ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన నలుగురిలో సవితా షణ్ముగసుందరం(21) అనే భారత సంతతి విద్యార్థి కూడా ఉన్నారు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాగా, సవితా షణ్ముగసుందరం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎకనామిక్స్లో డ్యూయెల్ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి కానుండగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఆస్టిన్లోని పేరున్న బ్యూఫోర్డ్లోని ఓ బార్ వెలుపల మిత్రులతో కలిసి ఉండగా కారులో వచి్చన దుండగుడు వారిపైకి కాల్పులకు దిగాడు. సమాచారం అందుకున్న నిమిషానికే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. మృతులను సవితా షణ్ముగసుందరం, రైడర్ హారింగ్టన్, జోర్జ్ పెడెర్సన్లుగా, దుండగుడిని సెనెగల్లో జని్మంచిన 53 ఏళ్ల ఎన్డిగా డియాగ్నెగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. మొత్తమ్మీద ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇరాన్పై దాడుల నేపథ్యం..
2000వ సంవత్సరంలో టూరిస్టు వీసాపై వచి్చన ఎన్డిగా డియాగ్నెగా 2006లో అమెరికా పౌరురాలిని వివాహమాడాడు. దీంతో 2013లో ఇతడికి పౌరసత్వం కూడా వచి్చందని హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఇతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఇరాన్ జాతీయ పతాకం, ఇరాన్ నేతల ఫొటోలు కొన్ని లభించాయి. అతడు ధరించిన టీ షర్టుపై ఇరాన్ జెండా డిజైన్, ‘ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్’అని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడటానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఎఫ్బీఐ శాన్ ఆంటోనియో విభాగం అధికారి అలెక్స్ డోరన్ మాత్రం ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉండే అవకాశం ఉన్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఎన్డిగా డియయాగ్నా ఈ ఘటనకు ప్రేరేపించిన కారణాలపై ముందుగానే ఒక నిర్ణయానికి రాలేమని ఎఫ్బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారులు మరణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఆమె సూపర్ స్టార్..
సవితా షణ్ముగ సుందరం మృతిపై టెక్సాస్ వర్సిటీ అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమెది కష్టించేతత్వమని, అందరితో కలిసిపోయే విద్యార్థి అని గుర్తు చేసుకుంటున్నారు. మెక్కాంబ్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రుస్ ఫిన్నే ‘ఎక్స్’లో..‘మా సూపర్స్టార్ విద్యార్థుల్లో షణ్ముగసుందరం ఒకరు. ఆమెను కోల్పోవడం నిజంగా బాధాకరం’అని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమె ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగ జీవితం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. సవితా షణ్ముగసుందరం ఇక లేరనే విషయాన్ని తాము ఇప్పటికీ నమ్మలేకున్నామని తోటి విద్యార్థి ఒకరన్నారు. ‘తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే కుమార్తె. ఎందరికో మంచి స్నేహితురాలు. ఈ ప్రపంచంలో తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యారి్థని’అంటూ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మరణం వార్త తమను ఎంతగానో కలిచి వేసిందని, ఆమెను మర్చిపోలేమని పేర్కొన్నారు.


