జాబితా హైకమాండ్కు ఇచ్చాం
జస్టిస్ సుదర్శన్రెడ్డి రాజ్యసభ అడగడం లేదు
మాజీ మావోయిస్టులు కాంగ్రెస్లోకి వస్తామంటే ఆహ్వనిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని, మొత్తం 16 మంది ఆశిస్తున్నారని, సామాజిక వర్గాల వారీగా వారి జాబితాను హైకమాండ్ ఇచి్చనట్టు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. రాజ్యసభ అభ్యరి్థత్వాల గురించి రాహుల్గాంధీ వచ్చిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చినా, ఖరారు కాలేదని తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు ఒకవేళ ఢిల్లీ వెళ్లాల్సి వస్తే బుధవారం వెళతామని, లేదంటే అధిష్టానం పెద్దలతో ఫోన్లో మాట్లాడతామని వెల్లడించారు.
మంగళవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి నలుగురు సమర్థవంతమైన బీసీ నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ నేతలు కూడా ఉన్నారన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల గురించి ఏఐసీసీ అన్ని అంశాలను బేరీజు వేస్తోందని, ముఖ్యంగా సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటోందని, సామాజిక కూర్పుతోనే అభ్యరి్థత్వాలు ఖరారయ్యే అవకాశముందని చెప్పారు. జస్టిస్. బి.సుదర్శన్రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు.
రెండింటి విధానాలూ ఒకటే
మావోయిస్టు ఎజెండా, కాంగ్రెస్ విధానం ఒకటేనని, పేదల సంక్షేమం, దేశ అభివృద్ధే ధ్యేయమని మహేశ్గౌడ్ చెప్పారు. అయితే, వారు ఆయుధాలు పట్టుకున్నారని, తాము ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేస్తామని, ఇదే తేడా అని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని, మాజీ మావోయిస్టులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, తాము ఎవరినీ పారీ్టలోకి రావాలని అడగలేదని, మాజీ మావోయిస్టులు కూడా తమను సంప్రదించలేదన్నారు.
జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు తీసుకుంటామని మహేశ్గౌడ్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాశామని, మార్కెట్ విలువ ఎంత ఉందో అంత చెల్లించి ఎకరం స్థలం తీసుకుంటామని, ఇందుకోసం ఏడు జిల్లాల్లో స్థలాల ఎంపిక కూడా జరిగిందన్నారు. బీఆర్ఎస్ తరహాలో పుక్కటికిమాత్రం ప్రభుత్వ స్థలాలు తీసుకోబోమని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీకి చెప్పారని, అలాంటి చోట్ల అందరు నేతలను పిలిపించి మాట్లాడుతామన్నారు.


