సేవాగ్రామ్‌కు వెళ్లండి | AICC says certificates will be given only after training | Sakshi
Sakshi News home page

సేవాగ్రామ్‌కు వెళ్లండి

Mar 4 2026 6:14 AM | Updated on Mar 4 2026 6:14 AM

AICC says certificates will be given only after training

గైర్హాజరైన అన్ని రోజులు అక్కడ శిక్షణ తీసుకోవాలి 

ఐదుగురు డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ ఆదేశాలు... జాబితాలో నలుగురు ఎమ్మెల్యేలు 

శిక్షణ తీసుకుంటేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పిన ఏఐసీసీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 8 మంది డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ నుంచి ట్రైనింగ్‌ సర్టిఫికెట్లు అందలేదు. వికారాబాద్‌లో 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో రెండు, మూడు రోజులు పాల్గొనలేదన్న కారణంతో తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ముగ్గురు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు ఈ సర్టిఫికెట్లను ఏఐసీసీ జారీ చేయలేదని సమాచారం. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షులు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, బీర్ల అయిలయ్య, మేడిపల్లి సత్యం, చిక్కుడు వంశీకృష్ణ (ఎమ్మెల్యేలు)తోపాటు వజ్రేశ్‌ యాదవ్‌ (మేడ్చల్‌) ఉన్నారు. పది రోజుల శిక్షణలో భాగంగా వీరు రెండు, మూడు రోజులు గైర్హాజరైన కారణంగానే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఎన్ని రోజులు గైర్హాజయ్యారో అన్ని రోజులపాటు మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌కు వెళ్లి అక్కడ శిక్షణతోపాటు సర్టిఫికెట్లు తీసుకోవాలని ఏఐసీసీ నుంచి శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించిన ఇన్‌చార్జ్‌లు స్పష్టం చేశారు. 

తమ నియోజకవర్గాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే శిక్షణకు వెళ్లలేదని, ఎమ్మెల్యేలుగా తమకుండే అనివార్య ప్రాధాన్యతలే ఇందుకు కారణమని, త్వరలోనే సేవాగ్రామ్‌కు వెళ్లి శిక్షణ తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించారు. పలువురు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ సర్టిఫికెట్లు ఇవ్వని విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కూడా ధ్రువీకరించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని పనుల వల్ల శిక్షణకు రెండు రోజుల పాటు హాజరు కాని వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పారు.  

కనీస సహకారం లేదు : రాహుల్‌తో డీసీసీ అధ్యక్షులు 
జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా తమను నియమించారు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ సహకారం అందించడం లేదని రాహుల్‌గాందీకి ఫిర్యాదు అందింది. సోమవారం వికారాబాద్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఈ ఫిర్యాదును నేరుగా రాహుల్‌కు చెప్పడం గమనార్హం. ‘మంత్రులే జిల్లాల్లో పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించడం లేదు. ప్రభుత్వ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. 

కానీ పార్టీ వ్యవహారాల్లోనూ వారి ఇష్టారాజ్యమే నడుస్తోంది. కనీసం డీసీసీ అధ్యక్షులుగా ఎక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఆర్థికంగా సహకరించే వారు కూడా లేరు.’అని ఓ నేత అందరి సమక్షంలోనే రాహుల్‌కు చెప్పినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన రాహుల్‌ డీసీసీ అధ్యక్షులే చొచ్చుకుపోవాలని సూచించారు. ఎవరికీ భయపడొద్దని చెబుతూ పార్టీ బలోపేతానికి డీసీసీ అధ్యక్షులు ఏం చేయాలనుకున్నా చేయొచ్చని, ఈ క్రమంలో ఏ సమస్య వచి్చనా తన వద్దకే వస్తుందని, తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.    

Advertisement
 
Advertisement
Advertisement