ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్ట్లకు చేరుకోగానే పశి్చమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు.
‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు.
క్యూల్లో వేల మంది..
‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్పోర్ట్లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కని్పంచింది. ‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్కు వచ్చేందుకు అక్కడి ఎయిర్పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు.


