చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. ముఖ్యంగా అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన వ్యూహాలకు పదును పెడుతూ, దక్షిణ తమిళనాడులో పార్టీ పట్టును మరింత సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం.
ఎంపీ కనిమొళిని తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్థానంలో కనిమొళిని బరిలోకి దింపేలా అంతర్గత చర్చలు సాగుతున్నాయని సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రాధాకృష్ణన్ ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వానికి తెలియజేశారని సమాచారం.
ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ మార్పును బలపరుస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కనిమొళి రాకకు సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోదరి అయిన కనిమొళి ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో డీఎంకే తరఫున చురుకుగా కనిపిస్తున్నారు.
ఇటీవల మీడియా ప్రతినిధులు తిరుచెందూర్ నుంచి పోటీ చేసే విషయంపై ప్రశ్నించగా, ఆమె ఆ అవకాశాన్ని కొట్టిపారేయకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో డీఎంకే ప్రాబల్యాన్ని పెంచడానికి కనిమొళి లాంటి అగ్రశ్రేణి నాయకురాలు అసెంబ్లీ బరిలో ఉండటం వ్యూహాత్మకంగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనిమొళి రంగ ప్రవేశం ఖాయమన్న వార్తలు తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
ఇది కూడా చదవండి: ‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు


