వార్‌ అక్కడ.. వర్రీ ఇక్కడ! | Concern among investors in Telangana in wake of Gulf countries war | Sakshi
Sakshi News home page

వార్‌ అక్కడ.. వర్రీ ఇక్కడ!

Mar 4 2026 6:22 AM | Updated on Mar 4 2026 6:22 AM

Concern among investors in Telangana in wake of Gulf countries war

యుద్ధం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారుల్లో ఆందోళన

పలువురు రాజకీయ, సినీ, రియల్‌ ఎస్టేట్‌ ప్రముఖులకు గల్ఫ్‌ దేశాల్లో బిజినెస్‌లు

వీరిలో పలువురు బినామీల పేర్లతో పెట్టుబడులు

ఇరాన్‌ దాడులతో వణుకుతున్న దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా నగరాలు

సాక్షి, హైదరాబాద్‌: గల్ఫ్‌లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్, హోటల్, గోల్డ్‌ ట్రేడింగ్, మైనింగ్‌ రంగాల్లో అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన మనోళ్లు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తాజా పరిణామాలు దుబాయ్‌ ’సేఫ్‌–హెవెన్‌’ అనే ఇమేజ్‌ను దెబ్బతీశాయి. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా తదితర నగరాల్లో పెట్టుబడులు పెట్టిన తెలంగాణకు చెందిన ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో ‘సీక్రెట్‌’పెట్టుబడులు పెట్టిన పలువురు రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులతోపాటు కొందరు సినీ ప్రముఖులు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.  

లెక్కకు మించి పెట్టుబడులు  
రాజకీయ, సినీ ప్రముఖుల్లో కొందరు బినామీల ద్వారా దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు రియల్‌ ఎస్టేట్‌ (లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు), హోటల్స్, గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారని తెలిసింది. అలాగే దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లాలోని కీలక నేతల్లో ఇద్దరికి దుబాయ్‌లో హోటల్, రియల్‌ ఎస్టేట్, ఐటీ, మైనింగ్‌ వ్యాపారాలు ఉన్నట్లు గట్టి ప్రచారం ఉంది.  

రియల్‌ ఎస్టేట్‌లో తెలుగువాళ్ల పెట్టుబడులు 
2025లో దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో రికార్డుస్థాయిలో సుమారు 249 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో భారతీయ పెట్టుబడులే 30 శాతం వరకు ఉన్నట్లు దుబాయ్‌ ట్రేడ్‌ వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక వెలువడింది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీ, రియల్‌ రంగంలో ఉన్న వారు పెద్దఎత్తున దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. లగ్జరీ విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఆఫ్‌–ప్లాన్‌ ప్రాజెక్టులు దుబాయ్‌లో బూమ్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు ’వెయిట్‌ అండ్‌ వాచ్‌’ మోడ్‌లోకి వెళ్లారు. ‘పానిక్‌ లేదు, కానీ డెసిషన్‌ మేకింగ్‌ పూర్తిగా ఆగిపోయింది. 

ఒక క్లయింట్‌ డీల్‌ బ్యాక్‌ అవుట్‌ చేశాడు. చాలామంది ఒప్పందాలు జాప్యం చేయమంటున్నారు. సైట్‌ విజిట్స్‌ తగ్గాయి. లావాదేవీలు 30–40% పడిపోయే అవకాశం ఉంది. లగ్జరీ సెగ్మెంట్‌ మరింత దెబ్బతింటోంది. ఇన్వెస్టర్లు ఆస్తుల విలువ పడిపోవడం, ఫోర్స్‌డ్‌ సేల్స్‌ భయంతో ఉన్నారు’అని దుబాయ్‌లో తెలుగు పెట్టుబడుదారులకు సంబంధించి బ్రోకర్‌గా పనిచేసే వ్యక్తి ఒకరు ఫోన్‌లో చెప్పారు. అలాగే హోటల్, పర్యాటక రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో అరైవల్స్‌ తగ్గాయి. పామ్‌ జుమైరా, దుబాయ్‌ మెరీనా హోటల్స్‌ ఆక్యుపెన్సీ రేట్లు దారుణంగా పడిపోయాయి. మైనింగ్, గోల్డ్‌ బిజినెస్‌లో డైరెక్ట్‌ డ్యామేజ్‌ తక్కువే అయినా, ఇన్సూరెన్స్‌ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్టులు రీ–నెగోíÙయేట్‌ అవుతున్నాయి. ఇవన్నీ గల్ఫ్‌లో పెట్టుబడిపెట్టిన తెలుగు ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement