గోరఖ్పూర్: సమాజంలో శాంతి, భద్రత, పరస్పర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహపూరితమైన పండుగలను జరుపుకోగలమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం గోరఖ్నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదని, అది సామాజిక సామరస్యానికి, సమిష్టి ఆనందానికి ప్రతీక అని అభివర్ణించారు.
వేల ఏళ్ల నాటి భారతీయ సంప్రదాయాలను, పూర్వీకులు అందించిన వారసత్వాన్ని ప్రస్తుత తరం అంతే ఉత్సాహంతో కొనసాగించడం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ‘హోలీ’ వేడుకల్లో భాగస్వామ్యం కావడం ద్వారా సామాజిక విభేదాలను రూపుమాపి, సామరస్య పూర్వక వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది హోలీ వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 1.61 లక్షలకు పైగా ప్రాంతాలలో హోలికా దహనం కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. హోలికా దహనం అనేది భగవంతుని నరసింహ అవతారాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భమని, సమాజంలోని అశాంతిని తొలగించి, దుష్ట శక్తులపై సచ్ఛీలత సాధించిన విజయానికి ఇది నిదర్శనమని గుర్తుచేశారు.
ప్రహ్లాదుడు, శబరి లేదా అర్జునుడి వంటి పౌరాణిక పాత్రల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తే, సానుకూల శక్తులు బలోపేతమై ప్రతికూల శక్తులు వాటంతట అవే పతనమవుతాయని యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘నవ భారతం’ ఆవిర్భవిస్తోందని, దేశం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అనంతరం గోరఖ్పూర్లో నిర్వహించిన 'భగవాన్ నరసింహ శోభా యాత్ర'లో పాల్గొన్న ముఖ్యమంత్రి భక్తులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ‘పాట వినపడలే..’.. ప్రముఖ సింగర్ షోలో ఫ్యాన్స్ కన్నీళ్లు!


