కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నాలుగు స్థానాలకు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు టీఎంసీ ‘ఎక్స్’ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంట్ చరిత్రలోనే తొలి LGBTQ+ పార్లమెంట్ సభ్యురాలు అవుతారు. కాగా.. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో అయిదు స్థానాలు ఖాళీ అవుతుండగా.. నాలుగు టీఎంసీ, మరొకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక, మేనకా గురుస్వామి జీవితం న్యాయపరమైన ప్రతిభ, సామాజిక న్యాయం కోసం పోరాటం, అంతర్జాతీయ గుర్తింపులతో నిండి ఉంది. ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం భారతదేశంలో సమానత్వానికి ఒక చారిత్రాత్మక మైలురాయి పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
మేనకా గురుస్వామి ఎవరు?
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనక కూడా ఒకరు. ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్జీబీటీక్యూ. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.
ఆమె 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీర్ను ప్రారంభించింది. అలాగే, ఆయనను ఆమె తన గురువుగా భావిస్తుంది. 2001లో ఆక్స్ఫర్డ్లో తన BCL మరియు హార్వర్డ్లో తన LLM పూర్తి చేసిన తర్వాత, ఆమె కొంతకాలం న్యూయార్క్లోని డేవిస్ పోల్క్, వార్డ్వెల్లో అసోసియేట్గా పనిచేసింది. తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలో స్థిరపడ్డారు.
ఆమె 2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్స్ జాబితాలో చోటు సంపాదించారు. టైమ్ మ్యాగజైన్-2019లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో ఇటీవల I-PAC కార్యాలయాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలను సవాలు చేస్తూ కోర్టు విచారణలో ఆమె.. టీఎంసీ తరఫున వాదనలు వినిపించారు. ఈ కారణంగానే ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చినట్టు బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.


