కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ భీకర పోరు వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడమే కాకుండా, పదుల సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. గత గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఘర్షణలు దారుణమైన సైనిక చర్యలకు దారితీశాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్థాన్లోని పలు ప్రాంతాల నుండి సుమారు 20,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా, 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు సైతం ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇప్పటికే తీవ్ర పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాల్లో అత్యవసర ఆహార పంపిణీ నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) హెచ్చరించింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా తాము సరిహద్దు వెంబడి దాడులు ప్రారంభించినట్లు అఫ్గాన్ ప్రకటించడంతో ఈ పోరు మరింతగా ముదిరింది. ఇస్లామాబాద్ సైతం వెనక్కి తగ్గకుండా కాబూల్, కందహార్ నగరాలతో పాటు వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది.
సరిహద్దులోని కునార్ ప్రాంతంలో క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మోతతో ప్రజలు భీతావహ స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కునార్లోని సిర్కానీ గ్రామంలోని వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వెళ్ళగా, ఆస్తులను కాపాడుకునేందుకు ఇంటికి ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైనిక పరంగా ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. అఫ్గాన్ సైన్యం తమ వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని చెబుతూనే, సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం


