శ్రీనగర్: ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతితో జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడటంతో ఆదివారం కశ్మీర్ లోయతో పాటు జమ్మూలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. షియా సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అయతొల్లా అలీ ఖమేనీ మృతి దరిమిలా శ్రీనగర్ సహా కశ్మీర్లోని మెజారిటీ ప్రాంతాలు, జమ్ము శివారులోని భటిండి, రాంబన్ జిల్లాలోని చందర్కోట్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఇరాన్లో ఉన్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ఇతరుల భద్రత విషయంలో తమ ప్రభుత్వం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని భరోసా అన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై బలప్రయోగం చేయవద్దని, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిగ్రహంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ వేదికగా కోరారు. మరోవైపు ఈ ఆకస్మిక నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు


