సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు | NABARD Chairman KV Shaji emphasized need to move MSP toward market pricing | Sakshi
Sakshi News home page

సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు

Feb 28 2026 12:09 PM | Updated on Feb 28 2026 12:15 PM

NABARD Chairman KV Shaji emphasized need to move MSP toward market pricing

భారతీయ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు సమయం ఆసన్నమైందని, సంప్రదాయ కనీస మద్దతు ధర విధానం నుంచి మార్కెట్ ఆధారిత ధరల వైపు మళ్లడం ద్వారానే రైతులకు శాశ్వత ఆర్థిక భరోసా లభిస్తుందని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజీ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘అగ్రి, కమోడిటీ సమ్మిట్ 2026’లో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా, సామాజికంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను వివరించారు.

ఖజానాపై భారం తగ్గేలా.. రైతుకు లాభం కలిగేలా..

ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోందని షాజీ విశ్లేషించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైసెస్’ (మార్కెట్ నిర్ణయించిన ధరలు) విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ‘ఎంఎస్‌పీ నుంచి మార్కెట్ ఆధారిత మద్దతు ధరలకు మళ్లాలి. ఇందులో కమోడిటీ డెరివేటివ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకోసం మేము ఎన్‌సీడీఈఎక్స్‌తో కలిసి పని చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

రైతులకు ధరల రక్షణ కవచం

రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓ) ద్వారా రైతులకు ‘పుట్ ఆప్షన్స్’ అనే సరికొత్త ఆర్థిక సాధనాన్ని పరిచయం చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. రైతులు స్వల్ప రుసుము చెల్లించి తమ పంట ధరకు ముందే లాక్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆ పెరిగిన ధరల ప్రయోజనాన్ని రైతులు పొందవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోతే రైతుకు కేవలం తాను చెల్లించిన రుసుము మాత్రమే నష్టం తప్ప, పంటపై కనీస ధర గ్యారెంటీగా ఉంటుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఉదాహరణకు ఒక రైతు క్వింటాల్ మిర్చిని రూ.10,000కు అమ్ముకోవాలని అనుకున్నాడనుకుందాం. రైతు కొంత రుసుము (ఉదాహరణకు రూ.200) చెల్లించి రూ.10,000 వద్ద ఎన్‌సీడీఈఎక్స్‌లో పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తారు. అంటే తన ధరను రూ.10,000 వద్ద లాక్ చేశారు.

ధరలు పడిపోతే.. పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధర రూ.8,000 కి పడిపోయింది. అప్పుడు రైతు ఆందోళన చెందక్కర్లేదు. అతను ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తన పంటను రూ.10,000కే అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు రూ.2,000 నష్టం తప్పుతుంది.

ధరలు పెరిగితే.. ఒకవేళ మార్కెట్లో ధర రూ.12,000కి పెరిగింది. అప్పుడు రైతు తన ‘ఆప్షన్‌’ను వదులుకుని నేరుగా మార్కెట్లోనే రూ.12,000కి అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు పెరిగిన ధర ప్రయోజనం లభిస్తుంది. అతను నష్టపోయేది కేవలం తను కట్టిన రూ.200 రుసుము మాత్రమే. మార్కెట్ కుప్పకూలినా రైతుకు కనీస గ్యారెంటీ ధర లభిస్తుంది. ఇది ఎంఎస్‌పీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఎంఎస్‌పీలో ధర స్థిరంగా ఉంటుంది. కానీ పుట్ ఆప్షన్‌లో మార్కెట్ ధరలు పెరిగితే ఆ అదనపు లాభం రైతుకే చెందుతుంది.

నాబార్డ్, ఎన్‌సీడీఈఎక్స్ సహకారం

ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి నాబార్డ్, ఎన్‌సీడీఈఎక్స్‌తో కలిసి పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. గిడ్డంగులను ఈ మార్కెట్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానించడం ద్వారా రైతులు తమ పంటను వేర్‌హౌజ్‌లో పెట్టి అక్కడి నుంచే ఈ ఆప్షన్ల ద్వారా ధరను లాక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా రైతులు మార్కెట్ ట్రేడింగ్ చేయడం కష్టం కాబట్టి, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) రైతుల తరపున ఈ లావాదేవీలు నిర్వహిస్తాయి. దీనివల్ల రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో పనిలేకుండా భరోసా లభిస్తుంది.

ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement