కాంగ్రెస్ అభ్యర్థిగా సత్యజిత్ గొమాంగ్
భువనేశ్వర్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెసు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం శనివారం 3 సెట్ల నామినేషన్ ఫారాలు కొనుగోలు చేసింది. పార్టీ ఎమ్మెల్యే సత్యజిత్ గొమాంగ్ ఈ దరఖాస్తులు పొందారు. రాజ్యసభ ఎన్నికల్లో 4వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపనుంది.
పేలుడు ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగిన విషాదకరమైన ఫ్యాక్టరీ పేలుడు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాయగడ: జిల్లాలోని గుడారి ఎన్ఏసీ తొమ్మిదో వార్డు పరిధి శ్రీరాంనగర్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు వంశీధర సబర్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులకు ఉన్న తాళాలను విరగ్గొట్టి లోపలకు వెళ్లి ఇంటిలోని వెండి, బంగారు, నగదును దోచుకున్నారు. ఈ మేరకు బాధితుడు గుడారి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్టీంతో సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు మునిగుడ సమితిలోని బాలిజోల సేవాశ్రమంలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటికి తాళాలు వేసి ఆశ్రమ పాఠశాలకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు.


