చెందారు. ఆదివాసీ తెగకు చెందిన అంబాగూఢ గ్రామ వాసి పడియా మాడీ (49) అనే వ్యక్తి బోర్వెల్ వాహనంలో పని చేయడానికి ఆంధ్రాకు వలస వెళ్లాడు. ఏం జరిగిందో గానీ గురువారం రాత్రి అతడి మృతదేహాన్ని వాహనంలో తీసుకువచ్చి ఇంటి ముందు దింపి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు, కలిమెల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా కడుపు భాగంలో గాయం కనిపించింది. ఎలా చనిపోయాడో తెలీకపోవడంతో ఐఐసీ ప్రభుదత్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తమ్మ తల్లి ఆలయం ఆదాయం రూ.6.81 లక్షలు
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయంలో ధర్మ హుండీల ద్వారా 93 రోజులకు గాను రూ.6,81,751 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ కె.గోవిందరావు, సభ్యులు బి.ప్రసాదరావు, పి.గోపి, డి.లక్ష్మణ రావు, డి.నాగరాజు, ఎ.అప్పారావు, ఎం.వెంకట్రావు సమక్షంలో శుక్రవారం హుండీ ఆదా యం లెక్కింపు నిర్వహించారు. మందసకు చెందిన ఈఓ ఎస్.నాగేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించినట్లు ఈఓ పేర్కొన్నారు. జిల్లా కళాకారునికి అరుదైన గౌరవం శ్రీకాకుళం కల్చరల్: నగరానికి చెందిన కళంకారీ కళాకారుడు ధను అంద్లూరికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా సత్కారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో 15రోజుల పాటు ‘కళా ఉత్సవ్–ఆర్టిస్ట్సు ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కళంకారీ కళాకారుల బృందాన్ని ఆప్యాయంగా కలుసుకుని, వారు ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్న కళంకారి కళా ప్రక్రియను పరిశీలించారు. ఈ గౌరవం జీవితంలో ఒక స్మరణీయ ఘట్టంగా నిలిచిందని, దేశ అత్యున్నత స్థాయిలో కలంకారీ కళకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అని ధను అంద్లూరి అన్నారు. చెత్తను తొలగించారుశ్రీకాకుళం (పీఎన్కాలనీ): సాక్షిలో ‘నిర్లక్ష్యం ముంచెత్తగా’ అనే శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. బలగలో ఉన్న చెత్త కుప్పల్ని, డంపర్బిన్లను తొలగించి పరిశుభ్రం చేయించారు. మహమ్మారి విస్తరిస్తోంది శ్రీకాకుళం: నగరంలో డయేరియా మహమ్మారి విస్తరిస్తోంది. శుక్రవారం దమ్మలవీధి, మంగువారి తోట నుంచి ఒక్కొక్కరు రిమ్స్కు వచ్చి చికిత్స చేయించుకున్నారు. నగరంలోని బలగ, డీసీసీబీ కాలనీలో కూడా డయేరియా వ్యాధి బారిన పడుతున్నారు. బలగలో ఇప్పటివరకు ఇద్దరు వ్యాధి బారిన పడగా ఇందులో ఒకరు ఇంటి వద్దనే చికిత్స చేయించుకుంటుండగా ఓ బాలిక మాత్రం రిమ్స్లో చేరింది. డీసీసీబీ కాలనీకి చెందిన ఓ అబ్బాయిని కూడా ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇల్లీసిపురం వెల్లవీధిలోని బీసీ హాస్టల్లో బుధవారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులు డయేరియా బారిన పడగా అందులో ఇద్దరిని సోమవారం ఉదయం డిశ్చార్జి చేశారు. జి.రాజేష్ అనే విద్యార్థి మాత్రం ఇప్పటికీ రిమ్స్లోనే చికిత్స చేయించుకుంటున్నాడు. ప్రభు త్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని మూడు రోజుల కిందట వాంతు లు, విరేచనాలతో రిమ్స్లో చేరి డిశ్చార్జి అయ్యింది. శుక్రవారం ఉదయం మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో రిమ్స్లోని ప్రత్యేక వార్డులో చేరింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 162 మంది వ్యాధిబారిన పడ్డారు. ఐదో రోజు 289 మంది డుమ్మా శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. 5వ రోజు శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ హిస్టరీ, ఒకేషనల్ సబ్జెక్టులతోపాటు గతంలో ఫెయిలైన బోటనీ, హిస్టరీ (బ్యాక్లాగ్) సబ్జెక్టుల విద్యార్థులు సైతం పరీక్ష రాశారు. మొత్తం మీద సెట్–1 ప్రశ్నాపత్రాలతో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 3039 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 2749 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 289 మంది డుమ్మా కొట్టారు. మాల్ ప్రాక్టీసులు నమోదు కాలేదని జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్కుమార్ పేర్కొన్నారు. -
జయపురం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్
జయపురం: అవిభక్త కొరాపుట్లో చారిత్రిక, ప్రధాన పట్టణం జయపురంను జిల్లా కేంద్రంగా జయపురం జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు శుక్రవారం చేరింది. జయపురం నుంచి జయపురం జిల్లా కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం భువనేశ్వర్ వెళ్లి రాష్ట్ర రెవెన్యూ, విస్తరణ నిర్వాహక శాఖల మంత్రి సురేష్ పూజారిని కలిసి జయపురం ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతినిధి బృందం సమర్పించిన వివరాలను పరిశీలించిన మంత్రి.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్నాని జయపురం జిల్లా కార్యాచరణ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కొరాపుట్ జిల్లాలో జయపురం సబ్ డివిజన్లోని 5 సమితిలతో పాటు, కొరాపుట్ సబ్డివిజన్ లమతాపుట్, నందపూర్ సమితులను కలిపి ప్రత్యేక జయపురం జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ప్రతినిధి బృందం మంత్రికి గట్టిగా వినిపించింది. అందుకు కమిటీ రూపొందించిన ప్రతిపాదిత జయపురం జిల్లా మ్యాప్ను అందజేసింది. మంత్రిని కలిసిన వారిలో జయపురం జిల్లా కార్యాచరణ కమిటీ సభ్యులు బులు దేవ శర్మ, గుప్త పాణిగ్రహి, సతీష్ నందా, షణ్ముఖ శ్రీను, ప్రకాశ్ మిశ్రా, ఆనంద మిశ్రా, సిద్ధు పాత్రో, తదితరులు ఉన్నారు. రెవెన్యూ మంత్రిని కలిసిన ప్రతినిధిలు జయపురం జిల్లా డిమాండ్ వినతిపత్రం సమర్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
జెడ్పీ సమావేశంలో సమస్యల ప్రస్తావన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పరిషత్ 75వ సాధారణ సమావేశం జెడ్పీ అధ్యక్షురాలు సమారి టాంగులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు వారి ప్రాంతానికి చెందిన సమస్యలను ప్రస్తావించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. సభ్యులు లేవనెత్తి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పట్టాల్లో లోపాలను సరిదిద్దుతూ లబ్ధిదారులకు సరైన పట్టాలు అందించాల్సిన అవసరాన్ని సమారీ టాంగులు ప్రస్తావించారు . జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పీఎంఈజీపీ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు 35 శాతం, పట్టణ ప్రాంతాలకు 25 శాతం సబ్సిడీ లభిస్తుందని అన్నారు. జిల్లాలో డ్రాపవుట్ రేటును తగ్గించేందుకు హాస్టల్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో చర్చించారు. రోడ్లు, ఆరోగ్యం, మంచినీరు, విద్యుత్పై సమావేశంలో చర్చించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు పతిత పావన్, వైద్య, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దాశరధి సరాబు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
జయపురం: జయపురం సమితి గ్రామ ప్రాంతాల్లో పర్యావరణం, విద్య, వైద్యం, తాగునీటి వనరుల కల్పన, అడవుల పెంపకంతో పాటు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక జయపురం పంచాయతీ సమితి కార్యాలయంలో జయపురం సమితి 7వ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి కార్యాలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన సమితి సభాగృహాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముందుగా సంప్రదాయంగా పూజ చేసిన అనంతరం సమితి బిడిఒ శక్తి మహపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జయపురం సమితిని రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిపేందుకు సమితిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలన్నారు. అందుకు తగిన ఆర్థిక సహాయం అందేలా తాను రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీడీఓ శక్తి మహపాత్రో మాట్లాడుతూ జయపురం సమితి పరిధిలో పనసపుట్బగర గ్రామంలో ఉన్న దక్షిణ కాళీదేవాలయ ప్రాంతాన్ని రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో పంచాయతీ సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, ఉపాధ్యక్షుడు గణేష్ పాడీ, ఎంపీ ప్రతినిధి కృష్ణచంద్ర నేపక్, జిల్లా పరిషత్ సభ్యులు తిపతి పట్నాయక్, అస్తా నాయక్, రశ్మీరత్, వ్యవసాయం, ఉద్యానవనం, అటవి, విద్యుత్, పశుసంపద, విద్య గ్రామీణ అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమ విభాగం, మట్టి సంరక్షణ, ఎస్.టి, ఎస్.సి. సంక్షేమం, సామాజిక భద్రత, పౌర సరఫరా విభాగం, తాగు నీరు, తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమితి ఇంజినీర్ విజయ్కుమార్ నందా, జూనియర్ ఇంజినీర్ భవానీశంకర్ పాత్రో పర్యవేక్షించారు. -
ప్రజల అవసరాలకే ప్రాధాన్యం
గార: గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకే అభివృద్ధి ప్రణాళికలో ప్రాధాన్యతనివ్వాలని ఎంపీపీ గొండు రఘురామ్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 2026–27 జీపీడీపీ ప్రణాళికపై సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కీలకమైన అంశాల్లో తాగునీటితో పాటు కాలువలు, రోడ్లు, పారిశుద్ధ్య పనులు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆర్థిక సంఘ నిధులతో పాటు స్థానికంగా వచ్చే ఇంటి పన్నులు వసూలు వంటివి అవసరమని పేర్కొన్నారు. కొర్లాం, అంపోలు, కళింగపట్నం సర్పంచ్లు పీస శ్రీహరిరావు, గొండు జయరాం, టి.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో జమ చేయడం లేదని, ఈ ఏడాది వచ్చినా వాటికి ఫ్రీజ్ చేయడంతో ఏ పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీవో సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవోలు ఈశర్ల రఘు, ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆగ్రహం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి కేంద్రంలో గురువారం రైతులు మండీలో ధాన్యం ఎత్తకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండీ నిర్వహణ, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పరిపాలనపై వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా పలు చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. గురువారం బస్తాలను రోడ్డుపై ఉంచి ధర్నా చేశారు. మండీల నుంచి ధాన్యాన్ని ఎత్తివేయాలని, ఖాళీ సంచులకు డబ్బులివ్వాలని, తూకం తగ్గింపు ఆపాలని, మిల్లర్ల అన్యాయాలను కోరారు. రైతుల ఆందోళనతో రహదారి స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా అదనపు సరఫరా అధికారి విశ్వజిత్ దాస్, అదనపు తహసీల్దార్ ఉమేష్ పూజారి, కోరుకొండ ఎంఐ హరీష్ రామ్ మల్లిక్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. -
రు.200 కోట్ల గంజాయి ఆయిల్ పరిశ్రమ స్వాధీనం
కొరాపుట్: గంజాయి ఆయిల్ ఉంటుందనేది ఊహాజనితం. కానీ అనుష్క ప్రధాన పాత్ర లో ఘాటీ తెలుగు సినిమాలో ఈ గంజాయి ఆయిల్ తయారి చూపించారు. ఊహించని విషయం ఏంటంటే ఘాటీ సినిమా చిత్రీకరణ చేసిన దండకారణ్యం లో కొరాపుట్ జిల్లాలోనే ఆదే సినిమాని తలపిస్తూ గంజాయి ఆయిల్ తయారీ పరిశ్రమను స్మగ్లర్లు నిర్వహించారు. గురువారం కొరాపుట్ జిల్లా పాడువా ప్రాంతంలో జోలాపుట్ జలాశయం మధ్యలో పోలీసులు దాడి చేసి ఈ పరిశ్రమని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిశ్రమ వద్దకి చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. స్మగ్లర్లు పడవల మీద ఇక్కడకి చేరుకొని గంజాయి ఆయిలు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా రసాయన శాస్త్రవేత్తల సహయ సహాకారాలు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ ప్రత్యేక పోలీసు బలగాలతో బోట్లతో పరిశ్రమ ఉన్న కటాఫ్ ప్రాంతానికి వెళ్లారు. ఎస్పీతో ఉన్న బలగాలకు కూడా తాము ఎక్కడికి వెళ్తున్నామనే విషయం తెలియక పోవడం గమనార్హం. డీవీఎఫ్ దళాలతో పరిశ్రమ ఉన్న ఐలాండ్ పై దిగారు. వీరిని చూసిన గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. పోలీసులు ఐలాండ్ లో గాలింపులు చేయగా 1,800 లీటర్ల గంజాయి ఆయిల్ పట్టుబడింది. ఈ ఆయిల్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రు.200 కోట్లు ఉంటుందని ఎస్పీ రోహిత్ వర్మ ప్రకటించారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో గంజాయి ఆయిల్ తయారి పరిశ్రమ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ దాడి విషయం ఎకై ్సజ్ పోలీసులకు తెలియక పోవడం గమనార్హం. రూ.5 కోట్ల విలువ గల గంజాయి స్వాధీనం కొరాపుట్ జిల్లా పోలీసులు మరో ఘటనలో రూ.5 కోట్ల విలువ గల గంజాయి పట్టుబడింది. గురువారం నందపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్డీపీఓ సుమిత్ర జెన్న ఈ కేసు వివరాలు ప్రకటించారు. కొరాపుట్ జిల్లా నందపూర్ వైపు వస్తున్న రెండు పికప్ వాహనాలను నందపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముచింపుట్ నుంచి వస్తున్న ఈ వాహనాలు హర్యానా వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాహనాల్లో 1143 కేజీల గంజాయి సీజ్ చేశారు. నిందితుల్లో హర్యానా వాసులు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ దాడిపై సదరన్ వెస్ట్రన్ రేంజ్ ఐజీ కన్వర్ విశాల్ సింగ్ పోలీసులను అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి టేక్గూడ గ్రామ సమీపంలో గురువారం ఒక ట్రక్కు, బైక్ను ఢీకొనడంతో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. సంతోష్ గౌడ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కోరుకొండకు సుదశా వత్రం కోసం వచ్చారు. పూజ అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం తరలించారు. విషయం తెలుసుకున్న కోరుకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఫోన్ల అందజేత జయపురం: జయపురం మునిసిపాలిటీలో పారిశుద్ధ్య శ్రామికులకు మునిసిపాలిటీ అధికారులు ఫోనులు సమకూర్చారు. గరిమ యోజనలో పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతో ఫోన్లు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి పాల్గొన్నారు. మునిసిపాలిటీ సెప్టిక్ ట్యాంక్లు పరిశుభ్రపరచే శ్రామికులు 11 మందికి జియో ఫోన్లు అందజేశారు. వారికి ఫోనులు సమకూర్చటం వలన ఎప్పపటికప్పుడు వారి పనితీరును, వారు ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు వీలు అవుతుందన్నారు. వైస్చైర్మన్ బి.సునీత, మునిసిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, కౌన్సిలర్లు జస్పాల్ సింగ్, సింహాచల బిశాయి, తదితరులు పాల్గొన్నారు. దుర్గా మందిరంలో చోరీ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రం దుర్గగుడి వీధిలోని దుర్గా మందిరంలో బుధవారం రాత్రి అమ్మవారి నగలు చోరీకి గురయ్యాయి. గురువారం ఉదయం 7 గంటలకు పూజారి ఆలయానికి ఉన్న గేటు విరిగి ఉంది. దీంతో పూజారి ఆలయం పక్కనే ఉన్న వారిని పిలిచి కమిటీకి సమాచారం అందజేశారు. అంతా కలిసి మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఐఐసీ రీగాన్ కీండోకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయం వద్దకు వచ్చి పరిశీలించగా అక్కడ అమ్మవారి మంగళసూత్రాలు, రెండు హారాలు, ముక్కు నత్తు పోయినట్లు గుర్తించారు. 70 ఏళ్ల ఆలయ చరిత్రలో తొలిసారి దొంగతనం జరిగిందని స్థానికులుచెబుతున్నారు. -
రామస్థూపానికి పంచామృత అభిషేకం
రాయగడ: జేకేపూర్లో గల శ్రీభూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరంలో ఈ నెల 23 వ తేదీ నుంచి కొనసాగుతున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా గురువారం మందిరం ప్రాంగణంలో గల రామస్థూపానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించిన వేదపండితులు గోపూజ విశేష హోమాలు పూర్తయ్యాక మందిరం ప్రాంగణంలో గల రామస్థూపానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ప్రాంతంలో గల కొంతమంది భక్తులు భక్తిశ్రద్ధలతో రామకోటి రచించి పుస్తకాలను ఒకే ప్రాంతంలో సమకూర్చి దానిపై ఈ స్థూపాన్ని నిర్మించారు. దీంతో ఈ స్థూపానికి రామ స్థూపంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ప్రతి వార్షికొత్సవాల్లో ఈ స్థూపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ అభిషేక పూజల్లో మందిరం కమిటీ అధ్యక్షుడు, జేకే పేపర్ మిల్ ఉపాధ్యక్షుడు (కమర్షియల్) వినయ్ ద్వివేది, ప్రముఖ న్యాయవాది హరిచందన్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మందిరం ప్రాంగణంలో గల కల్యాణమండపంలొ సామూహిక తులసీ దళ అర్చనలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. వచ్చే భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. ఇదిలాఉండగా బుధవారం సాయంత్రం ఉత్సవాలను పురష్కరించుకుని ఉత్సవ వేదిక వద్ద వివిధ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన బాల కళాకారులు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుడు, సీతారామ, లక్ష్మణ ఆంజనేయుల వేషధారణలతో పాటు చిన్నారులు చేసిన జానపద నృత్యాలతో వేదిక ఆకట్టుకుంది. అనంతరం మందిర కమిటీ ఉపాధ్యక్షుడు పట్నాన గౌరి శంకరరావు, కాశీపూర్లో గల మైత్రీ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ తదితర ప్రముఖులు కళాకారులను సన్మానించారు. అదేవిధంగా జేకేపూర్ పరిసర ప్రాంతాల్లొ ఉన్న వివిధ దేవాలయాలకు చెందిన పురోహితులను ఈ సందర్భంగా వేదికపై ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. -
ఓ నేరపూరిత ప్రేమకథ
● ప్రేమ కోసం సొంత తల్లి, తమ్ముడి హత్య ● బొరిగుమ్మలో కలకలం జయపురం: తమ ప్రేమను బతికించుకోవడానికి ఆ జంట ఇద్దరిని చంపేసింది. ఈ ఉదంతం బొరిగుమ్మ ప్రజలనే కాదు ప్రేమికుల రెండు కుటుంబాల వారిని శోక సంద్రంలో ముంచింది. ఈ డబుల్ మర్డర్ కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రేమికులతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కొరాపుట్ ఎస్పీ రోహిత్ శర్మ మంగళవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. తన ప్రేమను రక్షించుకునేందుకు మైనర్ ప్రేమికురాలు తన కన్న తల్లిని, తమ్ముడిని హత్య చేయించింది. ఈ హత్యలో నిందితులైన ఆమెతో పాటు ప్రేమికుడు బొరిగుమ్మ దాసరి వీధికి చెందిన పి.ఆదినారాయణ (21), ఆదినారాయణ బంధువు ప్రీతి నాయిక్(19), బిజాపూర్ గ్రామానికి చెందిన ఆదినారాయణ పాణిగ్రహి(19), కమతా గ్రామానికి చెందిన జగన్నాథ్ జాని(20) లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ వివరణ ప్రకారం బొరిగుమ్మ గ్రామం ప్రధాన మార్గంలో అనుష్కో పరిడ(45), ఆమె కుమారుడు ఎహేమ్ పరిడ(14) తో పాటు 16 యేళ్ల కుమార్తె ఉంటున్నారు. ఆమె కుమార్తె అయిన మైనర్ బాలిక, పి.ఆదినారాయణ ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అనుష్కో అంగీకరించ లేదు. గత ఏడాది డిసెంబర్ నెలలో అనుష్కో కుమార్తె తన ప్రేమికుడు ఆదినారాయణతో పాటు పరారైంది. అనుష్కో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమె కుమార్తెను కనుగొని ఆమెకు అప్పగించారు. తన కుమార్తెను దూరంగా ఉంచాలన్న అభిప్రాయంతో ఆమెను మౌంట్ అబూకు పంపించింది. అయితే ఆ బాలిక తల్లికి తెలియకుండా మౌంట్ ఆబూ నుంచి ఈ నెల 13 వ తేదీన జయపురం వచ్చి తన ప్రేమికుడు ఆదినారాయణతో జగన్నాథ్ ఇంటలో దాగుంది. ఈ నెల 15 వ తేదీన పుట్టిన రోజు పండగ జరుపుకొని ఫొటోలు తీయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ప ఓస్టు చేశారు. వాటిని చూసిన అనుష్కో తన కుమార్తె ఆదినారాయణతో జగన్నాథ్ ఇంటిలో ఉందని తెలుసుకొని ఇంటికి తీసుకు వచ్చింది. మనమంతా మౌంట్ ఆభూకి వెళ్లి పోదామని కుమార్తెకు బోధించింది. అందుకు ఆగ్రహం చెందిన బాలిక తల్లిని తన ప్రేమకు అడ్డు లేకుండా శాశ్వతంగా తొలగించుకొనేందుకు తన ప్రేమికుడితో స్కెచ్ వేసింది. అందుకు పథకం రూపొందించారు. ఈ నెల 18 వ తేదీ రాత్రి ప్రేమికుడు పి.ఆదినారాయణ, అతడి బంధువు ఆదినారాయణ పాణిగ్రహి, జగన్నాథ్ జానిలు అనుష్కో పరిడ ఇంటి వెనుక వైపు నుంచి ఇంటిలోనికి చొరబడ్డారు. ప్రేమికుడు పి.ఆదినారాయణ మొదట ఒక పదునైన కత్తితో అనుష్కో గొంతు కోసి ఆమె శరీరంపై పలు చోట్ల కత్తితో పోట్లు పొడిచి హత్య చేశాడు. తల్లి పక్కన పడుకున్న 14 యేళ్ల ఆమె కుమారుడు ఎహేమ్ పరిడ శబ్ధానికి లేచాడు. అది చూచిన ఆదినారాయణ ఆ బాలుని ఒడిసి పట్టుకోగా ఆ బాలుని గొంతు కోసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసు ఎస్పీ మీడియా ప్రతినిధులకు వివరించారు. హత్యలు చేసిన తర్వాత మృత దేహాలను అనుష్కో స్కూటీపై తీసుకువెళ్లి కెనాల్లో పడవేశారు. ఈ హత్యల సంఘటను మాఫీ చేసేందుకు తన తల్లి, తమ్ముడు కనిపించటం లేదని చెబుతూ మైనర్ బాలిక నాటకం ఆడిందని ఎస్పీ వెల్లడించారు. అనుష్కో ఆమె కుమారుడు కనిపించటం లేదని తెలిసి అనుష్కో సోదరుడు సత్యబ్రత పాత్ర ఈ నెల 21 వ తేదీన బొరిగుమ్మ వచ్చాడు. తన చెల్లి ఆమె కుమారుడు కనిపించటం లేదని సత్యబ్రత పాత్రో బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíܯ]l ´ùÎ-çÜ$Ë$ §ýlÆ>Åç³#¢ {´ëÆý‡…-À…-^éÆý‡$. AƇ$$™ól ÝùÐ]l$ÐéÆý‡… MösŒæ-´ëyŠæ ´ùÎçÜ$ õÜtçÙ¯ŒS ç³Ç«¨ A…yìlÆý‡Ð]l¬……yýl MðS¯é-ÌŒæÌZ ±sìæÌZ ™ólË$-™èl$¯]l² JMýS Ð]l$–™èl §ólà°² ^èl*íܯ]l Mö…™èl-Ð]l$…¨ ´ùÎ-çÜ$ÌSMýS$ ™ðlÍĶæ$ gôæÔ>Æý‡$. ´ùÎ-çÜ$Ë$ AW-²-Ð]l*-ç³MýS íܺ¾…-¨, OòÜ…sìæíœMŠS sîæÐŒl$-ÌS™ø B {´ë…™é°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. ÐéÆý‡$ MðS¯é-ÌŒæÌZ ™ólÍ E¯]l² Ð]l$–™èl §ólà°² ºÄ¶æ$-rMýS$ ¡Ô>Æý‡$. B ÔèæÐ]l… GçßæÐŒl$ ç³Ç-yýl-¨V> VýS$Ç¢…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… Ð]l$…VýSâýæ-ÐéÆý‡… fĶæ$…†-WÇ MöÌS»Œæ ÝëVýS$-±sìæ MðS¯é-ÌŒæÌZ A¯]l$-ÚùP Ð]l$–™èl §ólçßæ… ÌSÀ…-_…-¨. C§ýlªÇ Ð]l$–™èl §ólàË$ ÌS¿ýæÅ…-M>-Ð]l-r…™ø ´ùÎ-çÜ$Ë$ ç³NÇ¢ §ýlÆ>Åç³#¢ {´ëÆý‡…-À…_ Ð]l¬…§ýl$V> A¯]l$-ÚùP ç³Çyýl MýS$Ð]l*Æð‡¢ AƇ$$¯]l {õ³Ñ$-MýS$-Æ>Í™ø ´ër$ {õ³Ñ$-MýS$yýl$ B¨¯é-Æ>-Ķæ$-׿¯]l$ A§ýl$-ç³#ÌZ-°MìS ¡çÜ$-Mö° ™èlÐ]l$ O§ðl¯]l OÔðæÍÌZ Ñ^éÇ…^èlV> ç³NÇ¢ ÑÐ]l-Æ>Ë$ ÐðlÌSÏ-yýl-Ķæ*ÅÆ‡$$. ÐéÇ ¯]l$…_ õÜMýS-Ç…-_¯]l ÑÐ]l-Æ>-ÌS™ø çßæ™èlÅÌZ ´ëÌŸY¯]l² Ñ$VýS™é Ðéǰ AÆð‡çÜ$t ^ólíÜ-¯]lr$Ï ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. yýlº$ÌŒæ Ð]l$Æý‡z-Æý‡ÏMýS$ Ѱ-Äñæ*W…-_¯]l MýS†¢-°, Ð]l$–™èl §ólà-ÌS¯]l$ ¡çÜ$MýS$ ÐðlâôæÏ…-§ýl$MýS$ Ѱ-Äñæ*-W…-_¯]l A¯]l$-ÚùP çÜ*Šీ-MýSt-°, Æý‡MýS¢ç³# Ð]l$Æý‡-MýSË$ VýSÌS Mö°² Ð]lçÜ$¢-Ð]l#-ÌS¯]l$ ´ùÎ-çÜ$Ë$ ÝëÓ«-©¯]l ç³Æý‡-^èl$-MýS$-¯]l²r$Ï Gïܵ ÐðlÌSÏyìl…^éÆý‡$. °…¨™èl$Ë$ ¯]lË$-VýS$Æý‡$° MøÆý‡$tMýS$ ™èlÆý‡-Í…-^éÐ]l$° ™ðlÍ-´ëÆý‡$. OÐðl$¯]lÆŠ‡ »êÍ-MýS¯]l$ kOÐðl-¯]lÌŒæ MøÆý‡$tÌZ àfÆý‡$ ç³Æý‡_-¯]lr$Ï ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. -
పలాసలోని ఆగని గ్రావెల్ దందా
● రాత్రి పూట తవ్వకాలు ● మాయమవుతున్న కొండలు పలాస: పలాస నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల దందా ఆగడం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే అప్పుడు ఇష్టారాజ్యంగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. రూ.కోట్లు విలువైన కంకరను రోజూ వందలాది టిప్పర్లు ద్వారా తరలించుకు పోతున్నారు. తాజాగా పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని లలితా చారిటబుల్ ట్రస్ట్ వృదా్ధ్శ్రమం వెనుక సర్వే నంబరు 157లో ప్రభుత్వ భూమిలో కంకర తవ్వకాలు చేపడుతున్నారు. ఆ పక్కనే జిల్లాలోనే అతి పెద్దదైన జగనన్న కాలనీ కూడా ఉంది. ప్రస్తుతం కంకర తవ్వుతున్న భూమి కూడా గతంలో జగనన్న కాలనీ కోసం సేకరించిన స్థలమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన స్థలమని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి స్థలం ఎవరిదైనా ఎటువంటి అనుమతులు లేకుండా కంకర తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మందస మండలం కుంటికోట, రట్టి కొండలు, పలాస మండలం కంబిరిగాం వద్ద కూడా కంకర అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లి తూతూమంత్రంగా చర్యలు చేపట్టి తర్వాత విడిచి పెట్టేస్తున్నారని విమర్శలు వినిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పెంటిభద్ర రెవెన్యూలోని 410 సర్వేలో కంకర తవ్వకాలు చేపట్టిని వారిపై తగిన చర్యలు తీసుకోలేదని, కేవలం కంకర తవ్వకాన్ని ఆపేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
అసంబద్ధ ఉత్తర్వులు సరిచేయాలి
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల నియామక ఉత్తర్వుల్లో అసంబద్ధ విధానాలను సరిచేయాలని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకట ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డివిజన్ పరిధి దాటి కొంతమంది ప్రధానోపాధ్యాయులను నియమించడం, సీనియర్లను విస్మరించి జూనియర్లను నియమించడం, మినహాయింపు అడిగిన వారి బాధలను పట్టించుకోకుండా బలవంతంగా నియమించడం వంటివి సరిచేయాలని కోరారు. ఐచ్చిక సెలవులు, స్థానిక సెలవుల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులను కాదని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 28న ఆదిత్యలో రాష్ట్రస్థాయి హ్యాకథాన్ టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 28న రాష్ట్ర స్థాయిలో ఐగానిట్ 3.0 రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ సాంకేతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాలేజీ డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి సుమారు 150 జట్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ ప్రసన్నలక్ష్మి, కన్వీనర్ రమేష్నాయుడు, స్వప్నరేఖ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం హిరమండలం: లక్ష్మీనర్సుపేట ఇందిరానగర్ కాలనీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మండాది తవిటయ్యకు చెందిన ఇల్లు కాలిపోయింది. నిత్యావసరాలతో పాటు రూ.30 వేల నగదు కాలిపోయింది. తవిటయ్య దంపతులు పొలం పనులకు వెల్లినప్పుడు విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సర్పంచ్ దివాకర్నాయుడు, వీఆర్వో రమణమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీటి నమూనాల సేకరణ గార: శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో నీటి నమూనాల సేకరణను జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల గురువారం పరిశీలించారు. మేజర్ పంచాయతీ శ్రీకూర్మంలో వాటర్ ట్యాంకు పరిశుభ్రత, నీటి శాంపిల్స్ సేకరణపై ఆరా తీశారు. ట్యాంకు వద్ద పరిశుభ్రత చేసిన తేదీలను నమోదు చేయాలని, క్లోరినేషన్ పక్కాగా జరగాలన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ చంద్రకళ, పంచాయతీ సెక్రటరీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన శ్రీకాకుళం: పంచాయతీలను పర్యవేక్షించే డిప్యూటీ ఎంపీడీఓలు సమాచార హక్కు చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలన అధికారులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకం శిక్షణలో భాగంగా సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు స.హ.చట్టం దరఖాస్తులు ఎక్కువగా గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నారని, సరైన అవగాహన లేక సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రిసోర్స్ పర్సన్ కొమ్మాజోస్యుల వసంతకుమార్ సమాచార హక్కు చట్టం నిబంధనలు, ఇతర అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల, జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర అధికారి నిశ్చల పాల్గొన్నారు. కాలిపోయిన ఇల్లు -
పోలీసులకు రైఫిల్ షూటింగ్ పోటీలు
భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లా బొయిరి పోలీస్ శిక్షణ సంస్థ (పీటీఐ) ప్రాంగణంలో 54వ రాష్ట్ర పోలీసు రైఫిల్ షూటింగ్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిఘా విభాగం డైరెక్టర్ ఆర్పీ కోచే గౌరవ కవాతుతో స్వాగతించారు. ఈ సందర్భంగా కోచే మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బందిలో రైఫిల్ షూటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే పోటీల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే ప్రతి పోటీదారుడు తమ ఉత్తమ నైపుణ్యత ప్రదర్శించాలని ఆయన ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో ఒడిశా పోలీసులు తమ ప్రత్యేక ఖ్యాతిని, గుర్తింపును కొనసాగించాలని పిలుపునిచ్చారు. క్రీడా స్ఫూర్తి, బలమైన ఆత్మవిశ్వాసంతో పోటీని విజయవంతం చేయాలని అభినందించారు. రాష్ట్రంలోని వివిధ శ్రేణులు, బెటాలియన్ల నుంచి 16 పోలీసు జట్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొన్నాయి. 265 మంది పురుషులు, నలుగురు మహిళలు సహా మొత్తం 269 మంది ఆటగాళ్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. ఈ పోటీలు వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ చాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐజీపీ (ఎస్ఏపీ) గజవియే సతీష్ కుమార్, బొయిరి పీటీఐ కమాండెంట్ అశోక్ కుమార్ దెహురి, కటక్ 6వ ఒడిశా సాయుధ పోలీసు దళం (ఓఎస్ఏపీ) కమాండెంట్ సూర్య నారాయణ మల్లిక్, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయ క్రీడా అధికారి నీల మాధవ్ స్వంయి అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
‘హరదీప్ సింగ్ పురిని తొలగించాలి’
భువనేశ్వర్: అఖిల భారత మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకు ఒడిశా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహినీపతి ఆధ్వర్యంలో స్థానిక మాస్టర్ క్యాంటీన్ కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పురి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎపిస్టిన్తో సంబంధాన్ని కప్పిపుచ్చడానికి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. అమాయక మైనర్లపై లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్య వంటి దుశ్చర్యలతో వివాదాస్పదమైన ఎపిస్టిన్తో సంబంధం ఉన్నట్లు ప్రపంచంలోని అనేక మంది ప్రముఖుల పేర్లు బయటపడడంతో వారంతా నైతిక బాధ్యత వహించి ప్రతిష్టాత్మక పదవులు, హోదాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హరదీప్ సింగ్ పురి నిశ్చలంగా మంత్రి మండలిలో కొనసాగడం అత్యంత అనైతిక చర్యగా రాష్ట్ర మహిళా కాంగ్రెసు వర్గం ఆరోపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరదీప్ సింగ్ పురిని మంత్రిత్వ శాఖ నుంచి తక్షణమే తొలగించాలని కోరుతు నడి రోడ్డు మీద నిరసన ప్రదర్శించి దిష్టిబొమ్మ దహనం చేశారు. -
బాల్య వివాహాలతో అనర్థం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టేందుకు జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద చైతన్య రథాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ చైతన్య రథం వందరోజులపాటు జిల్లాలో గుమ్మా, ఆర్.ఉదయగిరి సమితిల్లో మారుమూల గ్రామాల్లో ప్రచారం చేసి బాల్యవివాహాలు రద్దుకు ప్రజల్లో చైతన్యం తెస్తోందని జిల్లా కలెక్టర్ అగర్వాల్ తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గనియా ఉన్నయన్ కమిటీ సంస్థ సభ్యులతోపాటు ఐ.ఎస్.ఆర్.డి డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వర చౌదరి, సఖీ ఒన్ స్టాప్ సెంటర్ సభ్యులు మధుస్మితా సాహు, తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన.. జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా సభాగృహంలో బాల్య వివాహాల నివారణ చట్టాలపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ కోర్టు జయపురం రిజిస్ట్రార్, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఇన్చార్జి కార్యదర్శి విష్ణు ప్రసాద్ దేవత హాజరయ్యారు. జాతీయ న్యాయ సేవా అథారిటీ రూపొందించిన ‘ఆశా –అవగాహన–మద్దతు– సహాయం, కార్యాచరణ ఎస్.ఓ.పి–2025’ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. బాల్య వివాహాల కలిగే అనర్థాలను వివరించారు.బాల్య వివాహం చేసిన, ప్రోత్సహించిన, సహకరించిన వారికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరీమానా ఉంటుందన్నారు. శిశు సంక్షేమ కమిటీ కొరాపుట్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయిత్రీదేవి, జిల్లా శిశు సంక్షేమ అధికారి సంగీతా రాణిపాణి, లీగల్ ఎయిడ్ ప్రధాన డిఫెన్స్ కౌన్సిల్ ప్రమోద్ కుమార్ దాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ హరిశ్చంద్ర ముదులి, పోలీసు సహాయ సూపరింటెండెంట్ డాక్టర్ హృషికేష్ బెహరా, జాయింట్ లేబర్ కమిషనర్ రామేశ్వరి హికాక తదితరులు బాల్య వివాహాల చట్టాలను వివరించారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. -
జనగణనపై శిక్షణ
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఓస్వాన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ‘2026 జనగణన’పై రెండు రోజులపాటు సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, జిల్లా శిక్షాధికారులు, పురపాలక, నగరపాలక మండలి ఈఓలకు మాస్టర్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ప్రారంభించారు. పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన కార్యక్రమం 2021లో కరోనా వల్ల జరగలేదు. ప్రస్తుతం 2026లో ఏప్రిల్ 16 నుంచి మే 15వ తేదీ వరకు జరుగనుంది. 2026 జనగణన కేంద్ర పోర్టల్లో కూడా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు లభ్యమవుతుందని కలెక్టర్ అగర్వాల్ తెలియజేశారు. ప్రస్తుతం జనగణనతోపాటు గృహా గణన, ఒక్కో కుటుబంలో వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు కూడా గణనలో పొందుపరుస్తారు. రెండు పర్యాయాలపాటు జరిగే జనగణన మొబైల్ యాప్ ద్వారా సెన్సస్ డాటాను నమోదు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏ.డి.ఎం ఫల్గుణి మఝి, ఏ.డి.ఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జాతీయ ఇన్ఫర్మెటిక్స్ కేంద్రం అధికారి మూర్తి, మాస్టర్ ట్రైనర్లు సంతోష్ కుమార్ ఆచారి, బ్లాక్ స్థాయి శిక్షాధికారులు, పథకాల అధికారి డిప్యూటీ డైరక్టర్ ప్రకాశ్ రౌత్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఆందోళన
జయపురం: ఎపిస్టిన్ కేసులో సంబంధం ఉన్న ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాలని కొరాపుట్ జిల్లా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గురువారం జయపురంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీపతి నాయకత్వంలో, కొరాపుట్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నళినీరత్ పర్యవేక్షణంలో నిర్వహించిన ఆందోళనలో ప్రధాని, కేంద్రమంత్రి దిష్టి బొమ్మలను దహన పరిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానించారని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందుకు నిరసనగా ప్రధాని, కేంద్ర మంత్రి దిష్టి బొమ్మలను దహన పరచామని మీణాక్షి బాహిణీపతి వెల్లడించారు. ఈ ఆందోళనలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రూపక్ తురుక్, జయపురం మునిసిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మమంతి, మహిళా కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలు కల్పించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుసాని సమితి ఉప్పలాడ పంచాయతీ కరడా గ్రామంలో సి.పి.ఐ.(ఎం.ఎల్.) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి గోమాంగో అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాలు, తాగునీరు, జంగల్ జమ్మి పట్టాలు, ఖేత్ మజ్దూర్ కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు, దినసరి కూలీ రూ.600లకు పెంపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వ్యవసాయ కార్మికులకు వర్తింపజేయాలని కోరారు. ఉప్పలాడ పంచాయతీ కరడా నుంచి పిడోబుడి, నువాసాయి వరకు పక్కా రోడ్డు వేయాలని, రెవెన్యూ అధికారులు నెలకు 15 రోజులు జంగిల్ జమ్మి పట్టాల కోసం గ్రామంలో సర్వే చేపట్టాలని, జీవీబీ రామ్జీ పథకం కింద వేతనదారులకు తిరిగి పని దినాలు కల్పించాలని డిమాండు చేశారు. మార్చి 15 లోగా జిల్లాలోని తహసీల్దార్లు తమ డిమాండ్లు నెరవేర్చకుంటే పర్లాకిమిడిలో సి.పి.ఐ.(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ తరఫున ఆందోళన చేపడతామని తిరుపతి గోమాంగో తెలియజేశారు. -
నష్ట పరిహారం చెల్లించాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పాయకొడాకులుగుడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బిరేన్ టక్రీ అనే విద్యార్థిపై ఈ ఏడాది జనవరిలో అదే పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థి టార్పెంట్ ఆయిల్ని శరీరంపై వేసి తగలబెట్టిన ఘటనలో విద్యార్థి తీవ్రగాయాలకు గురయ్యాడు. దీంతో కటక్లోని ఎస్సీబీ ఆస్పత్రిలో విద్యార్థి 48 రోజులు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని పాఠశాల గేటు వద్ద ఉంచి గురువారం ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఏబీఈవో శాంతిలత ముని తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. అనంతరం నష్ట పరిహారం చెల్లించేవిధంగా హామీ ఇవ్వడంతో మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
మావో స్థూపాలు ధ్వంసం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియతోపాటు కలిమెల, మాత్తిలి, ఖోయిర్పూట్ ప్రాంతాల్లో మావోలు నిర్మించిన స్థూపాలను గురువారం గిరిజనులు ధ్వంసం చేశారు. ముఖ్యంగా చిత్రకొండ సమితి జోడాంబో పంచాయతీలో ఖజూర్గూడ ప్రాంతంలో ఉన్న స్థూపం, ఘెనుబెడ గ్రామంలో ఉన్న స్థూపాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టులు పూర్తిగా లేరన్నారు. గ్రామస్తులంతా కలిసి ఇక మన భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోవాలని, మనకు మావోలతో భయం లేదన్నారు. ఈ నిర్మాణాలు మనకు వద్దని సభలో నిర్ణయించుకుని 20 స్థూపాలను ధ్వంసం చేశారు. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా మావోల చర నుంచి బయటబడ్డాయి. ఇక్కడ గిరిజనులు భయం వదిలి ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. పోలీసు శాఖ చేసిన కృషితో మావోలను తరిమికోట్టారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ మాట్లాడుతూ ప్రజలు సంఘర్షణ కంటే అభివృద్ధి, శాంతి అవకాశాలను కోరుకుంటున్నారని తెలిపారు. -
దేవునల్తాడలో విషాదం
వజ్రపుకొత్తూరు రూరల్: దేవునల్తాడ గ్రామానికి చెందిన వలస కూలి బుడగట్ల మోహన్రావు(46) దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెంది 17 రోజుల తర్వాత బుధవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకోవడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. నాలుగు నెలల క్రితం అదే కుటుంబానికి చెందిన మృతుని సోదరుడు బుడగట్ల చినబాబు సముద్రంలో తెప్ప బోల్తా పడి మృతి చెందారు. పొట్ట చేతపట్టుకొని ఎన్నో ఆశలతో వలసకూలీగా దుబాయ్ వెళ్లిన మోహన్రావు నేడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోహన్రావుకు భార్య ధనలక్ష్మీ, కుమారులు రాజేష్, నితిన్ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో రోడ్డున పడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. టెక్కలి: టెక్కలి విశాఖ డైరీలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కల్తీ పాల వ్యవహారంపై స్థానికంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ను సేకరించారు. ఎక్కడైనా ఆహారం కల్తీ జరిగినట్లు తెలిస్తే తక్షణమే సమాచారం అందజేయాలని వెల్లడించారు. -
ప్రసాదమా.. అపచారమా!
అరసవల్లి: ఆలయాల్లో తయారు చేసిన పులిహోర, లడ్డూలను దేవునికి ముందుగా నివేదించిన తర్వాతే అవి ప్రసాదాలుగా భావించి భక్తులు కళ్లకద్దుకుని తీసుకుంటారు.. నలుగురికి పంచుతారు కూడా..! ఇదే హిందూ సంప్రదాయంలో భాగం. కానీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ విధానం కొన్నాళ్లుగా కనిపించడం లేదు. గతంలో ముందుగా స్వామి వారికి నివేదించి ప్రసాదాల పేరిట విక్రయాలు చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దేవునికి నివేదించకుండానే విక్రయాలా..! ఆలయాల్లో బ్రాహ్మణ వంట పంతులు కచ్చితంగా దేవునికి ప్రసాదాలను తయారు చేయాల్సి ఉంది. ఈయన ఆధ్వర్యంలోనే దిట్టం ప్రకారం నాణ్యమైన రసవర్గాలతో తయారు చేసిన పులిహోర, లడ్డూలను రోజూ గర్భాలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు నివేదించాల్సి ఉంది. అయితే బ్రాహ్మణ వంట పంతులు నియామకం జరగకపోవడంతో ఇప్పటికే ఆలయ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట పంతులు చేతుల మీదుగా స్వామికి నివేదించిన నివేదనా వస్తువులే ప్రసాదంగా మారుతుంది. వీటిని అప్పటికే సిద్ధమైన తయారి పులిహోర లడ్డూ పూసలో కలుపుతారు. దీంతో మొత్తం ఈ పదార్థాలన్నీ ప్రసాదాలుగా ప్యాకెట్లకు సర్దేసి భక్తులకు విక్రయాలు చేయాల్సి ఉంది. ఇదే విధానం గత ప్రభుత్వ పాలన వరకు అరసవల్లిలో కొనసాగింది. కూటమి ప్రభుత్వం రాగానే శాశ్వత అన్నదాన ప్రసాదాల మండపాలన్నీ కూల్చివేయడంతో ప్రసాదాలను నివేదించే సంప్రదాయం కూడా కనుమరుగైంది. రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతులు నియామకాలు జరుగకపోవడంతో తయారు వస్తువులను ప్రసాదాలుగా నివేదించే నాథుడే కరువయ్యాడు. నమూనా విగ్రహానికి నివేదిస్తూ...! ఆలయ వర్గాలు భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఉండేలా వైజయంతి ఉత్సవ వేదిక వద్ద అలంకారంగా ఉన్న నమూనా ఆదిత్యుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వద్ద రోజూ ఇక్కడ తయారు చేసిన పులిహోర, లడ్డూలతో పాటు అన్నం, కూరలను కూడా నివేదించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి అసలైన మూలవిరాట్టుకు మాత్రమే ప్రసాదాలు, భోగాన్ని నివేదించాల్సి ఉంది. అలా చేయకపోవడంతో ఇదెక్కడి సంప్రదాయమంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు బ్రాహ్మణ సామాజిక వంట పంతులును నియమించి ఆయన ద్వారా స్వామి వారికి ప్రసాదాలను తయారు చేయించి నేరుగా స్వామివారి గర్భాలయంలోనే నివేదించి ఆ తర్వాతే ప్రసాదాల విక్రయాలకు సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. నివేదించకపోతే ఎలా? స్వామికి నివేదించకుండా పులిహోర, లడ్డూలను విక్రయించడం దారుణం. అలా చేస్తే అవి ప్రసాదాలే కాదు. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే వస్తువులుగానే చూడాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవస్థలు పని చేయకూడదు. – శ్రీపతి మురళీరావు, శ్రీకాకుళం అరసవల్లిలో దేవునికి నివేదించకుండానే లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు నమూనా విగ్రహానికి నివేదన చేయడంపై విమర్శలు ఇదేం పద్ధతంటూ భక్తుల మండిపాటు గతంలో ఉన్న విధానానికి స్వస్తి పలికిన వైనం శాశ్వత భవనాల కూల్చివేతతో సంప్రదాయాలకు మంగళం -
రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం, భార్యకు తీవ్ర గాయాలు
జయపురం: జయపురం–కొరాపుట్ 26 వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. జయపురం సదర్ పోలీసు అధికారి వివరాలు ప్రకారం జయపురం–కొరాపుట్ ఘాట్ రోడ్డులో భైరవ మందిరం సమీపాన ఒక ఇసుక లోడు టిప్పర్ జయపురం నుంచి కొరాపుట్ వెళ్తుండగా బొలంగీర్ జిల్లా బుబెల్ గ్రామం వాసి సుధీర్ కుమార్ ఖహుర్(36), అతడి భార్య మాధురి భాగ్లు ఒక బులెట్ పై జయపురం నుంచి కొరాపుట్ వైపు వెళ్తున్నారు. ఇసుక వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో టిప్పర్ వెనుక టైర్కు ఢీకొన్నారు. దీంతో బులెట్ బండి టైర్ కిందకు వెళ్లిపోయి సుధీర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా అతడి భార్య మాధురి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సుధీర్ మృత దేహంతో పాటు తీవ్రంగా గాయపడిన మాధురిలను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారి సచింత్ర ప్రధాన్ వెల్లడించారు. -
కుటుంబానికి సాయంగా లేనని..
● మనస్థాపంతో యువకుడు ఆత్మహత్యశ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని వాంబేకాలనీలో బుధవారం ఉదయం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యడగళ్ల పవన్కుమార్ (26) వాంబేకాలనీలోని రాజీవ్ గృహకల్పలో 9వ నెంబరు బ్లాక్లో తల్లి తిరుమలతో కలసి నివాసముంటున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి కూలి పనులకు వెళ్తూ, చీకులు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. పవన్ ఆటో నడుపుతుండగా అతని సోదరుడు నగరంలో ఓ వాటర్ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఆటోకి సరిగా బేరాలు రావడంలేదని, చిన్నపాటి ఉద్యోగముంటే బాగుండేదని, కుటుంబానికి సాయం చేయలేకపోతున్నానని ఇటీవల తల్లి వద్ద పవన్ అనేవాడు. ఆ క్రమంలోనే మంగళవారం స్నేహితుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లిన పవన్ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు, తెలిసినవారందరికీ వాకబు చేసినా ఫలితం లేదు. బుధవారం ఉదయం అదే వాంబేకాలనీ రాజీవ్గృహకల్ప 17వ బ్లాకులో పవన్.. చీరతో ఉరివేసుకుని ఉండటం స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా పవన్ కొన్ని కేసుల్లో నిందితుడిగా, సస్పెక్ట్ షీట్ సైతం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. -
హోర్డింగ్ కూలిన ఘటనలో మృతులకు పరిహారం ప్రకటన
భువనేశ్వర్: కాల వైశాఖి తాండవంతో హోర్డింగు కూలిన ఘటనలో మృతులకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బుధవారం పరిహారం ప్రకటించారు. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కారణంగా మంగళవారం స్థానిక అయిగిణియా ప్రాంతం దుర్గా పూజ మండపం సమీపంలో ప్రకటన హోర్డింగ్ నిలువునా కూలిపోయింది. ఈ ఘటన ఇద్దరు వ్యక్తుల ప్రాణాల్ని బలిగొంది. మృతులను టున్నా గౌడొ, సచ్చిదానంద ప్రధాన్గా గుర్తించారు. ముఖ్యమంత్రి సహాయం ఈ సంఘటనపట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల వంతున ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుండి విడుదల చేస్తారు. స్థానికుల ఆందోళన మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ విచారకర సంఘటనపై ఆవేదన వ్యక్తం చేసి సముచిత చర్యలతో తగిన న్యాయం కోరుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళనతో బుధవారం జాతీయ రహదారిపై వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు హైవేను దిగ్బంధించారు. ఖండగిరి ఠాణా పోలీసులు హోర్డింగు కూలి వ్యక్తుల దుర్మరణం సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కమనీయం
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కల్యాణం.. రాయగడ: జేకేపూర్లో గల శ్రీభూసమేత వేంకటేశ్వర స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం సుప్రభాత సేవ, వేదపారాయణం, వాసుర్త యోగీశ్వర, బ్రహ్మమండల పూజలు, అష్టదిక్పాలక ఆవాహన, ధ్వజారోహణం పూజలతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద శ్రీసీతారామ చంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తజనులు ఆనందోత్సాహాలతో హాజరయ్యారు. మందిర ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. సుమారు రెండు గంటల పాటుగా జరిగిన స్వామి వారి కల్యాణంలో భక్తులు పాల్గొన్నారు. విగ్రహాలకు వేదపండితులు అంపోలు అనంత వెంకట శ్రీనివాసాచార్యులు, గోపీనంబాళ్ల శేషాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు జరిగింది. అనంతరం జేకేపూర్లో గల ప్రముఖులను మందిరం కమిటీ ఉపాధ్యక్షుడు పట్నాన గౌరి శంకర్ రావు వేదికపై ఘనంగా సన్మానించారు. వేదపండితులు జి.శేషాచార్యులను సత్కరించారు. గోపూజలు, విశేష హోమాలు, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలతో కార్యక్రమాన్ని ముగించారు. మందిరం ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
స్కీమ్ వర్కర్ల ర్యాలీ
స్కీం వర్కర్ల ర్యాలీ పర్లాకిమిడి: భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆశ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘాల ఆధ్వర్యంలో స్కీం వర్కర్లు బుధవారం స్థానిక జగన్నాథ మందిరం నుంచి కలెక్టరేట్ వరకూ ’ప్రతిబాద్ దివాస్’పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారతీయ మజ్దూర్ సంఘ్ (గజపతి) కార్యదర్శి అంజలీనాయక్, బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, అఖిల ఒడిశా అంగన్వాడీ లేడీస్ వర్కర్ల మహాసంఘం కార్యదర్శి పుష్పాంజలి పండా తదతరులు పాల్గొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్–2020ను తిరిగి సవరణ చేయాలని, అంగన్వాడీ, ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ఈపీఎస్–95లో ఉన్న కనీస పింఛను రూ. వెయ్యి నుంచి రూ. 7,500 వరకూ పెంచాలని, కార్మికులకు ఈపీఎస్, ఈఎస్ఐ పెంపు, వారానికి అయిదు రోజుల పనిదినాలు, డీఏ అంద జేయాలన్న 11 న్యాయమైన డిమాండ్లపై కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిపారు. రెండు గంటలసేపు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన అనంతరం రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగకు వినతిపత్రాన్ని బీఎంఎస్ అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, కార్యదర్శి అంజలీ నాయక్లు అందజేశారు. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
రాయగడ : కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ మజ్ధూర్ సంఘ్ పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భారతీయ మజ్దూర్ సంఘ్ రాయగడ శాఖ కార్యదర్శి గణేష్ కుమార్ సాహు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ఆ సంఘ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జొగేశ్వర్ దాస్, జయంతి పద్మాలయ సాహు, ఉషారాణి దాస్, మమత బిశ్వాల్, గీతాంజలి హియాల్, సురేష్ సాహు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రామికుల సమస్యల విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరమని జోగేశ్వర దాస్ అన్నారు. సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25 న నిరసన దినోత్సవంగా పరిగణించి ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. -
న్యాయవృత్తి నిపుణులకు రిటైర్మెంట్ లేదు
పర్లాకిమిడి: కృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలలో ‘అల్యుమినీ టాక్’ పేరిట ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ న్యాయ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్, మహారాష్ట్ర నేషనల్ లా కళాశాల ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ భవానీ ప్రసాద్ పండా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో ‘విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలు’ ఎలా ఎంచుకోవాలి. దానివల్ల విద్యార్థుల భవిష్యత్లో ఎలా అభివృద్ధి చెందగలమో వివరించారు. 1973–76 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ భవానీ ప్రసాద్ పండా మాట్లాడుతూ అప్పట్లో మంచి అధ్యాపకులు ఉండేవారని, వారిలో లైఫ్ సైన్స్ ప్రొఫెసర్ బి.శశిభూషణ్రావు, తదితరుల పర్యవేక్షణలో మేము వృత్తిపరమైన విజయాలు సాధించామన్నారు. న్యాయ వృత్తి , అధ్యాపకులకు ఎప్పడూ రిటైర్మెంట్ ఉండదని కూడా అన్నారు. తదుపరి ఆయన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్పై అనర్గళంగా మాట్లాడారు. అనంతరం డాక్టర్ భవానీ ప్రసాద్ పండాను ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్ ఘనంగా సత్కరించారు. ఈ పూర్వ విద్యార్థుల ప్రసంగంలో రసాయన అధ్యాపకులు డాక్టర్ సునాశిరో మిశ్రో, సుభేందు కుమార్ ప్రధాన్, డాక్టర్ వైద్యనాథ్ పండా, తదితరులు భవానీ ప్రసాద్ పండా గురించి మాట్లాడారు. -
జగన్నాథుని ఆభరణాల లెక్కింపునకు రంగం సిద్ధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రత్నాభరణాల లెక్కింపు, అనుబంధ జాబితా ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు సర్వం సిద్ధమైందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. శ్రీ మందిరంలోని రత్న భాండాగారంలో భద్రపరచాల్సిన ఆభరణాలు ఇతరేతర అమూల్య సంపద లెక్కింపు, జాబితా తయారీ ప్రక్రియ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారం నాటికి ప్రారంభం కానుందని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు శ్రీ మందిరం ఛొత్తీషా నియోగుల వర్గంతో చర్చలు జరిగాయి. తేదీ, సమయాన్ని త్వరలో నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. ఆలయ సంప్రదాయం, ఆచారాల ప్రకారం తేదీ, సమయాన్ని ఆలయ పాలక మండలి నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఆభరణాల జాబితా ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి శ్రీ మందిరం పాలక మండలి ప్రతిపాదించిన 14 పేజీల ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ)ని ప్రభుత్వం ఆమోదించిందని శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాఢి ప్రకటించారు. ఆమోదిత కార్యాచరణ అమలు కోసం ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం పూరీ శ్రీ జగన్నాథ ఆలయం కార్యాలయంలో జరిగింది. ఆలయ ప్రధాన నిర్వాహకుడు పలువురు అధికారులకు వివిధ బాధ్యతలను కేటాయించారు. ఆభరణాల మూల్యాంకనం ఒక శుభ దినం అమృత ఘడియల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ ఆలయ రత్న భండార్ యొక్క జాబితా మరియు మూల్యాంకనాన్ని పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం (ఎస్జేటీఏ) రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రక్రియలో భాగంగా, ఆలయ పరిపాలన సజావుగా జరిగేలా చూసేందుకు రెండు అంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ యంత్రాంగం పర్యవేక్షక కమిటీ, నిర్వహణ కమిటీగా పని చేస్తుంది. రత్నాభరణాల లెక్కింపు, జాబితా రూపకల్పన సమగ్ర ప్రక్రియను పర్యవేక్షక కమిటీ పర్యవేక్షిస్తుంది. రత్న భాండాగారంలో భద్రపరిచే విలువైన ఆభరణాలు, వస్తువుల భౌతిక జాబితా, లెక్కింపు బాధ్యతల్ని నిర్వహణ కమిటీ నిర్వహిస్తుంది. భాండాగారంలో రత్న సంపద జాబితా రూపొందించడంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబద్ధమైన డాక్యుమెంటేషన్ వ్యవహారాల్ని ఈ కమిటీ నిర్ధారిస్తుంది. ఈ సమగ్ర ప్రక్రియ ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ప్రక్రియ 1978 జాబితా ప్రామాణికంగా రత్న భాండాగారంలో ఆభరణాలు తదితర వివరాల్ని పరిగణనలోకి తీసుకుంటుందని సీఏఓ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వార్షిక రథ యాత్ర పురస్కరించుకుని నీలాద్రి విజేకు సుమారు 24 రోజుల ముందు నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుందని పాలక, అధికార వర్గం అభిప్రాయపడుతుంది. ఈ వ్యవధిలో రోజువారీ ఆచారాలు, భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా జాబితా తయారీ సజావుగా కొనసాగుతుందని యోచిస్తున్నారు. ఈ యోచనకు అనుకూలంగా పండితులను సంప్రదించి శుభ దినం, సమయాలను పరిగణనలోకి సుకుని తేదీ వివరాలు త్వరలో ప్రకటిస్తారు. -
నేటి నుంచే రట్టి వల్లభ నారాయణుడి యాత్ర
మందస: ఉద్దానం ప్రాంతమైన మందస మండలం రట్టి గ్రామంలో వల్లభనారాయణుడి రట్టియాత్ర ఈ నెల 26 నుంచి మార్చి 3 వరకు ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. సింహాచలంలో సింహాద్రి అప్నన్న, రట్టిలో వెలసిన వల్లభనారాయణ స్వామి ఒక్కరేనని ఇక్కడి భక్తుల నమ్మకం. జిల్లాతో పాటు ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు అంకురార్పణ, 27న పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, 28న ధ్వజారోహణ, విశేణ హోమాలు, మార్చి 1న తిరువీధి మహోత్సవాలు, 2న స్వామివారికి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమా లు, 3న డోలో పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం, మఘ, కామదానం, కోలసేవ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడి వివేకానంద యువజన సేవా సంఘం, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో ప్రత్యేకత.. ఆలయ ప్రాంగణంలోని గరుడ స్తంభాన్ని నూతన దంపతులు ఆలింగనం చేసుకుంటే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దేవుని సన్నిధిలో ఉన్న తులసికోట వద్ద చాలామంది నేస్తరికం కట్టుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు వేర్వేరు చోట్ల పుణ్యక్షేత్రాలు దర్శించి చివరిగా మత్స్యవల్లభనారాయణ స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ యాత్ర చేసినట్లు అవుతుందని ప్రగాఢ నమ్మకం. -
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
జయపురం: విద్యుదాఘాతంతో మూడు ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన జయపురం సమితి బరిణిపుట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పశువుల యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మరణించిన ఆవులను పోస్టుమార్టం జరిపించి వాటిని యజమానికి అప్పగించారు. పశువుల యజమాని బరిణిపుట్ నివాసి టి.జనార్దనరాజు గత రాత్రి తన ఇంటి ఆవరణ నుంచి అకస్మాత్తుగా పశువుల అరుపులు వినిపించాయి. ఇంటిలో ఉన్న రాజు కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. అయితే ఆవుల శాల సమీపంలో ఉన్న 11 కేవీ వోల్టేజ్ స్తంభం నుంచి వైర్లు తెగి పశువల శాలపై ఉన్న టిన్ను రేకులపై పడి ఉన్నాయి. టిన్నులలో విద్యుత్ ప్రసారం జరిగి మూడు ఆవులు దుర్మరణం చెందాయి. 375 కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మాన్యంకొండ పంచాయతీలో గుంఠబేఢ గ్రామంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఐఐసీ ప్రభు దత్త విశ్వాల్ ఆదేశాలతో ఓ బృందం పోలీసులు మంగళవారం రాత్రి ఆ గ్రామానికి వెళ్లి దాడి చేశారు. ఈ ఘటనలో ఘసి గోలారీ, మహాదేవ్ మాఝిల ఇళ్లవద్ద రవాణాకు సిద్ధం చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకొని కలిమెల పోలీసుస్టేషన్కు తరలించారు. పట్టుబడిన గంజాయని బుధవారం తూకం వేయగా 375 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ప్రభు దత్త తెలిపారు. టీచర్కు ఘన నివాళులు జయపురం: కొద్ది రోజుల కిందట జయపురం సమితి ఉమ్మిరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయిన అంబాగుడ ప్రభుత్వ ఐటీఐ అధ్యాపకుడు సతీష్ సాహుకు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం సాయంత్ర వారంతా బ్యానర్లు పట్టుకుని, కొవ్వొత్తుల దీపాలు వెలిగించి రాజనగర్ కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వర్గీయ సతీష్ చిత్రపటం వద్ద దీపాలు వెలిగించారు. కారు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియ సమితి శిమిలిబాంఛ పంచాయతీ కలాధపల్లి గ్రామం మలుపు వద్ద కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం ఛత్తీస్గడ్ రాష్ట్ర దోర్నాపాల్ గ్రామం నుంచి దీపక్ అనే యువకుడు మరోవ్యక్తితో కారులో పోడియ గ్రామానికి వస్తున్నాడు. అయితే కలాధపల్లి వద్ద ఉన్న మలుపు తిరుగుతుండడగా ప్రమాదశాత్తు కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవ్ చేస్తున్న దీపక్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పోడియా అగ్నిమాపక అధికారి వీరేంద్రసింగ్ నేతృత్వంలో సిబ్బంది వచ్చి దీపక్ను కారులో నుంచి బయటకు తీసి పోడియ ఆరోగ్య కేంద్రానికి తరలించారు చికిత్స అందించారు. అయితే దీపక్ పరిస్థితి విషమంగా ఉంది. పోడియ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి.. కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు. -
ఘనంగా గణపతి మందిరం ప్రతిష్ట
పర్లాకిమిడి: గుసాని బ్లాక్ బుసుకుడి గ్రామంలో అభయ గణపతి మందిర ప్రతిష్టామహోత్సవానికి అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నారాయణరావును ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గేదెల శ్రీధర్ నాయుడు, బబులా పట్నాయక్, జగన్నాథ పరిడా, రఘురాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత మందస: బాలిగాం జంక్షన్ జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ పట్టుకున్నారు. ఒక బండిలో ఆరు పశువులు, మరో బండిలో ఏడు పశువులు మొత్తం 13 పశువులు పట్టుకుని వాహనాలపై కేసులు నమోదుచేసి గోశాలకు తరలించారు. సారా నిర్మూలనకు కృషిపాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సారా రహిత గ్రామాలున్న మండలంగా పాతపట్నం ఎంపికై ందని శ్రీకాకుళం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా–ఆంధ్ర చెక్పోస్ట్, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్పోస్ట్లను బుధవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటు సారా, మద్యం రవాణాకు ఆస్కారమున్న ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. అనంతరం పాతపట్నంలోని మద్యం షాపును తనిఖీ చేశారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు, ఎస్ఐ శ్రీనివాసరావు ఉన్నారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంచాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ను పెంచాలని రేషన్ డీలర్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వడగ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు కోరారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాశరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమీషన్ పెంపు జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. షాపు అద్దె, డోర్ డెలివరీ అవుతున్న ఖర్చులు, సహాయకుడికి వేతనం, ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. ఐ.వి.ఆర్.ఎస్.సర్వేలో రేషన్ డీలర్లకు సంబంధం లేని అంశాలు చెప్పడం వల్ల డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వే ప్రకారం డీలర్లపై చర్యలు తీసుకోవద్దని, అవసరమైతే లబ్ధిదారుల వద్ద నుంచి నేరుగా అభిప్రాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రవికుమార్, రణస్థలం వెంకటరావు, శిమ్మినాయుడు, రామ్మూర్తినాయుడు, మురళీమోహన్, పోలాకి జగన్, మూర్తి, పలాస మోహనరావు, శ్రీను, రామకృష్ణ, పంచిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. 1న క్రికెట్ ఎంపికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్, అండర్–23 పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు మార్చి ఒకటో తేదీన జరగనున్నాయని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ తెలిపారు. కళింగపట్నంలోని వైట్హౌస్ సమీపంలో ఉన్న క్రికెట్ మైదానంలో ఉదయం 9 గంటల నుంచి జిల్లా జట్ల సెలక్షన్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ ఆధార్ కార్డు, ఫారం–5తో హాజరుకావాలని కోరారు. తెలుపురంగు యూనిఫాం, షూ విధిగా ధరించాలని వారు సూచించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
జయపురం: వ్యవసాయ రంగంలో మహిళల భూమిక గుర్తించి వారికి సాధికారత కల్పించటమే ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందని కొరాపుట్ జిల్లా వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ దొళ బెహరా వెల్లడించారు. బుధవారం జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి బొయిపరిగుడ వ్యవసాయ విభాగ కార్యాలయంలో ముఖ్యవక్తగా పాల్గొన్నారు. జయపురం ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం వారు అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ప్రసంగిస్తూ మహిళా రైతులను ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దటం, పోషక ద్రవ్యాల వ్యవసాయాన్ని ప్రోత్సహించటం, వారిలో వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళా రైతులు వ్యవసాయంలో మరింత విజ్ఞాన వంతులై వ్వవసాయ ఉన్నతిలో భాగస్తులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రధాన ప్రాజెక్టు నిర్వాహకురాలు తృప్తి బారాహి, బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షురాలు పూర్ణిమ బారిక్, జయపురం జిలా వ్యవసాయ అధికారి లొలాటేందు మహాపాత్రో, బొయిపరిగుడ సహకార వ్యవసాయ అధికారి నందు జాని, సమగ్ర శిశు అభివృద్ధి పథకం పర్యవేక్షకురాలు లాల్మతి సర్కార్, మండియ రాణి, డాక్టర్ రొయిమతి ఘివురియ, ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ జెండర్ ఎక్స్పర్ట్ సురజిత్ తురుక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమితిలోని వివిధ గ్రామ పంచాయతీల నుంచి 70 మందికి పైగా మహిళా రైతులు పాల్గొన్నారు. స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడా, సీనియర్ సమన్వయ కర్త అక్షయ కుమార్ పండా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ కోఆర్డి నేటర్ అంతర్యామి బిశాయి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. -
మాతృభాషలో విద్యాబోధన చేయాలి
రాయగడ: చిన్నారులకు మాతృభాషలో విద్యాబోధన చేస్తే వారు సులువుగా పాఠాలను అర్థం చేసుకుంటారని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో మంగళవారం పిరామిల్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. చిన్నారులకు పాఠాలు చేప్పే సమయంలో వారి మాతృభాషలో ఉపాధ్యాయులు బోధించడం ద్వారా వారు సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు ఆలోచన శక్తి పెరుగుతోందన్నారు. జిల్లాలో 30 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకు ఆదివాసీల సంప్రదాయాలకు చెందిన భాషల్లో ఒకటైన కుయిలో బోధించడం వారి వికాశానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ‘మాతృభాషలో బోధించండి..మాతృభాషలో చదివించండి’ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక శాఖ అధికారి మీనతీదేవ్ పిరామిల్ ఫౌండేషన్ సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
సైక్లిస్ట్ను ఢీకొన్న అమొ బస్
భువనేశ్వర్: స్థానిక పలాసపల్లి ఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన అమొ బస్సు రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్ తీవ్రంగా గాయపడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలాసపల్లి ఫ్లైఓవర్ కింద ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతం గుండా వెళుతున్న వృద్ధ సైక్లిస్ట్ను అమొ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం తరువాత ఆగ్రహించిన స్థానికులు సంఘటనా స్థలంలో గుమిగూడి బస్సును ధ్వంసం చేసి వాహనంపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులగొట్టారు. గాయపడిన వ్యక్తికి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన స్థానికుల్ని శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బస్సుకు నిప్పు పెట్టిన స్థానికులు -
భూగర్భజలాలు అంతరించకుండా చర్యలు తీసుకోవాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో భూగర్భజలాల స్థాయి కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువగా ఉంది, ఇవి అడుగంటకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అధికారులకు కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ సూచించారు. ఆయన జాతీయ భూగర్భజలాలు మానచిత్రాలు, వాటి నిర్వహణ వర్క్షాపు స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ప్రారంభించారు. కేంద్ర జలశక్తి, నీటి వనరులు, నదుల అనుసంధానం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్షాపులో చిన్ననీటి పారుదల శాఖ ఎస్ఈ సింహాచల శతపతి, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్టు చరణశ్రీ మహాంతి, కేంద్ర జలశక్తి, నీటివనరుల శాఖ, సీనియర్ సైంటిస్టు రాజకిషోర్ మహాంతి తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్ష జిల్లాగా గజపతి జిల్లా గుర్తించిన తరువాత భూగర్భజలాలపై 2025లో సర్వేచేయడం జరిగిందని, దీనిప్రకారం మోహన బ్లాక్లో బిరికోట్, కాశీనగర్ బ్లాక్ కిత్తంగి, మధుసూదన్పూర్ (గుసాని)లో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తుందని వైజ్ఞాణికులు రాజకిషోర్ మహాంతి పవర్ ప్రజెంటేషన్లో పేర్కోన్నారు. భూమిలో ఫ్లోరైడ్, నైట్రేట్ ఉన్నందున భూగర్భజలాలు అంతరించడానికి ముఖ్య కారణంగా ఆయన కర్మశాలలో తెలియజేశారు. జిల్లాలో భూగర్భ జలాలు అంతరించపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వైజ్ఞానికుల సలహాలు తీసుకోవాలని, అలాగే సాగు, తాగునీరు స్టోరేజి, రిజర్వాయర్లు నిర్మించాలని కలెక్టర్ అగర్వాల్ ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల వనరులపై ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసి వాటిపై తయారు చేసిన సర్వే రిపోర్టును కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆవిష్కరించారు. వర్క్షాపులో రోడ్లు–భవనాల శాఖ, ప్రజా ఆరోగ్యశాఖ, వాటర్ షెడ్ అభివృద్ధిశాఖ అధికారి సురేష్ పట్నాయిక్, ఇరిగేషన్, గ్రామీణ త్రాగునీరు, శానిటేషన్,గ్రౌండ్ వాటర్ అభివృధ్ధి శాఖ, వివిధ సమితిల అధికారులు పాల్గొన్నారు. -
సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
భువనేశ్వర్: స్థానిక ధౌలి లింగిపూర్ ప్రాంతానికి సమీపంలో సూపర్ మార్కెట్లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. లక్షల రూపాయల విలువైన ఆస్తికి అపారమైన నష్టం వాటిల్లింది. బహుళ అంతస్తుల భవనంలో 3వ అంతస్తు నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్వల్ప వ్యవధిలో మంటలు శర వేగంగా వ్యాపించాయి. సమీపంలోని స్థానికులు అప్రమత్తం అయి అగ్ని మాపక సేవలకు సమాచారం అందించారు. అగ్ని మాపక దళం పూర్తి సరంజామాతో ఘటనా స్థలానికి చేరుకుని 6 గంటలకు పైగా నిర్విరామంగా శ్రమించి మంటలను నివారించారు. సూపర్ మార్ట్లో మంటలను నీటితో నియంత్రించడం సాధ్యం కాలేదు. నురుగు సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించామని అగ్నిమాపక శాఖ డైరెక్టరు జనరల్ సుధాంశు షడంగి తెలిపారు. గోడను పగలగొట్టి నురుగును ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఈ చర్యల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్ రోబోటిక్ మానిటర్తో పాటు 40 అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. అత్యంత మండే పదార్థం కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించినట్లు ఆయన పేర్కొన్నారు. మంటల తీవ్రత, ప్రభావిత అంతస్తులో ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టీల్ పాత్రలు మరియు ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. ఫలితంగా గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. -
ఘనంగా పల్లకీసేవ
పాలనలో బీజేపీ విఫలం బీజేపీపై నవీన్ విమర్శలు ఎక్కుపెట్టారు. పాలనలో విఫలమైందన్నారు. –8లోu● జేకేపూర్లో కొనసాగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలురాయగడ: పారిశ్రామిక ప్రాంతమైన జేకేపూర్లో కొలువైయున్న శ్రీభూసమేత కళ్యాణ వేంకటేశ్వర స్వర్ణోత్సవాల్లో భాగంగా సొమవారం సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకీలొ ఊరేగించారు. ఆలయ అర్చకులతో పాటు, బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా విశాఖపట్నం, బరంపురం నుంచి విచ్చేసిన పురోహితుల మంత్రోచ్ఛరణల మధ్య గోవింద నామ స్మరణాలతో స్వామివారిని ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు. విశ్వక్షేన పూజలు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం విశ్వక్షేన పూజలను నిర్వహించారు. జి.శేషాచార్యులు ఈ సందర్భంగా పూజా విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి వారికి మంగళహారతులను ఇచ్చారు. పుణ్యాహావాచనం, పరిషత్, రక్షాసూత్రా బంధనం, రుత్విక్ వరుణ, ముత్సంగ్రహణం తదితర పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టు వస్త్రాల సమర్పణ ప్రముఖ సంఘసేవకుడు, శ్రీక్షేత్ర టౌన్షిప్ అధినేత, శ్రీలక్ష్మీనృసింహ స్వామి మందిరం ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన పూలను స్వామి వారికి సమర్పించారు. అదేవిధంగా లక్ష్మీ,ధరణి, వేంకటేశ్వరులకు పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామివారి ఉత్సవాల్లో పట్టువస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. అనంతరం మందిరం కమిటీ అధ్యక్షులు, జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షులు (కమర్షియల్) వినయ్ ద్వివేది స్వామి వారిసేవలొ నిమగ్నమయ్యారు. స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పురోహితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కొంతమంది విదేశీయులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. -
ఇళ్ల నిర్మాణం పూర్తిచేయని వారికి నోటీసులు
జయపురం: నిరుపేదలకు సొంత ఇళ్లు కట్టుకునేందుకు ప్రధాన మంత్రి అవాస యోజన పథకంలో నిధులు మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలోని లబ్ధిదారులు ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణ పనులు సగంలో నిలిపి వేయటం, పునాది కూడా వేయనివారు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అటువంటి వారికి జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి బీడీఓ సుభ్రత్ సాహు రెడ్ నోటీసులు జారీ చేశారు. మంజూరైన ప్రధాన మంత్రి అవాస్ పథకంలోని ఇళ్లు వారం రోజుల్లో పూర్తిచేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తామన్నారు. వారందరికీ ప్రభుత్వ సహాయక, సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని రెడ్ నోటీసులలో హెచ్చరించారు. బొయిపరిగుడ సమితి దండాబడి పంచాయతీ దండాబడి గ్రామంలో సమితి బీడీఓ సుభ్రత్ సాహు సిబ్బందితో వెళ్లి ప్రధాన మంత్రి అవాస్ యోజనలో ఇళ్లు పూర్తి చేయని 38 మందికి మంగళవారం రెడ్ నోటీసులు అందజేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బొయిపరిగుడ సమితిలో 12 వందల ప్రధాన మంత్రి అవాస యోజన గృహాలు మంజూరు చేయగా.. వాటిలో నేటివరకు 800లకు పైగా ఇళ్లు పూర్తికాలేదని వెల్లడించారు. నోటీసులు అందజేసిన సమయంలో సమితి చైర్మన్ ప్రశాంత గుప్త, దండాబడి సర్పంచ్ చెండియ ఖిలో, ప్రభుత్వ ఇంజినీర్ ఖిరోద్ బెహర, జూనియర్ ఇంజినీర్ దిలీప్ బెహరా, పంచాయతీ విస్తరణ అధికారి సందీప్ పట్నాయక్, ప్రధాన మంత్రి అవాస్ యోజన బొయిపరిగుడ సమితి కోఆర్డినేటర్ ప్రదీప్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
ఐసీయూ ఏర్పాటు చేస్తాం
పర్లాకిమిడి: మూడు రోజుల క్రితం పర్లాకిమిడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ సౌకర్యం లేక గుమ్మాకు చెందిన మహిళ దీప్తిమొతి బెబర్తా మృతి చెందారు. దీనిపై ఒడిశా లెజిస్లేటివ్ అసెంబ్లీ 8వ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రశ్నను లేవనెత్తారు. పర్లాకిమిడి జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ సేవలు, మరో వంద బెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై 11 మంది సభ్యుల స్టాండింగ్ కమిటీ చైర్మన్ బిభూతి భూషణ్ ప్రధాన్ (ఎమ్మెల్యే) సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ ఏర్పాటుపై ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం నుంచి భువనేశ్వర్లో 8వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
ప్రయాణికులకు అవగాహన
రాయగడ: రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్పీఎఫ్ సిబ్బంది సూచించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు స్థానిక రైల్వే స్టేషభ్ ఒకటో నంబర్ ప్లాట్ఫాం వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్పీఎఫ్ అధికారి కె.ఎస్.వి.ఎన్.ఎస్.అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కట్ లేని ప్రయాణం చేయడం చట్టవిరుద్ధమన్నారు. అదేవిధంగా ఎటువంటి అనుమతుల్లేని వారి నుంచి రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రయాణ సమయంలో ఇక్కట్లకు గురికావద్దని వివరించారు. అలాగే ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బందులు గురిచేసే విధంగా వ్యవహరించ కూడదని అన్నారు. రైల్వే ట్రాక్లను అనధికారంగా దాటడం, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం వంటివి చట్టవిరుద్ధమని వివరించారు. -
పాలనలో బీజేపీ విఫలం: బీజేడీ
● రైతులకు అన్యాయం ● కుప్ప కూలిన శాంతిభద్రతలు భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన పూర్తిగా విఫలమైందని, శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ప్రతిపక్ష బిజూ జనతా దళ్ (బీజేడీ) బాహాటంగా ఆరోపించింది. మంగళ వారం స్థానిక దిగువ పీఎంజీ వద్ద పెద్ద ఎత్తున రైతుల ప్రదర్శన నిర్వహించింది. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్ వద్ద గుమిగూడారు. తరువాత దిగువ పీఎంజీకి ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా బీజేడీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తూ మండీలలో విస్తృతమైన అవకతవకలు చోటుచేసుకున్నాయని పాలన వైఫల్యాన్ని ఎండగట్టారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా కట్టు కథలు అల్లుతున్న వాస్తవాలు వైఫల్య పాలనకు అద్దం పడుతున్నాయని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ప్రసంగాలు, కథనాలతో ప్రభుత్వ పాలన సాధ్యం కాదని హితవు పలికారు. ప్రభుత్వ వాగ్దానాలు క్షేత్రస్థాయిలో వాస్తవ అమలు ప్రభుత్వ పారదర్శక పాలన ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నప్పటికీ కీలకమైన ఎన్నికల వాగ్దానాలు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని సభాముఖంగా ఆరోపించారు. గత బీజేడీ పాలనలో చేపట్టిన చొరవలను ఆయన ప్రస్తావిస్తు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం, రైతులకు ఆర్థిక సహాయం అందించే కాలియా పథకం అమలును ప్రస్తావించారు. నీటిపారుదల విస్తరణ, సంస్థాగత రుణ మద్దతు వంటి చర్యలతో తమ ప్రభుత్వం రైతాంగానికి వెన్నంటి ప్రోత్సహించిందన్నారు. రైతాంగం నుంచి వరి కొనుగోలులో పలు చట్టవిరుద్ధమైన పద్ధతులు అవలంభించడం ఎంత మాత్రం తగదన్నారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేక దళం ఏర్పాటు, మిల్లర్లు, అధికారుల లాలూచీ నివారణ, వ్యవసాయ పెట్టుబడుల సబ్సిడీపై 150 క్వింటాళ్ల పరిమితి తొలగింపు, 48 గంటల్లోపు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) చెల్లింపుల నిర్ధారణ, 72 గంటల్లోపు బహిరంగ పొలాల్లో పడి ఉన్న వరిని సేకరించడం వంటి దిద్దుబాటు చర్యలు, ప్రతిపాదిత చర్యలను కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. రైతాంగం సమగ్ర సంక్షేమానికి తమ విన్నపాలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టి కచ్చితమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇది అత్యంత విచారకర చర్యగా పేర్కొన్నారు. విపక్ష హోదాలో బిజూ జనతా దళ్ శాసన సభలో రైతుల సమస్యలను నిరంతరం లేవనెత్తుతోంది. రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై బీజేడీ అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం సమస్యలను పరిష్కరించేంత వరకు బీజేడీ ఆందోళన నిరవధికంగా కొనసాగుతందని విపక్ష నేత నవీన్ పట్నాయక్ సభాముఖంగా ప్రకటించారు. -
జయక్క జీవితం స్ఫూర్తిదాయకం
పలాస: శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వీరనారి పోతనపల్లి జయమ్మ జీవితం విప్లవకారులకు స్ఫూర్తిదాయకమని సి.పి.ఐ.ఎం.ఎల్.న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోలా ఈశ్వరరావు అన్నారు.పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద మంగళవారం పోతనపల్లి జయమ్మ 6వ వర్ధంతి సభ నిర్వహించారు. న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, కులవ్యవస్థ పెరిగిపోయిందని, అన్ని రకాలు దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అరుణపతాకాన్ని జయమ్మ కుమారుడు మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల మల్లేశ్వరరావు, తామాడ సన్యాసిరావు, పత్తిరి దానేసు, జోగి కోదండరావు, కొర్రాయి నీలకంఠం, సాలిన వీరాస్వామి, పుచ్చ దుర్యోధన, సామాజిక కార్యకర్త పోతనపల్లి అరుణ, కొమర వాసు, గొరకల బాలకృష్ణ, కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ, ఈశ్వరమ్మ, సొర్ర రామారావు, కుత్తుం వినోద్, నాగమణి, సార జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్ర జయంతి
జయపురం: జయపురం డొంగాగుడ ప్రాంతంలో ఉన్న సత్సంగ విహర్ ప్రాంగణంలో ఠాకూర్ అనుకూల చంద్ర 138వ జయంతి మహోత్సవాలతోపాటు సత్సంగ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి కీర్తనలు, ప్రార్థనలు, గ్రంధ పఠనం, సంగీతాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్సంగ్, భజన కీర్తనలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటలకు మాతృ సమ్మేళనం ప్రారంభమైంది. శిశిర కుమార్ పరిజా పౌరోహిత్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరంజన్ ఆచార్య వార్షిక నివేదిక సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా రితిక్, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు వెయ్యి మంది భక్తు పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న ఆలయాలను పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. ఠాకూర్ జీవిత విశేషాలను భక్తులకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బినోద్ మహాపాత్రో వివరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్ణచంద్ర స్వైన్, విశ్వజిత్ మిశ్రా, ప్రభాత్ దత్తా, సుకాంత నాయక్, భగవాన్ మహరాణ, సింహాద్రి పండా, భావగ్రహి బల, మదన్ మోహన్ నాయక్, ఖగేంద్ర బారిక్, నృసింహ సాహు, ధరణీధర్ సాహు, పరమేశ్వర పాత్రో, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జామి ఎల్లమ్మ తల్లి
కోర్కెలు తీర్చే కల్పవల్లి..పలాస: కోర్కెలు తీర్చె కల్పవల్లిగా, రోగాలు నయం చేసే ధన్వంతరి మాతగా, సంతతి ప్రసాదించే సంతాన లక్ష్మిగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జామి ఎల్లమ్మ తల్లి జాతర పలాసలో గురువారం జరగనుంది. బుధవారం రాత్రి కుంకుమ పూజలు అనంతరం గురువారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 11 గంటల వరకు జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి ఒడిశా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. తర్లాకోట జమిందారుల కాలం నుంచి జామి ఎల్లమ్మ జాతర సంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది.దీనిలో భాగంగా మంగళవారం పలాస కొల్లకోట వంశీయుల ఆధ్వర్యంలో అగ్ని గుండం నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉదయం పందిరి రాట వేసి యాత్ర ప్రారంభ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. దేవాలయంలో పూజలు అనంతరం అమ్మవారి జంగిడి ,మేళతాళాలతో పట్టణ పొలిమేర వరకు ఆటపాటలతో వెళ్లి అక్కడినుంచి వాహనంలో తర్లాకోట జమిందారుల ఇంటికి వెళ్లారు. అక్కడ అగ్నిగుండం తొక్కి మొదటి పడి కింద జమిందారుల ఇంటి నుంచి బియ్యం సేకరించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు. రాత్రి 9గంటల తర్వాత కొల్లకోట వంశీయులు ఆలయంలోనే భోజనాలు పూర్తి చేసి రాత్రి 11 గంటల నుంచి అమ్మవారి ఎదుట పసుపు కొమ్ములతో సిందూరం పండిస్తారు. అనంతరం ఎల్లమ్మ, ఎర్నెమ్మ, పోతురాజు విగ్రహాలతో ఆలయం నుంచి తెల్లవారి వరకు ఊరేగింపు చేపడుతారు. భారీ పోలీసు బందోబస్తు.. జాతర సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కర్రలతో బారికేడ్లు నిర్మించేవారు. ఈసారి పలాస ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ నుంచి ఆలయం వరకు ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ పర్యవేక్షణలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తన సిబ్బందితో ఏర్పాట్లు చేయించారు. ట్రాఫిక్ మళ్లింపు.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలాస మొగిలిపాడు నుంచి పలాస లోపలకు వాహనాలు రాకుండా నిషేధం విధించామని డీఎస్పీ తెలిపారు. మొగిలిపాడు నుంచి హైవే మీదుగా కోసంగిపురం కూడలి నుంచి కాశీబుగ్గలోకి పంపిస్తామన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. -
ఆయుర్వేద వైద్యంపై విస్తృత ప్రచారం
జయపురం: కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాస పరిషత్ వార్షిక ఉత్సవాలను నిర్వహించేందుకు మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. స్థానిక ఆయుర్వేద వికాస పరిషత్ సభాగృహంలో పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సుదర్శణ గౌడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి కవిరాజ్ పరమేశ్వర పాత్రో, కార్యదర్శి నివేదిక సమర్పించారు. అనంతరం పరిషత్ వార్షికోత్సవంపై సబికులు సుధీర్ఘంగా చర్చించారు. మార్చి ఆఖరి ఆదివారం వార్శిక ఉత్సవాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఆయుర్వేద వైద్యం ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్యులకు పిలుపునిచ్చింది. వార్షికోత్సవంలో ఆయుర్వేద వైద్యులను, వైద్యశాస్త్ర నిపుణులను, దిశారీలను, ఆయుర్వేద అభిమానులను సన్మానించాలని సమావేశం నిర్ణయించింది. మార్చి ఆఖరి ఆదివారం స్థానిక టౌన్ హాల్లో వార్షికోత్సవం నిర్వహించాలని, ఆ ఉత్సవాలకు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రంలో మూడు ఆయుర్వేద కళాశాలలు ప్రారంభించేందుకు ప్రకటించటం పరిషత్ న్యాయ సలహాదారు రాజేంద్ర కుమార్ గౌడ స్వాగతించారు. భవిష్యత్లో ప్రజలకు చేరువలో ఆయుర్వేద వైద్యం అందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుర్వేద పరిషత్లు ప్రధాన భూమిక నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశంలో పరిషత్ ఉపాధ్యక్షుడు కవిరాజ్ క్షేత్ర వాసి పండా, సహాయ కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ పరిచ, సలహాదారు డాక్టర్ జవహర్లాల్ జెన, డాక్టర్ కాళీచరణ్ మహారాణ, హిమాంశు పాణిగ్రహి, శివ కేశవ దాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక సదస్సులో పాణిగ్రాహికి సత్కారం
భువనేశ్వర్: స్థానిక క్రిస్టల్ క్రౌన్ కాన్ఫరెన్స్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఆధ్యాత్మిక సదస్సులో హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహిని రాసేశ్వరిదేవి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సదస్సులో పూరీ రాధా వల్లభ మఠం మహంత్ రామకృష్ణ దాస్, స్వామి శంకరానంద గిరి, స్వామి సత్యానంద మహరాజ్, స్వామి సుబల్ మహరాజ్ తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఆధ్యాత్మిక జీవితమే తొలి మెట్టు కావాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత మనిషి జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుందని అన్నారు. 200 లీటర్ల నాటుసారా స్వాధీనం రాయగడ: జిల్లాలోని మునిగుడలో అబ్కారీ శాఖ అధికారులు విస్తృతదాలు చేపటాటరు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం సాయంత్రం ఆ శాఖ సిబ్బంది సమితి పరిధిలోని ఇచ్ఛాపూర్ సమీపంలో ఒడిమస్కా గ్రామంలో దాడులను నిర్వహించి అక్రమంగా తయారు చేస్తున్న 200 లీటర్ల నాటుసారాతో పాటు 1200 లీటర్ల సారా తయారీకి వినియోగించే ఊటను స్వాధీనం చేసుకున్నారు. మునిగుడ అబ్కారీ శాఖ ఏఎస్సై రామజాన్ ఖాన్ నేతృత్వంలో దాడులు జరిగాయి. 14న జాతీయ లోక్ అదాలత్ జయపురం: జాతీయ న్యాయ సేవా ప్రదీకరణ, ఒడిశా రాష్ట్రన్యాయ సేవా ప్రదీకరణల మార్గదర్శకత్వంలో మార్చి 14వ తేదీన కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ ప్రదీకరణ కార్యదర్శి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జయపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్తోపాటు కొరాపుట్, కొట్పాడ్, బొరిగుమ్మ, సెమిలిగుడ, దసమంతపూర్, అమతాపుట్, లక్ష్మీపూర్ ప్రాంతాలలో ఉన్న అన్ని కోర్టులలోనూ లోక్అదాలత్లు నిర్వహించన్నుట్లు వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, మోటారు ప్రమాదాలు, బ్యాంక్ రుణాలు, విద్యుత్, నీటిసరఫరా బకాయిలు, కుటుంబ వివాదాలు, భూ సేకరణ, కార్మిక, ఉద్యోగ వివాదాలు, చెక్ బౌన్స్, రెవెన్యూ, వినియోగదారులు, ఉద్యోగ సంబంధిత కేసులు పరిష్కరిస్తామని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న కేసులే కాకుండా ఇంకా కోర్టులలో దాఖలు కాని ప్రీ–లిటిగేషన్ (పూర్వ వివాద) కేసులు కూడా లోక్ అదలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంతో కేసులు పరిస్కరించుకోచ్చన్నారు. -
అడవులను సంరక్షించాలి
● డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ అహోలే రాయగడ: అడవులను సంరక్షించడం అందరి బాధ్యతని డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ అహోలే అన్నారు. స్థానిక రాణిగుడఫారం వద్ద గల డీఎఫ్వో కార్యాలయం సమావేశం హాల్లో మంగళవారం అడవుల్లో కార్చిచ్చు అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అవగాహన లోపంతో ఎంతో మంది అడవులను తగులబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో అత్యధిక శాతం అడవులు ఉన్నాయని వాటిని సంరక్షించే విషయంలో సిబ్బంది కొరత కారణంగా అంతరించితోతున్నాయని అన్నారు. అడవులు పర్యావరణానికి ఎంతగానో దోహదపడుతున్న విషయం తెలుసుకోవాలని అన్నారు. విలువైన వృక్షాలు అంతరించిపోతున్నాయని, వన్యమృగాలు కనుమరుగువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అడవులను సంరక్షించే విషయంలో అందరూ చైతన్యవంతులవ్వాలని కోరారు. పోడు వ్యవసాయంతో అడవులను నాశనం చేస్తున్న వారు ఆ పద్ధతికి తిలోదకాలు పలకాలని అన్నారు. అడవుల్లో కార్చిచ్చులు సంభవించే సమయంలో సమీపంలోని గ్రామస్తులు వాటిని నియంత్రించేందుకు కృషి చేయడంతో పాటు సకాలంలో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏహీఎఫ్వోలు అశోక్ కుమార్ ప్రధాన్, సందీప్ కుమార్ పృష్టి, సంతోష్ కుమార్ ధరువ పాల్గొన్నారు. -
ఎల్బీఎస్నగర్లో చోరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఎల్బీఎస్ నగర్లో ఇద్దరు మైనర్లు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు ఓ ప్రభుత్వోద్యోగి ఇంట్లో చొరబడ్డారు. రెండు తులాల బంగారం, రూ.4 వేలు నగదు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలురు తల్లిదండ్రులు ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడుని కలిసి అభ్యర్థించడంతో ఇరువురు బాలురిని వేర్వేరుగా కౌన్సిలింగ్ నిర్వహిహించి పంపివేశారు. అనంతరం చోరీ సొత్తును బాధితులకు అప్పగించారు. ఖైదీలు సత్ప్రవర్తనతతో మెలగాలి గార: జైలులో సత్ప్రవర్తనతతో మెలగాలని, శిక్షాకాలం ముగిసిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. సోమవారం అంపోలు జిల్లా జైలును తనిఖీ చేసిన అనంతరం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఖైదీల కేసుల పురోగతిని సమీక్షించారు. ఆరోగ్యం పరిస్థితులపై ఆరా తీసి, వంటశాలను తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం పాతపట్నం: మండలంలోని ఎ.ఎస్.కవిటి గ్రామానికి చెందిన అంపోలు నాగవేణి గడ్డిమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త అంపోలు తిరుపతిరావు పొలానికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో గడ్డిమందు తాగి తన సోదరికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె స్థానికులకు తెలియజేయడంతో ఆటోలో పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. భర్త తిరుపతిరావుతో కుటుంబ తగాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. 25న శ్రీకాకుళంలో జాబ్మేళా శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పథక సంచాలకుడు పి.కిరణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీ–మార్ట్(హైదరాబాద్), ఫ్యూషన్ ఫైనాన్స్(శ్రీకాకుళం)లో అసోసియేట్, క్యాషియర్, పర్చేజ్ ఆఫీసర్, రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 10వ తరగతి ఆపై అర్హత కలిగి, 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.16,000 నుంచి రూ.26,000 వరకు వేతనం లభిస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బయోడేటాతో బుధవారం ఉదయం 9:30 గంటలకు శ్రీకాకుళంలోని నెహ్రూ యువ కేంద్రం వద్దకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 7989744612 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి శ్రీకాకుళం అర్బన్: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్కు బడ్జెట్లో నిధులు పెంచాలని సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుజరాతీపేటలో ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లల్లో ధరలు విపరీతంగా పెరిగినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు సరిపోవన్నారు. 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. మే నెలంతా వేసవి సెలవులు ఇచ్చేలా జీఓ విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిల్లో రిలే నిరాహార దీక్షలు, మార్చి 2న విజయవాడలో అలంకార్ సెంటర్ వద్ద మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీక్షలకు సీఐటీయూ టౌన్ కో– కన్వీనర్ ఎం.గోవర్దనరావు, సీనియర్ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.జ్యోతి, కె.సంధ్య, వై.లీలారత్నకుమారి, కె.పార్వతి, ఎల్.శ్యామల, టి.పుష్పలత, ఇ.అప్పలనర్సమ్మ, ఎల్.రూపవతి, బి.లక్ష్మి, ఎం.వరలక్ష్మి, వి.సంతోషి తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తాపడి పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: తలగాం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌపడ ఆర్ఎస్ నుంచి కొంతమంది ప్రయాణికులతో కలిసి ఆటోలో టెక్కలి వైపు వస్తుండగా తలగాం జంక్షన్ వద్ద దామోదరపురం రహదారి మీదుగా ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా టెక్కలి రోడ్డు పైకి వచ్చారు. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ద్విచక్ర వాహనచోదకులు సైతం అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నౌపడకు చెందిన బి.జయరాం, వి.కళ్యాణి, కె.అప్పారావు, భావనపాడుకు చెందిన ఎన్.రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న యరకన్నపేటకు చెందిన సీహెచ్ గవిరీష్, ఐ.లచ్చోడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
28లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఈ నెల 28లోగా తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాలను (లైఫ్ సర్టిఫికెట్) తప్పనిసరిగా సమర్పించాలని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ ఉప ఖజానా అధికారి (ఎస్టీవో) చింతాడ రామారావు ఒక ప్రకటనలో కోరారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఉప ఖజానా కార్యాలయ పరిధిలో 6,748 మంది పెన్షనర్లు ఉండగా, ఇప్పటివరకు 5,828 మంది ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని, ఇంకా 920 మంది నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. పెన్షనర్లు తమ సమీపంలోని ఖజానా కార్యాలయాల్లో గానీ, నెట్ సెంటర్లలో గానీ, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో గానీ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చని వివరించారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల బయోమెట్రిక్ పడని వారు నేరుగా జిల్లా కేంద్రంలో ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. జీవో ఎంఎస్ నంబర్ 315 ప్రకారం పెన్షన్ పొందుతున్న వారు శ్రీకాకుళం కార్యాలయ పరిధిలో 82 మంది ఉండగా, వారిలో కేవలం 25 మంది మాత్రమే ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని ఎస్టీవో తెలిపారు. మిగిలిన వారు ఈనెల 28లోగా సంబంధిత పత్రాలతో వచ్చి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. తలశిలకు జిల్లా నాయకుల పరామర్శనరసన్నపేట : ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు తలశిల రఘురాం కుటుంబాన్ని విజయవాడలోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం కలిసి పరామర్శించారు. రఘురాం తండ్రి చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణదాస్, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్కుమార్, చింతాడ రవికుమార్ పరామర్శించారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్ అదనపు ముఖ్యకార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. నువాగడ బ్లాక్లో పరిమళ, సంబల్పూర్, సుందర్ డంగ్, తరంగడ, తుబురుసింగి గ్రామ పంచాయతీల నుంచి 68 వినతులు అందాయి. వీటిలో గ్రామ పంచాయతీ సమస్యలకు సంబంధించినవి 50, వ్యక్తిగత ఫిర్యాదులు 18 ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలని బ్లాక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నలుగురుకి మధుబాబు పథకం ద్వారా పింఛన్లు మంజూరు చేశారు. భవన కార్మికుల కుటుంబానికి మ్యారేజ్ ప్రోత్సాహాకం కింద రూ.2.50 లక్షల చెక్ను కలెక్టర్ అందజేశారు. నువాగడ పంచాయతీ సమితి అధ్యక్షురాలు మాలతి ప్రధాన్, బీడీఓ లోకనాథ్ బెహరా, తహసీల్దార్ మోనాలిసా ఆచారి, ఇతర బ్లాక్ అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. చంద్రపూర్లో.. రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, డీఎఫ్ఓ అన్నాసాహెబ్ అహోలే, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. చంద్రపూర్ సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 50 వినతులను అధికారులు స్వీకరించారు. 37 వ్యక్తిగత, 13 గ్రామ సమస్యలుగా గుర్తించారు. గ్రామ సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అదనపు సంబఽంధితశాఖ అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ ఆదేశించారు. చిత్రకొండ సమితిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వబీమానన్ ఏరియా బోడపథర్ పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ అదేశాల మేరకు జిల్లా అదనపు కలేక్టర్ వెద్బ్ర్ ప్రధాన్ గ్రీవెన్స్ నిర్వహించారు. 78 వినతులు స్వీకరించారు. వీటిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవల అందించడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి పరిష్కరించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి వివరాలు ఆ శాఖల అధికారులతో చర్చించారు. సమితి సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా పలు అర్జీలు స్వీకరించారు. అనంతరం శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. క్లినిక్లో మొత్తం 21 శాఖలకు సంబంధించి 127 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ నుంచి 43, సెర్ప్ 31, పంచాయతీరాజ్ 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, నీటి వనరుల శాఖ 4, విద్యుత్ శాఖ 4, వ్యవసాయం, గనులు, ఇతర ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించి పలు వినతులు వచ్చాయి. ● గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి కోరారు. నియోజకవర్గానికి 25 స్కూటీలు చొప్పున 4375 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా లైసెన్స్ ఇప్పించి అందజేయాలని విన్నవించారు. ● శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లింగోద్భవ ఘట్టంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, వీఐపీల పేరిట ఇతరులు విగ్రహాలను తాకుతుండటం శాస్త్ర విరుద్ధమని అర్చకుడు ఎన్.రాజశేఖర్ కోరారు. ● గార మండలం శాలిహుండంలో గతంలో దళితులకు కేటాయించిన భూములను ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటోందని, తమకు న్యాయం చేయాలని పలువురు కోరారు. -
జయపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి
జయపురం: ఎటువంటి చారిత్రిక ప్రాధాన్యం లేని కొరాపుట్ కన్నా ఎంతో చరిత్ర గల జయపురం జిల్లాగా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. జయపురం కేంద్రం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించిన లేఖను జయపురం సబ్కలెక్టర్కు సోమవారం సమర్పించారు. కొరాపుట్కు జయపురానికి ఉన్న వ్యత్యాసాలను లేఖలో ఆధారాలతో పొందుపరిచారు. కొరాపుట్కు ఎటువంటి చరిత్ర లేదని, 1870లో ఆనాటి ఆంగ్లేయులు జయపురం సామ్రాజ్య ప్రాధాన్యతను మరుగున పరచేందుకు కొరాపుట్ను ఆశ్రయించారన్నారు. జయపురం 17వ శతాబ్దం నుంచి రాచరికం రద్దు అయి.. 1952 వరకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని వెల్లడించారు. స్వాతంత్య్ర ముందు, తరువాత కాలంలోనూ కొరాపుట్ జిల్లా విభజన జరిగేంత వరకు జయపురం కీలకపాత్ర నిర్వహించిందని వివరించారు. కొరాపుట్ సముద్ర మట్టానికి 880 మీటర్ల ఎత్తులో ఉండగా.. జయపురం 650 మీటర్ల ఎత్తులో ఉందన్నారు. కొరాపుట్ సబ్ డివిజన్ విస్తీర్ణం 5837 స్వేర్ కిలో మీటర్లు కలిగి ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉందన్నారు. జయపురం సబ్డివిజన్ 2970 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండి ఛత్తిష్గఢ్ రాష్ట్ర సరిహద్దున ఉందన్నారు. జనసంఖ్యలో కొరాపుట్ కన్నా జయపురం ఎక్కువ అని వెల్లడించారు. అవిభక్త కొరాపుట్లో జయపురం అతి పెద్ద పట్టణమన్నారు. నల్కో, హాల్ వంటి పరిశ్రమలు కొరాపుట్లో నెలకొని ఉండటం వలన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. జయపురం సబ్ డివిజన్లో ఒక్క పరిశ్రమ కూడా లేక పోవటం వలన ఉద్యోగ అవకాశాలు లేవని, అందువలన జయపురం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. జయపురంలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలు కొరాపుట్కు తరలించారని, జయపురంలో ప్రతిపాదిత మెడికల్ కళశాలను కొరాపుట్లో నెలకొల్పారని ఆరోపించారు. అందువలన జయపురం సబ్డివిజన్లో నిరుద్యోగం తాండవిస్తూ యువత పలు అక్రమమార్గాలలో పయనిస్తున్నారన్నారు. అందువల్ల జయపురం సబ్డివిజన్తోపాటు మల్కనగిరి జిల్లాలోని మత్తిలి, గోవిందపల్లి, కొరాపుట్ సబ్డివిజన్ లమతాపుట్ సమితి, నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలతో కలపి జయపురం కేంద్రం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
సమాజ రుగ్మతలు తొలగించేవి నాటకాలు
శ్రీకాకుళం కల్చరల్: సమాజంలో రుగ్మతలను ఎత్తి చూపి వాటిని తొలగించేందుకు నాటకాలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్ వేదికగా జరుగుతున్న నాటక పోటీల ముగింపు ఉత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రతి ఏడాది మంచి నాటక పోటీలను నిర్వహించి, కళను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యా మౌళిక వసతుల డైరెక్టర్ పీఎంజే బాబు, మొదలవలస రమేష్లు మాట్లాడుతూ కళా సేవ ఎంతో ఉత్తమమైనదన్నారు. ఉత్తమ ప్రదర్శన ‘మమ్మల్ని బతికించండి’.. మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలలో ఆరు నాటికలు ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ కళాసమితి వారి ‘మమ్మల్ని బతికించండి నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘సమయం’ నాటిక, ఉత్తమ జ్యూరీగా గుంటూరు వారి ‘తరమెల్లిపోతోంది’ నాటికలు బహుమతులు దక్కించుకున్నాయి. మానాపురం సత్యనారాయణ, గెద్దా వరప్రసాద్, నూర్బాషా ఖాసీంలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం బహుమతులు అందజేశారు. అంతకుముందు నిర్వహించిన ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక, ‘నిన్ను నీవు గెలుచుకో’ నాటికలు అలరించాయి. కార్యక్రమంలో సుమిత్రా కళాసమితి అధ్యక్ష కార్యదర్శులు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, మండవిల్లి రవి, కిల్లా ఫల్గుణరావు, మూర్తి, కె.సురేష్, రాజు పాల్గొన్నారు. -
ఉత్కళ సమ్మిళినీ సమావేశాలు వాయిదా
జయపురం: ఈ నెల 28, మార్చ్ 1 తేదీల్లో జయపురంలో నిర్వహించాల్సిన ఉత్కళ సమ్మిళనీ రాష్ట్ర స్థాయి సమావేశాలు వాయిదా పడ్డాయి. విధాన సభలో బడ్జెట్ సమావేశాల వల్ల మంత్రులు రాలేకపోతుండడంతో ఉత్కళ సమ్మిళినీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం స్థానిక స్వర్గీయ హరిశ్చంధ్ర బక్షీపాత్రో స్మృతి ఉద్యానవనంలో సమ్మిళని జిల్లా అధ్యక్షుడు మదన మోహణ నాయిక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముందుగా కార్యదర్శి నవీణ మదళగత సమావేశ నివేదికను సమావేశానికి సమర్పించారు. ఉపాధ్యక్షుడు రాజేంధ్ర గౌఢ రాష్ట్ర స్థాయి సమావేశంపై వివరించారు. ఫిబ్రవరి 28, మార్చ్ 1 వ తేదీలలో జయపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమావేశంపై ఆయన వివరించారు. ఆ సమావేశానికి రాష్ట్ర మంత్రులను ఆహ్వానించామని, అయితే శాసన సభలో బడ్జెట్ సమావేశాలు జరగడం వల్ల మంత్రులు రావటం లేదని వివరించారు. అందుచేత రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రులు వీలుని బట్టి త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రులను సంప్రదించే బాధ్యతలను భృగుబక్షీ పాత్రోకు అప్పగించినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి చంధ్ర కాంత సుతార్, సీనియర్ సభ్యులు ఫ్రఫుల్ల దాస్,శుభేంధు బ్రహ్మ, పరమేశ్వర పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
‘సుభద్ర’తో ఆర్థిక స్వావలంబన
● ఏడీఎం మునీంద్ర హానగ పర్లాకిమిడి: జిల్లా స్థాయి సుభద్ర శక్తి మేళా సోమవారం నాటికి ఆరోవరోజు చేరుకుంది. మహిళా స్వశక్తీకరణ, నారీమణులు ‘లక్షపది దిద్దీ’గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గజపతి జిల్లా స్థాయిలో వివిధ మహిళా గ్రూపుల స్టాల్స్, వారికి ఆహ్లాద పరచడానికి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు గజపతి స్టేడియంలో ఏర్పాటు చేశారు. సోమవారం నాటి కార్యక్రమాలకు అతిధులుగా ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, బి.డి.ఓ (గుసాని) గౌరచంద్ర పట్నాయక్, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం సునారాం సింగ్, జిల్లా ప్రోగ్రాం మేనేజరు, ఓ.ఎల్.ఎం టిమోన్ బోరా మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అనంతరం బలంఘీర్ జిల్లా, గజపతి సమలై నృత్య అకాడమీ తరఫున సాంస్కృతి, జానపద నృత్యాలు ప్రదర్శించారు. భువనేశ్వర్ నుంచి సినీ గాయని బర్నాలీ హోత్తా ఆధ్వర్యంలో గ్రూప్ సంగీతం పలువురిని అలరించింది. ప్రతిరోజూ స్టేడియంలో మహిళలకు ఉచిత కంటి శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న సుభద్ర శక్వి మేళా ముగించనున్నారు. -
యువత సన్మార్గంలో నడవాలి
జయపురం: యువత సన్మార్గంలో నడవాలని వక్తలు అన్నారు. అయితే నేటి సమాజంలో యువత మత్తు పానీయాలకు అలవాటు పడి, అక్రమ మార్గాలలో సంపాదించేందుకు చెడు మార్గాలు ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అటువంటి యువతను సక్రమ మార్గంలో నడిపేందకు కొరాపుట్ జిల్లా యువ సంఘటన ఆర్గనైజర్ సమాజ సూవి రవీంద్రకుమార్ మహపాత్రో ఆహ్వానం మేరకు పలువురు యువ నేతలు స్థానిక సిగ్నేచర్ హోటల్ సభాగృహంలో సోమవారం సమావేశం అయ్యారు. రవీంద్రకుమార్ మహపాత్రో అధ్యక్షన జరిగిన సమావేశంలో నేటి యువత పరిస్థితిపై సుధీర్ఘంగా చర్చించారు. యువత మంచి మార్గంలో నడచినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమన్నారు. నేటి యువత రేపటి తరాలకు మార్గదర్శులుగా ఉండాలన్నారు. ఎలాంటి వారితో కూడితే అలాంటి అలవాట్లే అలవడతాయని.. అందుకే మంచివారితో స్నేహం చేయాలన్నారు. మత్తు పదార్ధాలకు, చెడు అలవాట్లకు దూరంగా యువకులు ఉంటూ ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలన్నారు. యువతను మంచిమార్గంలో తీర్చిదిద్దేందుకు పాఠశాలలు ఆలయాలు కావాలన్నారు. తల్లిదండ్రులు ఎంతో కస్టపడి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే్ందుకు నిరంతరం ఆలోచిస్తారని వారి ఆశలను గౌరవించాలన్నారు. మంచి భవితను నిర్మించుకొనేందుకు ప్రతి యువత కలలు కనాలని పిలుపునిచ్చారు. తమ కలలు నిజం కావటానికి యువత కృషి చేయాలని ఉద్బోంధించారు. ముందుగా విద్యార్ధులు, యువత ‘నిషాకు నో’ చెప్పాలని, నిజాయితీ మార్గంలో సంపాదించేందుకు ప్రతి యువకుడు ప్రయత్నించాలని సూచించారు. తప్పుడు మార్గాలలో సంపాదించేందుకు ప్రయత్నిస్తే ఎన్నడూ సఫలం కాలేరని హితవు పలికారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని యువతకు పిలుపు నిచ్చారు. సమావేశంలో సిగ్నేచర్ హోటల్ యజమాని హిమాంక అగర్వాల, జయపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీజేడీ నేత అరుగుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సతీష్ నంద, వ్యాపార వేత్త బుల్లు దేవ్ శర్మ, కంట్రాక్టర్, కృష్ణ గౌఢ, సమాజ సేవి సంజయ్ జైన్, వివిధ వర్గాలకు చెందిన యువకులు ప్రసంగించారు. -
1025 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీస్స్టేషన్ సిబ్బంది ఆదివారం రాత్రి ఎంవీ 96 గ్రామం జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ ట్రక్కును గమనించారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 41 ప్లాస్టిక్ సంచుల్లో గంజాయిని గుర్తించి వెంటనే డ్రైవర్ను అరెస్టు చేశారు. సోమవారం విచారించగా పట్టుబడిన గంజాయిని నిందితుడు హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ ఝాబర్ సింగ్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. గంజాయిని తూకం వేయగా 1025 కిలోలు ఉంది. దీని విలువ రూ.80 లక్షలు వరకుం ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంసీ ఉద్యోగి మృతి రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఆర్ఎంపీలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న పితబాస్ రౌత్ (42) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాహల్ గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుణుపూర్లో గల ఆర్ఎంసీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న పితాబస్ బిసంకటక్లో గల ధాన్యం మండీల కేంద్రానికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి గుణుపూర్కు వస్తుండగా బిసంకటక్ మీనాహాల్ వద్ద ఎదురుగా వస్తున్న అంబులెన్స్ను బలంగా ఢీ కొన్నాడు. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలకు గురయ్యాడు. అటువైపుగా వెళ్లే కొందరు గాయాలతో ఉన్న అతడిని బిసంకటక్లో గల క్రిష్టియన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సను అందించిన వైద్యులు అప్పటికే పితాబస్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అంబుబులెన్స్ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. మా నక్టిమా జాతర ప్రారంభం మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి స్థానిక మానక్టిమా అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఆదివారం రాత్రి భారీ ఊరేగింపుతో అమ్మవారిని మౌలిమ మందిరం వద్ద నుంచి తెచ్చి నక్టిమా ఆలయం వద్ద మూడు రోజుల జాతర నిర్వహిస్తారు. వేలాది మంది ఘటాలతో వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. మెయిన్ రోడ్డులో అమ్మవారిని పల్లకీపై మోశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మంగళవారం వరకు జాతర నిర్వహిస్తారు. -
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
జయపురం: కాంగ్రెస్ పాలనలో ఉన్న జయపురం మున్సిపాలిటీపై విపక్ష బీజేడీ పత్రికా ప్రతినిదుల సమావేశంలో పలు ఆరోపణలు గుప్పించగా, నేడు మరో విపక్షం బీజేపీ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి చైర్మన్పై తీవ్ర ఆరోపణలు చేసింది. జయపురం బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్.మనోజ్ కుమార్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ మున్సిపాలిటీ, చైర్మన్, ఎమ్మెల్యే కార్యనిర్వాహక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపాలిటీకి చేరుకొని కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు 3 డిమాండ్లతో కార్యనిర్వాహక అధికారికి మెమోరాండం సమర్పించింది. అందులో మున్సిపాలిటీ చైర్మన్ తన సొంత పనులకు మున్సిపాలిటీ వాహనాలను వినియోగిస్తున్నారని, రోజుకు 30 లీటర్ల చొప్పున డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్లో ఎక్కువ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే మున్సిపాలిటీలో అభివృద్ధి, నిర్మాణ పనులలో అవినీతి తార స్థాయికి చేరుకున్నాయని, జగన్నాథ్ సాగర్ పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరుగుతోందని, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి చైర్మన్ ఇతర వ్యాపారాలు చేస్తున్నారని, తమ వ్యాపారాల నిమిత్తం ఆయన హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ వాటిపై వెంటనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరపాలని బీజేపీ నేతలు కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం అధికారులకు మెమోరాండం సమర్పిస్తూ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన జరిపిన వారిలో సీనియర్ బీజేపీ నేతలు రాజేంద్ర మహాపాత్రో, మధు హియాల్, సురభి పాణి, శంతూన్ పండ తదితరులు ఉన్నారు. -
బ్రహ్మోత్సవాలు
వైభవంగా కల్యాణ వేంకటేశుని..రాయగడ: పారిశ్రామిక ప్రాంతమైన జేకేపూర్లో గల భూసమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిపూజా కార్యక్రమాలు మందిర ప్రధాన అర్చకులు పొందూరు వెంకట ప్రదీప్, అంపోలు రంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి. బరంపురానికి చెందిన అంపోలు అనంత వెంకట శ్రీనివాస్ ఆచార్యులు, విశాఖపట్నంకు చెందిన గోపీనంబాళ్ల శేషాచార్యుల ఆధ్వర్యంలో స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పుష్పాభిషేకంతో పాటు పూలతో అలంకరించారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మందిరం ముఖ ద్వారం వద్ద పురోహితులు ప్రత్యేకమైన పూజలతో కలశ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో వందల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 108 కలశాలతో సమీపంలో గల నాగావళి నది వద్దకు వెళ్లి అక్కడ గంగమ్మ తల్లిని పూజించి కలశాల్లో నాగావళి నదీ జలాలను ఊరేగింపుగా మందిరం వద్దకు తీసుకువచ్చారు. తీసుకువచ్చిన నదీ జలాలను జాగ్రత్త పరిచారు. ఈ కార్యక్రమంలో మందిరం కమిటీ ఉపాధ్యక్షుడు పట్నాన గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. గోవింద మాల దీక్షాధారణ ఉత్సవాల్లో భాగంగా మందిరం వద్ద గోవింద మాల దీక్షను ధరించారు. ఈ ఉత్సవాల్లో దీక్షను ధరించిన వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహించేందుకు సహకరించడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందజేసే సేవా కార్యక్రమాల్లొ పాల్గొంటారు. మాల దీక్షను ధరించే వారు మార్చి 1 వ తేదీతో దీక్షను మందిరం వద్దే విరమిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మందిర ప్రాంగణంలో ప్రత్యేకమైన వేదికను నిర్వాహకులు రూపొందించారు. వేదిక వెనుక స్వామి వారి నామంతో పాటు శంఖు, చక్రం వంటివి అమర్చారు. అదేవిధంగా వేదిక ముందు భాగంలో గరుడ విగ్రహాలు వందనాలు చెబుతున్నట్లు రూపొందించిన వేదిక అందరినీ ఆకట్టుకుంటుంది. నేడు శ్రీరామ చంద్ర స్వామి వారి కల్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. కల్యాణోత్సవం అనంతరం విశేష హోమాలు, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు ఉంటాయి. -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
పర్లాకిమిడి: గత కొద్దిరోజులుగా గజపతి జిల్లాలో పర్లాకిమిడి, కాశీనగర్, రాయఘడ బ్లాక్లలో ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో మహేంద్రతనయ నదిలో నీరు అడుగంటింది. పర్లాకిమిడి – పాతపట్నం సరిహద్దులో మహేంద్రతనయ నది వద్ద ప్రజా ఆరోగ్య శాఖ నీటిని ఇసుక మూటలతో అడుకట్ట కట్టి పట్టణంలో తాగునీటికి ఆటంకం లేకుండా నీటి సరఫరా చేస్తున్నారు. వచ్చే నెలలో ఎండలు అధికంగా మండితే మహేంద్రతనయ నదిలో నీరు అడుగంటే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా పీహెచ్ఈడీ ఇంజినీర్లు ఇప్పటి నుండే తాగునీటిని బీఎన్ ప్యాలస్ వద్ద రిజర్వ్ చేస్తున్నారు. -
బీజేపీలో చేరిన సునాబెడా మున్సిపల్ చైర్మన్
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీకి చెందిన సునాబెడా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర కుమార్ పాత్రో అధికార బీజేపీలో చేరారు. సోమవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిర కార్యక్రమంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదే వేదిక మీద బీజేడీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్ మోహన్ సామాల్ కండువా కప్పి స్వాగతం పలికారు. రాజేంద్ర పాత్రో గత మున్సిపల్ ఎన్నికలలో కొరాపుట్ జిల్లా సునాబెడా నుంచి ఇండిపెండెండ్ అభ్యర్థిగా గెలుపొంది అప్పటి అధికార పక్షం బీజేడీలో చేరారు. ప్రస్తుతం దేశంలో నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరినట్లు రాజేంద్ర ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, పార్టీ నాయకుడు సుమంత్ ప్రధాన్ ఉన్నారు. -
లారీని ఢీకొన్న కారు
● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు మందస: మండలంలోని బాలిగం సమీపంలో ఉన్న ఎన్హెచ్ 16 జాతీయ రహదారిపై శనివారం రాత్రి లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారని ఎస్ఐ కృష్ణప్రసాద్ తెలిపారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీని, ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు అతివేగంతో వస్తున్న కారు డివైడర్ దాటుకొని వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి పీయూష్ కుమార్ శ్రీకాకుళంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఒడిశా రాష్ట్రంలోని కటక్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఇచ్ఛాపురం: రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట గ్రామానికి చెందిన కొండొలోల సాయికుమార్ని పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 9వ తేదీన అప్పన్నపేటలోని ఒక ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి, సుమారు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.6,500ల నగదు దొంగలించినట్లు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం పట్టణ ఎస్ఐకి వచ్చిన సమాచారం మేరకు స్థానిక రైల్వేస్టేషన్కు పట్టణ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఆవరణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సాయికుమార్ని పట్టుకొని విచారించారు. ఈ విచారణలో నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 28 దొంగతనాలు చేసి జైలుకి కూడా వెళ్లినట్లు నిర్దారణ అయ్యింది. నిందితుని వద్దనుంచి స్థానిక స్టేషన్లో నమోదైన కేసుతో పాటు నరసన్నపేట, ఆమదాలవలస, మెళియాపుట్టి, జేఆర్పురం, విజయనగరం–1 టౌన్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించిన 48 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.10,500లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు చిరస్మరణీయుడని కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) దుంపల రామారావు(లక్ష్మణరావు) అన్నారు. ఆదివారం బొడ్డేపల్లి వర్ధంతి పురస్కరించుకొని నగరంలోని సింహద్వారం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు బొడ్డేపల్లి అని కొనియాడారు. ప్రజా నాయకుడిగా రికార్డు స్థాయిలో పార్లమెంట్కు ఎన్నికై దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా వంశధార నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రైతుల సంక్షేమం కోసం, సాగునీటి వనరుల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడి నిధులు తీసుకొచ్చేవారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అంతా మంత్రి డైరక్షన్లోనే...
మంత్రి అచ్చెన్నాయుడి డైరక్షన్లోనే పట్టణంలో ఫుట్పాత్ దుకాణాల తొలగింపు జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ పేద, సామాన్య కుటుంబాలకు ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల నిర్మాణాలు చేపట్టి పేద, సామాన్య కుటుంబాలకు చెందిన వివిధ రకాల వ్యాపారస్తులకు వాటిని కేటాయించాలి. – సత్తారు సత్యం, వైఎస్సార్సీపీ నాయకుడు, టెక్కలి ● -
సామాజిక పురోగతికి పాటుపడాలి
కవిటి: రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ప్రజల పురోగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వక్తలు అన్నారు. మండలంలో కొత్త కొజ్జీరియా జంక్షన్లోని రెడ్డిక సంఘం భవనం వద్ద ఐక్యతా స్థూపం, యోగి వేమనల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం, పూరీ, గంజాం రెడ్డిక మహాజన పురోభివృద్ధి సంఘం తొలిసారి రిజిస్ట్రేషన్ చేసి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్డిక కుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వందేళ్ల ప్రయాణంలో విశేష సేవలందించిన దివంగత ఎమ్మెల్యేలు ఆశి నీలాద్రిరెడ్డి, ఉప్పాడ రంగబాబు, లండ కారయ్యరెడ్డి, దక్కత అచ్చుతరామయ్యరెడ్డిలు చిరస్మరణీయులని కొనియాడారు. అనంతరం పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో పూరీ, గంజాం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని రెడ్డిక సామాజికవర్గ ప్రజలు పాల్గొన్నారు. పక్కాగా డోలోత్సవం ఏర్పాట్లు గార: మార్చి 3, 4, 5 తేదీల్లో శ్రీకూర్మనాథాలయంలో జరిగే డోలోత్సవం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు సూచించారు. ఆదివారం విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ భవనంలో కూర్మనాథాలయ పాలక మండలి సమావేశం ఈవో టి.వాసుదేవరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అశోక గజపతిరాజు మాట్లాడుతూ క్యూలైన్లు, ఉత్సవం వేళ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండిగో సంస్థ సీఎస్ఆర్ నిధులు తొలి విడతగా ఇచ్చిన రూ.3.60 కోట్లతో పుష్కరిణి అభివృద్ధి పనులపై చర్చించారు. అదేవిధంగా అన్నదానం భవనం వద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చని నిర్ణయం చేశారు. సమావేశంలో అర్చకులు కిషోర్ బాబు, సభ్యులు కై బాడి కుసుమకుమారి, పల్ల పెంటయ్య, గంట్రేడి సంయుక్త, గొండు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చందు వైద్యానికి జీఎంఆర్ చేయూత జి.సిగడాం: మండల పరిధిలోని డీఆర్వలస(దాలెమ్మ రాజువలస) గ్రామానికి చెందిన నారాయణరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు చందు గత ఐదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వైద్యానికి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని జనవరి 28వ తేదీన ప్రాణ భిక్షపెట్టండి అనే శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి జీఎంఆర్ సంస్థ స్పందించింది. చందు వైద్యం నిమిత్తం రూ.3 లక్షల ఆర్థిక సాయం ఆదివారం అందజేసింది. కార్యక్రమంలో సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ కుమరాపు రమేష్నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, కుమరాపు పెద్ద శ్రీనివాసరావు, కుమరాపు నాగభూషణరావు, మాజీ సర్పంచ్ కుమరాపు అప్పలనాయుడు, విశ్రాంత వీఆర్వో కుమరాపు సన్యాసినాయుడు, పాండ్రంగి సీతారాం, పాండ్రంగి జానీ, కుమరాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరింతమంది దాతలు ముందుకు రావాలని కోరారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలోని సాయి నగర్కు చెందిన మెండ సీత(55) కాలిన గాయాలతో చికిత్స పొందుతూ రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. శనివారం దేవుడి వద్ద దీపం వెలిగిస్తున్న సమయంలో హారతి కర్పూరం బిల్లలు శరీరంపై పడడంతో సీత గాయాలకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలో ప్రథమ చికిత్స చేయించి, అనంతరం రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సీత ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బలివాడ గణేష్ తెలిపారు. -
కొఠియాలో కలెక్టర్ పర్యటన
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పద ప్రాంతమైన కొఠియాలో కొండ ప్రాంతాలను కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ పర్యటించారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియాలో కొండ పై ఉన్న గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. దాంతో కలెక్టర్ సత్యవాన్ నడక బాట ఎంచుకున్నారు. దాంతో సుమారు 3 కిలోమీటర్ల దూరం కొండల పై నడక ప్రయాణం చేశారు. కలెక్టర్ వెంట జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కూడా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందల కోట్ల నిధులు కొఠియా గ్రామాల పై ఖర్చు పెడుతుంది. అయితే అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్న విషయం కలెక్టర్ స్థాయి వ్యక్తి స్వయంగా చూడడానికి అవకాశం లేదు. దీంతో కలెక్టర్ ఆయా గ్రామాలకు స్వయంగా వెళ్లి గిరిజనులతో సంభాషించారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచు కోట వలే ఉండేది. -
సైనికా.. సెలవిక
● అధికార లాంచనాలతో జవాన్ అంత్యక్రియలు నరసన్నపేట: మండలంలోని చిక్కాలవలసకు చెందిన జవాన్ దంత అమృత్కుమార్(41) అంత్యక్రియలు అధికార లాంచనాలతో ఆదివారం చేపట్టారు. గత 20 ఏళ్లుగా సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్న అమృత్కుమార్ శుక్రవారం మణిపూర్ వద్ద విధుల్లో ఉండగా గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మడపాం టోల్గేట్ వద్దకు మృతదేహం చేరుకోగా అక్కడ నుంచి చిక్కాలవలస వరకు నరసన్నపేటకు చెందిన పారా మిలటరీ అసోసియేషన్ ప్రతినిధులు, మాజీ సైనికులు ర్యాలీగా తీసుకెళ్లారు. పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య అంత్యక్రియల్లో పాల్గొని అమృత్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్, ఎస్ఐ–2 శేఖరరావు, వైఎస్సార్సీపీ నాయకులు యాబాజి రమేష్, బొబ్బాది ఈశ్వరరావు, కింతలి చలపతిరావు, మొయ్యి లక్ష్మునాయుడు, సడగాన రవి తదితరులు పాల్గొన్నారు. -
చిరు వ్యాపారాలకు చిక్కులు..!
● ఫుట్పాత్ వ్యాపారాలు తొలగిస్తున్న అధికారులు ● ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలుకొని పాత జాతీయ రహదారి మీదుగా రోడ్డుకు ఆనుకుని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందినవారు వివిధ రకాల ఫుట్పాత్ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా చిన్నపాటి వ్యాపారాలతో జీవనం సాగిస్తూ వచ్చారు. అయితే గత కొద్దిరోజుల నుంచి పట్టణంలో అభివృద్ధి పేరుతో ఫుట్పాత్ వ్యాపారాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా వైఎస్సార్ జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ఫుట్పాత్ వ్యాపారాలను తొలగించారు. పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఆసరాగా ఉన్నటువంటి షెల్టర్ను కూల్చివేశారు. తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్కు ఎదురుగా పాత జాతీయ రహదారికి ఆనుకుని బడ్డీలు ఏర్పాటు చేసుకున్నవారిని సైతం అక్కడ నుంచి వెళ్లగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో చిరు వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అధికార యంత్రాంగం చర్యలపై బాధితులతో కలిసి దశల వారీగా ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీధి వ్యాపారాలను ప్రోత్సహించడానికి రుణాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతంలో స్థలం గుర్తింపు అధికారుల గుర్తింపు ప్రకారం పట్టణంలో సుమారు 250 వరకు వివిధ రకాల ఫుట్పాత్ వ్యాపారస్తులు ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సుమారు 400లకు పైగా కుటుంబాలు ఫుట్పాత్ వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తొలగించిన ఫుట్పాత్ వ్యాపారస్తుల కోసం చిన్న బజారులో పశువైద్య కేంద్రానికి పక్కన కొంత స్థలాన్ని గుర్తించారు. అయితే ఆ మారుమూల ప్రాంతంలో వ్యాపారాలు జరగవని నిరాకరిస్తూ బాధిత వ్యాపారస్తులు ఆ ప్రదేశానికి వెళ్లడం లేదు. వీటితో పాటు ఇదే ప్రాంతంలో కూరగాయల కాంప్లెక్స్లో కొన్ని దుకాణాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, వారి మాటలను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. -
అందరి సహకారంతో ఉగాది ఉత్సవాలు
● జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కొండబాబురాయగడ: వచ్చే నెల 19వ తేదీన ఉగాది ఉత్సవాలను అందరి సహకారంతో ఘనంగా నిర్వహించాలని రాయగడ జిల్లా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు యాల్ల కొండబాబు అన్నారు. స్థానిక స్వాగత్ హోటల్ సమీపంలో గల కోదండ రామ మందిరంలో ఆదివారం సమాఖ్య సభ్యుడు డి.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఉగాది సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గత మూడేళ్లగా తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించామని, అదే తరహా ఈ ఏడాది కూడా ఉత్సవాలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిద్దామన్నారు. అందుకు అందరి సహాయ, సహకారాలు ఎంతో అవసరమన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతోపాటు తెలుగు వారి ఐక్యతను చాటి చెప్పే ఈ ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఉగాది ఉత్సవాలు పొరుగున గల తెలుగు రాష్ట్రాల్లో సైతం అందరినీ ఆకరిస్తున్నాయన్నారు. రెండు రోజులపాటు ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. అందుకు అందరూ శ్రమదానం చేయాలే తప్ప.. ఎవ్వరినీ ఆర్థికపరంగా సహకరించాలని కోరలేదన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తుండటంతో గత మూడేళ్లగా ఉగాది ఉత్సవాలు అంబరాన్ని అంటాయన్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా కార్యాచరణ ప్రణాళికలను, అదేవిధంగా సూచనలు తీసుకునేందుకు తాము ఎప్పుడూ ఆహ్వానిస్తున్నామన్నారు. అందరి సలహాలు, సూచనల మేరకు ఉత్సవాలను నిర్వహించేందుకు సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఉగాది రోజున ప్రతీసారిలాగే కలశ యాత్ర నిర్వహిస్తుండటం ఆచారంగా మరిందని వివరించారు. దీనిని కొనసాగించడంతో పాటు ఈసారి మజ్జిగౌరి మందిరం నుంచి జరిగే కలశ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎడ్ల బళ్లతో సహా వివిధ రకాల కళాకారులతో వేషాధారణలను ఏర్పాటు చేస్తామన్నారు. అప్పట్లో పండగ పబ్బాల్లో ఎడ్ల బళ్ల వేషాలు సంప్రదాయంగా పరిగణించేవారని, అదే ఆచారాన్ని కొనసాగించి కలశ యాత్రలో పాల్గొనేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఉత్సవ వేదిక వద్ద సంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఈసారి భిన్నంగా స్టాల్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చినవారు స్టాల్స్లో పెట్టే వివిధ ప్రదర్శనలను తిలకించే అవకాశం కలుగుతుందన్నారు. ఉత్కళ తెలుగు సమాఖ్య ఉగాది కార్యాలయం ఏర్పాటు.. ఈ సారి కొత్తతరహా ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఆది నుంచి ఉగాది ఉత్సవాలు ముగిసేంత వరకు రింగ్ రోడ్డు సమీపంలో తెలుగు సమాఖ్య ఉగాది కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కొండబాబు ప్రకటించారు. ఈ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆసక్తి గల ప్రతి ఒక్కరూ వారి సలహాలు, సూచనలు, అదేవిధంగా దినసరి కార్యక్రమాలకు సంబంధించి చర్చించుకునే వీలు కలిగేలా వినియోగపడుతుందన్నారు. తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తెలుగు వంటల ఫుడ్ స్టాల్ను ఈ సారి ఉత్సవ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణంలో గల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, తెలుగు సంస్థలకు చెందిన వారు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కింతలి అమర్నాథ్, తెలుగు బ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షుడు రేజేటి శ్రీనివాస్ శర్మ, పతివాడ శ్రీనివాస్రావు, సి.హెచ్.సొంబాబు, వీరబాబు, తదితరులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. -
వందల సంఖ్యలో వాటర్ మీటర్ల చోరీ
పర్లాకిమిడి: స్థానిక తొమ్మిదో వార్డు రంగిరీజు వీధిలో శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రజారోగ్య శాఖ వాటర్ మీటర్లను కోసి పట్టుకెళ్లిపోయారు. ఉదయం రంగిరీజువీధి, వేంకటేశ్వర మందిరం వీధిలో పీహెచ్ఈడీ సరఫరా చేసిన తాగునీరు ఇంట్లోకి రాకపోవడంతో బయటకు వచ్చిచూడగా వాటర్ మీటర్లు కోసేయడంతో రోడ్డుపై తాగునీరు పారుతూ కనిపించింది. కొద్ది రోజుల కిందట 10, 9వ వార్డు కరణం వీధిలో కూడా ఒకేరోజు 17 తాగునీటి పైపులకు అమర్చిన వాటర్ మీటర్లను దొంగిలించారు. పర్లాకిమిడిలో 16వ వార్డులో వాటర్ మీటర్లు వందల సంఖ్యలో దొంగతనానికి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వాటర్ మీటర్లలో రాగి ఉంటుందని, వాటిని బయటకు తీసి స్క్రాప్కు అమ్ముతున్నట్టు కొందరు చెబుతున్నారు. దీనిపై కరణం వీధి ప్రజలు పీహెచ్ఈడీ ఇంజినీర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. వాటర్ మీటర్లు గత రెండేళ్లుగా పైపులకు అమర్చినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా మీటర్ రీడింగ్ చేయలేదనే అపవాదు కూడా ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వినియోగదారులు కోరుతున్నారు. -
ఉగాది వేడుకలకు సన్నాహకాలు
జయపురం: జయపురం తెలుగు సాంస్కృతిక సమితి, ఉగాది వేడుకలు జరిపేందుకు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించింది. సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయిక్ అధ్యక్షతన సిటీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఉగాది వేడుకల నిర్వహణపై సభ్యులు తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. తెలుగు సాంస్కృతిక సమితి ఏర్పడిన నాటి నుంచి క్రమం తప్పకుండా ఏటా జరుగుతున్న ఉగాది వేడుకలు గత నాలుగేళ్ల నుంచి జరగడం లేదు. అయితే ఈ ఏడాది తప్పకుండా జరపాలని సమితి నిర్ణయించటంతో సమావేశంలో పాల్గొన్న సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏటా ఉగాది వేడుకలు జరపాలని సభ్యులు సూచించారు. ఉగాది ఉత్సవాలతో పాటు సిటీ ఉన్నత పాఠవాల వార్షికోత్సవాలు కలపి రెండు దినాలు వేడుకలు జరపాలని సమావేశం నిర్ణయించింది. ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో శశిపట్నాయిక్, బి.సతీష్ కుమార్, జి.రాంబాబులను సభ్యులుగా నియమించారు. గతంలో తాము శ్రీపొట్టి శ్రీరాములు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక బృందాలను రప్పించేవారమని ఈ యేడాది కూడా శ్రీపొట్టి శ్రీరాములువిశ్వవిద్యాలయం వారిని ఒక సాంస్కృతిక టీమ్ను పంపమని కోరితే బాగుంటుందని తెలుగు సాంస్కృతిక సమితి మాజీ అధ్యక్షుడు వి.భాస్కర రావు సూచించారు. ఉగాది ఉత్సవాల ఖర్చులకు ప్రజల నుంచి చందాలు వసూలు చేయకుండా తెలుగు సాంస్కృతిక సమితి సభ్యులు సొంతంగా చందాలు వేసుకొని ఉత్సవాలు నిర్వహించాలని సభ్యులు ఇచ్చిన అభిప్రాయంతో సమావేశం ఏకీభవించింది. సమావేశంలో తెలుగు సాంస్కృతిక సమితి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జయపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వి.ప్రభాకర్, మాజీ కార్యదర్శి పి.మహేశ్వర రెడ్డి, ప్రస్తుత కార్యదర్శి వై.శ్రీనివాస ఖన్నా, ఎ.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.


