హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం! | Salaries To Be Credited Early On CM Yogi's Orders | Sakshi
Sakshi News home page

హోలీ బోనంజా: మూడు రోజులు సెలవు.. ముందుగానే జీతం!

Feb 28 2026 9:49 AM | Updated on Feb 28 2026 10:46 AM

Salaries To Be Credited Early On CM Yogi's Orders

లక్నో: దేశంలో హోలీ సంబరాలకు సన్నాహాలు మొదలయ్యాయి. మార్కెట్లలో వివిధ రంగులతో పాటు, రంగులను ఎగజిమ్మే గన్‌లు, ప్రత్యేక స్వీట్లను విరివిగా విక్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీపి కబురు  చెప్పారు. హోలీ పండుగను పురస్కరించుకుని.. ఫిబ్రవరి నెల వేతనాలను గడువు కంటే ముందే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 4న హోలీ పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో, పండుగ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఫిబ్రవరి 28వ తేదీనే జీతాలు జమ చేయాలని యూపీ సీఎం యోగి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా నెల ఆఖరున లేదా తర్వాతి నెల ప్రారంభంలో వచ్చే వేతనాలు, ఈసారి ముందుగానే అందనుండటంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. వేతనాల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు ఫిబ్రవరి 28 (శనివారం)ను పని దినంగా ప్రకటించింది. ఆదివారం (మార్చి 1) సెలవు దినం కావడం, ఆ మరుసటి రోజు నుంచే పండుగ సెలవులు ప్రారంభం కానుండటంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 28 లోపు అన్ని విభాగాల సిబ్బందికి వేతనాలు అందేలా చూడాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్రమబద్ధమైన ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, పారిశుధ్య కార్మికులకు సైతం పండుగ లోపే చెల్లింపులు జరపాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యంత్రాంగాన్ని హెచ్చరించారు.

విద్యాశాఖ సైతం ఈ ఉత్తర్వుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ మోనికా రాణి ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు విడుదల చేశారు. మార్చి 2న హోలికా దహన్ ఉన్నందున, ఆలోపే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వేతన ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 2, 3, 4 తేదీల్లో సెలవులు ఉన్న నేపథ్యంలో, పరిపాలనాపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆర్థిక శాఖ నుంచి కూడా ముందస్తు అనుమతులు పొందినట్లు అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సైతం ఈ ముందస్తు వేతనాల ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడంతో, నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ  నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: ‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement