ఐదు రాష్ట్రాల పోలింగ్: ఎన్నికల నగారాకు సన్నాహాలు | Election dates for 4 states after mid March | Sakshi
Sakshi News home page

ఐదు రాష్ట్రాల పోలింగ్: ఎన్నికల నగారాకు సన్నాహాలు

Feb 28 2026 12:47 PM | Updated on Feb 28 2026 1:08 PM

Election dates for 4 states after mid March

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. కేరళ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి  మూడో వారంలో వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించింది. కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కూడిన ఈ బృందం తమిళనాడు పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకుంది.

ఈ క్రమంలో ఎన్నికల సంఘం తన తదుపరి పర్యటనను మార్చి 5, 6 తేదీల్లో కేరళలో కొనసాగించనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చోటుచేసుకున్న సందిగ్ధత కారణంగా, తుది ఓటర్ల జాబితాను నేడు (శనివారం) ప్రచురించాలని అధికారులు నిర్ణయించారు. బెంగాల్ పర్యటన తేదీలను కమిషన్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కాగా ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

మార్చి 6న జరగాల్సిన ప్రధాని కేరళ పర్యటన ఇప్పుడు మార్చి 11కి వాయిదా పడింది. ఈ పర్యటన ముగిసిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేరళ పర్యటనలో భాగంగా ఎర్నాకులం కలుర్ స్టేడియంలో ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని విడుదల చేయనుంది. దీంతో పాటు మెరైన్ డ్రైవ్‌లో ధీవర సభ నిర్వహించే కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు. రైల్వే శాఖకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ఈ పర్యటనలో అధికారిక ప్రకటన వెలువడనుంది. మార్చి 14న అస్సాంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు ప్రధాని వెళ్లనున్నారు.

ఎన్నికల ప్రక్రియను వీలైనంత తక్కువ సమయంలో, సమర్థవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. గతంలో 2021లో ఎనిమిది విడతలుగా సుదీర్ఘంగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఈసారి కేవలం మూడు లేదా నాలుగు విడతల్లోనే ముగించాలని కమిషన్ యోచిస్తోంది. అయితే కేరళలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటనలు, పరిపాలనాపరమైన లాంఛనాలు పూర్తికాగానే మార్చి 15 తర్వాత ఏ క్షణమైనా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం: ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement