సాక్షి, వరంగల్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు సుష్మిత క్లారిటీ ఇచ్చారు. దీంతో, పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతరకు వచ్చారు. జాతర వేదికగా కొండా సుస్మితా మాట్లాడుతూ..‘నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైంది. నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొండా మురళీ ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు. నేను పరకాలకు వస్తా మీ బాధలు తీరుస్తాను. మీరంతా బాధల్లో ఉన్నారని నాకు అర్థం అవుతోంది. పరకాలలో ప్రతీ కార్యక్రమానికి వెళ్తాను.
తెలంగాణ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. పరకాల నుంచి ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాను. మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారు. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నా.. లేకపోతే మరోలా ఉండేది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


