ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ, చాలామంది ఎంతో ఇష్టంగా అరటిపండ్లను తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యం పాలిట ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మార్కెట్లో పసుపు రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ అరటిపళ్లు ప్రకృతి ప్రసాదించినవి కావు.. అవి ల్యాబొరేటరీలో తయారైన కెమికల్ ఫలాలు.. వ్యాపార దాహంతో కొందరు చేస్తున్న ఈ ‘స్లో పాయిజనింగ్’ కారణంగా జనం తమకు తెలియకుండానే ప్రాణాంతక వ్యాధుల కోరల్లో చిక్కుకుంటున్నారు’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మెరుపు వెనుక దాగున్న నిజం తెలిస్తే ఎవరైనాసరే మరోమారు అరటి పండును ముట్టుకునేందుకు కూడా భయపడతారని నిపుణులు అంటున్నారు.
కృత్రిమ మెరుపు.. ఆరోగ్యానికి ఎసరు!
కొందరు వ్యాపారులు పచ్చి అరటి గెలలను గంటల వ్యవధిలో పండించేందుకు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ డాక్టర్ మనన్ వోరా తెలిపిన వివరాల ప్రకారం ఈ రసాయనాలు పండు రంగును కృత్రిమంగా మారుస్తాయి. బయటకు పసుపు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించినా, లోపల పండు సహజంగా పక్వానికి రాదు. ఇలాంటి పండ్లను తింటే మనం పండును కాదు, విషాన్ని తింటున్నామని అర్థం.
సహజమైన పండును గుర్తించడం ఎలా?
సహజంగా పండిన అరటిపండు ఎప్పుడూ ఏకరీతి రంగులో ఉండదు. దానిపై అక్కడక్కడా చిన్న చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. పండు చూడటానికి కొంచెం వడలినట్లు అనిపించినా, లోపల మాత్రం అత్యంత తీయగా, మెత్తగా ఉంటుంది. అయితే కెమికల్స్తో పండించిన పండు పసుపు రంగులో మెరిసిపోతుంటుంది. ముఖ్యంగా తొడిమ భాగం ఆకుపచ్చగా ఉండి, పండు మాత్రం పసుపుగా ఉంటే అది కచ్చితంగా కృత్రిమంగా పండించిదరి గుర్తించవ్చని నిపుణులు చెబుతున్నారు.
లోపల గట్టిగా.. చప్పగా ఉందా?
కార్బైడ్ వేసి మగ్గబెట్టిన పళ్లను గుర్తించడానికి మరో సులువైన మార్గం ఉంది. ఇవి బయటకు పసుపుగా ఉన్నా, లోపల గుజ్జు గట్టిగా, చప్పగా ఉంటుంది. సాధారణంగా అరటిపండు క్రీమ్ రంగులో ఉండి మంచి సువాసన వస్తుంది. కానీ రసాయనాల ప్రభావంతో పండిన పండులో ఆ సహజమైన రుచి, వాసన ఉండవు. ఇలాంటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రెట్టింపు అవుతాయి.
కాల్షియం కార్బైడ్.. ఒక నిశ్శబ్ద హంతకి
కాల్షియం కార్బైడ్ రసాయనంలో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విషపూరిత మూలకాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరినప్పుడు కడుపు ఉబ్బరం, తీవ్రమైన అసిడిటీ, జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రంగును చూసి పండ్లనును ఎంచుకోవడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామని గుర్తించాలి.
అప్రమత్తతే అసలైన రక్షణ
మనం కొనే పండు అందంగా ఉండటం కంటే, ఆరోగ్యకరంగా ఉండటం ముఖ్యం. కొంచెం మచ్చలు ఉన్నా, సహజంగా పండిన పండ్లను ఎంచుకోవడమే శ్రేయస్కరం. పండ్లను తినే ముందు కనీసం గంట సేపు నీటిలో ఉంచి, బాగా కడిగిన తరువాత తినడం వల్ల రసాయనాల ప్రభావం కొంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: 70 శాతం భారతీయులు చేస్తున్న తప్పు!


