టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ తమది కాదని స్పష్టీకరణ
సంబంధిత రాష్ట్రాలే నీటి లెక్కలను రికార్డు చేయాలని సూచన
ఆ లెక్కల ఆధారంగానే త్రిసభ్య కమిటీ నీటి పంపిణీ చేస్తుందని వెల్లడి
ఇకపై ఎవరి ప్రాజెక్టుల నీటి లెక్కలను వారే రికార్డు చేయాలని ఏపీ, తెలంగాణకు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకుంటున్న నీటిని లెక్కించడానికి ఆయా ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను సాకుగా చూపి కృష్ణా జలాల లెక్కలను పర్యవేక్షించే బాధ్యతల నుంచి తప్పించుకుంది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని 12, 13వ క్లాజుల్లోని నిబంధనల ప్రకారం నీటి వినియోగం లెక్కింపు, వాటి ఖాతాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలదేనని గుర్తు చేసింది.
కృష్ణా బోర్డు నుంచి మెజర్మెంట్ బుక్స్ను తీసుకొని వాటిలో నీటి లెక్కలను రికార్డు చేసేలా సంబంధిత ప్రాజెక్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణాబోర్డు తాజాగా రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాసింది. తొలిదశ కింద ఏర్పాటు చేసిన 18 టెలిమెట్రీ కేంద్రాలతోపాటు రెండో విడత కింద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, వాటికి రక్షణ కల్పించే బాధ్యత సంబంధిత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది.
రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 85(8)ఏ ప్రకారం.. ట్రిబ్యునళ్ల తీర్పులతోపాటు ఉమ్మడి ఏపీ–ఇతర రాష్ట్రాలు/కేంద్రం మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా ప్రాజెక్టుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపడానికే తమ బాధ్యత పరిమితం అని గుర్తు చేసింది. ట్రిబ్యునళ్ల తీర్పులు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే నియమాలకు లోబడి మాత్రమే ప్రాజెక్టులు (బరాజ్లు, డ్యామ్లు, రిజర్వాయర్లు, రెగ్యులేటర్లు), కాల్వల నెట్వర్క్, నీటిని తరలించే ఇతర ప్రవాహ మార్గాలపై కృష్ణాబోర్డు తన అధికార పరిధి కలిగి ఉంటుందని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 87(1) పేర్కొంటోందని ప్రస్తావించింది.
కృష్ణా ట్రిబ్యునల్–1 సమర్పించిన తదుపరి నివేదిక ఆధారంగా 1976 మే 31న కేంద్ర వ్యవసాయ, నీటిపారుదలశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని క్లాజ్–12కి జత చేసిన అనుబంధం బీ(1)లో ఉన్న నిబంధనలతోపాటు కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని క్లాజ్–13లో ఉన్న నిబంధనల ప్రకారం నీటి వినియోగం లెక్కింపు, వాటి ఖాతాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని నిబంధనల ప్రకారం రాష్ట్రాలు నీటి లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగా.. రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లోని నిబంధనల మేరకు నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడమే తమ బాధ్యత అని తేల్చి చెప్పింది.
ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించాలని ఆదేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో దాని అమలు సాధ్యం కాలేదని తెలిపింది. సంబంధిత రాష్ట్రాలు తమ పరిధిలోని మొత్తం 31 గేజ్ స్టేషన్ల నుంచి సేకరించిన వివరాలను పంపిస్తే, వాటి ఆధారంగా తాము నీటి లెక్కలను సిద్ధం చేసి త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపిణీ జరుపుతున్నామని తెలియజేసింది.


