కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనున్న తరుణంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్)లోని తుది ఓటర్ల జాబితా శనివారం అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికంటే ముందే నేరుగా పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ కోలాహలం నెలకొంది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజాము నుంచే ఓటర్ల జాబితా హార్డ్ కాపీలను జిల్లా మేజిస్ట్రేట్లు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు చేరవేశారు. అక్కడి నుంచి బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) విడతల వారీగా ఈ జాబితాలను సేకరించి, ఆయా కేంద్రాల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఈ సవరణ ప్రక్రియలో దాదాపు 60 లక్షల మంది ఓటర్ల పేర్లపై సందిగ్ధత నెలకొనడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఈ పేర్లను ‘పరిశీలన’ విభాగంలో ఉంచారు. తాజాగా విడుదలైన తుది జాబితాలో వారిలో ఎంతమంది పేర్లు మనుగడలో ఉన్నాయి? ఇంకెంతమంది పేర్లు తొలగించారనే అంశం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో జాబితా అప్లోడ్ అయ్యేలోపు క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచేందుకే ఆఫ్లైన్ పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ, ఓటర్లలో నెలకొన్న ఉత్కంఠ కారణంగా పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కు సురక్షితంగా ఉందో లేదోనన్న ఆందోళన ఓటర్లలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ పరిణామం బెంగాల్ రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. తుది జాబితా వెలువడటంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. ప్రతి నియోజకవర్గంలోనూ బూత్ల వారీగా డేటాను విశ్లేషించేందుకు పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయికి చేరుకున్నారు.
ఓట్ల తొలగింపుపై అప్పుడే ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. స్వల్ప మార్పులు కూడా గెలుపోటములను శాసించే అవకాశం ఉండటంతో, తమ పార్టీ మద్దతుదారులైన ఓట్లర్ల పేర్లను నిర్ధారించుకునే పనిలో పడ్డారు. ఎన్నికల సంఘం మాత్రం పారదర్శకతే తమ ప్రధమ కర్తవ్యమని పునరుద్ఘాటించింది. అర్హులైన ఓటర్ల పేర్లు ఎవరివైనా జాబితాలో లేకపోయినా లేదా ఏవైనా తప్పులున్నా తక్షణమే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాల పోలింగ్: ఎన్నికల నగారాకు సన్నాహాలు


