తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అమర్నాథ్ కొట్టిపారేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కు లపై సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా HCA నుంచి విశాఖ కంపెనీకి రూ. 69 కోట్లు చెల్లింపులు జరిగాయన్న అంశం వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమర్నాథ్.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘69 కోట్ల రూపాయలు HCA నుంచి విశాఖ కంపెనీ కి చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగింది. డబ్బులు చెల్లించాలి అని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’’ అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ఒకవైపు HCA ప్రెస్ మీట్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. HCAలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేపట్టాయి.
మంత్రి వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కి 70 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు చేశాయి. మంత్రి ఆదేశాల మేరకు HCA లో ఉన్న పెద్దలు 70 కోట్లు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ఆరోపించాయి. ఈ ఆరోపణను కొట్టి పారేస్తూ.. HCA ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే క్రికెట్ సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో జింఖానా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది.


