సిలబస్ మార్పుపై ఉన్నత విద్యామండలి కసరత్తు
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో సాంకేతికతకు చోటు
సాంకేతిక పరిజ్ఞానంపై 20 శాతం సిలబస్ ఉండేలా మార్పులు
పారిశ్రామిక భాగస్వామ్యంతో విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు చర్యలు
2026–27 విద్యాసంవత్సరం నుంచి అమలుకు యోచన
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల మార్పుపై ఉన్నత విద్యామండలి కసరత్తు ముమ్మరం చేసింది. ఏడాదిగా కొత్త సిలబస్పై మేధోమథనం చేసిన మండలి.. మార్పుల అవసరం, సరికొత్త విధానాలతో ప్రయోజనాలు, జాబ్ మార్కెట్లోకి డిగ్రీ కోర్సులను తీసుకెళ్లడంపై సమగ్ర నివేదిక రూపొందించగా దీనికి సీఎం నుంచి ఆమోదం లభించింది. దీంతో 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ మార్పులను అమల్లోకి తేవాలని విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు.
ఇటీవల విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో ఆయన సమావేశమయ్యారు. వేగవంతమైన కార్యాచరణ అమలు చేయాలని వీసీలను ఆదేశించారు. డిగ్రీ కాలేజీలు, కోర్సుల అకడమిక్ ఆడిట్ను చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు ఇష్టపడని కోర్సులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా కొత్త సిలబస్లో భాగం చేయనున్నారు.
ఆంగ్ల భాషలోనూ సమూల మార్పులకు వ్యూహరచన సిద్ధమైందని మండలి వర్గాలు తెలిపాయి. ప్రతి కోర్సుకూ పారిశ్రామిక భాగస్వామ్యంతో నైపుణ్యం పెంపొందించేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాపకులకు అవగాహన క్లాసులు నిర్వహించే యోచనలో విద్యామండలి ఉంది.
డిగ్రీలో ఆధునిక సిలబస్
బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీల వైపు విద్యార్థులు మొగ్గుచూపడం లేదు. ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులే కోరుకుంటున్నారు. తక్షణ ఉపాధికి ఇదే మార్గమని భావిస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ కోర్సుల్లో నైపుణ్యం కొరత కనిపిస్తోంది. కృత్రిమ మేధ ప్రభావం, బిగ్ డేటాకు కనెక్ట్ అయ్యే కంప్యూటర్ భాష, కోడింగ్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు. గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారిని నియమించుకొని ఆపై వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో కొనసాగించేవి.
ప్రస్తుతం నైపుణ్యం ఉన్నవారినే ఆహ్వానిస్తున్నాయి. అందులో డిగ్రీ కోర్సుల నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని నౌకరీ డాట్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లో ఏఐ ప్రాధాన్యతను పెంచేలా సిలబస్లో మార్పులు తేవాలని బాలకిష్టారెడ్డి సూచించారు. 20 శాతం సాంకేతిక పరిజ్ఞానంపై సిలబస్ ఉండేలా మార్పులు చేయనున్నారు. టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్, ఆఫ్లైన్లో చేసేందుకు అవకాశం కల్పించడం మార్పుల్లో ముఖ్యమైనదిగా అధికారులు చెబుతున్నారు. వాటికి కొన్ని క్రెడిట్స్ కూడా ఇవ్వనున్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా ఇటీవల ఈ తరహా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏఐ సంబంధిత అప్లికేషన్స్తో కూడిన కోర్సులను స్వదేశీ, విదేశీ యూనివర్సిటీల ద్వారా చేసే అవకాశం కల్పించనున్నారు. ఆన్లైన్లో చేసే ఈ కోర్సులకూ క్రెడిట్స్ ఇవ్వనున్నారు. అయితే కోర్సుల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
మారిన కోర్సులకే మెజారిటీ
కోవిడ్ తర్వాత కామర్స్ కోర్సుల్లో గుణాత్మక మార్పులు చో టుచేసుకున్నాయి. ఈ–వాణిజ్యం పెరగడం, ఆన్లైన్ విధానంలో ఆడిటింగ్ చేపట్టడంతో కామర్స్ గ్రాడ్యుయేట్లకు డి మాండ్ పెరిగింది. ఇందులోనూ టెక్నాలజీతో కూడిన నైపు ణ్య మెళకువలు ఉన్నవారికే ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కాలేజీలు కామర్స్ కోర్సుల్లో టెక్నాలజీని తప్పనిసరి చేశాయి.
ఈ కారణంగా రాష్ట్రంలో అత్యధికంగా 37 శా తం విద్యార్థులు కామర్స్లో చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ లైఫ్సైన్స్ కోర్సులున్నాయి. వాటి కీ జాబ్ మార్కెట్ ఉండటం, ఏఐ టెక్నాలజీ సంబంధిత చా ప్టర్లు జోడించడమే ఈ మార్పులకు కారణంగా కనిపిస్తోంది.
డిగ్రీ స్వరూపం మారుస్తాం
సిలబస్ మార్పునకు తుది మెరుగులూ పూర్తయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యమే కేంద్రంగా డిగ్రీ కోర్సులు తేవాలన్నది మండలి ఆలోచన. ఈ క్రమంలో అన్ని రంగాల నిపుణుల సలహాలు తీసుకున్నాం. సిలబస్ మార్పుపై సబ్జెక్టు నిపుణుల ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చాం. అంతిమంగా డిగ్రీ స్వరూపం మారబోతోంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్


